ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలకు ఓకే.. ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్సిగ్నల్..
posted on Sep 16, 2021 11:29AM
ఏపీలో మరోసారి రాజకీయ హడావుడి. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు హైకోర్టు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించవచ్చని తెలిపింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఏప్రిల్ 1న ఎస్ఈసీ నీలం సాహ్ని ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా ఏప్రిల్ 8న ఏపీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ తేదీకి 4 వారాల ముందు ఎన్నికల కోడ్ విధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా నోటిఫికేషన్ ఉందని హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల ప్రక్రియ ఎక్కడైతే ఆగిందో అక్కడి నుంచి నిర్వహించేందుకు తాజాగా నోటిఫికేషన్ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు కట్టుబడి పోలింగ్ తేదీకి నాలుగు వారాల ముందు తిరిగి ఎన్నికల కోడ్ విధించాలని స్పష్టంచేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రద్దు చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి మే 21న తీర్పు ఇచ్చారు.
అయితే, సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎస్ఈసీ, ఎన్నికల్లో పోటీ చేసిన కొందరు హైకోర్టులో అప్పీళ్లు వేశారు. వాటిపై ఆగస్టు 5న విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వు చేసింది. తాజాగా ఓట్ల లెక్కింపునకు గ్రీన్సిగ్నల్ ఇస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది.