ముఖ్యమంత్రి కాన్వాయ్ పై కోడిగుడ్ల దాడి..
posted on Nov 24, 2021 4:33PM
ముఖ్యమంత్రి కాన్వాయ్.. అత్యంత భారీ భద్రత మధ్య ముందుకు సాగుతోంది. సీఎం కాన్వాయ్ వస్తుందంటే రోడ్డుపై ట్రాఫిక్ నిలిపివేస్తారు. సీఎం కాన్వాయ్ దగ్గరకు వెళ్లడానికి ఎలాంటి అవకాశం ఉండదు. కాని భారీ భద్రత ఉండే ముఖ్యమంత్రి కాన్వాయ్ పై కొందరు యువకులు దాడికి పాల్పడ్డారు. అతి దగ్గరగా వెళ్లి కోడిగుడ్లు విసిరారు. సీఎం కాన్వాయ్ పై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. పోలీస్ శాఖను షేక్ చేస్తోంది.
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కాన్వాయ్పై భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. పూరీ నగరంలోని దర్జీపోఖారీ ఛక్ వద్ద ఈ దాడి జరిగింది. శ్రీ జగన్నాథ్ పరికర్మ ప్రాజెక్టు శంకుస్థాపనకు సీఎం పట్నాయక్ వెళ్లి తిరిగి వస్తుండగా ఈ దాడికి పాల్పడ్డారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రతను ఛేదించుకుని బీజేవైఎం కార్యకర్తలు అత్యంత సమీపం నుంచి సీఎం కాన్యాయ్పైకి కోడిగుడ్లు విసిరారు. ఇవి నేరుగా ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు అద్దాలకు తగిలాయి. దాడి చేసిన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాష్ట్ర హోంశాఖ సహాయ మంత్రి దిబ్య శంకర్ మిశ్రాను కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గత కొద్ది రోజులుగా బీజేపీ నిరసన కార్యక్రమాలు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే పలువురు మంత్రుల వాహనాలపై కోడిగుడ్ల దాడులకు పాల్పడింది. మహిళా టీచర్ మమతా మెహర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు గోబింద సాహుతో శంకర్ మిశ్రా సంబంధాలున్నాయని బీజేపీ, కాంగ్రెస్ ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కోడిగుడ్ల దాడులు జరుగుతున్నాయి.
సీఎం కాన్యాయ్పై కోడిగుడ్ల దాడి చేసింది తామేనని బీజేవైఎం ఒడిశా అధ్యక్షుడు ఇరాసిస్ ఆచార్య తెలిపారు. ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్లినా నిరసన తెలుపుతుంటామన్నారు. దిబ్య శంకర్ను కేబినెట్ నుంచి తొలగించే వరకు ఇదే తరహాలో ఆందోళనలు కొనసాగిస్తామని స్పష్టం చేశారు.