జడ్జి ఇంటిపై దాడి... పేట్రేగిపోతున్న పెద్దిరెడ్డి గ్యాంగ్
ఏప్రిల్ 30వ తేదీ, 2024 సంవత్సరం. అది అన్నమయ్య జిల్లా బి.కొత్తకోటలో జడ్జి రామకృష్ణ నివాసం. సమయం రాత్రి తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలు అవుతోంది. అకస్మాత్తుగా కొంతమంది వ్యక్తులు రామకృష్ణ ఇంటి మీద దాడి చేశారు. వాళ్ళ చేతిలో వేటకొడవళ్ళు వున్నాయి. రాళ్ళతో, వేట కొడవళ్ళతో ఆ దుండగులు కిటికీల అద్దాలు పగలగొట్టారు. వరండాలో వున్న రామకృష్ణ కారును ధ్వంసం చేశారు. ఆకస్మికంగా జరిగిన ఈ ఘటనతో జడ్జి రామకృష్ణ కుటుంబం భయభ్రాంతులకు గురైంది. దాడి జరిగిన వెంటనే రామకృష్ణ 100 నంబర్కి ట్రై చేశారు. ఫోన్ కలవలేదు. రాత్రి పదిగంటల పదిహేను నిమిషాల ప్రాంతంలో రామకృష్ణ బి.కొత్తకోట సి.ఐ.కి ఫోన్ చేశారు. తన ఇంటిపై జరిగిన దాడి గురించి చెప్పారు. వెంటనే స్పందించి పోలీసులను పంపించాల్సిన సీఐ సరిగా స్పందించలేదు. పోలీసులందరూ బందోబస్తులో వున్నారని అన్నారు. రామకృష్ణ మాట్లాడుతుండగానే సీఐ ఫోన్ కట్ చేశారు. రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషాల ప్రాంతంలో రామకృష్ణ మదనపల్లి డీఎస్పీకి ఫోన్ చేశారు. ఆయన సీఐ కంటే ఎక్కువ నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు. కారణం లేకుండా ఎందుకు దాడి చేస్తారని అంటూ ఆయన కూడా ఫోన్ కట్ చేశారు.
ఆ తర్వాత రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో కొంతమంది పోలీసులు రామకృష్ణ ఇంటికి వచ్చారు. అక్కడ జరిగిన విధ్వంసాన్ని చూశారు. కంప్లయింట్ రాసి ఇవ్వమని కోరారు. ఇంతలో వారికి సీఐ నుంచి ఫోన్ వచ్చింది. వాళ్ళని వచ్చేయమని సీఐ ఆజ్ఞాపించారు. అప్పటి వరకు కంప్లయింట్ రాసి ఇవ్వమన్న పోలీసులు మేం ఇక్కడ కంప్లయింట్ తీసుకోం.. పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లయింట్ ఇవ్వండి అని చెప్పి వెళ్ళిపోయారు. అయితే అప్పుడున్న పరిస్థితిలో రామకృష్ణ ప్రమాదాన్ని శంకించి ఇంటి నుంచి బయటకి వెళ్ళలేదు.
మరుసటి రోజు ఉదయం రామకృష్ణ తన ఇంటిపై దాడి జరిగిన విషయాన్ని సోషల్ మీడియాలో పెట్టారు. సోషల్ మీడియాలో ఈ ఉదంతం వైరల్ అయింది. దాంతో పోలీసులతో కలసి సీఐ రామకృష్ణ ఇంటికి వచ్చారు. రిపోర్టు తీసుకున్నారు. ఇంట్లో వున్న సీసీటీవీ ఫుటేజ్ తీసుకున్నారు. మర్నాడు ఈ ఉదంతంపై సీఐ స్టేట్మెంట్ న్యూస్ పేపర్లలో వచ్చింది. మాజీ జడ్జి రామకృష్ణకి, ఆయన సోదరుడు రామచంద్రకి మధ్య ఆస్తికి సంబంధించిన వివాదాలు వుండటం వల్ల రామచంద్ర దాడి చేశారని, రామచంద్ర ప్రస్తుతం తమ కస్టడీలో వున్నాడని సీఐ చెప్పిన్టటు పేపర్లలో వచ్చింది. అయితే తన పొలంలో పైపులు ఎవరో ధ్వంసం చేశారని తెలిసి తాను పొలానికి వెళ్తే అక్కడకి రామచంద్ర వచ్చి మరలా తనతో గొడవ పడ్డాడని రామకృష్ణ చెప్పారు. తనకు ఎంపీ, వైసీపీ నాయకుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సపోర్టు వుందని, తనను ఎవరూ ఏమీ చేయలేరని, తనపై వున్న రౌడీషీట్ తీసివేస్తామని చెప్పారని తనతో వాదించాడని రామకృష్ణ తెలిపారు.
రామచంద్ర పోలీస్ కస్టడీలో వున్నట్టయితే తన దగ్గరకి ఎలా వచ్చాడని ఆయన ప్రశ్నిస్తున్నారు. పొలం దగ్గరకి తన సోదరుడు రామచంద్రతో కలసి వచ్చిన మనోహర్ అనే వ్యక్తితో మాట్లాడినప్పుడు రామచంద్రతోపాటు ఎంపీ మిథున్ రెడ్డి ప్రధాన అనుచరుడు సాయిచరణ్, ఇంకా దాదాపు పదిహేను మంది ఒక బార్ అండ్ రెస్టారెంట్లో కలసి, మద్యం సేవించి, రామచంద్రకు డబ్బు ఇచ్చి, మిథున్ రెడ్డితో వీడియో కాల్లో మాట్లాడించి, మీ ఇంటి పైకి దాడికి పురిగొల్పారని, రామచంద్రతోపాటు గాండ్ల రమేష్, కొత్తపల్లి సుధాకర్రాజు, వేములేటికోట శశిరెడ్డి, ఓబెరెడ్డిగారిపల్లె వాసుదేవరెడ్డి, మారెడ్డి శ్రీనివాసరెడ్డి... ఇంకా గుర్తుతెలియని మరికొంతమంది వ్యక్తులు ఈ దాడిలో పాల్గొన్నారని చెప్పాడు. దీనిని నిర్ధారణ చేసుకోవడం కోసం రామకృష్ణ కర్నాటక బోర్డర్లో వున్న స్వర్గ బార్ అండ్ రెస్టారెంట్ యజమానిని సంప్రదించి, 30-04-2024 సాయంత్రం 6:45 నిమిషాల నుంచి రాత్రి 10:00 గంటల సమయం వరకు వున్న సీసీటీవీ ఫుటేజ్ సేకరించి, విశ్లేషణ చేయగా, పెద్దిరెడ్డి కుటుంబం చేసిన కుట్ర బహిర్గతమైంది. కానీ, పోలీసులు ఇది కుటుంబ కలహమంటూ, పెద్దిరెడ్డి చెప్పిన విధంగా నడుచుకుంటూ, అసలైన నేరస్థులను కేసు నుంచి తప్పించడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ఈ అంశాలన్నిటినీ కూడా జడ్జి రామకృష్ణ అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి, జిల్లా పై అధికారులకు 03-05-2024న ఫిర్యాదు చేసినట్లుగా తెలియజేశారు. సహజంగా, ఇటువంటి దాడి జరిగినప్పుడు దాడి చేసిన వ్యక్తి కాల్ డేటాని పరిశీలించాలి, అతనితో ఎవరెవరు వున్నారన్న విచారణ జరపాలి. కానీ పోలీసులు ఇవేవీ జరపకుండా ఇది ఒక కుటుంబ తగాదా అని తేల్చేస్తున్నారని, సరైన విచారణ జరపకుండా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చెప్పినట్టుగా సీఐ వ్యవహరిస్తున్నారని రామకృష్ణ అంటున్నారు. తన ఇంటి మీద జరిగిన దాడి వెనుక వైసీపీ నాయకులు వున్నారని, వారందరినీ తప్పించడానికే తనపై జరిగిన ఈ ఘోరమైన, క్రూరమైన, దారుణమైన ఈ దాడిని ఒక కుటుంబ గొడవగా చిత్రీకరించడానికి, దాడికి పాల్పడిన వారిని కాపాడటానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారని జడ్జి రామకృష్ణ ఆరోపిస్తున్నారు. ఈ కేసు విషయంలో నిస్పాక్షిక విచారణ జరపాల్సిన బాధ్యత పోలీసుల మీద వుంది.