తిరుమల శ్రీవారి సేవలో ఫైనన్స్ కమిషన్ చైర్మన్ పనగారియా

16వ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగారియా శుక్రవారం (ఏప్రిల్ 18) ఉదయం అభిషేక సేవలో  తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 16వ ఫైనాన్స్ కమిషన్ బృందం ఆంధ్రప్రదేశ్ లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. పనగారియా నేతృత్వంలోని 16వ ఫైనాన్స్ కమిషన్ బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు విదేశీ పర్యటనకు బయలు దేరడానికి ముందు ఆయనతో భేటీ అయ్యింది. ఆ సందర్భంగా చంద్రబాబు వారికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.   ఒక ముఖ్యమంత్రి స్వయంగా ఆర్ధిక అంశాలపై ప్రజంటేషన్ ఇవ్వడం తమను అబ్బుర పరిచిందని ఆ సందర్భంగా పనగారియా ప్రశంసించారు.  అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వాట్సాప్ గవర్నెన్స్ పై  కూడా  ప్రశంసలు గుప్పించారు.  వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని   ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. ఈ విధానాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఇక తిరుమల శ్రీవారిని శుక్రవారం (ఏప్రిల్ 18) దర్శించుకున్నవారిలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ తదితర ప్రముఖులు ఉన్నారు.  

గోమాతల మరణాలతో వైసీపీ నీచ రాజకీయం!

ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నెన్ని అవకతవకలు జరిగాయో, ఎన్నెన్ని అపచారాలు జరిగాయో, ఏడు కొండల పవిత్రతను ఎంతగా దిగాజార్చారో ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే, ఇంటి మనిషి  సొంత బాబాయ్ ఎస్వీ సుబ్బారెడ్డిని ఒకటికి రెండు సార్లు టీటీడీ చైర్మన్ గా నియమించి స్వామి వారి సంపదను కొల్లగొట్టే ప్రయత్నం మొదలు.. అన్యమత ప్రచారాన్ని ప్రోత్సహించడం వరకు జగన్ రెడ్డి పాలనలో జరగని  పాపం అంటూ ఏదీ లేదు. అవును, టీటీడీ పాపాల పుట్టగా మారింది. అందుకే  వెంకన్న దేవుడు జగన్ రెడ్డిని, ఆయన గారి పార్టీని ఆ విధంగా శిక్షించాడు. అయినా, జగన్ అండ్ కో .. తీరు మారలేదు. టీటీడీ గోశాలలో గోవులు ఆకలి, అనారోగ్యంతో కన్ను మూస్తున్నాయని అసత్య ప్రచారికి తెర తీశారు. ఒక విధంగా, అధికార దాహంతో మహాపచారానికి పాల్పడుతున్నారు.    నిజానికి  బాబాయ్, అబ్బాయ్.. పాలనలో తిరుమలలో జరగని అపచారం అంటూ ఏదీ లేదు. అన్య మత ప్రచారం అయితే యథేచ్ఛగా సాగింది. ఒకసారి కాదు.. అనేక సార్లు అన్యమతస్తుల ఆగడాలు వెలుగులోకి వచ్చాయి, అయినా.. ఏ ఒక్కరిపైన చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.  అంతే కాదు.. అన్యమత ప్రచారాన్ని అడ్డుకున్నా, అవరోధాలు సృష్టించినా ఉపేక్షించేది లేదన్నట్లు జగన్ రెడ్డి ప్రభుత్వం ఫర్మానాలు జారీ చేసింది. అందుకే, నిబంధనలకు విరుద్ధంగా హిందూ దేవాలయాలలో పనిచేస్తున్న అన్య మతస్తులను గుర్తించి, ఇతర ప్రభుత్వ శాఖలకు బదిలీ చేయాలని సంకల్పించిన అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను  జగన్ రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రికి  బదిలీ చేసింది. అన్యమతస్తులకు అండగా నిలిచింది. నిజానికి ఎల్వీ సుబ్రమణ్యంను బదిలీ చేస్తూ తీసుకున్న నిర్ణయం  సామాన్యమైనది కాదు . హిందూ దేవాలయాల ధ్వంస రచన లక్ష్యంగా తీసుకున్న వ్యూహాత్మక   నిర్ణయంగా అప్పట్లోనే అధికార వర్గాలు, ముఖ్యంగా మాజీ ఐఎఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎల్వీ ఆకస్మిక బదిలీని అన్యమతస్తుల విషయంలో జోక్యం చేసుకోవద్దని అధికారులకు చేసిన హెచ్చరికగానే తీసుకోవాలి ఉంటుందని అప్పట్లోనే అధికారులు, పదవీ విరమణ చేసిన మాజీ అధికారులు  కొందరు పేర్కొన్నారు. ఒక్క తిరుమ లలోనే కాదు.. రాష్ట్రంలో ఎక్కడైనా, ఏ దేవాలయంలో అయినా అన్యమత ఉద్యోగుల జోలికి వస్తే  ఖబడ్దార్‌  అని అధికారులను పరోక్షగానే అయినా  ముఖ్యమంత్రి హోదాలో జగన్ రెడ్డి హెచ్చరించారని అంటారు.  మరో వంక అన్యమతస్తుల ఏరి వేతకు పూనుకున్నందుకే  చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిపై బదిలీ వేటు వేసిన తర్వాత  మరో అధికారి అలాంటి సాహసం చేయలేరని  అన్యమత ప్రచారం సాగిస్తున్న దేవాలయాల ఉద్యోగులు భరోసా ఇచ్చారు. అందుకే  ఆ తర్వాత ఏ అధికారీ ఆ సాహసం చేయలేదు. మరో వంక రాష్ట్రంలోని అనేక ప్రధాన దేవాలయాల్లో అన్యమత మత ప్రచారానికి అడ్డూ అదపూ లేకుండా  పోయిందని  అప్పట్లో అధికారులే కాదు భక్తులు కూడా ఆందోళన వ్యక్త పరిచారు.   ఆ విధంగా జగన్ రెడ్డి ఇచ్చిన భరోసాతోనే  ఆ ఐదేళ్ళ కాలంలో రాష్ట్రలో ఒకటి రెండు కాదు ఏకంగా వందకు పైగా దేవాలయాలపై దాడులు జరిగాయి. దేవుని రథాలు తగల బడ్డాయి.  గుళ్ళు కూలిపోయాయి. విగ్రహాల తలలు విరిగి పడ్డాయి. మరోవంక  ప్రభుత్వం అండదండలతో క్రైస్తవులు నామమాత్రంగా అయినా లేని గ్రామాల్లో  విదేశీ సంస్థలు సమకూర్చిన నిధులతో  చర్చిల నిర్మాణం జరిగింది.  అలాగే  కొన్ని కొన్ని చర్చిల నిర్మాణం,మరమత్తులకు నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ నిధులనే జగన్ రెడ్డి ప్రభుతం ఖర్చు చేసిందనే ఆరోపణలున్నాయి.  అందుకే  ఆంధ్రప్రదేశ్‌ సాధు పరిషత్‌ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి  జగన్ రెడ్డి  ఐదేళ్ల పాలనలో హిందువులు చాలా గడ్డు కాలాన్ని ఎదుర్కొన్నారని అన్నారు. చివరకు రామతీర్థలో రాములవారి శిరస్సు ఖండన వంటి దుర్మార్గ చర్యలకు  ఒడి గట్టినా ప్రభుత్వంపట్టించు కోలేదని ఆగ్రహం వ్యక్త పరిచారు. ఒక్కరంటే ఒక్కరినీ అరెస్ట్ చేయలేదు. ‘పాపం ..పిచ్చోళ్ళు’ అంటూ ధర్మ ద్రోహులకు జగన్ రెడ్డి ప్రభుత్వం  పిచ్చి సర్టిఫికేట్ ఇచ్చి  రక్షణ కవచంగా నిలిచింది.  అందుకే హిందూ ధార్మిక సంస్థలు జగన్ రెడ్డి హిందూ వ్యతిరేక పాలన సాగించారని  ముఖ్యంగా, తిరుమలను పవిత్రతను దిగజార్చే కుట్రలు జగన్ రెడ్డి ప్రభుత్వం చేసిందని అనేక సందర్భాలలో ఆరోపించాయి.   ముఖ్యంగా వాటికన్ సిటీని మించిన ప్రపంచ ఆద్యాత్మిక కేంద్రంగా తిరుమల ఎదుగుదలను  తట్టుకోలేకనో ఏమో  జగన్ రెడ్డి తమ ఐదేళ్ళ సుందర ముదనష్ట పాలనలో ఏడు కొండల ప్రతిష్టను దిగజార్చేందుకు శత విధాల ప్రయత్నించారని  అంటారు. అయితే.. ఆయన లక్ష్యం నెరవేరలేదు కానీ  దేవుని శిక్ష అయితే తప్పలేదు.  అవును. జగన్ రెడ్డికి అర్థమయ్యే భాషలోనే.. వెంకన్న దేవుడు సమా ధానం ఇచ్చారు. అహంకారంతో ఊగిపోయిన, ఆయన్ని పదకొండు సీట్లకు పడగొట్టి  చూపారని భక్తులు ఇప్పటికీ సంతోషం వ్యక్త పరుస్తున్నారు.  నిజానికి  వెంకన్న దేవుని ప్రతిష్టను దెబ్బ తీసే కుట్రలు జగన్ రెడ్డితో ప్రారంభం కాలేదు . గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి  ఏడు కొండలను రెండు కొండలకు కుదించి, కొండ పైనే చర్చి నిర్మాణం చేపట్టేదుకు విఫల ప్రయత్నం చేశారు. అయితే  ఆ తర్వాత ఏమి జరిగింది.   అందరికీ తెలిసిందే.  అయినా.. జగన్ రెడ్డి, చేసిందంతా చేసి ఇప్పడు టీటీడీ గోశాలో గోమాతలు చనిపోయిన సంఘటను ఆసరా చేసుకుని, రాజకీయం చేస్తున్నారు. గతంలో అయన హయాంలోనే నాసి రకం దాణా, ఎక్స్పైర్ అయిన మందులు ఇవ్వడం వలన  గోమాతాల ఆరోగ్యం దెబ్బతిన్నదని విజిలెన్స్  నివేదిక చెప్పిన నిజాన్ని మరిచి పోయి టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హిందువులను రెచ్చగొట్టే ప్రయత్నం  చేస్తున్నారు.  జగన్ రెడ్డి, తెర చాటు దర్శకత్వంలో భూమన నాటకాన్ని రక్తికట్టించే ప్రయత్నం గట్టిగానే  చేస్తున్నారు. నిజమే, కారణాలు ఏవైనా.. ఎక్కడైనా గోమాత తనువు చాలించడం ఏ హిందువునైనా బాధిస్తుంది. అయితే  గోమాతల సహజ మరణాలను రాజకీయం చేయడం  తద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం హిందువులే కాదు.. మనిషన్నవాడు ఎవడూ సమర్ధించడు. నిజానికి  ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం మత విద్వేషాలను రెచ్చగొట్టడం కూడా కొత్త కాదు. గతంలో వైఎస్  రాజశేఖర రెడ్డి  చెన్నా రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు  హైదరాబాద్ నగరంలో మత ఘర్షణలు సృష్టించి, వందల ప్రాణాలను బలితీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అందుకే జగన్ తో జాగ్రత్త అంటున్నారు.

పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ : భట్టి

హైదరాబాద్  పుప్పాలగూడ పరిసరాల్లో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్ హబ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. పుప్పాలగూడ భూముల్లో ఐటీ హబ్‌ ఏర్పాటుపై డిప్యూటీ సీఎం భట్టి  అధ్యక్షతన సమావేశమైన మంత్రులు దుదిల్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, సంబంధిత అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు. పుప్పాలగూడ పరిసరాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్ అధికారులు, రెవిన్యూ అధికారులు, స్పెషల్ పోలీస్ మ్యూచువల్ కో-ఆపరేటివ్ సొసైటీ తదితర సొసైటీలకు సుమారు 200 ఎకరాలకు పైచిలుకు భూమిని గతంలో ప్రభుత్వం కేటాయించింది.   ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఐఏఎస్‌లు, రెవెన్యూ, స్పెషల్‌ పోలీస్‌ సొసైటీలకు కేటాయించిన ఈ భూమిలో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ‘‘వివిధ సొసైటీలకు 200 ఎకరాల భూ కేటాయింపులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. పక్కనే ఉన్న మరో 250 ఎకరాల టీజీఐఐసీ భూములు కలిపి ఐటీ హబ్‌ ఏర్పాటు చేస్తాం. ఈ ఐటీ నాలెడ్జ్‌ హబ్‌తో 5 లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి’’ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు

హైద‌రాబాద్‌లో ఇద్ద‌రు పిల్ల‌ల్ని న‌రికి చంపిన త‌ల్లి

  మేడ్చల్ జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని గాజుల‌రామారంలో దారుణం జ‌రిగింది. ఓ క‌సాయి త‌ల్లి త‌న ఇద్ద‌రు కొడుకుల‌ను వేట కొడ‌వ‌లితో నరికి చంపింది. అనంత‌రం ఆమె భవనం పైనుంచి దూకి ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకుంది. హ‌త్య‌కు గురైన పిల్ల‌ల వ‌య‌సు 7, 5 ఏళ్లు ఉంటాయ‌ని స్థానికులు వెల్లడించారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని ముగ్గురి మృత‌దేహాలను స్వాధీనం చేసుకున్నారు. తేజస్విని రెడ్డి అనే మహిళ గాజులరామారం ప్రాంతంలో నివాసం ఉంటోంది. కొంతకాలంగా కుటుంబ కలహాలతో మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన తేజస్విని తన ఇద్దరు కుమారులు హర్షిత్ రెడ్డి (7), ఆశిష్ రెడ్డి (5)లను వేట కొడవలితో నరికి చంపినట్లు పోలీసులు గుర్తించారు.  పెద్ద కుమారుడు హర్షిత్ స్పాట్ డెడ్ కాగా.. తీవ్రంగా గాయపడిన చిన్న కొడుకు ఆశిష్‌ను ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మరణించాడు. చనిపోయే ముందు తేజస్విని ఆరుపేజీల సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. సూసైడ్ నోట్ లో ఆమె తన మనోవేదనను, కుటుంబపరమైన ఒత్తిడులను వివరించినట్టు సమాచారం. కేసు నమోదు చేసుకున్న అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అనంత‌రం పోస్టుమార్టం నిమిత్తం ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కుటుంబ త‌గాదాల నేప‌థ్యంలోనే ఆమె ఈ ఘాతుకానికి పాల్ప‌డి ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ సంఘ‌ట‌న‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.    

గ్రూప్-1 నియామకాలు నిలిపివేత

  తెలంగాణలో గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని,  సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని న్యాయస్ధానం టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. 2022 ఏప్రిల్ లో 503 పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ సమయంలో 3,50,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2022 అక్టోబర్‌లో గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా.. 2,80,000 మంది హాజరయ్యారు. అయితే, ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైనా.. పేపర్ లీక్ కారణంగా ఆ ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది. దాంతో 2023 జూన్‌లో మళ్లీ పరీక్షలు నిర్వహించారు. దీనిపై పలువురు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించగా.. పరీక్షల నిర్వహణలోని లోపాల నేపథ్యంలో పరీక్షలను రద్దు చేయాలని కోర్టు తీర్పునిచ్చింది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కానీ, తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పిటిషన్‌ను వెనక్కి తీసుకుంది. ఇదే సమయంలో పాత నోటిఫికేషన్‌ను రద్దు చేసి.. కొత్త నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి 19న విడుదల చేసింది.

నెల్లూరు లో ఇద్దరు దారుణ హత్య!

నెల్లూరు లో  వేరు వేరు సంఘటనల్లో ఇద్దరుు దారుణ హత్యకు గురయ్యారు.   ఈ   నెల్లూరు అయ్యప్ప గుడి వద్ద  కారు ట్రావెల్ యాజమాని అల్లా బక్షు టిఫిన్ బండి వద్ద టిఫిన్ చేస్తుండగా.. మద్యం సేవించిన ఓ గ్యాంగ్ మోటార్ బైక్ మీద వేగంగా వచ్చి బక్షు బైకును డీ కొట్టారు. దీంతో బక్షు వాళ్ళను మందలించాడు. మద్యం  మత్తులో ఉన్న వారు భక్షుతో గొడవకు దిగారు. ఆ గొడవ పెరిగి మద్యం మత్తులో ఉన్నవారిలో ఒకడు కత్తితో  బక్షు గుండెలో పొడిచాడు. కుప్పకూలి పడిపోయిన బక్షును ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. అలాగే మరో సంఘటనలో సుల్తాన్ అనే వ్యక్తిని మద్యం మత్తులో ఉన్న ఇద్దరు బండరాయి తో కొట్టి చంపారు. ఈ సంఘటన జాకీర్ హుస్సేన్ నగర్ వద్ద జరిగింది. ఇలా నెల్లూరు నగరం లో వరుసగా హత్యలు జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గడిచిన నెల రోజుల్లో నెల్లూరులో ఆరుగురు హత్యకు గురయ్యారు. నెల్లూరులో శాంతి భద్రతల పరిస్థితిపై  తెలుగు దేశం పార్టీ కి చెందిన నేతలు చంద్రబాబుకు కూడ ఫిర్యాదు చేశారు.

డ్రగ్స్ రైడ్.. హోటల్ నుండి దూకి పారిపోయిన నటుడు

  మలయాళం హీరో షైన్‌ టామ్‌ చాకో మరోసారి వార్తల్లో నిలిచారు. కొచ్చిలోని ఓ హోటల్‌లో డ్రగ్స్ వినియోగిస్తున్నారన్న సమాచారంతో జిల్లా యాంటీ-నార్కోటిక్ స్పెషల్ యాక్షన్ ఫోర్స్  బృందం  ఉదయం 11 గంటల సమయంలో రైడ్ చేసింది. అయితే పోలీసులు హోటల్‌కు రావడానికి కొద్దిసేపటి ముందే షైన్ టామ్ చాకో మూడో అంతస్తులో ఉన్న రూం కిటికీ నుండి రెండో అంతస్తులోకి దూకి, అక్కడి నుంచి మెట్ల ద్వారా చాకో పారిపోయినట్లు తెలుస్తోంది. అంతకు ముందు సూత్రవాక్యం అనే సినిమా షూటింగ్ సమయంలో షైన్ టామ్ చాకో డ్రగ్స్ తీసుకొని తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని నటి విన్సీ సోనీ అలోషియస్ ఆరోపించింది.  ఈ నేపథ్యంలో ఆమె సదరు నటుడిపై కేరళ చిత్ర పరిశ్రమలో మరియు అమ్మ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేసింది. గతంలో ఓ డ్రగ్స్ కేసు నుంచి నిర్దోషిగా విడుదలైన కొద్ది రోజుల్లోనే డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. దసరా మూవీతో టాలీవుడ్‌లో క్రేజ్ తెచ్చుకున్న మలయాళ నటుడు షైన్ టామ్ చాకో. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విలన్‌గా ప్రేక్షకులను మెప్పించారు. గతేడాది విడుదలైన తెలుగు మూవీ దేవరలోనూ కీలక పాత్ర పోషించారు. ఇటీవల విడుదలైన అజిత్ కుమార్‌ గుడ్ బ్యాడ్‌ అగ్లీ చిత్రంలోనూ కనిపించారు.

జగన్ అక్రమాస్తుల కేసు.. దాల్మియా సిమెంట్స్ ఆస్తుల అటాచ్

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఒక విధంగా జగన్ కి  ఎన్ఫోర్సమెంట్ డైరెక్టరేట్  ఝలక్ ఇచ్చింది. అక్రమాస్తుల కేసులో  793 కోట్ల రూపాయల విలువైన దాల్మిచా సిమెంట్స్ ఆస్తులను గురువారం (ఏప్రిల్ 17) అటాచ్ చేసింది. ఈ అటాచ్ చేసిన వాటిలో దాల్మిచా సిమెంట్స్ భూములు కూడా ఉన్నాయి.   కడప జిల్లాలో 417 హెక్టార్ల భూమి కేటాయింపు విషయంలో దాల్మియాపై ఆరోపణలు ఉన్నాయి. కడప జిల్లాలో దాల్మిచా సిమెంట్స్ కు సున్నపురాయి లీజు కేటాయింపుల వెనుక  జగన్ ఉన్నారని సీబీఐ గతంలో చార్జిషీట్ కూడా దాఖలు చేసిన సంగతి తెలిసిందే.  ఈ వ్యవహారంలో జగన్ 150 కోట్ల రూపాయలకు పైగా లబ్ధి పొందారని కూడా సీబీఐ ఆ చార్జి షీట్ లో పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ 150 కోట్ల రూపాయలలో 55 కోట్ల రూపాయలు హవాలా రూపంలోనూ, దాల్మియా సిమెంట్స్ లో షేర్ల రూపంలో 95 కోట్ల రూపాయలు  జగన్ కు చేరాయని సీబీఐ చార్జి షీట్ లో పేర్కొంది. ఆ చార్జి షీట్ ఆధారంగానే ఈడీ విచారణ జరిపింది. తాజాగా దాల్మియా సిమ్మెంట్స్ ఆస్తులను అటాచ్ చేసింది.   వాస్తవానికి జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ చార్జి షీట్ దాఖలు చేసి పన్నెండేళ్లు దాటింది. ఇప్పటి వరకూ విచారణ నత్తనడకనే సాగుతోంది. దర్యాప్తు దారీ అలాగే ఉంది. అటువంటిది హఠాత్తుగా ఉరుములేని పిడుగులా దాల్మియా ఆస్తులను అటాచ్ చేస్తూ ఈడీ ఉత్తర్వులు జారీ చేయడం సంచలనంగా మారింది. ఈ పరిణామంతో జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు వేగం పుంజుకున్నట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

పోలీసులు అడ్డుకున్నారంటూ రోడ్డుపైన బైఠాయింపు.. భూమన ఇంటి వద్ద హైడ్రామా

తిరుపతిలోని ఎస్పీ  గో  శాలలో గడిచిన మూడు నెలల్లో 100  గోవులు మృతి చెందాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపణల నేపథ్యంలో తిరుపతిలో గురువారం (ఏప్రిల్ 17) తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కరుణాకరరెడ్డి ఆరోపణలు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఖండించారు. అలాగే టీటీడీ  ఈవో శ్యామల రావు, కూటమి నాయకులు కూడా ఖండించారు. గడిచిన కొద్ది  రోజులుగా ఈ వివాదం కొనసాగుతున్నది. అనవసర ఆరోపణలు చేయడం భావ్యం కాదని కూటమి ఎమ్మెల్యే లు, ఎంపీలు, నాయకులు చెబుతున్నారు.  సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ సైతం గోశాలను సందర్శించి వివాదం కారణమైన భూమన ఆరోపణల్లో నిజం లేదని,  గోవులు సహజంగా మరణిస్తే దానికి రాజకీయం రంగు పులమడం సరైంది కాదని సూచించారు.   ఈ నేపథ్యంలోనే గోశాల ఆరోపణల పై తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులు ఎక్స్ వేదికగా జగన్ కు, టీటీడీ మాజీ  చైర్మన్ భూమన కు గోశాలకు రావాలని సవాల్ విసిరారు. ఆ సవాల్ ను స్వీకరించిన   భూమన కరుణాకర్ రెడ్డి ఎ  గురువారం ఉదయం 10 గంటలకు వస్తానని ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.  మరో వైపు కూటమి నాయకులు సైతం గోశాలకు రావాలంటూ ర్యాలీ చేపడుతున్నట్లు ప్రకటించారు.శాంతిభద్రతల నేపథ్యంలో పోలీసులు ర్యాలీ లు, నిరసనలు లేకుండా గోశాల పరిశీలన చేసి మీడియా తో మాట్లాడవచ్చని ఆదేశాలు జారీ చేశారు.   ఈ నేపథ్యంలో తిరుపతి మాజీ ఎమ్మెల్యే, తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇంటి వద్ద గురువారం (ఏప్రిల్ 17) ఉదయం నుంచి హై డ్రామా కొనసాగింది. పోలీసులు హౌస్ అరెస్టు లు చేశారంటూ వైసీపీ నేతలు ఆరోపణలు గుప్పించారు. వైసీపీ వారిని బయటకు పంపకుండా పోలీసులు దురుసుగా ప్రవర్తించారని విమర్శలు గుప్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా కు చెందిన ఎమ్మెల్యేలు, కూటమి ఇన్ చార్జిలు ఉదయం గోశాల వద్దకు చేరుకున్నారు.     మరో వైపు భూమన, ఎంపీ, మాజీ ఎమ్మెల్యే లు అనుచరులు, కార్యకర్తలు దాదాపు రెండు వేల మందితో గోశాలకు బయలు దేరారు. దీంతో పోలీసులు అంత మందితో గోశాల వద్దకు వెళ్లడం శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందనీ, పరిమిత సంఖ్యలో మాత్రమే అనుమతిస్తామని అడ్డుకున్నారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగి రోడ్డుపైనే బైఠాయించారు.  కొంత సమయానికి కారు ఎక్కి వెళ్తామని చెప్పిన తిరిగి ఇంటికి వెళ్ళిపోయారు. అప్పటి వరకు గోశాలలో ఎదురు చూసిన ఎమ్మెల్యే పులివర్తి నాని, బొజ్జల సుధీర్ రెడ్డి కరుణాకర్ రెడ్డి కి ఫోన్ చేసి తాము ఎదురుచూస్తున్నానీ, ఎస్కార్ట్ ఇస్తాము గోశాలకు రావాలనీ కోరారు. వస్తానని భూమన సమాచారం ఇచ్చారు. ఇది జరిగిన కొంత సమయానికి గోశాల వద్దకు తిరుపతి ఎంపీ గురుమూర్తి, భూమన కుమారుడు అభినయ్ రెడ్డి చేరుకున్నారు. అక్కడ పోలీసులు అభినయ్ రెడ్డి ని లోనికి అనుమతించలేదు.. ఎంపీ ను పోలీసులు దగ్గర ఉండి లోపలికి తీసుకురాగా.. అక్కడ ఎదురు చూస్తున్న కూటమి ఎమ్మెల్యే లు ఎంపీని ప్రశ్నించారు. సవాల్ విసిరిన వ్యక్తి రాకుండా మీరెందుకు వచ్చారని వచ్చారని ప్రశ్నించారు. తాను గోడ దూకి వచ్చాను.. పోలీసులు లోపలికి అనుమతించలేదని ఎంపీ సమాధానం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే లు మాట్లాడుతూ మీరు వచ్చిన విధంగానే ఆయనా వచ్చిండచ్చు కదా అంటూ ప్రశ్నించారు. దీంతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఎంపీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇలా ఉండగా గోశాల బయట భూమన కుమారుడు అభినయ్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు అడ్డుకుంటున్నా గోశాలలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు భూమన అభినయ్ రెడ్డిని అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు.  ఈ సందర్భంగా భూమన తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. వారు సవాల్ చేయడంతోనే గోశాల వద్దకు వచ్చాననీ, సవాల్ చేసిన వాళ్లు గోశాలలో కూర్చుని తమను లోనికి రానీయకుండా పోలీసులతో అడ్డుకుంటున్నారనీ విమర్శలు చేశారు.  

తమిళ దళపతిపై ముస్లిం సంస్థ ఫత్వా జారీ ఎందుకంటే?

  తమిళ వెట్రి కళగం అధినేత, నటుడు ద‌ళ‌ప‌తి విజయ్‌పై యూపీలోని బరేలీకి చెందిన సున్నీ ముస్లిం సంస్థ ఫత్వా జారీ చేసింది. ఆల్ ఇండియా ముస్లిం జమాత్ జాతీయ అధ్యక్షుడు, చష్మే దారుల్ ఇఫ్తా చీఫ్ ముఫ్తీ మౌలానా షహాబుద్దీన్ రజ్వీ బరేలీ ఈ ఫత్వాను జారీ చేశారు. విజయ్ ముస్లిం వ్యతిరేకి అని, అతని నేపథ్యం.. అత‌డి గ‌త‌ చర్యలు ఇస్లాంకు వ్యతిరేకంగా ఉన్నాయని ఫత్వాలో పేర్కొన్నారు. మద్యం తాగే వారిని, జూదగాళ్లను విజయ్ ఇఫ్తార్ విందుకు ఆహ్వానించి రంజాన్ మాసం పవిత్రతను దిగజార్చారని రజ్వీ, ద‌ళ‌ప‌తి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యక్తులను నమ్మవద్దని, మత పరమైన కార్యకలాపాలకు అతణ్ని ఆహ్వానించవద్దని తమిళనాడు ముస్లింలకు సూచించారు.  ఇక విజయ్ నటించిన బీస్ట్ సినిమాలో ముస్లింలను ఉగ్రవాదులుగా చిత్రీకరించారని.. ఈ మూవీలో ముస్లింల వ్యతిరేకిగా ఉన్న విజయ్.. రాజకీయాల్లోకి రాగానే ముస్లిం ఓటు బ్యాంకు కోసం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అందుకే ఆయనకు దూరంగా ఉండాలని ముస్లిం సంఘ నాయకులు సూచించారు.విజయ్ రంజాన్ మాసం యొక్క పవిత్రతను దిగజార్చారని రజ్వీ పేర్కొన్నారు. ఆహ్వానించబడిన వారు ఉపవాసం పాటించలేదని, ఇస్లాం యొక్క ఆచారాలను అనుసరించలేదని ఆయన పేర్కొన్నారు. కాబట్టి, తమిళనాడులోని సున్నీ ముస్లింలు ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. ముస్లింలు విజయ్‌కు దూరంగా ఉండాలని, ఆయన నిర్వహించే కార్యక్రమాలకు హాజరు కావద్దని, అలాగే వారి మతపరమైన కార్యక్రమాలకు ఆయనను ఆహ్వానించవద్దని రజ్వీ విజ్ఞప్తి చేశారు.     

తగ్గని రోజా నోటి దురుసు.. మహిళ నోటి వెంట ఇలాంటి మాటలా?

మాజీ మంత్రి రోజా మరో సారి మహిళలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే అయిన రోజా ఈ రోజు తిరుపతిలో తెలుగుదేశంపై విమర్శలు గుప్పించారు. గోశాలలో గోవుల మృతిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై టీటీడీ సవాల్ ను స్వీకరించిన భూమన గోశాలను సందర్శించేందుకు సిద్ధమయ్యారు. అయితే ఆయన శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా భూమన తన నివాసం నుంచి పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యకర్తలతో కలిసి గోశాలకు బయలు దేరారు. దీంతో పోలీసులు ఆయనను అడ్డుకుని కేవలం తన వ్యక్తిగత భద్రతా సిబ్బందిని మాత్రం తీసుకుని గోశాలకు వెళ్లాలని సూచించారు. అయితే అందుకు నిరాకరించిన భూమన తన నివాసం వద్దే రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాగా అక్కడకు చేరుకున్న నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి రోజా తెలుగుదేశంపై విమర్శలు గుప్పిస్తూ.. అనుచిత వ్యాఖ్యలు చేశారు. సవాల్ చేసి పారిపోయారంటూ తెలుగుదేశం వారిని ఉద్దేశించి  ఆడంగి వెధవలు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమె వ్యాఖ్యలు మొత్తంగా మహిళా లోకాన్నే కించపరిచేలా ఉన్నాయంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోజా మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో అమరావతి రైతుల ఉద్యమంపై కూడా ఇలానే మహిళలను కింపరిచేలా వ్యాఖ్యానించారు. తెలుగుదేశం వారు ఆడవాళ్లను ముందు పెట్టి అందోళనలు చేస్తున్నారంటూ ఆడింగి వెధవలు అన్న మాట ఉపయోగించారు. అలాగే ఒక సందర్భంగా నారా లోకేష్ కు చీర, గాజులు పంపిస్తానంటూ చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఒక మహిళ అయి ఉండి కూడా ఆడవారి పట్ల కించిత్ గౌరవం కూడా లేకుండా రోజా చేస్తున్న వ్యాఖ్యల పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా తిరుపతిలో ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజనులు ఫైర్ అవుతున్నారు.

తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్ !

  తెలంగాణలో మందుబాబులకు భారీ షాక్. త్వరలో మళ్లీ లిక్కర్ ధరలను పెంచాలని రేవంత్ సర్కార్ ఆలోచన చేస్తున్నట్లు  తెలుస్తోంది. ఇప్పటికే బీర్ల ధరలను 15% పెంచిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మద్యం రేటులను పెంచే అవకాశాలు కనబడుతున్నాయి. చీప్ లిక్కర్ మినహాయించి.. రూ.500 కంటే ఎక్కువ ఉన్న లిక్కర్ బాటిళ్లపై కనీసం 10% పెంచనున్నట్లు సమాచారం. బాటిళ్లపై కనీసం రూ.50 పెరిగే ఛాన్స్ ఉంది. అధికారులతో సమీక్షించిన అనంతరం ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.   వెయ్యి రూపాయల బాటలు ధర 1100 గా ఉండనుంది. చీప్ లిక్కర్ పైన పెంచకుండా బ్రాండెడ్ మందుల పైనే పెంచాలని యెచ్చిస్తోంది. దింతో మందుబాబులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా ఒకవేళ ధరలు పెరిగితే రెండువేల కోట్ల ఆదాయం రేవంత్ రెడ్డి సర్కార్ కు రానుంది. త్వరలో చీప్ లిక్కర్, విస్కీ, బ్రాందీ, రమ్, జిన్, వైన్, ప్రీమియం, విదేశీ మద్యం ధరలు 15 నుండి 20 శాతం పెరగనునట్లు టాక్

ఏమిటీ గో గోవిందం.. క‌రుణాక‌రా...

మీ హ‌యాంలో చేసిన పాత త‌ప్పులన్నీ బ‌య‌ట ప‌డ‌తాయ‌నా? భూమ‌న బాగోతాల వెన‌క దాగిన‌ అస‌లు ర‌హ‌స్యాలేంటి? పాత త‌ప్పుల‌ను క‌ప్పి పుచ్చుకోడానికి భూమ‌న చేస్తున్న కొత్త గో గాయాలేంటి? మ‌డ‌క‌శిర  ఎమ్మెల్యే చెప్పిన‌ట్టు.. వెంక‌టేశ్వ‌ర‌స్వామి అంటే ఎంత మాత్రం భ‌క్తిభావం లేని క‌రుణాక‌ర‌రెడ్డి ఏమిటి? ఇంత భారీ ఎత్తున గోనాట‌కం మొద‌లు పెట్ట‌డ‌మేంటి? నిజంగానే గోవుల‌పై ఆయ‌న‌కింత‌టి ప్రేముందా? ఇందులో దాగిన అస‌లు మ‌త‌ల‌బేంటి? అన్న‌దిప్పుడు ప్ర‌శ్నార్ధ‌కం అయి కూర్చుంది. ఇక్క‌డ క‌రుణాక‌ర‌రెడ్డి గోడ్రామా వెన‌క కొన్ని కొన్ని ప్ర‌త్యేక కార‌ణాలున్న‌ట్టుగా చెబుతున్నారు. ఇది వ‌ర‌కు గోశాల డైరెక్ట‌ర్ గా ఉన్న వ్య‌క్తి ఉప్పందించ‌డం వ‌ల్లే.. ఈ మొత్తం తంతు భూమ‌న న‌డిపిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఆ మాజీ గోశాల డైరెక్ట‌ర్ పై  తొక్కిస‌లాట వ్య‌వ‌హారంలో టీటీడీ క‌ఠిన చ‌ర్య‌లు చేప‌ట్ట‌డంతో.. అత‌డు టీటీడీపై క‌క్ష క‌ట్టిన‌ట్టుగా అంచ‌నా వేస్తున్నారు. దానికి తోడు ఇత‌డు భూమ‌నకు అత్యంత‌ ప్రియ శిష్యుడు కావ‌డంతో ఇదంతా వెన‌కుండి జరిపిస్తున్న‌ట్టు భోగ‌ట్టా. ఆ మాజీ డైరెక్ట‌ర్ మాజీ టీటీడీ చైర్మ‌న్ మ‌ధ్య మ‌రో సీక్రెట్ కూడా దాగి ఉన్న‌ట్టు చెబుతున్నారు. గ‌తంలో వీరు విదేశీ గోవుల వ్య‌వ‌హారంలో స్కామ్ కి తెర‌లేపార‌నీ.. ఇది ఎక్క‌డ బ‌య‌ట ప‌డుతుందో అన్న ఆందోళ‌న కొద్దీ ఈ ఇద్ద‌రూ క‌ల‌సి ఈ గోమ‌ర‌ణాల‌ు అనే తేనెతుట్టె క‌దిపార‌నీ అంటున్నారు. ఇదంతా ఒక నాట‌క‌మ‌ని తెలిసినా కానీ కూట‌మి ప్ర‌భుత్వం   పెద్దగా తిప్పి కొట్ట‌లేక పోతోంది. దానికి తోడు గోవుల‌కు సంబంధించిన విజిలెన్స్ రిపోర్టులు, ఆపై త‌ర‌చూ చ‌నిపోయే గోవుల‌కు సంబంధించిన లెక్కల విష‌యంలో వారికి వారే సెల్ఫ్ గోల్ వేసుకోవ‌డం భూమ‌న‌కు బాగా క‌లిసి వ‌చ్చిన‌ట్ట‌య్యింది. ఒక ప‌క్క చూస్తే భూమన త‌న రాజ‌కీయ వారసుడిగా రాణిస్తాడ‌నుకున్న కొడుకు కాస్తా ఆదిలోనే హంస‌పాదులా.. గ‌త ఎన్నిక‌ల్లో ఓడ‌టం. ఆపై కార్పొరేష‌న్ వ్య‌వ‌హారంలో అడ్డంగా బుక్ అవ‌డం వంటి అంశాల‌తో అత‌డు ఎంత మాత్రం పెర్ఫామెన్స్ చూపించ‌లేక పోతున్నాడు. ఇది గ‌మ‌నించిన భూమ‌న తానే స్వ‌యంగా రంగంలోకి దిగి పార్టీని తిరిగి గాడిలో పెట్ట‌డం, తన ఉనికి కాపాడుకోవడం కోసం ఈ గో డ్రామాకు తెర‌లేపిన‌ట్టు తెలుస్తోంది.  ఇది రెండు విధాలుగా భూమ‌నకు అవ‌స‌రంగా క‌నిపిస్తోంది. గ‌తంలో తన పాల‌న‌లో టీటీడీలో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు బ‌య‌ట ప‌డ‌కుండా ఉండాలంటే ముంద‌ర‌ కాళ్ల బంధం అత్య‌వ‌స‌రం. ఇటు చూస్తే క‌ల్తీ నెయ్యి వ్య‌వ‌హారంతో పాటు ఇంకా ఎన్నో విష‌యాల్లో భూమ‌న గ‌ట్టిగా ఇరుక్కునే విధంగా క‌నిపిస్తోంది. ఆ మాట‌కొస్తే గ‌త ఐదేళ్ల‌లో 2 వేల మంది భార‌త‌మ్మ సైన్యం అన్య‌మ‌త‌స్తుల రూపంలో తిరుమ‌ల‌లో పెద్ద ఎత్తున కీల‌క శాఖ‌ల‌లో కీల‌కంగా ప‌ని చేస్తున్నార‌ని లెక్క‌లు చెబుతున్నాయి. వీరంద‌రి ద్వారా ఇన్నాళ్ల పాటు సాగిన విధ్వంసం ఇప్పుడు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట ప‌డే ప్ర‌మాద‌ముంది. టీటీడీకే అత్యంత కీల‌క‌మైన ఆన్ లైన్ బుకింగుల్లో పెద్ద ఎత్తున అక్ర‌మాలు జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. ఆన్ లైన్ టికెట్ల‌తో పాటు పాసుల జారీ వ‌ర‌కూ భారీ ఎత్తున గోల్ మాల్ జ‌రిగిన‌ట్టు క‌నిపిస్తోంది. ఒక్క రోజానే వేల కొద్దీ పాసులు జారీ చేసి.. ల‌క్ష‌ల్లో వ‌సూలు చేశార‌ని అంటున్నారు. ఇవ‌న్నీ బ‌య‌ట ప‌డ‌కుండా ఉండాలంటే ఇదే స‌రైన ప‌నిగా భూమ‌న ఈ గోనాట‌కాన్ని తెర‌కెక్కించిన‌ట్టు తెలుస్తోంది. ఒక ప‌క్క టీటీడీ చైర్మ‌న్ గా బీఆర్ నాయుడు బాద్య‌త‌లు చేప‌ట్టినప్ప‌టి నుంచి త‌ర‌చూ ఏవో  వివాదాలు. తొక్కిస‌లాట గొడ‌వ‌లు, ఏకంగా ఒక బోర్డు మెంబ‌రే బూతులు, ఇక మ‌హా ద్వారం ముందు వ‌ర‌కూ చెప్పులేసుకుని రావ‌డాలు, ఫోటో షూట్లు, డ్రోన్లు ఆనంద నిల‌యం మీద ఎగ‌ర‌డాలు.. వంటి వివాదాస్ప‌ద అంశాల‌తో వ‌రుసగా దెబ్బ‌లు తింటూ వ‌స్తున్న పాల‌క మండ‌లిని మ‌రింత ఇర‌కాటంలో ప‌డేయ‌టానికి.. గో మ‌ర‌ణాల వ్య‌వ‌హారాన్ని ముందుకు తేవ‌డంతో ఇటు టీటీడీ పాల‌క మండ‌లి, అటు ఈవో సైతం ఇబ్బందుల్లో పడ్డారని తెలుస్తోంది. అయితే ఇదంతా ప్ర‌తిప‌క్ష పార్టీ పారిస్తోన్న‌ పాచిక‌గా.. కేబినెట్ భేటీల్లో గుర్తించిన మంత్రి మండ‌లి..  దీన్ని తిప్పి కొట్టే కార్యాచ‌ర‌ణ త‌యారు చేయాల‌నుకున్నా.. అదెలాగో వారికంటూ ఒక అంచ‌నా లేక పోవ‌డంతో భూమ‌న గోనాట‌కం  ర‌క్తి క‌డుతోందని అంటున్నారు.  దీంతో గోవుల సంఖ్య నుంచి స్వామి వారికి త‌ర‌చూ తీసుకెళ్లే పాల వ‌ర‌కూ ఆయ‌న లెక్క‌లు బ‌య‌ట‌కు తీస్తుంటే, ఇక్క‌డ పాల‌క‌మండ‌లి బుర్ర తిరుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ గ్యాప్ లో భూమ‌న మ‌రో అడుగు ముందుకేస్తూ  ఏనుగుల‌కు, గుర్రాల‌కూ స‌రైన ఆహారం అందించ‌లేక పోతున్నార‌నే విష‌యాల వ‌ర‌కూ ఏక‌ర‌వు పెడుతున్నారు. అక్క‌డితో చాల‌క నిషేధ‌మున్న కొండ మీద మ‌ద్య మాంసాల వ్య‌వ‌హారాల‌ను సైతం జ‌నం ముందుకు తెస్తూ.. గ‌తంలో త‌మ పాల‌న‌లో జ‌రిగిన లోటు పాట్లు బ‌య‌ట‌కు పొక్క‌కుండా గ‌ట్టి కోట‌గోడే క‌డుతోంది క‌రుణాక‌ర్ రెడ్డిలోని రాజ‌కీయ చ‌తుర‌త‌. అందుకే ఆయ‌న ఫేక్ ఫోటోలు వీడియోల‌తో చేసే ప్ర‌చారం సైతం చెల్లుబాటు అవుతోంద‌ని అంటున్నారు. ఇదే తెలంగాణ‌లో కంచె గ‌చ్చిబౌలీ భూముల వ్య‌వ‌హారంలో ఫేక్ వీడియోలు, ఫోటోల‌ను షేర్ చేసిన స్మిత స‌బ‌ర్వాల్ వంటి వారిని కూడా వ‌దిలి పెట్టుకుండా కేసులు బుక్ చేస్తున్నారు. నోటీసులు పంపుతున్నారు. అలాంటిదిక్క‌డ క‌నుచూపు మేర కూడా క‌నిపించ‌డం లేదు. భ‌య‌పెట్ట‌డానికైనా కేసులు, నోటీసులు పంప‌లేక పోవ‌డంతో.. భూమ‌న రోడ్డు మీద‌ కొచ్చి మ‌రీ మ‌హాభార‌తంలో గోగ్ర‌హ‌ణం అంత పెద్ద సీన్ క్రియేట్ చేస్తున్న‌ట్టుగా భావిస్తున్నారు.   గురువారం  శ్రీవారి నిజ‌నేత్ర ద‌ర్శ‌నం జ‌రుగుతుంద‌ని అంటారు. ఆ రోజు స్వామివారి ప‌ట్ల తప్పు ఎవ‌రు చేస్తున్నారో వారి బండార‌మంతా బ‌య‌ట ప‌డుతుంద‌ని చెబుతారు. అలాంటి గురువారం ఎప్పుడొస్తుంది? ఈ గోనాట‌కాల వెన‌క దాగిన ర‌హ‌స్యాలు ఎప్పుడు బ‌య‌ట ప‌డుతాయో ఎదురు చూస్తున్నారు స్వామివారి భ‌క్తులు.

గంటాకు గంట మోగిందంట!

 ఎయిర్పోర్ట్ ట్వీట్ పై  హై కమాండ్ క్లాస్  మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వ్యవహారశైలి.. తెలుగుదేశంలో హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో భీమిలి నుంచి గెలిచిన ఆయన.. కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే.. మంత్రి పదవి ఆశించారు. కానీ, వివిధ సమీకరణాలతో ఆయనకు కేబినెట్ లో ఛాన్స్ దక్కలేదు. దాంతో.. తన పని తాను చేసుకుంటున్నారు.  పర్లేదు.. అంతా బాగానే నడుస్తోందనుకుంటున్న టైమ్‌లో.. గంటా వ్యవహారశైలిలో మార్పు వచ్చిందనే చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయ్. ఈ మధ్యకాలంలోనే తన నియోజకవర్గంలో ఓ ఉద్యోగిపై చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయ్. పారిశుద్ధ్య నిర్వహణపై ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసే క్రమంలో.. రాస్కెల్ అంటూ మాట్లాడిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయ్. ఇవేవీ చల్లారకముందే విశాఖ నుంచి అమరావతికి విమాన సర్వీసులు లేకపోవడంపై చేసిన గంటా చేసిన ట్వీట్.. రాజకీయంగా చర్చనీయాంశమైంది.  విశాఖ విమాన సర్వీసుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ.. గంటా శ్రీనివాసరావు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు. అది కాస్తా.. స్టేట్ మొత్తం హాట్ టాపిక్‌గా మారింది. తెలుగుదేశం పార్టీకి చెందిన కింజరాపు రాంమోహన్ నాయుడు పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఆయన కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఎప్పటికప్పుడు పనులను పర్యవేక్షిస్తున్నారు.  మరోవైపు.. రాష్ట్రవ్యాప్తంగా సీప్లేన్‌ల ఏర్పాటు, అంతర్జాతీయ విమాన సర్వీసులు, ఇతర వసతులు ఏర్పాటు చేయడంలో.. కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడు కృషి చేస్తున్నారు. ఏపీ వ్యాప్తంగా విమాన సర్వీసులు పెంచే విధంగా.. ఆయన పనిచేస్తున్నారు. సరిగ్గా.. ఇదే సమయంలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు.. విశాఖ నుంచి నేరుగా అమరావతికి విమాన సర్వీసులు లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వివాదాస్పదంగా మారింది.  వైజాగ్ నుంచి విజయవాడకు వెళ్లాలంటే.. విశాఖలో ఫ్లైట్ ఎక్కి.. తెలంగాణలోని శంషాబాద్‌లో దిగి.. అక్కడి నుంచి మరో ఫ్లైట్ టికెట్ కొనుక్కొని అమరావతికి రావాల్సి వస్తోందని అందులో రాసుకొచ్చారు. తనతో పాటు వచ్చిన సీఐఐ, ఫిక్కీ సంస్థలకు చెందిన వ్యాపారవేత్తలు, ప్రముఖులకు కూడా ఇదే చేదు అనుభవం ఎదురైందన్నారు. మంగళవారం వందే భారత్ రైలు కూడా లేకపోవడంతో.. తాను రెండు విమానాలు మారాల్సి వచ్చిందని తన అసహనాన్ని  వెళ్లగక్కారు. విశాఖలో విమాన ప్రయాణికులకు ఎందుకీ దుస్థితి అంటూ తన ట్వీట్‌లో..  సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి రాంమోహన్ నాయుడు, మంత్రి నారా లోకేశ్‌కు ట్యాగ్ చేశారు.  దీనికి.. తెలుగుదేశం హైకమాండ్ హర్ట్ అయిందట.  దాంతో.. గంటా వ్యవహారంపై అధిష్టానం స్పందించాల్సి వచ్చిందనే టాక్ పార్టీలో వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం విశాఖను ఆర్థిక రాజధానిగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో విశాఖ నుంచి ఏపీ రాజధాని అమరావతికి నేరుగా విమాన సర్వీసులు లేకపోవడం ఏమిటని.. గంటా ట్వీట్ చేయడం పెద్ద చర్చకే దారితీసింది. పార్టీలో సీనియర్ నాయకుడు.. సమస్యపై స్పందించే తీరు ఇది కాదనే విధంగా అధిష్టానం ఆయనను మందలించిందన్న గుసగుసలు తెలుగుదేశం పార్టీలో వినిపిస్తున్నాయ్. ఇబ్బందులేమైనా ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలే తప్ప.. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడమేంటని ప్రశ్నించినట్లు తెలుస్తోంది.  కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి.. టీడీపీకి చెందిన వారేననే విషయం గుర్తుంచుకోవాలని చెప్పారట. భవిష్యత్‌లో ఇలాంటివి రిపీట్ కాకుండా చూసుకోవాలని అధిష్టానం గంటాకు సూచించిందని.. తెలుగుదేశం నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో పార్టీ అధికారంలో ఉన్నప్పుడు.. అవంతి శ్రీనివాస్‌తో విభేదాలు. ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచాక.. ఎప్పుడు పార్టీ వీడతారోనని ఐదేళ్లు సస్పెన్స్ కొనసాగిన పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మంత్రి అవుతారనుకున్నా.. ఆ అవకాశం దక్కలేదు. దాంతో.. ఏదో రకంగా, ఏదో ఒక ఇష్యూపై.. గంటా శ్రీనివాసరావు అసంతృప్తి వెళ్లగక్కడంపై.. పార్టీ పెద్దలు అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇప్పుడు అధిష్టానం హెచ్చరికతోనైనా.. గంటా తీరు మారుతుందా? లేక.. ఇలాగే కొనసాగుతుందా? అన్నది ఆసక్తి రేపుతోంది.

ఏపీలో ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ జారీ

  ఎస్సీ వర్గీకరణ-2025 సంబంధించి ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. గవర్నర్ జస్టిస్ అబ్ధుల్ నజీర్ ఆమోదం తెలిపారు. ఈ మేరకు గెజిట్ విడుదల చేస్తూ న్యాయశాఖ కార్యదర్శి ప్రతిభాదేవి ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల ఆర్డినెన్స్‌కు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ వర్గీకరణ ప్రకారం 59 ఉపకులాలను మూడు గ్రూపులుగా విభజించారు. గ్రూప్-1లోని 12 ఉపకులాలకు 1 శాతం, గ్రూప్-2లోని 18 ఉపకులాలకు 6.5 శాతం, గ్రూప్-3లోని 29 ఉపకులాలకు 7.5 శాతం రిజర్వేషన్లు వర్తింపజేయనున్నట్లు తెలుస్తోంది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఫలాలు అన్ని ఉపకులాలకు సమానంగా అందేలా 200 పాయింట్ల రోస్టర్ విధానాన్ని అమలు చేయనున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది ఎస్సీ వర్గీకరణ ప్రకారం కూలలు రాష్ట్రంలోని 59 షెడ్యూల్డ్ కులాలను జనాభా,వెనుకబాటుతనం మరియు సామాజిక సమైక్యతల ఆధారంగా మూడు కేటగిరీలుగా విభజించడం జరిగింది. ఈ మూడు కేటగిరీలకు రిజర్వేషన్ల శాతం క్రింది విధంగా నిర్ణయించబడింది: గ్రూప్-I (12 కులాలు): 1% రిజర్వేషన్  బవురి, చచాటి, చండాల, దండాసి, డొమ్, ఘాసి, గొడగలి, మెహతర్, పాకి, పామిడి, రెల్లి, సాప్రు గ్రూప్-II (18 కులాలు): 6.5% రిజర్వేషన్  అరుంధతీయ, బిందల, చమార్, చంభార్, దక్కల్, ధోర్, గొదారి, గోసంగి, జగ్గాలి, జంబువులు, కొలుపులవండ్లు, మాదిగ, మాదిగ దాసు, మాంగ్, మాంగ్ గరోడి, మాతంగి, సమగార, సింధోలు గ్రూప్-III (29 కులాలు): 7.5% రిజర్వేషన్  ఆది ద్రావిడ, అనముక్, అరయ మాల, అర్వ మాల, బారికి, బ్యాగర, చలవాది, ఎల్లమలవార్, హోలేయ, హోలేయ దాసరి, మదాసి కురువ, మహర్, మాల, మాల దాసరి, మాల దాసు, మాల హన్నాయి, మాలజంగం, మాల మస్తి, మాల సాలె, మాల సన్యాసి, మన్నే, ముండల, సంబన్, యాతల, వల్లువన్, ఆది ఆంధ్ర, మస్తి, మిట్టా అయ్యలవార్, పంచమ

ఐపీఎల్ లో హైదరాబాద్ బడా బాబు ఫిక్సింగ్ తంత్రం

ఐపీఎల్‌ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయా?  తెర వెనక ఐపీఎల్ జట్లను నయానా భయానా లొంగదీసుకోవటానికి హైదరాబాద్ కేంద్రంగా లాబీయింగ్ నడుస్తోందా?  హైదరాబాద్‎లోనే ఓ బడా వ్యాపారవేత్త ఈ ఐపీఎల్ మ్యాచ్ ఫిక్సింగ్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడా?  అంటే అవుననే సమాధానం వస్తుంది.  ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్ని ఐపీఎల్ జట్ల ఆటగాళ్లకు బీసీసీఐ వార్నింగ్‌ ఇచ్చింది.  ఐపీఎల్ సీజన్ వచ్చిందంటే చాలు..  ఏదో ఒక వివాదం లేకుండా సీజన్ పూర్తి కాదు. తాజాగా జరుగుతున్న సీజన్ అందుకు మినహాయింపు కాదు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో ఐపీఎల్ సీజన్‌లో వెలుగు చూస్తున్న వివాదాలు కొంత తగ్గాయన్న మాట వినిపిస్తోంది.  అందుకు చెక్ పడేలా.. తాజాగా బీసీసీఐ నేరుగా రంగంలోకి దిగటం.. స్పష్టమైన హెచ్చరికను జారీ చేయటం సంచలనంగా మారింది. ఐపీఎల్ ఎడిషన్ 18 రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే దాదాపు అన్ని జట్లు సగం మ్యాచులు ఆడేశాయి. మరో ఆఫ్ సీజన్ మిగిలి ఉంది. ఎలాంటి అవాంతరాలు లేకుండా ఫస్ట్ హాఫ్ సక్సెస్‎ఫుల్‎గా కంప్లీట్ అయ్యింది. ఓ వైపు పరుగుల వరద పారుతుండగా.. కొన్ని మ్యాచుల్లో బౌలర్ల అద్భుత ప్రదర్శనతో ఓడిపోయే మ్యాచ్‎లను కూడా టర్న్ చేశారు.  ఇలా ఎలాంటి ఆటంకాలు లేకుండా సాగుతోన్న ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్ వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఐపీఎల్‎లో మ్యాచ్ ఫిక్సింగ్  చేసేందుకు కొన్ని శక్తులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారి చట్టవ్యతిరేక పనులు చేసేలా వ్యక్తుల్ని ఒత్తిడికి గురి చేస్తున్నట్లుగా బీసీసీఐ వెల్లడించింది. ఈ సందర్భంగా ఐపీఎల్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. ఆ వ్యాపారి విషయంలో జాగ్రత్తగా ఉండండి. క్రికెటర్లు.. కోచ్‌లు.. సహాయ సిబ్బంది.. వ్యాఖ్యాతలు.. ఐపీఎల్‌తో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరికలు జారీ చేసింది. అలాగే అతనికి దూరంగా ఉండాలని ఐపీఎల్ జట్లకు.. బీసీసీఐ హెచ్చరించడం సంచలనంగా మారింది. అయితే గతంలో క్రికెట్ బెట్టింగ్స్, మ్యాచ్ ఫిక్సింగ్‎లు చేసిన అనుభవం ఆ వ్యాపారవేత్తకు ఉందని.. అతడికి పంటర్లు, బుకీలతో దగ్గరి సంబంధాలు ఉన్నాయని బీసీసీఐ పేర్కొంది. అతడు మళ్లీ యాక్టివ్ అయ్యాడని, మ్యాచ్ ఫిక్సింగ్ చేసేందుకు జట్టు యజమానులు, ఆటగాళ్లను కలిసేందుకు ట్రై చేస్తున్నాడని.. అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. డబ్బే కాకుండా విలువైన వస్తువులు, గిఫ్ట్‎లు ఎరగా వేస్తాడనీ, కుటుంబ సభ్యులకు కూడా విలువైన గిఫ్టులు పంపి  రొంపిలోకి లాగుతాడని హెచ్చరించింది. అతడితో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. ఇప్పటికే అతడు ఎవరినైనా సంప్రదిస్తే తమకు సమాచారం అందించాలని సూచించింది. బుకీల వలలో చిక్కుకుని భవిష్యత్ పాడు చేసుకోవద్దని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఎవరీ హైదరాబాదీ వ్యాపారి? అన్న చర్చ ఇప్పుడు జోరుగా సాగుతోంది. గతంలో ఎప్పుడూ ఈ విధంగా ఒక బిగ్ షాట్ ను ఉద్దేశించి ఈ తరహా వార్నింగ్ లు ఇచ్చింది లేదని చెబుతున్నారు. ఐపీఎల్ వ్యక్తులతో స్నేహం చేయటానికి.. సంబంధాలు పెంచుకోవటానికి సదరు వ్యాపారి ప్రయత్నిస్తున్నట్లుగా బీసీసీఐ పేర్కొంది. ఖరీదైన బహుమతులతో బుట్టలో వేసుకోవటం అనే వ్యూహాన్ని అమలు చేస్తున్న సదరు వ్యాపారి.. ఇప్పటికే పలువురికి ఖరీదైన బహుమతుల్ని ఇచ్చి కొందరితో పరిచయాలు పెంచుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలగొట్టే ఖర్మ మాకు లేదు : కేటీఆర్‌

కాంగ్రెస్ ప్రభుత్వాన్ని  కూలగొట్టే కర్మ మాకు లేదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. కంచ గచ్చిబౌలిభూములపై రూ.10 వేల కోట్ల కుంభకోణం జరిగిందని వారం రోజుల కింద చెప్పాని మాజీ మంత్రి స్పష్టం చేశారు. హెచ్‌సీయూ భూముల్లో చేరువును కూడా సీఎం రేవంత్‌రెడ్డి తాకట్టు పెట్టాడు.. రేవంత్ రెడ్డి లాంటి పిచ్చి సన్నాసి తప్ప చెరువును ఎవడు తాకట్టు పెట్టడని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న ఆ కొంత మంది పోలీసులను ఎవరిని వదిలి ప్రసక్తే లేదు.. మీ మీద కూడా సుప్రీంకోర్టుకు పోతామని ఆయన తెలిపారు.  రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యం లాగా పనిచేస్తున్న ఆ కొంత మంది పోలీసులను ఎవరిని వదిలి ప్రసక్తే లేదన్నారు. హెచ్‌సీయూ భూముల కోసం పోరాడిన విద్యార్థులు, సామాజికవేత్తలకు అభినందనలు. సెంట్రల్‌ ఎంపవర్డ్ కమిటీకి హృదయపూర్వక ధన్యవాదాలు. కంచగచ్చిబౌలి భూమి వర్సిటీ ఆధీనంలో ఉన్నదని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సాధికార కమిటీ చెప్పింది. ఆ భూములపై సుప్రీంకోర్టు చొరవ తీసుకోవాలని సూచించింది.వన్యప్రాణులు చనిపోయాయంటే ఏఐ వీడియోలంటూ కేసులు పెట్టారు. రేవంత్‌రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తున్న అధికారులు, పోలీసుపై సుప్రీంకోర్టుకు వెళ్తాం. కంచ గచ్చిబౌలి భూములపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తాం. ఆర్థిక దోపిడీ, పర్యావరణపై దాడి విషయంలో ప్రధాని మోదీ స్పందించాలి. చిత్తశుద్ధి ఉంటే రేవంత్‌ రెడ్డి బయటకు వచ్చి మాట్లాడాలని కేటీఆర్ తెలిపారు.

ఎంపీ మిథున్ రెడ్డికి సిట్ నోటీసులు

మద్యం కుంభకోణం దర్యాప్తులో  స్పీడ్ పెంచిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ తాజాగా ఈ కేసులో విచారణకు రావాల్సిందిగా వైసీపీ ఎంపీ మిధున్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది.  సిట్ నోటీసుల మేరకు మిథున్ రెడ్డి  శుక్రవారం (ఏప్రిల్ 18) విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే సిట్ నోటీసులపై మిథున్ రెడ్డి కోర్టును ఆశ్రయించారు. గతంలో కూడా ఇదే మద్యం కుంభకోణం కేసులో తనను అరెస్టు చేసే అవకాశం ఉందని పేర్కొంటూ మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం సుప్రీంను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. అయితే హైకోర్టు అప్పట్లో ఆయన యాంటిసిపేటరీ బెయిలు పిటిషన్ ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ మిథున్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించగా, విచారణకు సహకరించాలని మిథున్ రెడ్డిని ఆదేశించిన సుప్రీం కోర్టు ఆయనను అరెస్టు చేయవద్దంటూ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మిథున్ రెడ్డికి సిట్ శుక్రవారం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన గురువారం (ఏప్రిల్ 17) హైకోర్టును ఆశ్రయించారు.  సిట్ విచారణ సందర్భంగా తనతో పాటు న్యాయవాదిని కూడా అనుమతించాలని మిథున్ రెడ్డి తన పిటిషన్ లో కోరారు. అలాగే సిట్ విచారణకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆయన కోరారు. కాగా మిథున్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు ఈా రోజు విచారించనుంది.   ఇలా ఉండగా ఇదే కేసులో సిట్ నోటీసుల మేరకు ఈ రోజు విచారణకు హాజరు కావాల్సి ఉన్న మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి గైర్హాజరయ్యారు. సిట్ నోటీసులపై స్పందించిన విజయసాయిరెడ్డి తాను రెండు రోజులు ముందుగానే విచారణకు హాజరౌతానని కోరడంతో సిట్ అనుమతించి గురువారం విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే సిట్ విచారణకు విజయసాయి గైర్హాజరయ్యారు. అదే విధంగా ఇదే కేసులో ఇప్పటికే మూడు సార్లు నోటీసులు అందుకుని కూడా విచారణకు డుమ్మా కొట్టిన కసిరెడ్డి రాజశేఖరరెడ్డికి సిట్ నాలుగో సారి నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే.