12న ఈటీవీలో ‘రాజధాని ఫైల్స్’

అమరావతి రైతుల ఆవేదనకు అద్దం పట్టేలా శ్రీమతి హిమబిందు సమర్పణలో, భాను దర్శకత్వంలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై రవిశంకర్ కంఠంనేని నిర్మించిన ‘రాజధాని ఫైల్స్’ చిత్రం ఈనెల 12 ఆదివారం నాడు ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ఈటీవీలో ప్రసారం కాబోతోంది. ఒక దుర్మార్గుడు పాలకుడై రైతుల జీవితాలతో ఆడుకుంటుంటే, ఆ దుర్మార్గుడిపై తిరగబడి, రైతులు సాధించిన విజయం ఈ చిత్రం.  మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు తాను చేసే ప్రచారంలో సమయభావం వల్ల ప్రతీ ఊరికి, ప్రతీ ఇంటికి నేరుగా వెళ్లలేకపోయారు! అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్, బి.జె.పి. నాయకులు కూడా కొన్ని ప్రాంతాలకి వెళ్లలేకపోయారు..ఐనా తమ శక్తివంచన లేకుండా ప్రచారం చేశారు. వీళ్ల కూటమిని గెలిపించండని ప్రజలందరికీ చెప్పడానికి తెలుగువన్ వారి "రాజధాని ఫైల్స్" చిత్రం మాత్రం ప్రతీ ఇంటింటికీ వెళ్లి తలుపు తడుతోంది, ఇంటిలో ఉన్న ప్రతీ ఒక్కర్నీ ఆలోచింప చేయబోతోంది! రాజధాని లేని లోటుని.. కూటమి గెలుపు అవసరాన్ని ప్రజలకి తెలియజెప్పబోతోంది, అందుకే రేపు పోలింగ్ అనగా 12వ తేది ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషాలకు మీ ఈటీవీలో మీ ముందుకు వస్తోంది.! ఎంత ధైర్యం దానికి..! ఎంత శక్తి దానికి..!  దానికి కారణం అది ప్రజా బాణం.! కూటమి గెలుపుకి శ్రీకారం చుడుతోంది. రాష్ట్ర భవితకు ఆకారం ఇవ్వబోతోంది.. "రాజధాని ఫైల్స్" చిత్రం.

అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్, విడుదల!

ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కి బెయిల్ లభించిన నేపథ్యంలో ఆయన తీహార్ జైల్ నుంచి విడుదలయ్యారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఆయన అరెస్టు అయ్యారు. సార్వత్రిక ఎన్నికల ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జూన్ 1 వరకు ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో తీహార్ జైలు అధికారులు ఆయనను శుక్రవారం రాత్రి విడుదల చేశారు. జైలు నుంచి కారులో బయటకి వెళ్తూ కేజ్రీవాల్ ప్రజలకు అభివాదం చేశారు. కేజ్రీవాల్ విడుదల సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో తీహార్ జైలు వద్దకు వచ్చారు. కేజ్రీవాల్ తన వాహనంలో ఇంటికి బయల్దేరారు. కేజ్రీవాల్ వాహనంలో ఆయన భార్య, కుమార్తె, ఆప్ రాజ్యసభ ఎంపీ సందీప్ పాఠక్ వున్నారు.  హనుమాన్ దయ వల్లే తాను బయటకి వచ్చానని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు తాను హనుమాన్ ఆలయాన్ని సందర్శించనున్నానని ఆయన ప్రకటించారు. 

మాచర్ల ప్రజలూ.. అర్థం చేసుకోండి: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు మాచర్లలో పర్యటించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి, పల్నాటి పౌరుషాన్ని చూపించడానికి సిద్ధంగా వున్న మాచర్ల నియోజకవర్గ ప్రజలను పలకరించడానికి చంద్రబాబు వెళ్ళాలని అనుకున్నారు. అయితే అనుకోకుండా భారీ వర్షం కురవడం వల్ల చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దు చేసుకోవలసి వచ్చింది. అనంతరం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఒంగోలు బయల్దేరారు. ఈ సందర్భంగా మాచర్ల ప్రజలకు చంద్రబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వాతావరణం ఇబ్బంది కారణంగా రద్దయిన తన ప్రయాణాన్ని మాచర్ల ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. మాచర్ల వెళ్లేందుకు అన్ని అవకాశాలు పరిశీలించినా సాధ్యపడలేదు కాబట్టే రద్దు చేసుకున్నానని, దీనిని మాచర్ల ప్రజలు సహృదయంతో స్వీకరిస్తారన్న నమ్మకం తనకు వుందని చంద్రబాబు చెప్పారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బ్రహ్మానంద రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి తీసుకురావాలి ఆయన మాచర్ల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రౌడీ రాజకీయానికి పల్నాడు ప్రజలు తమ ఓటుతో గట్టి గుణపాఠం చెప్పాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

వైసీపీకి ఓటు వేయకపోతే చెప్పుచ్చుకుని కొడతా

వైసీపీకి ఓటు వేయకపోతే చెప్పుచ్చుకుని కొడతానని అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పాణెం హనిమిరెడ్డి నియోజకవర్గంలోని ప్రజలకు వార్నింగ్ ఇచ్చారు. శుక్రవారం నాడు అద్దంకిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హనిమిరెడ్డి ఈ వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికలలో వైసీపీకి ఓటు వేయకుండా, ఆ తర్వాత నా దగ్గర అన్ని వేల ఓట్లు వున్నాయి, ఇన్ని వేల ఓట్లు వున్నాయి. మీ పార్టీలో చేరతానని ఎవరైనా అంటే, వాళ్ళని చెప్పు తీసుకుని కొడతానని హెచ్చరించారు. నేను రవికుమార్, గరటయ్య లాంటి వాడిని కాదని, చాలా తేడాగాడినని, తనతో జాగ్రత్తగా వుండాలని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు తనకు ఓటు వేసిన వాళ్ళకే తాను సేవకుడినని, తనకు ఓటు వేయని వాళ్ళు తన దగ్గరకి వస్తే మర్యాదగా వుండదని ఆయన కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. తనకు ఓటు వేయని వాళ్ళకు తాను పని చేయనని స్పష్టం చేశారు. నేను మీకే ఓటు వేశాను. మా అబ్బాయి ఓటు వేయలేదు.. అతని పని చేసి పెట్టండి అని ఏ తండ్రి అయినా అడిగితే నేను వాళ్ళ పని చేయనుగాక చేయనని చెప్పేశారు. తనకు ఓటు వేసిన వాళ్లకి మాత్రమే తన సేవలు అందుతాయని పాణెం హనిమిరెడ్డి బెదిరిస్తున్నట్టు చెప్పారు.  ఏమయ్యా హనిమిరెడ్డి.. నీ పార్టీకి ఓటు వేయకపోతే చెప్పుచ్చుకుని కొడతావా? ఓటర్లకు ఇలాంటి వార్నింగ్ ఇచ్చిన నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి? నీకు ఓటు వేసినవాళ్ళకే నువ్వు సేవ చేసే పనయితే, నీకు ఓటు వేయని వాళ్ళ మీద నీకు అధికారం ఏముంటుందయ్యా? నీకు ఓటు వేయని వాళ్ళకి నువ్వెలా ఎమ్మెల్యే (గెలిచినప్పుడు సంగతిలే) అవుతావయ్యా? నీకు ఓటు వేయని వాళ్ళు చెల్లించే పన్నుల మీద నీకెందుకు హక్కుంటుందయ్యా. ఓటర్లని చెప్పుతో కొట్టడమేంటి? మతి వుండే మాట్లాడావా.. లేక జగన్ బ్రాండ్ గంజాయి గానీ, మందుగానీ కొట్టి మాట్లాడావా? ఎన్నికల్లో పోటీ చేస్తున్నప్పుడే ఈ రేంజ్ పొగరు చూపిస్తున్నావు.. అద్దంకి ఓటర్లు పొరపాటున నీకు ఓటు వేశారంటే.. వాళ్ళ చెప్పుతో వాళ్ళే కొట్టుకున్నట్టు! హనిమిరెడ్డి వ్యాఖ్యల పట్ల అద్దంకి నియోజకవర్గ ఓటర్లు చాలా సీరియస్‌గా వున్నారు. ఈనెల 13వ తేదీన హనిమిరెడ్డిని తమ ఓటుచ్చుకుని కొట్టడానికి రెడీగా వున్నారు. అద్దంకి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున గొట్టిపాటి రవికుమార్ పోటీలో వున్నారు. రవికుమార్ విక్టరీ ఆల్రెడీ కన్ఫమ్ అయిపోయింది. ఈ ఫ్రస్టేషన్లోనే హనిమిరెడ్డి ఓటర్లను చెప్పుతో కొడతానని వార్నింగ్ ఇచ్చి వుంటారని పరిశీలకులు అంటున్నారు.

చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దు ... భారీ వర్షమే కారణం

ఎన్నికలకు ఇంకా రెండు రోజుల సమయం మాత్రమే ఉంది.రాజకీయ నాయకులంతా ప్రచారాల్లో నిమగ్నమయ్యారు. ఇన్ని రోజులు మండుటెండలో ప్రచారం సాగించిన నేతలు ఇప్పుడు అకాల వర్షాలతో సతమతమవుతున్నారు. ఓ వైపు భహిరంగ సభలు, రోడ్​ షోలతో కార్యకర్తలు తీరిక లేకుండా ప్రజల మద్ధతు కూడగడుతుంటే వర్షం ప్రారంభమైంది. విజయవాడ నగరంలో భారీ వర్షం కురిసింది. రోడ్ల పైకి వర్షపు నీరు చేరి చిన్నపాటి చెరువును తలపిస్తుంది. భారీ వర్షం కారణంగా పలు చోట్ల ట్రాఫిక్ జామ్ అయ్యింది. విజయవాడలో ఒక్కసారిగా వాతావరణం మారింది. కారు మబ్బులు కమ్ముకోవడంతో పట్టపగలే చిమ్మ చీకట్లు వచ్చాయి. ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా దిగివచ్చాయి. దీంతో ఎక్కడి జనం అక్కడే నిలుచిపోయారు. ఉదయం నుంచి వాతావరణం మామూలుగా ఉండి అకస్మత్తుగా పెద్ద ఎత్తున వాన కురిసింది దీంతో జనాలు కొంత అసౌకర్యానికి గురయ్యారు.  గన్నవరంలోనూ జోరుగా వర్షం కురుస్తున్నా చంద్రబాబు సభలో ప్రజలు అలాగే ఉన్నారు. వాన పడుతున్నా బాబు ప్రసంగించారు. ప్రచారంలో భాగంగా తరువాత తెలుగుదేశం అధినేత మాచర్ల వెళ్లాల్సి ఉంది. ఓ వైపు వాన జోరందుకుంది. వాతావరణం బాగాలేకున్నా మాచర్ల వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు.కానీ ఆఖరి నిమిషంలో చంద్రబాబు మాచర్ల పర్యటన ఆగింపోయింది. ప్రతికూల వాతావరణం వల్ల మాచర్ల రూట్ క్లిష్టంగా ఉందని, అటవీప్రాంతం మీదుగా వెళ్లాల్సి ఉన్నందున ప్రయాణం సాగించలేమని పైలట్లు తెలిపారు. ఒంగోలు వెళ్లాలన్నా రూట్ డైవర్షన్ తీసుకుంటేనే సాధ్యమని పైలట్లు పేర్కొన్నారు. దీంతో నేరుగా ఒంగోలు వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. గన్నవరం నుంచి హెలికాప్టర్‌లో ఒంగోలు బయలుదేరిన చంద్రబాబు పరిస్థితిని మాచర్ల ప్రజలు అర్ధం చేసుకోవాలని కోరారు. అవకాశాలన్నీ పరిశీలించినా సాధ్యపడలేదు, కనుకే మాచర్ల పర్యటన రద్దు చేసుకున్నట్లు తెపిపారు. బ్రహ్మానందరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలని, పల్నాడు ప్రజలు తమ ఓటుతో రౌడీ రాజకీయాలకు గుణపాఠం చెప్పాలని అన్నారు. 

వీళ్ళని చూస్తే బాధ.. వాళ్ళని చూస్తే ఆనందం!!

ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశానిది ఒక ప్రత్యేక శైలి. భిన్నత్వంలో ఏకత్వం అనే లక్షణం భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లో ప్రత్యేకంగా నిలిచేలా చేసింది. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో మన భారతదేశ పౌరులు విభిన్నగంగా వుంటారు. ఓటు హక్కు వినియోగించుకునే విషయంలో కొంతమంది పద్ధతి చాలా బాధని కలిగిస్తూ వుంటుంది. అదే సమయంలో ఓటు హక్కుని వినియోగించుకునే విషయంలో కొంతమంది కమిట్‌మెంట్ ఆనందాన్ని కలిగిస్తూ వుంటుంది. ఒక మైనస్ బాధిస్తే, మరో ప్లస్ దాన్ని బేలన్స్ చేస్తూ వుంటుంది. ఈ రెండు భిన్నత్వాలు కలిసి వుంది కాబట్టే మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం వున్న దేశంగా అయింది. చాలామంది ఓటర్లు ఓటు వేయాలంటే వాళ్ళకి డబ్బు ఇవ్వాలి. ఎన్నెన్నో తాయిలాలు ఆశ చూపించాలి. స్వర్గాన్ని కిందకి దించుతామని హామీలు ఇవ్వాలి.. అప్పుడుగానీ కొంతమంది ఓటు వేయడానికి ఇళ్ళలోంచి బయటకి కదలరు. ఇంత చేసినా ‘మనం ఓటు వేయకపోతే ఏం జరుగుతుందిలే’ అని ఊరుకునేవాళ్ళూ వుంటారు. మనది ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామిక దేశమేనా అనే సందేహం వచ్చేలా చేస్తారు. ఇలాంటివారు నిరాశ కలిగిస్తే, మరికొంతమంది ఉత్సాహం కలిగిస్తారు. ఓటు వేయడం కోసం దూర ప్రాంతాల నుంచి సొంత ప్రాంతాలకు తరలి వస్తారు. ఆ దూర ప్రాంతాలు విదేశాలు అయినా సరే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో జరగుతున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేయడం కోసం అనేకమంది విదేశాల నుంచి కూడా తరలి వస్తున్నారు. అలా వస్తున్న భరతమాత ముద్దుబిడ్దలతో విజయవాడ విమానాశ్రయి క్రిక్కిరిసిపోతోంది. విమానాశ్రయానికి వెళ్ళే రోడ్లు వందలాది కార్లతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఇలాంటి ఓటర్లను చూసినప్పుడు మన భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఢోకా లేదని అనిపిస్తూ వుంటుంది. ఓటు వేయడం కోసం భారీ సంఖ్యలో ఎన్నారైలు తరలి వస్తున్నారని, ఇంకో మూడు రోజులపాటు విజయవాడ విమానాశ్రయాలు కిటకిటలాడుతూనే వుంటాయని విమానాశ్రయ అధికారులు చెబుతున్నారు. 

మా భూమి మీద నీ హక్కేంటి జగన్?

మా భూమి మీద నీ హక్కేంటి జగన్.. రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నీ తాకట్టు పెట్టేశావు.. ఇప్పుడు మా భూముల మీద పడ్డావా అని పలువురు ఆంధ్ర్రప్రదేశ్ రైతులు నిలదీస్తున్నారు. కడుపు కాలి, కట్టలు తెంచుకున్న ఆవేశంతో విరుచుకుపడుతున్నారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్.ని జగన్ తమ భూముల మీద ఆధిపత్యం కోసం తీసుకొచ్చాడని, ఇప్పుడు ఆ యాక్ట్ కారణంగానే రైతులు జగన్ ప్రభుత్వాన్ని భూమిలో పాతిపెట్టబోతున్నారని అన్నారు. మా భూముల పట్టాదార్ పాస్ పుస్తకాల మీద జగన్ ఫొటో చూసినప్పుడు గుండెలు మండిపోయాయని, మా తల్లిదండ్రులు ఇచ్చిన భూముల పుస్తకాల మీద జగన్ ఫొటో ఏంటని చాలా బాధపడ్డామని వారు చెప్పారు. అయితే, ఇంతకాలం జగన్ దురాగతాలకు భయపడి నోరు విప్పలేదని ఇప్పుడు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి, తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో చూపించడానికి సమయం వచ్చిందని వారు అంటున్నారు. 

వైసీపీ ఇసుక ముఠా అక్ర‌మ మైనింగ్ పై సుప్రీం సీరియ‌స్

ఇసుక అక్రమ తవ్వకాల్ని తక్షణం నిలిపివేయాలని, అనుమతి ఉన్న చోట కూడా యంత్రాలు ఉపయోగించవద్దని ఏప్రిల్ 29న సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా, అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు చేపడుతూనే ఉన్నార‌ని, దీనికి సంబంధించి ఇసుక రవాణ చేస్తున్న వాహనాలతో పాటు ఫొటోలు, తేదీ, సమయంతో కూడిన ఆధారాలను స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నాగేంద్ర కుమార్ సుప్రీం కోర్టు ముందు ఉంచారు. దీంతో విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ కేవలం కాగితాలపైనే ఉన్నాయని క్షేత్రస్థాయిలో చర్యలు కనిపించవని న్యాయమూర్తి జస్టిస్ అభయ్ ఎస్ ఓఖా వ్యాఖ్యానించారు. ఇసుక అక్ర‌మ మైనింగ్ ఏపీలో అధికార పార్టీ నేత‌ల‌కు ఎంత బిజినెస్ అనేది ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. నేత‌లంతా సిండికేట్ అయి ఇసుక‌ను బంగారంలా ధ‌ర‌లు పెంచి అమ్ముకుంటూ వేల కోట్లు కొల్ల‌గొట్టిన ఆరోప‌ణ‌లపై సుప్రీం కోర్టు మ‌రోసారి సీరియ‌స్ అయ్యింది. అక్ర‌మ మైనింగ్ ఆపాల్సిందేన‌ని స్ప‌ష్టం చేసింది. వెంట‌నే రాష్ట్ర ప్ర‌భుత్వ అధికారుల‌తో పాటు కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ అధికారులు కూడా క్షేత్ర స్థాయిలో ప‌ర్య‌టించి, అక్ర‌మ మైనింగ్ జ‌రుగుతుందో లేదో నిర్ధారించాల‌ని ఆదేశించింది.    గత ఏడాది కాలంగా రాష్ట్రంలో అక్రమంగా 20 మిలియన్‌ టన్నుల ఇసుకను తవ్వి తరలించి ఉంటారని పర్యావరణ వేత్తలు అంచనా వేస్తున్నారు. ఇసుకను బ్లాక్‌ మార్కెటింగ్‌ కిందకు తీసుకొచ్చి అమ్మడం ద్వారా 18 వేల కోట్లపైనే నేతలు వెనకేసుకొన్నారని ప్రముఖ జియాలజిస్ట్‌ శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి చెబుతున్నారు. ఇందులో ఎవరి వాటా ఎంతో తేలాల్సి ఉందంటారాయ‌న‌.  గతంలో ఎన్నడూ లేనంతగా గత ఏడాదిగా అక్రమంగా ఇసుకను దోచుకున్నారని  ప‌ర్యావ‌ర‌ణ‌వేత్త‌లు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.    సహజసిద్దంగా దొరికే ఇసుక విషయంలో జేపీ వెంచర్స్ పేరుతో కొందరు ప్రైవేటు వ్యక్తుల పెత్తనం సమంజసం కాదని పర్యావరణవేత్తలు అంటున్నారు. "ప్రభుత్వం చెబుతున్న దానికి విరుద్ధంగా పెద్ద పెద్ద యంత్రాల సహాయంతో నదీ గర్భాన్ని కొల్లగొడుతున్నారు. టన్నుల కొద్దీ ఇసుక తరలిస్తున్నారు. వాటివల్ల నదీ ప్రవాహాల్లో వేగం, దిశ కూడా మారిపోతున్నాయి. పర్యావరణ హననం జరుగుతోంది. వాటికి అడ్డుకట్ట వేయాలి. లేదంటే ఇసుక పేరుతో నదులను ఇష్టారాజ్యంగా తొలిచేస్తే తీవ్ర నష్టం తప్పదు’’ అని పర్యావరణ‌వేత్త ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. లాభాల కోసం ప్రైవేట్ వ్యక్తులు జరుపుతున్న తవ్వకాల్లో నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక వివాదాలకు కేంద్రంగా మారింది. అధికారిక లెక్కల ప్రకారం సుమారు 6 కోట్ల టన్నుల ఇసుక తవ్వకాలు జరిపితే అక్రమంగా తరలిస్తున్న 6.36 లక్షల టన్నుల ఇసుక పట్టుబడడం గమనిస్తే ఏపీలో ఇసుకని అక్రమార్కులు ఏ తీరున పక్కదారి పట్టిస్తున్నారో అర్థమవుతుంది. పట్టుబడిన ఇసుకనే అంత పెద్ద మొత్తంలో ఉంటే అధికారులకు చిక్కకుండా తరలిపోయింది ఎంత ఉంటుందోననే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. - ఎం.కె. ఫ‌జ‌ల్‌

జగన్ కు ఓటేస్తే ఒక్కొక్కరికి 57 వేలు నష్టం

జగన్మోహన్ రెడ్డికి ఓటు వేస్తే, రాష్ట్రంలో పెన్షన్లు తీసుకుంటున్న పేదలు ఒక్కొక్కరికి రాబోయే అయిదేళ్లలో 57 వేల రూపాయలు నష్టపోతార‌ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు వీఆర్ శ్రీలక్ష్మీ శ్యామల చెబుతున్నారు. మహిళ ఓటర్లతో 27 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో భారీ సంఖ్యలో బైక్ ర్యాలీలు నిర్వహించి ప్ర‌చారం నిర్వ‌హించారు.  అధికారంలోకి వ‌స్తే చంద్రబాబునాయుడు ఈ సంవత్సరం ఏప్రిల్ నుంచి పింఛనును 4000 చేస్తానని ప్రకటించారు.  జులై నెలలో అరియర్స్ కలిపి 7వేల రూపాయల పింఛన్లు అందుకుంటారు.   జగన్ సర్కారు ప్ర‌స్తుతం కేవ‌లం మూడువేల పెన్షను మాత్రమే అందిస్తోంది. జ‌గ‌న్ త‌న మేనిఫెస్టోలో  అయిదేళ్లకూ కలిపి 500 మాత్రం పెంచేలా హామీ ఇచ్చారు. అది కూడా.. 2028 ఏప్రిల్లో 250, 2029 ఏప్రిల్లో అంటే జస్ట్ ఎన్నికలకు ముందు మరో 250 పెంచుతానని పేర్కొన్నారు.  అంటే జగన్ ను గెలిపిస్తే ఇప్పుడున్న మూడు వేలు  మాత్రం ప్రజలకు అందుతాయన్నమాట.  ఇటు చంద్ర‌బాబు, అటు జ‌గ‌న్ హామీలను పోల్చి చూస్తే..చంద్రబాబు ఇచ్చేది అయిదేళ్లలో రూ.2.40 లక్షలు.  జగన్ ఇచ్చేది అయిదేళ్లలో రూ.1.83 లక్షలు. తేడా 57 వేలు.  అంటే ఇప్పుడు పెన్షన్లు తీసుకుంటున్న వృద్ధులు, వితంతువులు ఎవ్వరైనా సరే.. ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే గనుక.. రాబోయే అయిదేళ్లలో అచ్చంగా 57 వేల రూపాయలు కోల్పోబోతున్నారని శ్రీలక్ష్మీ శ్యామల  ప్ర‌చారం చేస్తున్నారు.  జ‌గ‌న్‌పై కేసులు కావొచ్చు, ఇత‌ర స్వార్థ ప్ర‌యోజ‌నాలు కావొచ్చు ఇన్నేళ్లుగా కేంద్రంలోని ఎన్డీయే కూట‌మి స‌ర్కారుకు, ప్ర‌ధాని మోడీకి ఏపీ సీఎం జ‌గ‌న్ వంగి వంగి దండాలు పెట్టారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల కోసం ఏనాడూ ప్ర‌శ్నించ‌ని ఆయ‌న సొంత ప‌నులే చూసుకున్నారు. రాష్ట్రానికి ద‌క్కాల్సిన ప్ర‌త్యేక హోదా, పోల‌వ‌రం నిధులు త‌దిత‌ర వాటి గురించి కూడా కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేక‌పోయారు. ఏమైనా అడిగితే జైల్లో వేస్తారేమో అన్న భ‌య‌మే అందుకు కార‌ణ‌మంటారు శ్రీలక్ష్మీ శ్యామల. ఆకువేడు ఉండి నియోజకవర్గంలో ఆమె రఘురామకృష్ణ రాజు తో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.  రఘురామకృష్ణంరాజు తన గెలుపు పక్కా ..మెజార్టీ లెక్కేసుకోవడం మిగిలింది. 

పిఠాపురం.. పవన్ కల్యాణ్ మెజారిటీపైనే అందరి ఆసక్తి!

ఏపీ ఎన్నికలలో  హాట్ సీట్లు అనదగ్గ వాటిలో మొదటిగా చెప్పుకోవలసింది పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గంపైనే. ఎందుకంటే ఇక్కడ జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నారు. ఆయనకు పోటీగా వైసీపీ వంగా గీతను బరిలోకి దింపింది. సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకుని పవన్ కల్యాణ్ కు పోటీగా అదే కాపు సామాజికవర్గానికి చెందిన వంగా గీతను వ్యూహాత్మకంగా వైసీపీ పోటీలో నిలబెట్టింది. అలాగే కాపు సామాజికవర్గానికే చెందిన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని పార్టీలో చేర్చుకుంది. పవన్ కు వ్యతిరేకంగా ముద్రగడ పిఠాపురంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఎన్నికలు మరో మూడు రోజుల వ్యవధిలోకి వచ్చేసిన తరుణంలో ప్రచారం జోరందుకుంది.   అయితే వాతావరణం మాత్రం పవన్ కల్యాణ్ కు పూర్తి అనుకూలంగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తు పవన్ కు గట్టి బలంగా మారింది. పవన్ కల్యాణ్ కోసం కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే మెగా హీరోలు, పలువురు సినీ, బుల్లితెర సెలిబ్రిటీలు సైతం పిఠాపురంలో మకాం వేసి పవన్ కల్యాణ్ ను గెలిపించాల్సిందిగా కోరుతూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడిని గెలిపించాలంటూ ఓ వీడియో సందేశం ద్వారా ఇచ్చిన పిలుపు కూడా నియోజకవర్గ ఓటర్లపై ప్రభావం చూపిందని చెబుతున్నారు. ఇప్పటికే వెలువడిన పలు సర్వేలు పిఠాపురంలో పవన్ విజయం నల్లేరు మీద బండినడకేనని తేల్చేశాయి. ఇక జనసేన శ్రేణులైతే పవన్ విజయం ఎప్పుడో ఖరారైందనీ, ఇప్పుడు తమ దృష్టింతా ఆయన సాధించబోయే మెజారిటీపైనేనని చెబుతున్నాయి. ఇక నియోజకవర్గంలో పరిస్థితులను నిశితంగా పరిశీలించిన రాజకీయ పండితులు పిఠాపురంలో పవన్ కల్యాణ్ కు లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని చెబుతున్నారు. కొన్ని సర్వే సంస్థలు కూడా ఆయనకు 75 వేల నంచి లక్ష ఓట్ల వరకూ మెజారిటీ వచ్చే అవకాశం ఉందని అంచనా వేశాయి.   జగన్ సర్కార్ పట్ల ప్రజలలో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు తోడు కూటమి బలం, కాపు సామాజికవర్గం మద్దతు కలిసి పిఠాపురంలో పవన్ కల్యాణ్ భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

రాజముద్ర కోసం రైతులు రెడీ!!

మే 13వ తేదీ ఎప్పుడు వస్తుందా, తెలుగుదేశం కూటమికి ఓటు వేసి జగన్ పీడ ఎప్పుడు వదిలించుకుందామా అని ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురు చూస్తున్నారు. జూన్ 4న ఫలితాలు రాగానే తమ తమ పొలాల్లో సరిహద్దు రాళ్ళమీద వున్న జగన్ ముఖాన్ని చెక్కేయడానికి  కొడవళ్ళు సిద్ధంగా వుంచుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం రాగానే రాజముద్రతో కూడిన పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు అవుతాయి. అలా రాజముద్రతో కూడిన పాస్‌ బుక్ తమ చేతికి అందిన వెంటనే, జగన్ ముఖచిత్రంతో వున్న పట్టాదార్ పాస్ పుస్తకాలను సాముహికంగా దహనం చేయడానికి పిడకలు, కట్టెలు రెడీ చేసుకుంటున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారం చేపట్టగానే లాండ్ టైటిలింగ్ యాక్ట్.ని రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తారు.. అప్పుడు రైతులందరూ నా భూమి నా సొంతం అని సంతోషంగా అరవడానికి సిద్ధంగా వున్నారు.

అరవింద్ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిలు

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు   భారీ ఊరట లభించింది. మద్యం కుంభకోణంలో అరెస్టైన కేజ్రీవాల్ కు దేశ సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ ను ఈడీ మార్చి 21న అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. బెయిులు కోసం కేజ్రీవాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ బెయిలు పిటిషన్ ను విచారించిన సుప్రీం కోర్టు జూన్ 1వ తేదీ వరకూ ఆయనకు మధ్యంతర బెయిలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.  కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదించారు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడేంత వరకూ కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిలు మంజూరు చేయాల్సిందిగా సింఘీ సుప్రీంను అభ్యర్థించారు. అయితే కోర్టు ఆయనకు జూన్ 1వ వరకూ మధ్యంతర బెయిలు మంజూరు చేసింది. అయితే కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిలు మంజూరు చేయడాన్ని ఈడీ అభ్యంతరం చెప్పింది. రాజకీయ ప్రచారం కోసం ఒక వ్యక్తికి బెయిలు మంజూరు చేయడం అన్నది ఇప్పటి వరకూ ఎన్నడూ జరగలేదని పేర్కొంది. అయితే కోర్టు మాత్రం ఈ 21 రోజులూ కేజ్రీవాల్ లోపల ఉన్నా, బయట ఉన్నా పెద్ద తేడా ఏమీ లేదని పేర్కొంటూ బెయిలు మంజూరు చేసింది. అలాగే జూన్ 2న ఈడీ అధికారుల ముందు లొంగిపోవాల్సిందిగా కేజ్రీవాల్ ను ఆదేశించింది. ఇదే మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన కవితకు పలు మార్లు బెయిలు కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ ఫలితం లేకపోయింది.  

కూటమికి వినూత్నంగా రైతుల మద్దతు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సందర్బంగా రైతులు టీడీపీ, వైసీపీ, బీజేపీ కూటమికి వినూత్నంగా మద్దతు తెలిపారు. గుంటూరు జిల్లా కొల్లిపర మండలం అత్తోట గ్రామానికి చెందిన కౌలు రైతులు ఎన్టీయే కూటమి గుర్తులను తమ పొలంలో నారుతో వచ్చేలా చేయడం ద్వారా మద్దతు తెలిపారు. గోంగూర విత్తనాలను క్రమపద్ధతిలో మొలకెత్తించడం ద్వారా సైకిల్, గాజు గ్లాసు, కమలం గుర్తుల రూపంలో నారు మొలకెత్తేలా చేశారు. అలాగే ‘ప్రతి చేతికి పని - ప్రతి చేనుకి నీరు’ అనే నినాదం కూడా మొలకెత్తిన నారు ద్వారా కనిపించేలా చేశారు. ‘అత్తోట కౌలు రైతులు’ అనే అక్షరాలు కూడా కనిపించేలా నారును మొలకెత్తించారు. జగన్ ప్రభుత్వ హయాంలో రైతుల జీవితాలు దారుణంగా తయారయ్యాయి. ముఖ్యంగా లాండ్ టైటిల్ చట్టం నుంచి తమను కాపాడేది ఎన్డీయే కూటమేనని రైతులు భావిస్తున్నారు. అందుకే కూటమికి మద్దతు ప్రకటిస్తున్నారు.

నవనీత్ కౌర్ పై కేసు

అబ్ కీ బార్ 400 బహార్ అనే నినాదంతో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న బిజెపి హైదరాబాద్ లోకసభ స్థానం  మీద పూర్తి కాన్ సన్ ట్రేషన్ చేస్తోంది. 40 ఏళ్లుగా హైద్రాబాద్ లోకసభ స్థానాన్ని గెలుస్తూ వచ్చిన మజ్లిస్ పార్టీని ఓడించడానికి బిజెపి అధిష్టానం భారీ వ్యూహంతో ఉంది. ఎవరూ ఊహించని  మహిళా అభ్యర్ధిని రంగంలో దించింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రోడ్  షో నిర్వహిస్తే దేశవ్యాప్తంగా పేరున్న సెలబ్రిటీలను రంగంలో దించుతోంది. ఒకప్పుడు తెలుగు సినిమాల హీరోయిన్ అయిన నవనీత్ కౌర్  హైదరాబాద్ బిజెపి ఎంపి అభ్యర్థి మాధవీలత  తరపున ప్రచారానికి వచ్చి  కేసులో ఇరుక్కున్నారు.  హైదరాబాద్ లోని షాద్ నగర్ లో ఎన్నికల ప్రచారంలో మహారాష్ట్ర ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ఇటీవల షాద్ నగర్ లో బీజేపీ నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న నవనీత్ కౌర్ ‘ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్థాన్ కు వేసినట్లే’నన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ఎన్నికల సంఘం కూడా సీరియస్ గా పరిగణించడంతో పోలీసులు నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పటికే మాధవీలతపై మజ్లిస్ పార్టీ ఈసీ కి ఫిర్యాదు ఇస్తే కాంగ్రెస్ పార్టీ పోలీస్ కేసు నమోదు చేయించడం చర్చనీయాంమైంది. 

గెలుపు దారి కానరాదేమి బాలినేని!

ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం హవా జోరుగా ఉంది. జగన్ గాలి వీచిన 2019 ఎన్నికలలో కూడా ఈ జిల్లాలో తెలుగుదేశం నాలుగు అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. ఈ సారి తెలుగుదేశం కు జనసేన, బీజేపీల బలం తోడైంది. జగన్ సర్కార్ పై ఉన్న తీవ్ర ప్రజా వ్యతిరేకతతో ఆ పార్టీకి సానుకూల పవనాలు వీస్తున్నాయి. ఇక ఒంగోలు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి, సీఎం జగన్ కు సమీప బంధువు బాలినేని అయితే గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు.   ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిగా దామచర్ల జనార్ధన్ పోటీ చేస్తున్నారు.  2014 ఎన్నికలలో తెలుగుదేశం అభ్యర్థిగా విజయం సాధించిన ఆయన 2019 వరకూ ఒంగోలు ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధికి చేసిన కృషి ఇప్పుడు ఆయనకు బాగా కలిసి వస్తోంది. 2019 ఎన్నికలలో ఆయన పరాజయం పాలయ్యారు. ఆ ఎన్నికలలో విజయం సాధించిన బాలినేని జగన్ తొలి కేబినెట్ లో మంత్రిగా కూడా పని చేశారు. అయినా నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేసింది శూన్యం అన్న భావన ప్రజలలో వ్యక్తం అవుతోంది. అభివృద్ధి మాట అలా ఉంచితే ఆయన హయాంలో నియోజకవర్గంలో అరాచకం తాండవించింది. స్వయంగా బాలినేని కుమారుడిపైనే భూ కబ్జాలు, దాడుల ఆరోపణలు ఉన్నాయి. బాలినేని కుమారుడు, ఆయన అనుచరులు విచ్చలవిడిగా భూకబ్జాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ ఆరోపణలపై ప్రభుత్వం గత్యంతరం లేని పరిస్థితుల్లో సిట్ దర్యాప్తునకు ఆదేశించాల్సి వచ్చిందంటే బాలినేని హయాంలో నియోజకవర్గంలో ఏ స్థాయిలో అరాచకత్వం రాజ్యమేలిందో ఊహించవచ్చు.  అలాగే ఆర్యవైశ్య సామాజిక వర్గానికి చెందిన సుబ్బారావు గుప్తాను వేధించిన ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్ంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  తాగునీటి పథకాలు, పోతురాజు కాలువ ప్రాజెక్టు విషయంలో బాలినేని వైఫల్యాలు నియోజకవర్గ ప్రజలలో బాలినేని ప్రతిష్టను మసకబార్చాయి. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి దామచర్ల జనార్ధన్ కు ప్రజా మద్దతు పెరుగుతోంది. ప్రచారంలో దామచర్ల దూసుకుపోతుంటే.. బాలినేని సొంత పార్టీ క్యాడర్ నుంచే వ్యతిరేకత ఎదుర్కొంటూ ఎదురీదుతున్నారు. అలాగే ఒంగోలు  సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరడం, కూటమి బలపరిచిన అభ్యర్థిగా తెలుగుదేశం తరఫున పోటీలో దిగడం కూడా బాలినేని విజయావకాశాలపై ప్రభావం చూపనుందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మాగుంట కుటుంబానికి ఒంగోలు, కొంండెపి నియోజకవర్గాలలో మంచి గుర్తింపు ఉంది. బైపాస్ రోడ్డు వంటి నిర్మాణాలతో ప్రజలలో మాగుంట శ్రీనివాసుల రెడ్డి కుటుంబంపై నియోజకవర్గ ప్రజలల సానుభూతి వ్య్తఅవుతోంది. అదే సమయంలో ఉద్యోగులు, టీచర్లు, కాపు సామాజికవర్గం ఈ సారి బేషరతుగా తెలుగుదేశం పార్టీకి, దామచర్ల విజయానికి మద్దతు ప్రకటించారు  

ఓటు వేయ‌డానికి ఎన్నారైల రాక! టీడీపీ గెలుపు కోసం ఎన్నారైల‌ ప్రచారం

ఎన్నిక‌ల పండగలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రవాస భారతీయులు ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా కేరళ, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ నుంచి విదేశాలకు వెళ్లినవారిలో.. వేల మంది స్వదేశీ బాట పట్టారు. ఇందుకోసం ప్రత్యేక విమానాలను ఆశ్రయిస్తున్నారు. గత రెండు రోజుల్లోనే దాదాపు 25 వేలకు పైగా ఎన్నారైలు వచ్చినట్లు అంచనా. పోలింగ్‌ తేదీ నాటికి ఈ సంఖ్య భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. అమెరికా, కెన‌డా, లండ‌న్‌తో పాటు  గల్ఫ్‌ దేశాల నుంచి పోలింగ్‌లో పాల్గొన‌డానికి త‌ర‌లి వ‌స్తున్నారు. గ‌తంలో ఎన్న‌డూ లేని విధంగా పోలింగ్‌లో భాగస్వామ్యం చేసేందుకు రాజకీయ పార్టీలు విదేశాల్లోనూ ప్రచారం చేశాయి. స్వదేశానికి వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశాయి. విదేశాల నుండి ఎన్ ఆర్ ఐ లు రావడం తో ఢిల్లీ -  విజయవాడ విమానం రద్దీ నెలకొంది.  ఓటు  హక్కు వినియోగించుకోవడానికి  మునుపెన్నడూ లేని విధంగా సుదూర ప్రాంతాల నుండి వస్తున్నారు. ఇదే ఒరవడి మరో మూడు రోజు లు కొనసాగుతుంది అని విమానాశ్రయాధికారులు చెబుతున్నారు.  విదేశాలనుండి వచ్చే వారంతా చంద్ర‌బాబుకు సంఘీభావంగానే వస్తున్నారు. టీడీపీ కూట‌మి గెలుపు కోసం ఎన్నారైలు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. విదేశాలలోని టీడీపీ అభిమానులు పెద్ద సంఖ్యలో  ఉద్యోగాలకు సెలువు పెట్టి, త‌మ వ్యాపారాలకు తాత్కలిక విరామం ఇచ్చి ఓటు వేయ‌డానికే విమానం ఎక్కేశారు.  ఈ రకమైన అంకితభావం కేర‌ళ‌లో క‌నిపిస్తోంది. ఇప్పుడు ఏపీకి చెందిన వారు ఓటు వేయ‌డానికి భారీ సంఖ్య‌లో విదేశాల నుంచి వ‌స్తున్నారు. ఒక ప్రణాళికాబద్ధంగా ఏపీలోని అన్ని నియోజకవర్గాలలోనూ అమెరికా నుండి వచ్చి ప్ర‌చారంలోనూ పాల్గొన‌డం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు. రాష్ట్రాన్ని రక్షించేందుకు తాము ప్రత్యక్షంగా రంగంలో దిగిన‌ట్లు వారు చెబుతున్నారు. తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమి పోటి చేస్తున్న అన్ని నియోజకవర్గాలలో ఎన్నారై తెలుగుదేశం బృందాలు సీరియ‌స్‌గా ప‌నిచేస్తున్నారు. మంగళగిరిలో పార్టీ ఏర్పాటు చేసిన వార్ రూంలో ఎన్నారై టీడీపీ అధ్యక్షుడు వేమూరి రవి కీలకపాత్ర వహిస్తున్నారు. - ఎం.కె.ఫ‌జ‌ల్‌

రామయ్యా.. రావాల్సిన అవసరం లేదయ్యా!

వేమన శతకం, సుమతీ శతకం తరహాలోనే భాస్కర శతకం కూడా వుంది. మారవి వెంకయ్య కవి 16వ శతాబ్దంలో ఈ శతకాన్ని రచించాడు. ఈ శతకంలోని ఒక పద్యం ఇలా చెబుతుంది... దానముఁ జేయనేరని యధార్మికు సంపద యుండి యుండియున్ దానె పలాయనంబగుట తథ్యము; బూరుగు మ్రాను గాచినన్, దాని ఫలంబులూరక వృథాపడిపోవవె యెండి గాలిచేఁ గానలలోన నేమిటికిఁగాక, యభోజ్యములౌట భాస్కరా!   ఈ పద్యం అర్థం ఏమిటంటే, దానం చేయడం చేతగాని ధనికుడికి ఎంత సంపద వుండి ఏం లాభం? అడవిలో బూరుగుచెట్టు విరగ కాస్తుంది. కానీ, దాని కాయలు ఎవరికీ ఉపయోగపడవు. దాని కాయలు పగిలిపోయి దాంట్లో వున్న దూది మొత్తం గాలిలోకి ఎగిరి ఎవరికీ ఉపయోగపడకుండా పోతుంది. ఈ పద్యం తరహాలోనే జూనియర్ ఎన్టీఆర్‌కి వున్న జనాకర్షణ అడవిలో పుట్టిన బూరుగ చెట్టు మాదిరిగా అయిపోయింది. ఆయన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఎంతమాత్రం ఉపయోగపడకుండా వృధా అయిపోయింది. అకారణంగా తెలుగుదేశం పార్టీ మీద అలిగిన జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరంగా వుంటున్నారు. పార్టీకి దూరంగా వుండటమే కాకుండా, కొడాలి నాని లాంటి వ్యక్తులకు అండగా నిలిచి, వాళ్ళ నోరు ఎంత మాట అయినా అనడానికి ధైర్యం ఇస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ఉద్దేశం కావచ్చు, ఆయన సన్నిహితుల ఉద్దేశం కావచ్చు.. తెలుగుదేశం పార్టీని అర్జెంటుగా జూనియర్ ఎన్టీఆర్ చేతిలో పెట్టేయాలి. తెలుగుదేశం పార్టీలో అన్ని విషయాలూ జూనియర్ ఎన్టీఆర్‌ని సంప్రదించే జరగాలి. అలాంటి అవకాశం లేకపోవడంతో జూనియర్ ఎన్టీఆర్ పార్టీకి దూరమయ్యారు. 2019 ఎన్నికల సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ప్రచారం చేయకుండా దూరంగా వున్నారు. ఏ నిమిషంలోనైనా అతని మనసు మారి ప్రచారానికి వస్తారేమోనని తెలుగుదేశం వర్గాలు ఎదురుచూశాయి. తమవంతు ప్రయత్నాలు చేశాయి. అయినా ఆ ప్రయత్నాలు ఫలించలేదు. ఆ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడానికి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయకపోవడం కూడా ఒక కారణం అని అనుకుంటూ ఆయన అభిమానులు ఆనందిస్తూ వుంటారు.. అది వేరే విషయం! ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మామ నార్నే శ్రీనివాస్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం మాత్రమే కాకుండా, చంద్రబాబును విమర్శించడానికి నేనున్నానంటూ ముందుకు వస్తూ వుంటారు. దీని వెనుక జూనియర్ ఎన్టీఆర్ ఆమోదం లేదని ఎవరూ అనుకోరు. ఈసారి ఎన్నికలలో పరిస్థితి మారిపోయింది. తెలుగుదేశం వర్గాలు అసలు జూనియర్ ఎన్టీఆర్ అనే వ్యక్తే వున్నాడనే విషయాన్ని మరచిపోయారు. ఆయన ప్రచారం చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కూడా ఎవరికీ రాలేదు. గత ఎన్నికలలో రామయ్యా.. వస్తావయ్యా అన్న తెలుగుదేశం.. ఈసారి మాత్రం రామయ్యా.. రావాల్సిన అవసరం లేదయ్యా అని చెప్పకుండానే చెప్పింది. గత ఎన్నికల సందర్భంగా బెట్టు చేసి, బిల్డప్ ఇచ్చే అవకాశం ఈసారి జూనియర్ ఎన్టీఆర్‌కి రాలేదు. జూనియర్ ఎన్టీఆర్‌ ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ కోరుకోలేదు. కానీ వైసీపీ మాత్రం జూనియర్ పేరుతో ఫేక్ ప్రచారం చేసుకుంటోంది. జూనియర్ ఫొటో పెట్టుకుని, ఆయన వైసీపీకి మద్దతుగా స్టేట్‌మెంట్ ఇచ్చినట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటూ ఆత్మానందం పొందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ అయిన పార్టీకి ఉపయోగపడలేదు. కాని పార్టీ మాత్రం ఇలా ఫేక్ ప్రచారానికి ఉపయోగించుకుంటోంది. 

ఫోనే లేకుండా నంబరెక్కడిది జగన్ రెడ్డీ!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తాను చెప్పే అబద్ధాలు గోడకట్టినట్లు కాదు కదా కనీసం తడికె కట్టినట్లు కూడా ఉండటం లేదు. ఎప్పటికప్పుడు అవాస్తవాలు ప్రచారంలోకి తీసుకురావడం, అడ్డంగా దొరికిపోయి నవ్వుల పాలు కావడం జగన్ కు ఒక ఆనవాయితీగా, ఒక అలవాటుగా మారిపోయింది. మనమంతా సిద్ధం బస్సుయాత్రలో భాగంగా జరిగిన గులకరాయి దాడిని హత్యాయత్నంగా అభివర్ణించి ఎన్నికలలో సానుభూతి లబ్ధి కోసం చేసిన ప్రయత్నం ఎలా బూమరాంగ్ అయ్యిందో తెలిసిందే. గాయం తగిలిందంటూ డజను మంది డాక్టర్ల బృందంతో చికిత్స చేయించుకుని అందుకు సంబంధించిన ఫోటోను సోషల్ మీడియాలో వైరల్ చేసి, గాయానికి పెద్ద పట్టీ వేసుకుని మరీ ప్రచారం నిర్వహించిన జగన్ ఆ పట్టీ తీసేయగానే నుదుటిపై గాయానికి సంబంధించి చిన్న మచ్చ, గీత కూడా లేకపోవడం వైద్య శాస్త్రంలోనే అద్భుతంగా అభివర్ణిస్తూ నెటిజన్లు ఓ రేంజ్ లో కామెంట్లు పెట్టారు. ఆయన ఐదేళ్ల పాలనలో ఇటువంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి.   తాజాగా ఒక చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ తనకు ఫోనే లేదంటూ ఓ బ్రహ్మాండమైన విషయం వెల్లడించారు. జగన్ తనకు ఫోన్ లేదు అని చెప్పి నెటిజనులకు అడ్డంగా బుక్కైపోయారు. ఫోన్ లేదు అని చెప్పి ఊరుకోకుండా ఆయన ఒక వేళ ఫోన్ ఉన్నా ఆ ఫోన్ నంబర్ కూడా తనకు తెలియదని మరో  మాట అన్నారు. ఫోన్ లేకుండా నంబర్ ఎందుకు ఉంటుంది జగన్ భాయ్ అంటూ నెటిజనులు జోకులు పేలుస్తున్నారు.   ఇంకా స్పష్టంగా జగన్ తన ఫోన్ బాగోతం ఎలా చెప్పారంటే... తన దగ్గర ఫోన్ లేదు అన్నారు. అలా అని ఊరుకోకుండా  ఫోన్ నంబర్ కూడా లేదు. అసలు నా ఫోన్ నెంబర్ నాకే తెలియదు అని సాగదీశారు. ఫోనే లేకపోతే.. నంబర్ ఎక్కడ నుంచి వస్తుంది సీఎం గారూ అని నెటిజనులు నిలదీస్తున్నారు. అదే సమయంలో ఉన్న రాజధానిని నిర్వీర్యం చేసేసి మూడు రాజధానులు కట్టేసినట్లే లేని ఫోన్ కు కూడా నంబర్ ఉందేమో అంటూ జోకులేస్తున్నారు.   అదే సమయంలో  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా జగన్ తన అఫిడవిట్లో పోన్ నంబర్ ఇచ్చారు. ఆ ఫోన్ నెంబర్ ఎ9849904123. ఫోన్ లేని జగన్ కు నంబర్ ఎలా వచ్చింది. అసలు తనకే తెలియని నంబర్ ను అఫిడవిట్లో ఎలా పేర్కొన్నారు.  అంటూ నెటిజనులు ప్రశ్నలు సంధిస్తుండటంతో అసలా ఇంటర్వ్యూ ఇవ్వనేల.. ఇచ్చితిని పో ఫోన్ బాగోతం గురించి చెప్పనేల? అంటూ జగన్  తల బాదుకుంటూ ఉండొచ్చు.