సమైక్యాంధ్రకోసం త్యాగానికి సిద్ధమంటున్న కాంగ్రెస్?
posted on Jul 28, 2012 12:47PM
ఎన్నికల్లో గెలుపు ఒక్కటే ముఖ్యం కాదు. ఒక రాష్ట్రభవిష్యత్తు అనేదే కాంగ్రెస్కు ముఖ్యమని ఆ పార్టీ సీనియర్ నేతలు ప్రకటిస్తున్నారు. 2014ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఓటమి పాలైనా పర్వాలేదంటున్నారు వారు. సమైక్యాంథ్ర కోసం పోరాడిన నాటి నేతల స్ఫూర్తిని రాష్ట్రానికి మిగులుస్తామని త్వరలో కాంగ్రెస్ ప్రకటించబోతోంది. అంతేకాకుండా అవసరమైతే ఈ రాష్ట్రాన్ని త్యాగం చేస్తాం కానీ, వేర్పాటువాద ధోరణిని సహించబోమని కాంగ్రెస్ హెచ్చరించనుంది. ఒక్క విభజన సిద్ధాంతాలనే పునాదులపై పార్టీలు పుట్టుకొచ్చినా పర్వాలేదు కానీ, కాంగ్రెస్ అన్న పదానికి సరైన అర్థం వచ్చేలా ప్రవర్తిస్తామని ఆ పార్టీ పేర్కొంటోంది.
అందుకోసం అథికారాన్ని త్యాగం చేయటానికైనా సిద్ధమేనని కాంగ్రెస్ కేంద్ర కమిటీ త్వరలో ప్రకటించనుంది. ఇప్పటి వరకూ దేశంలో ఇందిరాగాంధీ, రాజీవ్గాంధీల పాలనపై సదభిప్రాయం ఉందని, దాన్ని కొనసాగేలా భవిష్యత్తులో నడుచుకుంటామని ఆ పార్టీ సీనియర్ నేతలు అంటున్నారు. ఎందరో స్వాతంత్య్ర ఉద్యమ సారధులు తమ పార్టీ ఏర్పాటుకు కీలకపాత్ర పోషించినందున ఆనాడు పాకిస్తాన్గా విభజించటానికే ఇష్టపడని ఆ నిర్ణయాన్నే ఆంధ్రప్రదేశ్ విషయంలోనూ అమలు చేస్తామంటున్నారు. ఒక ప్రాంత ప్రజల ఆశల కోసం ఇంకొకరిని బలిపెట్టబోమని కాంగ్రెస్ ఘాటుగా సమాధానం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ప్రత్యేకించి ఆగస్టు 8 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాలకు ముందే ఈ విషయాన్ని యథాతథంగా ప్రకటిస్తామని సీనియర్ నేతలు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.