భారత సైనిక దళాలను చూస్తే గర్వంగా ఉంది : సీఎం చంద్రబాబు
posted on May 16, 2025 8:31PM

విజయవాడలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకు ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ర్యాలీలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్ విజయవంతం అయిన సందర్భంగా బీజేపీ చేపట్టిన దేశవ్యాప్త 'తిరంగ యాత్రలో భాగంగా నేడు ఏపీలో భారీ యాత్ర ఘనంగా నిర్వహించారు. సుమారు 5000 మంది పాల్గొన్న ఈ యాత్రలో జాతీయ జెండాలు చేపట్టి, దేశభక్తి నినాదాలు ఇస్తూ.. భారత సైనికులకు మద్ధతు తెలిపారు. ఈ సందర్బంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతు మన దేశాన్ని, మనల్ని కాపాడిన జవాన్లకు సెల్యూట్ తెలిపారు. ఉగ్రవాదాన్ని తుదముట్టించాలంటే ఆపరేషన్ సిందూర్ అవసరమని ముఖ్యమంత్రి అన్నారు.
అంతా గర్వించదగ్గ దళాలు మనకుండటం దేశానికే గర్వకారణమని పేర్కొన్నారు. జాతీయ జెండాను చూడగానే దేశభక్తి ఉప్పొంగుతుంది. ఆ జెండాని రూపొందించిన పింగళి వెంకయ్య ఈ ప్రాంతంవారే కావడం మన అదృష్టం. పహల్గామ్ అనగానే మనలో ఖబర్దార్ అని హెచ్చరించే పౌరుషం వస్తోంది' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆపరేషన్ సిందూర్లో భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులు, ఎంపీలు, ఎమ్మెల్యే, టీడీపీ బీజేపీ, జనసేన నాయకులు, నగరవాసులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొన్నారు. జాతీయ సమైక్యత, సమగ్రత చాటేలా విద్యార్థులు గీతాలాపన చేశారు.