ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన చంద్రబాబు, పవన్, లోకేశ్
posted on Aug 15, 2025 4:19PM

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించే స్త్రీ శక్తి’ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి డీప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ స్వయంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టారు. ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ మహిళల కోసం ఈ కీలక పథకం నేటి నుంచి అమలు చేస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం ఉండవల్లి నుంచి తాడేపల్లి, కనకదుర్గ వారధి మీదుగా విజయవాడ బస్ టెర్మినల్ వరకు చంద్రబాబు, పవన్, లోకేశ్ బస్సులోనే వెళ్లారు. వీరితో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, పలువురు ఇతర కూటమి నేతలు కూడా ఈ ప్రయాణంలో పాల్గొన్నారు. మహిళా ప్రయాణికులతో కలిసి ప్రయాణిస్తూ వారి సంతోషంలో పాలుపంచుకున్నారు.
సీఎం, మంత్రులు ప్రయాణిస్తున్న బస్సు వెళ్లే మార్గంలో మహిళలు పెద్ద సంఖ్యలో గుమిగూడి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. దారి పొడవునా మంగళహారతులతో నీరాజనాలు పలుకుతూ ఘన స్వాగతం పలికారు. ‘థాంక్యూ సీఎం సర్’ అంటూ నినాదాలతో తమ కృతజ్ఞతలు తెలియజేశారు. కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నేతలు పలుచోట్ల బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన కీలక హామీలలో ఒకటైన ఈ పథకాన్ని అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయడంపై రాష్ట్రవ్యాప్తంగా మహిళల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.మహిళలు 5 రకాల బస్సుల్లో ఫ్రీ బస్సు ప్రయాణం చేసే వెసులుబాటు కల్పించింది కూటమి ప్రభుత్వం.
పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. అలాగే సిటీ ఆర్డినరీ, ఎక్స్ప్రెస్, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లోనూ మహిళలు ఉచిత ప్రయాణం చేయవచ్చు. ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి కండక్టర్ జారీ చేసే జీరో ఫేర్ టికెట్తో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.స్త్రీ శక్తి' పథకం ద్వారా ఏకంగా 2.62కోట్ల మంది మహిళలు లబ్ధి పొందనున్నారు. మరోవైపు ఉచిత బస్సు ప్రయాణాన్ని ట్రాన్స్జెండర్లకు సైతం వర్తింపజేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ పథకం అమలుతో ఏపీ ప్రభుత్వంపై ఏటా రూ.1,942 కోట్ల అదనపు భారం పడనుంది.
.