వాళ్లు పరీక్షలు ఎలా రాస్తారు? పున‌రాలోచించాలన్న ఏపీ హైకోర్టు 

క‌రోనా విజృంభ‌ణ రోజురోజుకీ పెరిగిపోతున్న‌ప్ప‌టికీ ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించడానికి ఏపీ ప్ర‌భుత్వం సిద్ధ‌మైంది.  దీనిపై వ‌చ్చిన పిటిషన్ల‌పై హైకోర్టులో విచార‌ణ జ‌రిగింది. ప‌దో త‌ర‌గ‌తి, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌పై పున‌రాలోచించాలని ఏపీ స‌ర్కారుని హైకోర్టు సూచించింది. ఈ సందర్భంగా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. పిటిషనర్ల తరపున సీనియర్‌ కౌన్సిల్‌ చేసిన వాదనలో.. చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు.. పరీక్షల్లో భాగం కావాల్సి ఉందని పేర్కొంది. అందువల్ల ప్రభుత్వం వెంటనే పున:పరిశీలన చేసుకోవాలని సూచించింది. 

కొవిడ్‌ వచ్చిన విద్యార్థులు పరీక్షలు ఎలా రాస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. నిబంధనల ప్రకారం హోం ఐసోలేషన్‌లో ఉండాలి కదా? అని ప్రభుత్వాన్ని నిలదీసింది. వారికి ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారని... అదెలా సాధ్యమవుతుందని ఏపీ హైకోర్టు ప్రశ్నించింది. కొవిడ్‌ వచ్చిన వారు మానసికంగా పరీక్ష రాయగలుగుతారా? అని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు వాయిదా లేదా రద్దు చేసిన విషయంతో పాటు.. రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. కేసు విచారణను హైకోర్టు మే 3వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని ఆదేశించింది. మే 2లోపు ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu