యర్రగొండపాలెం వైపు ఆదిమూలపు చూపు
posted on May 15, 2025 2:06PM

సిట్టింగ్ స్థానంలో వైసీపీ పాలిట్రిక్స్
ప్రతి ఎన్నికల్లో నియోజకవర్గం మారి పోటీ చేసే వైసీపీ మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తిరిగి సెగ్మెంట్ మారేందుకు కసరత్తు మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో గెలుపొందిన యర్రగొండపాలెం నియోజకవర్గానికి తిరిగి వెళ్లేందుకు ఆయన తెర వెనుక రాజకీయాలు మొదలుపెట్టారంట. అందులో భాగంగా సొంత పార్టీ ఎమ్మెల్యేకు పొగ పెట్టే పనిలో పడ్డారంట. పార్టీ అధికారం కోల్పోయినా తన రాజకీయ భవిష్యత్ కోసం ఆ మాజీ మంత్రి పార్టీ ప్రయోజనాలను కూడా పణంగా పెట్టాలని చూస్తున్నారంట.
ఆ క్రమంలో ప్రకాశం జిల్లా వైసీపీలో మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిందిప్పుడు. ఆయన తన రాజకీయ భవిష్యత్ కోసం సొంత నియోజకవర్గం యర్రగొండపాలెం తిరిగి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు ఫ్యాన్ పార్టీలో గుసగుసలు మొదలయ్యాయి. ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైసీపీలో ఉన్న తన అనుచరుల్ని టీడీపీలో చేర్చడమే లక్ష్యంగా ఆదిమూలపు సురేష్ పావులు కదుపుతున్నారన్న ప్రచారం జిల్లా రాజకీయ వర్గాల్లో హాట్టాపిక్గా మారింది. 2024 ఎన్నికల సమయంలో తనకు కాకుండా పోయిన ఎర్రగొండపాలెంలో తాత్కాలికంగా ఫ్యాన్ పార్టీని వీక్ చేసి తిరిగి అక్కడ పాగా వేయాలని సురేష్ ప్రయత్నిస్తున్నారంట. ఆ క్రమంలో ఆదిమూలపు సురేష్ వ్యవహారం వైసీపీలో తీవ్ర చర్చినీయంశంగా మారింది.
2009లో రాజకీయాల్లోకి వచ్చిన ఆదిమూలపు సురేష్ ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఎర్రగొండపాలెం ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014 ఎన్నికలలో ఆదిమూలపు సురేష్ సంతనూతలపాడు నియోజకవర్గానికి మారి వైసీపీ నుండి గెలుపొందారు. 2019లో తిరిగి తన నియోజక వర్గమైన ఎర్రగొండపాలెం వెళ్లిన సురేష్ ఆ ఎన్నికల్లోనూ గెలిచి జగన్ ప్రభుత్వంలో మంత్రిగా పని చేశారు. మంత్రి వర్గ పునర్వ్యస్థీకరణలోనూ ఆదిమూలపు సురేష్కి రెండో సారి మంత్రిగా అవకాశం లభించింది. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో సురేష్తో పాట మంత్రివర్గంలో ఉన్న సీనియర్ నాయకుడు, జగన్ బంధువైన బాలినేని శ్రీనివాసరెడ్డిని మూడేళ్ళకే పక్కన పెట్టినా.. సురేష్ని ఐదేళ్ళ పాటూ కొనసాగించారు. దానిపై అప్పట్లో బాలినేని అలకపాన్పు ఎక్కడంతో వైసీపీ ముఖ్య నేతలు రంగంలోకి దిగి బుజ్జగించాల్సి వచ్చింది.
మంత్రిగా ఆదిమూలపు సురేష్పై అంత నమ్మకం ఉంచిన జగన్ టికెట్ దగ్గరకు వచ్చే సరికి మరోసారి ఆయనకు ఝలక్ ఇచ్చారు. 2024 ఎన్నికల్లో ఆదిమూలపు సురేష్ని కొండపి నియోజక వర్గానికి మార్చారు. తప్పనిసరి పరిస్థితులలో ఆయన కొండేపి నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. అయితే సురేష్ సిట్టింగ్ స్థానమైన ఎర్రగొండపాలెంలో పోటీ చేసిన తాటిపర్తి చంద్రశేఖర్ కూటమి హవాలోను వైసీపీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. దాంతో మాజీ మంత్రి ఆదిమూలపు సురేశ్ తెగ ఫీల్ అవుతున్నారంట.
కొండపి నియోజకవర్గంలో ఎన్నికల వేళ పార్టీ కార్యాలయాల కోసం తీసుకున్న ఇల్లు కూడా ఖాళీ చేశారట. ఆదిమూలపు సురేశ్ తిరిగి ఎర్రగొండపాలానికి షిఫ్ట్ అవ్వాలని చూస్తున్నా సిట్టింగ్ ఎమ్మెల్యేగా తాటిపర్తి చంద్రశేఖర్ ఉన్నారు. తిరిగి నియోజకవర్గంలో అడుగు పెట్టాలంటే తాటిపర్తి చంద్రశేఖర్ పరపతిని తగ్గించడమే మార్గమని భావిస్తున్న ఆదిమూలపు సురేష్ ఆ పనిలో పడ్డారన్న ప్రచారం జరుగుతోంది.
అందులో భాగంగా ఆదిమూలపు సురేష్ యర్రగొండపాలెంలో తన ముఖ్య అనుచరులుగా ఉన్న వారిని తెరచాటు రాజకీయం నడిపి సైకిల్ ఎక్కిస్తున్నారన్న టాక్ నడుస్తోందట. ఇటీవల త్రిపురాంతకం ఎంపిపి స్థానానికి, పుల్లలచెరువు మండల పరిషత్ వైఎస్ ప్రెసిడెంట్ స్థానానికి అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ ఆదిమూలపు సురేష్ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ కి వ్యతిరేకంగా తన అనుచరులతో కలిసి తెరచాటు రాజకీయం నడిపారని ప్రచారం జరుగుతోంది.
ఎర్రగొండపాలెంలో ఆదిమూలపు సురేష్ స్కెచ్ తెలుసుకున్న ఫ్యాన్ పార్టీ పెద్దలు ఇప్పటికే ఆయన్ని పిలిచి మందలించారంటున్నారు. ఒక వైపు టీడీపీలోకి తన అనుచరులను పంపుతూ యర్రగొండపాలెంలో వైసీపీని వీక్ చెయ్యాలని ఆయన చేస్తున్న ప్రయత్నాలపై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయట. ఇప్పటికే ఆదిమూలపు సురేష్ వైసీపీని వీడి టీడీపీలో చేరుతున్నారన్న ప్రచారం యర్రగొండపాలెంలో గుప్పుమంటోందట. ఈనేపథ్యంలో ముందస్తుగా తన అనుచరుల్ని సురేష్ వైసీపీ నుండి టీడీపీలో చేరుస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది.
అయితే నియోజక వర్గంలో జరుగుతున్న పరిణామాలతో తనకు సంబంధం లేదని ఆదిమూలపు సురేష్ పార్టీ పెద్దలకు వివరణ ఇస్తున్నా...సురేష్ పై మాత్రం రోజురోజుకీ ప్రచారం పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. చంద్రశేఖర్ని వీక్ చేసి నియోజకవర్గ పార్టీ బాధ్యతలు చేపట్టాలనే వ్యూహంలో ఆదిమూలపు సురేష్ ఉన్నారంటున్నారు. మరి 2029 ఎన్నికల నాటికి ఆయన ఫ్యూచర్ ఎలా ఉంటుందో చూడాలి.