కాంగ్రెస్ శని వదిలింది: బాబు
posted on Dec 9, 2013 12:24PM
దేశానికి పట్టిన కాంగ్రెస్ శని వదిలింది. నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దీనిని ప్రతిబింబిస్తున్నాయి. ఈ ఫలితాలను కాంగ్రెస్ కూడా స్వాగతించాలి. భవిష్యత్లో అవినీతి పార్టీలకు ఇదే గతి పడుతుంది. దేశ ప్రజలు నరేంద్ర మోడీని ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ వెంటిలేటర్ మీద ఉంది. ప్రజలు నీతివంతమయిన పాలనకే పట్టం కట్టారు అని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయడు అన్నారు. తెలంగాణ విషయంలో అందరికీ ఆమోదయోగ్యమయిన పరిష్కారం చూపిస్తానని చెప్పిన ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మాట తప్పారని ఆయన విమర్శించారు.
సోనియాగాంధీ చేతిలో ప్రధాని కీలుబొమ్మగా మారారని, ఆయన దేనికీ ఎదురు చెప్పడం లేదని తప్పుపట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశం మీద రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశానని అన్నారు. 371 డీ ఆర్టికల్ను వర్రీకరించి మాట్లాడుతున్నారని, అటార్నీ జనరల్ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, ఏ చట్టం కింద ఉమ్మడి రాజధాని చేస్తున్నారో చెప్పలేదని అన్నారు. నీటి మీద, హైదరాబాద్ మీద కేంద్రం తన పెత్తనం కోసం చూస్తుందని తప్పుపట్టారు. కాంగ్రెస్ పార్టీ దేశాన్ని పాలించే హక్కు కోల్పోయిందని అన్నారు.