టెలికాంలో కేంద్రం కీలక నిర్ణయాలు.. కస్టమర్లకూ లాభమా?
posted on Sep 16, 2021 11:46AM
ఆధునిక ఆర్థిక వ్యవస్థలో టెలికాం రంగం అత్యంత కీలకమైన పాత్రను పోస్తిస్తుంది. అదే సమయంలో దేశీయ టెలికాం రంగం సంక్షోభాలను ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం టెలికాం రంగానికి భారీ ఊరట నిచ్చే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన మంత్రి వర్గ సమావేసంలో ఇటు దేశీయ టెలికాం రంగానికి ఊరట నిచ్చే మారటోరియం తో పాటుగా ఇటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను మెరుగు పరిచే విధంగా టెలికాం రంగంలో నూటికి నూరు శాతం విదేశీ పెట్టుబడులను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకుంది. కొవిడ్19 సంక్షోభ సమయంలో టెలికాం రంగం అత్యంత సమర్ధవంతంగా సవాళ్ళను ఎదుర్కుంది. ఆన్లైన్ తరగతులు, వర్క్ ఫ్రమ్ హోమ్, వర్చువల్ సమావేశాలు.. ఇలా డేటా వినియోగం విరీతంగా పెరిగిన నేపధ్యంలో టెలికామ్ రంగం సమర్ధవంతంగా పనిచేసింది. ఇక ఇప్పుడు ప్రవేశ పెట్టిన సంస్కరణలతో మరింత మెరుగైన సేవలు అందిస్తుందన్న విశ్వాసాన్ని మంత్రివర్గం వ్యక్తపరిచింది.
కాగా, కేబినెట్ తీసుకున్న నిర్ణయాలలో భాగంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న దేశీయ టెలికం రంగానికి నాలుగేళ్ల మారటోరియం కల్పిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఉపశమన ప్యాకేజీలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సర్దుబాటు చేసిన స్థూల రాబడి బకాయిలతో సహా టెలికాం బకాయిలపై నాలుగు సంవత్సరాల మారటోరియంను వర్తింపజేసేందుకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీని వల్ల వేల కోట్ల స్పెక్ట్రమ్ బకాయిలు ఉన్న వొడాఫోన్-ఐడియాలాంటి టెలికం కంపెనీలకు పెద్ద ఊరట కల్పిస్తుందని బిజినెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నిర్ణయం అక్టోబర్ 1 నుంచి అమలులోకి రానున్నట్లు కేబినెట్ తెలిపింది. మారటోరియం పొందినవారు సదరు మొత్తానికి ఎంసీఎల్ఆర్ ప్లస్ 2 శాతం వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. అంతే కాకుండా ఆటోమేటిక్ మార్గంలో టెలికాం రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు కేబినెట్ అనుమతించింది. ఈ విషయమై కెబినెట్ సమావేశంలో టెలికాం మంత్రి మాట్లాడుతూ ‘‘సంస్కరణలు చాలా విస్తృతమైనవి. అవి నిర్మాణాత్మకమైనవి. ప్రస్తుతం తీసుకునే సంస్కరణలు నేడు, రేపు, భవిష్యత్లో మార్పును తీసుకువస్తాయి’’ అని అన్నారు.
ఇదలా ఉంటే, టెలికాం రంగంలో 100శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనుమతించడం సహా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న పలు కీలక నిర్ణయాలపై టెలికాం సంస్థలు, హర్షం వ్యక్తం చేశాయి. ప్రభుత్వం చేపట్టిన ఈ సంస్కరణలు, ఉపశమన చర్యలు..టెలికాం రంగం తన లక్ష్యాలను చేరుకోవడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నాయి.