తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్.. తోకలు కత్తిరిస్తాం

 

డేటా పేరుతో దాడులు చేస్తే  చూస్తూ ఊరుకొనే ప్రసక్తే లేదని టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు హెచ్చరించారు. సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన.. చిప్పిలి సమీపంలో విజయ పాల డెయిరీ, సహకార సంఘం ఆధ్వర్యంలో రూ.24కోట్ల వ్యయంతో నిర్మించిన టెట్రా ప్యాక్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేశారు. అదేవిధంగా మదనపల్లె గ్రామీణ మండలం చిప్పిలిలో నిర్మించిన సమ్మర్‌ స్టోరేజ్‌ వద్ద హంద్రీ-నీవా కాలువ ద్వారా చేరుకున్న కృష్ణాజలాలకు జలహారతి ఇచ్చారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రసంగించిన చంద్రబాబు.. డేటా దాడులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

జగన్‌, కేసీఆర్‌ కుమ్మక్కై టీడీపీని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. డేటా అనేది  పార్టీ వ్యక్తిగత విషయమని, అందులో తలదూర్చితే మీ మూలాలు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఏపీ డేటాపై కేసులు పెట్టేందుకు తెలంగాణ పోలీసులు ఎవరని ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ నియంతలాగా వ్యవహరిస్తున్నాడన్నారు. నియంతలా వ్యవహరిస్తే తాను చూస్తూ ఊరుకోబోనని హెచ్చరించారు. ఏపీ అభివృద్ధికి అడ్డుపడితే వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వైసీపీకి చెందిన కొందరు హైదరాబాద్‌లో ఉండి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారని మండిపడ్డారు. మన ప్రభుత్వ డేటాను ఎవరో దొంగిలిస్తే హైదరాబాద్‌లో ఉన్న పోలీసులు కాపాడతారట అంటూ ఎద్దేవాచేశారు. ఎవరో దారిన పోయిన దానయ్య ఫిర్యాదు చేశారని డేటా ఉంది కదా అని ఐటీ కంపెనీలపై దాడి చేస్తారా అని ప్రశ్నించారు. డేటా చోరీ పేరుతో తెలంగాణలో తప్పుడు కేసులు పెడితే ఖబడ్దార్ అంటూ తెలంగాణ సర్కార్‌ను హెచ్చరించారు. హైద్రాబాద్‌కు ఐటీ కంపెనీలను తీసుకొచ్చిన ఘనత తనదని గుర్తుచేసిన చంద్రబాబు.. 'నీ ప్రభుత్వానికి డేటా కూడ లేదు. నా ప్రభుత్వానికి డేటా ఉంది' అని పరోక్షంగా కేసీఆర్ ని ఎద్దేవా చేశారు. మోడీ, కేసీఆర్, జగన్‌లు కుమ్మక్కై ఏపీ రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో 8 లక్షల ఓట్లను తొలగించారని చెప్పారు. అవసరమైతే నా ఓటును కూడ తొలగించేందుకు సిద్దంగా ఉన్నారని విమర్శించారు. ఇది ఏపీ రాష్ట్రం.. బీహార్ రాష్ట్రం కాదన్నారు. మీ ఆటలు సాగనివ్వమన్నారు. అవసరమైత మీ తోకలు కత్తిరిస్తామని చంద్రబాబు హెచ్చరించారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu