సిసిఎల్ 3 ఫైనల్లో తెలుగు వారియర్స్ పరాజయం
posted on Mar 11, 2013 11:40AM
సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ 3 ఫైనల్లో టాలీవుడ్ టీం తెలుగు వారియర్స్ ఓటమి పాలైంది. తెలుగు వారియర్స్ పై కర్ణాటక బుల్డోజర్స్ జట్టు 26 పరుగుల తేడాతో గెలిచింది. చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఫైనల్లో 149 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన వారియర్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 122 పరుగులు మాత్రమే చేయగలిగారు. సెమీస్లో రాణించిన ఓపెనర్లు ఆదిత్య, ప్రిన్స్ ఫైనల్లో చేతులెత్తేశారు. ఒత్తిడికి లోనైన తెలుగు బ్యాట్ మెన్స్ గిరి 16, తేజ 23 బంతుల్లో 31, ఆదర్శ్ 22 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. నందకిశోర్ 11 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు 29 నాటౌట్ చివర్లో ధాటిగా ఆడినా విజయాన్ని అందించలేకపోయాడు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన బుల్డోజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 148 పరుగులు చేశారు. సొంతమైదానంలో చెలరేగిన ప్రదీప్ 31 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45, ధ్రువ్ శర్మ 45 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్తో 54 నాటౌట్ వారియర్స్ బౌలర్లను చిత్తుచేశారు. ఈ ఇద్దరూ మూడో వికెట్కు 60 పరుగులు జోడించి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ ట్రోఫీలను బుల్డోజర్స్ ఆటగాడు ధ్రువ్ శర్మ దక్కించుకున్నాడు. సిరీస్ బెస్ట్ బౌలర్ ట్రోఫీని వారియర్స్ ఆటగాడు రఘు అందుకున్నాడు.