Read more!

మాచర్ల ప్రజలూ.. అర్థం చేసుకోండి: చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు శుక్రవారం నాడు మాచర్లలో పర్యటించడానికి అన్ని ఏర్పాట్లూ చేసుకున్నారు. జగన్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి, పల్నాటి పౌరుషాన్ని చూపించడానికి సిద్ధంగా వున్న మాచర్ల నియోజకవర్గ ప్రజలను పలకరించడానికి చంద్రబాబు వెళ్ళాలని అనుకున్నారు. అయితే అనుకోకుండా భారీ వర్షం కురవడం వల్ల చంద్రబాబు మాచర్ల పర్యటన రద్దు చేసుకోవలసి వచ్చింది. అనంతరం చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుంచి హెలికాప్టర్లో ఒంగోలు బయల్దేరారు. ఈ సందర్భంగా మాచర్ల ప్రజలకు చంద్రబాబు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. వాతావరణం ఇబ్బంది కారణంగా రద్దయిన తన ప్రయాణాన్ని మాచర్ల ప్రజలు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. మాచర్ల వెళ్లేందుకు అన్ని అవకాశాలు పరిశీలించినా సాధ్యపడలేదు కాబట్టే రద్దు చేసుకున్నానని, దీనిని మాచర్ల ప్రజలు సహృదయంతో స్వీకరిస్తారన్న నమ్మకం తనకు వుందని చంద్రబాబు చెప్పారు. మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేస్తున్న బ్రహ్మానంద రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి తీసుకురావాలి ఆయన మాచర్ల ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రౌడీ రాజకీయానికి పల్నాడు ప్రజలు తమ ఓటుతో గట్టి గుణపాఠం చెప్పాలని చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.