ఏపీ మంత్రి నారాయణ కొడుకు దుర్మరణం...
posted on May 10, 2017 10:25AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ కుమారుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో తెల్లవారుజామున 3 గంటల సమయంలో నిశిత్ నారాయణ, రాజా రవివర్మ జూబ్లీహిల్స్ చెక్పోస్టు వైపు నుంచి పెద్దమ్మ గుడి వైపు వెళ్తుండగా.. కారు ఒక్కసారిగా అదుపుతప్పి మెట్రో పిల్లర్ నెం-9 బలంగా ఢీకొట్టింది. కారులో నిశిత్ నారాయణతోపాటు అతని స్నేహితుడు రాజా రవివర్మ ఉండగా.. కారు ఎయిర్ బ్యాగులు తెరుచుకున్నప్పటికి ప్రమాదం తీవ్రత ఎక్కువగా ఉండటంతో వారిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు కొడుకు మరణంతో మంత్రి నారాయణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఒక్కగానొక్క కుమారుడు ఆకస్మిక మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. ఇక లండన్ పర్యటనలో ఉన్న మంత్రి నారాయణ కుమారుడి మరణ వార్త వినగానే హుటాహుటిన భారత్కు బయలుదేరారు.
ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిశిత్ మృతిపై దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ఇంకా పలువురు రాజకీయ నేతలు, నారాయణ బంధువులు నిశిత్ మృతిపట్ల సంతాపం తెలుపుతున్నారు. అతని మృత దేహాన్ని చూడడానికి ఆస్పత్రికి తరలి వస్తున్నారు. నిషిత్ ప్రస్తుతం నారాయణ విద్యాసంస్థలకు డైరెక్టర్గా పనిచేస్తున్న నేపథ్యంలో.. నారాయణ విద్యా సంస్థల అధ్యాపకులు, విద్యార్థులు పెద్దయెత్తున చేరుకుని నిశీత్కు నివాళులర్పిస్తున్నారు. కాగా రేపు నెల్లూరులో నిశిత్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.