ప్రధానితో భేటీ అయిన ముఖ్యమంత్రి జగన్
posted on Feb 9, 2024 1:14PM
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ఏపీ సీఎం జగన్ ఈ మధ్యాహ్నం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ప్రధానికి శాలువా కప్పి సత్కరించారు. ఆయనకు వెంకటేశ్వరస్వామి ప్రతిమను బహూకరించారు. ప్రధానితో సీఎం జగన్ సమావేశం దాదాపు గంటన్నర పాటు సాగింది. విభజన హామీలు, ఏపీకి రావాల్సిన పెండింగ్ నిధులు, తాజా రాజకీయ పరిణామాల గురించి సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశానికి పార్లమెంటులోని ప్రధాని కార్యాలయం వేదికగా నిలిచింది.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు పెండింగ్ బకాయిలపై చర్చించారు. ఏపీకి ప్రత్యేక హోదా విభజన హామీల అమలు సహా రాజకీయ అంశాలు ప్రధానితో జగన్ చర్చించారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం, పోలవరం నిధులు విడుదల, పోలవరం ప్రాజెక్టు పూర్తి నిర్మాణ వ్యయంకు ఆమోదం, 2014 జూన్ నుంచి 2017 జూన్ వరకూ తెలంగాణ రాష్ట్రానికి సరఫరా చేసిన విద్యుత్కు సంబంధించి బకాయిల క్లియరెన్స్, కేంద్ర వాటా నుంచి ఆంధ్రప్రదేశ్కు రావాల్సిన పన్ను చెల్లింపులు చేయాలని ప్రధానిని కోరారు.
ప్రధానితో సమావేశం అనంతరం సీఎం జగన్ పార్లమెంటులోని ఆర్థిక శాఖ కార్యాలయానికి వెళ్లారు. అక్కడ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కలిశారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, పెండింగ్ బకాయిల గురించి చర్చించారు.