Facts About Daydreaming

పగటి కలలు కంటుంటారా? ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

  పగటి కల చాలా తరచుగా ఉపయోగించే మాట. ఎవరైనా ఏ పనీ చేయకుండా ఆలోచనలో మునిగిపోయి లోలోపల సంతోష పడటాన్ని పగటి కల అని అంటుంటారు.  అందులో భవిష్యత్తులో అలా ఉంటాం, ఇలా ఉంటాం,  అలా జరుగుతాయి, ఇలా జరుగుతాయి అంటూ చాలా రకాలుగా ఊహించుకుంటూ ఉంటారు.ఇలా పగటి కలలు కనడం అనేది చాలామందికి ఒకానొక తృప్తిని ఇస్తుంది.  కానీ ఈ పగటి కలల వల్ల కొంప కొల్లేరు అవుతుందని పరిశోధకులు అంటున్నారు. ఒక వ్యక్తి దైనందిన జీవితానికి,  పనితీరుకు అంతరాయం కలిగించే అధిక పగటి కలలను మాలాడాప్టివ్ పగటి కలలు కనడం అంటారు. విశ్రాంతి తీసుకోవడానికి లేదా వాస్తవికత నుండి క్లుప్తంగా తప్పించుకోవడానికి ఆరోగ్యకరమైన మార్గంగా ఉండే సాధారణ పగటి కలల మాదిరిగా కాకుండా, మాలాడాప్టివ్ పగటి కలలు తీవ్రమైన, స్పష్టమైన,  ఎక్కువగా  లీనమయ్యే ఫాంటసీలను కలిగి ఉంటాయి, ఇందులో ఒక వ్యక్తి రోజులో గంటల తరగబడి ఈ పగటి కలలు కనడంలో సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. ఈ పగటి కలలు చాలా సంక్లిష్టమైన  పరిస్థితులకు దారి తీస్తాయి.  ఒక వ్యక్తి నిజ జీవిత పరిస్థితులు,   బాధ్యతల కంటే తన ఫాంటసీ ప్రపంచాన్ని ఎక్కువగా  ఇష్టపడే స్థాయికి ఇవి తీసుకువెళతాయి. పర్యావసానంగా ఊహాజనిత ప్రపంచంలోనే గడపడానికి ఇష్టపడతారు.  అందులో తన పాత్రకే తను స్పందించడం,  తను చాలా గొప్ప అని అనుకోవడం వంటివి చేస్తారు. సాధారణంగా విశ్రాంతి తీసుకున్నప్పుడో లేదా ఖాళీ సయమం ఉన్నప్పుడో ఎక్కువ మంది తమ భవిష్యత్తును ఊహించుకుంటూ ఉంటారు.  భవిష్యత్తు కార్యాచరణలు, భవిష్యత్తులో సాధించబోయే విజయాలు,  తాము చేరుకునే స్థాయి మొదలైనవి అన్నీ ఇందులో ఊహించుకుంటూ ఉంటారు. అయితే ఇది మనిషిని మానసిక రుగ్మతలోకి లాగేస్తుంది. పగటి కలలు కనేవారు సాధారణంగా మనుషులలో కలవడం కంటే ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. సామాజికంగా చాలామందికి దూరమవుతారు. పగటి కలలలో కూడా మంచివి, చెడ్డవి రెండూ ఉంటాయి. మంచి చేసే విషయాలను ఊహించుకోవడం వల్ల సబ్కాన్షియస్ ను యాక్టీవ్ గా ఉంచుకోవచ్చు. కానీ చెడు విషయాలను పదే పదే పగటి కలలలో ఊహించుకోవడం వల్ల సబ్కాన్షియస్ మూలంగా జీవితంలో చెడు సంఘటలను చోటు చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది ఒత్తిడి, మానసిక ఆందోళన,  మనసు గాయపడటం, నిరాశ,  నిస్పృహ, అందరూ తనని ఒంటరిని చేసారనే భావన వంటి విషయాలను ఎక్కువగా ఊహించుకుంటూ ఉంటారు. ఇది మనిషి  జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తుంది. కొంతమందికి అయితే పైన చెప్పుకున్న భావాల నుండి బయటపడి తాము సంతోషంగా ఉన్నాం అనిపించేలా చేయడానికి కూడా ఈ పగటి కలలు సహాయపడతాయి. ఎవరితోనూ ఎక్కువగా కలవని వ్యక్తులు పగటి కలలు కనడానికి అడిక్ట్ అవ్వవచ్చని వైద్యులు చెబుతున్నారు.  వీటి ద్వారా తమ ఒంటరితనాన్ని జయించవచ్చు కానీ తాము  జీవితంలో ఎప్పటికీ ఒంటరితనంలో ఉండిపోతారని అంటున్నారు. ఇలా.. పగటి కలలు జీవితంలో కొన్ని విషయాలలో సహాయపడినా.. చాలావరకు వ్యక్తి సమయాన్ని వృథా చేస్తాయి. అలాగే వ్యక్తిని వాస్తవిక ప్రపంచానికి దూరంగా లాక్కుపోవడం వల్ల వారి ఎదుగుదల మరీ అంత ఆశాజనకంగా ఉండదు.  అందుకే పరిమితి లేని పగటి కలలు చాలా నష్టాన్ని చేకూరుస్తాయి.                          *రూపశ్రీ.  

World Art Day

ఊహలకు రెక్కలు ఇచ్చేదే కళ.. 

  కళ అనేది ఒక వ్యక్తిలోని ప్రతిభను,  సృజనాత్మకతను బయటకు తీసేది. మనిషి జీవితం చాలా వరకు కళలతో ముడి పడి ఉంటుంది.  ఒక పనిని సృజనాత్మకంగా చేయడాన్ని అందులో నైపుణ్యంగా చెబుతారు.  ఈ నైపుణ్యం అందంగా కనిపిస్తే ఆ పనిలో కళ ఉంది అంటుంటారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన ప్రపంచ కళ దినోత్సవం జరుపుకుంటారు.  ఈ సందర్భంగా కళల గురించి ముఖ్యంగా లలిత కళల గురించి, సృజనాత్మకత గురించి ప్రపంచ వ్యాప్తంగా  ఉన్న ఎన్నో విషయాలను తెలుసుకుంటూ కళల ప్రాధాన్యతను  ప్రస్తావిస్తారు. అన్ని సంవత్సరాల లాగే ఈ ఏడాది థీమ్ ను ఎంపిక చేశారు. "ఐక్యత మరియు పరివర్తన కోసం కళ" అనే అంశంతో ఈ ఏడాది కళల గురించి ప్రణాళికలు సాగుతాయి.   దీని గురించి పూర్తీ వివరంగా తెలుసుకుంటే.. ప్రపంచ కళా దినోత్సవం అనేది ప్రతి సంవత్సరం ఏప్రిల్ 15న జరుపుకునే లలిత కళలు,  సృజనాత్మకతకు సంబంధించిన అంతర్జాతీయ వేడుక. ఈ రోజు కళాత్మక వ్యక్తీకరణ, సాంస్కృతిక వైవిధ్యం,  సమాజంలో కళ  ప్రాముఖ్యతను ప్రోత్సహించడానికి  ఒక వేదికగా నిలుస్తుంది. ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఈ వేడుక కళ సమాజాలలో శాంతి, కమ్యూనికేషన్ ను,  అవగాహనను ఎలా పెంపొందించగలదో గుర్తు చేస్తుంది. 2025 లో ప్రపంచ కళా దినోత్సవం మానవాళిని రూపొందించడంలో, ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో,  ఊహలను  ఆవిష్కరణలను నిజం చేయడంలో..  కళ,  కళాకారుల విలువను గౌరవించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ప్రపంచ కళ దినోత్సవం.. ప్రపంచ కళా దినోత్సవ చరిత్ర ప్రపంచ కళా దినోత్సవాన్ని UNESCO భాగస్వామి అయిన ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఆర్ట్ (IAA/AIAP) స్థాపించింది. దీనిని మొదటిసారిగా 2012లో జరుపుకున్నారు. 1452లో జన్మించిన   అత్యంత ప్రసిద్ధ కళాకారులు,  ఆలోచనాపరులలో ఒకరైన లియోనార్డో డా విన్సీ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్ 15ని ప్రపంచ కళ దినోత్సవంగా ఎంపిక చేశారు. 2019లో UNESCO అధికారికంగా ప్రపంచ కళా దినోత్సవాన్ని గుర్తించింది, ఇది దీనికి ప్రపంచ ప్రాముఖ్యతను ఇచ్చింది. లియోనార్డో డా విన్సీ సృజనాత్మక స్వేచ్ఛ, బహుళ విభాగ మేధావి,  దార్శనిక ఆలోచనలను కలిగి ఉన్న వ్యక్తి. ప్రపంచ కళా దినోత్సవం కేవలం పెయింటింగ్‌లు లేదా శిల్పకళా వేడుక కాదు. ఇది అన్ని రకాల కళాత్మక వ్యక్తీకరణల గురించి తెలుపుతుంది.  ఇందులో దృశ్య కళలు,  ప్రదర్శన కళలు,  సాహిత్య కళలు,  డిజిటల్ ఆర్ట్స్, న్యూ మీడియా మొదలైనవి ఇందులో ప్రముఖంగా ఉన్నాయి. కళలు ఎందుకు ముఖ్యం.. కళ వ్యక్తిలో సృజనాత్మకతను,  భావ ప్రకటనా స్వేచ్ఛను ప్రోత్సహిస్తుంది.  సాంస్కృతిక మార్పిడి,  వైవిధ్యాన్ని ప్రోత్సహిస్తుంది సమాజంలో కళాకారుల పాత్రను ఇది నొక్కి చెబుతుంది.  కళా కారుల వల్లే ప్రపంచంలో చాలా విషయాలు వ్యాప్తి చెందాయి.  సంస్కృతులు,  చరిత్ర ఒక తరం నుండి మరొక తరానికి అందుతూ వచ్చింది.   కళల విద్య,  అభ్యాసంలో సృజనాత్మకత  ప్రాముఖ్యత గురించి అవగాహన పెంచుతుంది. చాలా మంది మల్టీటాలెంట్ అంటూ ఉంటారు.  ఇది  ప్రపంచం గురించి అవగాహనను బలోపేతం చేస్తుంది.                             *రూపశ్రీ

Dr BR Ambedkar special Story

రాజ్యాంగ రూపకర్త.. మన అంబేద్కర్..!

  డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్.. లేదా అంబేద్కర్.. భారత రాజ్యాంగ రూపకర్తగా అందరికీ ఈయన సురపరిచితం. అంతేనా..  అట్టడుగు వర్గంలో జన్మించి  పేద ప్రజలకు,  అంటరానివారి హక్కుల కోసం పోరాడిన మహనీయుడు అంబేద్కర్..  చాలామంది అంబేద్కర్ కేవలం  అట్టడుగు వర్గాల వారి కోసం మాత్రమే పారాడాడని చెబుతారు. కానీ అది తప్పు.. ఆయన భారతీయుల కోసం ముఖ్యంగా అట్టడుగు వర్గాల కోసం అణిచివేయబడుతున్న అన్ని రకాల వర్గాల కోసం కృషి చేశారు. అణగారిన వర్గాల న్యాయం,  సమానత్వం, గౌరవం కోసం పోరాటం చేశారు. సామాజిక వివక్షను నిర్మూలించి, తద్వారా చట్టం దృష్టిలో భారతదేశ పౌరులందరికీ సమానత్వాన్ని సమర్థిస్తూ డాక్టర్ అంబేద్కర్ తన జీవితాన్ని గడిపినందున ఆయన జన్మదినోత్సవాన్ని సమానత్వ దినోత్సవం అని కూడా పిలుస్తారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14వ తేదీన ఆయన జన్మదినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఆయన గురించి తెలుసుకుంటే..  డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1891లో మహర్ కులానికి చెందిన వ్యక్తిగా జన్మించారు మరియు జీవితాంతం తీవ్రమైన కుల వివక్షను అనుభవించారు. అంబేద్కర్ విద్యను సాధికారత,  సామాజిక పురోగతికి ఒక మార్గంగా భావించారు,  అణగారిన వర్గాలలో విద్యను వ్యాప్తి చేయడానికి 1923లో 'బహిష్కృత హితకారిణి సభ'ను స్థాపించారు. అంబేద్కర్ చేసిన కృషి.. షెడ్యూల్ కులాలు,  షెడ్యూల్ తెగలకు నాటి కాలంలో చదువుకోవడం కష్టంగా ఉండేది.  తినడానికి తిండి దొరకడం కూడా కష్టంగా ఉండేది.  సమాజంలో వారికంటూ ఎలాంటి గౌరవం ఉండేది కాదు.  అలాంటి వారి కోసం అంబేద్కర్ కృషి చేసారు. వీరిని (SC, St) అనే వర్గంలో చేర్చారు. కేవలం SC, ST లు మాత్రమే కాకుండా వెనుకబడిన ఇతర తరగతుల వారిని కూడా అంబేద్కర్ పరిగణలోకి తీసుకున్నారు. ఈ OBC వర్గం వారికి కూడా రిజర్వేషన్లు కల్పించారు. మహిళలు పురుషులతో సమానంగా ఎదగడానికి,  మహిళల సాధికారత కోసం అన్ని వర్గాలలో ఉన్న మహిళలకు రిజర్వేషన్లు ఏర్పాటు చేశారు.   కార్మికులకు, కార్మికుల కుటుంబాల విషయంలో కూడా అంబేద్కర్ ఆలోచనలు సాగాయి. కార్మిక హక్కుల కోసం,  వారి అవసరాల గురించి చర్యలు సాగాయి. పేదవారు,  సామాజికంగా వెనుకబడినవారు మొదలైన వారికి కులంతో సంబంధం లేకుండా విద్య,  ఉద్యోగం, రాజకీయాలు, సమాజంలో కూడా ఎవరు ఎటువంటి వివక్షకు గురికాకుండా అందరికీ సమాన హక్కులు ఉన్న దేశమే ఆయన కల.  ఆయన జీవితం కూడా ఈ హక్కుల సాదన దిశగానే సాగింది.  ఆయన జీవితం మొత్తం న్యాయం కోసం,  హక్కుల కోసం పోరాడటంలో గడిచిపోయింది. దేశ నిర్మాణం గురించి అంబేద్కర్ కు ఒక కల ఉండేది అదే కుల నిర్మూలన.. దేశాన్ని కుల విభజన ద్వారా కాకుండా సమానత్వం ద్వారా నిర్మించాలని అంబేద్కర్ కలలు కన్నాడు. దేశ ప్రయోజనాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన అంబేద్కర్ దేశం ఎప్పటికీ గుర్తుంచుకోదగిన వ్యక్తి,  పూజ్యునీయుడు.                                       *రూపశ్రీ.  

A story that tells why one should be virtuous

ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే కథ!

మనిషి జీవితంలో ధర్మమే ఎప్పటికైనా మూల స్థంభం. ధర్మాన్ని దాటి ప్రవర్తించేవారు, జీవించేవారు భవిష్యత్తులో ఖచ్చితంగా సమస్యలు ఎదుర్కొని తీరతారు.ఎందుకు అంటే అధర్మంగా ఉన్నవారికి జీవితంలో నీతి అనేది ఉండదు. అంటే ప్రవర్తన తప్పుగా ఉందని అర్థం. తప్పు ప్రవర్తన కలిగిన వారు అధర్మంలో ఉన్నారంటే అది తప్పు దారిలో వెళ్తున్నారని అర్థం. మనిషి ధర్మం గా ఉండాల్సిన అవసరం గురించి, ధర్మం తప్పితే ఎదురయ్యే పరిస్థితి గురించి, ధర్మంగా ఎందుకుండాలో తెలియజెప్పే ఒక కథ ఇది!! ఓ గ్రామంలో ఓ బ్రాహ్మణుడికి అనుకోకుండా యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది. అతడు ఈ వింత చూసి ఆశ్చర్యపోతున్నప్పుడు అతడి భార్య అక్కడికి వచ్చింది.  "ఏమిటండీ అలా ఆశ్చర్యంగా చూస్తున్నారు" అని అడిగిందామె. యజ్ఞకుండంలో బంగారు ముద్ద దొరికింది" అని బదులిచ్చాడు అతడు. "అవునా నేను నిన్న పొరపాటున  తాంబూలాన్ని యజ్ఞకుండంలో ఉమ్మేశాను. అదే ఇలా బంగారం అయ్యిందేమో!!"  "తాంబూలం అమ్మితే బంగారు ముద్ద రావడం ఏమిటే!! నీ బుద్దిలేని ఆలోచన కాకపోతే" అని విసుక్కున్నాడు అతడు. "సరే మీకు నమ్మకం లేకపోతే ఈరోజు నిన్నటిలాగే చేస్తాను. రేపు ఏమవుతుందో చూద్దాం" అన్నదామె. అతను సరేనని చెప్పడంతో ఆమె తాంబూలం నమిలి యజ్ఞకుండంలో ఉమ్మేసింది. మరుసటిరోజు చూడగానే ఆశ్చర్యంగా మళ్ళీ బంగారు ముద్ద కనిపించింది. వారికి రోజు తాంబూలం ఉమ్మి వేయడం, మరుసటిరోజు బంగారు ముద్ద తీసుకోవడం అలవాటు అయిపోయింది. అలా చేయడం వల్ల కొద్ధి కాలంలోనే వాళ్ళు గొప్ప ధనవంతులు అయిపోయారు. వాళ్ళు ధనవంతులు అయిన కారణం ఊరిలో కొందరికి తెలిసింది. ఆ ఊర్లో మిగిలిన వాళ్ళ ఇళ్లలో కూడా తాంబూలం ఉమ్మి యజ్ఞకుండంలో వేయడం బంగారు ముద్దలు తీసుకోవడం అందరికీ అలవాటు అయింది.  అందరూ ధనవంతులైపోతున్నారు. అయితే ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు మాత్రం భార్య ఎంత పోరినా ఆమె యజ్ఞకుండంలో ఉమ్మి బంగారం అందుకునేందుకు ఇష్టపడటం లేదు. అందరూ ధనవంతులవుతుంటే, తాము మాత్రం పేదవారుగానే ఉండటం ఆమెకు నచ్చలేదు. చివరికి భర్త ఎంతకీ మాట వినకపోవటంతో ఆమె పుట్టింటికి బయలుదేరింది. చేసేది లేక భర్త ఆమెను అనుసరించాడు. వారు ఊరి పొలిమేర దాటగానే ఊళ్ళో గొడవలు ప్రారంభమై ఇళ్ళు తగలబడిపోసాగాయి.  అప్పుడు ఆ బ్రాహ్మణుడు భార్యకు వివరించాడు "ధర్మానుసారం సంపాదించిన ధనం శాంతినిస్తుంది. అలా కాక ధర్మచ్యుతి చేస్తూ ఇష్టం వచ్చిన రీతిలో సంపాదన చేస్తే అది అనర్థానికి దారి తీస్తుంది. ఇన్నాళ్ళూ మనం ధర్మం పాటించటం ఈ ఊరిని కాపాడింది. మనం ఊరిని వదిలాం. అసూయా, ద్వేషాలతో ఊరు నాశనమైంది" అని. అది విన్న భార్యకు విషయం అర్థమైంది. ప్రస్తుతం మన సమాజం ఆ ఊళ్ళోవారున్న స్థితిలో ఉంది. ధనసంపాదన కోసం యజ్ఞకుండంలో సైతం ఉమ్మేసేందుకు సిద్ధపడ్డ ఆ ఊరివాళ్ళలాగా, ప్రస్తుతసమాజం డబ్బు సంపాదన కోసం అడ్డమైన గడ్డీ మేసేందుకు సిద్ధమౌతోంది. ఎంత ధనం సంపాదిస్తే, అంత అశాంతి పాలవుతోంది. నైతికవిలువలు వదిలి సమాజం మానవత్వాన్ని కోల్పోతుంది. మన తరువాతి తరాలైనా ఉత్తమ వ్యక్తిత్వంతో ప్రశాంతంగా జీవించాలంటే "ఉత్తమ ఆదర్శం" ఎంతో అవసరం.                                    ◆నిశ్శబ్ద.

know about waste free villages

భారతదేశంలో వ్యర్థాలు లేని గ్రామాల గురించి తెలిస్తే శభాష్ అంటారు..!

వ్యర్థాలు అంటే నిరుపయోగకరమైన వస్తువులు లేదా పదార్థాలు.  ప్రతి రోజు ప్రతి ఇంటి నుండి ఇలాంటి వ్యర్థాలు ఎన్నెన్నో బయటకు వెళుతూ ఉంటాయి. ఇది చాలా సహజ విషయం అని అందరూ అంటారు. కానీ ఈ వ్యర్థాలే పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి. మన భారతదేశంలో ప్రతి సంవత్సరం 62మిలియన్ టన్నులకు పైగా వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్నాయట. దేశం అంతా ఇంత వ్యర్థాల మధ్య కుళ్లిపోతున్నా కొన్ని ప్రాంతాలలో మాత్రం నిశ్శబ్ద యుద్దం జరుగుతోంది. ఇవి కూడా ఏ పట్టణ ప్రాంతాలలోనో ఏ పర్యావరణ సంస్థల ఆధ్వర్యంలో జరుగుతున్నవో అనుకుంటే పొరపాటు పడినట్టే..  భారతదేశంలో ఆరు గ్రామాలు వ్యర్థాలు లేని గ్రామాలుగా మారి దేశం దృష్టిని తమ వైపు ఆకర్షిస్తున్నాయి. అసలు ఈ గ్రామాలు అలా ఎలా మారాయి అనే విషయం తెలుసుకుంటే.. భారతదేశంలో మారుమూల ప్రాంతాలలో ఉండే కొన్ని గ్రామాలు వ్యర్థాలే లేని  గ్రామాలుగా రూపుదిద్దుకున్నాయి.  భారతదేశం మొత్తం మీద ఎంతో గర్వంగా గుర్తింపు పొందాయి. ఈ గ్రామాలలో పిల్లలు శుభ్రపరిచే కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తారు. పెద్దలు సరళంగా జీవించడం గురించి జ్ఞానాన్ని పంచుకుంటారు. ఇక్కడ  "వ్యర్థం" అనే ఆలోచన నెమ్మదిగా కనుమరుగవుతోంది.  ఎందుకంటే ఇక్కడ ఏదీ వృధా కాదు. ఇవి కేవలం విధానాలే కాదు, ప్రజల కథలు కూడా. ప్రపంచవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షించే అట్టడుగు స్థాయి చర్య. ఇది శుభ్రమైన వీధుల గురించి మాత్రమే కాదు - ఇది పరిశుభ్రమైన భవిష్యత్తు గురించి కూడా చెప్తుంది. ఈ గ్రామాల గురించి తెలుసుకుంటే.. ఆంధి, జైపూర్, రాజస్థాన్.. జైపూర్ నుండి కొద్ది దూరంలో ఉన్న ప్రశాంతమైన ఆంధి గ్రామం అసాధారణమైన పని చేస్తోంది. ఈ గ్రామంలో వ్యర్థాలను స్వచ్ఛమైన అవకాశంగా మారుస్తోంది. వినూత్నమైన గ్రీన్ టెక్నాలజీల సహాయంతో ఇప్పుడు ఆహార వ్యర్థాలు,  వ్యవసాయ వ్యర్థాల నుండి ఆసుపత్రి వ్యర్థ జలాలను కూడా శక్తి, స్వచ్ఛమైన నీరు,  కంపోస్ట్‌గా మారుస్తోంది. బయోగ్యాస్ ప్లాంట్లు, సౌరశక్తితో నడిచే వ్యవస్థలు,  సహజంగా నీటిని శుద్ధి చేసే తడి భూములను ఇక్కడ చూడవచ్చు. ఇవన్నీ ఇప్పుడు ఇక్కడ రోజువారీ జీవితంలో భాగమయ్యాయి. సైన్స్ నేతృత్వంలో,  ప్రజలచే శక్తిని పొందుతూ, గ్రామీణ భారతదేశం వ్యర్థాలు లేని  దిశగా మారడానికి చైతన్యం ఇస్తుంది. నయా బస్తీ, డార్జిలింగ్.. ఇదివరకు డార్జిలింగ్ కొండలలోని ఒక చిన్న గ్రామం నయా బస్తీ చెత్త కుప్పల కింద ఇబ్బంది పడుతుండేది. నేడు ఈ గ్రామం రూపు రేఖలు మారిపోయాయి.  దీనిని దాదాపుగా గుర్తించలేనంత అద్బుతంగా మారిపోయింది.  ఈ మార్పుకు  ఉట్సోవ్ ప్రధాన్,  అతని బృందం కీలకంగా ఉన్నారు. వారు తమ చేతులను చుట్టి సమాజంతో కలిసి పనిచేశారు. కంపోస్టింగ్ వంటి పురాతన పద్ధతులను తీసుకువచ్చారు. వాటిని పెర్మాకల్చర్ వంటి ఆధునిక ఆలోచనలతో కలిపారు.  వ్యర్థాలను జీవితంగా మార్చారు. ఇది ఇప్పుడు శుభ్రంగా ఉండటమే కాదు..  పచ్చగా, బలంగా ఉంది.  చోటా నరేనా, రాజస్థాన్.. ఒకప్పుడు ప్లాస్టిక్ కుప్పలు, కాలిపోతున్న వ్యర్థాల మధ్య పాతుకుపోయిన రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాలోని చోటా నరేనా గ్రామం ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. కేవలం ఎనిమిది నెలల్లోనే. ఒకప్పుడు కలుషితమైన ఈ గ్రామం రాష్ట్రంలో మొట్టమొదటి వ్యర్థ రహిత గ్రామంగా  మారింది - ఇదంతా అక్కడ నివసించే ప్రజల వల్లే సాధ్యమైంది. పటోడా, మహారాష్ట్ర.. మహారాష్ట్ర నడిబొడ్డున ఉన్న పటోడా గ్రామం సుస్థిర జీవనం అంటే ఏమిటో చూపిస్తుంది. ఇక్కడ,వ్యర్థాలను బయట పడేయడం కాదు - వాటిని పనిలో పెట్టడం జరుగుతుంది. ప్రతి ఇల్లు తన వ్యర్థాలను క్రమబద్ధీకరిస్తుంది. వంటగది వ్యర్థాలను పొలాలకు ఎరువుగా మారుస్తుంది.  ప్లాస్టిక్,  పొడి వ్యర్థాలను సేకరించి రీసైక్లింగ్ కోసం విక్రయిస్తుంది, ఇది గ్రామ ఆదాయాన్ని పెంచుతుంది. మేలతిరుప్పంతురుతి, తమిళనాడు.. దక్షిణ భారతదేశంలోనే అత్యంత పరిశుభ్రమైన పట్టణ పంచాయతీగా మేలతిరుప్పంతురుతి పేరు సంపాదించింది. ఈ పట్టణం వ్యర్థాలను మూలంలోనే క్రమబద్ధీకరిస్తుంది. సేకరణ కోసం ఎలక్ట్రిక్ వాహనాలను ఉపయోగిస్తుంది. నివాసితులకు ఉచితంగా మొక్కలను అందజేస్తారు.  బయోడిగ్రేడబుల్ బ్యాగుల కోసం ప్లాస్టిక్‌ను తొలగించమని ప్రోత్సహిస్తారు. ఇది పనిచేసే సరళమైన, సమాజ-ఆధారిత వ్యవస్థ. ఇంట్లోనే పెద్ద మార్పు ఎలా ప్రారంభమవుతుందో చూపించే చిన్న పట్టణం.  అంబికాపూర్, ఛత్తీస్‌గఢ్.. ఒకప్పుడు 15 ఎకరాల విస్తీర్ణంలో భారీ చెత్తకుప్పగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని అంబికాపూర్ కథను పూర్తిగా మార్చేసింది. నేడు ఇది భారతదేశంలోని అత్యంత పరిశుభ్రమైన నగరాల్లో ఒకటి.  ఇక్కడ ప్రతి ఇల్లు చెత్తను వేరు చేస్తుంది.  ఒక్క చెత్త కూడా చెత్తకుప్పలో పడదు.   *రూపశ్రీ  

Mahavir Jayanti

వర్థమాన మహావీరుడు ఎవరు? ఆయన చెప్పిన ఐదు జీవన సూత్రాలు ఏంటంటే..!

  ప్రతి సంవత్సరం చైత్ర శుక్ల త్రయోదశి నాడు దేశవ్యాప్తంగా మహావీర్ జయంతిని భక్తి, విశ్వాసం,  శాంతి.. మొదలైన  సందేశాలతో జరుపుకుంటారు. జైన మతం  24వ తీర్థంకరుడు అయిన  మహావీరుడి జన్మదినం కేవలం జైన మతస్థులకే కాకుండా మొత్తం ప్రపంచానికి కూడా  సత్యం, అహింస,  సంయమనం మొదలైన వాటిని ప్రేరేపిస్తుంది.  వర్థమాన మహావీరుడు అని పిలుచుకునే మహావీరుడు జైన మతంలో చివరి తీర్థంకరుడు కూడా.  ఈయన తన జీవితంలో 5 జీవన సూత్రాలను ప్రజలకు చెప్పాడు.  ఈ జీవన సూత్రాలు ప్రజలకు ఎంతో నేర్పిస్తాయి.  ఇది పూర్తీగా మతానికి మినహాయించి ఆలోచించాల్సిన అంశం.  వర్థమాన మహావీరుడు చెప్పిన ఐదు జీవన సూత్రాలు.. ఆయన చరిత్ర తెలుసుకుంటే.. వర్థమాన మహావీరుడు  క్రీస్తుపూర్వం 599లో బీహార్‌లోని కుందల్‌పూర్‌లో జన్మించాడు. అతని తండ్రి రాజు సిద్ధార్థ లిచ్చవి రాజవంశానికి పాలకుడు,  తల్లి త్రిషల గణతంత్ర యువరాణి. చిన్నప్పటి నుంచీ మహావీరునికి లోతైన సున్నితత్వం, నిర్లిప్తత,  సత్య అన్వేషణ అనేవి ఉండేవి. 30 సంవత్సరాల వయసులో తన రాజ్యాన్ని, కుటుంబాన్ని, విలాసాలను త్యజించి ఒక సాధువు జీవితాన్ని చేపట్టాడు. దీని తరువాత అతను 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు, ధ్యానం,  నిశ్శబ్ద సాధన చేసాడు. చివరికి  జ్ఞానోదయం పొందాడు.   'జిన్' అంటే ఇంద్రియాలను జయించినవాడు అని పిలువబడ్డాడు. దీని తరువాత  తన జీవితమంతా ప్రజా సంక్షేమం,  మత ప్రచారానికి అంకితం చేశాడు. మతపర,  సామాజిక ప్రాముఖ్యత.. వర్థమాన మహావీరుడి జయంతి కేవలం ఒక మతపరమైన విషయం కాదు. ఇది  మానవ విలువల పునరుద్ధరణకు ప్రతీక. ఈ రోజున జైన సమాజం ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కలశ యాత్ర, శోభా యాత్ర,  ప్రబోధాలను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న జైన దేవాలయాలలో మహావీరుడి విగ్రహాలను ప్రతిష్టించారు. అనేక చోట్ల ఉచిత వైద్య శిబిరాలు, ఆహార దానం, పుస్తక పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మహావీరుడి 5 జీవన సూత్రాలు.. మహావీరుడి జీవిత తత్వశాస్త్రానికి ప్రాథమిక పునాది ఆయన చెప్పిన ఐదు ప్రధాన ప్రమాణాలు. అహింస.. ప్రతి జీవికి ఒక ఆత్మ ఉంటుంది. కాబట్టి ఎవరినైనా బాధపెట్టడం పాపం. మహావీరుడు ఆలోచనలు, మాటలు,  చర్యలలో అహింసను అనుసరించాలనే సందేశాన్ని ఇచ్చాడు. సత్యం.. ఆత్మను పవిత్రం చేసుకోవడానికి నిజం మాట్లాడటమే ఏకైక మార్గం. అబద్ధాలు చెప్పడం వల్ల మనసు చంచలమై సమాజంలో అపనమ్మకం పెరుగుతుందని ఆయన అన్నారు. అస్తేయ.. అనుమతి లేకుండా ఏదైనా తీసుకెళ్లడం లేదా దొంగిలించడం నేరం. జీవితంలో ఆనందానికి సంతృప్తి,  స్వీయ నియంత్రణ మార్గం. బ్రహ్మచర్యం.. ఆత్మ పురోగతికి బ్రహ్మచర్యం, ఇంద్రియాలపై నియంత్రణ, మానసిక,  శారీరక నిగ్రహం చాలా అవసరం. అపరిగ్రహ.. మీరు ఎంత తక్కువ సేకరిస్తే, మీ జీవితం అంత సరళంగా,  ప్రశాంతంగా ఉంటుంది. నిజమైన త్యాగం అంటే సంపద, వస్త్రాలు, సంబంధాలు,  కోరికల పట్ల మమకారాన్ని త్యజించడం. మహావీరుడి ఈ సూత్రాలు నేటి యుగంలో కూడా అంతే సందర్భోచితంగా ఉన్నాయి. హింస, మోసం, అనుబంధం లేకుండా కూడా జీవితాన్ని అందంగా, విజయవంతం చేయవచ్చని ఆయన జీవితం మనకు బోధిస్తుంది.                                 *రూపశ్రీ.

In which earthen pots the water is cold

ఎరుపు, నలుపు...  ఏ మట్టికుండలలో నీరు చల్లగా ఉంటుందంటే..!

ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరుకోవడంతో రాబోయే నెలల ఉష్ణోగ్రత  గురించి ఆందోళన చెందుతున్నారు. చాలామంది ఇళ్లను చల్లగా ఉంచుకోవడానికి, చల్లటి నీటి కోసం  తాపత్రయ  పడుతుంటారు. మారుతున్న కాలంతో పాటు కూలింగ్ వాటర్ కోసం వాటర్ కూలర్లు, రిఫ్రిజిరేటర్లు వంటి పరికరాలు మార్కెట్లోకి వచ్చినప్పటికీ చాలామందికి కుండల మట్టి ప్రాధాన్యత, వాటి ఉపయోగం చాలా స్పష్టంగా అవగాహన ఉంది. అందుకే ఇంట్లో రిఫ్రిజిరేటర్లు ఉన్నా సరే..   మట్టి కుండలు కొంటూ  ఉంటారు.   గ్రామీణ ప్రాంత ప్రజలు అయినా,  పట్టణ ప్రాంత ప్రజలు అయినా   మట్టి కుండలను కొని అందులో నీరు తాగుతుంటారు.  ఎందుకంటే ఈ మట్టి  కుండలు నీటిని సహజంగా చల్లబరుస్తాయి. మట్టి కుండ  నీరు తాగడం వల్ల శరీరంలో ఎటువంటి కాలానుగుణ రుగ్మతలు ఏర్పడవు. కానీ  మార్కెట్లో రెండు రకాల మట్టికుండలు కనిపిస్తూ ఉంటాయి.  ఒకటి ఎరుపు రంగు కాగా.. మరొకటి నలుపు రంగు.  ఏ రంగు మట్టి కుండలు ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు చాలా మంది. దీనికి సరైన సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. నలుపు రంగు కుండ.. నలుపు రంగు వేడిని త్వరగా గ్రహిస్తుంది, అందుకే నల్ల కుండలోని నీరు త్వరగా చల్లబడుతుందని నమ్ముతారు. ఇది శరీరానికి కూడా మంచిది, అందుకే ఈ కుండకు భారీ డిమాండ్ ఉంది. ఎర్ర కుండ  కూడా మంచిదే అయినప్పటికీ, నల్లటి కుండతో  పోలిస్తే నీరు తక్కువ చల్లగా ఉంటుంది. అయితే, ఈ రోజుల్లో మట్టి కుండలు సిమెంట్‌తో కల్తీ చేయబడుతున్నాయి కాబట్టి దానిని కొనడానికి ముందు కుండను జాగ్రత్తగా పరిశీలించాలి. కల్తీని ఎలా గుర్తించాలి.. కుండ  కొనేటప్పుడు దాని బరువును తనిఖీ చేయాలి. నిజానికి మట్టి కుండలు తేలికగా ఉంటాయి, అయితే సిమెంట్ తో చేసిన కుండలు బరువుగా ఉంటాయి. అలాగే సిమెంట్ కలిపిన కుండలోని నీరు మట్టి కుండలోని నీరు అంత మంచిది కాదు. కాబట్టి, చల్లని  ఆరోగ్యకరమైన నీటి కోసం స్వచ్చమైన మట్టి కుండను ఎంచుకోవాలి. కుండ మందం.. మట్టి కుండల  షాపింగ్ కి వెళ్ళినప్పుడల్లా, మందంగా ఉండే కుండలు ఎంచుకోవాలి నిజానికి ఇది నీటిని ఎక్కువసేపు చల్లగా ఉంచుతుంది. సన్నని  మందం ఉన్న కుండలు సులభంగా విరిగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి కుండను కొనుగోలు చేసేటప్పుడు దాని మందంపై  శ్రద్ధ వహించాలి. లీక్ టెస్ట్.. తరచుగా ప్రజలు మట్టి కుండ  కొనేటప్పుడు తొందరపాటులో లీక్ టెస్ట్ చేయడం మర్చిపోతారు.  తరువాత ఇంటికి వచ్చి కుండను నీటితో  నింపినప్పుడు కుండ లీకవ్వడం చూసి బాధపడతారు. కాబట్టి దుకాణంలోనే నీటిని పోసి లీక్ టెస్ట్ చేయాలి. ఎక్కడి నుంచో నీళ్లు కారుతుండటం తెలుసుకోవచ్చు.  ఇలా చేయడం వల్ల  మళ్లీ మళ్లీ షాపుకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ తప్పులు చేయకండి.. తరచుగా  అందానికి ఆకర్షితులై, మరింత మెరిసే కుండలను కొంటారు. అయితే ఈ కుండలపై పెయింట్ వేయడం వల్ల నీరు అంత చల్లగా మారదు. కుళాయి ఉన్న కొంచెం పెద్ద కుండ కొనండి. దీనితో,  కుండను పదే పదే నింపాల్సిన అవసరం ఉండదు.  నీటిని బయటకు తీయడానికి దాన్ని తెరవాల్సిన అవసరం ఉండదు. ఇది నీటిని స్వచ్ఛంగా,  చల్లగా ఉంచుతుంది.   *రూపశ్రీ.

How to Keep Calm During Tests

పరీక్షల సమయంలో మనసు ప్రశాంతంగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

  పరీక్షలు.. పిల్లల జీవితాలను మార్చేవి.  ఏడాది మొత్తం చదివిన విషయాలను ఒక పరీక్షతో సమాధానాలు ఇచ్చి ప్రతిభను నిరూపించుకుంటేనే తదుపరి  తరగతికి లేదా తదుపరి దశకు అవకాశం ఉంటుంది.  అయితే పిల్లలు అయినా, పెద్దలు అయినా పరీక్షల కోసం సన్నద్ధం అయ్యేటప్పుడు ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. అలా ఒత్తిడికి గురైతే చదివిన విషయాలు గుర్తుండవు,  సిలబస్ తొందరగా పూర్తీ చేయలేం. పరీక్షల సమయంలో ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా ఉండాలంటే.. కొన్ని టిప్స్ పాటించాలి. ఒత్తిడి తగ్గడానికి చాలా మంది శ్వాస వ్యాయామాలు చేస్తారు.  లోతైన శ్వాస అనేది ఒత్తిడి హార్మోన్లను తగ్గిస్తుంది. కళ్లు మూసుకుని కొన్ని నిమిషాలు ధీర్ఘంగా శ్వాస తీసుకోవడం వల్ల ఒత్తిడి అనేది దరిచేరదు. ఎప్పుడూ నాన్ స్టాప్ గా చదువుకుంటూ ఉంటారు కొందరు. దీని వల్ల తాము బాగా చదువుతున్నాం అనుకుంటారు. కానీ ఇలా నాన్ స్టాప్ గా చదువుకోవడం వల్ల మనసు  అలసిపోతుంది. అందుకే ప్రతి గంటకు కనీసం 5 నుండి 10 నిమిషాల విరామం తీసుకోవాలి. ఈ 5, 10 నిమిషాల సమయంలో నీరు త్రాగడం, కాస్త ధీర్ఘశ్వాస తీసుకోవడం,  అటు ఇటు నడవడం వంటి పనులు ఏదో ఒకటి చేయవచ్చు. ధ్యానం చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ఏకాగ్రతతో ఉంటుంది. ప్రతి రోజూ కొన్ని నిమిషాలు ధ్యానం చేయడం అలవాటు చేసుకుంటే పరీక్షల ఒత్తిడి అనిపించదు. నిద్ర శరీరానికి ఔషధం వంటిది.   నిద్ర సరిగా లేకపోతే శరీరం అలసిపోయినట్టు అనిపిస్తుంది. మెదడు కూడా చురుగ్గా ఉండదు. అందుకే  ఎంత సిలబస్ ఉన్నా, పరీక్షలు ఎలాంటివి అయినా రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవడం ముఖ్యం. అది కూడా కనీసం 7 నుండి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. వ్యాయామం శరీరాన్నిమాత్రమే ఫిట్ గా ఉంచుతుంది అనుకుంటే పొరపాటు.  వ్యాయామం ఫిట్ గా ఉండటానికే కాకుండా మనసు ఏకాగ్రత పెరగడానికి,  ఒత్తిడి తగ్గడానికి కూడా వ్యాయామం సహాయపడుతుంది.  అందుకే రోజూ కనీసం 30 నిమిషాలు అయినా వ్యాయామం చేయాలి. ఒక్కొకరికి ఒకో  అభిరుచి ఉంటుంది.  ఈ అభిరుచిని బట్టి మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు.  కొందరు సంగీతం వింటారు.  కొందరు తోట పని చేస్తారు.  ఇలా నచ్చిన పని కొద్దిసేపు చేయడం వల్ల మనసు ఆందోళన తగ్గుతుంది. ఇది ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యులు ఎప్పుడూ  సహకారంగా ఉంటారు.  ఒత్తిడిగా అనిపించిన సందర్భాలలో చదవాలని అనుకోవడం తప్పు.  ఒత్తిడిగా అనిపించినప్పుడు సింపుల్ పుస్తకాలు పక్కన పెట్టి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో గడపాలి.  ఇలా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. పాజిటివ్ ఆలోచనలు సగం పైగా ఒత్తిడిని తగ్గిస్తాయి.   ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. పరీక్షల కోసం బాగా చదవాలన్నా, పరీక్షలు బాగా రాయాలన్నా పరీక్షల గురించి పాజిటివ్ గా ఉండాలి. అలాగని పరీక్షలను లైట్ గా తీసుకోకూడదు. సీరియస్ గా చదువుతూనే పరీక్షలలో మంచి ఫలితాలు సాధించగలం అనే నమ్మకం పెట్టుకోవాలి.                           *రూపశ్రీ.

Mahavir Jayanti

జైన మతాన్ని అందించిన తీర్థంకరుడు.. 

  జైన మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో మహావీర్ జయంతి ఒకటి. ఈ సంవత్సరం మహవీర్ జయంతి 2025 ఏప్రిల్ 10వ తేదీ గురువారం నాడు జరుపుకుంటారు. ఇది జైన మతం  24వ  తీర్థంకరుడు అయిన  మహావీర్ 2623వ జన్మదినం  జైన మతంలో 24వ తీర్థంకరుడు అయిన మహావీరుడే చివరి తీర్థంకరుడు కూడా. మహావీర్ జయంతి  ఏప్రిల్ 9 లేదా ఏప్రిల్ 10 అనే విషయంలో కొంత గందరగోళం ఉంది. జైన క్యాలెండర్,  సాంప్రదాయ పంచాంగం ప్రకారం మహావీర్ జయంతి ఈ సంవత్సరం ఏప్రిల్ 10 న అవుతుంది. వర్ధమానుడు అని కూడా పిలువబడే  మహావీరుడు క్రీ.పూ. 599లో కుండలగ్రామ (ప్రస్తుత బీహార్‌లోని వైశాలి జిల్లా)లో జన్మించాడు. ఆధ్యాత్మిక గురువు అయిన మహావీరుడు జైనమతం  ప్రధాన సూత్రాలైన అహింస , సత్యం,  స్వాధీనత లేకపోవడం (అపరిగ్రహం)లను రూపొందించాడు. ఆయన 72 సంవత్సరాల వయస్సులో క్రీ.పూ 527లో మోక్షం పొందాడు. మహావీరుడి జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు దేవాలయాలను సందర్శిస్తారు. ఊరేగింపులలో పాల్గొంటారు, ప్రార్థనలు చేస్తారు,  దానధర్మాలు చేస్తారు. శాంతి, కరుణ,  స్వీయ క్రమశిక్షణ మార్గాన్ని అనుసరించే లక్షలాది మంది భక్తులకు  మహావీరుడు స్ఫూర్తినిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా జైన భక్తులు మహావీర జయంతిని ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్గాలలో ఉత్సవాలు మారుతూ ఉంటాయి. కానీ సాధారణ ఆచారాలలో మహావీరుడి విగ్రహాన్ని రథయాత్ర అని పిలువబడే రథంపై మోసుకెళ్లడం కూడా ఉంటుంది. ఇది ఆయన బోధనల వ్యాప్తికి ప్రతీక. రథయాత్ర అంతటా ఆయన శిష్యులు భక్తి గీతాలు పాడుతూ, జైన మతానికి మహావీరుడు చేసిన కృషిని స్తుతిస్తారు. ఆ తరువాత ఆయన విగ్రహానికి ఆచార స్నానం లేదా అభిషేకం చేస్తారు. ఇది శుద్ధి,  పునరుద్ధరణను సూచిస్తుంది. ఈ ఆచారాలతో పాటు భక్తులు దానధర్మాలు చేయడంలో కూడా ముందుంటారు. ఇది మహావీరుడు తన కరుణను సమాజానికి తిరిగి ఇవ్వడంపై ఆయనకున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.   ప్రజలు మహావీరుడి  దేవాలయాలను కూడా సందర్శిస్తారు. ప్రార్థనలలో పాల్గొంటారు.  ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోరుకుంటారు. పూజారులు,  మత  నాయకులు ధర్మం,  స్వీయ-క్రమశిక్షణ మార్గంలో దృష్టి సారించే జైనమత సూత్రాలను ప్రోత్సహించడానికి బహిరంగ సమావేశాలు,  ఉపన్యాసాలను కూడా నిర్వహిస్తారు.                                       *రూపశ్రీ

tips on becoming more powerful

మీరు శక్తివంతమైన వ్యక్తులుగా మారాలి అనుకుంటున్నారా? ఈ పనులు మానేయండి..!

  శక్తివంతంగా ఉన్న వ్యక్తులు జీవితంలో ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోగలుగుతారు. ప్రతి ఒక్కరు శక్తివంతంగా ఉండాలని, తమ జీవితాన్ని గొప్పగా అభివృద్ది చేసుకోవాలని, ఇతరుల మీద ఆధారపడటం, సొంతంగా ఏ పని చేయలేకపోవడం,  ప్రతి దానికి సందేహించడం వంటి సమస్యలను అధిగమించాలని అనుకుంటూ ఉంటారు.  అయితే వీటిని అధిగమించడం అంత సులువు కాదు.  కానీ కొన్ని పనులను మానేయం ద్వారా జీవితంలో శక్తివంతంగా మారవచ్చు. ఇలా మారితే గనుక జీవితం మరొక స్థాయికి వెళుతుంది.  అందరూ మీరు శక్తివంతమైన వారని,  గొప్పవారని తప్పకుండా ఒప్పేసుకుంటారు.  ఇందుకోసం ఏ పనులు మానేయాలో తెలుసుకుంటే.. ఆలోచన.. ఆలోచన అందరికి ఉంటుంది.  అయితే ఆ ఆలోచనకు కూడా ఒక పరిధి ఉంటుంది.   ఆలోచించాల్సిన విషయాల గురించి ఆలోచిస్తే పర్వాలేదు. కానీ చిన్న చిన్న విషయాలను కూడా కొందరు అతిగా ఆలోచిస్తారు.  ఈ కారణం వల్ల చాలా వరకు ఆందోళన పెరుగుతుంది.  అందుకే చిన్న విషయాలకు ఆలోచించడం,  అతిగా ఆలోచించడం మానేయాలి. ఇతరులు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఎవరో ఒకరు ప్రధాన పాత్ర పోషిస్తారు. అయితే ఇతరుల మీద ఎక్కువ ఆశ పెట్టుకోవడం మంచిది కాదు.  ఏ విషయంలో అయినా సరే.. ఇతరుల మీద ఆశ, నమ్మకం పెట్టుకుని ఉంటారో.. అలాంటి వారికి నిరాశ ఎదురవుతుంది. అందుకే ఎవరి మీద ఆశ పెట్టుకోకూడదు. మాట్లాడటం.. మాట్లాడటం ఒక కళ అంటారు.  అయితే అందరితో ఒకే విధంగా మాట్లాడటం సరైనది కాదు.. పరిస్థితి బట్టి,  విషయాన్ని బట్టి మాట్లాడే విధానం వేరుగా ఉండాలి. ఎవరి దగ్గర ఏ విషయాన్ని మాట్లాడాలి? ఏ విషయాన్ని మాట్లాడకూడదు అనేది తెలుసుకోవాలి. అలాగే ఎవరితో అంటే వారితో అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలి.  మాటలను చాలా పొదుపుగా వాడాలి. అప్పుడే హుందాగా ఉంటారు. సరదా.. కొందరికి సరదాగా ఉండటం అలవాటుగా ఉంటుంది. అయితే అందరితో ఇలా సరదాగా ఉండటం కుదరదు.  ఎందుకంటే అందరూ ఈ సరదా తనాన్ని ఇష్టపడరు. అంతేకాదు.. ఇలా సరదాగా మాట్లాడటాన్ని కొందరు అవమానంగా చూస్తారు.  అందుకే అందరితో సరదా పనికిరాదు. వస్త్రధారణ.. వేసుకునే దుస్తులు,  తయారయ్యే విధానం కూడా చాలా సార్లు వ్యక్తులను హుందాగా,  గౌరవంగా నించోబెడుతుంది. అందుకే మనిషి వ్యక్తిత్వం ముఖ్యం,  దుస్తులది ఏముందిలే లాంటి డైలాగులు కట్టిపెట్టి చక్కగా రెడీ అవ్వాలి. ప్రాధాన్యత.. ఇతరులకు ప్రాధాన్యత ఇస్తూ ఇతరుల కోసం సమయాన్ని అడ్జెస్ట్ చేసుకునే వారిని చూసి ఉంటారు. కానీ అది తప్పు. ఎప్పుడూ ఇదే అలవాటు మంచిది కాదు.  తమను తాము పట్టించుకుంటూ, తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉంటే అప్పుడు ఇతరులు కూడా గౌరవిస్తారు,  మీ ప్రాధాన్యతను ఇతరులు గుర్తిస్తారు. అందుకే ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు.  మీ గురించి మీరు కేర్ తీసుకున్న తరువాతే ఇతరుల గురించి ఆలోచించాలి.                                               *రూపశ్రీ

Reasons Why Husbands And Wives Fight

ఫెమినిస్ట్ ల వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అవుతుందా?

   ఫెమినిస్ట్.. ఈ పదం ఎక్కడైనా కనిపించింది అంటే సమాజం దృష్టి మొత్తం అటువైపు సారిస్తుంది.  ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా సరే.. మహిళల వైపు వకల్తా పుచ్చుకుని మహిళల గురించి మాట్లాడేవారిని ఫెమినిస్ట్ లు అని అంటుంటారు.  ఫెమినిస్ట్ లు ఎక్కువగా మహిళలు మగాళ్ల కంటే ఎందులోనూ తక్కువ కాదు కదా అనే ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు.  ఫెమినిస్ట్ ల వల్ల చాలా వరకు మహిళల  జీవితాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.  ముఖ్యంగా వివాహ విషయంలో ఫెమినిస్ట్ ల వల్ల మహిళలకు కూడా ప్రాధాన్యత ఏర్పడింది.  ఒకప్పుడు ఆడపిల్ల అభిప్రాయంతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. అబ్బాయి ఇష్టా ఇష్టాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారో అమ్మాయి ఇష్టాఇష్టాలను అదే విధంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. మహిళల సమానత్వం గురించి మాట్లాడే స్త్రీ వాదుల వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది  ఎందుకంటే ఇలా సమానత్వం అనే విషయం గురించి మాట్లాడటం వల్ల భార్యాభర్తల మధ్య విడాకులకు దారి తీస్తున్నాయని కొందరు వాపోతున్నారు. దీని  గురించి తెలుసుకుంటే.. స్త్రీ వాదం.. స్త్రీ వాదం అనేది స్పష్టంగా స్త్రీని సమర్థిస్తూ,  స్త్రీ హక్కుల గురించి, స్త్రీ పురుషుల సమానత్వం గురించి మాట్లాడే విషయం.  స్త్రీ వాదంలో పేర్కొనే స్త్రీ పురుష సమానత్వ భావన  స్త్రీ కి సమాజంలోనూ,  ఇంటా,  బయటా గౌరవాన్ని, స్త్రీ గతి శీలతను మార్చి వేసింది అని చెప్పవచ్చు. స్త్రీ వాదం ఎప్పుడూ స్త్రీని వెనుకబడిన వ్యక్తిగా కాకుండా సమాజంతో పాటు అభివృద్ది సాధించే వ్యక్తిగా మారుస్తుంది.  వివాహ మార్పు.. స్త్రీ వాదం వల్ల వివాహ విషయాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికాలంలో వివాహం చేసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం తొందరగా విడాకులకు దారి తీస్తున్నాయి. ఇందులో స్త్రీ వాదుల ప్రమేయమే ఎక్కువ కారణం అని కొందరి వాదన. అయితే భార్యాభర్తలు ఇద్దరూ చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కేవలం పురుషుడు మాత్రమే అధికుడు అనే భావనతో ఉండటం సమంజసమైన విషయం కాదు.  స్త్రీ,  పురుషులు సమానం అని అంగీకరించినప్పుడు ఆ ఇద్దరి బందం ఎంతో ఆరోగ్యకరంగా సాగుతుంది. లింగ సమానత్వం అనేది బంధాల మీద ప్రబావం చూపినా అది భార్యాభర్తలను ఒక్కటిగా ఉంచేదే. అయితే ఈ లింగ సమానత్వాన్ని అంగీకరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. బాధ్యతలు.. ఇప్పటికాలంలో ఇంటి బాధ్యతల విషయానికి వస్తే ఆర్థిక విషయాలు అయినా ఇతరాలు అయినా మగవాడితో సమానంగా ఆడవారు కూడా బాధ్యతలు మోస్తున్నారు.  లింగ సమానత్వం పరంగా చూస్తే ఆడవారు కూడా బాధ్యతలు పంచుకుంటారు. దీని వల్ల భార్యాభర్తలు ఇద్దరి మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది.  ఇది ఆరోగ్య పరంగా అయినా,  కుటుంబ పరంగా అయినా మంచి మార్పుకు నాందిగా మారుతుంది. స్త్రీ వాదం కారణంగా బంధాల మధ్య బాధ్యతల విషయంలో ఎలాంటి సమస్యలు రావు కానీ భావోద్వేగాల విషయంలో మాత్రం మార్పులు ఉంటాయి. ప్రాధాన్యత.. స్త్రీ వాదులు లింగ సమానత్వాన్ని పేర్కొన్నప్పుడు  కుటుంబంలో మహిళలకు కూడా తమ అభిప్రాయాలు,  ఆలోచనలు వ్యక్త పరిచే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఇద్దరి మధ్య కూడా సమ ప్రాధాన్యత ఏర్పడుతుంది.  ఒకరు ఎక్కువ,  ఒకరు తక్కువ అనే భావన లేనంత వరకు ఏ బంధం అయినా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ప్రేమను,  నమ్మకాన్ని,  గౌరవాన్ని కలిగి ఉంటారు. నిర్ణయాలు.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల మీద ఇద్దరూ బాధ్యత కలిగి ఉంటారు. అలాగే ఇద్దరూ నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంబంధిత విషయంలో ఇద్దరూ సమత్వ భావన కలిగి ఉంటారు. ఇది భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహనను పెంచుతుంది. వివాహం,  సక్సెస్ మంత్రం.. వివాహం చేసుకోవడం తేలిక.. కానీ ఆ వివాహ బంధం సక్సెస్ కావడం కష్టం.  ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ సమత్వ భావనతో లేనప్పుడు చాలా మనస్పర్థలు, గొడవలు ఏర్పడతాయి. అదే భార్యను కూడా భర్త గౌరవిస్తే.. ఇద్దరూ సమానమే అనే భావనతో ఉంటే ఆ బంధం చాలా వరకు ఆరోగ్యకరంగా ఉంటుంది. కుటుంబ పరంగా అయినా, కెరీర్ పరంగా అయినా,  ఆర్థిక విషయాలు అయినా,  పిల్లల పెంపకం అయినా.. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సమ ప్రాధాన్యత ఇచ్చుకోవడం వల్ల వివాహ బంధం సక్సెస్ అవుతుంది. స్త్రీ వాదం అనేది మహిళలకు సమ ప్రాధాన్యత ఇచ్చినా, దాన్ని అంగీకరించినప్పుడు   అది వివాహ బంధాన్ని  సూపర్ సక్సెస్ చేస్తుంది.  అలా కాకుండా స్త్రీ  ని వివక్షతో చూస్తే ఆ బంధం తొందరగా బీటలు వారుతుంది.                                    *రూపశ్రీ.

World Health Day

ఆరోగ్యమే జీవితానికి  రక్ష.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..!

జీవితంలోని ప్రతి అంశం ఆరోగ్యం కారణంగా ప్రభావితమవుతుంది, దీర్ఘాయువు ఉన్నప్పుడు  ఆనందం,  సంతోషం కూడా ఉంటాయి. ప్రస్తుత కాలంలో మనిషి ఆరోగ్యం  అనే విషయం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు కూడా చాలా ముఖ్యం.  వివిధ వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు నేటి కాలంలో చాలా పెరుగుతున్నాయి.  ఈ వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తూ,  ఆరోగ్య సమస్యలకు తగిన చర్యలు తీసుకోవడం పట్ల అప్రమత్తంగా ఉండటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడూ కీలకంగా ఉంటుంది.    ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ ఆరోగ్య దినోత్సవం ఎలా ఏర్పాటైందో.. దీని ఉద్దేశాలు ఏంటో తెలుసుకుంటే..  1950 లో ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు  "ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు" అనే థీమ్ ను ఏర్పాటు చేశారు.  మరణాలను అడ్డుకోవడానికి,  తల్లులు,  నవజాత శిశువుల ఆరోగ్యం దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండటానికి,  తల్లి బిడ్జల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే కార్యక్రమాలు నిర్వహించడానికి,  దీనికి తగిన నిధుల ఏర్పాటుకు పిలుపునిస్తోంది. ఇదీ చరిత్ర.. 1948లో మొదటి ఆరోగ్య సభలో ప్రారంభమైనప్పటి నుండి,  1950లో అమల్లోకి వచ్చినప్పటి నుండి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన ప్రాధాన్యతను  ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నారు.  ప్రభుత్వ జోక్యం లేకుండా స్వయంప్రతిపత్తితో పనిచేయడానికి,  ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.   ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపన జ్ఞాపకార్థం ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించారు.   గత 50 సంవత్సరాలుగా ఇది మానసిక ఆరోగ్యం, తల్లి,  శిశు సంరక్షణ,  వాతావరణ మార్పు వంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను వెలుగులోకి తెచ్చింది. ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి అందరినీ ఒక్కటి చేయడం,  అవగాహన పెంచడం దీని లక్ష్యాలు. ఇటీవలి కాలంలో మానసిక ఆరోగ్యం,  మాతా శిశు ఆరోగ్యం,  వాతావరణ మార్పులు,  వివిధ ఆరోగ్య పరిస్థితులు,  వ్యాధులు మొదలైన వాటి గురించి కార్యాచరణ పెరిగింది.  ఆరోగ్యమే జీవితానికి రక్ష అని అంటారు.  ఆ ఆరోగ్యం అందరికీ లభించాలని,   ఆరోగ్య సౌకర్యాలు అభివృద్ది చెంది అందరికీ అందుబాటులోకి రావాలని ఈ రోజు కృషి చేస్తుంది.  మనషి తన చేతిలో ఉన్నంత వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిది.                                    *రూపశ్రీ.

Sri Rama Vaibhavam

 శ్రీరామ వైభవం!

రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           

Babu Jagjivan Ram special story

అంటరాని వారి అభ్యున్నతికి జీవితాన్ని ధారపోసిన బూబు జగ్జీవన్ రామ్..!

  బాబు జగ్జీవన్ రామ్ చాలా తక్కువ మందికి తెలిసిన వ్యక్తి.  విద్యార్థులను,  యువతను ప్రశ్నిస్తే ఈయన గురించి చెప్పేవారు తక్కువ. కానీ ఈయన తన జీవితాన్ని అంటరాని వారి అభ్యున్నతి కోసం అంకితం చేశారు.  అంటరానివారికి సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ అయిన ఆల్-ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనకు  దోహదపడ్డారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ  తేదీన బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజును చాలా గొప్పగా జరుపుకుంటారు.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని సెలవు దినంగా కూడా పరిగణిస్తారు.  ఈ సందర్భంగా  బాబు జగ్జీవన్ రామ్ గురించి తెలుసుకుంటే.. జగ్జీవన్ రామ్ ను బాబూజీ అని పిలుచుకుంటారు.  ఈయన  1908 ఏప్రిల్ 5న బీహార్‌లోని 'అంటరాని' కులంలో జన్మించాడు. ఈయన జన్మించినది సామాన్య రైతు కుటుంబంలోనే. ఈయనకు ఒక అన్న,  ముగ్గురు చెల్లెళ్లు ఉండేవారు.   ఈయన తన బాల్యంలో,  విద్యాభ్యాసం కొనసాగిస్తున్న రోజుల్లో  కూడా షెడ్యూల్డ్ కులాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడాలనే తన కోరికను వ్యక్తం చేసేవాడు. బాబూ జగ్జీవన్ రామ్ అడుగడుగునా వివక్షణ ఎదుర్కొన్నాడు.  అయినప్పటికీ ఆ వివక్షలను లెక్క  చేయకుండా చదువులో రాణించాడు.  1931 లో సైన్స్ లో డిగ్రీ పొందాడు.  అయినప్పటికీ ఆయనకు  సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి ఉండేది. ఎప్పుడూ అంటరాని వారికి సమానత్వం సాధించే విషయం గురించి ఆలోచించేవాడు.  ఈయనలో ఉన్న ఈ తపనను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరిశీలించాడు.  ఈ కారణంగా బాబు జగ్జీవన్ రామ్  నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిని ఆకర్షించి అతన్ని రాజకీయ జీవితంలోకి ఆకర్షించేలా చేసింది. నిజానికి, బాబు జగ్జీవన్ రామ్ 1936 నుండి 1986 వరకు 50 సంవత్సరాలు నిరంతరాయంగా పార్లమెంటేరియన్‌గా ఉన్నారు.  ఇది ప్రపంచ రికార్డును  నమోదు చేసింది. బాబు జగ్జీవన్ రామ్ జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలోని మొదటి క్యాబినెట్‌లో సభ్యుడు.  అంతేకాదు ఈ క్యాబినెట్ లో ఆయన  అతి పిన్న వయస్కుడైన మంత్రిగా,   భారత రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఉండేవారు. ఆయన ఉన్నత పదవులకు వెళ్లి రక్షణ మంత్రిగా (1970 - 1974),  ఉప ప్రధాన మంత్రిగా (1977 - 1979) కూడా పనిచేశారు. ఆయన 1986లో మరణించారు.  ఆయన మరణించే వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు.                                   *రూపశ్రీ.

chanakya about women power

చాణక్యుడు వందల సంవత్సరాల కిందటే స్త్రీల గురించి ఈ నిజాలు చెప్పేశాడు..!

  ఈ సమాజంలో స్త్రీల పాత్ర చాలా కీలకమైనది.  స్త్రీలు జ్ఞానానికి, విజ్ఞాన శాస్త్రానికి ఆధారం అని చెబుతారు. ప్రాచీన గ్రంథాలలో కూడా స్త్రీల పాత్ర,  స్త్రీల గుణగణాలు ఎంతో గొప్పగా ప్రస్తావించబడ్డాయి.  ఆచార్య చాణక్యుడు వందల సంవత్సరాల కిందటే తన నీతి శాస్త్ర గ్రంథంలో  స్త్రీల గురించి కొన్ని నిజాలను స్పష్టంగా చెప్పాడు.  పండితుడు,  దౌత్యవేత్త,  ఆర్థికవేత్త,  రాజకీయ వేత్త,  మంచి  సలహాదారుడు అయిన చాణక్యుడు స్త్రీల గురించి చెప్పిన విషయాలేంటో తెలుసుకుంటే.. ధైర్యానికి ప్రతిరూపం.. చాణక్య నీతి ప్రకారం స్త్రీకి అపారమైన శక్తి ఉంటుంది. సంక్షోభ సమయంలో తన భర్త, పిల్లలు, కుటుంబం,  వంశాన్ని రక్షించే స్త్రీని ఉత్తమురాలు అంటారు. అలాంటి మహిళలు సమాజానికి, దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తారు.  దేశాభివృద్ధికి తమ ప్రత్యేక సహకారాన్ని అందిస్తారు. చాలా మందికి తెలియదు.. కొందరైతే ఒప్పుకోరు.. కానీ స్త్రీలు రెట్టింపు ఆహారం తింటారు.  అలాగే  వారి వినయం నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట.   చైవ కామశ్చాష్టగుణం: స్మృత: ॥ అని చాణక్యుడు అన్నాడు. పురుషుల కంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువ ఆకలి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.  సిగ్గు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట. ధైర్యం ఆరు రెట్లు ఎక్కువ ఉంటుంది.  కామం ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటుంది. స్త్రీల గురించి ఆచార్య చాణక్యుడు మాట్లాడుతూ..  స్త్రీ ఎప్పుడూ మధురమైన మాటలు మాట్లాడాలని చెబుతాడు. ఆధునిక వాతావరణంలో, మహిళలు మాట్లాడే భాష క్షీణించింది. దీని కారణంగా సమాజం ప్రభావితమవుతోంది. స్త్రీ ఎప్పుడూ దుర్భాషను ఉపయోగించకూడదని చాణక్యుడు అన్నాడు. దుర్భాషలాడే స్త్రీల గురించి చెబుతూ.. ఈ  అలవాటు ఉన్న స్త్రీల జీవితాలు సమస్యలతో నిండి ఉంటాయి అని అన్నాడు. వైవాహిక జీవితంలో ఉత్సాహం  లోపిస్తుందట. అలాంటి స్త్రీలు ఒత్తిడితోనూ,  వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారని చాణక్యుడు చెప్పాడు. తప్పుడు భాష మాట్లాడటం వల్ల ఆలోచనలలో స్వచ్ఛత తగ్గిపోతుందట. ఆలోచనలు స్వచ్ఛంగా లేకపోవడం వల్ల అది మనస్సు,  మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా సమయం వచ్చినప్పుడు, ఒక స్త్రీ తన నైపుణ్యాలను,  బలాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. ఈ పరిస్థితిలో న్యూనతా భావన,  ఒత్తిడి పెరుగుతుంది. ఇది తరువాత అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని చాణక్యుడు చెప్పాడు.                                                   *రూపశ్రీ

పచ్చదనానికి ప్రాణం పోస్తున్నాడు.. 83 ఏళ్ల వయసులో ఓ తాత చేస్తున్నాడంటే..!

పచ్చదనం అంటే ఆ  తాతకు ప్రాణం.. ఇంతకీ ఎవరు ఈ తాత అంటే.. ఆయన పేరు సూర్యనారాయణ్..  తన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ఆయనకు చాలా ఇష్టం.  ఆ ఇష్టమే ఆయనను ఒక సంకల్పానికి సిద్దం చేసింది. బెంగళూరు నివాసి అయిన ఈ పచ్చదనపు ప్రేమికుడు తనకు ఉన్న పరిశుభ్రతను చాలా సీరియస్ గా తీసుకున్నారు.  ఎంతగా అంటే తను నివసించే పరిసర ప్రాంతాలను చీపురు పట్టుకుని మరీ శుభ్రం చేసే అంత.  పచ్చదనానికి ప్రాణం పోస్తున్న ఆ తాత గురించి తెలుసుకుంటే.. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ 60 ఏళ్లు నుండి 62 ఏళ్లకు రిటైర్ అయిపోతారు.  65 ఏళ్లు దాటాయంటే ఇంటి పట్టున ఉంటూ భార్యా లేదా కోడలు వండిపెడుతుంటే తింటూ కృష్ణా, రామ అంటూ కాలక్షేపం చేస్తుంటారు.  మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ  సంతోషాన్ని,  జ్ఞాపకాలను పోగేసుకుంటూ ఉంటారు.  కానీ  బెంగళూరుకు చెందిన 83ఏళ్ల సూర్యనారాయణ్ మాత్రం అందుకు భిన్నం.  ఈయన మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. 60ఏళ్ల వయసులో రిటైర్ అయిన ఈయన 24ఏళ్ల నుండి తనకు ఎంతో ఇష్టమైన పరిశుభ్రతను తను నివసించే ప్రాంతాలకు  అంతా వ్యాప్తం చేస్తున్నాడు. ఈయన దగ్గరుండి ఎవరితోనూ పనులు చేయించట్లేదు.  స్వయంగా తానే చీపురు పట్టి వీధులు ఊడుస్తున్నాడు.  ప్రతి ఉదయం వీధులు ఊడ్చి శుభ్రం చేస్తాడు.  శుభ్రమైన మురుగు కాలువలు,  పచ్చదనం,  చెత్త ప్రదేశాలను మచ్చలేని ప్రదేశాలుగా శుభ్రంగా మార్చేస్తుంటాడు. సూర్యనారాయణ్ గారు  రైతు కుటుంబంలో జన్మించారు.  ఆయనకు చెట్లు నాటడం అంటే చెప్పలేనంత ఇష్టం.  వాటిని సంరక్షించడం ఆయన బాధ్యతగా భావించేవాడు. చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి,  ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడే వయస్సులో, సూర్యనారాయణ్ ప్రతిరోజూ చేతిలో చీపురు పట్టుకుని తన పనిని కొనసాగిస్తూ కనిపిస్తాడు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ తాత కృషి మరింత పెరుగుతుంది. 2001 నుండి వర్షాకాలంలో కూడా అవిశ్రాంతంగా వీధులు ఊడ్చడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం,  ఎండిన ఆకులను కంపోస్ట్ చేయడం చేస్తున్నాడు. వర్షాకాలంలో పేరుకుపోయిన బురదను తొలగించడానికి, డ్రైనేజీ పొంగిపోకుండా నిరోధించడానికి  అదనపు కృషి చేస్తున్నాడు. తను చేసే పనిని చాలా అంకిత భావంతో చేస్తాడు.  సంవత్సరాల నుండి  తను చేస్తున్న పని మధ్యలో గాయాలు అయినా సరే వెనకడుగు వేయడం లేదు.  తన భార్య మద్దతు ఉండటంతో తాను చేసే పని చిన్నది పెద్దది అనే తేడా లేకుండా మనసు పెట్టి చేయగలుగుతున్నానని, తనకు ఆ పని చేయడం ఇష్టం కాబట్టే చేస్తున్నానని ఎంతో సంతోషంగా అంటున్నాడు.   ఈ స్వచ్చంద సేవకుడికి లాల్ సలాం చెప్పాల్సిందే..!                          *రూపశ్రీ.

ఛత్రపతి శివాజీ మహరాజ్ ను భారత నావికాదళ పితామహుడు అని ఎందుకు అంటారంటే..!

  శత్రువుల మనస్సుల్లో భయాన్ని రేకెత్తించిన నిష్ణాతుడైన వ్యూహకర్త, ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని,  మరాఠా నావికాదళాన్ని స్థాపించిన దార్శనిక నాయకుడు. యూరోపియన్ శక్తులు సముద్రాలను నియంత్రించే సమయంలో, శివాజీ స్వావలంబన నావికా దళానికి ఒక మార్గాన్ని రూపొందించాడు, 'భారత నావికాదళ పితామహుడు' అనే బిరుదును పొందాడు. డిసెంబర్ 4న నేవీ దినోత్సవం సందర్భంగా, శివాజీని భారత నావికాదళ మార్గదర్శకుడిగా కూడా గౌరవిస్తారు. భారతదేశంలో నేవీ ఇంత దృఢంగా రూపుదిద్దుకొన్నది అన్నా.. భారత నావికాదళ విభాగంలో ఓ గుర్తింపును తెచ్చుకోగలిగి దేశానికి రక్షణ కల్పిస్తోందన్నా అదంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ చలువే.. భారత నావికాదళ పితామహుడు అని ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఎందుకు గౌరవిస్తారో తెలుసుకుంటే.. దూరదృష్టి గల నాయకత్వం,  నావికా వ్యూహం రాబోయే కాలంలో యుద్దాల  ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన గొప్ప దార్శనికత విప్లవాత్మకమైనది. భవిష్యత్తులో యుద్ధం తీరప్రాంతాలు,  అరేబియా సముద్రాల వెంబడి ఉంటుందని శివాజీ అర్థం చేసుకున్నాడు. ఈ కారణంగా పోర్చుగీస్ కు  తన రాజ్యానికి ఉమ్మడిగా ఉన్న సిద్ధిల నుండి వచ్చే సాధారణ ముప్పుల నుండి భారతదేశ పశ్చిమ సముద్ర తీరాన్ని కాపాడటం కోసం కసరత్తులు చేశాడు. శివాజీ నావికా దళాల వ్యవస్థీకరణ సర్వతోముఖంగా,  పూర్తిగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. నావికాదళం వేగవంతమైన,  బలమైన నౌకాదళాన్ని సృష్టించడం, నావికాదళానికి సురక్షితమైన లంగరులను అందించడం, వాటిని సరఫరా చేయడం, రక్షించడం, మొదలైనవి  దాడి జరిగినప్పుడు ఎదుర్కోవడంలో  శిక్షణ పొందిన నావికాదళాన్ని రూపొందించగలిగింది. ఇక్కడి నుండే శివాజీ వ్యూహాత్మక దృష్టి భారత నావికాదళం   ను అభివృద్ధి చేయడమే అంతిమం లక్ష్యం అయ్యింది.   బలమైన నావికా దళాన్ని నిర్మించడం శివాజీ మహారాజ్ సాధించిన అత్యంత ముఖ్యమైన విజయం శక్తివంతమైన నావికా దళాన్ని నిర్మించడం. చాలా  రకాల యుద్ధనౌకలను నిర్మించడానికి, వాటిని సమర్థవంతంగా  నిలబెట్టుకోవడానికి చాలా ఖర్చులు చేశాడు. ఈ నౌకాదళంలో వివిధ రకాల నౌకలు ఉన్నాయి.  వాటిలో ముఖ్యమైనవి.. గల్లివాట్స్: వేగవంతమైన దాడులు చేయడానికి,  నిఘా సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించే ఓడలు.  ఇవి సాధారణంగా చాలా భారీగా నిర్మించబడతాయి గురాబ్స్: సముద్రంలో పెద్ద యుద్ధాలలో ఉపయోగించే తుపాకీతో కూడిన రెండవ పెద్ద ఓడలు. శివాజీ తన నౌకాదళానికి బలమైన ఓడల ప్రాముఖ్యతను సరిగ్గా అర్థం చేసుకున్నాడు.  అందువల్ల అతను తన దగ్గర ఉన్న నైపుణ్యం గల శిల్పులతో అధిక నాణ్యత గల కలపతో ఓడలను నిర్మించమని ఆదేశించాడు.  పదిహేడవ శతాబ్దంలో ఓడల తయారీకి అత్యంత సమకాలీన పద్ధతులను అనుసరించాడు.  దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రొఫెషనల్ షిప్‌బిల్డర్లను,  సిద్దీలు,  పోర్చుగీసులను ఉపయోగించి  ఉత్తమ నౌకాదళాన్ని అందించాడు. శివాజీ ఆధ్వర్యంలో స్థాపించబడిన కేంద్రీకృత నావికా దళం ప్రపంచంలోని ఆధిపత్య యూరోపియన్ శక్తులతో సమర్థవంతంగా పోటీపడేది. కీలకమైన నావికా స్థావరాలను ఏర్పాటు చేయడం సురక్షితమైన,  బాగా ప్రణాళికాబద్ధమైన నావికా నౌకాశ్రయాల అవసరాన్ని గ్రహించిన శివాజీ కొంకణ్ తీరంలో అనేక కోటలు,  ఓడరేవులను అభివృద్ధి చేశాడు . వీటిలో సింధుదుర్గ్, విజయదుర్గ్ & కొలాబా నావికా కోటలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ కోటలు బాగా నిర్మించబడ్డాయి,  సరఫరా, మరమ్మతు దుకాణాలు,  సిద్ధంగా ఉన్న రక్షణ యంత్రాలు కలిగి ఉండేలా ఏర్పాటు అయ్యాయి. మాల్వన్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక ద్వీపంలో నిర్మించిన సింధుదుర్గ్ కోట, శివాజీ నావికా దళం బలానికి నిదర్శనం. కోట ఉన్న ప్రదేశం ద్వారా, మరాఠా నావికాదళం పశ్చిమ తీరం వెంబడి సముద్రంలో ఇతర కార్యకలాపాలను తనిఖీ చేయడానికి,  నియంత్రించడానికి మంచి స్థితిలో ఉండేది. ఈ నావికా స్థావరాలు మరాఠా నావికాదళం  నిరంతర పనితీరుకు మద్దతు ఇచ్చినందున అవి ముఖ్యమైన సరఫరా డిపోలు,  స్టేజింగ్ పాయింట్లుగా ఉండేవి. శిక్షణ,  ఆవిష్కరణలు.. శివాజీ మహారాజ్ తన నావికా దళాల కసరత్తులు,  విన్యాసాల గురించి చాలా శ్రద్ధ వహించాడు. తన నావికులు,  నావికా అధికారులు సముద్ర పోరాటం, నావికా ధోరణి,  ఓడ సంరక్షణను అర్థం చేసుకునేలా ఆయన కఠినమైన వృత్తి శిక్షణను ఏర్పాటు చేశాడు. శిక్షణ,  నైపుణ్య అభివృద్ధిపై ఈ దృష్టి వృత్తిపరమైన,  సమర్థవంతమైన నావికాదళాన్ని నిర్మించడంలో పాత్ర పోషించింది. శివాజీ నావికా కార్యకలాపాలలో అతనికి ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టిన మరో అంశం ఆవిష్కరణ. సముద్రంలో మారుతున్న యుద్ధ స్వభావానికి అనుగుణంగా అధునాతన సాధనాలను అభివృద్ధి చేయాలని,  వ్యూహాత్మక ఆలోచనలను ఉపయోగించాలని ఆయన కోరారు. ఛత్రపతి శివాజీ మహారాజ్.. పూణేలోని జాగీర్‌ను మొదటిసారిగా చేపట్టి స్వతంత్ర మరాఠా పాలనను స్థాపించే ప్రయత్నం ప్రారంభించినప్పుడు శివాజీ వయసు కేవలం పదహారు సంవత్సరాలు . శివాజీకి వేగం, ఆశ్చర్యం వంటి గెరిల్లా యుద్ధ వ్యూహాలు ఉన్నాయి , అందుకే శివాజీని " పర్వత ఎలుక" అని పిలుస్తారు. అతని వ్యూహాలు అతను తన స్థానాన్ని నిలబెట్టుకుని, మొఘల్ సామ్రాజ్యం మరియు ఇతర ప్రత్యర్థులతో సహా వారి సంఖ్య,  సైన్యంతో సంబంధం లేకుండా శత్రువులను ఓడించగలిగాడు. శివాజీ నావికా దళంలో ఆ కాలానికే ఇంత కృషి చేసినందుకే.. ఈయనను భారతీయ నావికాదళ పితామహుడు అని అంటారు.                                               *రూపశ్రీ.  

వేసవి కదా అని ఫ్రిజ్ లో నీళ్లు తాగుతున్నారా? జరిగేది ఇదే..!

వేసవికాలం మొదలవగానే చాలా ఇళ్లలో ఫ్రిజ్ లో వాటర్ బాటిల్స్ నింపి పెట్టేస్తారు.  ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. బయటి నుండి రాగానే చల్లని నీరు తనివితీరా తాగితే తప్ప శరీరానికి ఉపశమనం, మనసుకు హాయి అనిపించవు. అయితే చాలామంది ఫ్రిజ్ నీరు తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని అనుకుంటారు. అందుకే మేం ఫ్రిజ్ వాటర్ తాగము అని చెబుతూ ఉంటారు. నిజంగా ఫ్రిజ్ వాటర్ తాగితే ఆరోగ్యం పాడవుతుందా? వేసవి కాలంలో సాధారణ నీరు ఎంత తాగినా దాహం తీరినట్టు అనిపించదు.  అలాంటప్పుడు ఫ్రిజ్ నీరు తాగడమే బెటర్ అనుకుంటారు చాలా మంది.  మరి ఫ్రిజ్ లో చల్లని నీరు చేసే చేటు ఏంటి? ఆరోగ్య నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. ఫ్రిజ్ నుండి చల్లని నీరు తాగితే ఈ వేసవి వేడికి దాహం తీరినట్టు అనిపిస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ చల్లని నీరు తాగడం వల్ల జీవక్రియ మందగిస్తుంది.  ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. గోరు వెచ్చని నీరు, సాధారణ నీరు,ఫ్రిజ్ లోని చల్లని నీరు.. ఈ మూడింటిని పరిశీలిస్తే.. గోరు వెచ్చని నీరు చాలా తొందరగా జీర్ణం అవుతుంది.  అదే సాధారణ నీరు జీర్ణం కావడానికి సగటు సమయం పడుతుంది. కానీ ఫ్రిజ్ లోని చల్లని నీరు తాగితే మాత్రం అవి జీర్ణం కావడం చాలా ఆలస్యం. ఫ్రిజ్ నీళ్ళు తాగే వారిలో జీవక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ కారణంగా బరువు తగ్గడం కష్టమవుతుంది.  బరువు తగ్గాలని అనుకునే వారు ఫ్రిజ్ లో నీరు తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల శరీరంలో మలబద్దకం రావచ్చు.   ఫ్రిజ్ లో చల్లని నీరు తాగడం వల్ల మైగ్రైన్ వచ్చేప్రమాదం పెరుగుతుంది.  ఇది తలనొప్పి సమస్యను పెంచుతుంది.  ఇప్పటికే మైగ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడేవారు చల్లని నీరుకు దూరంగా ఉండాలి. ఒక వేళ ఈ వేసవిలో చల్లని నీరు తాగాలి అనిపిస్తే ఫ్రిజ్ లో నీటికి బదులుగా కుండలో నీరు తాగవచ్చు.                                  *రూపశ్రీ.

మరాఠా యోధుడు.. ఛత్రపతి శివాజీ వర్థంతి..!

    ఛత్రపతి అనే పేరు వెంటే చాలు.. శివాజీ మహారాజ్ గుర్తుకు వస్తాడు. మరాఠా సామ్రాజ్యానికి వన్నె తెచ్చిన వాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు కూడా ఈయనే. 17వ శతాబ్దపు భారతీయ యోధులలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా ప్రముఖమైన వారు.  శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ఛత్రపతి మహారాజ్ 1680 సంవత్సరం,  ఏప్రిల్ 3వ తేదీన మరణించారు.  2025 ఏప్రిల్ 3వ తేదీ అయిన ఈ రోజు గురువారం నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 345వ వర్థంతి జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు,  ఆయన మరణానికి దారి తీసిన సంఘటనల గురించి తెలుసుకుంటే.. శివాజీ భోంస్లే (1630-1680 CE) గా జన్మించిన ఆయన ఈ సంవత్సరం  ఫిబ్రవరి 18న ఆయన 395వ జయంతిని జరుపుకున్నారు  ఈరోజు ఆయన 345వ వర్ధంతిని జరుపుకుంటున్నాము.  1680, ఏప్రిల్ 3న, శివాజీ మహారాజ్ అనారోగ్య సమస్యల కారణంగా, తీవ్రమైన జ్వరం,  విరేచనాలతో బాధపడుతూ రాయ్‌గడ్ కోటలో మరణించారని చరిత్ర చెబుతోంది. ఈ రోజున, మహారాష్ట్రతో పాటు  ఇతర ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు,  నివాళుల ద్వారా శివాజీ మహారాజ్  వారసత్వాన్ని గౌరవిస్తున్నాయి.   శివాజీ మహారాజ్ గురించి చాలా మందికి తెలియని నిజాలు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19, 1630న పూణే జిల్లాలోని జున్నార్ సమీపంలోని శివనేరి కోటలో జన్మించారు. కొంతమంది శివుడి ప్రేరణగా ఈయనకు శివాజీ అని పెట్టారని చెబితే కొందరుపండితులు అతనికి స్థానిక దేవత అయిన శివాయ్ పేరు పెట్టారని చెబుతారు. శివాజీ మహారాజ్ స్వరాజ్యాన్ని స్థాపించడం ప్రారంభించాడు.  అతని లక్ష్యం సంస్కృతంలో ఉన్న తన రాజ  ముద్రలో స్పష్టంగా పేర్కొనబడింది. షాహాజీ కుమారుడు శివాజీ రాజ్యం చంద్రవంకలా పెరుగుతూనే ఉంటుందని,  ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆ ముద్ర హామీ ఇచ్చింది. స్వరాజ్యానికి పునాది వేయడానికి శివాజీ మహారాజ్  రాజ్‌గడ్, తోర్నా, కొండనా,  పురందర్ వంటి కోటలను స్వాధీనం చేసుకున్నాడు. 1656లో శివాజీ మహారాజ్ సతారా జిల్లాలోని జావాలిని స్వాధీనం చేసుకున్నాడు, ఇది వ్యూహాత్మక కారణాల వల్ల చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. తరువాత  రైరీని తన ఆధీనంలోకి తీసుకున్నాడు, తరువాత దీనిని రాయ్‌గడ్ అని పేరు మార్చారు. దీన్ని శివాజీ మహారాజ్ తన   రాజధానిగా మార్చుకున్నాడు. కొంకణ్ ప్రాంతంలోని మహులి, లోహగడ్, తుంగా, టికోనా, విసాపూర్, సోంగడ్, కర్నాల, తాలా,  ఘోసాల వంటి కోటలను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. శివాజీ మహారాజ్ అష్ట ప్రధాన మండల్‌ను ఏర్పాటు చేశాడు, ఇది ఎనిమిది మంది సలహాదారుల మండలి. వారు రాజకీయ,  ఇతర ముఖ్యమైన విషయాలలో శివాజీ మహారాజ్ కు  సహాయం చేసేవారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఓడరేవులు,  వ్యాపార నౌకలను రక్షించడానికి,  వాణిజ్యం,  కస్టమ్స్ నుండి డబ్బు సంపాదించడానికి ఒక నావికాదళాన్ని నిర్మించాడు. అతను 1665 లో తన మొదటి నావికా దండయాత్రను చేపట్టాడు. శివాజీ మహారాజ్ విద్యకు ఒక చిన్న బృందం బాధ్యత వహించింది. ఆ బృందం అతనికి చదవడం, రాయడం, గుర్రపు స్వారీ, యుద్ధ కళలు,  మతపరమైన అధ్యయనాలను నేర్పింది. సైనిక శిక్షణ కోసం అతనికి ప్రత్యేక బోధకుడు కూడా ఉండేవారు. జూన్ 6, 1674న, గగాభట్ అనే గౌరవనీయ పండితుడు అతనికి రాయ్‌గఢ్‌లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేశాడు. ప్రత్యేక నాణేలు తయారు చేయబడ్డాయి - హోన్ అనే బంగారు నాణెం,  శివరాయ్ అనే రాగి నాణెం - పురాణగాథ శ్రీ రాజా శివఛత్రపతి అని చెక్కబడి ఉన్నాయట.                                        *రూపశ్రీ.