భార్యాభర్తలు విడిపోవడానికి కారణమయ్యే మిస్టేక్స్ ఇవీ..  మీరు ఈ తప్పులు చేస్తారేమో జాగ్రత్త..!

  వివాహం అనేది ఇద్దరు వ్యక్తులు జీవితాంతం కలిసి ఉండాలనే చేసుకుంటారు.  కానీ దురదృష్టం కొద్ది పెళ్ళి చేసుకున్న జంటలు అన్నీ కలిసి ఉండటం జరగదు. కుటుంబ కారణాలు కావచ్చు, వ్యక్తిగత కారణాలు కావచ్చు, వేరే ఇతర కారణాలు కూడా కావచ్చు.  నేటికాలంలో భార్యాభర్తలు విడిపోవడానికి చాలా రకాలుగా కారణాలు ఉంటున్నాయి. అయితే భార్యాభర్తలు  మాత్రమే చేసే కొన్ని మిస్టేక్స్ ఉంటాయి.  వీటి వల్ల భార్యాభర్తల బంధం బలహీనపడి విడిపోవడానికి దారి తీస్తుంది. భార్యాభర్తలు విడిపోవడానికి కారణం అయ్యే ఆ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటే.. ఆ తప్పులు జరగకుండా జాగ్రత్త పడవచ్చు.  తద్వారా భార్యాభర్తల బంధం పదిలంగా ఉంచుకోవచ్చు. ఇవి మాట్లాడకూడదు.. భార్యాభర్తలలో ఏవరైనా లేకా ఇద్దరూ అయినా వివాహానికి ముందు వేరే వ్యక్తులను ప్రేమించి ఉండవచ్చు.  కొందరు తమ వివాహం సమయంలో నిజాయితీగా ఉండాలనుకుని తమ గత ప్రేమ విషయాన్ని చెబుతుంటారు.  అయితే వారు నిజాయితీగా తమ ప్రేమ గురించి చెప్పిన తరువాత  మాజీ ప్రియుడు లేదా ప్రియురాలి గురించి  పదే పదే మాట్లాడటం, ఏదైనా సమయం లేదా  సందర్బంలో మాజీ వ్యకులతో పోల్చి అసహనం వ్యక్తం చేయడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే బార్యాభర్తల బంధం దెబ్బతింటుంది. ఎందుకంటే ఎవరూ ఇలా పోలికలు పెట్టి మాట్లాడటం గురించి సహించరు. చిన్న విషయాలు, గొడవలు.. భార్యాభర్తలు చిన్న చిన్న విషయాలకే ఒకరితో మరొకరు గొడవ పెట్టుకుంటే లేదా ఎటువంటి కారణం లేకుండా  కోపాన్ని, అసహనాన్ని చూపిస్తుంటే ఆ బంధం ఎక్కువకాలం నిలవడం కష్టమవుతుంది. అందుకే భార్యాభర్తలు మిగతా సమయాలలో ఎలా ఉన్నా ఒకరి పక్కన ఒకరు ఉన్నప్పుడు ఓపికగా, ప్రశాంతంగా ఉండాలి. అబద్దాలు.. భార్యాభర్తలు ఒకరితో మరొకరు పదే పదే అబద్ధం చెబితే  సంబంధం బెడిసికొట్టే అవకాశం ఉంది. ఎప్పుడూ నిజాయితీగా ఉండాలి,  నిజాన్నే మాట్లాడాలి.  ఎప్పుడైనా అబద్దం అనేది చెబితే భాగస్వామిని బాధపెట్టకూడదనే ఉద్దేశంతో చెప్పాలి తప్ప..  మోసం చేసే ఉద్దేశంతో చెప్పకూడదు.  భాగస్వామిని మోసం చేయడం వల్ల భార్యాభర్తల  బంధం ఒక్క క్షణంలో నాశనం అవుతుంది. తప్పులు, క్షమాపణ.. భార్యాభర్తల మధ్య గొడవలు, వాదనలు వచ్చినట్టే తప్పులు కూడా జరుగుతాయి.  భార్యాభర్తలలో ఎవరైనా సరే.. తప్పు చేస్తే మరొకరు క్షమించడానికి సిద్దంగా ఉండరు. జరిగిన తప్పు గురించి పదే పదే సమయం,  సందర్భం వచ్చిన ప్రతి సారి నిందిస్తూ, తిట్టుకుంటూ ఉంటారు.  కానీ ఇది చాలా కాలం పాటు కొనసాగితే అది  సంబందాన్ని దెబ్బతీస్తుంది. ఇలా గొడవ చేస్తుంటే ఏ లైప్ పార్ట్నర్ కూడా కలిసి ఉండాలని అనుకోరు. ఫలితంగా ఇద్దరూ విడిపోయే అవకాశాలు పెరుగుతాయి. అందుకే  ఏ తప్పును ఎక్కువ కాలం మనసులో పెట్టుకుని ఉండకూడదు.  తప్పు జరగగానే దాని గురించి మాట్లాడుకుని, ఆరోగ్యకర సంభాషణలతో పరిష్కరించుకుని, దాని గురించి వదిలేయాలి.                              *రూపశ్రీ.  

అపరాధ భావం లేకుండా ఇతరులకు "నో" చెప్పాలంటే ఇవి తెలుసుకోవాల్సిందే..!

  నేటి బిజీ జీవితాల్లో అందరినీ సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించడం వల్ల మనల్ని మనం కోల్పోవడం, మనకు మనం ప్రాధాన్యత ఇచ్చుకోవడం తగ్గుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు చాలామంది  నో చెప్పాలనుకుంటారు. కానీ చివరికి సరే అని చెబుతుంటారు. నో చెబితే ఎదుటివారు ఏమనుకుంటారో అనే ఫీలింగ్ ఒకటైతే.. మనం కాకపోతే ఎవరు సహాయం చేస్తారు అనే మంచితనం కూడా ఇలా సరే అని చెప్పడానికి కారణం అవుతుంది.  కానీ ఇలా సరే అని చెప్పిన తరువాత చాలామంది ఆ పని పూర్తీ చేయడంలో చాలా అలసిపోతారు,  తమ మీద తాము చిరాకు పడతారు, నేనెప్పుడూ ఇంతే ఇలా తప్పు  చేస్తుంటాను అని అసంతృప్తి కలిగిస్తుంది. కానీ ప్రతి ఒక్కరూ సరిహద్దులు నిర్ణయించుకోవడం చాలా ముఖ్యం. సరిహద్దులు నిర్ణయించుకోవడం అంటే ఇతరులను దూరం పెట్టడం లేదా దూరం చేసుకోవడం అస్సలు కాదు.. తమను తాము గౌరవించుకుంటూ ఇతరులను కూడా గౌరవించేలా చేసేది ఇలా సరిహద్దులు నిర్ణయించుకోవడమే..  సరిగ్గా సరిహద్దులను నిర్ణయించినప్పుడు సంబంధాలు బలపడతాయి. అపరాధ భావన  లేదా తప్పు చేసిన ఫీలింగ్ లేకుండా ఎవరికైనా నో చెప్పాలంటే కొన్ని విషయాలు తెలుసుకోవాల్సిందే.. దేని వల్ల ఎక్కువ అలసిపోతున్నాం, చిరాకు వడుతున్నాం,  ఒత్తిడి గురవుతున్నాం అనే విషయాలు ఆలోచించి అర్థం చేసుకోవాలి. ఇలా అర్థం చేసుకుంటే ఏది ముఖ్యం,  ఏది ముఖ్యం కాదు.. అనే విషయాలు అర్థం చేసుకోవచ్చు.  ఇది ఎవరికైనా ఏ విషయానికి నో చెప్పాలి,  దేనికి చెప్పకూడదు  అని నిర్ణయించుకోవడంలో సహాయపడుతుంది. ఎవరైనా ఏదైనా సహాయం అడిగినప్పుడు దాని విషయంలో పరిమితులు,  సామర్థ్యం మొదలైనవి మొహమాటం లేకుండా చెప్పాలి.  షో-ఆఫ్ చేయడానికి చాలామంది తమ గురించి కొండంత చెప్పుకుని తరువాత ఇబ్బంది పడుతుంటారు. అందుకే తమ గురించి తాము ఎక్కువ చెప్పుకోకూడదు. ఇలా చేస్తే ఇండైరెక్ట్ గా నో చెప్పినట్టు అవుతుంది. ఇతరులు ఏదైనా అడిగినప్పుడు ఆ పని చేసే సామర్థ్యం లేదా సమయం లేనప్పుడు అదే విషయాన్ని చెప్పాలి.  అంతేకానీ ఎదుటివారికి అనవసరమైన సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. ఇది అపార్థాలకు,  తగాదాలకు దారి తీసే అవకాశం ఉంటుంది. ఎవరికైనా దేని గురించి అయినా కారణాలు చెప్పే బదులు,  తాము ఉన్న పరిస్థితులు, చుట్టూ ఉన్న వాతావరణం వంటివి వివరించి చెప్పాలి.  ఇది ఎదుటి వ్యక్తిని బాధపడకుండా ఉంచుతుంది. ఎదుటివారు సరిహద్దులను మరచిపోయి అన్ని విషయాలను, పనులను సహాయం అడుగుతుంటే.. అలాంటి వారికి సున్నితంగానే సరిహద్దును గుర్తు చేయాలి.  సాధ్యమైనంత వరకే సమయాన్ని ఇవ్వాలి కానీ ఇతరుల కోసమే పూర్తీ సమయాన్ని వెచ్చించకూడదు. ఎదుటివారి దృష్టిలో ఎప్పుడూ తటస్థంగానే ఉండాలి.  అంచనాలు పెరుగుతూ ఉంటే వారి దృష్టిలో ఆశించడం కూడా పెరుగుతుంది. ఎవరి అవసరాలు వారికి ముఖ్యమని ఎదుటివారికి అర్థమయ్యేలా చేస్తుండాలి. ఇలా ఉంటే ఎదుటివారు కూడా ఏ విషయం అడగాలి, ఏది అడగకూడదు  అనే విషయం అర్థం చేసుకోగలుగుతారు. సొంత పనులు వదులుకుని మరీ ఇతరుల కోసం పాకులాడకూడదు.  ఎవరికోసం ఖర్చయ్యే సమయం అయినా సరే.. ఎన్ని కారణాలు చూపించినా  ఒక్క సెకెను కూడా తిరిగి తెచ్చుకోలేం. కాబట్టి సొంత పనుల తర్వాతే ఇతరుల పనులు చేసివ్వాలి.  ఇది స్వార్థం అని చాలామంది అనుకుంటారు. కానీ మనం బాగుంటేనే.. ఇతరుల కోసం మనం చేసే పనులకు గౌరవం ఉంటుంది.                                  *రూపశ్రీ

అందరూ మిమ్మల్ని గౌరవించాలంటే ఈ 5 నియమాలు పాటించాల్సిందే..!

  ప్రతి వ్యక్తి గౌరవంగా ఉండాలని అనుకంటాడు.  తను ఎక్కడ ఉంటే అక్కడ తనకు గౌరవం లభిస్తుంది అంటే ఆ వ్యక్తి వ్యక్తిత్వపరంగా ఉన్నతంగా ఉన్నట్టే లెక్క.  కానీ చాలా మంది వ్యక్తిత్వ పరంగా సరిగా లేకుండా.. నలుగురు గౌరవం ఇవ్వడం లేదని వాపోతుంటారు.  అయితే అందరూ గౌరవం ఇవ్వాలంటే ప్రతి వ్యక్తి కొన్ని నియమాలు పాటించాలి. ఈ నియమాలు పాటిస్తే అందరూ ఆటోమేటిక్ గా గౌరవం ఇస్తారు.  నలుగురిలో ఎప్పుడూ గౌరవాన్ని ఇస్తూ వ్యక్తిని హుందాగా ఉంచే ఆ 5 నియమాలు ఏంటో తెలుసుకుంటే.. పిలుపు.. ఎవరిని అయినా, దేనికైనా పిలవడం లేదా పలకరించడం చాలా కామన్.  ఏదేనా పని కోసం కావచ్చు,  సహాయం కోసం కావచ్చు.  ఎవరిని అయినా సరే.. రెండు కంటే ఎక్కువ సార్లు పిలవకూడదు.  పదే పదే ఎక్కువ సార్లు పిలవడం వల్ల వ్యక్తుల దృష్టిలో చిన్నతనంగా మారతాము.  దీని వల్ల వ్యక్తిత్వం కూడా పలుచబడుతుంది.  సమయం కేటాయించగలిగే వారు లేదా తోడుగా ఉండగలం అనుకునేవారు అయితే ఎక్కువ సార్లు అడిగించుకోకుండానే వచ్చేస్తారు. కానీ రాలేదంటే.. వారు ఏదైనా సమస్యలో ఉండాలి, లేదంటే వారికి వచ్చే ఉద్దేశం లేక రాకపోయి ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఎవరినీ దేనికోసం ఎక్కువసార్లు పిలవకూడదు. సలహాలు, సూచనలు.. కొందరికి అత్యుత్సాహం ఉంటుంది.  పక్కన ఉన్నవారు అయినా తెలిసిన వారు అయినా స్నేహితులు అయినా, కుటుంబ సభ్యులు అయినా.. ఇలా ఎవరైనా సరే.. వారు ఏదైనా ఇబ్బంది లేదా సమస్యలో ఉన్నట్టు కనిపిస్తే ఊరికే ఉండలేరు.  తమ తెలివి తేటలు ఉపయోగించి ఏదో ఒక సలహా లేదా సూచన ఇస్తూనే ఉంటారు. ఎదుటివారు తాము చెప్పింది యాక్సెప్ట్ చేసేవరకు ఏదో ఒకటి చెప్పడం చేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల ఎదుటివారి దృష్టిలో గౌరవం ఉండదు.  అందుకే ఎదుటివారు తమకు తాము అడిగేవరకు ఎవరికీ ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వకూడదు. వినడం.. ఎదుటివారు ఏదైనా చెప్పేటప్పుడు వినాలంటే చాలామంది చాలా బోర్ ఫీలవుతారు. అదొక టైం వేస్ట్ పని అన్నట్టు ఫీలయ్యేవారు, ఎదుటివారు చెప్పింది వినడం పెద్ద తలనొప్పి అనుకునేవారు ఎక్కువ. కానీ ఎదుటివారు ఏదైనా చెప్పేటప్పుడు శ్రద్దగా వెంటే వారు చెప్పే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దీనివల్ల వారికి తిరిగి సమాధానం చెప్పాలంటే ఎక్కువ సేపు మాట్లాడాల్సిన అవసరం ఉండదు.  అందుకే ఎక్కువ వినాలి,  తక్కువ మాట్లాడాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ప్లానింగ్స్.. ఏదైనా పని చేయడానికి ప్లానింగ్ గా ఉండటం చాలామంది కామన్ గా చేసేపని.  అయితే ప్లానింగ్ అనుకోగానే దాన్ని అందరికీ వివరించి చెప్పడం,  ఆ పని తర్వాత ఏం జరుగుతుంది,  దాని పర్యవసానాలు ఎలా ఉంటాయి.. మొదలైన విషయాలన్నీ చాలామంది పూస గుచ్చినట్టు వివరించి చెప్పేస్తుంటారు.  దీనివల్ల అనుకున్న పనులు జరగకపోయినా,  అసలు పనులు మొదలు పెట్టలేకపోయినా చాలా అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే చేయబోయే పనుల గురించి ఎవరికీ చెప్పకూడదు.  పనులు పూర్తయ్యే దాక ఎవరికీ చెప్పకూడదు. సంతోషం.. సంతోషంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. అలాగే.. అందరూ సంతోషంగా ఉండాలని కోరుకునేవారు కూడా ఉంటారు.  అందుకే చాలామంది తమ చుట్టూ ఉన్నవారిని సంతోషంగా ఉండటం కోసం చాలా సతమతం అవుతుంటారు. ఈ క్రమంలో తమ ప్రాధాన్యతలు కోల్పోవడం, తమ పనులు మానుకోవడం వంటివి కూడా చేస్తారు. కానీ అందరినీ సంతోషంగా ఉంచడం అసాధ్యం  అనే విషయాన్ని గ్రహించాలి.  అందరినీ సంతోషంగా ఉంచడం ఒక్కరి పనే కాదని,  ఎవరి సంతోషాన్ని వారు నిలబెట్టుకోవాలని తెలుసుకోవాలి.  ఇలా ఉంటే అందరూ గౌరవిస్తారు.                                              *రూపశ్రీ.

ట్రోఫీ వైఫ్.. పెళ్లైన ఆడవాళ్లలో చాలామంది పరిస్థితి ఇదే.. మీరూ ఇంతేనా..!

  ఈ ప్రపంచంలో భార్యాభర్తల బంధం  చాలా అపురూపమైనది.  వేర్వేరు ప్రాంతాలలో పుట్టి పెరిగిన ఇద్దరు వ్యక్తులు వివాహం పేరుతో కలిసి జీవించడం,  ఎలాంటి పరిస్థితులు  ఎదురైనా ఒకరికి ఒకరు తోడుండటం ఈ బంధాన్ని ప్రత్యేకంగా నిలబెడుతుంది.  అయితే భార్యాభర్తల బంధంలో తమదే పై  చేయి ఉండాలనే పిచ్చి ఆలోచన చాలామందిలో ఉంటుంది. మరీ ముఖ్యంగా మగవారు భార్యల విషయంలో ఆధిపత్య ప్రవర్తన కలిగి ఉంటారు.  ఈ వివాహ బంధంలో చాలామంది ఆడవారు ఒక సమస్యను ఎదుర్కొంటూ ఉంటారు. అదే ట్రోఫీ వైఫ్.. అసలు ట్రోఫీ వైఫ్  అంటే  ఏంటి? ఇలాంటి పరిస్థితిలో ఎక్కువమంది భార్యలు ఎందుకు ఉన్నారు? ఈ పరిస్థితిలో ఉన్నారని చెప్పడానికి భార్యాభర్తల మధ్య  ఉండే పరిస్థితులు ఏంటి? తెలుసుకుంటే.. ట్రోఫీ భార్య అంటే.. ట్రోఫీ భార్య అంటే.. భర్త కేవలం భార్య బాహ్య రూపానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం. అతని దృష్టిలో భార్యకు ఎలాంటి ప్రాధాన్యత ఉండదు.  మూడు ముళ్లు వేసి పెళ్లి పేరుతో తన ఇంటికి తీసుకుని వచ్చి భార్యను కేవలం తన అవసరానికి వాడుకోవడం చేస్తుంటాడు.  ఇలాంటి పరిస్థితిలో ఉన్న బార్యలు అందరూ ట్రోఫీ భార్యలే.  ట్రోఫీ భార్యల పరిస్థితులు.. భార్యాభర్తల బంధంలో ఏ నిర్ణయం తీసుకున్నా భార్యాభర్తలు ఇరువురూ కలిసి తీసుకోవాలి అనుకుంటారు.  భర్త అయినా, భార్య అయినా తమ పార్ట్నర్ తమను కూడా అబిప్రాయం అడగాలని అనుకుంటారు. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం ఇలాంటి ప్రాధాన్యతకు నోచుకోరు.  భర్త ఏ నిర్ణయం తీసుకున్నా తన సొంతంగా తీసుకుంటాడు.  భార్య అభిప్రాయంతో కానీ,  భార్య  ఆలోచనలతో కానీ అతనికి ఆసక్తి ఉండదు. భార్యాభర్తల బంధంలో ప్రేమ ఉండాలని చాలామంది అనుకుంటారు. ముఖ్యంగా భర్త చూపించే ప్రేమ భార్యకు ఎంతో ముఖ్యం. కానీ ట్రోఫీ భార్యలు మాత్రం భర్త ప్రేమకు నోచుకోరు. భర్తలు ఒక వేళ ప్రేమ చూపించినా అదంతా షో-ఆఫ్ కే.. అంటే నలుగురు చూడాలని, తనను మంచి భర్తగా ట్యాగ్ వేయాలనే కోరికతో  నలుగురిలో భార్యల పట్ల ప్రేమ చూపిస్తుంటారు. భార్యాభర్తలు అంటే.. ఒకరి వల్ల మరొకరు సంతోషంగా ఉండాలి. కానీ కొందరు మాత్రం తమ సంతోషాన్ని మరచి ఇతరులకు బాగా కనిపించాలని, ఇతరుల దృష్టిలో ఏది సరైనది అయితే.. అలాగే తాము ఉండాలని అనుకుంటారు. ఇలాంటి పరిస్థితిలో ఉండే భార్యలు అందరూ ట్రోఫీ భార్యలే. భర్త ఎప్పుడూ భార్యను అన్ని విషయాలలో నియంత్రణ చేస్తుంటే.. ఆ బార్య ట్రోఫీ భార్య అని అంటున్నారు రిలేషన్షిప్ నిపుణులు. ఏం మాట్లాడాలి? ఏం తినాలి? ఏ దుస్తులు ధరించాలి? ఇలా ప్రతి విషయంలో భర్త జోక్యం చేసుకుంటూ ఉంటారు. భార్య ఎమోషన్స్ ను ఎప్పుడూ పట్టించుకోకుండా కేవలం తనకు నచ్చినది జరగాలని భర్త డిమాండ్ చేస్తుంటే ఆ  భార్య ట్రోఫీ వైఫ్ అని అర్థమట. వివాహం అయిన తరువాత ఆడపిల్లను కేవలం తనకు భార్య  అనే కోణంలో మాత్రమే చూస్తూ ఆమెకంటూ ఎలాంటి వ్యక్తిగత జీవితం,  స్పేస్ లేకుండా చేస్తుంటారు కొందరు భర్తలు.  ఇలా తమను తాము కోల్పోయే భార్యలు అందరూ ట్రోఫీ వైప్ లు.                                 *రూపశ్రీ.

విజయం సాధించాలంటే ఈ విషయాలను గుర్తంచుకోవాలి..!

మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇచ్చిన సలహాలను నేటికీ మనం మన పెద్దలు లేదా తెలిసిన వారి నుండి వినవచ్చు. భగవద్గీత యొక్క ఈ జ్ఞానం నేటి ఆధునిక యుగంలో కూడా చాలా ఉపయోగకరంగా ఉంది. మీరు ఈ బోధనలను తెలుసుకుని, వాటిని తెలివిగా అనుసరించి, వాటిని మీ జీవితంలో చేర్చుకుంటే, మీ పురోగతిని ఎవరూ ఆపలేరు. భగవద్గీతలో జీవిత సారాంశం ఉందని మన పెద్దలు చెప్పడం మీరు వినే ఉంటారు. మహాభారత యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పిన ఉపదేశాలు మీ జీవితంలో కూడా ఉపయోగపడతాయి. ఐతే భగవద్గీతలో మనిషి ప్రగతి సాధించాలంటే ఏం చేయాలి అని చెప్పారు..? మీ కోపాన్ని నియంత్రించుకోండి: కోపం గందరగోళాన్ని సృష్టిస్తుంది, గందరగోళం తెలివిని పాడు చేస్తుంది, బుద్ధి చెడిపోతే, తర్కం నాశనం అవుతుంది, తర్కం నాశనం అయినప్పుడు, వ్యక్తి నాశనం అవుతాడు. అందువల్ల అతను తన అన్ని పనులలో వైఫల్యాన్ని ఎదుర్కొంటాడు. అదే వీక్షణ: జ్ఞానాన్ని,  చర్యను ఒకటిగా చూసే వ్యక్తి జ్ఞానం ఉన్న వ్యక్తి. ఎవరైతే జ్ఞాని అయినా లేదా అతను జ్ఞానవంతుడు అయినా, అతని అభిప్రాయం కూడా సరైనదే. ఏ సమస్యను ఏ కోణంలో చూడాలో ఆయనకు అవగాహన ఉంది. మానసిక నియంత్రణ: మన మనస్సు ఎప్పుడూ మన అదుపులో ఉండాలి. మన మనస్సును అదుపులో ఉంచుకున్నప్పుడే అన్ని కార్యాలలో విజయం సాధించగలుగుతాము. మనసును అదుపులో పెట్టుకోని వారికి మనస్సే శత్రువులా ప్రవర్తిస్తుంది. స్వపరీక్ష: పురోగతి సాధించడానికి స్వీయ మూల్యాంకనం చాలా ముఖ్యం. మనం చేస్తున్న పని, ఎంచుకున్న మార్గం, తీసుకున్న నిర్ణయం అన్నీ సరైనవేనా.? లేక తప్పా? దాని గురించి ముందుగా మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఆత్మజ్ఞానం అనే ఖడ్గంతో మన హృదయాల్లోని అజ్ఞానపు సందేహాలను తొలగించి, క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎంచుకుంటే, మీరు తప్పకుండా అందులో పురోగతి సాధిస్తారు. ప్రతి చర్యకు ప్రతిఫలం ఉంటుంది: ఈ జీవితంలో మనం ఏమీ కోల్పోలేదు లేదా వృధా చేయలేదు. మీరు ఏమి చేసినా, దాని నుండి మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను పొందుతారు. ఇది మీ జీవితాన్ని మార్చడానికి మీకు సహాయం చేస్తుంది. సాధన తప్పనిసరి: మనస్సు చంచలంగా ఉంటే లేదా మీ మనస్సును నియంత్రించడం మీకు కష్టంగా అనిపిస్తే, మీరు మంచి అలవాట్ల ద్వారా దానిని నియంత్రించవచ్చు. మీ మనస్సు నియంత్రణలో ఉన్నప్పుడే మీ చర్యలు, మీ భావోద్వేగాలు అదుపులో ఉంటాయి. ఆత్మవిశ్వాసంతో ఆలోచించండి: మనిషి తాను సాధించాలనుకున్నది ఆత్మవిశ్వాసంతో ఆలోచిస్తే ఏదైనా సాధించగలడు. ఏ పని చేసినా అందులో నమ్మకం ఉంటేనే చేయాలి. ఇలా చేయండి: క్రియలో నిష్క్రియతను,  నిష్క్రియంలో చర్యను చూసేవాడు తెలివైనవాడు. ఈ వ్యక్తులు తాము చేసే పనిలో ఆనందాన్ని పొందినప్పుడు మాత్రమే సంతృప్తిని అనుభవిస్తారు.

ఇంట్రోవర్ట్ లను తక్కువ అంచనా వేయకండి.. వీళ్ల గురించి తెలిస్తే నోరెళ్లబెడతారు!

ఇంట్రోవర్ట్.. ఎవ్వరితోనూ ఎక్కువ కలవరు. ఎవరైనా పలకరించినా, మాట్లాడినా ఎప్పుడెప్పుడు అక్కడి నుండి పారిపోదామా అని ఎదురు చూస్తుంటారు. ఎప్పుడూ ఏదో దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటారు.  ఒంటరిగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతారు. ఈ కారణంగానే ఇంట్రోవర్ట్ అనే మాట బయటకు తెలిస్తే అదేదో వాళ్లకు ఏదో జబ్బు ఉందన్నట్టు ట్రీట్ చేస్తూ ఉంటుంది సమాజం. అయితే ఇంట్రోవర్ట్ లను తేలిగ్గా తీసిపడేయకూడదని, ఇంట్రోవర్ట్ లు గా ఉండి ప్రపంచాన్ని తమ ప్రతిభ ద్వారా, విజయాల ద్వారా ఆకర్షించిన వారి గురించి తెలిస్తే వాళ్లను తక్కువ అంచనా అస్సలు వేయకూడదని అనిపిస్తుంది. ఇంట్రోవర్ట్ ల గురించి.. మనిషన్నాక సందర్భాన్ని బట్టి ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరూ మాట్లాడటం అస్సలు అవసరం లేదు. కొంతమంది మౌనంగా ఉండి తమ ఎనర్జీ లెవెల్‌ని మెయింటైన్ చేసి దానిని తమ శక్తిగా మార్చుకోవడానికి ఇష్టపడతారు. ఇది ఏదో మాటవరుసకు చెబుతున్నది కాదు. సాక్షాత్తూ మైయర్స్ బ్రిగ్స్ టైప్ ఇండికేటర్ పరిశోధన ఇలా చెబుతోంది. గ్లోబల్ శాంపిల్‌పై అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని 56.8% మంది వ్యక్తులు అంతర్ముఖులుగా ఉన్నారు.  అంటే తమతో తాము ఉండటానికి  లేదా మౌనంగా ఉండటానికి వీరు ఇష్టపడతారు. బహిర్ముఖ వ్యక్తుల కంటే  అంతర్ముఖులే ఎక్కువ విజయాలు సాధిస్తారని, ప్రపంచ రూపురేఖలను మార్చిన ఎంతో మంది ప్రసిద్ద వ్యక్తులు అంతర్ముఖులే అని తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. తక్కువ మాట్లాడటం.. సమయానికి మాట్లాడటం.. కొందరు వ్యక్తులు అంతర్ముఖులతో వ్యవహరించడం కొంచెం కష్టమని అంటుంటారు. ఎందుకంటే అంతర్ముఖులు తమ భావాలను ఎవరికీ చెప్పరు. కానీ తక్కువ మాట్లాడటం అంటే ఏదో దాచడం అని కాదు. పరిశోధన ప్రకారం అంతర్ముఖులు ఆలోచనాత్మకంగా మాట్లాడతారు. వారి  మాటలు చాలా విస్తృతంగా సరైన కారణాలతో కూడుకుని ఉంటాయి. వీరు ఎవరికీ త్వరగా స్పందించరు. ఎమోషనల్ అటాచ్మెంట్ తక్కువగా ఉంటుంది.  అందుకే  ఇతర వ్యక్తుల కంటే వీళ్లు   సంతోషంగా ఉంటారు. ఎందుకంటే వీరు వారికి నచ్చింది మాత్రమే మాట్లాడుతారు. ఒంటరితనమే బలం.. మానసిక  రోగుల వైద్యుల అభిప్రాయం ప్రకారం అంతర్ముఖ వ్యక్తులు బహిర్ముఖుల కంటే బలంగా , శక్తివంతంగా ఉంటారు. ఎందుకంటే వారు ప్రతి పరిస్థితిని ప్రశాంతంగా, తెలివిగా ఆలోచిస్తారు. దానికి తగినట్టే నిర్ణయం తీసుకుంటారు. ఈ ప్రశాంత స్వభావం కారణంగా ఇంట్రోవర్ట్ లు  ఎప్పుడూ కోపం తెచ్చుకోరు. లేదా దూషించే మాటలు మాట్లాడరు.  సాధారణంగా వీరు ఇతరులకు చాలా పొగరు వ్యక్తులుగా అనిపిస్తారు. కానీ వీరు అర్థమయ్యే కొద్దీ.. వీరి మీద గౌరవం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా.. అంతర్ముఖులు తమ భావోద్వేగాలను బయటకు  వ్యక్తం చేయకపోవచ్చు. కానీ వారు మానసికంగా బలంగా ఉంటారు. వీరు సులభంగా ఎవరికీ  భయపడరు. తక్కువ మాట్లాడటం వల్ల  వీరిని చాలామంది పిరికివాళ్లు అని అంటూ ఉంటారు. కానీ అంతర్ముఖుల శక్తి అసాధ్యం. వారు మానసికంగా దృఢంగా ఉంటారు. జ్ఞాపకశక్తి ఎక్కువ.. 2007లో రష్యాలో అంతర్ముఖులపై నిర్వహించిన పరిశోధనలో   వీరు ఏవైనా సంఘటనలు, విషయాలను చాలా కాలంపాటూ గుర్తుంచుకుంటారని తెలిసింది. ఎందుకంటే ఇంట్రోవర్ట్ వ్యక్తులకు ఫ్రంటల్ లోబ్‌లో ఎక్కువ రక్త ప్రసరణ ఉంటుంది. ఫ్రంటల్ లోబ్ అనేది మెదడులోని జ్ఞాపకాలను నిల్వ చేసే భాగం. ఇది సమస్యలకు పరిష్కాలు ఆలోచించడం, సరైన ప్రణాళికలు రచించడం వంటి విషయాలలో చాలా బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల అంతర్ముఖులు బాగా ప్రణాళిక వేయడంలో ,సమస్యలను పరిష్కరించడంలో కూడా తెలివిగా ఉంటారు.  లాజిక్‌పై దృష్టి పెట్టడంతో పాటు, వీరు  సృజనాత్మకంగా , శక్తివంతంగా ఉంటారు.                                          *నిశ్శబ్ద.

మనిషిలో మరొక అంతర కోణం!

హిమాలయాలకు వెళ్ళిన ఒక యోగి ఐదేళ్ళ తర్వాత మళ్ళీ ప్రజల మధ్యకు వచ్చినప్పుడు వారిని చూసి, "ఇంకా పోట్లాడుకుంటూనే వున్నారా?” అని ఆశ్చర్యపోయాడంట. పిల్లల దగ్గరనుండి పెద్దవాళ్ళ వరకూ, మనుష్యులు పోట్లాడుకోకుండా క్షణముండలేరు. ఈ విషయంలో ఆధునికులూ పూర్వీకులూ అనిగానీ, ఈ జాతివారు ఆ జాతివారు అనిగానీ, ఈ మతంవారూ మరో మతానికి చెందినవారని గానీ, స్త్రీ పురుష భేదాలు గానీ ఏమీలేవు. పోట్లాడటం ప్రధానం, కారణమేదైనాగానీ, పోట్లాట అనేది ఒకటి వుంటూ వుండాలి. లేకపోతే తోచదు. సాధారణంగా చిన్న పిల్లల్ని "మీరిద్దరూ ఏదో గిల్లికజ్జా పెట్టుకుంటారేమిటర్రా?" అని మందిలిస్తాం కానీ, పెద్దవాళ్ళూ చేసేది అదే. కాకపోతే చిన్నవాళ్ళు ఏ చాక్లెట్ల పంపిణీ దగ్గరో, బడిలో ఏ కుర్చీలో ఎవరు కూచోవాలి అనే విషయానికో తగాదా పడతారు. పెద్దవాళ్ళు చాలా “పెద్ద” విషయాలనుకునే వాటి విషయంలో అంటే... మతపరమైన, భాషాపరమైన విషయాలతో, పోరాటానికి సిద్ధపడతారు. చిన్న పిల్లలు గిల్లుకోవటంతో ఆపేస్తారు. పెద్దవాళ్ళు రక్తం చిందిస్తారు. మనిషిలో తల ఎత్తే ప్రతి అభిప్రాయమూ, మరొక మనిషితో వచ్చే ప్రతి అభిప్రాయ భేదమూ రక్తం ధారపోసేటంతటి ముఖ్యమైన విషయమే. ఇక్కడ ఒక విషయమేమంటే తప్పని సరి అయితేనే తన రక్తం చిందుతుంది.  సాధారణంగా అయితే  తన అనుచరుల రక్తమే ఉంటుందక్కడ ఇదీ నేటి రాజకీయం, సమాజ పోకడ. మత విశ్వాసాలు బలంగావున్న కాలంలో ఒక్కొక్క మతం వారు మరొకరి మీద విరుచుకు పడేవారు. ఒకే మతానికి చెందినవారిలో కూడా ఎన్నో సంఘర్షణలు. కేథలిక్కులూ, ప్రాటస్టాంట్ లూ ఆనాటికీ ఈనాటికీ ఐర్లాండ్లో కుత్తుకలను కత్తరించుకోడానికి వెనుకాడడం లేదు. ముస్లిములలో సున్నీలకు షియాలకు మధ్యన పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూనే వున్నది. హిందూమతంలోని వైష్ణవులకు, శైవులకు ఎంతటి ప్రజల విరోధమో చరిత్ర తెలియజేస్తూనే వున్నది. మతం కాకపోతే భాష, భాష కాకపోతే ప్రాంతం, నగరాలకై గ్రామాలకై పెనుగులాట, ఆదర్శాలకై, అభిప్రాయాలకై పోరుసల్పమని నాయకులు ఉద్ఘాటిస్తూనే వుంటారు. పోరునష్టం అనే విషయం మానవుడికి తెలిసినట్లుగానే వుంటుంది. కాని పోరునే అతడు ఆరాధిస్తాడు. పోరే అతడి జీవనసూత్రం, అందుకనే జీవితాన్ని కూడా "జీవనసమరం, జీవనపోరాటం" అనే పేర్లతో వ్యవహరిస్తూ వుంటాడు.  పూర్వం మనరాజులు ఆచరించిన అశ్వమేధయాగం లో "చేతనైతే మా యజ్ఞాశ్వాన్ని ఆపిచూడండి, ఆపినవారు మా భుజబలాన్ని చవిచూడండి". అనే ప్రకటన, పోరుకు ఆహ్వానమే కదా? అంటే మనిషికి పోరు అతి సహజమైన గుణమన్నమాట, పైపెచ్చు ఇది ఎంతో గౌరవించదగిన గుణమని మన నాగరీకుల భావన. కానీ ఈ ప్రపంచంలో అక్కడక్కడ కొన్ని "అనాగరికమైన" అడవి జాతులు కూడా వున్నాయి. వారిలో ఒక జాతివారు మరొక జాతివారిమీద అనివార్య కారణాల వల్ల యుద్ధ దుందుభులు మ్రోగించారనుకుందాం. ఇవతలి జాతివాడు అవతలి జాతివాణ్ణి చంపడం కూడా జరిగిందనుకుందాం. అప్పుడు ఇతడు తానొక ఘనకార్యం చేశానని తానొక వీరాధి వీరుణ్ణని భావించడం జరుగుతుంది. చాలా ఉద్రేకంగా ఉత్సాహంగా తనవారిలోకి తిరిగి వస్తాడు. అతని గ్రామంలోని వారందరూ అతడికి బ్రహ్మరథం పట్టారనీ, "వీరగంధం" పూస్తారని మనం అనుకోవచ్చు. కానీ మన ఊహ సరికాదు అంటాడు, ఆఫ్రికాలోని కొన్ని అడవి జాతుల్ని అధ్యయనం చేసిన ప్రఖ్యాత మనస్తత్వ శాస్త్రవేత్త, కార్ల్ యూంగ్, ఈ వీర శూర శిఖామణిని ఊరి పొలిమేరల్లోనే ఆపి అక్కడే ఒక గుడిసెలో అతడికి నివాసం ఏర్పాటు చేస్తారు. అతడిలోని రక్తదాహం తొలగిపోవడానికి కొన్ని నెలలపాటు అతణ్ణి ఏకాంతంగా వుండనిచ్చి, శాఖాహారం మాత్రమే పెడుతుంటారు. ఆ అడవి జాతివారికి తోటి మానవుడి ప్రాణం తీయడం అంత గర్భనీయం అంటారు. ఇదీ మనిషిలో ఉండే ఒకానొక స్వభావ కోణం                                    ◆నిశ్శబ్ద.

సుఖమా! సంతోషమా!

అనగనగా ఓ మధ్యతరగతి ఉద్యోగి. అతను రోజూ తన కార్యాలయానికి వెళ్తూ వస్తూ దారిలో కనిపించే విశేషాలను గమనిస్తూ ఉండేవాడు. అంతా బాగానే ఉండేది కానీ, దారి మధ్యలో కనిపించే ఆ రాజభవనాన్ని చూడగానే ఉద్యోగి మనసు కలుక్కుమనేది. ‘ఆహా! హాయిగా ఆ రాజకుటుంబంలో పుట్టినా బాగుండేది, ఎలాంటి కష్టమూ లేకుండా పట్టుపరుపుల మీద నుంచే అష్టైశ్వార్యాలూ అనుభవించవచ్చు’ అంటూ తెగ ఈర్ష్యపడిపోయేవాడు ఉద్యోగి. రాజకుటుంబం సంగతేమో కానీ ఈ ఉద్యోగిని చూసి అసూయపడేవారు కూడా లేకపోలేదు. రోజూ ఉదయాన్నే ఠంచనుగా ఉద్యోగి గొడుగుని ఊపుకుంటూ వెళ్తుంటే దారిలో ఒక పళ్ల దుకాణం వాడు అతణ్నే గమనిస్తూ ఉండేవాడు. ‘ఛీ వెధవ బతుకు! చిన్నప్పుడు మా నాన్న మాట విని బుద్ధిగా చదువుకుని ఉంటే హాయిగా ఆ ఉద్యోగిలాగా ఉండేవాడిని కదా! ఉద్యోగం ఉంటే దర్జాగా బతకవచ్చు’ అనుకునేవాడు దుకాణదారుడు.  ఇదిలా ఉండగా ఉద్యోగికి ఓసారి అరుదైన అవకాశం దక్కింది. కార్యాలయం తరఫున యువరాజుని కలిసి కొన్ని సంతకాలు తీసుకోవాల్సి వచ్చింది. ఆ మాట వినగానే ఉద్యోగి ఎగిరి గంతేశాడు. ‘తను ఎప్పటికీ ఆ భోగాలను అనుభవించలేడు. కనీసం వాటిని ఒక రోజు పాటు దగ్గరగా చూసే అవకాశం వచ్చింది కదా!’ అనుకున్నాడు. రాజభవనంలో తన సమయం ఎలా గడవబోతోందో తెగ ఊహించుకోసాగాడు ఉద్యోగి. అతని ఊహలతో పని లేకుండా ఆ రోజు రానే వచ్చింది. తనకున్న వాటిలో బాగున్న దుస్తులను వేసుకుని, తలని ఒకటికి పదిసార్లు దువ్వుకుని రాజభవనానికి బయల్దేరాడు ఉద్యోగి. ఉద్యోగి రాక గురించి వినగానే యువరాజుగారు నేరుగా అతణ్ని తన మందిరానికి పంపించమన్నారు. యువరాజుగారు పట్టుపరుపు మీద పడుకునో, అలంకరించుకుంటూనో ఉంటారనుకుంటూ బెరుకుగా ఆ గదిలోకి అడుగుపెట్టిన ఉద్యోగికి ఆయన కిటికీ దగ్గర నిల్చొని కనిపించారు. ‘యువరాజా! నేను మీ సంతకాల కోసం వచ్చాను’ అని ఉద్యోగి ఒకటికి రెండుసార్లు చెప్పినా యువరాజుగారు వినిపించుకోలేదు. ఇక లాభం లేదని ఉద్యోగి ఆయనకు దగ్గరగా వెళ్లి చూస్తే ఏముంది… యువరాజుగారు తీక్షణంగా ఆ పళ్లు అమ్ముకునేవాడినే చూస్తున్నారు. ‘యువరాజా! అతనేమన్నా అపచారం చేశాడా? అంత తీక్షణంగా చూస్తున్నారు?’ అంటూ కాస్త చొరవగా అడిగాడు ఉద్యోగి.  ‘అపచారమా పాడా! అతణ్ని చూసినప్పుడల్లా నాకు మహా అసూయగా ఉంటుంది. హాయిగా ఏ రోజుకారోజు కాయకష్టం చేసకుంటూ, వచ్చినదానితో తృప్తిగా బతుకుతూ, భవిష్యత్తు గురించి ఎలాంటి బాధా లేకుండా ఉండే అతని జీవితం ఎంత సంతోషంగా ఉంటుందో కదా! కావాలంటే దుకాణాన్ని తీసి ఉంచుతాడు, లేకపోతే మధ్యలోనే కట్టేసి తన భార్యాపిల్లలతో కలిసి షికారుకి వెళ్లిపోతాడు. అంత స్వేచ్ఛగా, సాదాసీదాగా జీవించడంలో ఉన్న ఆనందం బందిఖానాలాంటి ఈ రాజభవనంలో ఎక్కడ ఉంటుంది,’ అంటూ నిట్టూర్చారు యువరాజులవారు. యువరాజులవారి మాటలు విన్న ఉద్యోగికి ఏదో కొత్త విషయం బోధపడింది. సుఖానికీ, సంతోషానికీ ఉన్న వ్యత్యాసం తెలిసి వచ్చింది. మరి అదే విషయం దుకాణదారుడుకి ఎప్పుడు తెలిసివస్తుందో!

మీక్కూడా ఆఫీసులో చిరాకు పెరుగుతుందా? ఇలా జరగచ్చు జాగ్రత్త..!

  జీవితంలో ప్రతి ఒక్కరికీ నిర్వర్తించే వృత్తి చాలా కీలకమైనది.  జీవితం గడవడానికి ఆ వృత్తే సంపాదనను అందిస్తుంది. ప్రతి వ్యక్తి రోజులో సింహభాగం ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడంలోనే గడుస్తుంది.  అయితే ఆఫీసులో ఒత్తిడి,  చిరాకు వంటి సaమస్యలు చాలా సాధారణంగా ఉంటాయి.  వీటిని కొందరు తేలికగా తీసుకుని చాలా ఈజీగా డీల్ చేస్తే.. మరికొందరు ఒత్తిడి,  చిరాకు వంటి విషయాలకు చాలా అతిగా రియాక్ట్ అవుతుంటారు. ఇలా ఆఫీసులో చిరాకు,  ఒత్తిడి కలగడం వల్ల ఉద్యోగులకు మనోబలం తగ్గుతుంది. ఆఫీసులలో చాలా అనుకువగా పనిచేసే ఉద్యోగులు,  పై అధికారులు ఎక్కువగా అధిపత్యం చెలాయించే ఉద్యోగులు కొందరు ఉంటారు. ఇలాంటి వారికి ఆఫీసులో ఉద్యోగపరంగా ఆసక్తి కోల్పోతుంటారు.  ఈ ఆసక్తి తగ్గడం కారణంగా ఉద్యోగుల పని నాణ్యత,  వారి పని చేసే తీరు మారిపోతుంది. సాధారణంగా చేసే పనిని నిర్ణీత గడువు కంటే ఎక్కువ సమయం తీసుకుని పని చేస్తుంటారు. నిరుత్సాహం వల్ల తమ పని మీద ఆత్మవిశ్వాసం కూడా కోల్పోతుంటారు.   ఉద్యోగస్థులు తమ పని మీద నిర్లక్ష్యంగా ఉండటం,  వారి పనిలో ప్రతి కూల ప్రభావం పడటం వంటివి జరగడం వల్ల వారు ఉత్తమ ఉద్యోగులు అనే ట్యాగ్ ను కోల్పోతారు. ఆఫీసులో చిరాకు,  ఒత్తిడి అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటే అక్కడ సరైన వాతావరణం,  ఉద్యోగులను ట్రీట్ చేస్తున్న తీరు సరిగా లేదని అర్థం.  దీని వల్ల ఉద్యోగులు పని  చేస్తున్న చోటు నుండి వెళ్లిపోయే ఆలోచనలో ఉంటారు.  ఇది సంస్థలకు చాలా నష్టం తెచ్చిపెడుతుంది. ఆఫీసులో ఎదురయ్యే చిరాకులు,  ఒత్తిడి వంటి కారణాల వల్ల చాలా మంది ఉద్యోగులు తమ తోటి ఉద్యోగులతో తప్పుగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.  దీని వల్ల పని చేసే వాతావరణం  అనారోగ్యకరంగా మారుతుంది. చాలా కాలం పాటు ఉద్యోగుల మద్య గొడవలు,  నిరాశ,   ఒత్తిడి, చిరాకు వంటివి కొనసాగుతుంటే..  అవి మానసిక సమస్యలకు దారితీస్తాయి. ఉద్యోగులలో కోపం,  రక్తపోటు సమస్యలు,  మధుమేహం వంటివి కూడా ఇలాంటి సమస్యల వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కంపెనీలు ఉద్యోగులను పని యంత్రాలుగా చూస్తుంటాయి.  అలాంటి చోట్ల ఉద్యోగస్థులు చాలా ఎక్కువ వైఫల్యం అవుతుంటారు. అలా కాకుండా కంపెనీలు ఉద్యోగస్థుల మానసిక ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. కంపెనీలు ఉద్యోగుల మానసిక ఉత్తేజాన్ని ఇచ్చే కార్యాకలాపాలను కూడా చేపడుతుండాలి. అపుడే ఉద్యోగస్థులు మానసికంగా బలంగా ఉండి సంస్థ కార్యకలాపాలు సమర్థవంతంగా చేయగలుగుతారు.                                       *రూపశ్రీ

భార్యాభర్తల మధ్య మూడవ వ్యక్తి జోక్యం ఉంటే  పర్యవసానాలు ఇవే..!

దాంపత్య జీవితం అనేది ఇద్దరి మధ్య ఉండే ఒక పవిత్ర బంధం. ఇది శరీర సంబంధం మాత్రమే కాదు..  ప్రేమ, నమ్మకం, కమ్యునికేషన్,  బాధ్యత, గౌరవం అనే ఐదు స్థంభాల మీద నిలబడే సంబంధం. చాలావరకు భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం గురించి చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కొందరేమో భార్యాభర్తల గొడవ, సమస్య మూడవ వ్యక్తికి చెప్పడం వల్ల.. ఆ మూడవ వ్యక్తి భార్యాభర్తలను కూర్చోబెట్టి, వారి మధ్య అపార్థాలు తొలగిస్తారు అని అంటుంటారు. కానీ చాలామంది మాత్రం మూడవ వ్యక్తి జోక్యం వల్ల భార్యాభర్తల బంధం విచ్ఛిన్నం అవుతుంది అంటుంటారు.  భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం గురించి.. కలిగే పర్యవసానాలు గురించి తెలుసుకుంటే..  “మూడవ వ్యక్తి జోక్యం” అంటే.. భార్యాభర్తల మధ్య వచ్చే సమస్యలలో, ఎమోషన్ పరిస్థితులలో, నిర్ణయాలలో, కుటుంబసభ్యులు, స్నేహితులు, బంధువులు లేదా ఎవరైనా ఇతర వ్యక్తి ప్రభావం చూపించడం. అలాంటి వ్యక్తులనే థర్డ్ పర్సన్ అని అంటారు. ఈ “మూడవ వ్యక్తి” ఎప్పుడూ చెడు ఉద్దేశంతో ఉండకపోవచ్చు. కానీ సమస్య ఏమిటంటే, ఆ మూడవ వ్యక్తి దంపతుల మధ్య ఉన్న నిజమైన అభిప్రాయాలు, ఆలోచనలు, పరిస్థితులు, అనుభవాలను అర్థం చేసుకోలేరు. దాంతో వాదన పెద్దదవుతుంది, అనుమానం పెరుగుతుంది, ప్రేమ తగ్గుతుంది. మూడవ వ్యక్తి జోక్యం ఉంటే ఏమవుతుంది? భార్యాభర్తల బంధంలో మూడవ వ్యక్తి జోక్యం పాయిజన్ లా పనిచేస్తుందని రిలేషన్షిప్ నిపుణులు అంటున్నారు. దీనివల్ల కలిగే నష్టాలు ఏంటంటే..  నమ్మకం దెబ్బతింటుంది.. భార్యకు లేదా భర్తకు “వారి మాట వినడం కంటే బయట వాళ్ల మాట ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు” అన్న భావన వస్తుంది. ఇది నమ్మకాన్ని దెబ్బతీస్తుంది. ప్రైవసీ ఉండదు..  దంపతుల మధ్య జరిగిన విషయాలు మూడవ వ్యక్తి వద్దకి వెళ్లడం వల్ల “ప్రైవసీ” కోల్పోతుంది. అది తర్వాత చాలా దారుణంగా మారుతుంది. ప్రతి చిన్న విషయాన్ని చెప్పుకోవడం, చర్చించడం, తప్పుగా అర్థం చేసుకోవడం వంటి  సమస్యలను పదే పదే తెస్తుంది. నిర్ణయాలు దెబ్బతింటాయి.. మూడవ వ్యక్తి అభిప్రాయం విని తీసుకున్న నిర్ణయాలు చాలా సార్లు అసలైన పరిస్థితికి దూరంగా ఉంటాయి. ఎందుకంటే మూడవ వ్యక్తికి ఎప్పుడు భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య, పరిస్థితి 100% అర్థం కాదు.  ఎదురు వ్యక్తులు వారి అనుభవాల పరంగా నిర్ణయాలు చెబుతారు.  కోపం, అసహనం, దూరం పెరుగుతాయి.. ప్రతి వాదనలో “వాళ్లు అలా చెప్పారు” అనే పదం వస్తే, దంపతుల మధ్య దూరం పెరుగుతుంది.  అది క్రమంగా బంధం చేదిపోవడానికి సారి తీస్తుంది.   బ్రేకప్ అయ్యే ప్రమాదం.. మూడవ వ్యక్తి ఎక్కువగా  జోక్యం చేసుకోవడం వల్ల ఒక దశలో నమ్మకం పూర్తిగా పోతుంది. ఇది విడాకులకు కూడా దారి తీస్తుంది. *రూపశ్రీ.

తోబుట్టువుల మధ్య బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు ఇవే..!

  ఒకే తల్లి రక్తం పంచుకుని పుట్టినా.. పెద్దయ్యాక జీవితాలు విడివడి దూరం పెరిగే బంధం తోబుట్టువుల బంధం. అయితే ఈ ప్రపంచంలో రక్త సంబంధానికి ఉన్న శక్తి, దాని ప్రత్యేకత చాలా గొప్పది. తల్లిదండ్రులకు చెప్పుకోలేని విషయాలు తోబుట్టువుకు చెప్పుకునే వారు ఎందరో ఉంటారు.   పిల్లల మధ్య ఉన్న తోబుట్టువుల బంధం  జీవితాంతం నిలిచే సంబంధం. ఈ బంధం ప్రేమతో, గౌరవంతో, పరస్పర సహకారంతో ఉండాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా కీలకం.  తల్లిదండ్రులు చేసే  ప్రవర్తన,  ప్రేమ చూపే విధానం, మందలించే తీరు, పోలికలు పెట్టడం లాంటి వాటి వల్ల ఈ బంధం బలపడవచ్చు లేదా బలహీనమవచ్చు. తోబుట్టువుల బంధం బలంగా ఉండాలంటే తల్లిదండ్రులు నేర్పించాల్సినవి ఏంటో తెలుసుకుంటే.. తోబుట్టువుల బంధం బలంగా ఉండటానికి తల్లిదండ్రులు నేర్పించాల్సిన విషయాలు.. సమాన ప్రేమ, గౌరవం.. తల్లిదండ్రులు పిల్లలను  అందరినీ సమానంగా ప్రేమించడం, గౌరవించడం చాలా ముఖ్యం. “నువ్వు పెద్దవాడివి కాబట్టి ఎప్పుడూ తక్కువగా వాదించు” లేదా “నువ్వు చిన్నవాడివి, నీ అక్క/అన్న మాట విను” అనే మాటలు కొన్నిసార్లు అన్యాయంగా అనిపిస్తాయి. పిల్లలు ఇద్దరూ తల్లిదండ్రుల దృష్టిలో సమానమైనవారమనే భావన కలిగి ఉండాలి. ఇది అసూయ లేదా అసమానత ఫీలింగ్ రాకుండా చేస్తుంది.  సహకారం, పంచుకోవడం నేర్పించాలి.. చిన్నప్పటి నుంచే కలిసి ఆటలు ఆడించడం, పని చేయించడం, ఒకరికొకరు సహాయం చేసుకోడం అలవాటు చేయాలి. కలసి చేసే పనులు జట్టు భావన,  బాధ్యతా భావం పెంచుతాయి. కష్టాలు, ఇబ్బందులు పంచుకోవడం..  పిల్లలు తమ ఇబ్బందులను ఒకరితో ఒకరు చెప్పుకోవడం, ఒకరికి ఒకరు సహాయం చేసుకోడం, ఒకరి ఇబ్బందులలో మరొకరు తోడు ఉండటం చిన్నతనం నుండే తల్లిదండ్రులు నేర్పించాలి. దీనివల్ల తోబుట్టువు అంటే ధైర్యం, భరోసా ఏర్పడతాయి.  వివాదాలు వచ్చినప్పుడు న్యాయంగా వ్యవహరించడం.. తల్లిదండ్రులు పిల్లల పట్ల న్యాయంగా ఉండాలి. ఎప్పుడు ఒకరికే తమ సపోర్ట్ ఇవ్వడం, తప్పు చేయకపోయినా ఇంకొకరిని తిట్టడం లాంటివి చేయకూడదు. వివాదాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఒకరి వెంట మరొకరు ఎలా సపోర్ట్ ఉండాలో కూడా నేర్పించాలి.  పోలికలు కాదు ప్రోత్సాహం ఇవ్వడం.. “నీ తమ్ముడు బాగా చదువుతున్నాడు, నువ్వు ఎందుకు చదవడం లేదు?” లాంటి పోలికలు బంధాన్ని పాడుచేస్తాయి. ప్రతిఒక్కరి బలాలు వేరు.  ఒకరు చదువులో, మరొకరు క్రీడల్లో మెరుస్తారు.  “నీకు వంట బాగా వస్తుంది, నీ అక్క డ్రాయింగ్ బాగా వేస్తుంది”  ఇలాంటి మాటలు  వల్ల ఇద్దరూ తమతమ ప్రతిభను గౌరవిస్తారు.   సమయం కేటాయించడం.. పిల్లలతో సమయం గడపడటం చాలా ముఖ్యం. మరీ ముఖ్యంగా పిల్లల అభిరుచిని బట్టి వారికి సమయాన్ని కేటాయించాలి.  ఇలా చేస్తే పిల్లలందరికీ తల్లిదండ్రులు “నన్ను ప్రత్యేకంగా చూసుకుంటున్నారు” అనే భావన వస్తుంది.  ఇది అసూయ తగ్గిస్తుంది. ప్రేమ చూపే విధానం నేర్పించడం.. తోబుట్టువులు ఒకరికి ఒకరు ప్రేమ చూపడం, క్షమించుకోవడం నేర్పించాలి. “అన్నకు sorry చెప్పు” అనడం కాకుండా, “నీ మాట వల్ల అన్నకి బాధ కలిగింది, ఇప్పుడు ఎలా సరిచేస్తావు?” అని అడగాలి.  ఇది మనసును అర్థం చేసుకునే నైపుణ్యాన్ని పెంచుతుంది.                           *రూపశ్రీ.

ఈ రెండూ మీ జీవితాన్ని మార్చేస్తాయ్!

మీరు కొత్త సంవత్సరంలో తీసుకున్న దృఢ నిర్ణయాలు సంగతి ఏమిటి? వాటి సంగతే మర్చిపోయారు కదూ! ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుంటే తప్ప గుర్తుకురావడం లేదు కదూ! మీరే కాదు, ఇలాగే చాలా మంది 'కొత్త సంవత్సరంలో బరువు తగ్గాలనీ, వేకువజామున లేచి వ్యాయామం చేయాలనీ, లేదా నడకకు వెళ్ళాలనీ, ప్రతి రోజూ ఫలానా సమయంలో చదువుకోవాలనీ, తినడం తగ్గించాలనీ' తాము ఇలా మారాలనుకున్న విషయాలను జనవరి 1వ తేదీన సంప్రదాయంగా తీసుకునే నిర్ణయాలుగా మార్చి, ఈపాటికి మర్చిపోయే ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో నిర్ణయాలు తీసుకునేవారు ఇరవైనాలుగు గంటలు గడవకముందే తమ ప్రమాణాలను తీసి గట్టున పెడతారని ఒక సర్వేలో తేలింది. మనం తీసుకునే ఇలాంటి కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో మనకు ప్రయోజనాలను చేకూరుస్తాయని తెలిసినా నిర్ణయాలకు కట్టుబడి ఉండడం లేదు. మొదటి రోజున్నంత దృఢ నిశ్చయం ఆ తరువాత లేకపోవడం, అవి కేవలం ఉద్వేగభరితమైన మాటలుగానే మిగిలిపోవడం చాలామందికి నిత్యం అనుభవమే. సంకల్పబలం, క్రమశిక్షణ మాత్రమే అంతర్గత శక్తిని మేల్కొలిపి, బలహీనతల్ని జయించేలా చేయగలవు. జీవితంలో ఏదైనా మార్పు తీసుకురావాలంటే పై రెండూ సహకరించకుండా ఏదీ సాధ్యం కాదు. సంకల్పబలం : సంకల్పబలం కలిగినవాళ్ళు మానసిక బలహీనతలకు దూరంగా ఉంటారు. సోమరితనాన్నీ, వాయిదా మనస్తత్వాన్నీ ఆమడదూరంలో ఉంచుతారు. జీవితంలో తమదంటూ ప్రత్యేకశైలితో ఉంటూ విజయం వైపు పయనిస్తారు. అనవసరమైన, పనికిరాని అలవాట్లకు బానిసలు కారు. వారిలోని అంతర్గత శక్తి వారిని ఉద్వేగాలకు గురి కాకుండా మార్పునకు వ్యతిరేకధోరణిని వ్యక్తం చేయనీయ కుండా వారిని మానసికంగా బలవంతులుగా తయారుచేస్తుంది.  క్రమశిక్షణ : క్రమశిక్షణ అనేది సంకల్పబలంతో కలసి పనిచేసే మానసిక శక్తి. అనుకున్నవి సాధించే ప్రయత్నంలో భాగంగా సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక, శారీరక, ఆధ్యాత్మిక శక్తినిచ్చేదే క్రమశిక్షణ. ముఖ్యంగా క్షణికసుఖాలను దూరంగా ఉంచి ఉత్తమ నిర్ణయాలను తీసుకునే శక్తిని కూడా ఇస్తుంది. ఉదాహరణకు క్రమశిక్షణ కలిగిన విద్యార్థి సంకల్పబలం తోడైతే గంటసేపు టీవీ చూసే కన్నా చదువు మీదే పెట్టే సమయం వల్ల ప్రయోజనం కలుగుతుందనీ, పొద్దున్న ఇంకా నిద్రపోవడం కన్నా వాకింగ్ చేయడం, యోగాభ్యాసం చేయడం ఉత్తమమనీ తెలుసుకుంటాడు. ప్రయోజనాలు: సంకల్పబలం, క్రమశిక్షణ తోడైతే మనిషి తన ప్రవర్తనలను, చర్యలను, ఉద్వేగాలను అదుపులో ఉంచుకునే చైతన్యస్థితిలో ఉంటాడు. అవి లేనివారు వాటికి బానిసలవుతారు. మీ విషయంలోనే ఆలోచించండి. మీరు కచ్చితంగా ఈ సారి చేయాలని నిర్ణయించుకున్న పనులు ఎన్ని వాయిదా వేసుకున్నారు? ఒక పని మొదలు పెట్టి తరువాత వదిలేసిన అనుభవాలున్నాయా? పై బలహీనతల నుంచి బయట పడి, అనుకున్న పని అనుకున్న సమయంలోనే పూర్తిచేసినప్పుడు కలిగే విజయగర్వం, మానసిక తృప్తి, తత్సబంధ ఫలితాలు అనుభవిస్తేనే తెలుస్తుంది. ఇలా భావాల్ని అదుపులో ఉంచుకుని క్రమశిక్షణతో జీవించడమంటే జీవితాన్ని నిస్సారంగానో, నిస్తేజంగానో గడిపినట్లు అనుకుంటారు కొంతమంది. నిజానికి ఇలా జీవించడమే, అనవసర ఆలోచనలను దూరం చేసి ఉత్సాహంగా ఉండటమంటే...                                   ◆నిశ్శబ్ద.

కాస్త ఆలోచించుకోండి!

సాధారణంగా చాలామంది ఈకాలంలో ఆన్లైన్ షాపింగ్ విషయంలో ఎప్పుడూ ముందుంటారు. ఆన్లైన్ షాపింగ్ డెలివరీ సేవలు పల్లెపల్లెకు విస్తరించడంతో పట్టణాల నుండి మాత్రమే కాకుండా పల్లెల నుండి షాపింగ్ చేసేవారే ఎక్కువయ్యరు. ఈ ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ లు ఇచ్చే ఆఫర్ లు, కొన్ని ముఖ్యమైన రోజుల్లో ఇచ్చే డిస్కౌంట్ లు, ఓ నిర్ణీత ధరకు షాపింగ్ చేయడం వల్ల ఫ్రీ డెలివరీ ఇవ్వడం వంటి కారణాల వల్ల వీటిలో సందడి బాగానే ఉంటుంది.  టౌన్స్ లో సూపర్ మార్కెట్లు, డీ మార్ట్ లు, రిలయన్స్ మార్ట్ మొదలైనవి ఉండటం వల్ల కొన్ని అవసరమైనవి బయటకెళ్లి తెచ్చుకుంటూ ఉంటారు. కానీ పల్లెల్లో నివసించేవాళ్లకు సీన్ రివర్స్ లో ఉంటుంది. లోకల్ వస్తువుల లిస్ట్ చాలా చిన్నగా ఉంటుంది. ఇప్పటి ఇంటి అవసరాలకు ఉపయోగపడే వస్తువుల నుండి, ఫుడ్ ఐటమ్స్ వరకు లోకల్ లో దొరకడం కష్టమే. ఇలాంటి వాటిని పాయింట్ చేసుకుని ఆన్లైన్ అమ్మకాల జోరు పెరిగింది. దుస్తులు, కిచెన్ ఐటమ్స్, ఫుడ్ ఐటమ్స్, చెప్పులు లాంటివి అన్ని ఆన్లైన్ లో దొరికేస్తున్నాయి. అయితే ఈ ఆన్లైన్ షాపింగ్ మాయలో పడి సాధారణం కంటే ఎక్కువ ఖర్చులు చేసేస్తున్నారు అందరూ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇంతకు చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటి?? ఆన్లైన్ షాపింగ్ ను  ఎలా చేయడం వల్ల మంచిది? ఆఫర్స్ చూసి ఎగబడద్దు! చాలామంది ఆఫర్స్ చూశారంటే చాలా తొందరపడతారు. స్టాక్ అయిపోతే కొంప కొల్లేరు అయిపోతుందేమో అన్నంత ఫీలవుతారు. అందుకే తొందరగా కార్ట్ లో వేయడం, వెంటనే ఆర్డర్ పెట్టేయడం చేస్తారు. పూర్తి డెలివరీ అయిన తరువాత వచ్చిన ఐటమ్స్ చూసి ఏడుపెత్తుకుంటారు. కొంతమంది ఏమవుతుందిలే రిటర్న్ చేసేయచ్చు అనే తెలివి ఉపయోగిస్తారు అయితే అక్కడే పప్పులో కాలువేస్తున్నారు. కొన్ని ఐటమ్స్ కు రిటర్న్ పాలసీ ఉండదు. ఆ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. టచ్ చేయద్దు! చాలామంది డిస్కౌంట్ చూశారంటే డమాల్ అయిపోతారు. అబ్బాబ్బా ఎంత ఖరీదైన వస్తువు ఎంత తక్కువ ధరకు వస్తుంది అని తెగ ఖుషీ అయిపోతారు. ఆ వస్తువుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎలక్ట్రానిక్ పరికరాలు చాలా తక్కువ ధరకు ఇస్తున్నాడంటే అందులో ఉన్న ఇన్నర్ పార్ట్శ్ నకిలివి కావచ్చు. ఇలాంటి ఫ్రాడ్ లకు ఏ ఆన్లైన్ ప్లాట్ఫామ్ బాధ్యత వహించదు. కాబట్టి అవగాహన రిటర్నబుల్  పాలసీ ఉంటే తప్ప ఎలక్ట్రానిక్ పరికరాలు కొనద్దు. అనవసరంగా కొనద్దు! కొందరికి ఆఫర్లు, డిస్కౌంట్ చూసి అవసరం లేకపోయినా కొన్ని వస్తువులు కొనాలనిపిస్తుంది. అలా కొనడం వల్ల ఆ వస్తువును ఎప్పుడు వాడతారో ఆ దేవుడికే తెలియాలి. చాలామంది ఇళ్లలో ఇలాంటి స్టఫ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాటి కోసం పెట్టె ఖర్చుతో కొన్ని ఇంటి అవసరాలు తీరవచ్చు. కాబట్టి మధ్యతరగతి, దిగువ తరగతి వారు ఇలాంటి ఆఫర్ల మాయలో పడి డబ్బు వేస్ట్ చేసుకోకండి. స్పెషల్ డేస్! పండుగలకు ముందు, ఆయా షాపింగ్ వారి యనివర్సరీ రోజుల్లో మంచి మంచి డిస్కౌంట్ ఆఫర్లు పడుతుంటాయి. అలాంటి సమయాల్లో కావలసిన వస్తువులను రిటర్న్ పాలసీ చూసి కొనుగోలు చేయవచ్చు. వస్తువు బాగుంటే ఉంచుకుంటాం. లేకపోతే రిటర్న్ పెట్టేయచ్చు.  కొందరు అనుకుంటారు. ఇంత తక్కువ ధరకు ఎలా ఇస్తారు అని. ఎక్కువగా అమ్ముడుపోతుంటే వాటిని తయారుచేసే వారికి తయారీ సరుకు కొనుగోలుకు కూడా ధర తక్కువగా పడుతుంది. కిలో మామిడిపళ్ళు కొనేవాడు ఏకంగా బుట్ట పళ్ళు కొంటె వాడికి ఒక్కొక్క పండు తక్కువ ధరకు వస్తుంది. అదే విధంగా ఈ ఆన్లైన్ మార్కెట్లలో కూడా వస్తువుల ఉత్పత్తుల విషయంలో జరుగుతుంది. కాబట్టే తక్కువ ధరకు అమ్మకానికి పెడతారు. ఇలాటి ఆఫర్ల సమయంలో మరీ అంత నాణ్యమైనవి కాకపోయినా పెడుతున్న ఖర్చుకు సాటిసిఫై అయ్యేలా ఉండే వస్తువులను పొందడం మాత్రం తప్పనిసరి. ఏది ఏమైనా ఆన్లైన్ షాపింగ్ విషయంలో మరీ అంత దూకుడుగా ఉండొద్దు.                                 ◆ వెంకటేష్ పువ్వాడ.

ఈ విషయాలు ఎవరితోనైనా చెప్పారో..జీవితాంతం పశ్చాత్తాపడాల్సిందే..!

ఆచార్య చాణక్యుడు తన జ్ఞానం, బోధనలు, నైతికతకు నేటికీ ప్రసిద్ధి చెందాడు. మన జీవితంలో చాణక్యుడి సూత్రాలను పాటించడం ద్వారా మనం విజయవంతమైన జీవితాన్ని పొందవచ్చు. డబ్బు, ఆరోగ్యం, వ్యాపారం, వైవాహిక జీవితం మొదలైన అనేక అంశాలపై చాణక్యుడు తన నీతిలో చాలా ఆలోచనలను వివరించాడు. ఆయన సూత్రాలకు నేటికీ ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక వ్యక్తి తన జినాలోని కొన్ని ఆలోచనలను ఇతరులతో పంచుకోకూడదని చెప్పాడు. ఈ విషయాలు ఎల్లప్పుడూ దాచుకోవాలి.  ఎందుకంటే ఇది మనకు హాని కలిగిస్తుంది. కాబట్టి ఇతరుల నుండి ఎప్పుడూ దాచవలసిన ఆలోచనలు ఏమిటో తెలుసుకుందాం. మీ వయస్సు గురించి: ఆచార్య చాణక్య తన చాణక్య నీతిలో ఒక వ్యక్తి తన వయస్సు గురించి ఎవరికీ చెప్పకూడదని.. అతని వయస్సును ఎల్లప్పుడూ రహస్యంగా ఉంచాలని చెప్పాడు. ఎందుకంటే మీ శత్రువులు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. బహుమతిని రహస్యంగా ఉంచండి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, గురువు ఏదైనా ప్రత్యేక మంత్రాన్ని లేదా జ్ఞానాన్ని ఒక వ్యక్తికి అప్పగిస్తే, అతను దానిని మరెవరికీ చెప్పకూడదు. దానధర్మం చేయడం పుణ్య కార్యంగా పరిగణించబడుతున్నప్పటికీ, ఇతరుల ముందు దానధర్మం చెప్పకూడదు.  మీరు మతపరమైన కార్యకలాపాల కోసం ఇచ్చిన విరాళాల గురించి ఎవరితోనూ పంచుకోకూడదు. ఎందుకంటే మీరు దీని నుండి ఎటువంటి పుణ్యాన్ని పొందలేరు. వైవాహిక జీవితం గురించి: వైవాహిక జీవితం అనేది భార్యాభర్తల మధ్య ప్రేమ, సంరక్షణ నుండి కలహాల వరకు అనేక అంశాలను కలిగి ఉంటుంది. చాలా విషయాలు  రహస్యంగా ఉంటాయి, అటువంటి పరిస్థితిలో, మీరు మీ వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలను మూడవ వ్యక్తితో పంచుకుంటే, మీ ఇద్దరికీ నష్టం జరగవచ్చు. మీ వైవాహిక జీవితం గురించి చాలా మంది ఆడుకోవచ్చు. సంపద గురించి: ఆచార్య చాణక్యుడు ప్రకారం, తన సంపద, సంపాదన గురించి ఎవరికీ చెప్పకూడదు. మీరు ఎల్లప్పుడూ మీ ఆదాయాలను గోప్యంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ప్రజలు దానితో మిమ్మల్ని బాధపెడతారు. పై ఆచార్య చాణక్యుడి ఆలోచనలను మనం ఎప్పుడూ రహస్యంగా ఉంచాలి. లేకపోతే, అది మీకు మరిన్ని సమస్యలకు దారితీయవచ్చు. ఇది మిమ్మల్ని కోపం..అసంతృప్తికి గురి చేస్తుందని గుర్తుంచుకోండి.  

ఆలోచన ఉద్దేశం ఎలా ఉండాలి?

ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే. ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు. ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం. ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి. శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి.  ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు. అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.                                  ◆నిశ్శబ్ద.

ఈ మూడు పనులు చేసే మగాళ్లకు తమ భార్యల మీద అస్సలు కోపముండదట!

భార్యాభర్తలకు ఒకరి మీద మరొకరికి కోపం రావడం సహజం. ఆ కోపం చాలా మటుకు ఎలా వస్తుందో అలాగే వెళ్లిపోతుంది కూడా. కొందరి విషయాలలో మాత్రమే కోపాలు కాస్తా గొడవలకు, అవి కాస్తా తెగదెంపులకు దారి తీస్తాయి. ఎలాంటి గొడవలు జరిగినా, ఏ సమస్య వచ్చినా అవి చాలా వరకు పరిష్కారం అవడం అనేది భార్యాభర్తలు వాటికి రియాక్ట్ అవ్వడం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇంకొక విషయం ఏమిటంటే.. భార్యాభర్తల సాధారణ ప్రవర్తన కూడా వారికి తమ భాగస్వామి మీద కోపం వస్తుందా? రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుంది. సాధారణంగా మగవారు చేసే మూడు పనులు వారికి తమ భార్యల మీద కోపం వస్తుందా రాదా అనే విషయాన్ని స్పష్టం చేస్తుందట. ఇంతకీ భర్తలు చేసే ఆ మూడు పనులేంటంటే.. సహాయం..  పనిని జెండర్ ఆధారంగా విభజించకుండా అన్ని పనులు అందరూ చేయవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకుంటారో అలాంటి భర్తలు భార్యలను అస్సలు కోపగించుకోరట. పైపెచ్చు ఇలాంటి భర్తలు తమ భార్యలకు ఎంచక్కా సహాయం కూడా చేస్తారట. ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే భర్తలు సహాయం చేస్తే భార్యలు చాలా సంతోషిస్తారు.  భర్తలకు అనుగుణంగా ఉంటారు. భార్యలు కూడా  ఇలాంటి భర్తలకు కోపం తెప్పించే పనులు అస్సలు చెయ్యరు. ప్రేమను వ్యక్తం చేయడం.. చాలామంది మగాళ్లకు భార్య మీద బోలెడు ప్రేమ ఉంటుంది. కానీ అదంతా ఇంట్లోనో లేక పడక గదిలోనో మాత్రమే బయట పెడుతుంటారు. కానీ భార్య మీద ఉన్న ప్రేమను ఎలాంటి సంకోచం లేకుండా బహిరంగంగా బయటపెట్టే భర్తలకు తమ భార్యలంటే ఎనలేని ప్రేమ ఉంటుంది. ఇలాంటి భర్తలకు అస్సలు భార్యలమీద కోపం అనేది కల్లో కూడా ఉండదేమో అన్నంత ప్రేమగా ఉంటారు. నలుగురిలో భార్య మీద కోప్పడే మగాడు కాదు.. నలుగురిలో భార్య మీద ప్రేమ కురిపించే మగాడిని చూసి భార్య గర్వపడుతుంది. అలాంటి భర్తను గౌరవిస్తుంది. సమయాన్ని  గడపడం.. భార్య కోసం సమయాన్ని వెచ్చించే భర్త ఎప్పుడూ భార్య మీద కోపం చేసుకోడు. ఎందుకంటే అతను భార్య కోసం సమయాన్ని వెచ్చించడంలోనే అతని ప్రేమ వ్యక్తం అవుతుంది. ఇక తన కోసం సమయం కేటాయిచే  భర్తంటే భార్యకు కూడా గౌరవం. ఇద్దరూ కలిసి గడిపే సమయంలో భార్యాభర్తలు ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకోవడం, ఒకరికొకరు మద్దతుగా ఉండటం ఇలా అన్నీ వారి బంధాన్ని దృఢంగా మారుస్తాయి.                                                 *నిశ్శబ్ద. 

పెళ్ళికి ముందు ఈ 5 విషయాలు కూతుళ్లకే  కాదు.. కొడుకులకు కూడా నేర్పించాలి..!

  వివాహం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య బంధం మాత్రమే కాదు రెండు కుటుంబాల మధ్య బంధం. కొత్త సంబంధాలకు సర్దుబాటు కావడానికి సమయం పడుతుందనేది అంగీకరించాల్సిన వాస్తవం. సాధారణంగా తల్లిదండ్రులు తమ కుమార్తెను అత్తవారింటికి పంపేటప్పుడు  ఆమె అత్తమామల ఇంట్లో ఎలా ఉండాలో.. మంచి భార్యగా,  కోడలుగా ఎలా ఉండాలో కొన్ని విషయాలు చెబుతారు. అలాగే అత్తారింట్లో పనులన్నీ ఎలా చేయాలో కూడా నేర్పించి మరీ పంపుతారు. కానీ వివాహం తర్వాత మంచి భర్తగా,  అల్లుడిగా ఎలా ఉండాలో అబ్బాయిలకు నేర్పించే తల్లిదండ్రులు బహుశా చాలా అరుదుగా ఉంటారని చెప్పాలి. పెళ్లి తర్వాత అమ్మాయిలు మానసికంగా,  ఆచరణాత్మకంగా తమ అత్తమామల ఇంట్లో సర్దుబాటు చేసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. కానీ అబ్బాయిలు ఈ పరిస్థితికి సిద్ధంగా ఉండరు.  అయితే పెళ్లికి ముందు కూతుళ్లకు ఎన్నో విషయాలు నేర్పించే తల్లిదండ్రులు,  పెళ్ళి తర్వాత ఎలా ఉండాలి అనే విషయం గురించి కొడుకుకు కూడా కొన్ని నేర్పించాల్సి ఉంటుంది.  ఇలా చేయడం వల్ల పెళ్లి తర్వాత  అబ్బాయి మంచి భర్తగా మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన  అల్లుడుగా కూడా మారతాడు. అర్థం చేసుకునే కొడుకు మాత్రమే రెండు కుటుంబాలను కలిపి ఉంచగలడుయ  కోడలికి తన అత్తమామల ఇల్లు తన  'ఇల్లు' అని అనిపించేలా చేయగలడు. ఇందుకోసం పెళ్లికి ముందు కొడుకులకు తల్లిదండ్రులు ఏం చెప్పాలో.. ఏం నేర్పించాలో తెలుసుకుంటే.. సమానత్వం.. వివాహం తర్వాత భార్య తన బాధ్యత మాత్రమే కాదు, తన జీవిత భాగస్వామి కూడా అని  కొడుకుకు చెప్పాలి. ఇంటి ప్రతి నిర్ణయంలో ఆమెను అభిప్రాయం తీసుకోవాలని చెప్పాలి.  భార్య భావాలను,  అభిప్రాయాలను గౌరవించడం, కోడలు ఆ ఇంట్లో గెస్ట్ లేదా పని మనిషి లాంటిది కాదని  ఇంట్లో ఆమెకు శాశ్వత స్థానం ఉంటుందని చెప్పాలి. సమతుల్యత.. వివాహం తర్వాత కొడుకు తరచుగా తన తల్లి,  భార్య మధ్య చిక్కుకుపోతాడు. సంబంధాలలో సామరస్యం ముఖ్యమని, పోలిక కాదని కొడుకులకు  వివరించి చెప్పాలి. కొడుకు సమతుల్యతను కాపాడుకుంటే కోడలికి ఇంట్లో ఎటువంటి సమస్య ఉండదు.  లేదా తల్లికి ఎటువంటి ఫిర్యాదు ఉండదు. అతని భార్య,  తల్లి మధ్య ఏదైనా విభేదాలు ఉంటే ఇద్దరి మధ్య తేడాలు తగ్గించడానికి ప్రయత్నం చేయాలి.  అంతే తప్ప ఒకరికే సపోర్ట్ చేస్తూ ఏకపక్షంగా ఉండకూడదు.   సహాయం.. ఇంటి పనులు కేవలం మహిళల బాధ్యత మాత్రమే కాదని పెళ్లికి ముందు  కొడుకుకు వివరించాలి. కొన్నిసార్లు  భార్యకు చిన్న విషయాలలో సహాయం చేయడం,  ఆమెను మానసికంగా  మరియు ాలా ఊరట ఇస్తుంది. భార్యతో సంబంధాన్ని బలపరుస్తుంది.  కూతుళ్ల లాగే  కొడుకు కూడా ఇంటి పనులలో సహాయం చేయమని చెప్పాలి. తద్వారా అతను తన భార్యకు సహాయం చేయడంలో సిగ్గుపడడు,  అతను ఇంటి పనులపై అవగాహన పెంచుకుంటాడు. అత్తవారిల్లు.. పెళ్లి తర్వాత కోడలు తన అత్తామామలను తన తల్లిదండ్రులుగా భావించి కుటుంబంలో కలిసిపోవాలంటే..  తన భార్య తల్లిదండ్రులను గౌరవించడం కూడా అంతే బాధ్యత అని  కొడుకుకు చెప్పాలి. కోడలు తల్లిదండ్రులను, ఆమె కుటుంబాన్ని తన సొంత కుటుంబ సభ్యులుగా భావించాలి. ఇలా ఉంటే కోడలు కూడా తన అత్తామామలను తన తల్లిదండ్రుల లాగే చూసుకోవడం జరుగుతుంది.   రెండు కుటుంబాలను ఏకం చేయడం కొడుకు బాధ్యత కూడా. ప్రైవసీ.. భార్యాభర్తల మధ్య విషయాలు వ్యక్తిగతమైనవి. చిన్న చిన్న విషయాలను బయట పంచుకోవడం లేదా తల్లిదండ్రులతో ప్రతిదీ పంచుకోవడం,  అక్కా చెల్లెళ్లు, అన్నాదమ్ములతో ప్రతీది చెప్పడం  వల్ల అపార్థాలు వస్తాయని  కొడుకుకు నేర్పాలి. మంచి భర్త లక్షణం ఏమిటంటే అతను తన సంబంధం  గౌరవాన్ని కాపాడుకోవడం. అతను ఆ గౌరవాన్ని కాపాడటానికి ప్రయత్నం చేస్తే భార్య కూడా అతనికి సహకారంగా వ్యక్తిగత విషయాలను ఎవరితో పంచుకోకుండా ఉంటుంది.                           *రూపశ్రీ.

జీవితంలో అనుకరణ ఎంతవరకు మంచిది!

పిల్లలు పెద్దల్ని అనుకరించడం, వాళ్ళలాగే గొప్పవాళ్ళు కావాలని ఆశించడం సహజమైన విషయం. మనం మనకు తెలియకుండానే ఇతరులను అనుకరిస్తుంటాం. మన జీవితంలో ఈ'అనుకరణ'ఎంత వరకు అవసరమో తెలుసుకోవడం మంచిది. తల్లితండ్రులతో మొదలు..  పిల్లలు ప్రధానంగా తల్లి తండ్రులను అనుకరిస్తారు. కాబట్టి తల్లితండ్రులు ముందుగా ఆదర్శవంతమైన జీవితాన్ని గడిపితే పిల్లలు వారంతట వారే అమ్మా నాన్నల నుంచి అన్నీ నేర్చుకుంటారు. ఈ రోజుల్లో తల్లి తండ్రులకు పిల్లలతో కాస్త సమయం గడపడానికే తీరిక లేనప్పుడు వారి నుంచి పిల్లలు ఏం నేర్చుకోగలరు? నేటి తరం వారికి టీవీ, ఇంటర్ నెట్లో మిత్రులు, బంధువులు. పిల్లలు ఏమైనా పాఠాలు నేర్పుతున్నది ఇవే.. వీటిలో ఏముంటాయో  మనకూ తెలుసు. ఇలాంటి విషయాలు పిల్లలకు అలవాటు చేస్తే వారిలో ఏ పాటి ఉన్నత విలువలు అలవడతాయో మనం ఊహించవచ్చు. నేటి యువతరం ప్రసార మాధ్యమాల ప్రభావంతో ప్రతికూల భావాలకు బానిసలై, వాటినే తమ జీవితాల్లో అనుకరిస్తోంది. ఈ ప్రభావాలకు దూరంగా ఉంటూ, మనదైన ఉన్నత సంస్కృతికీ, ఆధ్యాత్మికతకూ ప్రాధాన్యం ఇచ్చినప్పుడే యువతీ యువకులు ప్రగతిని సాధించగలరు. వివేచనతో అనుకరణ ఉండాలి.. మనం సాధారణంగా ఒక వ్యక్తి, లేదంటే  సమాజంలో బయటకు కనిపించే ఎన్నో విషయాలకు ఆకర్షితులమై, వాటిని అనుకరించే ప్రయత్నం చేస్తాం. దీని వల్ల కొంచెం కూడా ప్రయోజనం లేకపోగా నష్టం కలిగి తీరుతుంది. సింహం చర్మాన్ని వేసుకున్నంత మాత్రాన గాడిద కాస్తా సింహం కాబోదు కదా! మనం వివేచన లేకుండా గుడ్డిగా ఎవరినైనా అనుకరిస్తే పురోగతి చెందే మాట అటుంచి, అధోగతి పాలయ్యే ప్రమాదం ఉంది. ఇలాంటి అనుకరణ వల్ల మన వ్యక్తిత్వాన్నీ, ఆత్మవిశ్వాసాన్నీ కోల్పోయి జీవచ్ఛవాలుగా మారతాం. అందుకే, మనం ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. మంచిని అనుకరిస్తేనే ఉన్నత స్థితి..  మనం చెడును అనుకరిస్తే అధోగతిని పొందినట్లే, మంచిని అనుకరిస్తే ఉన్నతమైన స్థితికి చేరుకోగలం. 'Be not an imitation of Jesus, but be Jesus. You are quite as great as Jesus, Buddha, or anybody else' అని స్వామి వివేకానంద చెప్పారు. ఈ విషయాన్ని ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుంటే.. "ఒక దొంగ అర్ధరాత్రి సమయంలో రాజమందిరానికి వెళ్ళాడు. అక్కడ రాజు, రాణితో 'మన అమ్మాయి వివాహం నదిఒడ్డున తపస్సు చేసుకుంటున్న ఒక సాధువుతో జరిపించాలి'. అన్నాడు. ఇది విన్న దొంగ 'నేను సాధువు వేషం వేసుకుంటాను. అదృష్టం బాగుంటే నన్నే రాజకుమారి వరించవచ్చు' అని మనస్సులో అనుకున్నాడు. తరువాత రోజు రాజు సేవకులు నది ఒడ్డుకు వెళ్ళి సాధువులను ఒక్కొక్కరినీ రాజకుమారిని వివాహం చేసుకోవలసిందిగా కోరారు. అయితే ఎవరూ అంగీకరించలేదు. చివరకు ఈ ‘దొంగ – సాధువు' దగ్గరకు వచ్చి అడిగారు. ఇతను మౌనం వహించాడు. మౌనాన్ని అంగీకారంగా భావించి రాజ సేవకులు వెళ్ళి, జరిగినదంతా రాజుతో చెప్పారు. రాజు స్వయంగా ఆ నది ఒడ్డుకు వచ్చి, తన కుమార్తెను వివాహం చేసుకో వలసిందిగా ఆ దొంగ సాధువును ప్రార్ధించాడు. ఆ దొంగ- సాధువు తన మనస్సులో 'నేను సాధువు వేషం వేసినంత మాత్రాన స్వయంగా రాజు నా దగ్గరకు వచ్చి బతిమాలుతున్నాడు. నేను నిజంగా సాధువును కాగలిగితే ఈ జీవితం ఎంత సార్థకమవు తుందో కదా!' అని అనుకొని, వెంటనే తన మనస్సు మార్చుకున్నాడు. భవిష్యత్తులో గొప్ప సాధువుగా ప్రఖ్యాతి చెందాడు". మనం కేవలం ఒకరిని అనుకరించడంతో ఆగిపోకుండా వారిలో ఉన్న ఉన్నత విలువలను సొంతం చేసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే జీవితంలో మంచి స్థాయికి చెరగలం.                                  *నిశ్శబ్ద.

ఒక బంధంలో విజయం సాధించాలంటే, ప్రేమలో విఫలమవడం నేర్చుకోవాలి.!!

నేటి కాలంలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు. కొందరి ప్రేమకథ పెళ్లికి దారితీయదు. ఏదైనా ప్రేమ బంధం దృఢంగా ఉండాలంటే సద్గురువు చెప్పిన ఈ మాటలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.  కొన్నిసార్లు ఇది బంధాన్ని విజయవంతం చేయడానికి సరిపోదు. బంధంలో నివసిస్తున్న ఇద్దరు వ్యక్తుల మధ్య అలాంటి కొన్ని సమస్యలు తలెత్తుతాయి. వారు తమ కోసం వేర్వేరు మార్గాలను ఎంచుకోవాలి.  వివాహాన్ని ప్రేమకు గమ్యస్థానంగా పరిగణించనప్పటికీ, జీవితాంతం కలిసి ఉండటమే అత్యంత అందమైన, పవిత్రమైన బంధం. ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు తమ ప్రేమికుడితో కలిసి కుటుంబాన్ని గడపాలని కలలు కంటారు. కానీ మీ ప్రేమను పెళ్లి దశకు ఎలా తీసుకురావాలో మీకు తెలియదు. అలాంటి వారికి సద్గురు సలహా ఉపయోగపడుతుంది. సంబంధాన్ని కాపాడుకోవడానికి సద్గురు సలహా: ఈషా ఫౌండేషన్ వ్యవస్థాపకుడైన సద్గురు, యువ తరం సమస్యలను బాగా అర్థం చేసుకుని, వారికి బాధ కలిగించకుండా వాటిని ఎలా పరిష్కరించాలో తెలిసిన మత గురువులలో ఒకరిగా పరిగణిస్తున్నారు. ప్రేమ సంబంధాన్ని మెరుగుపరచడానికి.. అతను ఇచ్చిన చిట్కాలను అనుసరించడం ద్వారా, మీరు మీ సంబంధాన్ని ప్రతి సమస్య నుండి కాపాడుకోవచ్చు. దానిని విజయవంతం చేయవచ్చు. ఈ విషయం మాత్రమే ప్రేమ సంబంధాన్ని విజయవంతం చేస్తుంది: సద్గురు చెప్పినట్లుగా, మీలో ఉన్న ప్రేమ సఫలీకృతం కావాలంటే, మీరు ముందుగా ఓడిపోవడం నేర్చుకోవాలి, ఎక్కువ కాలం ఉండకూడదు లేదా అంతం కాదు. మీ సంబంధాన్ని గెలవాలంటే మీరు ప్రేమలో ఓడిపోయిన వ్యక్తి అయి ఉండాలి. సంబంధంలో జీవిస్తున్న ఇద్దరూ దీనిని అర్థం చేసుకున్నప్పుడు, వారి జీవితమంతా ఏదీ వారిని వేరు చేయదు. వారి ప్రేమ అజరామరం. ప్రేమలో ఓడిపోవడం అంటే ఏమిటి? జీవితంలో ఎప్పుడూ ఓడిపోకండి, కానీ మీ ప్రేమికుడితో మీ సంబంధాన్ని చిరస్థాయిగా మార్చుకోవడానికి మీరు ఓడిపోవడం మంచిది. యుద్ధాల్లో గెలవాలంటే ఓడిపోయినట్లే, ప్రేమ కూడా వీటిలో ఒకటి మాత్రమే. అయితే అంతకు ముందు రిలేషన్ షిప్ లో లూజర్ అంటే అర్థం తెలుసుకోండి. మీ భాగస్వామి కోసం ఏదైనా చేయండి: ప్రతి ఒక్కరూ ప్రేమలో లావాదేవీల గురించి మాట్లాడుతారని సద్గురు చెప్పారు. అయితే అందులో ఓడిపోయిన వారిని ఎంచుకుంటేనే మీరు మీ ప్రేమ వ్యవహారాన్ని విజయవంతం చేయగలరు. దీని కోసం మీరు కోల్పోయేది ఏమీ లేదు. మీ భాగస్వామి నుండి మీరు కోరుకున్న దానికంటే ఎక్కువ చేయడం అంటే. ఇలా చేయడం వల్ల మాత్రమే ప్రేమ పెరుగుతుంది. సంబంధాలు చిరస్థాయిగా ఉంటాయి. అటువంటి వ్యక్తుల సంబంధం విజయవంతం కాదు: ఇతరులు మీ నుండి తీసుకోవాలని మీరు ఎల్లప్పుడూ ఆశించినట్లయితే, ఎవరూ మీతో సంబంధాన్ని కలిగి ఉండకూడదని సద్గురు వివరిస్తున్నారు. మీరు ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచించకూడదు: రిలేషన్‌షిప్‌లో ప్రతి ఒక్కరికీ కొన్ని అంచనాలు ఉంటాయి. భాగస్వామి మీతో నిజాయితీగా ఉండాలి, మిమ్మల్ని గౌరవించాలి, మీ ఆత్మగౌరవాన్ని దెబ్బతీయకూడదు. అంతే కాకుండా అనవసరమైన అంచనాల భారాన్ని వారి భుజాలపై వేసుకోవడం సరికాదు. ఇది మీ సంబంధాన్ని నాశనం చేస్తుంది. విజయవంతమైన ప్రేమ సంబంధం అంటే ఏమిటి? ప్రేమ సంబంధం  విజయం ప్రతి జంటకు భిన్నంగా ఉంటుంది. కొందరు వివాహ దశకు చేరుకోవడం ద్వారా తమ సంబంధాన్ని విజయవంతంగా భావిస్తారు, కొందరు దీనిని ఎల్లప్పుడూ ఒకరికొకరు సుఖంగా ఉన్నట్లు భావిస్తారు, తద్వారా మూడవ వ్యక్తి రాక వారి సంబంధాన్ని మార్చదు.