బెట్టింగ్ యాప్‌లపై రియాక్ట్ అయిన లోకేష్

బెట్టింగ్ యాప్‌లపై ఏపీ మంత్రి నారా లోకేష్ స్పందించారు. బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని తనకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు ఎక్స్‌లో పెట్టిన ఒక పోస్టుపై లోకేష్ తీవ్రంగా రియాక్టయ్యారు. బెట్టింగ్ యాప్‌లపై రాష్ట్రంలో ఉక్కుపాదం మోపుతామన్న లోకేష్.. ఏపీలో బెట్టింగు యాప్‌ల నిషేధానికి సమగ్ర విధానాన్ని తీసుకువస్తామని తెలిపారు. ఈ విధారం దేశానికే ఆదర్శంగా ఉండేలా ఉంటుందని చెప్పారు. న్యాయపరమైన అన్ని అవకాశాలను ఉపయోగించుకుని బెట్టింగ్ సంస్కృతిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నామని, బెట్టింగ్ యాప్‌ల వలన జీవితాలు నాశనం అవుతున్నాయని పేర్కొన్నారు. అనేక మంది బెట్టింగ్ యాప్‌లకు ఆకర్షితులై ఆర్దికంగా దెబ్బతింటున్నారని, ఇటువంటి పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. బెట్టింగ్ యాప్‌లలో జూదం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.మొత్తం దేశానికే ఒక ఉదాహరణగా నిలిచే సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నామని, ఈ ముప్పును అంతం చేయడానికి అన్ని చట్టపరమైన మార్గాలను అన్వేషిస్తామని ట్వీట్ చేశారు.

ఆ దేశంలో తొలి ఏటిఎం ప్రారంభించారు!

ఏటీఎం లేని దేశం ఉంటుందంటే నమ్ముతారా? కానీ ఇంతకాలం ఏటీఎం లేని ఆ దేశంలో మొట్టమొదటి ఏటీఎం ఇప్పుడే ప్రారంభించారు. మన దేశంలో ఏటీఎం ప్రారంభించాలంటే ఏ బ్రాంచి మేనేజరో, ఇతర అధికారో వెళ్తారు. కానీ, పసిఫిక్‌ సముద్రంలోని ఓ ద్వీప దేశంలో దీని  ప్రారంభోత్సవానికి..  ఏకంగా ప్రధానే హాజరయ్యారు. పెద్ద కేక్‌ కోసి సంబరాలు చేసుకున్నారు. ఎందుకంటే ఆ దేశంలో అదే తొలి ఏటీఎం మరి. అదే తువాలు దేశం. ఇది ఆస్ట్రేలియా-హవాయి మధ్య తొమ్మిది ద్వీపాలతో కలిసి ఏర్పడింది. దాదాపు 11,200 మంది జనాభాతో 10 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఈ దేశం ఉంది. ఇక్కడ ఏప్రిల్‌ 15న తొలి ఏటీఎం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ప్రధాని ఫెలెటి టెయో స్వయంగా హాజరయ్యారు. దేశ చరిత్రలో ఇది చెప్పుకోదగ్గ మైలురాయిగా అభివర్ణించారు. ఇది దేశానికి గొప్ప విజయమని.. మార్పునకు అవసరమైన కీలక స్విచ్‌ అని వక్తలు అభివర్ణించారు. పసిఫిక్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ సంస్థ దీని తయారీకి నేషనల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ తువాలుకు సాయం చేసింది. ఇటీవల కాలంలో సముద్ర మట్టాలు పెరిగి తమ భూభాగం కనుమరుగు అవుతుండటంతో తువాలు రెండేళ్ల క్రితం కీలక నిర్ణయం తీసుకుంది. భావి తరాలకు సంస్కృతి, సంప్రదాయాలను తెలియజేసేలా డిజిటల్‌ దేశంగా మారేందుకు ఏర్పాట్లు చేసుకుంది. ఈ దీవి రాజధాని ప్రాంతం ఇప్పటికే 40 శాతం సముద్రంలో కలిసిపోయింది. ఇదిలాగే కొనసాగితే ఈ దశాబ్దం చివరికి పూర్తిగా కనుమరుగు కావడమే కాకుండా, ప్రపంచంలో గ్లోబల్‌ వార్మింగ్‌కు బలయ్యే తొలి ద్వీపం ఇదే కానుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. రాబోయే రోజుల్లో తువాలు కనుమరుగైనా.. మెటావర్స్‌ సాంకేతికత ద్వారా తమ దేశ ప్రకృతి అందాలు, ప్రజల జీవనశైలిని పర్యాటకులు చూసేలా ఏర్పాట్లు చేసుకుంది.

ఏపీలో పాస్టర్లకు వేతనలు ప్రకటించటంతో..జగన్ వ్యూహానికి చెక్

  గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవ పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పాస్టర్లకు నెలకు రూ. 5 వేలు చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ప్రభుత్వం  గౌరవ వేతనం చెల్లించడానికి రూ.30 కోట్లు విడుదల చేసింది. పాస్టర్లకు ఏడు నెలల పాటు మే 2024 నుండి నవంబర్ 2024 వరకు నెలవారీ గౌరవ వేతనం చెల్లించాలని మైనారిటీల సంక్షేమ శాఖ ప్రభుత్వ ఉత్తర్వు  జారీ చేసింది. ఈ ఏడు నెలల కాలానికిగాను రూ. 30 కోట్లు కూటమి ప్రభుత్వం విడుదల చేసింది. ఈ ఏడు నెలలకు ఒకొక్క పాస్టర్‌కు రూ. 35 వేల చొప్పున లబ్ది చేకూరనుంది. 2023 జనవరిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్లతో ఆయన ఆత్మీయ సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ అధికారంలోకి వస్తే.. గౌరవ వేతనం అందిస్తామని పాస్టర్లకు ఆయన హామీ ఇచ్చారు.  ఆ క్రమంలో అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం హామీని అమలు చేసింది. రాష్ట్రంలో ఉన్న చర్చి పాస్టర్లకి ప్రతి నెలా గౌరవ వేతనం కోసం నిధులు విడుదల చేయాలని.. లేకపోతే కలెక్టర్‌ కార్యాలయాల వద్ద ధర్నాలు చేస్తామని వైసీపీ అధినేత జగన్ తెలిపిన సంగతి తెలిసిందే. పాస్టర్లకు  గౌరవ వేతనం సీఎం చంద్రబాబు ప్రకటించటంతో ఆ క్రెడిట్ కూటమి ప్రభుత్వం కొట్టేసిందని చెప్పుకోవచ్చు. గత కొంతకాలం రాష్ట్రంలో క్రిస్టియన్స్ కూటమి ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. పాస్టర్ ప్రవీణ్ పగడాల రోడ్డు ప్రమాదన్ని హత్యగా చిత్రకరించి వైసీపీ రాజకీయంగా లబ్ధి పొందాలని చూసింది వారి ఆశలు అడియాశలయ్యాయి. ఏపీలో ఉన్న చర్చి పాస్టర్లకి ప్రభుత్వం ప్రతి నెలా గౌరవ వేతనం ప్రకటించడంతో కూటమి ప్రభుత్వన్నికి క్రైస్తవుల్లో సానుభూతి వచ్చినట్లు తెలుస్తోంది. చంద్రబాబు  ఒకే దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్లు వైఎస్ జగన్ వ్యూహానికి చెక్ పెట్టారు.

యూపీఐ చెల్లింపులపై జీఎస్టీ..కేంద్రం క్లారిటీ

  దేశంలో ఇకనుంచి రూ.2 వేలకు పైగా చేసే అన్ని రకాల యూపీఐ పేమెంట్స్ మీద కేంద్ర ప్రభుత్వం 18% జీఎస్టీ విధించనున్నట్టు వస్తున్న వార్తలపై కేంద్ర ఆర్థిక శాఖ క్లారిటీ ఇచ్చింది. అన్ని నిరాధార, తప్పుడు దోవ పట్టించే వార్తలని కొట్టిపారేసింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనమే లేవని ఆర్థికశాఖ స్పష్టం చేసింది.  శుక్రవారం కొన్ని జాతీయ మీడియా సంస్థలు ఈ కథనాలను ప్రసారం చేయగా ఆర్థిక శాఖ స్పందించింది. ప్రస్తుతానికి అలాంటి ఆలోచనలు ఏవీ లేవని, చిన్న చిన్న చెల్లింపులపై ఎటువంటి టాక్స్ లు విధించబోమని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దేశంలో యూపీఐ పేమెంట్స్‌ ప్రోత్సహించేందుకు ఎన్డీయే సర్కార్ కట్టుబడి ఉందని ప్రకటించింది. అందర్నీ ప్రోత్సహించేందదుకు చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇప్పుడున్న రూల్స్ ప్రకారం యూపీఐ లావాదేవీలపై నేరుగా జీఎస్టీ వేయడానికి వీలు లేదు. యూపీఐ అనేది ఒక మాధ్యమం అని పేర్కొంది

హైదరాబాద్‌లో దంచి కొట్టిన వర్షం..పలు చోట్ల ట్రాఫిక్ జామ్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో  ఉరుములు, మెరుపులతో వాన దంచి కొట్టింది.పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. వివిధ ప్రాంతాలకు విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. సహాయకచర్యల్లో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అబిడ్స్, నాంపల్లి, బంజారాహిల్స్‌, మాదాపూర్‌, చైతన్యపురి, దిల్‌సుఖ్‌నగర్‌, వనస్థలిపురం, గాంధీభవన్‌, కార్వాన్, కుత్బుల్లాపూర్, మియాపూర్‌, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, సికింద్రాబాద్‌, గాంధీ ఆసుపత్రి, మెట్టుగూడ తదితర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదైంది. రోడ్లపై మోకాళ్ల లోతు నీరు నిలవడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.  లోతట్టు ప్రాంతలు నీట మునిగాయి. తెలుగు తల్లి ప్లైఓవర్, బషీర్‌బాగ్ పీజీ లా కాలేజీ రోడ్డులో చెట్లు కూలాయి.కూలిన చెట్లను వెంటనే తొలగించాలని డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని ఆదేశించారు. ట్రాఫిక్‌ ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మరోసారి భారీ వర్షం పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో రోడ్లపై నీరు నిలిస్తే వెంటనే తొలగించాలని పొన్నం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోరారు.

హైదరాబాద్‌లో రూ.10,500 కోట్లతో భారీ పెట్టుబడి

జపాన్ పర్యటనలోని ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి టోక్యోలోని హోటల్ ఇంపీరియల్‌లో జరిగిన ఇండియా-జపాన్ ఎకానమిక్ పార్ట్‌నర్ షిప్ రోడ్డు షో‌లో పాల్గోన్నారు. తెలంగాణలొ పెట్టుబడులు పెట్టి  అభివృద్ధి చెందాలని వ్యాపారవేత్తలకు సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికారు. ముఖ్యమంత్రి బృందం హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులను సాధించింది. రూ. 10,500 కోట్లతో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఎన్‌టీటీ డేటా, నెయిసా సంస్థలు సంయుక్తంగా ఈ డేటా సెంటర్‌ క్లస్టర్‌ను ఏర్పాటు చేయనున్నాయి. టోక్యోలో సీఎం  సమక్షంలో త్రైపాక్షిక ఒప్పందాలపై ప్రభుత్వ అధికారులు, సంస్థల ప్రతినిధులు సంతకాలు చేశారు. మరోవైపు రుద్రారంలో రూ.562 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటుకు తోషిబా ఒప్పందం చేసుకుంది.ముఖ్యమంత్రి సమక్షంలోనే తోషిబా అనుబంధ సంస్థ టీటీడీఐ ప్రతినిధులు ఎంవోయూపై సంతకాలు చేశారు.  విద్యుత్‌ సరఫరా, పంపిణీ రంగంలో పెట్టుబడులు, ఆవిష్కరణలకు ఈ ఒప్పందం జరిగింది. రుద్రారంలో ఇప్పటికే ఈ సంస్థ రెండు ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది. ఈ భారీ పెట్టుబడులపై సీఎం రేవంత్‌ హర్షం వ్యక్తం చేశారు. దేశంలోనే కొత్త రాష్ట్రం.. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న తెలంగాణ మీకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతోంది. జపాన్ ని ఉదయించే సూర్యుడి దేశం అని పిలుస్తారు. మా ప్రభుత్వ నినాదం తెలంగాణ రైజింగ్.. ఈరోజు తెలంగాణ జపాన్ లో ఉదయిస్తోందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. 

మోదీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల కమిటీ

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంత్రల కమిటీని నియమించింది. ప్రధాని నరేంద్రమోడడీ  మే 2న అమరావతికి రానున్న సంగతి తెలిసిందే. రాజధాని అమరావతి పనున పున: ప్రారంభానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనను విజయవంతం చేయాలన్న కృత నిశ్చయంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నది. దాదాపు ఐదు లక్షల మంది వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నది.   నారాలోకేష్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, నారాయణ, సత్యకుమార్, కొల్లు రవీంద్రలతో  ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. అలాగే  అందులో లోకేశ్, పయ్యావుల, నారాయణ, సత్య కుమార్, నాదెండ్ల, రవీంద్ర ఉన్నారు. అలాగే ఐఏఎస్ అధికారిని వీరపాండ్యన్ నునోడల్ అధికారిగా నియమించింది. 

లిక్కర్ స్కాంలో అతనిదే ప్రధాన పాత్ర.. సాయిరెడ్డి సంచలన విషయాలు

  వైసీపీ హయాంలో జరిగిన లిక్కర్ కేసులో  మాజీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. మద్యం కుంభకోణంలో కీలక సూత్రధారి రాజ్ కసిరెడ్డి అని విచారణలో వెల్లడించినట్టు తెలుస్తోంది. ఈ స్కాంలో సాక్షిగా హాజరు కావాలని సిట్ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేయగా.. నేడు సిట్ ముందుకు వచ్చారు. శుక్రవారం విజయవాడ సిట్ ఆఫీసులో ఈ విచారణ జరుగుతోంది. ఈ కుంభకోణంలో మెయిన్ రోల్ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిదే అని విజయసాయి పేర్కొనగా.. అదే ఆఫీసులో వేరేచోట విచారణ జరుపుతున్న కసిరెడ్డి తండ్రిని విజయసాయి సమాధానాలను బేస్ చేసుకొని ప్రశ్నలు ఆడుగుతున్నట్టు సమాచారం.కాగా విచారణ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. నిన్న విచారణకు హాజరవుతానని సిట్ అధికారులకు సమాచారం పంపిన ఆయన... కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల హాజరు కాలేకపోయారు. ఈరోజు విజయవాడలోని సిట్ కార్యాలయానికి ఆయన వచ్చారు. ప్రస్తుతం సిట్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది.   

సాయం మాటల్లో కాదు చేతల్లో.. గిరిజనానికి పాదరక్షలు అందించిన పవన్ కల్యాణ్

సహాయం అన్నది మాటల్లో కాదు చేతల్లో ఉండాలి అన్న విషయాన్ని పవన్ కల్యాణ్ నిరూపించారు. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ నెల అల్లూరి సీతారామరాజు జిల్లాలో పర్యటించారు.  ఆ పర్యటనలో భాగంగా ఆదివాస గ్రామం డుంబ్రిగుడలో ఆయన గిరిజనులతో మమేకమయ్యారు.  ఆ సందర్భంగా గ్రామంలో దాదాపు ఎవరూ పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్లతోనే ఉండటాన్ని గమనించారు. సరైన రహదారుల లేని గిరిజన గ్రామాలలో గిరిజనం చెప్పులు కూడా లేకుండా నడవాల్సిన పరిస్థితికి చలించిపోయారు. అడవితల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఆయన గిరిజన గ్రామాలకు రహదారులు వంటి ఎన్నో హామీలు ఇచ్చారు. వాటిని త్వరలోనే ఆరంభిస్తానని నమ్మబలికారు. అయితే ఆ వాగ్దానాలతో సంబంధం లేకుండా పవన్ కల్యాణ్ వారికి ఓ అనూహ్య బహుమానం ఇచ్చారు. చెప్పుకోవడానికి అది చాలా చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ అందరి హృదయాలనూ హత్తుకునే ఉదాత్త చర్య అనడంలో మాత్రం సందేహం లేదు. ఇంతకీ పవన్ కల్యాణ్ చేసింది ఏమిటంటే డుంబ్రిగుంట గ్రామ గిరిజనులకు ఆయన పాదరక్షలు పంపించారు. తన టీమ్ ద్వారా మొత్తం గ్రామ ప్రజలందరికీ పాదరక్షలు అందించారు. గ్రామంలో ఎంద మంది ఉన్నారు, వారికి ఏ సైజు పాదరక్షలు అవసరం తదితర వివరాలన్నిటినీ సర్వే చేయించారు. గురువారం (ఏప్రిల్ 17)న డుంబ్రిగుంట గ్రామస్తులకు పాదరక్షలు అందజేయించారు. డుబ్రిగుంట గ్రామంలో ఉన్న 345 మందికి పాదరక్షలు అందచేయించారు. ఉప ముఖ్యమంత్రి కార్యాలయ సిబ్బంది గ్రామంలోని ప్రతి ఇంటికీ వెళ్లి పాదరక్షలు అందజేశారు.   కోరకుండానే కష్టం తెలుసుకుని, అవసరాన్ని గుర్తించి తమకు పాదరక్షలు అందించిన  ప‌వ‌న్‌కు గిరిజనం కృతజ్ణతలు తెలిపారు.  

ఎంఎంటీఎస్‌ యువతి రేప్ కేసులో..బిగ్ ట్విస్ట్

హైదరాబాద్‌లోని ఎంఎంటీఎస్‌లో యువతిపై అత్యాచారయత్నం ఘటనపై బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. అసలు సదరు యువతిపై లైంగిక దాడి జరగలేదని పోలీసు ఎంక్వైరీలో తేలింది. రైలులో వెళ్తూ ఇన్‌స్టా రీల్స్ చేసిన ఆమె ప్రమాదవశాత్తు కింద పడిపోయింది. ఈ విషయాన్ని ఇంట్లో చెబితే తిడతారని  అత్యాచారం జరిగింది అంటూ ఆ యువతి కట్టుకథ అల్లింది. ఆమె చెప్పిన వివరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు 100 మంది అనుమానితులను విచారించారు. వారు చెప్పిన విషయాలతో కంగుతిన్న అధికారులు 250 సీసీటీవీ ఫుటేజీని పరిశీలించి యువతిని విచారించగా ఆమె చెప్పిన సమాధానాలతో పోలీసులకు అనుమానం మొదలైంది.  ఇక వారు తమ స్టైల్లో విచారణ జరపగా ఆ యువతి అసలు విషయం చెప్పుకొచ్చింది. సోషల్ మీడియాలో రీల్స్ చేస్తుండగా కింద పడ్డానని.. తనపై అత్యాచారం జరగలేదని.. చెప్పడంతో నిజానిజాలు నిర్ధారించిన పోలీసులు ఈ కేసు క్లోజ్ చేశారు.అసలు ఆమెపై అత్యాచారమే జరగలేదని పోలీసుల దర్యాప్తులో తేలింది. యువతి అధికారులకు అబద్ధం చెప్పినట్లు తెలిసింది. ఈ కేసులో రైల్వే పోలీసులు చేపట్టిన లోతైన దర్యాప్తులో సంచలన  విషయం వెలుగులోకి వచ్చింది.   

పీఎం ఏసీ యోజన.. నిజంగా ఇది చల్లటి కబురే!

వేసవి ఉక్కపోతకు సామాన్యులు అల్లాడిపోకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక సరికొత్త పథకంతో ముందుకు రాబోతున్నది. అదే పీఎం ఏసీ యోజన. ఈ పథకం ద్వారా పేదలకు సబ్సిడీ ధరలకే ఏసీలు అందజేస్తారు. ఈ పథకం ఎప్పటి నంచి ప్రారంభం అవుతుందన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. అయితే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం కసరత్తును వేగవంతం చేసిందని చెబుతున్నారు. అన్ని వర్గాలూ ఎండా కాలంలో ఉక్కపోతనుంచి రక్షణ పొందాలన్న ఉద్దేశంతోనే పీఎం ఏసీ యోజన పథకాన్ని తీసుకువస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఈ వేసవి నుంచి కాకపోయినా వచ్చే వేసవి నాటికైనా ఈ పథకాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్రం కృత నిశ్చయంతో ఉందని చెబుతున్నారు. అలాగని ఇదేమీ గతంలో ఎన్నడూ లేని సరికొత్త పథకం కాదు. కొంచం అటూ ఇటూలో సబ్సీడీపై ఏపీలు అందజేసే పథకం ఇప్పటికే ఢిల్లీలో అమలులో ఉంది. ఢిల్లీలో 3 స్టార్ అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న ఏపీలను ఇచ్చి 60శాతం డిస్కౌంట్ లో 5స్టార్ ఏసీలను ఇచ్చే పథకం ఒకటి ఢిల్లీలో బాగా పాపులర్ అయ్యింది. ఇప్పుడు కేంద్రం భారీ సబ్సిడీలో పేదలకు ఏపీలను అందించే పథకానికి రూపకల్పన చేయనుంది. వేసవి తీవ్రత ఏటికేడు పెరిగిపోతుండటంతో వారికి ఒకింత చల్లటి కబురు చెప్పాలని కేంద్రం భావిస్తోంది. అలాగే పేదలపై విద్యుత్ భారం పడకుండా ఉండేలా ఈ పథకాన్ని రూపకల్పన చేసి అమలు చేయాలని భావిస్తోంది.  

కూల్ డ్రింక్‌లో బల్లి..అస్వస్థతకు గురైన యువకుడు

  సమ్మర్ వచ్చిందంటే ఎండతాపం నుంచి ఉపసమనం పొందేందుకు కూల్ డ్రింక్స్‌, ప్రూట్‌ జ్యూస్ వంటికి తాగుతుంటారు. ఇలానే కూల్‌డ్రింక్ తాగేందుకు వెళ్లిన ఇద్దరి యువకులకు భారీ షాక్ తగిలింది. వాళ్లలొ ఒకరు తాగిన కూల్‌డ్రింక్‌లో బల్లి అవశేషాలు ప్రత్యక్షమైంది. అది చూసిన యువకుడు కంగుతిన్నాడు.ఈ విషయాన్ని హోటల్ నిర్వాహకుడి దృష్టికి తీసుకెళ్లినా.. వారు పెద్దగా స్పందించలేదు. ఆ యువకులకు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. వారి తీరుపై ఆ యువకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. సదాశివపేట పరిధిలోని పెద్దపూర్ వద్ద ఎన్‌హెచ్ 65 పక్కన ఉన్న హోటల్‌లో ఇద్దరు యువకులు తాగిన కూల్ డ్రింక్‌లో చనిపోయిన బల్లి కనిపించాయి.  అనంతరం సగం కూల్ డ్రింక్ తాగడంతో యువకుడు స్వల్ప అస్వస్థతకు గురైనట్టు తెలిసింది. ఈ క్రమంలోనే యువకుడిని ఆసుపత్రికి స్నేహితులు తరలించారు. ఈ ఘటన నేపథ్యంలో ఆహార భద్రత అధికారులు చర్యలు తీసుకోవాలని కస్టమర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు స్పందిస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు చర్యలు తీసుకుంటున్నప్పటికీ హైదరబాద్ నగరంలో నిత్యం పలు రెస్టారెంట్‌లలో ఇలాంటి నిర్లక్ష్యం కనుబడుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బయటి ఫుడ్ తినాలంటే ప్రజలు భయపడుతున్నారు కనీస శుభ్రత పాటించని హోటళ్లు కొన్నయితే పాడైన ఆహార పదార్థాలు విక్రయిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న రెస్టారెంట్లు మరికొన్ని. ఇవన్నీ చూసి ప్రజలు బయటి ఆహారం తినాలంటే భయపడుతున్నారు.  ఇంటి ఫుడ్‌నే సో బేటర్ అంటున్నారు.  

మ‌హిళా ఉద్యోగుల‌కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్

ఏపీలో కూటమి ప్రభుత్వం మహిళ ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగంలో నూతంగా నియమితులైన ప్ర‌భుత్వ ఉద్యోగినులు ప్ర‌సూతి సెల‌వులు తీసుకున్నా ప్రొబేష‌న్‌కు ఎలాంటి ఇబ్బంది ఉండ‌దని తెలిపింది. ఈ మేర‌కు ప్రసూతి సెల‌వుల‌ను డ్యూటీగా ప‌రిగ‌ణిస్తూ ప్ర‌భుత్వం గెజిట్ విడుద‌ల చేసింది. ఇదివ‌ర‌కు రెగ్యుల‌ర్ మ‌హిళా ఉద్యోగుల‌కు మాత్ర‌మే మాతృత్వ సెల‌వులు ఉండేవి. తాజాగా స‌ర్కార్ తీసుకున్న‌ ఈ నిర్ణ‌యం ప‌ట్ల ప్ర‌భుత్వ ఉద్యోగినులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. మరోవైపు గుడ్ ఫ్రైడే సందర్భంగా పాస్టర్లకు ఏపీ ప్రభుత్వం తీపి క‌బురు చెప్పింది. నెలకు రూ.5 వేలు చొప్పున పాస్టర్లకు గౌరవ వేతనం ఇచ్చే అందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ ప్రభుత్వం. ఈ నిర్ణయం తో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 8,427 మంది క్రైస్తవ పాస్టర్లకు లబ్ది చేకూరనుంది. 2024 మే నుంచి నవంబర్ వరకు (7 నెలలు) విడుదల కానున్నాయి. నారా లోకేశ్ యువగళం హామీని అమలు చేసిన కూటమి ప్రభుత్వం.. ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. ఇక ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పాస్టర్ల, క్రైస్తవ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. 

త్వరలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ.. ఎందుకంటే?

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కానున్నారా? అన్న ప్రశ్నకు రాజకీయవర్గాలలో ఔననే సమాధానమే వస్తోంది. అయితే వీరి భేటీ ఎప్పుడు? ఎక్కడ జరుగుతుందన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. మొత్తం మీద ఉభయ తెలుగు రాష్ట్రాల మధ్యా ఎడతెగకుండా కొనసాగుతున్న విభజన సమస్యల పంచాయతీతో పాటు, జల వివాదాలకు కూడా శాశ్వత పరిష్కారం కనుగొనాలన్న లక్ష్యంతో ఇరు రాష్ట్రాల సీఎంలూ భేటీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయని రెండు రాష్ట్రాల అధికార వర్గాలలో జోరుగా చర్చ సాగుతోంది.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలుగా విడిపోయి దశాబ్దా కాలం దాటుతోంది. అయితే ఇప్పటికీ విభజన సమస్యలు ఇరు రాష్ట్రాల మధ్యా అలాగే కొనసాగుతున్నాయి. జలవివాదాలు కూడా రెండు రాష్ట్రాలనూ ఇబ్బందులు పెడుతూనే ఉన్నాయి. ఈ సమస్యలను పరిష్కరించుకుంటేనే ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంగా అభివృద్ధి, సంక్షేమాలపై సంపూర్ణంగా దృష్టి సారించడానికి వీలౌతుందన్న ఉద్దేశంతో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని చెబుతున్నారు.  ఇదే లక్ష్యంతో గత ఏడాది జులైలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ ఒక సారి భేటీ అయిన సంగతి తెలిసిందే. తెలంగాణలోని ప్రజాభవన్ లో జరిగిన ఈ భేటీ సుహృద్భావ వాతావరణంలో జరిగింది.  ఇప్పుడు మరోసారి భేటీ కావాలని ఇరువురూ భావిస్తున్నారు.  విభజన సమస్యలలో చాలా వరకూ కూర్చుని మాట్లాడుకుంటే పరిష్కారమైపోయేవే ఉన్నాయని రాజకీయవర్గాలు అంటున్నాయి. ఇక చట్ట ప్రకారం పరిష్కారం కావాల్సిన వాటి విషయంలో కూడా మాట్లాడుకుని ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి కూడా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ అవసరమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరలో మరోసారి భేటీ కావాలని చంద్రబాబు, రేవంత్ లు భావిస్తున్నారని, ఇందుకు సంబంధించి సూత్రప్రాయ నిర్ణయం కూడా అయిపోయిందనీ అభిజ్ణవర్గాల భోగట్టా. ఏపీలో  ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్న వైసీపీ , తెలంగాణలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ లు విభజన సమస్యల పరిష్కారం విషయంలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించాయని చంద్రబాబు, రేవంత్ లు భావిస్తున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సాధ్యమైనంత త్వరగా విభజన సమస్యలకు పరిష్కారం కనుగొనాలని వారిరువురూ భావిస్తున్నారు.  త్వరలో వీరి మధ్య జరిగే భేటీలో జల వివాదాల అంశం కూడా ప్రస్తావనకు వస్తుందని అంటున్నారు.  ఉద్యోగుల పంపకం,  విద్యుత్ బకాయిలు, ఆస్తుల విభజన వంటి సమస్యలపైనా చర్చించి పరిష్కరించుకోవాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ భావిస్తున్నారని చెబుతున్నారు. 

బంధువు ఉద్యోగం కోసం కొండా సురేఖ రాయబారం

వైరల్ అవుతున్న మంత్రి ఆడియో కొండా సురేఖ ఎపిసోడ్ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో హాట్ డిబేట్‌కు దారితీస్తోంది .. తాజాగా సెక్రటేరియట్‌లో దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ పేషీలో సరస్వతి నది పుష్కరాలకు సంబంధించిన యాప్, వెబ్‌సైట్‌ని లాంచ్ చేశారు. దానికి సంబంధించిన ప్రెస్‌మీట్ ముగిశాక.. ఐటీ మంత్రి శ్రీధర్ బాబుతో ఆవిడ జరిపిన సంభాషణ.. హాట్ టాపిక్‌గా మారింది. మంత్రి మాట్లాడిన అంశంపైనే ఇప్పుడు వివాదమంతా. తన బంధువు బిడ్డ కోసం.. ఓ ఉద్యోగం ఉంటే చూడాలంటూ.. కొండా సురేఖ మాట్లాడిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయ్. ఈ పైరవీ సీన్ అంతా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సహచర మంత్రి.. ఉద్యోగం చూడాలని కోరడం, సరే చేద్దాం.. ఇప్పిస్తానంటూ ఆ మంత్రి కూడా బదులివ్వడంపై.. సోషల్ మీడియాలో డిబేట్‌ మొదలైంది.  తన అన్నయ్య మనవడు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడని.. ఏదైనా ఉద్యోగం కోసం సిఫారసు చేయాలని కొండా సురేఖ.. తన సహచర మంత్రి శ్రీధర్ బాబుని కోరారు. ఆయన కూడా సరే అంటూ హామీ ఇవ్వడం క్షణాల్లో జరిగిపోయాయ్. ఇదంతా క్యాజువల్‌గా జరిగి ఉంటే ఎలాంటి వివాదం లేదు. ఇష్యూ ఇద్దరు మంత్రుల మధ్యలోనే ఉండిపోయేది. బయటకు తెలియకపోయేది. కానీ.. ఈ సీన్ అంతా అక్కడే ఉన్న కెమెరాల్లో రికార్డ్ అవడం, ఆ క్లిప్ బయటకు రావడం, సోషల్ మీడియాలో వైరల్ అవడంతో.. వివాదంగా మారింది. ప్రెస్‌మీట్ అవగానే.. మంత్రులు మాట్లాడుకున్నారు. అక్కడ కెమెరాలున్నాయనే కనీస అవగాహన కూడా లేకుండా.. మంత్రి తన బంధువులకు ఉద్యోగం కావాలి.. అందుకు మీ రికమండేషన్ కావాలని అడగడంపై.. సోషల్ మీడియా యూజర్లంతా విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి నెలకొంది. తమకు కూడా ఉద్యోగాలు కావాలని, మంత్రులు సిఫారసు చేయాలని కామెంట్స్ చేస్తున్నారట. ఈ వ్యవహారం కాస్తా.. కాంగ్రెస్ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ తీవ్ర చర్చకు దారితీసిందట. ఆ మధ్య.. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలతో పాటు తెలుగు చలనచిత్ర పరిశ్రమలోనే తీవ్ర దుమారం రేపాయి. ఆవిడ చేసిన వ్యాఖ్యల్ని.. రాజకీయ నాయకులతో పాటు సినీ ప్రముఖులంతా ముక్తకంఠంతో ఖండించిన పరిస్థితి. ఈ క్రమంలో.. కొండా సురేఖ వ్యాఖ్యలపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం, వివరణ అడగడం కూడా జరిగింది. అప్పుడే.. ఆవిడను మంత్రి పదవి నుంచి తప్పిస్తారనే ఊహాగానాలు వినిపించాయి. చివరకు.. కొండా సురేఖ తన వ్యాఖ్యల్లో తప్పుంటే వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటన చేశారు. ఇంకా.. ఈ వ్యవహారం కోర్టులో నలుగుతూనే ఉంది. ఈ ఇష్యూ.. కొండా సురేఖకు తలనొప్పిగా మారిందనేది విశ్లేషకుల మాట. అయితే.. ఇదే సమయంలో మంత్రిగారి వ్యవహారం వివాదాస్పదంగా మారడం ఇప్పుడు కొత్తేమీ కాదనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది.  గతంలో ఆవిడ మాట్లాడిన ఆడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయ్. మనవడి పుట్టినరోజు సందర్భంగా.. ఎవరెక్కువ డ్యాన్స్ చేస్తే వాళ్లకు తాగినంత మద్యం అంటూ చెప్పిన సెల్ఫీ వీడియో కాల్ కూడా వైరల్ అయింది. మొత్తంగా.. మంత్రి కొండా సురేఖ ఏం మాట్లాడినా.. అది వైరల్ అవడం పరిపాటిగా మారుతోందనే చర్చ పార్టీలో నడుస్తోంది. అంతేకాదు.. ఆమె వ్యవహారశైలి పదే పదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతుండటంతో.. కొండా సురేఖ గ్రాఫ్ కూడా పడిపోతోందనే చర్చ సాగుతోంది. ఆవిడ పనితీరు కూడా బాగాలేదనే విమర్శలు వినిపిస్తున్నాయట. ఇప్పటికే.. పలుమార్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌కు గురైన మంత్రి కొండా సురేఖ.. ఇకపై కొంత సంయమనంతో వ్యవహరిస్తే బాగుటుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.

కర్నాటకంలో కులకలం

మీరు కొట్టుకుంటే.. మోదీ కూల్చేస్తారు   ముఖ్య నేతలకు ఖర్గే హెచ్చరిక   కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ  కుల గణనకు ఇచ్చే ప్రాధాన్యత గురించ ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. కులగణనతో దేశాన్ని ఎక్స్- రే తీసి.. అసమానతలను తొలగిస్తామనీ, దేశ సంపదను అన్ని వర్గాలకూ సమానంగా పంచుతామనీ, రాహుల్ గాంధీ  2024 ఎన్నికల్లోనే దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.  ఇక అక్కడి నుంచీ రాహుల్ గాంధీ కులగణన గురించి ఎక్కడంటే అక్కడ మాట్లాడుతూనే ఉన్నారు. పార్లమెంట్  ప్రసంగమే అయినా.. పార్టీ లేదా పబ్లిక్ మీటింగే అయినా..  కులగణన ప్రస్తావన లేని రాహుల్ గాందీ ప్రసంగం ఇటీవల కాలంలో ఒక్కటీ  లేదంటే అతిశయోక్తి కాదు.ఇది ఆయనకు ఈ అంశం పట్ల ఉన్న నిబద్దతకు నిదర్శనంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.  దేశంలో అసమానతలు తొలిగి పోయేందుకు కులగణనను మించిన దివ్య ఔషథం మరొకటి లేదనే విశ్వాసం ఆయన ప్రతి మాటలో వ్యక్తమవుతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే కులగణనకు రాహుల్ గాంధీ బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారని  అంటున్నారు. కులగణనలో ఆయన భవిష్యత్ భారతాన్ని చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను చూస్తున్నారు. అందుకే ఆయన  దేశం అంతటా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే  కాంగ్రెస్ ప్రభుత్వాలు తక్షణం కులగణన చేపట్టి ఆదర్శంగా నిలవాలని కాంగ్రస్ పాలిత మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులను రాహుల్ గాంధీ ఆదేశించారు.     రాహుల్ గాంధీ ఆదేశాల మేరకే తెలంగాణ ప్రభుత్వం ఆగమేఘాలపై కులగణనను చేపట్టింది.   దిగ్విజయంగా పూర్తిచేసింది. అంతే కాదు  తదను గుణంగా రిజర్వేషన్లను పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ.. రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. కేంద్రం పై వత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ పెద్దలు, మంత్రులు ఢిల్లీ వరకూ వెళ్లి జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారు. రాహుల్ గాంధీ మెప్పు పొందారు. ఇటీవల జరిగిన అహ్మదాబాద్ ఏఐసీసీ వేదిక నుంచి  రాహుల్ గాంధీ తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసల్లో ముంచెత్తారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపిన కులగణనను ఆదర్శంగా తీసుకుని దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని ఆయన కేంద్ర ప్రభుతాన్నిడిమాండ్ చేశారు.  అయితే ఇప్పడు అదే కులగణన కర్ణాటక మంత్రి వర్గంలో కుంపట్లు రాజేసింది. అసలే ఉప్పు నిప్పులా ఉండే ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  మధ్యన మరో కుంపటి వెలిగించింది.  నిజానికి  రాహుల్ గాంధీ మదిలో కులగణన మెరుపు మెరవక ముందు ఎప్పుడో దశాబ్దం క్రితం 2015లోనే.. ఇదే ముఖ్యమంత్రి సిద్ద రామయ్య సారధ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  సామాజిక ,ఆర్థిక, విద్యా సర్వే పేరిట  కులగణన చేపట్టింది.  ప్రాథమిక   నివేదిక 2018 నాటికే సిద్దమైంది. అయితే అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆ నివేదికను ముట్టుకోలేదు. పక్కన పెట్టింది.  అయితే.. 2023లో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి.. మళ్ళీ సిద్దరామయ్య ముఖ్యమంత్రి అయిన తర్వాత కులగణన మరోమారు తెర పైకి వచ్చింది. ముఖ్యంగా రాహుల్ గాంధీ కులగణన జెండా పట్టిన తర్వాత  పాత సర్వే అంశం  పై కొచ్చింది. అయితే  ఓ వంక రాహుల్ గాంధీ,దేశ వ్యాప్తంగా కులగణన చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా.. సిద్ధంగా ఉన్న కులగణన నివేదికను బయట పెట్టేందుకు కర్ణాటక ప్రభుత్వం నిన్న మొన్నటి వరకూ మీన మేషాలు లెక్కిస్తూ వచ్చింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్  మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో  కాంగ్రెస్ అధిష్టానం కూడా వేలు పెట్టే ప్రయత్నం చేయలేదు. అయితే.. తాజాగా గత శుక్రవారం (ఏప్రిల్ 11) నివేదిక రాష్ట్ర మంత్రి వర్గం ముందు కొచ్చింది. నివేదిక కాపీలు మంత్రుల చేతుల్లోకి వచ్చాయి. అందులోని అంశాలు లీక్ అయ్యాయి.  సహజంగానే దుమారం చెలరేగింది. నివేదిక ప్రకారం కర్ణాటకలో వెనుకబడిన కులాల జనాభా 69.60 శాతానికి చేరింది. ముస్లిములు సహా, మిగిలిన సామాజిక వర్గాల శాతం ఇంచు మించుగా రెట్టింపు అయింది. మరోవంక రాష్ట్రంలో రాజకీయంగా బలమైన సామాజికవర్గం వీరశైవలింగాయతలలోని, లింగాయతులు, వక్క లింగాయతుల శాతం మాత్రం తగ్గింది.  దీంతో, నివేదిక విశ్వసనీయతను ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సహా పలువురు తప్పు పడుతున్నారు. కులగణన నివేదికను వీరశైవలింగాయతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆ నివేదికను చెత్తబుట్టలో పడేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం (ఏప్రిల్ 17) న కులగణన నివేదికపై చర్చించేందుకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ  ప్రత్యేక సమావేశం  తీవ్ర వాదోపవాదాల నడుమ రసాభాసగా ముగిసినట్లు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తున్న లింగాయత్, వక్క లింగాయత్ కులాల మంత్రులు నివేదికను పూర్తిగా వ్యతిరేకిచినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ సమావేశం ముగిసిన తర్వాత శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి హెచ్.కే పాటిల్ మీడియాతో మాట్లాడుతూ.. చర్చలు అసంపూర్తిగా ముగిసాయి, తిరిగి మే 2న జరిగే మంత్రివర్గ ప్రత్యేక సమవేశంలోమరో సారి  మరింత లోతుగా చర్చిస్తామని చెప్పారు. అయితే.. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ సింగల్ పాయింట్ ఎజెండాగా ముదుకు తీసుకుపోతున్న కులగణనకు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలోనే ఎదురుదెబ్బ తగలడం  కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికరంగా మారుతుందని పరిశీలకులు అంటున్నారు.  మరోవంక  కులగణన వివాదం నేపథ్యంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యమంత్రి పదవి కోసం కొట్టుకోకండని, కర్ణాటక ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రికి సూచించారు. మీ మధ్య విభేదాలు మోడీకి అవకాశమవుతున్నాయని ఖర్గే హెచ్చరిం చారు. ప్రధాని ప్రభుత్వాన్ని కూల్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొంటూ కాంగ్రెస్ నేతలు అప్ర మత్తంగా ఉండాలన్నారు. కాగా  ఖర్గే చేసిన బహిరంగ హెచ్చరిక ప్రమాద స్థాయిని సూచిస్తోందని పరిశీలకులు అంటున్నారు.

పీటల వరకే పెళ్లి.. తమిళ పొత్తులో కొత్త తిరకాసు!

తమిళనాడులో భారతీయ జనతా పార్టీ, అన్నాడీఎంకే పార్టీల మధ్య ఎన్నికల పొత్తు కుదిరింది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా రెండు రోజులు చెన్నైలో కూర్చుని మరీ పొత్తును పీటలెక్కించారు. స్వయంగా ఆయనే చెన్నైలో పొత్తు ప్రకటన చేశారు. వచ్చే సంవత్సరంలో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే’ పార్టీలు కలిసి  పోటీ చేస్తాయని ప్రకటించారు.  అన్నాడీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పడి కే. పళని స్వామి, బీజేపీ నేత అన్నామలైలతో కలిసి  మీడియా సమావేశంలో పాల్గొన్న అమిత్ షా స్వయంగా  పొత్తు ప్రకటన చేశారు. అంతే కాదు.. పొత్తుకు అన్నాడీఎంకే ఎలాంటి షరతులు పెట్టలేదని, అలాగే బీజేపీ నుంచి కూడా షరతులు ఏవీ లేవని స్పష్టం చేశారు. డీఎంకే దుష్ట దుర్మార్గ  పాలనను అంతమొందించడమే లక్ష్యంగా  బీజేపీ, అన్నాడీఎంకే కూటమి ఇతర పార్టీలను కలుపుకుని ఎన్డీఎ బ్యానర్ పై ఎన్నికల్లో పోటీ చేస్తుందని అమిత్ షా చెప్పారు. అంత వరకు అంతా బాగుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నడ్డా సహా బీజేపీ జాతీయ నేతలు, రాష్ట్ర నాయకులు పొత్తు కుదరడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అయితే..  స్ట్రాంగర్ టుగెదర్   (‘కలిసి ఉంటే కలదు బలం’) అని ట్వీట్ చేశారు. అన్నాడీఎంకే ఎన్డీఎ కూటమిలో చేరినందుకు సంతోషం వ్యక్తం చేశారు. స్వాగతించారు. నిజానికి ఎన్నికల పొత్తుకు సంబంధించి ఇరు పార్టీల మధ్య గత కొంత కాలంగా చర్చలు, సంప్రదింపులు జరుగతున్న నేపధ్యంలో, పొత్తు ప్రకటన పెద్దగా సంచలనం కాలేదు. అయితే  పొత్తు పారాణి ఆరక ముందే.. అన్నాడీఎంకే అధినేత పళని స్వామి  పొత్తుకు కొత్త అర్థం చెపుతూ చేసిన  ప్రకటన నిజంగానే రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు, దేశ రాజకీయాల్లోనూ సంచలనం సృష్టించింది. చర్చకు దారి తీసింది.    అవును. ఎన్నికల వరకే పొత్తంటూ పళని స్వామి పొత్తుకు కొత్త అర్థం చెప్పారు.ఎ న్నికలలో ఎన్డీఎ కూటమి గెలిచినా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు అన్నాడీఎంకే ఒప్పుకోదని స్పష్టం చేశారు. అంటే  పీటల వరకే పెళ్లి, సంసారం అంటే కుదరదు  అని పళని స్వామి మెలిక పెట్టారు. అంతే కాదు.. అమిత్ షా చెప్పింది కూడా అదే  అని వివరణ  కూడా ఇచ్చారు. అయితే  వాస్తవంలో అమిత్ షా చెప్పిన దానికి, పళని స్వామి చెప్పిన భాష్యానికి పొంతన లేదని పరిశీలకులు అంటున్నారు. అమిత్ షా చాలా  స్పష్టంగా  పొత్తుకు తమిళ పార్టీ ఎలాంటి షరతులు పెట్టలేదని చెప్పారు. కానీ  పళని స్వామి ఇప్పడు పొత్తుకు షరతులు వర్తిస్తాయి అంటున్నారు. అంతే కాదు.. పొత్తు ఎన్నికల వరకే, ఎన్డీఎ అధికారంలోకి వచ్చినా, బీజేపీ, ఇతర మిత్ర పక్షాలకు మంత్రివర్గంలో స్థానం ఉండదని  పళని స్వామి తేల్చేశారు.  మరో వంక రాష్ట్ర బీజేపీ నాయకులు కూడా అంతేగా ..అంతేగా అంటున్నారు. అయితే.. బీజేపీ జాతీయ నాయకత్వం కూడా అదే అభిప్రాయంతో వుందా అనేది ఇంకా స్పష్టం కాలేదని  పార్టీ వర్గాల సమాచారం. అయితే..  దీర్ఘకాల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని బీజీపీ నాయకత్వం,అన్నాడీఎంకే షరతులకు తాత్కాలికంగానే అయినా  ఓకే అంటుందని  అంటున్నారు.  నిజానికి  అన్నాడీఎంకే డిమాండ్ మేరకే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తప్పించిందనీ, అలాగే  పళని స్వామి తాజా డిమాండ్ ను అంగీకరించినా అంగీకరిస్తుందని అంటున్నారు.    అయితే.. పళని స్వామి రోజుల వ్యవధిలోనే యు టర్న్ ఎందుకు తీసుకున్నారు?  ఇంతలో ఏమి జరిగింది.. అంటే, బీజేపీతో పొత్తును అన్నాడీఎంకే లో ఒక వర్గం వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వరం నేతల విముఖతే పళని సామి యు టర్న్ కు ప్రధాన కారణం అంటున్నారు. బీజేపీతో పొత్తు ముస్లిం ఓటును పూర్తిగా దూరం చేస్తుందని అన్నాడీఎంకే నాయకులు  పొత్తును వ్యతిరేకిస్తునట్లు తెలుస్తోంది. అలాగే.. బీజేపీతో పొత్తు కారణంగా  2021 అసెంబ్లీ 2019, 2024 లోక్ సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలు కూడా పొత్తు వద్దనడానికి కారణంగాచెపుతున్నారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తున్నా  ఫలితం లేక పోయింది. అన్నాడీఎంకే సీట్ల సంఖ్య 136 నుంచి 75కి పడి పోయింది.  అధికారం అన్నాడీఎంకే చేజారింది. అలాగే, 2019 లోక్ సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తులో భాగంగా 20 సీట్లలో పోటీ చేసి కేవలం ఒకే ఒక్క సీటు గెలుచుకుంది.  అయితే  బీజేపీతో తెగతెంపులు చేసుకున్న తర్వాత జరిగిన 2024 లోక్ సభ ఎన్నికల్లో 33 సీట్లలో పోటీ చేసినా అన్నాడీఎంకేకి  ఆ ఒక్క సీటే దక్కింది. అందుకే  ఆ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకునే బీజేపీతో పొత్తుపట్ల అన్నాడీఎంకేలో విముఖత వ్యక్తం అవుతోందనీ, అందుకే, పళని స్వామి యు టర్న్ తీసుకున్నారని అంటున్నారు.  అయితే.. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా అన్నామలై నాయకత్వంలో బీజేపీ బలం మెల్ల మెల్లగా పెరుగుతోందని అంటున్నారు.  2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు ఉన్నా బీజేపీకి  3-4 శాతం మధ్యనే ఓట్లు పోలయ్యాయి. కానీ,  2024 లోకసభ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తు లేకున్నా బీజేపీ ఓటు 7.58 శాతం పెరిగింది.  11 శాతానికి పైగా ఓట్లు బీజేపే  సొంత చేసుకుంది. ఈ నేపథ్యంలోనే అన్నాడీఎంకే బీజేపీతో మళ్ళీ పొత్తుకు సిద్దమైంది. అయితే పార్టీలో వ్యతిరేకత వచ్చిన నేపథ్యంలో  పళని స్వామి అటూ ఇటూ అవుతున్నారని అంటున్నారు. అయితే ప్రస్తుతానికి పళని  స్వామి  వ్యూహాత్మకంగా వెనకడుగు వేసినా.. డీఎంకేను ఎదుర్కోవాలంటే  బీజేపీ ఓటుతో పాటుగా కేంద్ర ప్రభుత్వ సపోర్ట్ కూడా అన్నాడీఎంకేకు అవసరం అవుతుందనీ,  అలాగే  బీజేపీకి కూడా దీర్ఘకాల ప్రయోజనాల దృష్ట్యా ఏపీలో టీడీపీ, జనసేనతో ఎలాగైతే పొత్తు  అవసరమో.. అదే విధంగా  తమిళనాడులో అన్నాడీఎంకే పొత్తు అనివార్యమని అంటున్నారు.  సో .. బీజేపీ, అన్నాడీఎంకే  పొత్తు ప్రయాణంలో ఒడిదుడుకులు ఉన్నా చివరాఖరుకు పొత్తు  పట్టాలు ఎక్కుతుందని అంటున్నారు.  

బొత్స బెదిరింపులకు కార్పొరేటర్లు భయపడేనా ?

విశాఖలో మేయర్ పై అవిశ్వాస తీర్మానం పై చర్చ రేపే ఓడలు బళ్ళు బళ్ళు ఓడలవుతాయి అంటారు ఇప్పుడు వైసీపీ పరిస్థితి అలాగే  తయారైంది.  నిన్న మొన్నటి వరకూ  నిశ్శబ్దంగా ఉన్న వైసీపీ నాయకులు తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్నారు.  రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి.  రాజ్యసభ సభ్యత్వం నుంచి సర్పంచి వరకు వైసీపీ నాయకులు  రాజీనామాలు చేసి కూటమి పార్టీల బాట పడుతున్నారు.  ఈ తరుణంలో వైసీపీకి విశాఖ మేయర్ పీఠం అగ్నిపరీక్షగా మారింది. ఆ పార్టీకి కంటే..   ఆ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణకి విశాఖ మేయర్ పీఠాన్ని కాపాడుకోవడం కీలకంగా మారింది. . .విశాఖ కార్పొరేషన్ లో 98 వార్డులకు గాను 58 వార్డులో వైసీపీ కార్పొరేటర్లు గెలుపొందారు.  కానీ అప్పుడు ప్రభుత్వం అధికారంలోకి ఉండడంతో ఇతర పార్టీలు ఇండిపెండెంట్ లను కూడా వైసీపీ బెదరించి తమలో కలుపుకుంది.  అయతే రాష్ట్రంలో  వైసీపీ అధికారం కోల్పోవడంతో విశాఖ మేయర్ పీఠం పై కూటమి నాయకులు కన్ను వేశారు.  దీనికి వైసీపీలోని అసంతృప్తి వర్గం పూర్తిస్థాయిలో సహకరించింది.  దీంతో నిన్న మొన్నటి వరకు వైసీపీలో ఉన్న కార్పొరేటర్లు, ఎక్స్ అఫీషియో సభ్యులు తెలుగుదేశం, జనసేన గూటికి చేరిపోయారు. మేయర్ పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే కావల్సిన మ్యాజిక్ ఫిగర్ 74. అయితే ఇప్పడు కరుడుగట్టిన వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు కూడా ఫ్యాన్ పార్టీని వీడారు. తిప్పల వంశీ,  బెహరా భాస్కరరావు... ముత్తం శెట్టి ప్రియాంక లాంటి నాయకులు కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు ఈ దశలో తమ పార్టీ సింబల్ పై గెలుపొందిన 58 మంది కార్పొరేటర్లు అవిశ్వాస తీర్మానం చర్చకు హాజరు కాకూడదని ఆ పార్టీ నాయకులు  బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ హుకుం జారీ చేశారు. అలాగే పార్టీ విప్ ను కూడా జారీ చేస్తున్నట్టు ప్రకటించారు.  పార్టీ ఆదేశాన్ని పాటించని వారిపై అనర్హత వేటు వేస్తామని కూడా బొత్స సత్యనారాయణ తాజాగా హెచ్చరించారు.  నిజానికి విశాఖ తాజా కార్పొరేషన్ కాలపరిమితి కేవలం పది నెలలు మాత్రమే ఉంది. ఈ దశలో న్యాయం పరమైన చిక్కులు పూర్తి కావడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది.  దీంతో పార్టీ మారిన ఫ్యాన్ పార్టీ నాయకులు ఎవరూ కూడా బొత్స మాటలను లెక్కచేసే అవకాశం లేదు.  అన్నిటికంటే మించి కార్పొరేటర్లగా గెలిచినప్పటికీ అధికారంలో ఉన్నప్పుడు తమను పట్టించుకోలేదన్న ఆగ్రహం చాలామంది వైసీపీ కార్పొరేటర్ లలో ఉంది.  ముఖ్యంగా ఒక కోటరీ చుట్టూ కార్పొరేషన్ వ్యవహారం సాగిందని ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్లు విమర్శిస్తున్నారు. ఇక బొత్స సత్యనారాయణ విశాఖ మేయర్ విషయంలో బీసీ కార్డును ఉపయోగించుకోవాలని భావించారు. అవిశ్వాసం ద్వారా బీసీ మహిళను అగౌరవ పరుస్తున్నారని బొత్స సత్యనారాయణ తాజాగా ఆరోపించారు. దీనికి కూటమి కార్పొరేటర్ మూర్తి యాదవ్ తీవ్రంగా కౌంటర్ ఇచ్చారు. అసలు పేరుకు మేయర్ అయినప్పటికీ ఆమెను ఆ పార్టీ ఎప్పుడూ కూడా గౌరవించలేదని ఆరోపించారు. ఎంపీ విజయసాయిరెడ్డి,  వై వి సుబ్బారెడ్డి లాంటి నాయకుల పెద్దరికం మాత్రమే కనిపించిందని గుర్తు చేశారు. ఈ దశలో విశాఖ మేయర్ భవిష్యత్తుతో పాటు బొత్స సత్యనారాయణ పెద్దరికానికి ఈ అవిశ్వాస తీర్మానం అగ్నిపరీక్ష కానుంది.

అసత్య ఆరోపణలు.. భూమనపై కేసు

తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోని ఎస్వీ గోశాలలో గోవుల మృతి పై గత కొన్ని రోజులుగా వివాదం జరుగుతూనే ఉంది. తొలుత తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్, తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి మీడియా సమావేశంలో టీటీడీ తిరుపతి గోశాల గోవధ శాల గా మారిందంటూ ఆరోపణలు గుప్పించారు. మూడు నెలల కాలంలో 100 గోవులు మృతి చెందాయని పేర్కొన్నారు. అదే రోజు టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేసి, భూమన ఆరోపణలు అవాస్తవమని ఖండిచారు. గోశాల పై అసత్య ప్రచారం మైనుకోవాలని,  నేరుగా వస్తే సాక్షాలతో నిరూపిస్తామన్నారు.  ఇక ఆ తరువాత రోజుకొక్క అంశంతో ప్రచారం, వాదోపవాదాలు, సవాళ్లు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి ఇటీవల జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ను కలిసి టీటీడీ ప్రతిష్టను దిగజార్చేలా గోశాల పై అసత్య ఆరోపణలు చేసిన టీటీడీ మాజీ  చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పై ఫిర్యాదు చేసి, చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే గోశాల పరిధిలోని ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లోనూ ఫిర్యాదు చేశారు. దీనిపై ఎస్వీయూ పోలీసులు క్రైమ్ నెంబర్ 62/20 25 బి.ఎన్.ఎస్ యాక్ట్ 353(1), 299, 74 ఆఫ్ ఐటీ యాక్ట్ సెక్షన్ లు కింద భూమన పై కేసు నమోదు చేశారు. దీనిపై టీటీడీ బోర్డు సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి మీడియా తో మాట్లాడుతూ  టీటీడీ, అనుబంధట సంస్థ ల పై ఆధారాలు లేకుండా రాజకీయ ప్రయోజనాల కోసం అసత్య ఆరోపణలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.  భవిష్యత్తులో ఆరోపణలు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎస్వీయూ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని, టీటీడీ గోశాలలో సహజంగా గోవులు మరణిస్తే దానా సరిగ్గా పెట్టలేదు..  బక్కచిక్కి పోయాయని అసత్య ప్రచారం భక్తుల్లోకి తీసుకెళ్లి టీటీడీ ప్రతిష్ట ను దిగజార్చే విధంగా చేశారని అన్నారు. గో  హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా అసత్య ఆరోపణలు చేసిన   టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కఠినమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ ను కోరినట్లు చెప్పారు. అదే ఫిర్యాదు ఎస్వీయూ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇచ్చాననీ, దానిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు. అసత్య ప్రచారం చేసే వారిని ఉపేక్షించేది లేదని భాను ప్రకాశ్ రెడ్డి అన్నారు.