కేజ్రీవాల్ ప్రభుత్వంతోనే వ్యవహరించండి. హైకోర్టు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎట్టకేలకు ఓ పెద్ద ఊరట లభించింది. గత కొంత కాలంగా లెఫ్టింనెంట్ గవర్నర్ విషయంలో కేంద్ర ప్రభుత్వంతో ఇబ్బందులు పడుతున్న కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టు తీర్పుతో ఊపిరి పీల్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అధికారులను ఢిల్లీ ప్రభుత్వ ఏసీబీ అధికారులు విచారించడానికి వీల్లేదని, ఇంకా కొన్ని అంశాలపై ఢిల్లీ ప్రభుత్వం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని, ఈ అంశాలలో లెఫ్టినెంట్ గవర్నర్ ఢిల్లీ ప్రభుత్వ సలహాలు తీసుకోవాల్సిన అవసరం లేదని కేంద్రం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం నుంచే ఏసీబీ విభాగం ఆదేశాలు తీసుకుని పాటించాలే తప్ప కేంద్ర ప్రభుత్వం నుండి కాదని, అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఢిల్లీ మంత్రి వర్గం సలహాలతోనే పనిచేయాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ హైకోర్టు తీర్పు కేంద్ర ప్రభుత్వానికి పెద్ద దెబ్బ అని ఆయన ట్వీట్ చేశారు.