ఏపీలో పోలీస్ రాజ్.. డీజీపీపై నిప్పులు చెరిగిన చంద్రబాబు..
posted on Aug 30, 2021 11:07AM
ఏపీలో వైసీపీ ప్రేరేపిత పోలీస్ రాజ్ కనిపిస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసమ్మతులు ఉంటే వేధిస్తారా? ప్రజలతో పాటు ప్రతిపక్ష నేతలను పోలీసులు వేధిస్తున్నారు. ప్రతిపక్ష నాయకులను చట్టవిరుద్ధంగా నిర్బంధిస్తున్నారు. ప్రజాస్వామ్య హక్కులకు విరుద్ధంగా చర్యలు ఉంటున్నాయి. మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై అక్రమ కేసులు తగవంటూ టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. విశాఖ జిల్లాలో చింతమనేనిని పోలీసులు అరెస్టు చేయడంపై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్కు చంద్రబాబు ఘాటు లేఖ రాశారు.
"టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు సరికాదు. అక్రమ నిర్బంధాలు, అరెస్టులు మంచిది కాదు. ప్రతిపక్ష నాయకులను బెదిరించే ప్రయత్నాలు తగదు. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నారు. చింతమనేని ప్రభాకర్ను అక్రమంగా అరెస్టు చేయడం హేయం. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రభాకర్ నిరసన వ్యక్తం చేశారు. దెందులూరు తహశీల్దార్కు వినతి పత్రమిస్తే తప్పుడు కేసులా? విశాఖలో వివాహ వేడుకకు హాజరైతే అశాస్త్రీయంగా అరెస్టు చేశారు. ప్రజల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే తప్పా? నిరసన ద్వారా అసమ్మతిని వ్యక్తం చేయడం చట్టవిరుద్ధమా?" అంటూ డీజీపీని నిలదీశారు చంద్రబాబు.
"టీడీపీ నాయకులపై తప్పుడు కేసులు పెట్టడంపైనే పోలీసులు దృష్టి పెడుతున్నారు. రాష్ట్రంలో రోజూ హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రజలు నిరంతరం భయం, అభద్రతతో జీవిస్తున్నారు. రాబోయే రోజులకు.. పోలీసుల ప్రస్తుత తీరు బ్లాక్ మార్క్గా ఉంటుంది. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే చర్యలు మానుకోండి. టీడీపీ నాయకులపై తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలి" అని లేఖలో డీజీపీని డిమాండ్ చేశారు చంద్రబాబు.