2033 వరకు కాంగ్రెస్ పార్టీదే అధికారం : సీఎం రేవంత్ రెడ్డి

 

 

మంత్రుల పనితీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పీఏసీ సమావేశంలో అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలను ఇన్‌ఛార్జ్ మంత్రులు పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. త్వరలోనే మార్కెట్ కమిటీలు, దేవాలయ కమిటీలలో నామినేటెడ్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నికకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సమాయత్తం చేయాలని కాంగ్రెస్ నేతలకు ఆయన సూచించారు.


టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ రచించిన ‘విధ్వంసం నుంచి వికాసం వైపు’ పుస్తకన్ని సీఎం రేవంత్ ఏఐసీసీ ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆవిష్కరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ రాష్ట్రాన్ని వికాసం వైపు కాంగ్రెస్ నడిపిస్తోందని.. సబ్బండ వర్గాలకు ఇచ్చిన అభయహస్తం హామీలను నెరవేరుస్తూ ఇంటింటా సౌభాగ్యం నిలిచేలా ఇందిరమ్మ రాజ్యాన్ని అందిస్తోందని తెలుపుతూ పుస్తకన్ని మహేశ్ కుమార్ గౌడ్  రచించారు. ఈ సందర్భంగా పీసీసీ నూతన ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు నియామక పత్రాలు అందజేశారు.  ఈ దేశంలో అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లే సాధ్యమైందన్నారు. 


ఉమ్మడి రాష్ట్రంలో 1994 నుంచి 2004 వరకు తెలుగు దేశం పార్టీ, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని సీఎం చెప్పారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014 నుంచి 2023 వరకు బీఆర్ఎస్ రెండు సార్లు అధికారంలో ఉందని 2023 నుంచి 2033 వరకు పదేళ్లు కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలో ఉండబోతున్నదన్నారు. ఈ పదేళ్లు పార్టీ కోసం పని చేసే వారిని కాపాడుకునే బాధ్యత పార్టీ తీసుకుంటుందన్నారు. పదేళ్లు అధికారం నడిపించే వరకు నేను బాధ్యత తీసుకుంటా. ఆ తర్వాత పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి నడిపించాల్సిన బాధ్యత పార్టీలోని యువతరం తీసుకోవాలని చెప్పారు.  ఎస్సీ వర్గీకరణలో దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యమెంట్ తీసుకువస్తున్నాం. త్వరలో డీలిమిటేషన్ జరగబోతున్నదని సీట్లు పెరగబోతున్నాయన్నారు. మహిళా రిజర్వేషన్లు రాబోతున్నాయి సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.