ఏఓబీ.. పెరుగుతున్న మృతుల సంఖ్య... ఒక కానిస్టేబుల్ మృతి

 

ఏఓబీ ప్రాంతంలో  పోలీసులకు, మావోయిస్టులకు మధ్య భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టుల  24కు చేరింది. మృతుల్లో ఆరుగురు మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారు. ఏవోబీకి పది కిలో మీటర్ల దూరంలో ఒడిశా మల్కాన్ గిరి జిల్లా రామగుర్హా ప్రాంతంలో మావోయిస్టుల ప్లీనరీ జరుగుతున్నట్టు అందిన సమాచారం మేరకు పోలీసులు చుట్టుముట్టి వారిపై కాల్పులు జరిపారు. మావోలు కూడా ఎదురు కాల్పులకు దిగారు.

 

ఇదిలా ఉండగా ఘటనా స్థలంలో జరిగిన ఎదురు కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు కానిస్టేబుళ్లు  అజీజ్ బాషా, డి.సతీష్‌ లలో  ఒకరు మరణించినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని  హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం తరలిస్తుండగా అజీజ్ బాషా మార్గమధ్యంలోనే మరణించారు. మరో కానిస్టేబుల్ డి.సతీష్‌ కాలికి బుల్లెట్ గాయం కావడంతో అతడిని విశాఖపట్నంలోని సెవెన్ హిల్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.