పీఎస్సార్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిలు మంజూరు

సీనియర్ ఐపీఎస్ అధికారి, ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆరోగ్య కారణాలపై ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ పై  కోర్టు సానుకూలంగా  స్పందించింది. రెండు వారాల పాటు మధ్యంతర బెయిలు ఇస్తూ బుధవారం (జూన్ 11) తీర్పు వెలువరించింది.  ఏపీపీఎస్సీ అక్రమాల కేసులో విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పీఎస్సార్ ఆంజనేయులుకు మధ్యంతర బెయిలు లభించడంతో ఆయనకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.  ఏపీపీఎస్సీ ఆక్రమాల కేసులో పీఎస్సార్ ఆంజనేయులు విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే.  పీఎస్సార్ ఆంజనేయులు తొలుత ముంబై నటి కాదంబరి జత్వానీని అక్రమంగా నిర్బంధించి, ఆమెపై అక్రమ కేసు నమోదు చేశారన్న ఆరోపణలపై అరెస్టయ్యారు. ఈ కేసులో ఆయన రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలోనే, ఏపీపీఎస్సీలో పరీక్షా పత్రాల మూల్యాంకనానికి సంబంధించి నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రమేయంతో అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఆయనపై వచ్చాయి. దీంతో   ఆంజనేయులును పోలీసులు అరెస్ట్ చేసి, కస్టడీలోకి తీసుకుని విచారించారు. కాగా, కాదంబరి జత్వానీ కేసులో  హైకోర్టు ఆంజనేయులుకు బెయిల్ మంజూరు అయినప్పటికీ ఏపీపీఎస్సీ కేసులో ఆయన   రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు.  ఇప్పుడు ఆరోగ్య కారణాలపై హైకోర్టు ఆయనకు బుధవారం 14 రోజులుమధ్యంతర బెయిలు మంజూరు చేసింది.   ఈ నెల 26న తిరిగి  జైలుకు సరెండర్​  కావాలని ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 

తన ఆరోగ్యం బాలేదనీ, చికిత్స కోసం బెయిలు మంజూరు చేయాలంటూ పీఎస్సార్ ఆంజనేయులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోగా, ఆ పిటిషన్ ను విచారించిన కోర్టు  పీఎస్సార్  ఆరోగ్యంపై సీల్డ్ కవర్ లో నివేదిక అందించాలంటూ బెజవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వైద్యులు పీఎస్సార్ ఆంజనేయులుకు సంబంధించిన పూర్తి స్థాయి ఆరోగ్య నివేదికను కోర్టుకు బుధవారం (జూన్ 11) ఆ నివేదికను పరిశీలించిన కోర్టు మధ్యంతర బెయిలు మంజూరు చేసింది.