లోగుట్టు పెరుమాళ్ళకే కాదు నాకూ ఎరుకే...

  సహకార ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయం గురించి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మీడియాకు, పార్టీ అధిష్టానానికి ఏకరువు పెట్టడం చూసినవారికి, పార్టీలకతీతంగా సాగవలసిన సహకార ఎన్నికలు రాజకీయ నాయకుల కనుసన్నలలో ఏవిధంగా జరిగాయో కళ్ళకు కట్టినట్లు చూపుతుంది.   రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలలో వేలు పెట్టడమే ఒక తప్పనుకొంటే, వాటి మద్య పోరాటాలు, పొత్తులు మరో తప్పు. ఇవి చాలవన్నట్లు, ఒకే పార్టీలో మళ్ళీ రెండుమూడు వర్గాలుగా చీలిపోయి, డీసీసీబీ బోర్డు పదవులు, అధ్యక్షపదవుల కోసం లోపాయికారీ రాజకీయాలు చేసుకుపోతున్నారు. తనకు దక్కకపోయినా పరువలేదు కానీ, పార్టీలో తన ప్రత్యర్ధికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పదవులు దక్కకూడదనే పంతంతో కొందరు కోర్టులకి వెళ్లి స్టేలు తెచ్చుకొంటే, మరి కొంత మంది విపక్షాలతో చేతులు కలిపి తమ పార్టీ అభ్యర్డులకే ఎసరు పెడుతున్నారు.   మొన్న కంచికచర్ల మండలం, గొట్టుముక్కల గ్రామంలో కాంగ్రెస్ నాయకుడు గుదే వెంకటేశ్వరరావు (బుజ్జి) నివాసంలో జరిగిన వేడుకల్లో, మంత్రి సారధికి, మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుకు మద్య నడిచిన ఈ సంభాషణ ఇటువంటి వాటికి ఒక చిన్నఉదాహరణ మాత్రమే.   మంత్రి సారధి: ఏమన్నా బాగున్నావా?   వసంత: ఆ.. ఏం బాగో.. ఒక పక్క నా ఐతవరం సొసైటీకి స్టే తీసుకువచ్చి, నన్ను ఎన్నికల్లో నిలబడకుండా చేసి, ఇప్పుడు బాగున్నావా అని అడగం వెటకారం కాకపొతే మేరేమిటి?   మంత్రి సారధి: అన్నా, నువ్వలా అనుకోమాకు. స్టే సంగతి నాకు నిజంగా తెలియదు. వేరెవరో తెచ్చి ఉంటారు.   వసంత: పిన్నమనేని వెంకటేశ్వరరావు నాకంతా చెప్పాడు. పోనీ, నీకు తెలియదని తినే ఈ భోజనం మీద ప్రమాణం చేసి చెపుతావా?   మంత్రి పార్ధ సారధి: కొంచెం అసహనంగా కదిలారు గానీ జవాబీయలేదు.   వసంత: అన్నా! మీరు పెద్దవాళ్లు. మమ్మల్ని ఆశీర్వదించాలి, కాని ఇలాగ శపించకూడదు.   ఇదొక చిన్న సొసైటీ కధ మాత్రమమే. ఇటువంటివి రాష్ట్రంలో చాలానే కుమ్ములాటల కధలు, జరిగాయి.

బాబు కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా?

    టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు గత ఐదు నెలలుగా ఎండనక వాననక తీవ్ర ఆరోగ్య సమస్యలు బాధిస్తున్నా సరే పార్టీకి పునర్వైభవం తేవాలని పాదయాత్రలు చేస్తుంటే, చంచల్ గూడా జైల్లో కూర్చొన్న జగన్ మోహన్ రెడ్డి, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలను, నాయకులనూ జైలు బాట పట్టిస్తున్నారు.   నిన్న తెదేపా శాసనమండలి సభ్యుడు బొడ్డు భాస్కర రామారావు చంచల్ గూడా జైలులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోగా, ఈ రోజు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం తెదేపా శాసనసభ్యుడు సాయి రాజ్, పాతపట్నం మాజీ శాసన సభ్యుడు కలమట మోహన్ రావు, ఆయన కుమారుడు వెంకట రమణ కూడా చంచల్ గూడా జైలుకి వెళ్లనున్నారు. ఈతంతు ముగిసిన తరువాత వారు నేరుగా విజయమ్మ దర్శనం చేసుకొని, పార్టీ కండువా కప్పుకోవాలని బయలుదేరుతున్నారు.   వీరికి జతగా విశాఖ జిల్లా భీమిలిపట్నం తెదేపా ఇన్-చార్జ్ ఆంజనేయులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి జంపింగు ఇచ్చుకొనేందుకు సిద్దంగా ఉన్నారు. ఇక నేతల వెనుక, తోకలవంటి వారి అనుచరులు కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో జేరుతారని ప్రత్యేకంగా పేర్కొనవలసిన అవసరం లేదు.   తెదేపాకు శ్రీకాకుళం జిల్లాలో పెద్దన్నగా నిలబడిన కింజారపు ఎర్రం నాయుడు ఆకస్మిక మరణంతో ఆ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. రాజకీయాలలోబొత్తిగా అనుభవం లేని ఆయన కుమారుడు రామ్ మోహన్ నాయుడిని ఆయన రాజకీయ వారసుడిగా పార్టీ ప్రకటించడం కూడా, బహుశః జిల్లా నేతలకి రుచించకపోవడం వల్లకూడా ఈ పరిణామాలు కలిగి ఉండవచ్చును.   కానీ, ఇప్పుడే ఇంత జోరుగా సాగుతున్న ఈ వలసలను చూస్తుంటే, రేపు ఎన్నికలు ప్రకటించిన తరువాత వలసలు మరెంత జోరుగా సాగుతాయో ఊహించుకోవచ్చును. అందువల్ల, తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు తన పాదయాత్ర మీద మాత్రమే దృష్టి పెట్టి ఒక పద్దతిగా ముందుకు సాగిపోయినట్లయితే, వెనక నుండి ఆయన పార్టీ ఖాళీ అయిపోవడం ఖాయం. కనుక, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం మంచిది.

త్రిపురలో 93 శాతం రికార్డ్ పోలింగ్

        త్రిపురలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలికి రికార్డ్ స్థాయిలో పోలింగ్ నమోదైంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 91.22 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఈసారి 93 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇంతటి భారీ స్థాయిలో పోలింగ్ నమోదు కావడం దేశ చరిత్రలో ఇదే తొలిసారని ఎన్నికల సంఘం అధికారులు చెపుతున్నారు. త్రిపురలో మొత్తం 23,58,493 మంది ఓటర్లు ఉండగా, 60 మంది సభ్యులు గల అసెంబ్లీకి భారీగా పోలింగ్ నమోదైంది. రాష్ట్రంలో కొన్ని చోట్ల పోలింగ్ ఇంకా ముగియనందున ఓటింగ్ శాతం మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.16 పార్టీలకు చెందిన 249 మంది అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీపడ్డారు. శాంతిభద్రతల కోసం 250 కంపెనీల పారామిలటరీ బలగాలను మోహరించారు. పోలింగ్ భారీగా నమోదు కావడంతో అధికార లెఫ్ట్‌ఫ్రంట్, కాంగ్రెస్ కూటములు విజయంపై ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. వరుసగా ఐదోసారీ తమకే అధికారం దక్కుతుందని లెఫ్ట్‌ఫ్రంట్, ఈ సారి ఓటర్లు తమనే గెలిపిస్తారని కాంగ్రెస్ ధీమాగా ఉన్నాయి.  

రాహుల్ టార్గెట్ 2014: కిరణ్, బొత్స తో భేటి

        ఏఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నేడు, రేపు పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలతో పార్టీ పటిష్ఠతపై కీలక చర్చలు జరపనున్నారు. ఈ సమావేశానికి హాజరుకావడానికి బొత్స సత్యనారాయణ నిన్న ఢిల్లీ చేరుకోగా, సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. వివిధ రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, పార్టీకి ఎదురవుతున్న సమస్యలు, పార్టీ నిర్మాణాన్ని పటిష్ఠం చేయడం, పార్టీ ఎన్నికల్లో విజయావకాశాలకు తీసుకోవల్సిన చర్యలపై వారితో చర్చిస్తారు. ఈ నేపథ్యంలో పీసీసీ చీఫ్ బొత్స, సీఎం కిరణ్ కూడా ఆయనతో వేర్వేరుగా, కలిసి చర్చించనున్నట్లు తెలిసింది. రాష్ట్రంలో ప్రభుత్వం, పార్టీ ఎదుర్కొంటున్న రాజకీయ, సంస్థాగత సమస్యలు, వైసీపీ ప్రాబల్యం, టీడీపీ అధినేత పాదయాత్ర, తెలంగాణ తదితర అంశాలపై వారిద్దరి అభిప్రాయాలను రాహుల్ తెలుసుకునే అవకాశం ఉంది. ఈ రెండురోజుల్లో పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించనున్నట్లు సమాచారం. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రాహుల్ రాష్ట్రస్థాయి నేతలను కలుసుకోవడం ఇదే తొలిసారి. ఇప్పటివరకూ సోనియాతోనే పార్టీ వ్యవహారాలు చర్చించేందుకు అలవాటుపడ్డ ఈ నేతలు ఇప్పుడు నేరుగా రాహుల్ నాయకత్వంలో పనిచేసేందుకు వీలుగా రంగం సిద్ధం చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు ఏఐసీసీ వర్గాలు తెలిపాయి.

బాబు పాదయాత్రకి బ్రేకుల్లేవు

  చంద్రబాబు తన పాదయాత్రను యధావిధిగా కొనసాగించనున్నారు. నిన్న కొలకలూరులో జరిగిన చిన్న ప్రమాదంలో ఆయనకి కుడికాలు బెణికింది. ఈ రోజు హైదరాబాదు నుండి వచ్చిన డాక్టర్లు మరోమారు పరీక్ష చేసిన అనంతరం వారి సలహా మేరకు బాబు తన పాదయాత్రను కొనసాగించనున్నారు. నిన్న ప్రమాదం జరిగిన తరువాత కూడా ఆయన నడవాలని ప్రయత్నించినా కాలునొప్పి ఎక్కువగా అవడంతో కేవలం మరో కిమీ దూరం మాత్రమే నడిచి పాదయాత్ర విరమించుకొన్నారు. హరికృష్ణ, జూ.యన్టీఆర్, మరియు చంద్రబాబు అర్ధాంగి భువనేశ్వరి బాబును ఫోన్ లో పరామర్సించగా లోకేష్ మాత్రం స్వయంగా కొలకలూరువచ్చి తండ్రిని కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితులు తెలుసుకొన్నారు. శరద్ పవర్ కూడా చంద్రబాబును ఫోన్ లో పరామర్శించి, ఆరోగ్యం జాగ్రతగా కాపాడుకోమని సూచించారు.

చంచల్ గూడా జైలు బాటపట్టిన ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరుడు

  గత కొద్ది రోజులుగా తెలుగు దేశం పార్టీ నుంచి బయటకి వెళ్ళే ఆలోచన చేస్తున్న ఎమ్మెల్సీ బొడ్డు భాస్కరరామారావు గురువారంనాడు దైర్యం చేసి చంచల్ గూడా జైలుకి వెళ్ళిపోయారు. జగన్ మోహన్ రెడ్డిని కలుసుకొని వచ్చిన తరువాత మీడియా వారితో మాట్లాడుతూ, చంద్రబాబు వైఖరి నచ్చనందునే తానూ పార్టీ వీడుతున్నానని, జగన్ మోహన్ రెడ్డితో మనసు విప్పి అన్ని మాట్లాడుకొ న్నట్లు, చంద్రబాబుతో మాట్లాడే అవకాశం తనకు ఎప్పుడు కలుగలేదని అన్నారు.   అయితే, తెలుగు తమ్ముళ్ళు మాత్రం అతని మీద చాలాగుర్రుగా ఉన్నారు. పార్టీలో కీలకపదవులిచ్చి గౌరవించినప్పటికీ పార్టీపట్ల కానీ, పార్టీ అధినేతపట్ల గానీ కనీస విశ్వాసం కూడా చూపకుండా, జగన్ ఆఫర్ చేసిన డబ్బుకు అమ్ముడుపోయాడని తీవ్రవిమర్శలు చేసారు. గతంలో, తెలుగుదేశం పార్టీ హయాములో ఆయనకి కీలకమయిన రాష్ట్ర ప్రణాళిక సంఘం అధ్యక్ష పదవిని చంద్రబాబు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత చంద్రబాబు ప్రభుత్వం ఏంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన్మభూమి కార్యక్రమానికి కూడా బొడ్డు భాస్కరావే ముఖ్య బాధ్యతలు నిర్వహించారు. 2009 సం.లో పార్టీ పరాజయం పాలయిన తరువాత కూడా, ఆయన అదే స్పూర్తితో, అంకిత భావంతో పార్టీకి సేవచేసినందున శాసనమండలికి పంపడం జరిగింది.   అయినప్పటికీ, ఆయన ఈవిధంగా పార్టీకి ద్రోహం చేసి జగన్ గూటికి చేరడం తెలుగు తమ్ముళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. కేవలం జగన్ ఆశ చూపిన డబ్బుకి, శాసన సభ టికెట్టుకి ఆశపడి పార్టీకి ద్రోహం తలబెట్టాడని ఆరోపిస్తున్నారు. ఆయన జగన్ను కలిసేందుకు జైలుకి వెళ్ళినట్లు తెలియగానే, ఆయను పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు కూడా వెలువడ్డాయి.

ప్రేమికులరోజు: అన్నాచెల్లెళ్లకు పెళ్లి, బంధువులు ఆగ్రహం

        ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి ప్రేమ పక్షులు పార్కులకు, పబ్బులకీ వెళితే వారికి అక్కడే పెళ్లిళ్లు చేసేస్తామని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ ముందే హెచ్చరి౦చారు. అయితే హైదరాబాదులోని కుషాయిగూడలో రాజు, గౌతమి అనే ప్రేమికులకు భజరంగ్ దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. ఈ పెళ్ళి వివాదానికి దారి తీసింది.   అబ్బాయి - అమ్మాయి తరపు పెద్దలు వచ్చి గొడవకు దిగారు. విషయం ఏంటని చూస్తే.. పెళ్లి చేసుకున్న రాజు, గౌతమిలు కజిన్స్. రాజుకు గౌతమి పిన్ని కూతురట. వీరికి దళ్ కార్యకర్తలు పెళ్లి చేశారు. అయితే, ఈ విషయం దళ్ కార్యకర్తలకు తెలియదు. వారు కుషాయిగూడలో ఓ గుడికి వెళ్లి వస్తుండగా భజరంగ్ దళ్ కార్యకర్తలు వారిని అడ్డగించి కౌన్సెలింగ్ నిర్వహించి అనంతరం పెళ్లి చేశారు. తాము వరుసకు అన్నా చెల్లెళ్లమని చెప్పలేదట. దీంతో ప్రేమికులుగా భావించి దళ్ కార్యకర్తలు వారి పెళ్లి చేశారు. రాజు, గౌతమిల పెళ్ళిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు స్థానిక పోలీసు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. 

జగన్ ఆస్తుల కేసు ఆషామాషీ కాదు: సిబిఐ

        చంచల్ గూడ జైల్లో వున్న జగన్ కి కోర్ట్ ఈనెల 27వరకు రిమాండ్ పొడిగించింది . ప్రతి పద్నాలు రోజులకు ఓసారి రిమాండును పొడిగిస్తున్నారని జగన్ తరపు న్యాయవాది ఆక్షేపించారు. సిబిఐ తన దర్యాఫ్తును ఎప్పుడు పూర్తి చేస్తోందో? ఎప్పుడు ఆఖరి ఛార్జీషీటు దాఖలు చేస్తుందో? తెలియకుండా ఉందన్నారు. సిబిఐ తన ఆఖరి ఛార్జీషీట్ ఎప్పుడు దాఖలు చేయనుందో? దర్యాఫ్తు ఎప్పుడు పూర్తి చేస్తారో? స్పష్టంగా చెప్పాలని జగన్ తరఫు న్యాయవాది కోర్టులో సిబిఐని ప్రశ్నించారు.దీంతో జగన్ కేసు పురోగతిపై పూర్తి వివరాలతో కూడిన మెమో దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించింది. జగన్ కేసుకు సంబంధించి ఏడు అంశాలపై దర్యాప్తు పూర్తి అయ్యాక ఒకే చార్జీ షీటును తయారు చేసి కోర్టుకు దాఖలు చేస్తామని సీబీఐ తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. జగన్ ఆస్తుల కేసు ఆషామాషీ కేసేమీ కాదని, ఆయన కూడా సాధారణ వ్యక్తి కాదని సిబిఐ కోర్టుకు తెలియజేసింది. జగన్‌కు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశం ఉందని, జగన్ జైల్లో ఉంటేనే కేసును స్వేచ్ఛగా విచారణ చేయగలుగుతామని సీబీఐ పేర్కొంది.

చంద్రబాబుకు తప్పిన ప్రమాదం..కాలికి గాయం

        తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు కు త్రుటిలో ప్రమాదం తప్పింది. గుంటూరు పాదయాత్రలో కొలకలూరు గ్రామంలో  స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహాన్ని ఆవిష్కరించిన అనంతరం మెట్ల నుండి దిగుతున్న సమయంలో వేదిక కోసం ఏర్పాటు చేసిన మెట్లు కూలిపోయాయి. వెంటనే భద్రత సిబ్బంది స్పందించి ఆయనను కింద పడకుండా పట్టుకున్నారు. దీంతో ఆయనకి ప్రమాదం తప్పింది. సమయానికి స్పందించిన భద్రత సిబ్బంది పై అందరూ పొగడ్తల వర్షం కురిపించారు. చంద్రబాబుకు ప్రమాదం తప్పిందన్న విషయం తెలియగానే ఆయన కుమారుడు లోకేష్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణ ఫోన్‌లు చేసి ఆరోగ్యం, ప్రమాదంపై వాకబు చేశారు. బాబు తూలిపడ్డారని తెలిసిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆందోళనకు గురయ్యారు. అయితే, ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. బాబు కాలికి స్వల్ప గాయం మినహా ఎలాంటి ప్రమాదం జరగలేదని, టిడిపి అభిమానులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ఈ రోజు పాదయాత్రను నిలిపివేసే అవకాశం ఉంది.  

తెలంగాణాలో ఎన్నికలకీ సమైక్య బూచేనా?

  ఈ నెల 21వ తేదీన జరగనున్న శాసన మండలి ఎన్నికలను సీమాంద్ర-తెలంగాణా సెంటిమెంటుల మద్యన జరిగే యుద్ధంగా భావించి, తెరాస తరపున పట్టభద్రుల నియోజక వర్గం నుండి పోటీ చేస్తున్న తనను, సుధాకర్ రెడ్డిని గెలిపించాల్సిందిగా తెలంగాణా జేయేసీ కన్వీనర్ మరియు తెరాస నేత స్వామి గౌడ్ ప్రజలను కోరారు. మొన్న జరిగిన సహకార సంస్థల ఎన్నికలలో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకొన్నా కాంగ్రెస్ ప్రభుత్వం, ఆ ఫలితాలను ఎత్తి చూపుతూ తెలంగాణా సెంటిమెంటు క్రమంగా కనుమరుగయిపోతోందని చేస్తున్న ప్రచారానికి సరయిన జవాబు చెప్పాలంటే, తెలంగాణా ఉద్యమం కోసం పోరాడుతున్న తెరాస అభ్యర్దులను గెలిపించడం ద్వారానే సాద్యం అని తెలిపారు. తమను గెలిపించడం ద్వారా సమైఖ్యవాదులయిన లగడపాటి వంటి వారికి కనువిప్పు కలుగుతుందని ఆయన అన్నారు.       అయితే, తెలంగాణా ప్రజలలో తమకున్నఆదరణ, మద్దతులపై ఆధారపడి స్వశక్తితో విజయం సాధించవలసిన తెరాస నేతలు, తెలంగాణాలో జరిగే ఎన్నికలకు కూడా సమైఖ్యవాదులను, సమైక్యవాదాన్ని బూచిగా చూపించి ప్రజలనుండి ఓట్లు కోరడమే విడ్డూరం.  

భారత్ ఆశ్రయం కోరిన మాల్దీవుల మాజీ దేశాధ్యక్షుడు

  మాల్దీవుల మాజీ దేశాధ్యక్షుడు మొహమ్మద్ నషీద్, తనపై స్థానిక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీచేయడంతో, నిన్నరాజధాని ‘మాలే’లోగల భారత హై కమీషన్ కార్యలయానికి వచ్చి అక్కడ తనకి రాజకీయ ఆశ్రయం ఇప్పించవలసిందిగా భారత హై కమీషనరు డీ.యం.ముల్లెను అభ్యర్దించారు. నషీద్ 2012వ సంవత్సరంలో స్థానిక క్రిమినల్ కోర్టు ప్రధాన న్యాయ మూర్తిని అరెస్ట్ చేసిన కేసులో, కోర్టు నషీద్ ను స్వయంగా కోర్టులో హాజరయి తన సంజాయిషీ ఇవ్వాల్సిందిగా ఆడేశించినప్పుడు, ఆయన కోర్టుకు రాకపోవడంతో అయన బెయిలు దరఖాస్తును తిరస్కరిస్తూ, అయన అరెస్ట్ కు ఆదేశాలు జారీ చేసింది. అరెస్ట్ తప్పించుకొనేందుకు, నషీద్ భారత హై కమీషన్ కార్యాలయంలో ఆశ్రయం కోరారు. అంతర్జాతీయ న్యాయ సూత్రాల ప్రకారం, స్వదేశంలో ఉన్న విదేశీ హై కమీషన్ కార్యలయాలలోకి స్థానిక పోలీసులు లేదా రక్షణ అధికారులు కానీ లోనకి ప్రవేశించే వీలులేదు గనుక, నషీద్ భారత కార్యాలయంలో ఆశ్రయం కోరారు. అందువల్ల, ఆయన బయటకు వస్తే, అరెస్ట్ చేసేందుకు మాల్దీవుల పోలీసులు భారత హై కమీషన్ కార్యాలయాన్ని చుట్టుముట్టారు. అయితే, వారు ఎట్టి పరిస్థితుల్లో భారత హై కమీషన్ కార్యాలయములోకి ప్రవేశించబోరని మాల్దీవుల ప్రస్తుత అధ్యక్షుడు మొహమ్మద్ వహీద్ తెలిపారు.

జగన్ తో టిడిపి ఎమ్మెల్సీ బొడ్డు 5 కోట్ల డీల్!

        తూర్పు గోదావరి జిల్లాకు చెందిన టిడిపి ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర రామారావు జగన్ పార్టీలో కి చేరుతున్నట్టు తెలుస్తోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌నుచంచల్‌గూడ జైల్లో కలిశాడు. భాస్కర రామారావు వెంట కాకినాడ నగర శాసనసభ్యుడు, కాంగ్రెస్ నుంచి జగన్ పంచన చేరిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కూడా ఉన్నారు. మరోవైపు భాస్కరరామారావుపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తపరుస్తున్నారంటూ, జగన్ తో ఐదు కోట్ల డీల్ జరిగిందని ఆరోపిస్తున్నారని ఒక ప్రముఖ పత్రిక వెబ్ సైట్ లో కధనాన్ని ప్రచురించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో రూ.8 కోట్లు ఖర్చు అయిందని, ఆ డబ్బు కోసమే భాస్కరరామారావు పార్టీని ఫిరాయించారని టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది మరో బోఫోర్స్ కుంభకోణ౦!

        తాజా హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణం మరో బోఫోర్స్ కుంభకోణమని అంటూ బీజేపి విరుచుకు పడింది. ఈ ఒప్పందాన్ని రద్దు చేయాలని యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ అంశాన్ని పార్లమెంట్‌లో లేవనెత్తేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కాంగ్రెస్ ఉక్కిరి బిక్కిరి అవుతోంది.   ఇప్పటికే ఈ కుంభకోణంపై సీబీఐ, ఈడీ దర్యాప్తునకు కేంద్రం ఆదేశించారు. హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో దోషులెవర్నీ వదిలిపెట్టమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అవరమైతే హెలికాప్టర్ల ఒప్పందాన్ని రద్దు చేస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఏ.కే.ఆంటోని ప్రకటించారు. ఇటలీకి చెందిన వీవీఐపీ హెలికాఫ్టర్ కొనుగోలు ఒప్పందంలో చోటు చేసుకున్న అవకతవకల్లో తన పాత్ర ఏమాత్రం లేదని, ఈ విషయంలో ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నట్టు భారత ఎయిర్‌మార్షల్ చీఫ్ ఎస్.పి.త్యాగి వెల్లడించిన సంగతి తెలిసిందే. మొత్తం 3,600 కోట్ల రూపాయల వ్యయంతో ఇటలీ ఎయిర్ స్పేస్ కంపెనీ నుంచి 12 అగస్టా వెస్ట్‌ల్యాండ్ హెలికాఫ్టర్లను కొనుగోలు ఒప్పందంలో భారత్ లంచాలు చెల్లించినట్టు ఇటలీ పత్రికలు వార్తా కథనాలను ప్రసారం చేశాయి.  

సమైక్యమా? ఇప్పుడు కాదులే...

    ఒకానొకప్పుడు చంద్రబాబు తెలంగాణా లో పాదయత్ర చేస్తున్న సమయంలో నిత్యం ఎవరో ఒకరు తెలంగాణా ఇవ్వాలని మీరు కోరుకొంటున్నారా లేదా? తెలంగాణా పై మీ అభిప్రాయం స్పష్టంగా చెప్పమని, లేకపొతే ‘జై తెలంగాణా’ అనమనో అడుగుతూ ఆయనను ఇబ్బందికర పరిస్థితుల్లో నెట్టేవారు. అప్పుడు ఆయన వారికి లౌక్యంగా సమాధానం చెప్పి బయటపడేవారు.   తెలంగాణా అనుకూల నిర్ణయం తీసుకొన్న తరువాత కూడా ఆయన తన పార్టీ వైఖరిని ఇంతవరకు స్పష్టంగా ప్రకటించలేదు. ఎందుకంటే, మరీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తే, కాంగ్రెస్ దానిని ఆసరాగా తీసుకొని తన పార్టీని రాజకీయంగా దెబ్బ తీయవచ్చుననే భయంచేత కావచ్చును. లేదా, ఒకవేళ తానూ ‘జై తెలంగాణా’ అన్న తరువాత, కాంగ్రెస్ సమైక్యం అని ప్రకటిస్తే, అప్పుడు రాష్ట్రంలో తన పార్టీ పరిస్థితి దారుణంగా తయారవుతుందనే భయంచేత కావచ్చును. మొత్తం మీద, చంద్రబాబు అటు ‘జై తెలంగాణా’ అని అనలేకా, ఇటు ‘జై సమైక్యాంద్ర’ అని అనలేక చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో పాదయాత్ర సాగిస్తున్నారు.   పటిష్టమయిన తన పార్టీ క్యాడర్ల సహాయంతో సమైక్యవాదులను తన పాదయాత్రలకి దూరంగా ఉంచి ముందుకు సాగుతున్న చంద్రబాబు, తెలంగాణాలో తానూ ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇక్కడ కోస్తాంధ్రాలో ఇంతవరకు ఎదుర్కోకుండానే ముందుకు సాగిపోతున్నారు. లగడపాటి వంటివారు ఆయనను ఇబ్బందిపెట్టాలని ప్రయత్నించినా పోలీసుల జోక్యంతో ఆ ప్రమాదం కూడా అదిగమించగలిగారు.   అయితే, నిన్న గుంటూరు జిల్లా ఉప్పలపాడు గ్రామంలో ఆయన పాదయాత్ర సాగున్నపుడు మాత్రం ఈ ఇబ్బందికర సమస్య మళ్ళీ ఎదుర్కోకతప్పలేదు. గ్రామంలో రైతులతో మాట్లాడుతుండగావారిలో ఒక రైతు చంద్రబాబును ‘జై సమైక్యాంధ్ర’ అనమని కోరాడు. ఇటువంటి సమస్యలను ఇప్పటికే చాలాసార్లు ఎదుర్కొన్న చంద్రబాబు ఆచి తూచి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వైఖరిని ఇప్పటికే చాలాసార్లు చెప్పామని, ఇక దానిపై నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కేంద్రదానిదే తప్ప తమది కాదని ఆయన జవాబు ఇచ్చారు. దీనినే రెండు కళ్ళ సిద్దాంతం అని తెరాస అభిప్రాయపడితే, కర్ర విరగకుండా పాము చావకుండా ప్రమాదం దాటేయడం అని రాజకీయ విశ్లేషకులు అబిప్రాయపడుతున్నారు.

మంత్రి కొండ్రు మురళి కి మదపిచ్చి!

        చంద్రబాబుకు పిచ్చి ముదిరిందని మంత్రి కొండ్రు మురళి మోహన్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు పై టిడిపి నేతలు మండిపడుతున్నారు. కొండ్రు మురళి అధికార మదంతో పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్ విమర్శించారు. చంద్రబాబు పాదయాత్ర తల్లి, పిల్ల కాంగ్రెస్‌కు అంతిమయాత్ర అని ఆయన కొత్త నినాదం ఇచ్చారు. వైఎస్ జగన్ అవినీతిలో కొండ్రుకు వాటా ఉందని, ఆయన ఆస్తులపై సీబీఐ విచారణ జరపాలని రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. చంద్రబాబును పార్టీ అద్యక్ష పదవి నుంచి మార్చాలని మురళీమోహన్ సూచించగా, లిక్కర్ డాన్‌గా పేరొందిన కాంగ్రెస్ అధ్యక్షుడిని మార్చుకోండని బాబు రాజేంద్ర ప్రసాద్ సూచించారు.

పార్కు జంటలకి పెళ్లిళ్ళ రోజు నేడు

  ఈ రోజు ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడానికి ప్రేమ పక్షులు పార్కులకు, పబ్బులకీ వెళితే వారికి అక్కడే పెళ్లిళ్లు చేసేస్తామని విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ హెచ్చరిస్తున్నాయి. విదేశీ సంస్కృతికి అలవాటుపడ్డ యువత, ఇటువంటి ‘వాలెంటైన్స్ డే’ వంటివాటిని సాకుగా తీసుకొని విచ్చలవిడితనానికి అలవాటుపడి భారతీయ సంస్కృతిని మంటగలుపుతున్నారని తీవ్రంగా విమర్శించే ఆ రెండు హిందూసంస్థలు, ఇటువంటి ప్రేమ జంటలకి బుద్ది చెప్పేందుకు మంగళ సూత్రాలు, మట్టెలు, పసుపుకుంకుమలు వంటి పెళ్లి సామాగ్రిని దేశంలో అన్ని ప్రాంతాలలో సిద్ధం చేసుకొని ప్రేమపక్షులకోసం పార్కుల వద్ద, పబ్బులవద్ద ఎదురు చూస్తున్నాయి.   హైదరాబాదు పోలీసు కమీషనరు మాత్రం ప్రేమజంటలకి దైర్యం చెపుతూ మేమున్నామని అంటున్నారు. పార్కుల వద్ద ప్రేమికులను కాపాడేందుకు పోలీసులను కూడా ఏర్పాటు చేయనున్నారు.   గమ్మతయిన విషయం ఏమిటంటే, మిగిలిన రోజుల్లో పార్కుల్లో, బీచుల్లో ప్రేమ జంటలు కనిపిస్తే వారిని తరిమేసే పోలీసులే ఈ రోజు వారిని వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ ల నుండి కాపాడే బాద్యత తీసుకోక తప్పట్లేదు.   భజరంగ్ దళ్ నగర కన్వీనర్ భరత్ వంశీ, రాష్ట్ర కార్యదర్శి టి.యమన్‌సింగ్ హైదరాబాదులో తమ కార్యాయలంలో మీడియాతో మాట్లాడుతూ ప్రేమ జంటలను పట్టుకుని అందరి సమక్షంలో వారికి కౌన్సెలింగ్ నిర్వహించి, వారి తల్లి తండ్రులకు చెప్పి మరీ పెళ్లిళ్లు చేస్తామని అన్నారు.

నారా లోకేష్ ట్విట్టర్ పోస్ట్: బాబుపాదయాత్రకు ఢిల్లీ గజగజ

  ఒక వైపు చంద్రబాబు నాయుడు నిరంతరంగా పాదయాత్ర చేసుకుపోతూ, ప్రభుత్వాన్ని, కాంగ్రెస్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలను ప్రజల మద్యనిలబడి మరీ ఎండగడుతుంటే, ఆయన కుమారుడు తన ఇంట్లోంచే ఆ పార్టీలపై ట్విట్టర్ ద్వారా సైబర్ యుద్ధం చేస్తున్నాడు. సంక్షిప్తంగా ఉండే సందేశాలతోనే గుంటూరు మిర్చి అంత ఘాటయిన డైలాగులు పేల్చుతూ అందరి దృష్టినీ ఆకట్టుకొంటున్నాడు. అయితే, ఆ రెండు పార్టీలలో ఇంతవరకు అతనిని ఎదుర్కొనే ‘సైబర్ వీరుడు’ ఇంకా పుట్టినట్లు లేదు. అందువల్ల లోకేష్ ట్వీటర్లో చేసిన విమర్శలకు, ఆ రెండు పార్టీలు మీడియా ముఖంగానో లేకపోతే ప్రజలతో నేరుగానో జవాబు చెప్పుకోవలసివస్తోంది. త్వరలో ఆ రెండు పార్టీలు కూడా లోకేష్ కు ధీటుగా సైబర్ యుద్ధం చేసేందుకు ప్రయత్నం చేసినా చేయవచ్చును.   ఇక, విషయానికి వస్తే నారా లోకేష్ మళ్ళీ మరో మారు ట్వీటర్లో కాంగ్రెస్ ను విమర్శిస్తూ సందేశం పెట్టాడు. తన తండ్రి ఇక్కడ చంద్రబాబు పాదయాత్ర చేస్తుంటే, అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఉలికులికి పడుతోందని, పాదయాత్ర ప్రకంపనలు ఢిల్లీలో కనిపిస్తున్నాయని వ్రాసాడు. ఇక్కడ తన తండ్రి చంద్రబాబు నాయుడు 1000 కిమీ పాదయాత్ర పూర్తి చేయగానే, అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం నగదు బదిలీ పధకం మొదలు ప్రకటించిందని, మళ్ళీ ఇప్పుడు 2000 కిమీ. పూర్తిచేయగానే ఋణ మాఫీ అంటోందని ఎద్దేవా చేసాడు.   ఒక వైపు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఋణ మాఫీ అసాద్యం, అసంభవం అంటుంటే, మరో పక్క కేంద్రం రుణమాఫీ గురించి మాట్లాడటమే రాజకీయాలలో చురుకుగా ఉండే లోకేష్ వంటి యువకులకు విమర్శించే అవకాశం ఇస్తోందని అని అనుకోవచ్చును.

అఫ్జల్ గురూ కోసం పరితపిస్తున్న మన మేధావులు

  మన దురదృష్టం ఏమిటంటే, మరొకరికి అవకాశం దక్కకుండా జాగ్రత్త పడుతున్నట్లు మన దేశం మీద మనమే దాడి చేసుకొంటాము. భారత పార్లమెంటు మీద దాడి చేయడమే కాకుండా 9 మందిని పొట్టన బెట్టుకొన్న తీవ్రవాది అఫ్జల్ గురూను మొన్న ఉరి తీసినప్పుడు వరవరరావు మొదలుకొని, కాశ్మీరు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా వరకు ‘అతనిని ఉరి తీయడం చాల అమానుషం’ అంటూ చాల మందే నిరసనలు తెలియజేసారు. అటువంటప్పుడు జమ్మూ కాశ్మీర్ ను, మన దేశం నుండి విడగొట్టి పాకిస్తాన్ లో కలిపేయాలని కోరుకొంటున్న జమ్మూ కాశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ అధ్యక్షుడు యాసిన్ మాలిక్ మాత్రం ఎందుకు ఊరుకొంటాడు?   అతనివంటి వారికి మన దేశం కన్నా, మన దేశాన్నితరచూ అవమానించే పాకిస్తాన్ అంటేనే ప్రేమ అధికం. మొన్న ఆ దేశం వెళ్ళిన మాలిక్ ఈసారి తన అసలు రూపం ఏమిటో లోకానికి, ముఖ్యంగా భారతదేశానికి చూపాడు. ముంబై దాడులకు తెగబడిన లష్కరే తొయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌తో ఒకే వేదికపై కలిసి కూర్చొని అఫ్జల్ గురూ ఉరికి నిరసనగా పాకిస్తాన్ లో ఒక రోజు దీక్ష చేసాడు.   అసలు అఫ్జల్ గురూ వంటి తీవ్ర వాదికి మద్దతుగా నిరసన చేయడమే ఒక తప్పయితే, మన దేశం మీద దాడికి తెగబడి అనేక మంది అమాయకులను పొట్టన బెట్టుకొన్న మరో పాకిస్తాన్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌తో కలిసి, పాకిస్తాన్ లో దీక్ష చేయడం రెండవ తప్పు.   బహుశః మన దేశంలో ఉన్న స్వేచ్చస్వాతంత్రాల వల్లనే, ఒక దేశద్రోహిని ఉరితీసినప్పుడు కూడా తమను తాము మేధావులుగా భావించేవారు అనేక మంది రాష్ట్రపతి, ప్రభుత్వం, సుప్రీంకోర్టు చేసిన నిర్ణయాన్ని ప్రశ్నించగలుగుతున్నారు. తద్వారా వారికి మన వ్యవస్థపట్ల ఎంత గౌరవం ఉందో స్పష్టంగా అర్ధం అవుతోంది. అఫ్జల్ గురూ వంటి తీవ్ర వాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన అమాయక పౌరుల కన్నా, తీవ్రవాదుల ప్రాణాలే మిన్నఅని భావించడం ఏ వాదం అవుతుంది? అమాయకుల ప్రాణాలు పొట్టన బెట్టుకొనే ఒక కరడుకట్టిన తీవ్రవాదిని, ఉద్యమకారుడిగా వర్ణించడం ఏవిధంగా సమర్ధనీయం?   రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ ఏ చిన్న సమస్యను పరిష్కరించడానికి ముందుకు రాని ఇటువంటి కుహనా మేధావులు, అనవసరమయిన సమయంలో, అనవసరమయిన విషయాలలో తల దూర్చి మేమున్నామంటూ మీడియా కెక్కుతుంటారు. గానీ, డిల్లీ గ్యాంగ్ రేప్, నల్గొండను దశాబ్దాలుగా పట్టిపీడిస్తున్న ఫ్లోరోసిస్ సమస్య, రాష్ట్ర విభజనవంటి పలు కీలక అంశాలపై ఏనాడు నోరువిప్పని ఇటువంటి పనికి రాని, కుహాన మేధావులు మన దేశంలో కోకోల్లలున్నారు.   వారి ఈ అతివల్లనే మాలిక్ వంటి వేర్పాటువాదులు దైర్యంగా ఉగ్రవాదులతో కలిసి తిరుగుతూ మన దేశం, ప్రభుత్వం పరువు పాకిస్తాన్ లో తీస్తున్నారు. ప్రభుత్వం కేవలం అతని పాస్ పోర్ట్ స్వాదీనం చేసుకొనంత మాత్రాన్న ఒరిగేదేమీ ఉండదు. అతనికి కూడా కటినంగా శిక్షించి అటువంటి ఆలోచనలు చేసే వారికి గట్టి హెచ్చరిక చేయాలి.

గుంటూరులో సహకారం లేనట్లే

  గుంటూరు సహకార సంఘాల ఎన్నికలలో ఆదిక్యత కనబరచిన తెలుగుదేశం పార్టీకి, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్ష పదవి దాదాపు ఖాయం అనుకొంటున్న తరుణంలో హైకోర్టు అక్కడ 4 వారాలపాటు ఎన్నికలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసి పెద్ద షాక్ ఇచ్చింది. రెండు వారాల్లో కౌంటరు దాఖలు చేయాలని కోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక నేడో రేపో వెళ్లి బ్యాంకు వ్యవహారాలు చూసుకోవడమే తరువాయి అనుకొంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకి కోర్టు ఆదేశాలు పెద్ద షాక్ ఇచ్చినట్లయింది. ఇక పక్కనే ఉన్న కృష్ణా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు అధ్యక్ష పదవికి మాజీమంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు పేరును కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది.