ఎన్టీఆర్ శత జయంతి కానుక.. త్వరలో వెబ్ సైట్, సావనీర్
posted on Feb 4, 2023 @ 3:23PM
నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఆయన చరిత్ర భావి తర తరాలకు స్ఫూర్తి కావాలనే ఉద్దేశంతో ఓ బృహత్తర కార్యక్రమాన్ని మొదలు పెట్టామని మాజీ ఎమ్మెల్సీ, తెలుగు దేశం పార్టీ రాజకీయ కార్యదర్శి టి .డి జనార్దన్ తెలిపారు. ఎన్ .టి .ఆర్ శత జయంతి కమిటీ చైర్మన్ జనార్దన్ శనివారం (ఫిబ్రవరి 4) మీడియాతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ సినిమాలలో పలు చిరస్మర ణీయమైన పాత్రలు పోషించి తెలుగు వారి ఆరాధ్య నటుడుగా నీరాజనాలందుకున్నారనీ, అలాగే రాజకీయాలలో ప్రవేశించి, తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల స్వల్ప కాలంలోనే ఆ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారనీ చెప్పారు.
ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన పథకాలతో ప్రజానాయకుడిగా ప్రజల మన్ననలను అందుకున్నారని చెప్పారు. ఎన్టీఆర్ తెలుగునాట మాత్రమే కాదు, భారత రాజకీయాలలో కూడా క్రియాశీల పాత్ర పోషించి, జాతీయ నాయకుడిగా ప్రతిపక్షాలను ఏకతాటిపైకి తీసుకువచ్చారన్నారు. దార్శనికత కలిగిన నాయకుడిగా ఆయన స్ఫూర్తిమంతమైన జీవితం ఎప్పటికీ తెలుగువారి కి మార్గదర్శకం కావాలనే ఉద్ధేశంతో ఎన్టీఆర్ శత జయంతి కమిటీ, ఎన్టీఆర్ సినీ ప్రస్థానం, రాజకీయ, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన సమగ్రమైన సమాచారంతో ఎన్ .టి ఆర్ వెబ్ సైట్ రూపకల్పన చేస్తున్నట్లు వివరించారు.
అలాగే ఎన్టీఆర్ తో చిత్ర రంగంలో పనిచేసిన నటీ నటులు, సాంకేతిక నిపుణులు, రాజకీయ రంగంలో వారితో సాన్నిహిత్యం వున్న నాయకులు,ఆయనతో సాన్నిహిత్యం ఉన్న వారి వ్యాసాలు , ప్రముఖుల కథనాలు, సందేశాలు , అరుదైన ఫొటోలతో ఒక ప్రత్యేక సంచిక రూపొందిస్తున్నట్లు జనార్దన్ చెప్పారు. అలాగే ఎన్టీఆర్ అసెంబ్లీలో చేసిన ప్రసంగాలు , చారిత్రక ప్రసంగాలతో మరో రెండు పుస్తకాలు కూడా ప్రచురించనున్నట్లు జనార్దన్ తెలిపారు.
ఎన్టీఆర్ నటుడిగా తెలుగు ,తమిళ ,హిందీ భాషల్లో 300 చిత్రాలలో విభిన్నమైన పాత్రల్లో నటించారు. మూడు తరాల ప్రేక్షకులకు ఆయన అభిమాన నటుడయ్యారు. సినీ రంగంలో ఆయన నెలకొల్పిన రికార్డులు, సాధించిన విజయాలు అపూర్వం ,అనితర సాధ్యం . కేవలం నటుడిగానే కాక ప్రజలకు ఏ కష్టం వచ్చినా, అన్నగా నేనున్నానంటూ ముందు కొచ్చి ఆదుకున్నాడు . రాయలసీమ కరవు , దివిసీమ సీమ ఉప్పెన విపత్తులలో బాధితులను ఆదుకోవడానికి సహ నటీనటులతో కలిసి కలసి విరాళాలు సేకరించారు. చైనా యుద్ధ సమయంలో కూడా దేశ రక్షణ కోసం నిధుల సేకరణకు నడుం బిగించారు. ఆ అసమాన సేవే ఆయనను రాజకీయ రంగం వైపు నడిపించిందని జనార్దన్ తెలిపారు. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని కాపాడాలని, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ దుష్టపాలనకు చరమ గీతం పలకాలని, నట జీవితాని త్యాగం చేసి 1982 మార్చి 29న తెలుగు దేశం పార్టీని ప్రారంభించిన మహోన్నత నాయకుడు,ఆదర్శ ప్రజా సేవకుడు, తెలుగు జాతికి స్ఫూర్తి ప్రదాత ఎన్ .టి .ఆర్ అని జనార్దన్ చెప్పారు .
సమాజమే దేవాలయమని, ప్రజలే దేవుళ్ళని నమ్మిన ఎన్.టి.ఆర్. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చరిత్రను సృష్టించాయన్నారు. రెండు రూపాయలకు కిలో బియ్యం, జనతా వస్త్రాలు, పక్కా గృహాలు ,మహిళలకు ఆస్తిలో హక్కు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. పేదవాడికి పట్టెడన్నం పెట్టలేని, నిలువనీడ కల్పించలేని, కట్టుకోవడానికి గుడ్డ ఇవ్వలేని రాజకీయం ఎందుకని? ఆయన ఆవేదనతో ప్రశ్నించారు.అది నెరవేర్చడానికి ఆయన చిత్తశుద్ధితో చివరి వరకూ కృషి చేశారని జనార్దన్ చెప్పారు.
ఎన్టీఆర్ భౌతికంగా దూరమై 27 సంవత్సరాలు అయినా, ఇప్పటికీ జాతికి స్ఫూర్తి నిస్తూనే వున్నారు ఆయన జీవితం తర తరాలకు మార్గదర్శం కావాలనే ఈ మహాయజ్ఞానికి పూనుకున్నామని జనార్దన్ తెలిపారు. ఎన్ .టి .ఆర్ ఘన కీర్తిని చాటే విధంగా విజయవాడ , హైదరాబాద్ లో తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా రెండు కార్యక్రమాలను ఏర్పాటుచేస్తున్నామని , తెలుగు దేశం జాతీయ అధ్యక్షులు నారా చంద్ర బాబు నాయుడు , ఇతర జాతీయ నాయకులు , సినిమారంగ ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొంటారని జనార్దన్ తెలిపారు .
ఈ కమిటీలో సీనియర్ నాయకులు ఎమ్ .ఏ .షరీఫ్, రావుల చంద్రశేఖర్ రెడ్డి, అట్లూరి అశ్విన్, తెలుగు వన్ ఎండీ కంఠంనేని రవి శంకర్ , నిర్మాతలు కాట్రగడ్డ ప్రసాద్, అట్లూరి నారాయణ రావు, సీనియర్ జర్నలిస్టులు విక్రమ్ పూల, భగీరథ, పారిశ్రామిక వేత్త మధుసూదన రాజు, మండవ సతీష్ , కాసరనేని రఘురామ్ శ్రీపతి సతీష్ వివిధ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు . రామ్మోహన్ రావు , సత్యనారాయణ , వినాయకరావు తదితరులు కూడా తమ సహకారాన్ని అందిస్తున్నారని జనార్దన్ తెలిపారు .
ఈ ప్రయత్నానికి అన్నగారి అభిమానులు, వారితో సాన్నిహిత్యం ఉండి, మర్చిపోలేని సంఘటనలు , అపురూమైన ఫోటోలు ఎవరి దగ్గర వున్నా tdjanardhan@gmail.com మెయిల్ లేదా 9866178085 మొబైల్ నంబర్ కి WhatsApp పంపించి సహకరించాలని జనార్ధన్ మీడియా ద్వారా జనార్దన్ విజ్ఞప్తి చేశారు .