నేడు టీఆర్‌ఎస్‌లోకి తీగల కృష్ణారెడ్డి

కొద్ది రోజుల క్రితం తెలంగాణ తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరనున్నారు. ఆయన నియోజకవర్గంలోని సొంత ఇంజినీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేస్తున్న భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సమక్షంలో ఆయన గులాబీ కండువా కప్పుకోనున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ గంగాధర్‌గౌడ్ కూడా ఇదే వేదికపై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సరూర్‌నగర్ ఎంపీపీ విక్రంరెడ్డి కూడా టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు ప్రకటించారు.