ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఒకే సారి ఎన్నికలు?

ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగవలసిన తీరుగా జరుగుతాయా,  ముందస్తుకు జరుగుతాయా? ఇది ఇప్పడు కాదు, ఎప్పటి నుంచో  జరుగుతున్న చర్చ. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ మరో మారు జమిలి ఎన్నికల చర్చను తెరపైకి తెచ్చిన తర్వాత ... ముందస్తు అసెంబ్లీ ఎన్నికల చర్చ మరింత ఊపందుకుంది. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల ప్రకటన చేసినప్పటి నుంచి మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటుగా,జమిలి బిల్లు తెచ్చేందుకే ప్రత్యేక సమావేశాలు అనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరో వంక  సెప్టెంబర్ 18న మొదలైన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో అందరూ అనుకున్నట్లుగానే, కేంద్ర ప్రభుత్వం కొత్త పార్లమెంట్ భవనంలో మహిళా బిల్లుతోనే అడుగుపెట్టింది.

మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో విపక్షాలు, బిల్లును సమర్దిస్తూనే  చిన్న చిన్న చిక్కులు సృష్టించే ప్రయత్నం చేసినా, కేంద్ర ప్రభుత్వం విపక్షాలు వెనకడుగువేసే ఆవకాశం లేకుండా ముగ్గులోకి దించింది.  బుధవారం( సెప్టెంబర్ 20) లోక్ సభలో బిల్లు ఆమోదం పొందింది,  గురువారం( సెప్టెంబర్ 21) పెద్దల సభలోనూ పాసై ..రేపో మాపో చట్టంగా బయటకు వస్తుంది. సరే, మహిళా బిల్లు చట్టం అయినా  2024 సార్వత్రిక ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్ అమలు కాదు.  ఎన్నికల తర్వాత జనగణన, డీలిమిటేషన్  ప్రక్రియలు పూర్తయిన తర్వాతనే మహిళల రిజర్వేషన్లు అమలులోకి వస్తాయని  హోం మంత్రి అమిత్ షా లోక్ సభలో స్పష్టం చేశారు. అయినా చట్టం అమలుకు సంబంధించి ఇంకా కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అయినా అది ప్రస్తుతానికి అప్రస్తుతం. కనుక దానిని పక్కన పెడితే.. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలకు చాలా ముందునుంచి రాజకీయ వర్గాల్లో  జమిలి ఎన్నికల చర్చ బలంగా నడుస్తోంది. అయితే, ప్రస్తుతానికి   ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయినా ఆ అంశం చుట్టూనే  చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు? అనే ఉత్కంఠ ఉంది.

మహిళా బిల్లు తరహాలో ముందస్తు సమాచారం లేకుండా జమిలి బిల్లును ప్రభుత్వం తెస్తుందా అన్న అనుమానాలున్నాయి. మహిళా బిల్లు తరహాలో  2029 ఎన్నికల నుంచి అమలుచేసే విధంగా జమిలి ఎన్నికల బిల్లును తెస్తుందా, అన్న అనుమనాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్, జమిలి ఎన్నికలపై  బీజేపీ, ముఖ్యంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టి పెట్టారు. ఈ టర్మ్ పూర్తయ్యే లోగా, ఈ రెండు హామీలకు చట్ట బద్దత   కల్పించే ఉద్దేశంతోనే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వాహించానే నిర్ణయం తెసుకున్నట్లు బీజీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపధ్యంలో అవసరం అయితే, ప్రత్యేక సమావేశాలను మరో ఒకటి రెండు రోజులు పొడిగించి జమిలి బిల్లును ‘మమ’  అనిపించినా అనిపించవచ్చని అంటున్నారు. 

అదే నిజమైతే, లోక్ సభ ఎన్నికలను ముందస్తుకు జరిపి, ఆ ఎన్నికలతో పాటుగా, ఐదారు నెలలు అటూ ఇటుగా ఎన్నిలు జరగ వలసిన రాష్ట్రాల శాసన సభ ఎన్నికలను అటూ ఇటు చేసిన మినీ జమిలి ఎన్నికలు జరుపుతుందా అనే విషయంలోనూ అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఈ అనుమానాలు మరింత  బలంగావినిపిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం  బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, తెలంగాణ మంత్రి తారక రామా రావు, అసెంబ్లీ  ఎన్నికలు ఆరు నెలలు వాయిదా  పడే   అవకాశం లేక పోలేదని అన్నారు. లోక్ సభ ఎన్నికలతో పాటుగా వచ్చే మార్చి,ఏప్రిల్ లో జరిగ వచ్చని అన్నారు. అందుకు తగ్గట్టునే భారత ప్రాధాన ఎన్నికల  కమిషనర్ రాజీవ్ కుమార్, అసెంబ్లీ ఎన్నికలను గడువుకు  ఆరు నెలలు ముందు  వెనక నిర్వహించే అధికారం ఎన్నికల సంఘానికి ఉందని పేర్కొన్నారు. 

అదలా ఉంటే ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  బుధవారం( సెప్టెంబర్20) జరిగిన మంత్రివర్గ సమావేశంలో  ముదస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు.  జమిలి లేదా ముందస్తు ఎన్నికలపై  పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కేంద్ర  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో, చూద్దాం .. ఆ తర్వాత ముందస్తు పై ఒక నిర్ణయం తీసుకుందామని అన్నట్లు తెలుస్తోంది, మరో వంక బీజేపీ నాయకులు అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు యథాతథంగా గడువు ప్రకారమే జరుగుతాయని పైకి అంటున్నా, వ్యక్తిగత సంభాషణల్లో  మినీ జమిలి అవకాశాలను పూర్తిగా కొట్టివేయలేమని అంటున్నారు. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఒకే సారి ఎన్నికలు జరిగే అవకాశాలే అధికంగా ఉన్నాయని అంటున్నారు.  అందుకు తగ్గట్టుగానే ముఖ్యమంత్రి జగన్ కేబినెట్ భేటీలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా సిద్ధంగా ఉండాలని చెప్పడం.. ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతో పాటే జరుగుతాయని అంటున్నారు. అయితే అది ఈ ఏడాది డిసెంబర్ లోనా, వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలతో పాటుగానే అనే విషయంలో మాత్రం స్పష్టత లేదని అంటున్నారు.