మీ సొంతింటి కల బాధ్యత నాది.. చంద్రన్న భీమా డబుల్

 

ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ సీఎం చంద్రబాబు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడలో జరిగిన మేడే వేడుకల్లో పాల్గొన్న ఆయన.. పలువురు కార్మికులను సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మిక హక్కులను కాపాడుకోవడంతో పాటు ఆధునికీకరించాల్సి ఉందన్నారు. కార్మికుల కష్ట ఫలితమే రాష్ట్ర సంపద అని అన్నారు.

కార్మికులకు ఎల్లప్పుడూ టీడీపీ అండగా ఉంటోందని చంద్రబాబు చెప్పారు. కార్మికుల శ్రమను దోపిడీ చేసే యాజమాన్యాల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. మోదీ పాలనలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమయిందనీ, ఉద్యోగాలు ఊడిపోయాయని చంద్రబాబు విమర్శించారు. అయినా ఏపీకి రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చామనీ, తద్వారా ఉద్యోగాలు పోకుండా కాపాడామని చెప్పారు. చంద్రన్న భీమా ద్వారా కార్మికులకు రూ.5లక్షలు ఆర్థిక సాయం అందిస్తున్నామని, త్వరలోనే ఈ మొత్తాన్ని రూ.10లక్షలకు పెంచుతామన్నారు. డ్రైవర్ల సాధికార సంస్థను ఏర్పాటు చేసి ఆదుకుంటున్నామని గుర్తుచేశారు. అసంఘటిత కార్మికుల కోసం ఉచితంగా సొంతింటి నిర్మాణం చేపడతామని, ప్రతి ఒక్కరి సొంతింటి కల నెరవేర్చే బాధ్యత తనదని భరోసా ఇచ్చారు. సంపద సృష్టించడంలోనూ, సంపదను పేదలకు వినియోగించడంలోనూ ముందుంటామని చెప్పారు.