16 నెలలు చిప్ప కూడు తిన్నా బుద్ది మారలేదు.. విజయసాయిరెడ్డికి అయ్యన్న స్ట్రాంగ్ కౌంటర్

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "16 నెలలు చిప్పకూడు తిన్నా జగన్ రెడ్డికి, విజయసాయిరెడ్డికి బుద్ధి మారలేదు. అదే దొంగ బతుకు ఇంకెన్నాళ్లు? ఇంకెంత కాలం మీ ఫేక్ ప్రచారం? అందుకే మిమ్మల్ని ఫేక్ గాళ్ళు అనేది'' అంటూ అయ్యన్న మండిపడ్డారు. ''శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి పట్టణంలో పాలేశ్వరస్వామి ఆలయం దగ్గర ఉన్న 3 రోడ్ల జంక్షన్ వెడల్పు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగింది. అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి దిమ్మ కూడా అప్పుడే ఏర్పాటు చేసారు. పాలేశ్వరస్వామి దేవాలయం ధర్మకర్తలు చెట్టు దగ్గర ఉన్న పాత నంది విగ్రహాన్ని ఆ దిమ్మపై ప్రతిష్టించారు'' అని అయ్యన్న వివరించారు.

 

అయితే ''నంది విగ్రహాన్ని తొలగించి వైఎస్ విగ్రహం పెట్టడానికి వైసీపీ నాయకులు అసత్య ప్రచారం మొదలుపెట్టారు. గ్రామస్తుల సమక్షంలో అందరూ చూస్తుండగానే విగ్రహ ప్రతిష్ఠ జరిగితే సిసి టివి ఫుటేజ్ అంటూ ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు?'' అని అయన ఈ సందర్భంగా ఎంపీని నిలదీశారు. అసలు ''జరిగింది విగ్రహ ప్రతిష్ఠ అయితే టిడిపి నేతలు విగ్రహం ధ్వంసం చేసారంటూ ఫేక్ ప్రచారం ఏంటి సాయిరెడ్డి? హిందూ దేవతా విగ్రహాలు ధ్వంసం చేసానంటూ ప్రకటించిన వాడిని, వాడి వెనుక ఉన్న మత మార్పిడి మాఫియా పెద్దలను తప్పించడానికి మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ధర్మమే గెలుస్తుంది. తప్పు చేసిన వారిని ఆ దేవుడు శిక్షిస్తాడు అన్న విషయం జగన్ రెడ్డి కి బాగా తెలుసు కదా'' అని అయ్యన్న పేర్కొన్నారు.

 

అయితే అంతకుముందు వైసిపి ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ లో ''మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి, రాజకీయ ఉనికి కోసం నీచానికి తెగబడుతోంది పచ్చపార్టీ. టెక్కలిలో శివాలయంలో ఉన్న నంది విగ్రహం తొలగింపే దీనికి ఉదారహరణ. ఇది చాలు రాష్ట్రంలో విగ్రహాల ధ్వంసం వెనుకున్నవారెవరో చెప్పడానికి? సీసీ కెమెరా దృశ్యాలపై చంద్రన్న, అచ్చన్నా ఏమంటారు?'' అంటూ ఒక వీడియోను జత చేశారు.