మంత్రుల మధ్య భగ్గుమన్న విభేదాలు.. ఉత్తమ్ పై అలిగిన కోమటిరెడ్డి.. ఏంజరిగిందంటే?
posted on Jul 29, 2025 1:24PM

కాంగ్రెస్ మంత్రుల మధ్య విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. నల్గొండ జిల్లాకే చెందిన మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిల మధ్య విభేదాలు రచ్చకెక్కియి. నాగార్జున సాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే కార్యక్రమం సందర్భంగా ఈ విభేదాలు బహిర్గతమయ్యాయి. మంగళవారం (జులై 29) సాగర్ గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయాల్సిన కార్యక్రమానికి మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ ను సాగర్ కువెళ్లాల్సి ఉంది. ముందుగా నిర్ణయించిన కార్యక్రమం ప్రకారం ఈ ముగ్గురు మంత్రులూ ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరాల్సి ఉంది. ఆ మేరకు ఉదయం 9గంటలయ్యే సరికల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లు బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రావడంలో తీవ్ర జాప్యం జరిగింది. పది గంటల వరకూ ఎదురు చూసిన మంత్రి కోమటిరెడ్డి తీవ్ర అసహనానికి గురయ్యారు.
తనను ఉదయం 9గంటలకల్లా రమ్మని చెప్పి ఆయన మాత్రం రాకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కోమటిరెడ్డి తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని బేగంపేట విమానాశ్రయం నుంచి వెనక్కు వెళ్లిపోయారు. దీంతో మంత్రి కోటమిరెడ్డి వెంకటరెడ్డి లేకుండానే మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్ లు హెలికాప్టర్ లో సాగర్ కు బయలుదేరి వెళ్లారు.
కోమటిరెడ్డి అలకను, ఆగ్రహాన్నీ పట్టించుకోకుండా మంత్రులు ఉత్తమ్, లక్ష్మణ్ లు నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేసే కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం పూర్తి చేశారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డితో కలిసి నాగార్జునసాగర్ గేట్లు ఎత్తి నీటిని కిందకు విడుదల చేశారు. దాదాపు18 ఏళ్ల తర్వాత జూలై నెలలో నాగార్జునసాగర్ గేట్లు తెరవడం ఇదే తొలిసారి. సాధారణంగా సాగర్ గేట్లు ఆగస్టు చివరిలో లేదా సెప్టెంబర్ తొలి వారంలో తెరిచి దిగువకు నీటిని విడుదల చేస్తారు.