కొద్ది సేపట్లో తెలంగాణ పై ప్రకటన
posted on Jul 30, 2013 6:11PM
యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం ముగిసిన అనంతరం యుపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధి నివాసంలో సీడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశం సుమారు గంట, గంటన్నరపాటు జరగవచ్చునని భావిస్తున్నారు. ఆ తర్వాత ఏడు గంటల ప్రాంతంలో సీడబ్ల్యూసీ సమావేశంలో వెల్లడైన అభిప్రాయాలపైనా, తీర్మానం గురించీ అధికారికంగా మీడియా సమావేశంలో ప్రకటించే అవకాశం ఉంది.
తెలంగాణా అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం అంతిమ నిర్ణయం ప్రకటించే క్షణాలు సమీపిస్తుండడంతో ప్రధాని డాక్టర్ మన్మోహ న్ సింగ్ నివాసం వద్ద పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. యూపీఏ భాగస్వామ్య పక్షాలతో సమన్వయ కమిటీ సమావేశం దాదాపు గంటసేపు జరిగింది. గతంలో ఎప్పుడూ ప్రధాని ఇంటివద్ద ఇంత పెద్ద ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేయలేదు. తెలంగాణాపై ఏం నిర్ణయం తీసుకుంటారోనన్న ఆసక్తితో ప్రధాని ఇంటి సమీపంలో మీడియా ప్రతినిధులు గుమికూడారు.