పంచె కట్టుకున్నాడని రైల్లోంచి దించేశారు...ఏకాలంలో ఉన్నాం ?
posted on Jul 6, 2019 5:04PM

కొన్ని కొన్ని సంఘటనలు చదువుతూ ఉంటే పట్టరాని కోపం వచ్చేస్తున్తుంది. అలా ఎప్పుడు జరుగుతుంది అంటే అయ్యోపాపం అనుకున్నప్పుడో లేదా అలాంటి అవమాన కరమైన ఘటనలే మనం కూడా ఎదుర్కున్నప్పుడు. తాజాగా జరిగిన ఒక ఘటన కడుపు మండేలా చేయడం ఖాయం. ఎందుకంటే ధోతీ కట్టుకున్న పాపానికీ ఒక వృద్దుడిని రైలెక్కనీయ లేదు రైల్వే పోలీసులు. అదేదో అమెరికాలోనో ఆఫ్రికాలోనో కాదు మన భారతావనిలోనే.
ఈ ఘటనకు సంబందించిన పూర్తి వివరాల్లోకి వెళితే ఉత్తరప్రదేశ్ కి చెందిన రామ్ అవధ్ దాస్(82) ఎతవా నుంచి ఘజియాబాద్ వెళ్లటానికి శతాబ్ధి ఎక్స్ప్రెస్లో టిక్కెట్ రిజర్వ్ చేసుకున్నాడు. ఘజియాబాద్ వెళ్లటానికి ఎతవా రైల్వే స్టేషన్ చేరుకుని శతాబ్ధి ఎక్స్ప్రెస్ స్టేషన్కు చేరుకోగానే అందులోకి ఎక్కాడు. అయితే కొద్దిసేపటి తర్వాత ఆయనదగ్గరకు చేరుకున్న రైల్వే సిబ్బంది రామ్ అవధ్ దాస్ వేసుకున్న దుస్తులను, అతని వాలకాన్ని చూసి టికెట్ ఉందని చెబుతున్న వినిపించుకోకుండా కిందకు దింపేశారు.
ఆ పెద్దాయన కిందకు దిగి వేరే బోగిలోకి ఎక్కబోయేలోగా రైలు కదిలి వెళ్లిపోయింది. దీంతో ఆగ్రహించిన రామ్ అవధ్ దాస్ తనతో అలా ప్రవర్తించిన సిబ్బంది మీద రైల్వే అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు పొరపాటున వేరే బోగిలోకి ఎక్కటం వలెనే సిబ్బంది కిందకు దింపేశారని అతన్ని కించపరచలేదనీ, అతడు వేరే బోగిలోకి ఎక్కే సమయంలో రైలు కదిలి వెళ్లిపోయిందని చెబుతున్నారు. మహాత్మ గాంధీని నల్లవాడంటూ టికెట్ ఉన్నా రైల్లో నుంచి తోసేసిన విషయాన్ని జ్ఞప్తికి తెస్తున్న ఈ ఘటనలో అవధ దాస్ చూడడానికి మహాత్మాగాంధీ లానే ఉండడం గమనార్హం.