కారు హారన్‌ కొట్టాడని కాంగ్రెస్ నేత దౌర్జన్యం

 

రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హారన్ కొట్టటం సహజం.అయితే హారన్ కొట్టాడని ఓ కాంగ్రెస్ నేత సదరు వ్యక్తి ఇంట్లోకి అనుచరులతో చొరబడి దౌర్జన్యం చేశాడు.మహిళలతో అసభ్యంగా ప్రవర్తించాడు.కారు అద్దాలు ధ్వసం చేశాడు.పోలీసుల కధనం ప్రకారం...ద‌మ్మాయిగూడ లక్ష్మీనగర్‌కు చెందిన ప్రసాద్‌గౌడ్‌ అర్ధరాత్రి 12.30కు కారులో ఇంటికి వస్తున్నాడు. ప్రసాద్‌గౌడ్‌ దమ్మాయిగూడ కూడలి నుంచి ఇంటి సమీపంలోని మలుపు వద్దకు రాగానే కారు హారన్‌ను మోగించాడు.కీసర మండలానికి చెందిన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కందాడి స్కైలాబ్‌రెడ్డి అదే లక్ష్మీనగర్‌ లో నివాసముంటున్న బంధువు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుడు నర్సింహారెడ్డి ఇంటికి వచ్చారు.అయితే ప్రసాద్‌గౌడ్‌ హారన్‌ కొట్టినప్పుడు స్కైలాబ్‌రెడ్డి ఇంటి బయట ఉన్నారు.తన ముందు హారన్‌ కొడుతూ వెళ్లటంతో స్కైలాబ్‌రెడ్డి ఆగ్రహానికి లోనయ్యారు.తన అనుచరులతో ప్రసాద్‌గౌడ్‌ ఇంటికి వెళ్లారు.

గేటును తన్ని ఇంట్లోకి చొరబడ్డారు.ఇంట్లోని వస్తువులు, పూలకుండీలను ధ్వంసం చేశారు.ఇదేంటని ప్రసాద్‌గౌడ్‌ నిలదీయడంతో నా ముందు హారన్ కొడతావా అంటూ కుటుంబ సభ్యులపై దాడికి దిగారు.అక్కడే ఉన్న ప్రసాద్‌గౌడ్‌ సోదరి అడ్డుకునేందుకు యత్నించగా ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు.ఇంట్లోని కుటుంబ సభ్యులందరిని బెదిరించి వారితో కాళ్లు మొక్కించుకుని అవమానానికి గురిచేశారు.అనంతరం బయట ఉన్న కారు అద్దాలను ధ్వంసం చేశారు.దీంతో ప్రసాద్ గౌడ్ 100కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.అక్కడికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరించారు.అనంతరం ప్రసాద్ గౌడ్ జవహర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఈ మేరకు పోలీసులు స్కైలాబ్‌రెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.