విజయమ్మ బైబిల్ పై రాద్ధాంతం అవసరమా ?
posted on Jul 26, 2012 4:53PM
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మీ ఈ మద్య ఎక్కడికి వెళ్లినా బైబిలుతో వెళ్లటం చర్చనీయాంశమైంది. మనది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ఎవరు ఏ మతానైనా అనుసరించే వెసులుబాటు వుంది. అయినా ఈ దేశంలో పుట్టుకలో వచ్చే కులం మాత్రమే చచ్చే వరకు మారదు, కాని మతాలు మాత్రం మన ఇష్టం ఉన్నప్పుడు మారే అవకాశం మన రాజ్యాంగం కల్పించింది. మహాత్మాగాందీ ఎప్పుడూ గీతతో దర్శనమిచ్చేవారు. ఇప్పటికీ చాలామంది కాశీతాడునో లేదా సాయిబాబా తాడులనో చేతులకు కట్టుకుంటారు. లేదంటే ఆంజనేయ బిళ్లలు మెడలో వేసుకుంటారు. అది వాళ్ల మానసిక స్థితికి అద్దంపడుతుంది. అంతా మంచి జరుగుతుందని, లేదంటే భయపడకుండా వుండటానికి ఇలా చాలా కారణాలు ఉండవచ్చు.
వైసిపి గౌరవాద్యక్షురాలు బైబులు పట్టుకొని కనపబడటం వెనుక కారణాలను చూద్దాం. ఆమె నిన్నటివరకు సాదా సీదా మహిళ కచ్చింతంగా చెప్పాలంటే ఎన్నడూ గుమ్మందాటి ఎరుగని మామూలు మహిళ. అనుకోని పరిస్థితుల్లో రాజకీయల్లోకి రావడం, ప్రచారం చేయాల్సిరావడం వెంటవెంటనే జరిగిపోయాయి. దాంతో పరిస్థితులను వెంటవెంటనే ఆకళింపు చేసుకొని సందర్బాను సారంగా అనుసరించే పద్దతులకు ఇంకా ఆమె అలవాటు పడలేకే ఆత్మ స్ధయిర్యం కోసం బైబిలును వెంటబెట్టుకుని తిరుగుతున్నారనిపిస్తుంది. దీని వెనుక ఆమె అత్తగారు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి తల్లిగారైన జయమ్మగారి ప్రభావం కూడా ఉండి వుంటుంది.
ఆమె తన కొడుకును ముఖ్యమంత్రిగా చూడటానికి ఏళ్ల తరబడి ప్రార్ధనలు చేసారని చెబుతారు. ఆఖరికి ఆమె తన కొడుకు ముఖ్యమంత్రి అయిన తరువాతే పరమపదించారు. అకాలమరణంతో భర్తని పోగొట్టుకోవడంతో పాటు కొడుకు జైలుపాలవ్వడంతో ఆమె బైబిల్లో ప్రశాంతత వెతుకుంటున్నారనే అనుకోవాలి. అనేక గందరగోళ పరిస్థితుల్లో తెలంగాణలోని సిరిసిల్ల పర్యటన జరపవలసి వచ్చినప్పుడు కూడా అదే తోడుగా ధైర్యాన్ని పొందారనుకుందాం. మీడియాలోని కొన్ని వర్గాలు అమె బైబిల్ పై కూడా చర్చలు జరిపి, రాద్దాంతాలు చేయడం ఎంతవరకూ సమంజసమన్న విమర్శలు వస్తున్నాయి.