అవును.. ఈటల రాజేందర్ కు మద్దతిచ్చాం.. కాంగ్రెస్ ఎంపీ సంచలనం..
posted on Nov 2, 2021 3:18PM
తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఘన విజయం దిశగా దూసుకుపోతున్నారు. తొలి రౌండ్ నుంచే లీడ్ సాధించిన ఈటల... రెండు, మూడు రౌండ్లు మినహా మిగిలిన అన్ని రౌండ్లలోనూ మంచి మెజార్టీ సాధించారు. అయితే హుజురాబాద్ లో కాంగ్రెస్ కు మాత్రం ఘోరంగా ఓట్లు సాధించింది. ఆ పార్టీకి కనీసం 2 శాతం ఓట్లు కూడా రాలేదు. దీంతో కాంగ్రెస్ లో కలకలం రేగుతోంది.
హుజూరాబాద్ ఫలితాలపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ మంచి మెజార్టీతో గెలుస్తారని అన్నారు. ఎన్నికలో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ సర్వశక్తులను ఒడ్డిందని కోమటిరెడ్డి చెప్పారు. ఐదు నెలల్లోనే టీఆర్ఎస్ రూ. 5 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. మద్యం ఏరులై పారిందని అన్నారు. అయినప్పటికీ టీఆర్ఎస్ కు అదిరిపోయే తీర్పును హుజూరాబాద్ ప్రజలు ఇవ్వనున్నారని చెప్పారు.
శత్రువుకు శత్రువు మిత్రుడు అనే సిద్ధాంతం ప్రకారం ఈటల రాజేందర్ కు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇవ్వక తప్పలేదని కోమటిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ గట్టిగా పోరాడితే ఓట్లు చీలిపోయి, చివరకు టీఆర్ఎస్ కు లాభం చేకూరుతుందనే తాము కాస్త వెనక్కి తగ్గామని చెప్పారు. ఈటలకు పరోక్షంగా మద్దతు ఇవ్వాల్సి వచ్చిందని అన్నారు. నాగార్జునసాగర్, దుబ్బాక ఎన్నికల్లో పని చేసినట్టు హుజూరాబాద్ లో తాము చేయలేదని చెప్పారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.