లెక్చర్ ఇవ్వడానికి వెళ్లి.. చావు అంచులకు చేరి..
posted on Dec 8, 2021 4:29PM
భారత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న ఆర్మీ హెలికాప్టర్ ఘోర ప్రమాదానికి గురైంది. తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. ప్రమాద సమయంలో హెలికాప్టర్ లో 14 మంది ఉన్నారు. తమిళనాడులోని వెల్లింగ్టన్లో మిలిటరీ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు ఈ ఉదయం 9 గంటలకు ఢిల్లీలోని ప్రత్యేక విమానంలో వెళ్లిన రావత్.. కొద్ది గంటలకే ప్రమాదానికి గురయ్యారు.
ఉదయం 9 గంటల ప్రాంతంలో జనరల్ బిపిన్ రావత్, ఆయన సతీమణి మధులిక రావత్, ఆర్మీ ఉన్నతాధికారులు కలిసి ప్రత్యేక విమానంలో డీల్లీ నుంచి తమిళనాడు బయల్దేరారు. ఉదయం 11.35 గంటలకు సూలూరు ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ల్యాండ్ అయ్యింది. అక్కడి నుంచి వీరంతా ఎంఐ-17వీఎఫ్ హెలికాప్టర్లో వెల్లింగ్టన్కు బయల్దేరారు. వెల్లింగ్టన్లోని డిఫెన్స్ సర్వీస్ కాలేజీలో లెక్చర్ ఇచ్చేందుకు రావత్ బయల్దేరారు. మార్గమధ్యంలో మధ్యాహ్నం 12.20 గంటల సమయంలో కట్టేరీలోని నంచప్ప చత్రం ప్రాంతంలో వీరు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ఒక్కసారిగా కూలిపోయింది.
బిపిన్ రావత్.. సర్జికల్ స్ట్రైక్ మాస్టర్ మైండ్.. పవర్ఫుల్ ఆర్మీ బాస్..
అటవీ ప్రాంతంలో చెట్టుపై ఒక్కసారిగా కూలడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో హెలికాప్టర్ నుంచి నలుగురు ప్రయాణికులు మండుతూ కిందపడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతం వెల్లింగ్టన్ ఆర్మీ క్యాంప్కు కేవలం 16 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. మరో ఐదు నిమిషాల్లో ఆర్మీ క్యాంప్లో హెలికాప్టర్ ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. అంతలోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.