power

జనానికి కరెంట్ షాక్

హైదరాబాద్: గృహవినియోగదారులకు ఇది చేదువార్త. గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలను పెంచాలన్న డిస్కాంల ప్రతిపాదనలకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపిఇఆర్‌సి) రెండు, మూడు రోజుల్లో పచ్చ జెండా ఊపనున్నట్లు తెలుస్తోంది. పెరిగిన విద్యుత్ చార్జీల మేరకు రాష్ట్రప్రభుత్వం సబ్సిడీ రూపంలో భరిస్తుందా లేక నేరుగా గృహ వినియోగదారుల నుంచే పెరిగిన చార్జీలను వసూలు చేసేందుకు ప్రభుత్వం డిస్కాంలకు అనుమతి ఇస్తుందా అనే అంశంపై ఉత్కంఠత నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన మరుక్షణం ఏపిఇఆర్‌సి నుంచి ఆదేశాలు వెలువడవచ్చునని సమాచారం. ఆ లోగా విద్యుత్ చార్జీల పెంపుదలకు అంగీకరిస్తే శాసనసభలో విపక్షాల నుంచి ఒత్తిడి రావడమేకాకుండా స్వపక్షం నుంచి కూడా నిరసనలు రావచ్చని భావిస్తున్నారు. వ్యవసాయ రంగానికి ఉచిత సబ్సిడీ వల్ల సాలీనా ఐదు వేల కోట్ల రూపాయల వరకు మొత్తాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ఈ ఏడాదికి గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలను పెంచి పది సంవత్సరాలవుతుంది. ఈ నేపథ్యంలో ప్రజల ఆర్థిక జీవన ప్రమాణాలు మెరుగుపడడం, మధ్యతరగతి వర్గం వారు కూడా ఎసి యంత్రాలను వినియోగించడం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని కనీసం రెండు వందల యూనిట్లు ఆ పైన విద్యుత్ వినిమయం చేసే వారికి మాత్రమే పెంచిన చార్జీలు వర్తించే అవకాశం ఉంది. ప్రభుత్వం సబ్సిడీని భరిస్తానన్నా అంగీకరించే స్థితిలో డిస్కాంలు లేవు. ఎందుకంటే డిస్కాంలకు ప్రభుత్వం సబ్సిడీల బకాయిలను క్రమం తప్పకుండా చెల్లించడం లేదు. ప్రస్తుతం గృహ విద్యుత్ వినియోగదారుల కేటగిరీ ఎల్‌టి 1లో ఐదు శ్లాబ్‌లు ఉన్నాయి. ఇకపై ఆరు శ్లాబ్‌లు చేయనున్నట్లు సమాచారం. నాల్గవ శ్లాబ్ నుంచి విద్యుత్ చార్జీలు పెంచవచ్చు.

karunanidhi

కరుణ భార్యల ఆస్తుల విలువ

చెన్నై: డిఎంకె అధినేత కరుణానిధి తన భార్యలిద్దరికీ ఆస్తి పంచినట్లు కనిపిస్తున్నారు. తనకు, తన ఇద్దరు భార్యలకు సంబంధించిన ఆస్తుల విలువను ఆయన గురువారం వెల్లడించారు. గురువారం తిరువురూర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన కరుణానిధి తమకు 41 కోట్ల విలువ చేసే అస్తులున్నట్లు వెల్లడించారు. కరుణానిధి భార్యల్లో దయాళు ఆస్తి విలువ 17.34 కోట్ల రూపాయలు కాగా, రజిత ఆస్తుల విలువ 18.68 కోట్ల రూపాయలు. ఆయనకు 4.92 కోట్ల విలువ చేసే ఆస్తులు మాత్రమే వున్నాయి. దయాళు నలుగురు సంతానాల్లో కేంద్ర మంత్రి ఎంకె అళగిరి, ఉప ముఖ్యమంత్రి స్టాలిన్ ఉన్నారు. రజతి కూతురు కనిమొళి. కరుణానిధి మొదటి భార్య పద్మావతికి ఎంకె ముత్తు అనే కుమారుడున్నాడు. పద్మావతి మరణంతో కరుణానిధి 1948లో దయాళును పెళ్లి చేసుకున్నారు.

sirish

శిరీష్ కు జైలు తప్పేట్లు లేదు

హైదరాబాద్: ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి చిన్న కూతురు శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్‌కు జైలు తప్పేట్లు లేదు. వరకట్నం వేధింపుల కేసులో అతనికి బెయిల్ ఇవ్వడానికి కోర్టు గురువారం తిరస్కరించింది. శిరీష్ భరద్వాజ్ తరఫున న్యాయవాది సివిఎల్ నర్సింహా రావు వేసిన బెయిల్ పిటిషన్‌ను హైదరాబాదు నాంపల్లి క్రిమినల్ కోర్టులోని 8వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ న్యాయమూర్తి తిరస్కరించారు.శిరీష్ తల్లి, శ్రీజ అత్త సూర్యమంగళకు మాత్రం కోర్టు షరతులతో కూడిన ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. తన భర్త శిరీష్ భరద్వాజ్‌పై, అత్త సూర్యమంగళపై శ్రీజ వరకట్నం వేధింపుల కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో శిరీష్ భరద్వాజ్ ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.

CM

మేడమ్‌కు సీఎం కిరణ్ మొర

న్యూఢిల్లీ: స్థానిక సంస్థల ఎన్నికల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురుదెబ్బ తిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి... అందుకుగల కారణాలను సోనియాకు వివరించారు. గురువారం ఢిల్లీలో ఆయన టెన్ జన్‌పథ్‌లో మేడమ్‌తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థుల పరాజయం వెనుక కారణాలు, పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సోనియా సమక్షంలోను, ఆ తర్వాత సోనియా రాజకీయ సలహాదారు అహ్మద్‌పటేల్, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్‌లతో దాదాపు 40 నిమిషాలపాటు చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం... జగన్‌ను ఏమాత్రం ఉపేక్షించరాదని, ఆయన దూకుడుకు కళ్లెం వేయాలని కిరణ్ అధిష్ఠానాన్ని కోరారు. "ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి వెనుక పెద్ద ఎత్తున ధన బలం పనిచేసింది. నన్ను అసమర్థుడిగా చిత్రీకరించి జగన్‌ను బలోపేతం చేసేందుకు పార్టీలో కొంతమంది పెద్ద మనుషులు పరోక్ష ప్రయత్నాలు చేస్తున్నారు. నన్ను, కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేందుకు అంతర్గత కుట్ర జరుగుతోంది'' అని కిరణ్ వివరించారు. చిత్తూరులో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, అనంతపురంలో జేసీ వర్గం కుట్రల మూలంగా పార్టీ పరాజయం పాలైందని సోనియాకు చెప్పారు. సొంత జిల్లాలో తనను దెబ్బతీస్తే, పార్టీని కూడా దెబ్బతీయగలమన్నది వారి ఉద్దేశమని కిరణ్ తెలిపారు. అయినప్పటికీ... చిత్తూరు జిల్లాలో కేవలం ఒకే ఒక్క ఓటుతో కాంగ్రెస్ అభ్యర్థి ఓడిపోయారని ఆయన తెలిపారు. గిడుగు రుద్రరాజు, గంగాభవానీలపై వారి జిల్లాల్లో వ్యతిరేకత ఉన్నప్పటికీ వారికే తిరిగి అవకాశం ఇవ్వడం తప్పైందని అంగీకరించారు. అయితే... "వారిని గెలిపిస్తామని అధిష్ఠానానికి, నాకు హామీ ఇచ్చిన కొందరు పెద్ద మనుషులు ఘోరంగా విఫలమయ్యారు'' అని చెప్పారు. నామినేటెడ్ అభ్యర్థుల విషయంలో ముందుగా నిర్ణయం తీసుకుని ఉంటే ఈ ఎన్నికలపై కొంత ప్రభావం చూపేదని ఆయన చెప్పినట్లు తెలిసింది. ఈ సందర్భంగా కడప జిల్లాలో ఎన్నిక గురించి సోనియా ప్రస్తావించారు. "జిల్లా అంతటా జగన్‌కు పట్టు లేదని తేలిపోయింది. ఇక్కడ కేవలం పది ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యాం'' అని కిరణ్ బదులిచ్చారు. జగన్ వర్గానికి గట్టి సమాధానం చెప్పడం పట్ల సోనియా సంతృప్తి వ్యక్తం చేశారు. ముందుగా కిరణ్ రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, పాలనా విధానంపై అధిష్ఠానానికి ఒక సమగ్ర నివేదికను సమర్పించారు. ఈ భేటీలో సోనియా గాంధీ సీఎం పనితీరుపై విరుచుకుపడ్డారు. మీకు పగ్గాలు ఇచ్చి పొరపాటు చేశామని, మీ విషయంలో మా అంచనాలు తప్పాయని వ్యాఖ్యానించే వరకూ ఆమె ఆగ్రహస్థాయి చేరుకుంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. మండలి ఎన్నికల్లో పార్టీ పరాజయంపై కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ముఖ్యమంత్రి పై తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. మీ వ్యవహారశైలి, నిర్ణయాల వల్లే పార్టీ ఓటమిపాలయిందని, నేతలతో సమన్వయం చేసుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీకు ఎన్నిసార్లు చెప్పినా సమన్వయం చేసుకోవడంలో విఫలమవుతున్నారని, ఇకపై సహించేది లేదని నిర్మొహమాటంగా హెచ్చరించారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చి తప్పు చేసినట్లు భావించవలసి వస్తోందని సోనియా మండిపడ్డారు.

devineni

కేసీఆర్ పై మండిపడిన దేవినేని

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు పార్లమెంటు సభ్యుడు అయి ఉండి న్యూఢిల్లీలో సమావేశాలు జరుగుతుంటే ఇక్కడ ఉండి బయట రాజకీయాలు చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ శాసనసభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చెప్పారు. టిడిపిని పీనుగుల పార్టీ అనడం శోచనీయమన్నారు. పీనుగుల పార్టీ అయితే 2009 ఎన్నికలలో పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. భూకేటాయింపులపై ప్రభుత్వం జెఎల్పీ వేయడానికి వెనుకాడుతుందన్నారు. కాంగ్రెసు చేసిన పాపాలు బయటపడతాయనే వారు జెఎల్పీ వేయడం లేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటిని ముట్టడిస్తామన్నారు. శ్రీకృష్ణ కమిటీలో ఉన్న 8వ అధ్యాయాన్ని కేంద్రం వెంటనే బహిర్గత పర్చాలని ఆయన డిమాండ్ చేశారు.

TDP

సరి సమానం..కాంగ్రెస్కు 3-జగన్కు 3-టీడీపీకు 3

హైదరాబాద్: రాష్ట్రంలో ఎనిమిది జిల్లాల్లో స్థానిక సంస్థల కోటా కింద జరిగిన తొమ్మిది ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో కాంగ్రెస్, తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (జగన్ వర్గం)లు సమానంగా పంచుకున్నాయి. పార్టీలోని లుకలుకలు మాత్రమే కాకుండా మంత్రుల్లోని అసంతృప్తి జ్వాలలు కూడా మరోసారి పైకెగశాయి. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు వైయస్ జగన్‌ను సమర్థంగా ఎదుర్కంటున్నారని ఇంత కాలం భావించారు. కానీ, అది అంత సులభం కాదని ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. పార్టీలోని అంతర్గత విభేదాలను కూడా ఆయన పరిష్కరించకలేక పోయారు. సమయం వస్తే దెబ్బ తీయడానికి కిరణ్ కుమార్ రెడ్డి ప్రత్యర్థులు సిద్ధంగా ఉన్నారని ఎన్నికల ఫలితాల వల్ల తేలిపోయింది. అనంతపురం జిల్లాలో శాసనసభ్యుడు జెసి దివాకర్ రెడ్డి మొదటి నుంచి తాను కాంగ్రెసు అభ్యర్థి పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని సమర్థించబోనని చెబుతూ వస్తున్నారు. సమయం చాలానే ఉన్నా ఆయనను దారికి తేవడంలో ముఖ్యమంత్రి విఫలమయ్యారు. అలాగే, తన సొెత జిల్లా చిత్తూరులో కూడా అసమ్మతి కుంపటి రగులుతున్న విషయం ఆయనకు తెలియంది కాదు. తనకు వ్యతిరేకంగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి పని చేస్తారని ఆయనకు తెలుసు. అయినా, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డిని, మరో శాసనసభ్యురాలు కుతూహలమ్మను బుజ్జగించడంలో ఆయన విఫలమయ్యారనే చెప్పవచ్చు. అలాగే, జగన్ వర్గం అభ్యర్థిని ఓడించడానికి కిరణ్ కుమార్ రెడ్డి వేసిన ఎత్తులేవీ పారలేదు. కొద్దిపాటి ఓట్లతోనే తాము ఓడిపోయామని కిరణ్ కుమార్ రెడ్డి సమర్థించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ నైతికంగా వైయస్ జగన్ విజయం సాధించారనే చెప్పవచ్చు. ఇకపోతే, పశ్చిమ గోదావరి జిల్లా ఫలితాలు కిరణ్ కుమార్ రెడ్డికి పెద్ద దెబ్బనే. ఇక్కడ జగన్ వర్గం రాజకీయాల కన్నా కిరణ్ కుమార్ రెడ్డి వ్యవహార శైలే కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను దెబ్బ తీసింది. స్థానిక నాయకుల మాటలను ఖాతరు చేయకుండా ఆయన అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ సమయాన్ని చూసి మంత్రులు వట్టి వసంతకుమార్, బొత్స సత్యనారాయణ తమ అసంతృప్తిని బయట పెట్టారు. వట్టి వసంతకుమార్ రాజీనామా చేయడానికి సిద్ధపడగా, బొత్స సత్యనారాయణ ముఖ్యమంత్రికి చురకలంటించారు. స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రాంగం, యంత్రాంగం బెడిసి కొట్టిందనే చెప్పాలి. ఇది అదనుగా తీసుకుని - వైయస్ రాజశేఖర రెడ్డి ఉంటే కాంగ్రెసుకు ఈ పరిస్థితి ఉండేది కాదని వైయస్ జగన్ వర్గం శాసనసభ్యులు అంటున్నారు.