గురుకులంలో కరోనా కలకలం.. థర్డ్ వేవ్ వచ్చేసిందా?
posted on Nov 29, 2021 12:43PM
దేశంలో ఒమిక్రాన్ కేసులు బయటపడటం కలకలం రేపుతుండగానే.. తెలంగాణలో కోవిడ్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. విద్యా సంస్థల్లో భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. హైదరాబాద్ లోని మహీంద్రా యూనివర్సిటీలో కొవిడ్ పంజా విసరగా.. తాజాగా గురుకుల పాఠశాలలో వైరస్ విజృంభించింది. పదుల సంఖ్యలో విద్యార్థులు, సిబ్బంది వైరస్ భారీన పడ్డారు.
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు మండలం, ముత్తంగి గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేగింది. 42 మంది విద్యార్థులు, ఒక ఉపాధ్యాయురాలకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ గురుకుల పాఠశాలలో మొత్తం 491 మంది విద్యార్థులు, 27 మంది సిబ్బంది ఉన్నారు. పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను అధికారులు వైద జీనోమ్ స్వీక్వెన్సింగ్కు పంపారు. పాజిటీవ్ వచ్చిన విద్యార్థులను వసతి గృహంలోనే క్వారంటైన్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.