ఉగ్రవాదంపై దౌత్య యుద్ధం!
posted on May 18, 2025 7:23AM

పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కు ప్రపంచ దేశాల నుంచి గట్టి మద్దతు లభించింది. చైనా, టర్కీ వంటి కొన్ని దేశాలు పాకిస్థాన్ కు మద్దతు పలికినా, మెజారిటీ దేశాలు మన దేశానికి సంపూర్ణ మద్దతునిచ్చాయి. మద్దతు ఇవ్వడమే కాదు పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై జరిపిన దాడులను సమర్ధించాయి. ఈ నేపధ్యంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నపాకిస్థాన్ ఉగ్ర రూపాన్ని ప్రపంచం ముందు ఉంచేందుకు.. తద్వారా అంతర్జాతీయంగా పాకిస్థాన్ ను ఏకాకిని చేపేందుకు,ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం దౌత్య వ్యూహాన్ని సిద్దం చేసింది.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదుల అమానుష ఉగ్ర దాడుల చరిత్రను, ఉగ్ర కుట్రల్ని ప్రపంచ దేశాలకు విశదీకరించేందుకు.. మరీ ముఖ్యంగా 26 మంది అమాయక పర్యాటకులను, అత్యంత కిరాతకంగా హతమార్చిన సంఘటన నేపధ్యంగా మన దేశం చేపటిన ఆపరేషన్ సిందూర్ పూర్వపరాలను వివరించేందుకు పార్లమెంట్ సభ్యుల ప్రతినిధి బృందాలను వివిధ దేశాలకు పంపాలని మోదీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందు కోసం ఏడు అఖిలపక్ష బృందాలను ఏర్పాటు చేసింది.
కేంద్రం ప్రకటించిన ఏడు ప్రతినిధుల బృందాలకు ఏడుగురు పార్లమెంట్ సభ్యులు సారథ్యం వహించనున్నారు. కాంగ్రెస్ నుంచి శశిథరూర్, బీజేపీ నుంచి రవిశంకర్ ప్రసాద్, జేడీయూ నుంచి సంజయ్ కుమార్ ఝా, బీజేపీ నుంచి బైజయంత్ పాండా, డీఎంకే నుంచి కనిమొళి, ఎన్సీపీ నుంచి సుప్రిరాయ సూలే, శివసేన నుంచి శ్రీకాంత్ ఏక్నాథ్ షిండేలు ఈ బృందాలకు సారథ్యం వహిస్తారు. అమెరికా ప్రతినిధి బృందానికి శశిథరూర్, రష్యా ప్రతినిధి బృందానికి కనిమొళి, ఆఫ్రికా ప్రతినిధి బృందానికి శ్రీకాంత్ షిండే, గల్ఫ్ దేశాలకు రవి శంకర్ ప్రసాద్ నేతృత్వం వహిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఇందుకు సంబధించి కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ప్రధన పార్టీలకు లేఖలు రాశారు. ప్రపంచ దేశాలకు భారత వాణిని బలంగా వినిపించే ఎంపీల పేర్లను పంపాలని కోరారు. అందుకు సమాధానంగా కాంగ్రెస్ పార్టీ, నలుగురు ఎంపీల పేర్లను పంపింది. అయితే.. ఆ పేర్లలో ఐక్య రాజ్య సమితి కీలక బాధ్యతలు నిర్వహించిన అనుభవంతో పాటుగా,విదేశీ వ్యవహార స్థాయి సంఘం చైర్మన్ గా ఉన్న సీనియర్ ఎంపీ శశిథరూర్ పేరు లేదు. మాజీ మంత్రి ఆనంద్ శర్మ, లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ ఉప నాయకుడు గౌరవ్ గొగోయ్, మరో ఇదరు ఎంపీలు సయ్యద్ నసీర్ హుస్సేన్, రాజా బ్రార్ పేర్లను కాంగ్రెస్ పార్టీ పంపింది. అయితే, ప్రభుత్వం విడుదలచేసిన జాబితాలో కాంగ్రెస్ నుంచి శశిథరూర్ పేరు ఉండటం అందర్నీ ఆశ్చర్యపరిచింది. కాంగ్రెస్ పంపిన జాబితాలో శశిథరూర్ పేరు లేకపోయినా ఆయన పేరును కేంద్రం ప్రకటించడం, వివాదంగా మారింది.
మరో వంక. శశిథరూర్ అఖిలపక్ష బృందానికి నాయకత్వం నడిపించే అవకాశం దక్కడం ఆనందంగా ఉందన్నారు. పహల్గాం దాడి నుంచి ఇటీవల చోటుచేసుకున్న కార్యకలాపాలపై భారత వైఖరిని ప్రపంచ దేశాల ముందు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. దేశానికి తన సేవలు అవసరమైనప్పుడు తప్పకుండా అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు.