కూటమికి చిరు మద్దతు.. జగన్ కు మైండ్ బ్లాక్!

కీలెరిగి వాత పెట్టినట్లుగా చిరంజీవి జగన్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఎన్డీయే కూటమి అభ్యర్థులకు మద్దతు ప్రకటిస్తున్నారు.  అసలే బలహీనంగా ఉన్న జగన్ కు చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ఇవ్వడం మరింత బలహీనం చేస్తుందనడంలో సందేహం లేదు. ఇప్పటి వరకూ చిరంజీవి ప్రత్యక్షంగా తన రాజకీయ మొగ్గు ఎటువైపు అన్నది ప్రకటించలేదు. కానీ మిత్రులు అంటూ అనకాపల్లి లోక్ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, అలాగే జనసేన అభ్యర్థి పంచకర్ల రమేష్ లకు ఓటు వేయండి అంటూ ఆయన ఒక వీడియో సందేహం ద్వారా ప్రజలకు పిలుపు నిచ్చారు. అంతకు ముందే తన సోదరుడు పవన్ కల్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీకి ఐదు కోట్ల రూపాయల విరాళం అందించారు.

ఇప్పుడు తాజాగా తన సోదరుడు పవన్ కల్యాణ్ కు ఓటు వేసి ఓ నిస్వార్థ సేవకుడిని గెలిపించాలని కోరుతూ పిఠాపురం ప్రజలను ఓ వీడియో ద్వారా కోరారు. ఎన్నికలు రోజుల వ్యవధిలోకి వచ్చేశారు. మరో ఐదు రోజులలో రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇప్పటికే కూటమికే రాష్ట్రంలో మొగ్గు కనిపిస్తోందంటూ పలు సర్వేలు తేల్చేశాయి. జగన్ తీవ్ర ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కూటమి సభలకు జనం పోటెత్తుతుండటం, మరో వైపు వైసీపీ ప్రచారానికి స్పందన కనిపించకపోవడంతో వైసీపీ శిబిరం డీలా పడింది. ఈ తరుణంలో చిరంజీవి కూటమికి మద్దతు పలికడం కచ్చితంగా వైసీపీకి మూలిగే నక్క మీద తాటిపండు పడ్డ చందంగా మారుతుందనడంలో సందేహం లేదు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు రానున్న రెండు మూడు రోజులలో చిరంజీవి తెలుగుదేశం అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. అలా కలవడం  అంటే చిరంజీవి తెలుగుదేశం కూటమికి బాహాటంగా మద్దతు ప్రకటించినట్లేనని భావించాల్సి ఉంటుంది. 

ఇక తాజాగా జనసేనానికి మద్దతుగా అన్నయ్య చిరంజీవి వీడియో సందేశం అందరినీ కదిలిస్తోంది. హృదయాలకు హత్తుకునేలా ఉంది. కుటుంబంలో చివరివాడిగా పుట్టిన పవన్ కల్యాణ్ సమాజానికి మేలు చేయడంలో మాత్రం ముందువాడిగా నిలిచాడని పేర్కొన్నారు.  చిరంజీవి పిలుపు పిఠాపురంలో ఏమూలో వైసీపీకి మిణుక్కు మిణుక్కు మంటున్న గెలుపు ఆశలను ఆవిరి చేసేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిరంజీవి చంద్రబాబుతో భేటీ అయితే ఆ ప్రభావం రాష్ట్రం మొత్తం ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే జగన్ సహా ఆ పార్టీ నేతలంతా ఓటమి బెంగతో డీలా పడ్డారు.  చిరు ఎంట్రీతో  ఆ పార్టీ అధినేత మరింత దుర్బలంగా మారడం ఖాయమంటున్నారు. ఎందుకంటే చిరంజీవి చాలా కాలంగా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజలలో ఆయనకు ఉన్న గుర్తింపు, గౌరవం మాత్రం చెక్కు చెదరలేదు. ఆయన మద్దతు నిస్సందేహంగా కాపు సామాజికవర్గ ఓటర్లను తెలుగుదేశం కూటమివైపు ఆకర్షిస్తుంది.  సరిగ్గా ఎన్నికల వేళ తెలుగుదేశం కూటమికి చిరు మద్దతుగా రావడం జగన్ కు మింగుడుపడని అంశమే. గతంలో సినిమా టికెట్ల తగ్గింపు చిరంజీవి జగన్ ను కలిసిన సందర్భంలో  ఎదురైన పరాభవానికి సరైన సమయంలో  ఎదురైన పరాభవానికి చిరంజీవి సరైన సమయంలో దీటైన బదులిచ్చినట్లుగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.