కొత్త స్ట్రెయిన్ కరోనా... మళ్ళీ లాక్ డౌన్ వైవు ప్రపంచం అడుగులు!
posted on Dec 21, 2020 11:25AM
కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పడుతోందని ప్రపంచం ఊపిరి పీల్చుకుంటున్న సమయంలో బ్రిటన్ లో మరోసారి తీవ్ర కలవరం మొదలైంది. కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ చాల వేగంగా వ్యాపిస్తోందని, దీని పై ఇప్పటికే నియంత్రణ కోల్పోయామని.. పరిస్థితి అదుపు తప్పిందని బ్రిటన్ హెల్త్ సెక్రటరీ మాట్ హెన్కాక్ వ్యాఖ్యలు చేసారు. ఈ కొత్త కరోనా స్ట్రెయిన్ విజృంభణకు అవకాశమివ్వకూడదని భావించిన యూకే ప్రభుత్వం తాజాగా లాక్డౌన్-4ను విధించింది. బ్రిటన్తో పాటు దక్షిణాఫ్రికా దేశాల్లో కూడా కొత్త రకం కరోనా వైరస్ స్ట్రెయిన్ విజృంభిస్తుండటంతో ప్రపంచ దేశాలు మరోసారి కలవరపడుతున్నాయి. యూకే నుంచి రాకపోకలు సాగించే ప్యాసింజర్ విమానాలపై భారత్ సహా యూరప్ దేశాలు విమాన సర్వీసులను వెంటనే నిలిపివేశాయి. ఇది ఇలా ఉండగా క్రిస్మస్ సందర్భంగా లాక్డౌన్ నిబంధనలను సడలిస్తామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ప్రకటన చేసి రోజులు కూడా గడవక ముందే లాక్డౌన్ 4ను మరింత కఠినంగా అమలు చేయాల్సిన పరిస్థితి రావడం అక్కడి ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ కొత్త స్ట్రెయిన్ వైరస్ ను ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కాక బ్రిటన్ ప్రభుత్వం ఇప్పటికే చేతులెత్తేసింది. ఈ కొత్త రకం కరోనా ఎంత వేగంగ వ్యాపిస్తోందంటే తాజాగా అమెరికా తర్వాత నిన్న ఎక్కువ కరోనా కేసులు బ్రిటన్లోనే నమోదయ్యాయి. దీంతో ఇన్నాళ్లూ మొదటి పది దేశాలలో అన్నిటికంటే కింద ఉండే బ్రిటన్... ఇప్పుడు టాప్ 2 ప్లేస్ కి వచ్చేసింది. దీంతో ప్రజలు క్రిస్మస్కి దూరంగా ఉండాలనీ, ఇళ్లలోనే ఉండాలని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఆదేశించారు. కరోనా వ్యాక్సిన్ దేశమంతా సప్లై అయ్యే వరకూ కొన్ని నెలలపాటూ తాజా నిబంధనలు కొనసాగుతాయని ఆయన అన్నారు.
కొత్త వైరస్ వేగంగా వ్యాపిస్తోంది కాబట్టి... మరణాల రేటు మాత్రం ఇప్పటి కంటే ఎక్కువగా ఉంటుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రపంచ దేశాలు కూడా మరికొన్ని నెలలపాటూ కఠిన నిబంధనలను కొనసాగించడం మేలంటున్నారు. ఈ కొత్త వైరస్ డిటైల్స్ పూర్తిగా అర్థం కాలేదనీ... అయితే మున్ముందు దీని వివరాలు పూర్తిగా తెలుస్తాయంటున్నారు.