ఏప్రిల్ 27న పాదయాత్ర ముగింపు
posted on Mar 25, 2013 10:23AM
చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర విశాఖ జిల్లాలో ముగియనుంది. ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఆయన.. నాతవరం మండలం గన్నవరంమెట్ట వద్ద వచ్చే నెల ఎనిమిదో తేదీన విశాఖ జిల్లాలో అడుగుపెడతారు. ఏప్రిల్ 27 వరకు ఆ జిల్లాలో పర్యటిస్తారు. అదే రోజు విశాఖ మధురవాడలో బహిరంగ సభలో పాల్గొని పాదయాత్ర ముగిస్తారు. కాగా, విశాఖ జిల్లాలో మొత్తం 19 రోజులపాటు 11 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 163 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయనున్నారు.
జిల్లాలో చోడవరం, మాడుగుల, పాడేరు, అరకులోయ మినహా మిగిలిన నియోజకవర్గాల్లో ఆయన పర్యటిస్తారు. ఈ మేరకు పాదయాత్ర షెడ్యూల్ను పార్టీ జిల్లా పరిశీలకుడు సుజనాచౌదరి ఆదివారం వెల్లడించారు. యాత్ర ముగించేనాటికి ఆయన 2750 నుంచి 2800 కిలోమీటర్ల దూరం నడుస్తారని తెలిపారు. దేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడూ ఇంత సుదీర్ఘకాలం, ఇంత ఎక్కువ దూరం పాదయాత్ర చేయలేదని గుర్తుచేశారు. పాదయాత్ర ముగింపునకు గుర్తుగా మధురవాడలో పైలాన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.