సొంతగూటికి పొంగులేటి?

గత కొంత కాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఖమ్మం జిల్లా రాజకీయాలు కీలకంగా, ఆసక్తిదాయకంగా మారాయి. రసకందాయంలో పడ్డాయి. కొంత కాలం క్రితం, రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ రీ ఎంట్రీకి ఖమ్మం వేదికయింది. టీడీపీ అధినేత, చంద్రబాబు ఖమ్మం నుంచే శంఖారావం పూరించారు. ఆ తర్వాత, బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు ఖమ్మం వేదికయింది. అదలా ఉంటే అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ రాజకీయ భవిష్యత్ కు కొత్త బాటలు వేసుకునే క్రమంలో  ఆత్మీయ  సమ్మేళనాలు నిర్వహించి హాల్ చల్ సృష్టించారు. అయితే, బీఆర్ఎస్ ట్రబుల్ షూటర్  హరీష్ రావు జరిపిన దౌత్యంతో తుమ్మల మెత్త పడ్డారు. బీఆర్ఎస్ లో కొనసాగుతున్నారు.  కానీ, పొంగులేటి బీఆర్ఎస్ ను వదిలేశారు. బీఆర్ఎస్ లో జరిగిన అవమానాలను తలచుకుని తలచుకుని ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అయితే  తనకు  తన వర్గానికి అన్యాయం చేసిన బీఆర్ఎస్ ను దెబ్బ తీసేందుకు ఎవరితో జట్టు కట్టాలి , ఏ పార్టీలో చేరాలి  అనే విషయంలో మాత్రం ఇంకా ఒక స్పష్టమైన నిర్ణయానికి రాలేక పోతున్నారు. ఈ నేపధ్యంలోనే, పొంగులేటి ఖమ్మం రాజకీయాల్లోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా వార్తల్లో వ్యక్తిగా నిలిచారు.  బీఆర్ఎస్ నుంచి అయితే  బయటకు వచ్చేసిన పొంగులేటి ఏ పార్టీలో చేరతారు అనేది ఇప్పడు రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారింది. బీఆర్ఎస్ నుంచి నేరుగా ఆయన బీజేపీ గూటికి చేరతారనే ప్రచారం సాగింది. ముహూర్తాలు, వేదికలు కూడా ఫిక్సయి పోయాయి. కానీ,ఇంతలో కాంగ్రెస్ నుంచి ఆఫర్ వచ్చింది. తేల్చుకొనే లోగా గత పరిచయాలో వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల చక్రం తిప్పారు. పొంగులేటితో చర్చించారు. గతంలో వైసీపీలో పని చేసిన పొంగులేటికి ఆ కుటుంబపై అభిమానం ఉంది. తాజాగా విజయమ్మతో భేటీ అయ్యారు. ఇక నిర్ణయానికి వచ్చేశారు. పార్టీలో చేరిక.. ముహూర్తం దాదాపు ఫిక్స్ అయ్యాయి. తన నిర్ణయం పై అనుచరలతో సమవేశానికి పొంగులేటి సిద్దమయ్యారు.  పొంగులేటి తాను ఏ పార్టీలో చేరినా జిల్లాలో తన హవా కొనసాగాలని కోరుకున్నారు. బీఆర్ఎస్ ను ఢీ కొట్టేందుకు సిద్దమయ్యారు. తొలుత బీజేపీలో చేరాలని భావించారు. కానీ  కాంగ్రెస్ వర్సస్ బీఆర్ఎస్ అన్నట్లు గా పోరు సాగుతున్న ఖమ్మం జిల్లాలో బీజేపీకి పట్టు చిక్కటం కష్టమని శ్రేయోభిలాషులు సూచించారు. వామపక్ష.. కాంగ్రెస్.. గులాబీ పార్టీకే అక్కడ ప్రజలు మద్దతుగా నిలిచే అవకాశం ఉందంటూ సర్వే నివేదికలు స్పష్టం చేసాయి. దీంతో.. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తరువాత వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలతో భేటీ అయ్యారు. జిల్లాలో పాలేరు నుంచి షర్మిల పోటీ చేస్తుండటంతో.. అక్కడ మినహా ఇతర నియోజకవర్గాల్లో పొంగులేటి మద్దతు దారులకు సీట్లు ఇచ్చే అంశం పైన చర్చ జరిగినట్లు సమాచారం. పార్టీలోకి వస్తే బాగుంటుందని షర్మిల సూచించారు. నిర్ణయం మాత్రం పెండింగ్ లో పెట్టారు. ఇప్పుడు తాజాగా విజయమ్మ తో భేటీ అయ్యారు.  విజయమ్మతో భేటీ తరువాత పొంగులేటి రాజకీయ అడుగులు ఏంటనేది స్పష్టత వచ్చింది.  వైసీపీ ఆవిర్భావం తరువాత జరిగిన తొలి ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ తో పాటుగా మూడు అసెంబ్లీ స్థానాలను ఆ పార్టీ గెలుచుకుంది. ఖమ్మం నుంచి వైసీపీ ఎంపీగా పొంగులేటి గెలుపొందారు. ఇప్పుడు వైఎస్సార్టీపీ ఏర్పాటు తరువాత జరుగుతున్న తొలి ఎన్నికల్లో షర్మిల అదే జిల్లా నుంచి పోటీ చేస్తున్నారు. గతంలో వైసీపీ కోసం ఆ కుటుంబంతో కలిసి పని చేసిన అనుభవం ఉండటంతో.. ఇప్పుడు తన అనుచరులకు ఈ పార్టీ ద్వారా టికెట్లు దక్కించుకోవటం పైన చర్చలు జరిపారు  కాంగ్రెస్ లో కొంత ఓట్ బ్యాంక్ కలిసి రావటంతో పాటుగా వైఎస్సార్ ఇమేజ్.. తమకు వ్యక్తిగతంగా ఉన్న మద్దతు కలిసి జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలవచ్చని లెక్కలు వేశారు. పాలేరు లో షర్మిల గెలుపునకు సహకరించేందుకు పొంగులేటి విజయమ్మతో భేటీలో హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..నాడు జగన్ తో కలిసి వైసీపీలో.. నేడు షర్మిలతో కలిసి వైఎస్సార్టీపీలో పొంగులేటి పని చేయటం ఖాయమని చెబుతున్నారు.  ప్రస్తుతం జిల్లాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా పొంగులేటి వైఎస్సార్‌టీపీలో చేరున్నారని తెలుస్తోంది. పార్టీలో చేరికపై వరుస మంతనాలు జరుపుతూ వస్తున్నారు. ఈ నెల 8 న పాలేరు లో వైఎస్ విజయమ్మ పర్యటించనున్నారు. అదే రోజున పొంగులేటి వైఎస్సార్‌టీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. తనతో పాటుగా అనుచరులను పార్టీలో చేర్చేలా మంతనాలు పూర్తయినట్లు తెలుస్తోంది. ఆ రోజు చేరటమా లేక షర్మిల పాదయాత్ర ముగింపు సభలో చేరటమా అనేది చర్చ జరిగింది.  పాలేరులో విజయమ్మ - షర్మిల సమక్షంలోనే చేరేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పొంగులేటి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.. ఏం జరుగుతుందనేది త్వరలోనే పూర్తి స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోందని అంటున్నారు.

గవర్నర్, ప్రభుత్వం మధ్య సయోధ్య కొనసాగుతుందా?

అబద్ధాలా .. అర్థ సత్యాలా అనే  విషయం పక్కన పెడితే, అసలు గవర్నర్  శాసన సభకు వచ్చి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం, నిజంగా... నిజమా, అనే అనుమానం అందరిలో కాకున్నా కొందరిలో ఇంకా అలాగే వుంది.  నిజం  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్  సాదరంగా ఆహ్వానించింది, నిజంగా నిజమేనా, అనే అనుమానం కూడా ఇంకా పూర్తిగా తొలిగి పోలేదు. అలాగే, ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్  చక్కగా అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు చదవడం  నిజంగా నిజమేనా  అనే అనుమానాలు కూడా ఇంకా అలాగే ఉన్నాయి.  గత రెండు రెండున్నర సంవత్సరాలుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సాగుతున్న ప్రచ్ఛన్న  పోరు,  అంతకు మించి రాష్ట్ర శాసన సభ సమావేశాల ప్రారంభానికి ముందు చోటు చేసుకున్న పరిణామాలు, రాజకీయ వివాదం రాజ్యాంగ వివాదానికి దారితీసేలా తలెత్తిన పరిస్థితులు  గుర్తు చేసుకుంటే, ఇలాంటి దృశ్యం ఒకటి ఇంత త్వరగా చూస్తామని బహుశా రాజకీయ పండితులు సైతం ఊహించి ఉండరు. నిజానికి  రాష్ట్ర హై కోర్టు జోక్యం చేసుకోవడం వలన కానీ  లేదంటే  నిజంగానే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.    కానీ, అందరి ఊహాలను తల్లకిందులు చేస్తూ  ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్  అటు గవర్నర్ తమిళి సై  చాలా చక్కగా ఎవరి పాత్రను వారు పోషించారు. ‘సయోధ్య’ చిత్రాన్ని రక్తి కట్టించారు. అఫ్కోర్స్ ముఖ్యమంత్రి బాడీ లాంగ్వేజ్ లో కొద్దిపాటి అవమాన ఛాయలు, గవర్నర్ అడుగుల్లో కొద్దిపాటి విజయ దరహాసం అగుపించాయనుకోండి  అది వేరే విషయం.  అయినా  రెండు వ్యవస్థల మధ్య సయోధ్య అవసరాన్ని ఇద్దరూ ఎంతో కొంత గ్రహించినట్లే కనిపించారు. అయితే, ఈ సయోధ్య ఇంత వరకేనా   ముందు ముందు కూడా కొనసాగుతుందా? అంటే, రాజకీయ విశ్లేషకులు అనుమానమే అంటున్నారు. కానీ  ఇక ముందు గతంలోలాగా తెగే వరకూ లాగే పరిస్థితి అయితే రాకపోవచ్చనీ, ఇరు వర్గాల నుంచి ఎంతో కొంత విజ్ఞత, వివేచనా, సంయమనం ఆశించ వచ్చననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రధానంగా ఇప్పటికే పెండింగ్ లో ఉన్న ఐదారు బిల్లుల విషయంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఆమోద ముద్ర వేస్తారా? తిప్పి పంపుతారా? అనేది తేలితే సయోధ్య ఎంత వరకు నిలుస్తుందని అనే విషయంలో కొంత క్లారిటీ వస్తుందని అంటున్నారు. ముఖ్యంగా   మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో అవిశ్వాసం తీర్మానం గడువును ప్రస్తుతమున్న మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళకు పొడిగిస్తూ  గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన సవరణ బిల్లును  గవర్నర్ పెండింగ్ లో ఉంచారు. ప్రస్తుత సయోధ్య నేపధ్యంలో అయినా  గవర్నర్ దానిని ఆమోదిస్తారా? లేదా అనే ‘ఉత్కంఠ వ్యక్తమవుతోంది.  నిజానికి, రాష్ట్రంలోని 127 పట్టణ, నగరపాలక సంస్థలలో అవిశ్వాస తీర్మానం తీసుకొచ్చేందుకు ప్రస్తుతమున్న మూడేళ్ళ గడవు జనవరి 26తో ముగిసింది. మరో వంక ఇప్పటికే అనేక పట్టణ, నగర పలక సంస్థలలో అధికార బీఆర్ఎస్ లో లుకలుకలు మొదలయ్యాయి. అలాగే హుజురాబాద్ సహా అనేక పట్టణ  నగరపాలక సంస్థలలో అవిశ్వాస తీర్మానం నోటీసులు కూడా ఇచ్చారు. క్యాంపులు, ప్రజా ప్రతినిదుల కొనుగోలు వ్యవహారాలు మొదలైన వార్తలు అందుతున్నాయి. ఈ నేపధ్యంలో గవర్నర్  అవిశ్వాస గడువు పొడిగింపు బిల్లుకు ఆమోదమ తెలుపుతారా ? తిప్పి పంపుతారా? అదీ ఇదీ కాకుండా పరిశీలనలో ఉంచుతారా? అనేది సయోధ్యకు పరీక్షగా మారిందని అంటున్నారు.

కేసీఆర్ మనవడి మిస్సింగ్.. పోలీసులే పట్టుకెళ్లారంటూ ఆరోపణలు!

కే‌సీ‌ఆర్ మనవడు మిస్సింగ్. స్వయంగా కేసీఆర్ మనవడి తల్లి ఈ ఆరోపణ చేశారు. పోలీసులే తన కుమారుడిని అర్ధరాత్రి తీసుకు వెళ్లారనీ, అప్పటి నుంచీ అతడు కనిపించడం లేదనీ ఆరోపించారు. ఔను నిజమే కేసీఆర్ మనవడు రితేష్ కనిపించడం లేదు. ఈ విషయాన్ని ఆమె తల్లి కేసీఆర్ అన్న కుమార్తె రమ్యారావు తెలిపారు.   రెండు రోజుల క్రితం జూబ్లీహిల్స్‌లోని తన నివాసం నుంచి పోలీసులు  తన కొడుకు రితేష్ ను తీసుకెళ్లారని, ఇప్పటి వరకు ఏ పోలీస్ స్టేషన్‌లో ఉన్నాడనే విషయాన్ని చెప్పడం లేదని ఆమె ఆరోపించారు.   సిటీ వ్యాప్తంగా గాలించినా తన కుమారుడి ఆచూకీ లభించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కాగా అసలు విషయమేమిటంటే రాష్ట్రంలో సమస్యల పరిష్కారం డిమాండ్ తో ఎన్ఎస్ యూఐ అసెంబ్లీ ముట్టడికి పిలుపు నిచ్చింది. దీంతో పోలీసులు ఎన్ఎస్ యూఐ ముఖ్య నేతలూ, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఆ క్రమంలోనే ఎన్ఎస్ యూఐలో చురుకుగా ఉంటున్న రితేష్ ను కూడా పోలీసులు తీసుకువెళ్లారు. అయితే వాళ్లను ఎక్కడ ఉంచామన్నది కనీసం తల్లిదండ్రులకు కూడా తెలియజేయకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. దీంతో రితేష్ జాడ తెలియడం లేదంటూ రమ్యారావు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం అర్దరాత్రి దాటిన తరువాత పోలీసులు రెండు వాహనాల్లో వచ్చి రితేష్ గురించి ఆరా తీశారని రమ్యారావు చెప్పారు. ఆ తరువాత రితేష్ గురించి ఇళ్లంతా గాలించారనీ ఆయన లేకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారనీ, అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకూ రితేష్ ఆచూకీ తెలియడం లేదని ఆమె ఆరోపిస్తున్నారు. రితేష్ ఆచూకీ కోసం అన్నిపీఎస్ లూ తిరిగినా ఫలితం లేకపోయిందనీ, ఇక్కడికి వెళితే అక్కడా, అక్కడికెళితే అక్కడ అని తిప్పుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. 

ఎన్టీఆర్ శత జయంతి కానుక.. త్వరలో వెబ్ సైట్, సావనీర్

నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఆయన చరిత్ర భావి తర తరాలకు స్ఫూర్తి  కావాలనే  ఉద్దేశంతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టామని  మాజీ ఎమ్మెల్సీ, తెలుగు దేశం పార్టీ రాజకీయ కార్యదర్శి  టి .డి  జనార్దన్ తెలిపారు.     ఎన్ .టి .ఆర్ శత జయంతి కమిటీ  చైర్మన్ జనార్దన్ శనివారం (ఫిబ్రవరి 4)  మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్  సినిమాలలో పలు చిరస్మర ణీయమైన పాత్రలు పోషించి తెలుగు వారి ఆరాధ్య నటుడుగా నీరాజనాలందుకున్నారనీ,  అలాగే రాజకీయాలలో ప్రవేశించి, తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల స్వల్ప కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారనీ చెప్పారు. ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలతో  ప్రజానాయకుడిగా ప్రజల మన్ననలను అందుకున్నారని చెప్పారు.  ఎన్టీఆర్  తెలుగునాట మాత్రమే కాదు,  భారత రాజకీయాలలో కూడా క్రియాశీల పాత్ర పోషించి,   జాతీయ నాయకుడిగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారన్నారు. దార్శనికత కలిగిన నాయకుడిగా ఆయన స్ఫూర్తిమంతమైన జీవితం ఎప్పటికీ తెలుగువారి కి  మార్గదర్శకం కావాలనే ఉద్ధేశంతో  ఎన్టీఆర్ శత జయంతి కమిటీ, ఎన్టీఆర్ సినీ ప్రస్థానం,  రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమగ్రమైన సమాచారంతో ఎన్ .టి ఆర్ వెబ్ సైట్ రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు. అలాగే ఎన్టీఆర్ తో చిత్ర రంగంలో పనిచేసిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ రంగంలో వారితో సాన్నిహిత్యం వున్న నాయకులు,ఆయనతో సాన్నిహిత్యం ఉన్న వారి  వ్యాసాలు , ప్రముఖుల కథనాలు, సందేశాలు , అరుదైన ఫొటోలతో ఒక ప్రత్యేక సంచిక రూపొందిస్తున్నట్లు జనార్దన్ చెప్పారు. అలాగే  ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు , చారిత్రక ప్రసంగాలతో మరో రెండు పుస్తకాలు కూడా ప్రచురించనున్నట్లు జనార్దన్ తెలిపారు.  ఎన్టీఆర్ నటుడిగా  తెలుగు ,తమిళ ,హిందీ భాషల్లో 300 చిత్రాలలో విభిన్నమైన పాత్రల్లో నటించారు. మూడు  తరాల ప్రేక్షకులకు  ఆయన అభిమాన నటుడయ్యారు. సినీ రంగంలో ఆయన నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అపూర్వం ,అనితర సాధ్యం . కేవలం నటుడిగానే కాక ప్రజలకు ఏ కష్టం వచ్చినా, అన్నగా నేనున్నానంటూ ముందు కొచ్చి ఆదుకున్నాడు . రాయలసీమ కరవు , దివిసీమ సీమ ఉప్పెన విపత్తులలో బాధితులను ఆదుకోవడానికి సహ నటీనటులతో కలిసి  కలసి విరాళాలు సేకరించారు.  చైనా యుద్ధ సమయంలో కూడా దేశ రక్షణ కోసం నిధుల సేకరణకు నడుం బిగించారు. ఆ అసమాన సేవే ఆయనను రాజకీయ రంగం వైపు నడిపించిందని జనార్దన్ తెలిపారు. తెలుగువారి ఆత్మ  గౌరవాన్ని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడాలని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలనకు  చరమ గీతం  పలకాలని, నట జీవితాని త్యాగం చేసి  1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని ప్రారంభించిన మహోన్నత నాయకుడు,ఆదర్శ ప్రజా సేవకుడు,  తెలుగు జాతికి స్ఫూర్తి ప్రదాత   ఎన్ .టి .ఆర్ అని జనార్దన్ చెప్పారు . సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్ళని నమ్మిన ఎన్.టి.ఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత  ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రను సృష్టించాయన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు ,మహిళలకు ఆస్తిలో హక్కు  వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని, నిలువనీడ కల్పించలేని, కట్టుకోవడానికి గుడ్డ ఇవ్వలేని రాజకీయం ఎందుకని? ఆయన ఆవేదనతో ప్రశ్నించారు.అది  నెరవేర్చడానికి ఆయన చిత్తశుద్ధితో చివరి వరకూ కృషి చేశారని జనార్దన్ చెప్పారు. ఎన్టీఆర్  భౌతికంగా దూరమై 27 సంవత్సరాలు అయినా,  ఇప్పటికీ జాతికి స్ఫూర్తి నిస్తూనే వున్నారు  ఆయన జీవితం తర తరాలకు మార్గదర్శం కావాలనే ఈ మహాయజ్ఞానికి పూనుకున్నామని జనార్దన్ తెలిపారు. ఎన్ .టి .ఆర్ ఘన కీర్తిని చాటే విధంగా విజయవాడ , హైదరాబాద్ లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రెండు కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని , తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు , ఇతర జాతీయ నాయకులు , సినిమారంగ  ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటారని జనార్దన్ తెలిపారు .  ఈ కమిటీలో  సీనియర్ నాయకులు ఎమ్ .ఏ .షరీఫ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అట్లూరి అశ్విన్, తెలుగు వన్  ఎండీ కంఠంనేని రవి శంకర్ , నిర్మాతలు  కాట్రగడ్డ ప్రసాద్,  అట్లూరి నారాయణ రావు,  సీనియర్ జర్నలిస్టులు విక్రమ్ పూల, భగీరథ,  పారిశ్రామిక వేత్త మధుసూదన రాజు, మండవ సతీష్ , కాసరనేని  రఘురామ్  శ్రీపతి సతీష్ వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు .  రామ్మోహన్ రావు , సత్యనారాయణ , వినాయకరావు తదితరులు కూడా తమ సహకారాన్ని అందిస్తున్నారని జనార్దన్ తెలిపారు .      ఈ ప్రయత్నానికి అన్నగారి అభిమానులు, వారితో సాన్నిహిత్యం ఉండి, మర్చిపోలేని సంఘటనలు , అపురూమైన ఫోటోలు ఎవరి దగ్గర వున్నా  tdjanardhan@gmail.com మెయిల్ లేదా 9866178085 మొబైల్ నంబర్ కి WhatsApp పంపించి సహకరించాలని జనార్ధన్ మీడియా ద్వారా  జనార్దన్ విజ్ఞప్తి చేశారు .

ప్రముఖ గాయని వాణీజయరాం కన్నుమూత

సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ గాయని వాణిజయరాం శనివారం (ఫిబ్రవరి 4) కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్యంతో తీసుకుంటున్న వాణీ జయరాం చెన్నైలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.  పలు హిట్ చిత్రాల్లో అద్భుత పాటలు పాడిన వాణీజయరాం మృతిపట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు. వాణిజయరామ్ అసలు పేరు కలైవాణి.   14 భాషల్లో దాదపు 20 వేల పాటలు పాడిన వాణీ జయరామ్ కు కేంద్రం ఇటీవలే  కేంద్రం పద్మభూషణ్ పురస్కారం లభించిన సంగతి విదితమే. తన అద్భుతమైన గాత్రంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించున్న వాణీజయరాం మృతి పట్ల పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 

బీఆర్ఎస్ తో దోస్తానీకి ఎంఐఎం చెల్లుచీటీ?.. అందుకే అసెంబ్లీలో అక్బరుద్దీన్ విమర్శల బాణాలు?

 ఎనిమిదేళ్ల జిగిరీ దోస్తానీకి తెరపడిందా? ఎంఐఎం, బీఆర్ఎస్ ల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయా? తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నుంచీ కేసీఆర్, ఒవైసీల మధ్య మైత్రి కొనసాగుతూనే ఉంది. టీఆర్ఎస్ గా ఉన్నంత కాలం ఇరు పార్టీల మధ్యా పొరపచ్చాల్లేవు. ఎన్నికల పొత్తు లేకపోయినా.. రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా ఇరు పార్టీల మధ్యా బహిరంగ అవగాహనే ఉండేది. జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా ఆ అవగాహన మేరకే అభ్యర్థులను రెండు పార్టీలూ నిలబెట్టాయి. అయితే ఆ మైత్రి ఇప్పుడు మాయమైంది. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచీ ఇరు పార్టీల మధ్యా విభేదాలు ఆరంభమయ్యాయనీ, అవి నివురుగప్పిన నిప్పులా కొనసాగుతున్నాయనీ పరిశీలకులు అంటున్నారు. అయితే తాజా బడ్జెట్ సమావేశాలలో ఆవి ఒక్కసారిగా బయటపడ్డాయి.  అసెంబ్లీలో శనివారం (ఫిబ్రవరి 4)న బీఆర్ఎస్, ఎంఐఎం నేతల మధ్య మాటలయుద్ధం నడిచింది.   ఎంఐంఎం ఎమ్మెల్యే అక్బరుద్ధీన్ ఓవైసీ ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీలో హామీలు ఇస్తారు.. తప్ప వాటిని అమలు చేయరని  విమర్శించారు. సమస్యలు చెప్పుకుందామంటే సీఎం, మంత్రుల దర్శనమైనా మాకు కలగడం లేదని దుయ్యబట్టారు. మీకు మమ్మల్ని కలవడం ఇష్టం లేకపోతే..   మీ చెప్రాసిని   చూపిస్తే వారినైనా కలిసి మా సమస్యలపై విన్నవించుకుంటామని ఒవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.  పాతబస్తీలో మెట్రో సంగతి ఏమైందని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితి ఏంటని ఒవైసీ  నిలదీశారు. ఉర్ధూ రెండవ అధికారిక బాష అయినా అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీకి మద్దతు ఇవ్వడం వల్ల   రాష్ట్రానికి ఒరిగిందేమిటని ఒవైసీ అన్నారు. నోట్లరద్దు, జీఎస్టీకి మద్దతు ఇవ్వొద్దని అప్పట్లో నెత్తీ నోరు బాదుకుని చెప్పినా అప్పటి టీఆర్ఎస్ పట్టించుకోలేదన్నారు.  దీంతో ఒవైసీ మాటలకు మంత్రి కేటీఆర్ దీటుగా బదులిచ్చారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఒవైసీ చెప్పిన మాటలన్నీ వాస్తవం అయిపోవన్నారు. ఏడుగురు సభ్యులున్న ఎంఐఎం సభలో మాట్లాడేందుకు ఎక్కువ సమయం కోరుతోందనీ, అది సాధ్యం కాదనీ కుండబద్దలు కొట్టారు. అసలు బీఏపీ సమావేశానికి రాకుండా ఇప్పుడు అక్బరుద్దీన్ ఒవైసీ ఇష్టారీతిగా మాట్లాడి ప్రయోజనం ఏమిటని నిలదీశారు. ఇంత కాలం పాలు, నీళ్లలా కలిసి ఉన్న బీఆర్ఎస్, ఎంఐఎంల మధ్యా అసెంబ్లీ వేదికగా మాటలయుద్ధం సాగడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇరు పార్టీల మధ్యా మైత్రి కేసీఆర్ టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చేందుకు సిద్ధపడినప్పుడే తెగిపోయిందని పరిశీలకులు అంటున్నారు. ఆయన ఆ నిర్ణయం తీసుకున్న క్షణమే  తెరాస (ఇప్పుడు బీఆర్ఎస్)   మిత్రపక్షం  ఎంఐఎం గులాబీ పార్టీకి తలాక్  చెప్పాలనే నిర్ణయానికి వచ్చిందంటున్నారు. నిజానికి ముందు నుంచి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ వచ్చిన ఎంఐఎం. కేసీఆర్ సారథ్యంలో జరిగిన తెలంగాణ మలి విడత ఉద్యమాన్నీ వ్యతిరేకించింది.  రాష్ట్ర విభజ జరిగితే  బీజేపీ బలపడుతుందన్న ఏకైక  కారణంతోనే ఎంఐఎం అధ్యక్షుడు,  హైదరబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్  లోపలా వెలుపలా కూడా పలు సందర్భాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విభజనను గట్టిగా వ్యతిరేకించారు. అయితే ఆయన వ్యతిరేకతను ఎవరూ పట్టించుకోలేదు. రాష్ట్ర విభజన జరిగిపోయింది. ఆ తరువాత అనూహ్యంగా  కేసీఆర్, ఒవైసీ జిగిరీ దోస్తులై పోయారు. ముఖ్యమంత్రి కేసీఆర్ శాసన సభ వేదికగానే, ‘అవును. ఎంఐఎం మా మిత్ర పక్షం’ అని ప్రకటించారు కూడా. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎవరికి వారు పోటీ చేసినా, ఫలితాలు వచ్చిన తర్వాత  మళ్లీ ఒకటై పోయారు. చివరకు మొన్నటికి మొన్న సెప్టెంబర్ 17న  అనివార్యంగా తెలంగాణ విమోచన దినోత్సవం జరపవలసి వచ్చినప్పుడు కూడా  తెలంగాణ విమోచన దినాన్ని, విమోచన దినంగా కాకుండా ఒవైసీ సూచించిన విధంగా జాతీయ సమైక్యతా దినంగా కేసీఆర్ జరిపించారు. అయితే  ఇప్పటికే జాతీయ రాజకీయాలలో చురుకుగా వ్యవహరిస్తున్న ఎంఐఎం అధినేత ఒవైసీ  కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావడాన్ని స్వాగతించలేదు. కేసీఆర్ జాతీయ రాజకీయాలలో వైపు దృష్టి సారిస్తే తెలంగాణలో   తెరాస(బీఆర్ఎస్) గెలుపు అవకాశాలు దెబ్బతింటాయని ఒవైసీ భావిస్తున్నారు. అంతే కాకుండా తెలంగాణలో బీజేపీ బలోపేతం కావడానికి కూడా  కేసీఆర్ తీరే కారణమని ఒవైసీ గుర్రుగా ఉన్నారు.  అంతే కాకుండా రాష్ట్రంలో కాషాయ దళం బలోపేతం కావడానికి కేసీఆరే ఉద్దేశపూర్వకంగా అవకాశం ఇస్తున్నారన్న అనుమానాలు కూడా ఆయనలో గూడుకట్టుకుని ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.   ఇంత కాలం తెరాసతో ఉన్న రాజకీయ అవగాహన కారణంగా  ఎంఐఎం ఇంతవరకూ పాత బస్తీలోని ఏడు అసెంబ్లీ,  హైదరాబాద్ లోక్ సభ స్థానానికి మాత్రమే పరిమితమైంది. ఇక ఇప్పుడు తెరాస బీఆర్ఎస్ గా మారిన తరువాత ఆ పార్టీకి దూరం జరగడమే కాకుండా   రాష్ట్రంలో ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఇతర జిల్లాలు, నియోజక వర్గాల నుంచి కూడా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. కేసీఆర్ జాతీయ పార్టీ అంటూ తెరాసను కనుమరుగు చేసిన తరువాత.. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందన్న నిర్ణయానికి ఎంఐఎం వచ్చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఎంఐఎం కేవలం పాత బస్తీకే పరిమితమైతే   బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తరువాత  తమ గొంతు నొక్కేస్తుందని,  అందుకే పాతబస్తీకి ఆవల కూడా ఎంఐఎం ఎమ్మెల్యేలను గెలిపించుకుంటూ.. భవిష్యత్ లో ఒక వేళ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా దీటుగా ఎదుర్కొనేందుకు వీలవుతుందని  ఎంఐఎం అధినేత భావిస్తున్నారు.  ఈ నేపధ్యంలోనే ఉమ్మడి అధిలాబాద్, నిజాబాబాద్, కరీంనగర్ జిల్లాలలోని ముస్లిం ఆధిపత్యం ఉన్న నియోజక వర్గాల నుంచి పోటీ చేయాలని ఎంఐఎం నాయకత్వం నిర్ణయానికి వచ్చి నట్లు తెసుస్తోంది. అలాగే, ఓబీసీలు, దళితులను కలుపుకుని రాష్ట్రంలో విస్తరించే, ప్రణాళికకు ఒవైసీ పదును పెడుతున్నారు. అలాగే  అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అధిక స్థానాలు గెలిచి హాంగ్ అసెంబ్లీ ఏర్పడితే, ఎంఐఎం కాంగ్రెస్తో చేతులు కలిపి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు అవకాశం ఉంటుందన్నది కూడా ఎంఐఎం అధినేత వ్యూహంగా పరిశీలకులు చెబుతున్నారు.   అందుకే ఎంఐఎం బీఆర్ఎస్ తో మైత్రికి చెల్లుచీటీ పాడేసిందనీ, ఆ ఫలితమే నేడు అసెంబ్లీలో ఈ ఎనిమిదిన్నరేళ్లలో ఎన్నడూ లేని విధంగా కేసీఆర్ సర్కార్ పై అక్బరుద్దీన్ ఒవైసీ విమర్శల వర్షం కురిపించారని అంటున్నారు.    

తార్కిక ముగింపు దిశగా వివేకా హత్య కేసు.. సజ్జల కుట్ర భాష్యం అందుకేనా?

వైఎస్ వివేకానందరెడ్డి కేసులో తాడేపల్లి ప్యాలెస్ పూర్తిగా ఇరుక్కుందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవర్న విషయంలో ఇంత కాలం అనుమాలు ఉన్నాయన్న అభిప్రాయం సామాన్యజనంలో ఉండేది. ఇప్పుడు అది దాదాపుగా నివృత్తమైందని అంటున్నారు. ఇక అసలు విషయానికి వస్తే ఈ కేసులో తాడేపల్లి ప్యాలెస్ ఇరుక్కుందన్న విషయం వైసీపీ శ్రేణులకే కాదు.. ఆ పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్న వారికి కూడా అవగతమైంది. అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించిన రోజు నుంచీ వైసీపీలో ఆరంభమైన గాభరా.. శుక్రవారం (ఫబ్రవరి  3) సీఎం ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి పీఏ నవీన్ లను సీబీఐ విచారించడంతో మరింత పెరిగింది. అందుకే వారెక్కడా మీడియా కంటబడకుండా, మీడియాతో మాట్లాడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుని విచారణ నుంచి బయటకు వచ్చిన వెంటనే వారిని ఏకంగా ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తన కారులో విమానాశ్రయానికి, అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలస్ కు చేర్చేలా ఏర్పాట్లు చేసుకున్నారు. ఇక కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ ల విచారణ తరువాత వివేకా హత్య కేసులో ఏవన్ అయిన గంగిరెడ్డిని శనివారం విచారించనుంది. వరుసగా సంభవిస్తున్న పరిణామాలలో వివేకా హత్య కేసులో కీలక వ్యక్తులు ఉన్నారన్న నమ్మకం బలపడుతూ వస్తోంది. అదే వైసీపీలో కంగారుకు కారణమౌతోంది.  వివేకా హత్య జరిగిన నాటి నుంచీ గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించడం దగ్గర నుంచీ, ఆ తరువాత ఈ హత్య వెనుక ఉన్నది నారా చంద్రబాబు అంటూ ఆరోపణలు గుప్పించడం వరకూ..ఇక కేసు దర్యాప్తు సీబీఐ చేపట్టిన తరువాత వివేకా హత్య వెనుక ఉన్నది ఆయన కుమార్తె సునీత, ఆమె భర్తే అంటూ ఆరోపణలు చేయడం వరకూ వైసీపీ ఈ కేసులో లోతుల్లెకి వెళ్లి దర్యాప్తు జరగకుండా అడ్డుకునేందుకు చేయని ప్రయత్నం లేదు. పన్నని కుట్ర లేదు. ఏకంగా సీబీఐ అధికారులపైనే ప్రైవేటు కేసులు, కడపలో వారికి బెదరింపుల వరకూ ఎంత చేయాలో అంతా చేసింది. అయితే పట్టు వదలకుండా వైఎస్ వివేకా కుమార్తె సునీతా రెడ్డి చేసిన న్యాయపోరాటం కారణంగా కేసును ఏపీ నుంచి తెలంగాణకు మార్చిన తరువాత.. దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇన్నేళ్లుగా ఎన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నా.. కనీసం విచారణకు కూడా రావలసిన అవసరం లేకుండా మేనేజ్ చేసుకోగలిగిన అవినాష్ రెడ్డి అనివార్యంగా సీబీఐ విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. విచారణలో ఆయన నుంచి కీలక సమాచారం రాబట్టిన సీబీఐ.. ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ కు సన్నిహితంగా మెలిగే కృష్ణమోహన్ రెడ్డి, నవీన్ లను పిలిపించుకుని విచారించింది. ఇప్పుడు వెంటనే గంగిరెడ్డిని విచారించడంతో అందరి చూపులూ తాడేపల్లి ప్యాలెస్ వైపే అనుమానంగా చూస్తున్నాయి. వివేకా హత్య వెనుక తాడేపల్లి ప్యాలెస్ పెద్దల ప్రమేయం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. దీంతో వైసీపీ ఇప్పుడు కొత్త వ్యూహంతో ముందుకు వస్తోంది. ఈ కేసులో జగన్ ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందంటూ రాద్ధాంతం చేయడానికి సిద్ధపడుతోంది. ఇందుకు తొలి పలుకు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి నోటి వెంటే వచ్చింది. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. వివేకా హత్య కేసులో జగన్ ను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందన్నారు.  వివేకా హత్య కేసులో వైసీపీ ఎన్ని యూటర్న్ లు తీసుకుందో లెక్కే లేదు. గొడ్డలి పోటును గుండెపోటుగా నమ్మించడానికి చేసిన ప్రయత్నం నుంచి  చంద్రబాబు,  వివేకా కుమార్తె, అల్లుడులపై ఆరోపణల వరకూ ఎంత చేయాలో అంతా చేసింది. ఇప్పుడు వివేకా హత్య కేసులో వైసీపీ పెద్దల ప్రమేయం బయటపడటం ఖాయమని తేలిన తరువాత ఇక ఇప్పుడు అనివార్యంగా కుట్ర కోణాన్ని తెరపైకి తీసుకు వచ్చింది. అక్రమాస్తుల కేసులు జగన్ అరెస్టయిన సందర్బంగానూ వైసీపీ దాదాపుగా ఇటువంటి ఆరోపణలే చేసిన సంగతి తెలిసిందే.   తెలుగుదేశం, కాంగ్రెస్ లు కుట్ర చేశాయని జగన్ అప్పట్లో ఆరోపించారు. వివేకా హత్య కేసులో ఇంత కాలం అనుమానాలుగా ఉన్న విషయాలపై ఇప్పుడు సీబీఐ దర్యాప్తు జోరందుకున్న తరువాత స్పష్టత వస్తోంది.  అదే వైసీపీని గాభరాపెడుతోంది. అందుకే కుట్ర అంటూ గగ్గోలు పెడు తోంది.   

జగన్ కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారు.. సీజేఐకి న్యాయవాది లేఖ

ఏపీ జగన్ రాజధాని విషయంలో చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. ముఖ్యమంత్రి కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ విపక్షాలు దుమ్మెత్తి పోస్తున్నాయి. మూడు రాజధానుల విషయం కోర్టు పరిధిలో ఉంది. రాజధాని అమరావతిని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వకుండానే రాజధానుల అంశంపై అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామంటూ సుప్రీం కోర్టు పేర్కొంది. ఆ కేసు  గత నెల 31న విచారణ జరగాల్సి ఉండగా జరగలేదు. ఈ పరిస్థితుల్లో  ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో ముఖ్యమంత్రి జగన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు రాజధాని అంశంపై సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండగా, సీఎం జగన్ ఏపీ రాజధాని విశాఖనే అని ప్రకటించేశారు. త్వరలో అక్కడి నుంచే తాను పాలన సాగించనున్నట్లు చెప్పారు. ఏపీ మూడు రాజధానుల అంశం కోర్టు విచారణలో ఉండగా జగన్ ఈ విధమైన ప్రకటన చేయడం కోర్టు ధిక్కారమేనని న్యాయనిపుణులు చెబుతున్నారు. ఏపీకి విశాఖపట్నమే ఏకైక రాజధాని అని ప్రకటించిన జగన్.. పెట్టుబడిదారులను విశాఖకు రావల్సిందిగా కోరారు.  వచ్చే నెలలో విశాఖ వేదికగా నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సుకు పెట్టుబడి దారులను ఆహ్వానించేందుకు హస్తినలో గత నెల 30న  జరిగిన సదస్సులో జగన్ ప్రసంగించారు.  ఆ ప్రసంగంలోనే ఆయన రాజధాని విశాఖేనని ప్రకటించేశారు.  జగన్ ప్రకటన కోర్టు ధిక్కారం కిందకే వస్తుందని విపక్షాలే కాదు.. న్యాయ నిపుణులు కూడా అంటున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని సుప్రం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు ఓ న్యాయవాది.  త్వరలో విశాఖ ఏపీ రాజధాని కాబోతోందని ప్రకటించడం ద్వారా ఏపీ ముఖ్యమంత్రి జగన్  కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ ఏపీ న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ విశాఖ రాజధాని అని ప్రకటించడం ద్వారా ఏపీ సీఎం జగన్  కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారనీ, జగన్ పై సుమోటాగా చర్యలు తీసుకోవాలని ఆయన సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు.  

హతవిధీ ఇదేం కొలువు.. జగన్ సర్కార్ లో బ్యూరోక్రాట్ల పరిస్థితి దయనీయం!

జగన్ సర్కార్ లో హైరార్కీ అన్నది కాగడా వేసి వెతికినా కనిపించదు. ప్రభుత్వానికి అడుగులకు మడుగులు ఒత్తుతూ పని చేయడమే ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల ప్రథమ కర్తవ్యంగా మారిపోయింది. బహుశా స్వతంత్ర భారత దేశంలో అధికారుల సేవలను ఇంతగా తన అవసరాల కోసం వాడుకున్న సీఎం జగన్ వినా ఎవరూ ఉండకపోవచ్చు. తాజాగా వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణకు హాజరైన ఇద్దరు వ్యక్తులను ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ, ఔను సీఎస్ స్వయంగా వారిని విచారిస్తున్న జైలు వద్దకు వెళ్లి విచారణ పూర్తి కాగానే తన కారులో ఎక్కించుకుని తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కోని పోయారు. వివేకా హత్య కేసు లో అవినాష్ రెడ్డిని వాచారించి రాబట్టిన సమాచారం ఆధారంగా ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి, జగన్ సతీమణి భారతి పికే నవీన్ లను సీబీఐ శుక్రవారం ( ఫిబ్రవరి 3)న విచారించింది. వారిరువురినీ కడప సెంట్రల్ జైల్ గెస్ట్ హౌస్ లోదాదాపు 6 గంటల పాటు విచారించింది. విచారణ  ముగిసిన అనంతరం వారు బయటకు రాగానే సీఎస్ జవహర్ రెడ్డి వారిరువురినీ తన కారులో  తిరుపతి విమానాశ్రాయానికి అక్కడ నుంచి విమానంలో తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కోని పోయారు. ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి ఒక కేసులో విచారణకు హాజరైన ఇరువురి విషయంలో అంత శ్రద్ధ తీసుకుని విచారణ ముగిసిన అనంతరం స్వయంగా పికప్ చేసుకని మరీ తాడేపల్లికి తోడ్కొని రావడం సంచలనంగా మారింది. ఇరువురినీ విచారణ ముగిసిన తరువాత పికప్ చేసి తీసుకుని రావడమే కాదు.. తాడేపల్లి నుంచి కడపకు ఈయనే డ్రాప్ చేశారా అన్న సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. సీఎస్ స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా పికప్ ఆండ్ డ్రాప్ పనులు చేయడమేమిటన్న చర్చ రాజకీయవర్గాలలోనే కాదు సామాన్యులలో కూడా జోరుగా సాగుతోంది. జగన్ సర్కార్ లో సీఎస్ కు పనీపాటా లేదా అన్న సెటైర్లు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.   ఒక హత్య కేసులో విచారణ ఎదుర్కొంటున్న వ్యక్తులను సీఎస్ ఇలా తన కారులో పికప్ చేసుకుని తాడేపల్లి ప్యాలెస్ కు తోడ్కొని రావడం తీవ్రమైన విషయమనీ, ఇది దర్యాప్తును ప్రభావం చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయనిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అంతే కాకుండా ఈ హత్య కేసులో నిందిుతలకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహయం, సహకారం అందడం తీవ్ర మైన విషయంగా చెబుతున్నారు. సీఎస్ ఎందుకోసం, ఎవరి కోసం ఇలా చేస్తున్నారో అర్ధమౌతూనే ఉందని పరిశీలకులు చెబుతున్నారు.   అయినా జగన్ సర్కార్ లో అధికారులను అడ్డగోలుగా వాడుకోవడం.. చివరికి ఎక్కడైనా తేడా కొడితే నిర్దాక్ష్యిణ్యంగా బలిపశువులను చేసి వదిలించుకోవడం అనవాయితీగా మారిపోయిందని రాజకీయవర్గాలు అంటున్నారు. జగన్ సీఎం కావడానికి ముందు నుంచే ఆయన చెప్పినట్లల్లా నడుచుకున్న అప్పటి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎంత అవమానకర రీతిలో ఆ పదవి నుంచి సాగనంపారో తెలిసిందే కదా అంటూ ఉదహరిస్తున్నారు. ఆ తరువాత  ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ విషయమే తీసుకుంటే.. ఆయన ప్రభుత్వానికి అనుకూలంగా, విపక్షాలను ఇబ్బంది పెట్టే విధంగా ఎంత అడ్డగోలుగా వ్యవహరించారో అందరికీ తెలిసిందే. ఆయన పోలీసు అధికారిగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడిన సందర్బాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఉద్యోగుల చలో విజయవాడను విఫలం చేయడంలో ఏపీ పోలీసు వైఫల్యం ఆయన పదవికి ఎసరు తెచ్చిన సంగతి తెలిసిందే. అలాగే.. ఏపీ సీఐడీ మాజీ చీఫ్.. సునీల్.. విపక్ష నేతలు, సామాన్యులపై అడ్డగోలు కేసులు బనాయించి అరెస్టులు చేసి వేధించారు. కనీస ఫార్మాలటీస్ కూడా పాటించకుండా వ్యవహరిస్తున్నారంటూ కోర్టులు పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అయినా కూడా ఆయన పట్టించుకోకుండా ఏలిన వారి సేవలో తరించారు. అటువంటి సీఐడీ మాజీ చీఫ్ ను కూడా జగన్ సర్కార్ కూరలో కరివేపాకు మాదిరిగా ఆ పదవి నుంచి పక్కకు పెట్టేయడమే కాకుండా పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆయన లాంగ్ లీవ్ లో వెళ్లిపోయారు. ఇక తాజాగా గవర్నర్ కార్యదర్శి సిసోడియాకూ అటువంటి మర్యాదే చేసింది. జగన్ సర్కార్. ఏరి కోరి గవర్నర్ కార్యదర్శిపదవిలో నియమించిన ప్రభుత్వమే ఆయనను నిర్దాక్షిణ్యంగా ఆ పదవి నుంచి బదలీ చేసింది. ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఇప్పటి వరకూ ప్రభుత్వానికి సిసోడియా అత్యంత విశ్వాసపాత్రుడు. గవర్నర్ కు వచ్చే ఫిర్యాదులను సిసోడియా లీక్ చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. విపక్ష నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ దొరకకుండా చేయడం, అలాగే కీలక విషయాలు గవర్నర్ దృష్టికి వెళ్లకుండా చేయడంలోనూ సిసోడియా కీలకంగా వ్యవహరించారన్న ఆరోపణలనూ ఆయన ఎదుర్కొన్నారు. అటువంటి సిసోడియాపై సర్కార్ బదలీ వేటు వేయడం, ఎలాంటి పోస్టింగూ ఇవ్వకుండా పక్కన పెట్టడంతో ఆయన కూడా జగన్మాయకు బలిపశువు అయ్యారని పరిశీలకులు అంటున్నారు. ఇంతకీ సిసోడియాపై వేటుకు కారణమేమిటంటే.. గవర్నర్ కు ఉద్యోగుల అపాయింట్ మెంట్ దొరకడమే. ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వంపై ఫిర్యాదు చేయడమే. ఉద్యోగ సంఘాల నేతలకు గవర్నర్ అపాయింట్ మెంట్ ఇప్పించింది సిసోడియానే అన్న నిర్ధారణకు వచ్చిన జగన్ సర్కార్ ఆయనపై బదలీ వేటు వేసిందని అంటున్నారు. ఇక జగన్ సర్కార్ లో అధికారుల విధి నిర్వహణ మొత్తం జగన్ మెప్పు పొందడం కోసమే అన్నట్లుగా మారిందనీ, ఆ పారామీటర్లు చేరుకోలేని వారెవరినైనా ప్రభుత్వం స్పేర్ చేయదనీ ఉద్యోగ వర్గాలలో చర్చ జరుగుతోంది.  

అబద్ధాల పుట్ట.. తప్పుల తడక.. గవర్నర్ ప్రసంగంపై కాంగ్రెస్, బీజేపీ రియాక్షన్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం (ఫిబ్రవరి 3) ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగంపై విపక్షాలు విమర్శలతో విరుచుకుపడ్డాయి. గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ వాయిదా పడింది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ చేసిన ప్రసంగం ప్రభుత్వ బాకా ఊదడానికే పరిమితమైందని విపక్షాలు విమర్శించాయి. ఎంత సేపూ ప్రభుత్వ పథకాలను ఆకాశానికి ఎత్తేయడమే తప్ప రాష్ట్రంలో వాస్తవ పరిస్థితిని ప్రతిబింబించేలా గవర్నర్ ప్రసంగం లేదని దుయ్యబట్టాయి. డబుల్ బెడ్ రూం ఇళ్లు, ధరణి పోర్టల్ వంటి అంశాలు గవర్నర్ ప్రస్తావించనే లేదన్నారు. సభ వాయిదా పడిన అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గవర్నర్ ప్రసంగం మొత్తం అబద్ధాల పుట్ట అని అభివర్ణించారు. ఈ ప్రసంగం చేయడం కంటే గవర్నర్ ప్రసంగం లేకుండా గత ఏడాది మాదిరిగానే బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై ఉంటే బాగుండేదని అభిప్రాయ పడ్డారు. ఆమె ప్రసంగం మొత్తంలో ఒక్కటంటే ఒక్క నిజం కూడా లేదని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకం చెప్పుకుంటున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రస్తావన గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ప్రస్తావనకైనా రాలేదని నిలదీశారు. వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అంటూ చెప్పడం శుద్ధ అబద్ధమని జీవన్ రెడ్డి అన్నారు. అలాగే  దళితబంధు పేరుతో దళితుల్నిప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు. అంతకు ముందు మీడియా పాయింట్ వద్ద మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కూడా గవర్నర్ తమిళిసై ప్రసంగం మొత్తం తప్పుల తడక అని విమర్శించారు. ప్రభుత్వ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు గవర్నర్ చేత అబద్ధాలు చెప్పించిందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ అన్నదిపూర్తిగాఅవాస్తవమని, ఎక్కడా వ్యవసాయానికి 24గంటల కరెంట్ అందడం లేదన్నారు. తప్పుల తడకగా మారిన ధరణి పోర్టల్ గురించి గవర్నర్ ప్రసంగంలో అసలు మాట్లాడనేలేదని ఈటల అన్నారు.  

తెలుగుదేశంకే స్వల్ప మొగ్గు.. ఆత్మసాక్షి సర్వే

ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడం అధికార వైసీపీకీ, విపక్ష తెలుగుదేశం కు కూడా నల్లేరు మీద బండి నడక కాదు. తీవ్ర మైప ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న.. వైసీపీ, బలంగా పుంజుకున్న తెలుగుదేశం కూడా ఎన్నికలలో విజయం కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి ఉంది. రాష్ట్రంలో ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ,   . పొత్తులు, పోటీలపైనే కాకుండా,  ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయన్న చర్చోపచర్చలు ఎడతెరిపి లేకుండా సాగుతున్నాయి. ఇప్పటికే   రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే అధకారంలోకి ఏ పార్టీ వస్తుంది, పొత్తులు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుంది, పొత్తులు లేకుండా వేర్వేరుగా పార్టీలు పోటీ చేస్తే ఫలితం ఏలా ఉంటుంది అన్న విషయంపై పలు రకాల సర్వేలు వచ్చాయి.  అయితే తాజాగా శ్రీ ఆత్మసాక్షి సర్వే శాస్త్రీయంగా నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం వైపు స్వల్ప మొగ్గు ఉంటుందని తేలింది. ఔను ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే తెలుగుదేశం 78 స్దానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. అయితే సింపుల్ మెజారిటీకి మాత్రం ఆ పార్టీ అడుగు దూరంలోనే నిలిచిపోతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక వైసీపీ 63 స్థానాలలో గెలిచి రెండో స్థానంలో నిలుస్తుంది.  ఇక జనసేన కేవలం 7 స్థానాలకే పరిమితమౌతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. ఇక నువ్వా నేనా అన్నట్లుగా 27 స్థానాలలో పోటీ ఉంటుందని పేర్కొంది. అయితే తుది ఫలితం మాత్రం ఆయా పార్టీల తరఫున పోటీ చేసే అభ్యర్థులపై ఆధారపడి ఉంటుందని, అయితే తెలుగుదేశం పార్టీ కనీసం 36 స్థానాలలో ప్రస్తుత అభ్యర్థులు లేదా నియోజకవర్గ ఇన్ చార్జ్ లను మార్చాల్సి ఉంటుంది. అలాగే వైసీపీ కూడా కనీసం 50 స్థానాలలో సిట్టింగులను లేదా నియోజకవర్గ ఇన్ చార్జ్ లను మార్చాల్సి ఉంటుంది.  అంటే తెలుగుదేశం కు స్వల్ప మొగ్గు కనిపించినా, అభ్యర్థుల విషయంలో సరైన నిర్ణయం తీసుకోవడంలో విఫలమైతే ఆ పార్టీ భారీగా నష్టపోకతప్పదని సర్వే వెల్లడిస్తోంది. ఇదే పరిస్థితి వైసీపీకి కూడా ఉందని చెబుతోంది. వివిధ సామాజిక వర్గాల మొగ్గు, ఆయా వర్గాలను ఆకట్టుకునే విషయంలో తెలుగుదేశం, వైసీపీలకు ఉన్న సానుకూలతలు, వ్యతిరేకతలు, ఇంకా పొత్తులు ఉంటే ఫలితాలు ఎలా ఉంటాయి. పొత్తులు లేకుండా విడివిడిగా పోటీ చేస్తే వచ్చే రిజల్ట్ ఏమిటి? అన్న అంశాలపై సమగ్ర విశ్లేషణతో పూర్తి సర్వేను త్వరలో వెల్లడించనున్నట్లు శ్రీ ఆత్మసాక్లి ఓ ప్రకటనలో పేర్కొంది. 

ప్రభుత్వంపై గవర్నర్ ప్రశంసలు.. కేసీఆర్, తమిళిసైల మధ్య విభేదాలకు తెర!

తెలంగాణ గవర్నర్ తమిళిసైకి.. కేసీఆర్ సర్కార్ కు మధ్య  గత మూడేళ్లుగా రగులుతున్న విభేదాల మంట టీ కప్పులో తుపానుగా తేలిపోయింది. రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య ఉన్న అగాధం పూడిపోయింది. ఇంత కాలం ఉప్పు నిప్పులా, విమర్శలు, ప్రతి విమర్శలతో గవర్నర్, సీఎం కేసీఆర్ మధ్య ఉన్న విభేదాలు చల్లారిపోయాయి. ఢిల్లీ వేదికగా తెలంగాణ ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రతిష్టను గవర్నర్ తమిళసై దిగజారిస్తే.   గవర్నర్ పై బీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పించడం, రాజ్ బవన్ ను బీజేపీ కార్యాలయంగా చేశారని ఆరోపించడమే కాకుండా, గవర్నర్ కు ఇవ్వాల్సిన ప్రొటోకాల్ ను కూడా ఇవ్వకుండా అవమానించారు. ప్రభుత్వం, గవర్నర్ మధ్య సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి, మర్యాద గీత దాటేశాయి అనే అంతా అనుకున్నారు. అలాంటిది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీన్ ఒక్క సారిగా మారిపోయింది.  తెలంగాణ బడ్జెట్ కు అనుమతి విషయంలో గవర్నర్, ప్రభుత్వం మధ్య ప్రతిష్ఠంభన నెలకొన్న దశలో రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. అక్కడ జరిగిన పరిణామాల నేపథ్యంలో ప్రభుత్వం తన పిటిషన్ ఉపసంహరించుకుంది. గవర్నర్ బడ్జెట్ కు ఆమోదం తెలిపారు. ఇలా రాజీ కుదిరింది. దీంతో సీన్ మారిపోయింది.  శుక్రవారం (ఫిబ్రవరి 3) అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజున ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు.  అంతకు ముందు.  అసెంబ్లీకి వచ్చిన  గవర్నర్ తమిళసైకి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎదురేగి, గౌరవపూర్వకంగా నమస్కరించి ఆహ్వానం పలికారు. ఆ తరువాత గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.   ప్రజాకవి కాళోజీ మాటలను ప్రస్తావిస్తూ ఆమె ప్రసంగం ప్రారంభించారు. తన ప్రభుత్వం (my government) అంటూ ప్రసంగం ఆరంభించిన గవర్నర్ తమిళిసై తెలంగాణ అభివృద్ధి దేశానికే రోల్ మోడల్ అంటూ ప్రస్తుతించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ప్రజాప్రతినిథుల నిర్విరామ కృషితోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమైందన్నారు. తెలంగాణ సర్కార్ ఎన్నో విజయాలు సాధించిందన్నారు.  దేశానికే ధాన్యాగరంగా ఆదర్శంగా మారిందన్నారు.  సంక్షేమం అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. పెట్టుబడులకు స్వర్గధామంగా విలసిల్లుతోంది అంటూ ప్రశంసల వర్షం కురిపించారు. రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రసంగానికి సిద్ధం చేసి ఇచ్చిన ప్రతినే గవర్నర్ తమిళిసై చదివారు. ఎక్కడా తన సొంత అభిప్రాయాలను వెల్లడించలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు, రైతు బంధు, కొత్త సచివాలయం, వైద్య కళాశాలల పెంపు ఇలా అన్ని అంశాలనూ స్పృశిస్తూ గవర్నర్ ప్రసంగం కొనసాగింది. పల్లె ప్రగతి, పట్ణణ ప్రగతి కార్యక్రమాలతో రాష్ట్ర ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పారు.  దీంతో గవర్నర్ తన ప్రసంగంలో ఏం మాట్లాడుతారో అన్న టెన్షన్ తో ఉన్న ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఇటీవల తమిళనాడు అసెంబ్లీలో జరిగిన సంఘటన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే ఎటువంటి ఇబ్బందీ లేకుండా గవర్నర్ ప్రసంగం ముగియడంతో గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలకు పూర్తిగా తెరపడినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు

నిజానికి ఒక తెలంగాణలోనే కాదు, దేశ వ్యాప్తంగా ఐటీ, ఈడీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ దాడులు, సోదాలపై రాజకీయ ఆరోపణలూ వెల్లువెత్తుతున్నాయి. అయినా  సోదాల దారి సోదాలదే, ఆరోపణల దారి ఆరోపణలదే అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. ముఖ్యంగా తెలంగాణలో ఐటీ సోదాలు తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తాజాగా  హైదరాబాద్ లో మరో మారు ఐటీ సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి.  ఈ ఏడాది  రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఐటీ అధికారులు తరచూ రైడ్స్ నిర్వహించడం ఇప్పుడు పలువురు నాయకులను టెన్షన్ కు గురిచేస్తున్నాయి.  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో గురువారం (ఫిబ్రవరి 3)ను పెద్దం సంఖ్యలో ఐటీ అధికారులు చేరుకుని సోదాలు నిర్వహిస్తున్నారు. గత మూడు రోజులుగా ఆయనకు సంబంధించిన  కంపెనీల్లో సోదాలు చేసిన ఐటీ ఇప్పడు ఆయన నివాసంలో సోదాలు చేపట్టింది.  ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి కంపెనీల్లో దాడులు చేసిన ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న తరువాత,  తాజాగా ఎమ్మెల్సీ ఇంట్లో సోదాలు చేయడం సంచలనంగా మారింది. ఐటీ అధికారులు ఎమ్మెల్సీ ఇంట్లో, ముప్పా, వెర్టెక్స్ కంపెనీల్లో సైతం ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణలో ఐటీ రైడ్స్ సర్వసాధారణమయ్యాయి. ప్రతి నెలా   తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో ఈ సోదాలు జరుగుతూనే ఉన్నాయి. గతంలో మంత్రి మల్లారెడ్డి, గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రి రవి, పలు షాపింగ్ మాల్స్, వంశీరామ్ బిల్డర్స్, ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీ, పలు కెమికల్ కంపెనీలు, పలు రియల్ ఎస్టేట్ కంపెనీల్లో ఐటీ అధికారుల రైడ్స్  జరిగాయి. కాగా ఇటీవల మంత్రి మల్లారెడ్డి, అతని సన్నిహితులు, కుటుంబసభ్యుల ఇళ్లల్లో, కార్యాలయాల్లో ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆ సమయంలో కూడా ఐటీ  అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏకంగా 2 రోజుల పాటు జరిగిన ఈ సోదాల్లో అధికారులు రూ.20 కోట్లు, బంగారు ఆభరణాలు సహా పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆ తర్వాత మంత్రి గంగుల కమలాకర్ , ఎంపీ గాయత్రీ రవి ఇళ్లల్లో, ఆఫీసుల్లో అధికారులు సోదాలు చేశారు. ఆ వెంటనే పలు షాపింగ్ మాల్స్ లో కూడా అధికారులు రైడ్స్ చేశారు. ఇప్పుడు ఐటీ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి నివాసంలో దాడులు జరుగుతున్నాయి.

బీజేపీ తెలంగాణ పగ్గాలు ఈటలకు?

తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది. విడతల వారీ పాదయాత్రలను సక్సెస్ ఫుల్ గా ముగించినా, ఆ పాదయాత్రల ప్రారంభానికి, ముగింపునకు ఢిల్లీ నుంచి పార్టీ అగ్రనేతలను తీసుకువచ్చి ఆర్భాటం చేసినా బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కు మైలేజీ రాలేదా?  పాదయాత్రలు సక్సెస్ అయ్యాయి కానీ, పార్టీ ఇమేజ్ ప్రజలలో ఇసుమంతైనా పెరగలేదా? ముఖ్యంగా రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారైందా? రాష్ట్రంలో వచ్చే ఎన్నికలలో ఎలాగైనా అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న బీజేపీ ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి పట్ల ఆందోళనలో ఉందా? గ్రామీణ ప్రాంతాలలో పార్టీ పటిష్టత కోసం తీసుకోవలసిన చర్యలపై కసరత్తులు ప్రారంభించిందా? అందులో భాగంగా పార్టీలో మార్పులు, చేర్పులకు శ్రీకారం చుట్టిందా? అంటే పార్టీ వర్గాలు ఔననే అంటున్నాయి. పార్టీ హై కమాండ్ కూడా రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై సీరియస్ గా దృష్టి సారించిందంటున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకు వెళ్లడంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విఫలమయ్యారని హై కమాండ్ భావిస్తోందని చెబుతున్నారు. పార్టీ సభలకు జనసమీకరణలో బండి సంజయ్ సక్సెస్ అయినా.. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతం విషయంలో ఆయన అనుకున్నంతగా విజయవంతం కాలేదని బీజేపీ హైకమాండ్ అభిప్రాయపడుతోందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే.. క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టత కోసం..  రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని ఈటలకు అప్పగించాలన్న యోచనలో బీజేపీ హై కమాండ్ ఉందని చెబుతున్నారు. ఇటీవల ఒక సంస్థ నిర్వహించిన సర్వే ఫలితం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసి ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. ఆ సర్వే ఫలితం అని కాకపోయినా.. గ్రామీణ ప్రాంతాలలో బీజేపీకి ఎంత మాత్రం పట్టు లేదన్న సంగతి హై కమాండ్ కూడా గుర్తించిందంటున్నారు. ఇటీవలి మునుగోడు ఉప ఎన్నిక ఫలితానికి కూడా అదే కారణమని హై కమాండ్ భావిస్తోంది.  ఇక పోతే ఇటీవలి కాలంలో బండి సంజయ్ కుమారుడి వివాదాస్పద వైఖరి వల్ల పార్టీ పట్ల జనంలో వ్యతిరేకత పొడసూపిందన్న భావన కూడా బీజేపీ హైకమాండ్ లో వ్యక్తమౌతోంది. అదీ కాక పట్టణ ప్రాంతాలకే బండి సంజయ్ ప్రభావం పరిమితం అన్న నిర్ధారణకు కూడా మోడీ, షా వచ్చినట్లు రాష్ట్ర బీజేపీ వర్గాలలో చర్చ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో అటు అర్బన్ లోనూ ఇటు రూరల్ లోనూ కూడా మంచి పట్టున్న నేతకు పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ నేతగా ప్రజలలో మంచి గుర్తింపు ఉన్న ఈటల రాజేందర్ అయితే పార్టీని క్షేత్ర స్థాయిలో మరింతగా బలోపేతం అవుతుందని మోడీ షా ద్వయం భావిస్తున్నట్లు చెబుతున్నారు.

12 మంది భార్యలు... 102 మంది పిల్లలు.. ఇక చాలు బాబు!

పెళ్లిళ్లలో కాదు కానీ.. పిల్లల విషయంలో గిన్నిస్ రికార్డు సాధించాలనుకున్నాడో ఏమో కానీ ఉగండాకు చెందిన ఓ వ్యక్తి 12 పెళ్లిళ్లు చేసుకుని ఏకంగా 102 మంది పిల్లల్ని కన్నాడు. ఇంకా ఇంకా కావాలని అనుకుంటున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో ఇక పెళ్లిళ్లకు, పిల్లలకుఫుల్ స్టాప్ పెట్టేశానంటున్నాడు. ఇప్పుడు తన పెద్ద కుటుంబాన్ని పోషించుకోవడానికి ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒంట్లో చేవ ఉన్నంత వరకూ కష్టపడి తన కుటుంబాన్ని పోషించుకుంటాననీ, అయినా ఇంత పెద్ద కుటుంబాన్ని సాకాలంటే సాయం కావాలి కదా మరి అంటున్నాడు. అతనికి 102 మంది పిల్లలు ఉన్నారు.. వాళ్లల్లో చాలా మందికి వివాహాలయ్యాయి. వాళ్లకీ పిల్లలుపుట్టేశారు. అతగాడు తాత కూడా అయిపోయాడు. ఔను అతగాడికి 568 మంది మనవళ్లు ఉన్నారు. ఇంతకీ అతడి వయస్సు ఎంతంటారా? జస్ట్ 67 ఏళ్లు. ఇంతకీ అతడి పేరేంటో చెప్పలేదు కదూ.. అతడి పేరు ముసా హసహ్యా. ఇప్పుడు ఇంత పెద్ద కుటుంబాన్ని సాకడానికి ప్రభుత్వం తనకు ఆర్థిక సహాయం చేయాలని కోరుతున్నాడు. 

కళా తపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూత

సుప్రసిద్ధ దర్శకుడు,  కళా తపస్వి పద్మశ్రీ కె విశ్వనాథ్ ఇక లేరు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలతో అనారోగ్యంగా ఉన్న కె.విశ్వనాథ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు.   శంకరాభరణం చిత్రంతో తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కే. విశ్వనాథ్ ఆ తరువాత సాగరసంగమం, శృతిలయలు, సిరివెన్నెల, స్వర్ణకమలం, స్వాతికిరణం,  సప్తపది, స్వాతిముత్యం, స్వయంకృషి, శుభోదయం, శుభలేఖ, శుభసంకల్పం వంటి ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన సినిమాలలో సంగీత, సాహిత్యాలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. కే.విశ్వనాథ్ కు 2016లో దాదాసాహెబ్ ఫాల్కే, 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారాలు లభించాయి.  

ఢిల్లీ మద్యం కుంభకోణం.. ఈడీ ఛార్జిషీట్‌లో కేజ్రీవాల్‌, కవిత పేర్లు

దేశ వ్యాప్తంగా మరీ ముఖ్యంగా అటు దేశ రాజధని ఢిల్లీ, ఇటు తెలంగాణ రాజధాని హైదరాబాద్ లలో రాజకీయ  ప్రకంపనలు సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం  ఇప్పటికే చాలా మలుపులు తిరిగింది. ఇప్పడు మరో సీరియస్ టర్న్ తీసుకుంది. ఇంతవరకు దాఖలు చేసిన ఛార్జ్ షీట్ లో పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖుల పేర్లను చేర్చిన ఈడీ.. తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సహా మరికొందరి పేర్లను ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ఏకంగా ఓ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరును ఛార్జ్‌షీట్‌లో నమోదు చేయటం ప్రకంపనలు సృష్టిస్తోంది.  కాగా డిల్లీ మద్యం కుంభకోణం మనీలాండరింగ్‌ కేసులో ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌ను రౌస్‌ అవెన్యూ ప్రత్యేక కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఛార్జిషీట్‌లో పేర్కొన్న నిందితులకు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది. ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం గురించి ప్రస్తావించింది.  ఈ కేసుకు సంబంధించి జనవరి 6న 13,657 పేజీల అనుబంధ ఛార్జిషీట్‌ను దాఖలు చేసిన ఈడీ ఐదుగురి పేర్లు, ఏడు కంపెనీలను చేర్చింది. విజయ్‌నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, శరత్‌ చంద్రారెడ్డి, బినోయ్‌బాబు, అమిత్‌ అరోరాలను నిందితులుగా చేర్చింది. సౌత్‌ గ్రూప్‌ లావాదేవీల్లో  శరత్‌ చంద్రారెడ్డి, అభిషేక్‌, విజయ్‌ నాయర్‌ కీలక వ్యక్తులుగా ఉన్నారు. మొత్తం ఛార్జిషీట్‌పై 428 పేజీలతో ఈడీ ఫిర్యాదు నివేదికను కోర్టుకు అందించింది. సౌత్‌ గ్రూప్‌ నుంచి రూ.100 కోట్ల లావాదేవీల ఆధారాలను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొన్నట్టు సమాచారం. మనీలాండరింగ్‌కు సంబంధించి మొత్తం 12 మంది పేర్లను సప్లిమెంటరీ ఛార్జిషీట్‌లో ఈడీ పేర్కొంది. తీహార్‌ జైల్లో ఉన్న సమీర్‌ మహేంద్రు, శరత్‌రెడ్డి, అభిషేక్‌ బోయినపల్లి, విజయ్‌ నాయర్‌, బినోయ్‌ బాబు, అమిత్‌ అరోరా, ఇటీవల అప్రూవర్‌గా మారిన దినేష్ అరోరాతో పాటు మందస్తు బెయిల్‌తీసుకున్న ఇద్దరు మాజీ అధికారులు కల్దీప్‌సింగ్‌, నరేంద్ర సింగ్‌, ముత్తా గౌతమ్‌, అరుణ్‌ పిళ్లై, సమీర్‌ మహేంద్ర కంపెనీలను ఛార్జిషీట్‌లో ప్రస్తావించారు. నవంబర్‌ 26న మద్యం విధానం వ్యవహారంలో మనీలాండరింగ్‌ కేసులో 3 వేల పేజీలతో ఈడీ తొలి ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. తొలి ఛార్జిషీట్‌లో సమీర్‌ మహేంద్రు, అతనికి చెందిన నాలుగు కంపెనీలపై ఈడీ అభియోగాలు నమోదు చేసింది. సమీర్ మహేంద్రు మనీలాండరింగ్ వ్యవహారంలో దాఖలు చేసిన తొలి చార్జిషీట్ పై ఫిబ్రవరి 23న విచారణ జరగనుంది.

బడ్జెట్ లో తెలంగాణను విస్మరించిన కేంద్రం

కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ తెలంగాణకు రిక్తహస్తమే చూపింది. బడ్జెట్ కు ముందు రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేసిన విజ్ఞప్తులేవీ కేంద్ర విత్తమంత్రి పట్టించుకోలేదు.   గతేడాది అప్పుల కోసం రాష్ట్ర బడ్జెట్‌లో అంచనాలు భారీగానే వేసుకున్నా మూడింట ఒక వంతు భాగానికి కేంద్ర ప్రభుత్వం వివిధ కారణాలతో కోత పెట్టింది. మరో రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌లో గతేడాది తరహాలోనే రిజర్వు బ్యాంకు ద్వారా రుణాలు తీసుకోడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. అయితే కేంద్ర బడ్జెట్‌లో ఎఫ్ఆర్‌బీఎం గురించి స్పష్టత ఇవ్వడంతో ఈసారి కూడా రుణాల లభ్యత   కష్టంగానే ఉంటుందని స్పష్టమైపోయింది. రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.5% మేర రుణాలు తీసుకోవచ్చని కేంద్రం చెప్పినా దానిని విద్యుత్ సంస్కరణలకు ముడిపెట్టింది. అంటే విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తేనే   0.5% మేర అధిక రుణాలు పొందడానికి అవకాశం ఉంటుంది. లేకుంటే రాష్ట్రానికి రుణ లభ్యత 3.0% మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ విద్యుత్ సంస్కరణలను అమలు చేసే ప్రసక్తే లేదని క్లారిటీతోనే ఉంది. అందుకే రాష్ట్ర జీఎస్‌డీపీలో 3.5% మేర రుణాలు కాకుండా, 3.0% రుణానికే అవకాశం ఉంటుంది. అంటే  దాదాపు ఆరు వేల కోట్ల రూపాయల మేర రుణానికి కోత తప్పదు.  మరో వైపు కేంద్రం  నుంచి గ్రాంట్ల రూపంలో ఆశించిన స్థాయిలో రాకపోవచ్చనే అభిప్రాయాన్ని కూడా రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు.  ప్రీ-బడ్జెట్ సమావేశంలో హరీశ్‌రావు లిఖితపూర్వకంగా చేసిన విజ్ఞప్తులేవీ కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోలేదు. విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులపైనా కేంద్ర బడ్జెట్‌లో క్లారిటీ ఇవ్వలేదు. కేంద్ర బడ్జెట్ బిజినెస్, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు. ఒకవైపు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెట్టిందని, పని దినాల పెంపును కనీసం ప్రస్తావించలేదని అంటున్నారు.   మూలధన వ్యయం కేటాయింపులు పెంచడం లాంటివి కనిపించడం ఒక పాజిటివ్ సంకేతమైనా.. మెజారిటీ పేదల సంక్షేమం విషయంలో మాత్రం ఆశించిన స్థాయిలో కేంద్రం నుంచి స్పందన లేదని పేర్కొన్నారు. చివరాఖరికి రాష్ట్రం ఏర్పడిన కొత్తలో కేంద్ర సంక్షేమ పథకాల అమలు కోసం విడుదలైన నిధులు పొరపాటున ఏపీ రాష్ట్ర ఖాతాలోకి వెళ్ళిపోయాయని, వాటిని సర్దుబాటు చేయాలన్న విజ్ఞప్తిని సైతం పట్టించుకోలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు.  

భారాసాకు కష్టమే.. తెలంగాణలో హంగే!

ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడిందన్నది సామెత. తెలంగాణలో బీఆర్ఎస్ పరిస్థితి అలా తయారైంది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారంలో కొనసాగిన తెరాస (ఇప్పుడు భారాస) తీవ్రమైన ప్రభుత్వ వ్యతిరేకతను మూటగట్టుకుంది. తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతను గమనించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ప్రజల దృష్టిని మరల్చి.. రాష్ట్రంలో ముచ్చటగా మూడో సారి అధికారాన్ని దక్కించుకునేందుకు.. వ్యూహాత్మకంగా జాతీయ రాజకీయాలలో తెలంగాణ మోడల్ అంటూ తెరాసను భారాసగా మార్చి జాతీయ పార్టీని చేశారు. ఇతర రాష్ట్రాలలో భారాస విస్తరణ అంటూ వివిధ రాష్ట్రాలలో ప్రస్తుతం రాజకీయంగా అంతగా క్రియాశీలంగా లేని నాయకులను ప్రగతి భవన్ కు పిలిపించుకుని పార్టీ కండువా కప్పుతూ.. జాతీయ రాజకీయాలలో భారాసా ప్రభంజనం సృష్టిస్తుందంటూ తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆ దిశగా ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అయితే ఆయన వ్యూహాలు ఫలించే అవకాశాలు లేవనీ తాజాగా ఉమ్మడి జిల్లాల వారీగా నిర్వహించిన ఒక సర్వే ఫలితం తేటతెల్లం చేసింది. అలాగే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూకుడు ప్రదర్శిస్తున్న బీజేపీ కూడా తెలంగాణలో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవని ఆ సర్వే ఫలితం తేటతెల్లం చేసింది. గత ఎనిమిదిన్నరేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం యాంటీ ఇన్ కంబెన్సీని ఎదుర్కొంటుంటే.. గత తొమ్మిదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై కూడా తెలంగాణలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఎంతగా ప్రయత్నం చేసినా బీజేపీ ప్రభావం రాష్ట్రంలోని ఒక్క జిల్లాకే పరిమితమైందని సర్వే వెల్లడించింది.  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో హంగ్ తప్పదన్న సంకేతాలు ఇస్తోంది. అయితే ఇటీవలి కాలంలో రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా పరాజయాన్ని మూటగట్టుకుంటున్న కాంగ్రెస్ గణనీయంగా పుంజుకుని మ్యాజిక్ ఫిగర్ కు చేరువయ్యే అవకాశాలున్నాయని కూడా ఆ సర్వే పేర్కొంది.  రాష్ట్రంలో  వచ్చే ఎన్నికలలో అధికారం చేపట్టబోయేది మేమే అని ధీమాగా చెబుతున్న బీజేపీ మూడో స్థానానికే పరిమితమౌతుందని సర్వే ఫలితం చెబుతోంది.   రాష్ట్రంలో కాంగ్రెస్ ను బలహీనపరిచేందుకు కేసీఆర్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదనీ, ప్రజలలో కాంగ్రెస్ పట్ల సానుకూల వ్యక్తమౌతున్నదనీ సర్వే ఫలితం పేర్కొంది.     ఉమ్మడి జిల్లాల వారీగా జరిగిన ఈ  సర్వే రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ సర్వే ప్రకారం  ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే రాష్ట్రంలో అతి పెద్ద పార్టీ గా కాంగ్రెస్ అవతరిస్తుందనీ,  అధికార భారాసా రెండవ స్థానానికే పరిమితమౌతుందనీ, ఇక బీజేపీ మూడో స్థానంతో సరిపెట్టుకోవలసిందేననీ ఆ సర్వే పేర్కొంది.  ఉమ్మడి జిల్లాల వారిగా సర్వే వెల్లడించిన దానిని బట్టి ఆరు రాష్ట్రాలలో కాంగ్రెస్ కు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఇక మూడు జిల్లాలో బారసా కు కొద్ది పాటి మొగ్గు కనిపించగా, కేవలం హైదరాబాద్ జిల్లాలో మాత్రమేబీజేపీ కి కొంత సానుకూలత కనిపించింది.  హంగ్ అనివార్యమైన పరిస్థితులున్నప్పటికీ.. మ్యాజిక్ ఫిగర్ కు కాంగ్రెస్ చేరువగా వస్తుందనీ, ఎన్నికల నాటికి ఇదే ట్రెండ్ కొనసాగితే మ్యాజిక్ ఫిగర్ ను అధిగమించి అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదని సర్వే ఫలితం చెబుతోంది.