తెలుగుదేశం మహిళా నేత గాయత్రి సస్పెన్షన్

తెలుగుదేశంమహిళా విభాగం నేత గాయత్రిని పార్టీ సస్పెండ్ చేసింది. భారత్, పాక్ మధ్య సంబంధాలు, ప్రస్తుత పరిస్థితులపై ఆమె ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు, ప్రసంగలే కారణమని చెబుతున్నారు. పార్టీ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందున గాయత్రిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి పరచూరి అశోక్ బాబు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.   గాయత్రిపై సోషల్ మీడియాలో వచ్చిన ఆరోపణలే ఇందుకు కారణమని అంటున్నారు.   విజయవాడకు సందిరెడ్డి గాయత్రి గతంలో తెలుగు మహిళ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలోవైసీపీ నేతలు, కార్యకర్తల విమర్శలకు కౌంటరిస్తూ పార్టీలో కీలకంగా వ్యవహరించారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ టీడీపీ వాదనను బలంగా వినిపించారు. ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. అయితే ఇప్పుడు ఆ సోషల్ మీడియాలో ఆమెపై వెల్లువెత్తిన విమర్శల కారణంగానే గాయత్రి సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా పాకిస్థాన్, భారత్ సంబంధాలపై ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలపై ఆర్ఎస్ఎస్, బీజేపీలు తీవ్ర అభ్యంతరం తెలపడమే గాయత్ని సస్పెన్షన్ కు కారణంగా చెబుతున్నారు.  ముఖ్యంగా ఆమె భారత ఇతిహాసాలు మహాభారతం, రామాయణంపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై గాయత్రిని సస్పెండ్ చేయడమే కాకుండా దర్యాప్తునకు కూడా తెలుగుదేశం ఆదేశించింది.   గాయత్రిపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ  హిందూ ఐటీ సెల్, బిజెపి ఆర్ఎస్ఎస్ ల డిమాండ్ మేరకే గాయత్రిని సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది.  ఈ సస్పెన్షన్ పై గాయత్రి స్పందన ఏమిటన్నది తెలియాల్సి ఉంది. 

14 ఏళ్లు.. 35 బంతులు.. 100.. ప‌రుగులు.. వాహ్ వైభవ్ సూర్యవంశి

13 ఏళ్ల వ‌య‌సులో బీహార్ ఫ‌స్ట్ క్లాస్ క్రికెట్ లోకి ఎంట్రీ అండర్ 19 యూత్ టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా పై 58 బాల్స్ లో సెంచెరీ ఐపీఎల్ ఎంట్రీ ఇచ్చిన అతి పిన్న వయస్కుడిగా రికార్డ్  టీ20 క్రికెట్ లో హాఫ్ సంచెరీ చేసిన యంగెస్ట్ ప్లేయ‌ర్ (14 సం. 32 రో.)  సీనియ‌ర్ క్రికెట్ లో సెంచ‌రీ చేసిన యంగెస్ట్ ప్లేయ‌ర్   హెచ్చ‌రిక మీరు ఈ విన్యాసాలు ద‌య చేసి ట్రై చేయ‌వ‌ద్దు.. ఇది నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో జ‌రిగిన‌ది అంటూ ఒక్కో యాడ్ లో మ‌నం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఇది  క్రికెట్ హెచ్చ‌రికః మీకు కూడా 14 ఏళ్లు వ‌చ్చాయి క‌దాని ఇలాంటి బీభ‌త్స‌మైన ఇన్నింగ్స్ ఆడ‌కండి. మీక‌న్నా వ‌య‌సులో పెద్ద‌వారైన క్రికెట‌ర్లు వెంట‌నే రిటైర్మెంట్ తీసుకుంటార‌ని ఈ హెచ్చ‌రిక‌ను మార్చి రాయాల్సి ఉంటుంది. ఒక చిన్న కుర్రాడు.. కాదు కాదు 14 ఏళ్ల చిచ్చ‌ర పిడుగు.. చేసిన విధ్వంసానికి కొత్త పేరు క‌నిపెట్టాలేమో. అవేం సిక్సులు.. ఒళ్లంతా తిరిగిపోతూ ఏకంగా 11 సిక్సులు బాద‌డంతో..  ఒక్కొక్క‌రికీ దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించింద‌ని చెప్పాల్సి ఉంటుంది. టాప్ ఫోర్ లో ఉన్న గుజ‌రాత్ టైటాన్స్ కి చెందిన బౌల‌ర్ల‌ను ఎక్క‌డో చిట్ట చివ‌రున్న రాజ‌స్తాన్ రాయ‌ల్స్ కి యంగ్ కిడ్ వైభ‌వ్ సూర్య‌వంశీ వ‌చ్చి వారికి నైట్ మేర్ చూపించాడు.  విచిత్ర‌మేంటంటే సూప‌ర్ స్ట్రైక‌ర్, హ‌య్య‌స్ట్ సిక్స‌ర్స్ వంటి వాటితో పాటు ప్లేయ‌ర్ ఆఫ్ ద మ్యాచ్ అంటూ మొత్తం నాలుగు అవార్డులు తీసుకున్న సూర్య‌వంశీతో పాటు ఇత‌డికి బౌలింగ్ వేసి ప‌ది డాట్ బాల్స్ వేసిన ర‌షీద్ ఖాన్ కి హ‌య్య‌స్ట్ డాట్ బాల్స్ అవార్డు తీస్కోవ‌డం. ఇదెలా విచిత్ర‌మంటే.. ఇంత విధ్వంసంలో ఆ మాత్రం డాట్ బాల్స్ వేసిన ఒకే ఒక్క‌డు ర‌షీద్.  ఇక గుజ‌రాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్ మ‌న్ గిల్ ని ర‌వి శాస్త్రీ ఎంత గుచ్చి గుచ్చి అడుగుతుంటే సిగ్గుతో ఆ బాలుడి గురించి ఏం మాట్లాడ‌డే.  ఇదిలా ఉంటే.. ఇట్స్ హిజ్ ప్లే గ్రౌండ్.. అంటూ డిజిట‌ల్ స్క్రీన్ పై ప‌డ్డం ఎంత‌టి సెన్సాఫ్ హ్యూమ‌ర్ ఉండాలో క‌దా అనిపించింది. నేను బౌల‌ర్ని చూడ‌ను బాల్ ని మాత్ర‌మే చూస్తా అంటూ పెద్ద పెద్ద బౌల‌ర్ల‌ను ఊచ కోత కోసిన‌ ఈ కుర్రాడికి ఐపీఎల్ మొత్తం పెట్టిన పేరు బాస్ బేబీ.  స‌చిన్ టెండూల్క‌ర్ పై అయినా పాకిస్థాన్ వెళ్లిన‌పుడు చిన్న పిల్లాడికి ఎలా బౌలింగ్ వేయాలా అని జాలి చూపిస్తే.. ఇంత చిన్న పిల్లాడి చేత ఇంత‌టి ఇంట‌ర్నేష‌న‌ల్ బౌల‌ర్ల‌యిన మాకు ఎంతటి ఘోర ప‌రాభ‌వంరా నాయ‌నా! అంటూ సిరాజ్, ఇషాంత్ శ‌ర్మ‌, ర‌షీద్ ఖాన్, ప్ర‌సిధ్ కృష్ణ ప‌డ్డ బాధ వ‌ర్ణ‌నాతీతం. వీరంద‌రిలోకీ ప్ర‌సిద్ ఒకింత అదృష్ట‌వంతుడు.. 35 బాల్స్ కి వ‌న్నాట్ వ‌న్ బాదిన ఈ టోర్న‌డో, ఈ తుఫాన్ ని ఇలాగైనా నేను కంట్రోల్ చేశాన‌న్న సంతృప్తిని మిగుల్చకున్నాడు ప్ర‌సిద్.. ఇప్పుడు స‌మ‌స్య ఏంటంటే ఇంత చిన్న వ‌య‌సులో ఇత‌డు సెట్ చేసిన రికార్డులు ఈ వ‌య‌సులో క్రికెట్ ప్రాక్టీస్ చేసే కుర్రాళ్ల‌పై చాలా చాలా ప్రెష‌ర్ ప‌డుతుందంటున్నారు కామెంట‌రేట‌ర్లు.  ఈ కుర్రాడ్ని పిక్ చేసిన రాహుల్ ద్రావిడ్ కి ఎంత చెడ్డ పేరంటే.. ఇంత భీక‌ర బౌల‌ర్ల‌కు ఈ వ‌య‌సు పిల్లాడ్ని వ‌దిలి బ‌లి  పెడ‌తారా ఎక్క‌డైనా? అంటూ తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. సోమవారం (ఏప్రిల్ 28) వైభవ్ సూర్యవంశి ఆనందానికి ఒక హద్దంటూ లేదు..  తన తండ్రి  క్రికెటర్ కావాల‌నుకున్నారు. కానీ ఆయ‌న కాలేక పోయారు. అందుకే ఆ క‌సి కొద్దీ బ్రియాన్ లారా ఇన్ స్పిరేష‌న్ తో తాను క్రికెట్ ని చిన్న నాడే సీరియ‌స్ గా తీసుకున్నాననీ,  2 ఏళ్ల పాటు ఇంట్లోనే ఆడి, ఆ త‌ర్వాత స‌మ‌స్తిపూర్.. ఆపై పాట్నాలో ట్రైనింగ్ తీసుకుని..  ఆ త‌ర్వాత‌ బోర్డుకు ఆడాననీ చెప్పిన సూర్యవంశీ.. ఆపై ఐపీఎల్ లో అడుగు పెట్టి ఇదిగో బ్రయన్ లారా ఇన్సిపిరేషన్ తో ఇలా విధ్వంస ర‌చ‌న‌లో వంద మంది సెహ్వాగ్ ల‌ను, వేయి మంది రిష‌భ్ పంత్ ల‌నీ దాటేశాడు.. ఆల్ ఫార్మాట్ క్రికెట్ లో కొత్త చ‌రిత్ర లిఖించాడు.  16 ఏళ్ల‌కే క్రికెట్ లో అడుగు పెట్టాన‌ని ఇప్ప‌టి వ‌ర‌కూ విర్ర‌వీగుతూ వ‌చ్చిన స‌చిన్ ని అయితే ఎప్పుడో వెన‌క్కు నెట్టేశాడు వైభ‌వ్ సూర్య‌వంశీ. తాను ఇండియ‌న్ క్రికెట్ కి రెప్ర‌జెంట్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఆశిస్తున్న వైభ‌వ్ త్వ‌ర‌లోనే ఆ ఫీట్ కూడా షురూ చేసి.. ఎంద‌రు బౌల‌ర్లకు నిద్ర లేకుండా  చేస్తాడో చెప్ప‌లేం.  మూడో మ్యాచ్ కే త‌న ప్ర‌త్య‌ర్ధి బౌల‌ర్ల‌ను ముప్పు తిప్ప‌లు పెట్టి.. మూడు చెరువుల నీరు తాగించిన.. వైభ‌వ్  ఫ్యూచ‌ర్ లో మ‌రిన్ని విధ్వంసాలు సృష్టించి కొత్త క్రికెట్ చ‌రిత్ర‌ను రాయాల‌ని ఆశిస్తూ... బేబీ బాస్  ద వ‌ర‌ల్డ్ క్రికెట్ ఈజ్  యూవ‌ర్ ప్లే గ్రౌండ్.. రా క‌న్నా.. ప్లే కిడ్.. బిగ్ క్రికెట్.. హ్యాపీ క్రికెట్ జ‌ర్నీ

14 ఏళ్లకే ఐపీఎల్ అరంగేట్రం.. ఆపై సెంచరీ.. వైభవ్ సూర్యవంశి ఓ అద్భుతం

రాజస్థాన్ రాయల్స్ అద్భుతం చేసింది. 209 పరుగులను ఇంకా 4.1 ఓవర్లు ఉండగానే ఛేదించింది. వరుస పరాజయాలతో కునారిల్లి ఉన్న జట్టు ఇంత వరకూ ఛేదనలో తడబడుతూ వచ్చింది. అయితే సోమవారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో మాత్రం కొండంత లక్ష్యాన్ని ఉఫ్ మని ఊదేశింది. అయితే ఈ ఛేదన ఇంత సునాయాసం కావడానికి కారణం మాత్రం వండర్ బాయ్ వైభవ్ సూర్యవంశి. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటారు. వైభవ్ సూర్య వంశీ కూడా 14 ఏళ్ల పిన్న వయస్సులోనే ఐపీఎల్ లో అరంగేట్రం చేశారు. అలా ఐపీఎల్ లో ఆడిన  అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. అయతే అక్కడితో ఆగిపోలేదు. ఐపీఎల్ లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే సిక్సర్ బాది ఔరా అనిపించాడు. ఇప్పుడు సోమవారం ( ఏప్రిల్ 29) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో సెంచరీ కొట్టి ఐపీఎల్ లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. అంతేనా ఐపీఎల్ లో అత్యంత వేగవంతమైన సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రికార్డుల్లోకి ఎక్కాడు. వైభవ్ సూర్యవంశి 35 బంతుల్లో 11 సిక్స్ లు, 7 ఫోర్లతో సెంచరీ చేశాడు.  సరే ఇక మ్యాచ్ విషయానికి వస్తే రాజస్థాన్ రాయల్స్ తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్  నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 201 పరుగుల విజయలక్ష్యాన్ని 14.5 ఓవర్లలో కేవలం రెండు వికెట్లు కోల్పోయి ఛేదించేసి విజయాన్ని అందుకుంది. ఆర్ ఆర్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశి 38 బంతుల్లో 101 పరుగులు చేశాడు. యశస్వి జైస్వాల్ 40 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లలో 70 నాటౌట్ చెలరేగి ఆడారు. దీంతో రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ పై విజయం సాధించింది.  

రాజ్యసభ అభ్యర్థిగా బీజేపీ నేత పాక వెంటకసత్యనారాయణ.. విధేయత, సీనియారిటీకే పెద్దపీట

విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన సీనియర్ నేత పాక వెంకటసత్యనారాయణ ఖరారయ్యారు. ఈ విషయాన్ని బీజేపీ సోమవారం సాయంత్రం అధికారికంగా ప్రకటించింది. బీజేపీతో పాకా సత్యనారాయణకు నాలుగు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉంది.ఆర్ఎ్ఎస్ నేపథ్యం ఉన్న పాక సత్యనారాయణ బీజేపీలో వివిధ స్థాయిలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నేపథ్యం కలిగిన ఆయన, పార్టీలో వివిధ స్థాయిల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు.  గతంలో రాష్ట్ర పార్టీ అధ్యక్ష పదవికి, ఎమ్మెల్సీ ఎన్నికలో అభ్యర్థిత్వం కోసం పార్టీ సీరియస్ గా పరిశీలనకు వచ్చినట్లు పార్టీ వర్గాల సమాచారం.   పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరం చెందిన బిజెపి సీనియర్ నాయకుడైన పాక వెంకటసత్యనారాయణ  ప్రస్తుతం ఆయన బిజెపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా ఉన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన పాక్ వెంకటసత్యనారాయణ గోదావరి జిల్లాల్లో ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానం నుంచి బీజేపీ తమిళనాడు మాజీ అధ్యక్షుడు అన్నామలై, మాజీ కేంద్ర మంత్రి అరుణా ఇరానీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే బీజేపీ సోమవారం అధికారికంగా పాక వెంకటసత్యనారాయణ పేరు ప్రకటించడంతో ఆ వార్తలన్నీ ఊహాగానాలే అని తేలిపోయింది. వృత్తిరీత్యా న్యాయవాది అయిన పాక వెంకటసత్యనారాయణ బీసీ వర్గానికి చెందిన నాయకుడు. మంచి వక్త. వివాదరహితుడు. పార్టీకి నాలుగు దశాబ్దాలుగా అంకిత భావంతో పని చేస్తున్నారు. వెంకటసత్యనారాయణను  రాజ్యసభ సభ్యత్వం దక్కడం పట్ల బీజేపీ రాష్ట్రనాయకులలో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి.  బీజేపీ ఏపీ కోర్ కమిటీ సోమవారం (ఏప్రిల్ 28) సమావేశమై బీజేపీ అభ్యర్థిపై చర్చించింది. పలువురి పేర్లను పరిశీలించిన తరువాత పాక వెంకటసత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ఫైనల్ చేసి అధిష్ఠానానికి పంపింది.  ఈ కోర్ కమిటీ సమావేశంలో యూరప్ పర్యటనలో ఉన్నబీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర కోర్ కమిటీ పాక్ వెంకటసత్యనారాయణ పేరును అధిష్ఠానానికి పంపింది. మరో ఆలోచన లేకుండా పార్టీ హైకమాండ్ కూడా ఆ పేరునే ఖరారు చేసి ప్రకటించింది. పాక్ వెంకటసత్యనారాయణ మంగళవారం (ఏప్రిల్ 29)న నామినేషన్ దాఖలు చేయనున్నారు.  వాస్తవానికి, ఈ రాజ్యసభ స్థానానికి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై, ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ వంటి పలువురి పేర్లు గత కొంతకాలంగా ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాడు ఎన్నికల నేపథ్యంలో అన్నామలైని ఏపీ నుంచి రాజ్యసభకు పంపించి, కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని విస్తృతంగా వార్తలు వచ్చాయి. అయితే, ఈ ఊహాగానాలన్నింటినీ పక్కన పెట్టి, పార్టీకి మొదటి నుంచి సేవలందిస్తున్న రాష్ట్ర నేతకే అవకాశం ఇవ్వాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. అత్యంత సామాన్య కార్యకర్త స్థాయి నుంచి పార్టీలో పనిచేసిన పాకా సత్యనారాయణకు అనూహ్యంగా రాజ్యసభ అవకాశం దక్కడంతో పార్టీ శ్రేణుల్లోనూ ఆసక్తి నెలకొంది. అధిష్ఠానం నిర్ణయం వెలువడిన వెంటనే పలువురు నేతలు, కార్యకర్తలు ఆయనకు అభినందనలు తెలుపుతున్నారు. మంగళవారం ఆయన నామినేషన్ దాఖలు చేయను న్నారు.

కేటీఆర్‌కు వెన్ను పూసలో గాయం.. కొద్ది రోజులు పార్టీ కార్యక్రమాలకు దూరం

  బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ జిమ్ వర్కౌట్ చేస్తుండగా గాయపడ్డారు. దీంతో ఆయన కొద్ది రోజుల పాటు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్లు సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని కేటీఆర్ స్వయంగా ఎక్స్ వేదికగా అభిమానులకు, బీఆర్‌ఎస్ శ్రేయోభిలాషులకు తెలియజేశారు. అంతేగాక త్వరలోనే తన పాదాలపై తాను నడుచుకుంటూ వస్తానని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ట్విట్టర్ లో.. జిమ్ లో వర్కౌట్  చేస్తుండగా వెన్నుపూసలో సమస్య తలెత్తిందని తెలిపారు. దీంతో వైద్యులను సంప్రదించగా.. కోలుకునేందుకు కొద్ది రోజుల సమయం పడుతుందని, అప్పటివరకు బెడ్ రెస్ట్  అవసరం అని సూచించినట్లు చెప్పారు. నిన్న ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో కేటీఆర్ పాల్గొన్న సంగతి తెలిసిందే. కేటీఆర్ త్వరగా కోలుకోవాలని బీఆర్‌ఎస్ శ్రేణులు కామెంట్లు చేస్తున్నారు  

బాలకృష్ణకు అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు

  ప్రముఖ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మభూషణ్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.‘‘గౌరవ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పద్మభూషణ్ అవార్డు అందుకున్న ప్రముఖ సినీనటులు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు నా అభినందనలు. కళా, సేవా, రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసుకున్న బాలయ్య మరిన్ని నూతన శిఖరాలు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఆయనపై సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అభినందనలు చెబుతున్నారు. ఈ మేరకు ఎక్స్‌లో ట్వీట్లు చేస్తున్నారు.

ఏపీ రాజ్యసభ ఎన్డీఏ అభ్యర్థిగా బీజేపీ నేత పాకా వెంకటసత్యనారాయణ

    ఏపీలో ఖాళీ అయిన  రాజ్యసభ స్థానానికి అభ్యర్థి ఖరారయ్యారు. భీమవరం బీజెపి క్రమశిక్షణ సంఘం ఛైర్మన్ పాక వెంకట సత్యనారాయణ పేరును కమలం పార్టీ అధిష్ఠానం ప్రకటించింది. రేపు ఆయన నామినేషన్ దాఖలు చేయనున్నారు. పాక గతంలో భీమవరం కౌన్సిలర్ గా పని చేశారు. ప్రస్తుతం పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ గా ఉన్నారు. ఈ స్థానం నుంచి అన్నామలై, స్మృతి ఇరానీ, మందకృష్ణ మాదిగ పోటీ చేస్తారని ప్రచారం జరిగినా అనూహ్యంగా పాక పేరును ప్రకటించారు.  ఇటీవల విదేశీ పర్యటనకు వెళ్లి తిరుగుపయనంలో దిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఈ స్థానానికి ఎస్సీ వర్గీకరణలో కీలకంగా వ్యవహరించిన నేత, ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ  తమిళనాడుకు చెందిన అన్నామలై, కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయ్యింది. మరో రెండేళ్ల పదవీ కాలం ఉన్న నేపథ్యంలో ఉపఎన్నికకు ఇటీవల నోటిఫికేషన్‌ విడుదలైంది  

పద్మభూషణ్ అవార్డు అందుకున్న నందమూరి బాలకృష్ణ

    టాలీవుడ్ ప్రముఖ హీరో హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పద్మ భూషణ్ అవార్డు అందుకున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన  పౌర పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ గౌరవాన్ని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ సంప్రదాయ తెలుగు వస్త్రధారణ అయిన పంచెకట్టులో హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమానికి బాలయ్య పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. భారతీయ సినిమా రంగానికి, సమాజానికి బాలకృష్ణ అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు ఈ పద్మ భూషణ్ అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. హీరోగా సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిన సేవలతో పాటు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఛైర్మన్‌గా అందిస్తున్న సేవలను పరిగణనలోకి తీసుకుని ఆయనను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు. దివంగత ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు నందమూరి తారక రామారావు వారసుడిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన బాలకృష్ణ, తన సుదీర్ఘ కెరీర్‌లో వందకు పైగా చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. గతేడాది 50 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్నారు. పౌరాణికం, జానపదం, సాంఘికం, సైన్స్‌ ఫిక్షన్‌, బయోపిక్‌.. ఇలా అన్ని పాత్రలను చేసిన ఏకైక అగ్ర నటుడిగా ఆయన తెలుగు ప్రేక్షకుల మనుసు దోచుకున్నారు. క్యాన్సర్‌ ఆస్పత్రి ఛైర్మన్‌గా ఎంతో మందికి పేదలు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు.. గతంలో కూడా ఆయన అనేక ఫిలింఫేర్, నంది అవార్డులతో సహా పలు పురస్కారాలు అందుకున్నారు.

ఏపీలో 10 జిల్లాలకు డీసీఎంఎస్‌ ఛైర్మన్ల నియామకం

  ఏపీలోని 10 జిల్లాల సహకార బ్యాంకు సంఘాల చైర్మన్లను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియమించారు. జిల్లా సహకార మార్కెటింగ్‌ సంఘాల (డీసీఎంఎస్‌) ఛైర్మన్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‌గా శివ్వల సూర్యనారాయణ (టీడీపీ), విశాఖ డీసీసీబీ ఛైర్మన్‌గా కోన తాతారావు (జనసేన) నియమితులయ్యారు. విజయనగరం డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత కమిడి నాగార్జునను నియమించారు. గుంటూరు డీసీసీబీ చైర్మన్‌గా మాకినేని మల్లికార్జునరావు(టీడీపీ), కృష్ణా డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత నెట్టెం రఘురామ్, నెల్లూరు డీసీసీబీ చైర్మన్‌గా ధనుంజయరెడ్డి (టీడీపీ), చిత్తూరు డీసీసీబీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీ నేత అమాస రాజశేఖర్ రెడ్డిని నియమించారు. అనంతపురం డీసీసీబీ చైర్మన్‌గా కేశరెడ్డి (టీడీపీ), కర్నూలు డీసీసీబీ చైర్మన్‌గా తెలుగుదేశం పార్టీకి చెందిన డి. విష్ణువర్ధన్ రెడ్డి, కడప డీసీసీబీ చైర్మన్‌గా టీడీపీ నేత బి. సూర్యనారాయణరెడ్డి నియమించారు. డీసీఎంస్ చైర్మన్‌ లిస్ట్ ఇదే శ్రీకాకుళం డీసీఎంస్ చైర్మన్‌గా టీడీపీ నేత అవినాశ్ చౌదరి, విశాఖ డీసీఎంస్ చైర్మన్ గా కొట్ని బాలాజీ (టీడీపీ), విజయనగరం డీసీఎంస్ చైర్మన్‌గా గొంప కృష్ణ(టీడీపీ), గుంటూరు డీసీఎంస్ చైర్మన్‌గా వడ్రాణం హరిబాబు (టీడీపీ), కృష్ణా డీసీఎంస్ చైర్మన్‌గా జనసేన పార్టీకి చెందిన బండి రామకృష్ణను నియమించారు. నెల్లూరు డీసీఎంస్ చైర్మన్‌గా టీడీపీ నేత గొనుగోడు నాగేశ్వరరావు, చిత్తూరు డీసీఎంస్ చైర్మన్‌గా సుబ్రహ్మమణ్యం నాయుడు(టీడీపీ), అనంతపురం డీసీఎంస్ చైర్మన్‌గా నెట్టెం వెంకటేశ్వర్లు (టీడీపీ), కర్నూలు డీసీఎంస్ చైర్మన్‌గా జి. నాగేశ్వరయాదవ్(తెలుగుదేశం పార్టీ), కడప డీసీఎంస్ చైర్మన్ గా టీడీపీ చెందిన యర్రగుండ్ల జయప్రకాశ్‌ను నియమించారు. ఈ మేరకు లిస్టు రిలీజ్ చేశారు. 

తిరుపతి జిల్లాలో కంటైనర్‌ కిందకు దూసుకెళ్లిన కారు .. ఐదుగురు మృతి

  తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పూత‌ల‌ప‌ట్టు-నాయుడుపేట జాతీయ ర‌హ‌దారిపై పాకాల మండ‌లం తోట‌ప‌ల్లి వ‌ద్ద కంటైన‌ర్ కిందకు కారు దూసుకెళ్లింది. ఈ ఘ‌ట‌న‌లో ఐదుగురు అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ప్ర‌మాద‌స్థ‌లికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. స్థానికులు క్షతగాత్రుల్ని సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులను తమిళనాడులోని కృష్ణగిరి వాసులుగా గుర్తించారు.  మృతి చెందిన వారిలో ఇద్దరు పురుషులు, ఇద్దరు మహిళలు, దాదాపు 9 ఏళ్ల వయసున్న బాలుడు ఉన్నారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారిగా భావిస్తున్నారు. ఈ సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు అన్ని రకాలుగా సాయం అందేలా చూడాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. గాయ‌ప‌డిన వారిని స‌మీపంలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.  

గ్రూప్-1 నియామకాలపై టీజీపీఎస్సీ అప్పీలు పిటిషన్

  తెలంగాణ గ్రూప్-1 నియామకాలపై ఇటీవల హైకోర్టు సింగిల్ ఇచ్చిన మధ్యంతరం ఉత్తర్వులను సవాల్ చేస్తూ టీజీపీఎస్సీ  అప్పీల్ పిటీషన్ దాఖలు చేసింది. దీనిపై హైకోర్టు సీజే ధర్మాసనం రేపు విచారణ చేపట్టనుంది.  గ్రూపు-1 పరీక్షలో అక్రమాలు జరిగాయని హైకోర్టుపలు పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. మెయిన్స్ ఎగ్జామ్ మూల్యాంకనం సరిగ్గా జరుగలేదని, పరీక్షల కేంద్రాల కేటాయింపుల్లోనూ నిబంధనలు పాటించలేదని పిటిషనర్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.  గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో కొన్ని పిటిషన్లు దాఖలు కావడం, వాటిపై విచారణ జరగడం, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం, నియామక పత్రాలు జారీ చేయకుండా ఆపడం జరిగింది. అయితే, సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించొచ్చని హైకోర్టు స్పష్టం చేసింది.    

పేదరికం తరిగి ఉపాధి పెరిగిపోతోంది..ట!

ప్రపంచ బ్యాంకు ఉవాచ దేశంలో పేదరికం ఏ స్థాయిలో వుందో, ఆకలి స్థాయి ఏమిటో, కటిక దారిద్ర్యంలో మగ్గుతున్న పేదలకు తెలిసినంతగా మరొకరికి తెలియదు. కానీ ప్రపంచ బ్యాంకు తాజా   నివేదిక మాత్రం భారత దేశంలో పేదరికం రోజురోజుకూ తగ్గిపోతోందని అంటోంది.  ఆర్థిక పేదరికం మాత్రమే కాకుండా, విద్య, ఆరోగ్యం జీవన ప్రమాణాలతో ముడిపడి ఉన్న వివిధ కోణాల పేదరికంలో కుడా  కూడా భారత దేశం మంచి మెరుగుదల సాధించిందని నివేదిక పేర్కొంది. అలాగే..  ఉపాధి కల్పనలోనూ భారత దేశం ముందుకు దుసుకుపోతోందని   ప్రపంచ బ్యాంకు తాజా నివేదిక లెక్కలు కట్టి మరీ తేల్చి చెప్పింది.  అవును. గడచిన దశాబ్ద కాలంలో భారత దేశంలో 17.10 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడినట్టు ప్రపంచ బ్యాంకు వెల్లడించింది.  2011-12లో దేశ జనాభాలో 16.2 శాతం ప్రజలు దుర్భర పేదరికం (రోజుకు రూ.200 కంటే తక్కువ ఆదాయం)లోమగ్గగా, 2022-23 నాటికి ఆ సంఖ్య 2.3 శాతానికి తగ్గినట్టు ప్రపంచ బ్యాంకు ఇటీవల విడుదల చేసిన నివేదిక  పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. దుర్భర పేదరికంతో బాధపడుతున్నవారు పదేళ్లలో గ్రామీణ ప్రాంతాల్లో 18.4 శాతం నుంచి 2.8 శాతానికి, పట్టణ ప్రాంతాల్లో 10.7 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరం 7.7 నుంచి 1.7 శాతానికి తగ్గింది. పేదలు క్రమేణా దిగువ, మధ్య-ఆదాయ కేటగిరీలోకి మారుతున్నారు. అలాగే దిగువ, మధ్య-ఆదాయ కేటగిరిలో ఉన్నవారు మధ్య తరగతి ఆదాయ కేటగిరిలోకి వెళ్తున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 69 శాతం నుంచి 32.5 శాతానికి, పట్టణాల్లో 43.5 శాతం నుంచి 17.2 శాతానికి తగ్గింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అంతరం 25 నుంచి 15 శాతానికి తగ్గింది. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనలో భారత్‌ పురోగతి సాధిస్తోందని ప్రపంచ బ్యాంక్‌ నివేదిక పేర్కొంది. 2021-22 నుంచి యువత (శ్రామిక-వయసు జనాభా) కంటే వేగంగా ఉపాధి పెరుగుతోందని వెల్లడించింది. ముఖ్యంగా మహిళలు, గ్రామీణుల్లో స్వయం ఉపాధి పెరుగుతోందని తెలిపింది. 2024-25 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పట్టణ నిరుద్యోగం 6.6 శాతానికి తగ్గిందని, 2017-18 నుంచి ఇదే అతి తక్కువ అని వెల్లడించింది. ఉపాధి కోసం గ్రామీణ పురుషులు పెద్ద సంఖ్యలో పట్టణాల బాట పడుతున్నారని తెలిపింది. వ్యవసాయ రంగంలో గ్రామీణ మహిళల ఉపాధి మెరుగుపడినట్టు పేర్కొంది. దేశంలో మహిళల ఉపాధి రేటు 31 శాతానికి చేరినట్టు వెల్లడించింది. అయితే,ఉపాధి విషయంలో మహిళలు మెరుగుపడినప్పటికీ, వారిపై అసమానతలు మాత్రం తగ్గలేదని వరల్డ్ బ్యాంక్ తెలిపింది. మహిళా ఉద్యోగ రేటు 31 శాతానికి చేరుకుందని, కానీ వేతన ఉద్యోగాల్లో మహిళల కంటే పురుషులు 234 మిలియన్లు ఎక్కువగా ఉన్నారని పేర్కొంది. అలాగే దేశంలో ఉన్న పేదరికాన్ని కూడా నివేదికలో ప్రపంచ బ్యాంకు ప్రస్తావించింది. అలాగే, 2011-12లో ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, బిహార్, బెంగాల్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో 60శాతంగా  ఉన్న పేదల, 2022-23 నాటికి 54 శాతానికి తగ్గారని, అని వరల్డ్ బ్యాంకు పేర్కొంది. అయితే,ఇప్పటికి కూడా పేదరికంలో పెద్ద పీట ఈ ఐదు రాష్ట్రాలదే’అని కూడా ప్రపంచ బ్యాంకు స్పష్టం చేసింది. అయితే ఈ నివేదిక అక్షర సత్యమా అంటే కాదు. నిజానికి ప్రపంచ బ్యాంకు నివేదిక అనే కాదు, ప్రపంచంలోని ఏ సంస్థ ఇచ్చే నివేదిక అయినా సంపూర్ణ సత్యం కాదు. సంపూర్ణ అసత్యం కాదు. కొంత సత్యం. కొంత అసత్యం. అయితే.. ఇతర దేశాలతో పోల్చి నప్పుడు, ముఖ్యంగా కొవిడ్ అనంతర కాలంలో, మన దేశం ఆర్థిక పరిస్థితి ఎంతో కొంత మెరుగ్గా ఉందని ప్రపంచ దేశాలు అన్నీ అంగీకరిస్తున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ త్వరలోనే ప్రపంచ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో మూడవ స్థానికి చేరుకుంటుందని అంటున్నారు. అలాగే.. గడచిన పదేళ్ళలో 25 కోట్ల మందికి పైగా పేదలు, పేదరికం గీత దాటి పై మెట్టుకు చేరుకున్నారని, కేంద్ర విత్త మంత్రి నిల సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు.  అయితే.. మరో వంక విపక్షాలు మాత్రం దేశంలో పేదరికం, నిరుద్యోగం పోటాపోటీగా పెరిగి పోతున్నాయని అంటున్నారు. అందుకే.. మజ్ను అందాలను చూడాలంటే లైలా కళ్లతో చూడాలి అంటారు.

MCRHRD వైస్ చైర్మన్‌గా సీఎస్ శాంతి కుమారి

  తెలంగాణ ప్రస్తుత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి  శాంతి కుమారికి ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) వైస్ ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ  సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. అంతేకాకుండా, ఆమెకు ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్‌ (డీజీ)గా అదనపు బాధ్యతలు కూడా అప్పగించింది. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు కాగా తెలంగాణ తదుపరి సీఎస్‌గా  కె. రామకృష్ణారావును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం 1991 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన రామకృష్ణారావును సీఎస్‌గా ఎంపిక చేసింది.  

విశాఖలో గూగుల్ సంస్థ భారీ పెట్టుబడులు : సీఎం చంద్రబాబు

  హైదరాబాద్‌లో కేవలం 14 నెలల్లోనే హైటెక్ సిటీని నిర్మించానని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అమరావతిలోని విట్  విశ్వవిద్యాలయంలో నేడు జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.  ప్రపంచంలో ఏ మూలకు వెళ్లినా భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు తమ ప్రతిభతో ఉన్నత స్థానాల్లో ఉంటున్నారని  కొనియాడారు. ఈ సందర్భంగా విట్-ఏపీ క్యాంపస్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం, నూతన స్టార్టప్ ఆలోచనలకు ఊతమిచ్చేందుకు ఏర్పాటు చేసిన వి-లాంచ్‌ ప్యాడ్ 2025 ఇంక్యుబేషన్ సెంటర్‌ను లాంఛనంగా ఆవిష్కరించారు. విద్యార్థులనుద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ, విట్-ఏపీలో 95 శాతం మంది విద్యార్థులు క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలు సాధించడం అభినందనీయమన్నారు. భవిష్యత్ అంతా ఐటీ దేనని అప్పట్లోనే చెప్పాను దేశంలోని ఐఐటీలలో 20 శాతం సీట్లు తెలుగోళ్లే కొల్లగొడుతున్నారు. అన్నింటిలో తెలుగువారు ముందుండాలనేదే నా ఆకాంక్ష అని తెలిపారు.ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులుంటారు.. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారని పేర్కొన్నారు.  మే 2 ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమరావతికి వస్తున్నారు. ప్రధాని చేతుల మీదుగా అమరావతి పున:ప్రారంభం కాబోతుందని.. అప్పట్లో ఐటీని ప్రమోట్ చేశానని.. ఇప్పుడు క్వాంటమ్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నానని తెలిపారు. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్ ఉద్యోగానికి కూడా డిమాండ్ ఉండేది. ఒకప్పుడు ప్రభుత్వ అటెండర్‌ ఉద్యోగానికి కూడా డిమాండ్‌ ఉండేది. ఇప్పుడు కలెక్టర్‌ పోస్టు కంటే ఐటీ ఉద్యోగానికే డిమాండ్‌ ఎక్కువగా ఉందన్నారు. విట్‌ అమరావతిలో 95 శాతం ప్లేస్‌మెంట్లు వస్తున్నాయి. మీరు ఉద్యోగంలో సంతృప్తి చెందవద్దు.. కొత్త సంస్థలు స్థాపించండి. సిలికాన్‌ వ్యాలీలో కంపెనీల సీఈవోలంతా తెలుగోళ్లు, భారతీయులే. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉంటారు. అందులో అగ్రస్థానంలో తెలుగువారు ఉంటారు. త్వరలో అమరావతిలో రతన్‌టాటా ఇన్నోవేషన్‌ హబ్‌ ఏర్పాటు చేస్తున్నాం. మన పిల్లలు ప్రపంచస్థాయి సేవలు అందించే స్థాయికి ఎదగాలి. వాట్సప్‌ సేవ ద్వారా ప్రజలకు పరిపాలన, ప్రభుత్వ సర్వీసులు దగ్గర చేశాం. వాట్సప్‌ ద్వారా వెయ్యి రకాల సేవలు అందిస్తున్నాం. స్వర్ణాంధ్రప్రదేశ్‌ 2047కి మార్గసూచి రూపొందిస్తున్నాం. ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదిగింది. ఇప్పుడు కలెక్టర్ పోస్ట కంటే ఐటీ ఉద్యోగానికి డిమాండ్ ఎక్కువగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో విట్ యూనివర్సిటీ ఛాన్స్‌లర్ డాక్టర్ జి. విశ్వనాథన్, వైస్ ఛాన్స్‌లర్ డాక్టర్ ఎస్.వి. కోటారెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

రాజకీయ సయోధ్య మూన్నాళ్ళ ముచ్చటేనా?

పహల్గాం ఉగ్ర దాడి నేపధ్యంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలను పక్కన పెట్టి  ఒక్కటయ్యాయి. ఐక్యతను  ప్రదర్శించాయి. ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. మాలో మాకు సవాలక్ష విబేధాలు ఉండవచ్చును కానీ..  మా దేశం పై మరో దేశం ఏ రూపంలో దాడి చేసినా, రాజకీయాలను పక్కన పెట్టి ఒక్కటై నిలుస్తామని శతృ మూకకు స్పష్టమైన హెచ్చరిక చేశాయి. దేశం గర్వించేలా అధికార, ప్రతిపక్ష నాయకులు, చేతులు కలిపి సయోధ్య  ప్రదర్శించారు. అవును పహల్గాం ఉగ్ర దాడి పై చర్చించేందుకు ఏప్రిల్ 24 న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్, ఎంఐఎం సహా ప్రతిపక్ష పార్టీలన్నీ ఉగ్రదాడిని ముక్త కంఠంతో ఖండించాయి. కాంగ్రెస్ అగ్ర నేతలు, రాహుల్ గాంధీ,మల్లికార్జున ఖర్గే సహా  అన్ని పార్టీల నాయకులు సర్కార్ కు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని మట్టుపెట్టేందుకు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, మద్దతు ఇస్తామని  అండగా నిలుస్తామని ‘బ్లాంక్ చెక్ ’ ఇచ్చారు. సంపూర్ణ మద్దతు ఇచ్చారు. సయోధ్య ప్రకటించారు. అయితే.. ఈ మాటల తడి ఇంకా పూర్తిగా అరక ముందే.. వాతావరణం వేడెక్కుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. అవును  అఖిలపక్ష సమావేశంలో వ్యక్తమైన సయోధ్యకు ఇంతలోనే   చుక్కెదురు అయిందా?  ఇంతలోనే సయోధ్యకు చిల్లు పడిందా?  అనే  అనుమనాలు, ఆందోళన వ్యక్త మవుతున్నాయి.  ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ స్వరం మెల్లమెల్లగా మారుతోందని అంటున్నారు.  ఏప్రిల్ 24న ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశంలో భద్రతా లోపాలకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపక్షాలకు తప్పడు సమాచారం ఇచ్చిందని, తప్పు దోవ పట్టించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. తృణమూల్ కాంగ్రెస్ స్వరం కలిపింది.  అఖిల పక్ష సమావేశంలో  కేంద్ర హోం మంత్రిత్వ శాఖ అధికారులు, ఉగ్రదాడి జరిగిన  బైసరాన్ లోయలో పర్యటించేందుకు టూర్ ఆపరేటర్స్  స్థానిక అధికారుల అనుమతి తీసుకోలేదనీ,   అలాగే  సహజంగా బైసరాన్  లోయలో పర్యాటకుల సందర్శనకు జూన్  లో అనుమతిస్తారనీ,  కానీ ఈసారి స్థానిక అధికారులు, పోలీసుల అనుమతి లేకుండానే టూరిస్ట్  ఆపరేటర్స్ ఏప్రిల్ 20 నుంచే బైసరాన్  లోయకు పర్యాటకులను  తీసుకు పోయినట్లు పేర్కొన్నారు. అయితే  హోం శాఖ అధికారులు ఇచ్చిన ఈ సమాచారం తప్పని  బైసరాన్ లోయ ఒక్క మంచు కురిసే కాంలో తప్పించి, సంవత్సరం పొడుగునా తెరిచే ఉంటుందిని  స్థానిక పత్రికలలో కథనాలు వచ్చాయి. ఈ పత్రికా కథనాలే.. విపక్షాలకు ఆయుధం అయ్యాయి.   అవును ఆ పత్రికా కథనాలను ఉటంకిస్తూ.. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ మీడియా సెల్ ఇంచార్జి, జైరాం రమేష్  సోషల్ మీడియా ప్లాట్ ఫారం   ‘ఎక్స్’  వేదికగా  చిన్నగా  చిచ్చు పెట్టారు.  అఖిల పక్ష సమావేశంలో ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చినట్లుంది.  రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్  అధ్యక్షతన ఏప్రిల్ 24 న జరిగిన అఖిలపక్ష సమావేశంలో సరైన  సమాచారం ఇచ్చినట్లు లేదు. నిజానికి  తప్పుడు  సమాచారం యిచ్చినట్లుంది  అంటూ, ఒక అస్పష్ట పోస్టు పెట్టారు. చిచ్చు రాజేశారు. ఆవెంటనే  మరో కాంగ్రెస్ ఎంపీ రందీప్ సుజ్రేవాలా  ఒక అడుగు ముందుకేసి  దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయ మన్నట్లు, పహల్గాం  ఉగ్ర దాడిలో ఇంటెలిజెన్స్, భద్రతా వైఫల్యాలు జరిగాయని నిర్ధారించారు. ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర మంత్రులు  అఖిల పక్ష సమావేశానికి, మొత్తం దేశానికీ దేశానికీ ఎందుకు  అబద్దం చెప్పారంటూ  ఆశ్చర్యం వ్యక్తం చేశారు.  అలాగే..  తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు, మాజీ జర్నలిస్ట్ సాగరికా ఘోష్  కూడా కాంగ్రెస్ తో గొంతు కలిపారు. ప్రధాని మోదీ ప్రభుత్వం, హోం మంత్రి అమిత్ షా, ఎందుకు ప్రతిపక్షాన్ని తప్పు దో పట్టించారు? అంటూ ప్రశ్నించారు.  అయితే.. ఏవో కొన్ని స్థానిక పత్రికల్లో వచ్చిన కధనాల అధారంగా కాంగ్రెస్, తృణమూల్  నాయకులు..  ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్లు అసత్యాన్ని ప్రచారం చేయడం ఏమిటని బీజేపీ ఎదురు దాడికి దిగింది. అంతే కాకుండా అఖిలపక్ష  సమావేశంలో ఇచ్చిన మాటను  కాంగ్రెస్ పార్టీ  ఇంతలోనే ఎందుకు తప్పుతోందని  అధికార బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. అంతే కాదు..  నువ్వోకటంటే మేము నాలుగు అంటాం  అంటూ బీజీపీ రాజ్యసభ సభ్యుడు సుధాన్షు త్రివేది ఇందిరా గాంధీ మర్డర్ మొదలు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగిన అనేక భద్రతా లోపాలాను ప్రస్తావిస్తూ ఎదురు దాడికి దిగారు. దీంతో ఉరుము ఉరిమి మంగలం మీద పడినట్లు  అవుతుందని గ్రహించి కావచ్చును, కాంగ్రెస్ అధ్యక్షుడు  మల్లికార్జున ఖర్గే   సెక్యూరిటీ లోపాల గురించి  హోం మంత్రి అమిత్ షా అఖిల పక్ష సమావేశంలో అంగీకరించారు.  సో.. తానా విషయంలోకి పోను కానీ  1961 సిందూ నదీ జలాల ఒప్పందం నిలిపి వేయడంపై అభ్యంతరం వ్యక్తపరిచారు. దిగువకు నీరు పంపకుండా  ఎలా నిలుపుతారు అంటూ నిలదీశారు? అసాధ్యమంటూ ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టారు.  అయితే..  ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ ఇంతలోనే  ‘యు’ టర్న్ తీసుకోవడం, కాంగ్రెస్ వెంట తృణమూల్ అడుగులు వేయడం, మరో వంక కర్ణటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, పాకిస్థాన్ పై యుద్ధం వద్దని అనడం వంటి  పరిణామాలను  గమనిస్తే..  అఖిల పక్ష సమవేశంలో వ్యక్తమైన రాజకీయ సయోధ్య మూన్నాళ్ళ ముచ్చ టేనా  అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడారు..రజతోత్సవ సభపై రేవంత్ రియాక్షన్

  హన్మకోండ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించిన బీఆర్‌ఎస్ రజతోత్సవ సభలో ఆ పార్టీ అధినేత కేసీఆర్ చేసిన ప్రసంగంపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. తెలంగాణ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఇప్పుడు మాపై నిందలు వేేేస్తున్నరని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలు నమ్మే స్థితిలో లేరని, కేసీఆర్ అభద్రతాభావంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి, తనకు మధ్య దూరం పెరిగిందంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన కొట్టిపారేశారు. రాహుల్ గాంధీతో తనకు ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని స్పష్టం చేశారు. మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్,కేకే, వేం నరేందర్ రెడ్డితో కలిసి నిన్న శాంతి కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలు, అపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణపై చర్చించారు.  అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. గతంలో బీఆర్ఎస్ హయంలో ఖమ్మం రాహుల్ గాంధీ సభకు బస్సులు ఇవ్వమంటే ఇవ్వకుండా అడ్డుకున్నారని విమర్శించారు. అవసరాలకు అనుగణంగా కేసీఆర్, ప్రధానీ మోడీ మాటలు మారుస్తున్నారని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశానికి ఇందిరాగాంధీ లాంటి ప్రధాని కావాలని, రెండు దేశాలను ఓడించిన ఘనత ఇందిరాగాంధీదేనన్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. శాసన సభ్యులు హైదరాబాద్ లో టైమ్ పాస్ చేయడం సరికాదని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీలో ఓపిక ఉంటే పదవులు వస్తాయి. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నష్టపోతారు. రాహుల్ గాంధీకి, నాకు గ్యాప్ ఉందనడం అవాస్తవం అని మా ఇద్దరి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని ఎవర్నీ నమ్మించాల్సిన పని లేదన్నారు. బయట ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోనని చెప్పారు.  

హరిరాం అక్రమాస్తులు.. వంద కోట్లు పైమాటే!?

కాళేశ్వరం మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్‌ భూక్యా హరిరాంని అక్రమాస్తుల కేసులో అరెస్టు చేసింది  ఏసీబీ. హరిరాంతో సంబంధమున్న 14 ప్రదేశాలతో దాడులు చేసింది అవినీతి నిరోధకశాఖ. ఈ దాడుల్లో భూక్యా హరిరాంకి సంబంధించిన భారీ ఎత్తున అక్రమాస్తులున్నట్టు గుర్తించిన ఏసీబీ  హరిరాంను గజ్వేల్ లో శనివారం (ఏప్రిల్ 26)అరెస్టు చేసింది. ఈ సందర్భంగా హరిరాం విలాసవతంతమైన ఆస్తుల జాబితా విడుదల చేసింది. దాని ప్రకారం చూస్తే.. షేక్‌పేటలో లగ్జరీ విల్లా, కొండాపూర్‌లో లగ్జరీ విల్లా, శ్రీనగర్ కాలనీలో ఫ్లాట్, మాదాపూర్‌లో ఫ్లాట్, నార్సింగిలో ఫ్లాట్, అమరావతిలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్, మర్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్‌చెరులో 20 గుంటల భూమి, శ్రీనగర్ కాలనీలో 2 ఇండివిడ్యువల్ హౌసెస్, బొమ్మలరామారంలో ఆరు ఎకరాల్లో మామిడి తోటతో కూడుకున్న ఫామ్ హౌస్. కొత్తగూడెంలో నిర్మాణంలో ఉన్న ఒక భవంతి, కుత్బుల్లా పూర్ లో ఓపెన్ ప్లాట్, మిర్యాలగూడలో మరో ఓపెన్ ప్లాట్, ఒక బీఎండబల్యూ కారుతో సహా.. 2 ఇతర వామనాలు తమ సోదాల్లో వెలుగులోకి తీశారు అధికారులు. ఇంకా బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లతో కలుపుకుని సుమారు ఈ అక్రమాస్తుల   విలువ వంద కోట్ల మేర ఉండొచ్చని అంచనా.  హరిరాంను అదుపులోకి తీసుకుని జ్యుడిషియల్ కస్టడీకి తరలించారు అధికారులు. కాళేశ్వరం రూపకల్పన, నిర్మాణం నిర్వహణలో తీవ్రమైన లోపాలను బయట పెట్టింది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. నివేదిక విడుదలైన కాసేపటికే ఇది జరగడం గమనార్హం.

స్థానిక పీఠాల్లో కూటమి పాగా!

ఫలిస్తున్న బాబు చాణక్యం దూసుకు పోతున్న కూటమి  డీలా పడిన వైసీపీ ఏపీలో కూటమి పార్టీలు స్థానిక పీఠాలను కైవశం చేసుకుంటున్నాయి. చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో  రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కలల రాజధాని నిర్మాణం ఓ వైపు యుద్ధప్రాతిపదికన సాగుంతోంది. మూడేళ్ల కాల వ్యవధిలో అమరావతి పూర్తి కానున్నదని చంద్రబాబు నమ్మకంగా చెబుతున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం పనుల వేగం ఆకాశమే హద్దుగా పరుగులు తీస్తున్నది, అదే సమయంలో తెలుగుదేశం స్థానిక సంస్థలపై దృష్టి కేంద్రీకరించింది. జగన్ హయాంలో  దౌర్జన్యంగా గెలుచుకున్న స్థానిక సంస్థలలో జెండా ఎగుర వేస్తున్నది. గ్రేటర్ విశాఖపై కన్నేసిన టీడీపీ ఆ దిశగా దూసుకెళ్లి మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం లో సక్సెస్ అయింది. ఇక అప్పటి వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ దక్కించుకున్న  గుంటూరు,కుప్పం, మాచర్ల మున్సిపల్ పీఠాల్నిసైతం తెలుగుదేశం కూటమి తన ఖాతాలో వేసుకుంది.  రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆయా స్ధానాల్లో ఉన్న మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు తప్పుకోవడమో, అవిశ్వాసంలో పదవులు కోల్పోవడమూ జరుగుతోంది. ఈ సీట్లను  ఎన్నికల ద్వారా కూటమి సర్కార్ తమ ఖాతాలో జమ చేసుకుంది. సీఎం చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో జరిగిన మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికలో పలువురు వైసీపీ సభ్యులు టీడీపీ వైపు దూకేశారు. దీంతో ఐదో వార్డ్ కౌన్సిలర్ సెల్వరాజ్ కూటమి తరఫున మున్సిపల్ ఛైర్మన్ గా ఎన్నికయ్యారు. వైసీపీ నుండి నలుగురు కౌన్సిలర్లు టీడీపీ వైపుకు వెళ్ళిపోయారు.  దీంతో 24 మంది సభ్యులలో 14మంది మద్దతుతో పాటు ఎక్స్ ఆఫిషియో మెంబర్ మద్దతు కూడా లభించడంతో టీడీపీ సునాయాసంగా ఛైర్మన్ పీఠం దక్కించుకుంది లాగే గుంటూరు నగర పాలక సంస్థ మేయర్ పీఠం సైతం కూటమి కైవసం చుసుకుంది. మేయర్ ఎన్నికల్లో కూటమికి 34 ఓట్లు, వైసీకి 27 ఓట్లు వచ్చాయి. దీంతో టీడీపీ కౌన్సిలర్ కోవెలమూడి రవీంద్ర మేయర్ గా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. ఈ పరిణామంతో టీడీపీ సంబరాల్లో మునిగిపోయింది. గతంలో మేయర్ గా ఉన్న కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేయడంతో ఇక్కడ మేయర్ ఎన్నిక జరిగింది. మరోవైపు పల్నాడు జిల్లా మాచర్ల మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికల్లోనూ కూటమి ఘన విజయం సాధించింది. మాచర్ల మున్సిపాలిటీలో 31 వార్డులు ఉండగా.. ఇందులో 21 మంది కౌన్సిలర్ల మద్దతుతో టీడీపీ చైర్మన్ పీఠం దక్కించుకుంది. టిడిపి బలపరిచిన అభ్యర్థి 27 వార్డు కౌన్సిలర్ షేక్ మదార్ సాహెబ్ ఛైర్మన్ పీఠం అధిష్టించబోతున్నారు. గతంలో మాచర్లలో ఏకపక్షంగా ఛైర్మన్ పీఠం దక్కించుకున్న వైసీపీకి ఇది గట్టి ఎదురుదెబ్బగా భావించాల్సి ఉంటుంది.   ఇక విజయవాడ మేయర్ పీఠంపై కూడా కూటమి కన్నేసిందని తెలుస్తోంది. విజయవాడలో టీడీపీ కూటమి అభ్యర్థి విజయానికి ఏ వ్యూహారు రచించనుననారన్నది సర్వత్రా ఆసక్తి కలిగిస్తున్న అంశంగా మారిపోయింది.