ఏపీలో పర్యవేక్షణకు సమన్వయ బృందాలు!

లాక్ డౌన్ పటిష్ట అమలు, నిత్యావసర వస్తువులు సరఫరా,సేవలు పర్యవేక్షణకు రాష్ట్ర స్థాయిలో సమన్వయ బృందాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో లాక్ డౌన్ ను పటిష్టంగా అమలు చేసే ప్రక్రియలో భాగంగా ప్రజలకు వివిధ నిత్యావసర సేవలు అందేలా చూడడం ఇందుకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే రాష్ట్ర స్థాయిలోని 1902 కంట్రోల్ రూమ్ ద్వారా స్వీకరించి వాటిని సత్వరం పరిష్కరించేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిల్లో సమన్వయ బృందాలను ఏర్పాటు చేస్తూ జిఓఆర్టి సంఖ్య 223 ద్వారా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈసమన్వయ బృందాలు లాక్ డౌన్ సక్రమంగా అమలు అయ్యే లి చూడడంతో పాటు ఆ సమయంలో ప్రజలకు వివిధ నిత్యావసర సేవలు సక్రమంగా అందేలా చూస్తుంది.అంతేగాక వివిధ నిత్యావసర వస్తువులు డిమాండ్ ను ముందుగానే అంచనా వేసి ఆయా నిత్యావసర వస్తువులు కూరగాయలు ఆయా ప్రాంతాలకు సరఫరా జరిగేలా ఈసమన్వయ బృందాలు చూస్తాయి.నిత్యావసర వస్తువులు సేవలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఫిర్యాదులు ఉంటే 1902 కంట్రోల్ రూమ్ ద్వారా స్వీకరించి వాటిని రాష్ట్ర,జిల్లా స్పందన కంట్రోల్ రూమ్లు ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సిఎస్ నీలం సాహ్ని ఆ ఆదేశాలలో పేర్కొన్నారు. పౌరసరఫరాలు, పోలీస్, డైరీ డెవలప్మెంట్, పశుసంవర్థక,మత్స్య, మున్సిపల్, పంచాయతీరాజ్, కార్మిక తదితర శాఖల అధికారులు రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ కు రోజువారీ నివేదికను (Daily Situation Report)సమర్పించాలని సిఎస్ స్పష్టం చేశారు. సంబంధిత సమన్వయ బృందం ఓవరాల్ ఇన్చార్జి రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ సమన్వయంతో వివిధ నిత్యావసర సేవలు ప్రజలకు సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు.అదే విధంగా జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్లు కూడా రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్ తో సమన్వయంతో పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. అదేవిధంగా వివిధ నిత్యావసర వస్తువులు తయారీ,రవాణా, సేవలుకు సంబంధించి ఏమైనా ఇబ్బందులు ఉంటే అలాంటి సమస్యలు, ఫిర్యాదులను ఈసమన్వయ బృందాలు తెల్సుకుని రాష్ట్ర, జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ లో ద్వారా సకాలంలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర సమన్వయ బృందాలు: కేంద్ర ప్రభుత్వం,ఇతర రాష్ట్రాలతో  ఓవరాల్ సమన్వయ ఇన్చార్జి  టిఆర్ఆండ్బి ముఖ్య కార్యదర్శి కృష్ణ బాబు ఆయనతోపాటు మార్కెటింగ్ శాఖ ప్రత్యేక కార్యదర్శి వై.మధుసూదనరెడ్డి, మార్కెటింగ్ శాఖ కమీషనర్ ప్రద్యుమ్న,ఎ.శ్రీకాంత్, ఎన్ఫోర్స్మెంట్ ఐజి వినీత్ బ్రిజ్ లాల్,ఐజి లీగల్ హరికుమార్ ఉన్నారు. అలాగే మాన్యుఫాక్చరింగ్ మరియు నిత్యావసర వస్తువులు సమన్వయ బృందం ఇన్చార్జి గా పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ ఆయనతోపాటు పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం,కార్మిక శాఖ ప్రత్యేక కమీషనర్ రేఖా రాణి,ఎంపి ఫైబర్ సిఇఓ సుమీత్ ఉన్నారు. నిత్యావసర వస్తువులు సరఫరా రాష్ట్ర, జిల్లా సమన్వయ ఇన్చార్జి గా  పౌరసరఫరాల శాఖ కమీషనర్ కె.శశిధర్ ఆయనతోపాటు ప్రద్యుమ్న,ఉద్యానవన శాఖ కమీషనర్ చిరంజీవి చౌదరి, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమీషనర్ హెచ్ అరుణ్ కుమార్, మార్క్ ఫెడ్ ఎండి శ్రీ కేష్ లక్తర్,ఆయిల్ ఫెడ్ ఎండి శ్రీకాంత్ రెడ్డి ఉన్నారు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు రవాణా పర్యవేక్షణ కు ఇన్చార్జి గా రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ విసి మరియు ఎండి  వై.భాను ప్రకాశ్ ఆయనతోపాటు రవాణా శాఖ కమీషనర్ పి.సీతారామాంజనేయులు,సిఐడి డిజి డా.సిఎం త్రివిక్రమ్ వర్మ, సర్వే శాఖ డైరెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. స్థానిక సంస్థల్లో నిత్యావసర వస్తువులు,తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్యం నిర్వహణ ఇన్చార్జిగా పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది ఆయనతో పాటు మున్సిపల్ పరిపాలన శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఆశాఖ కమీషనర్ జిఎస్ఆర్కె విజయకుమార్, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్‌.శ్రీకాంత్,ఎసిబి డిఐజి యం.రవిప్రకాశ్, గిరిజన సంక్షేమ శాఖ సంచాలకులు రంజిత్ భాషా ఉన్నారు. అలాగే స్వచ్చంద సంస్థలు,వాలంటరీ గ్రూపులు,సిఎస్ఆర్ నిధులు సమీకరణ తదితర అంశాలకు ఇన్చార్జి గా సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకులు కె.హర్షవర్ధన్,బిసి సంక్షేమ శాఖ సంచాలకులు బి.రామారావు,గ్రేహాండ్స్ ఎస్పి రాహుల్ దేవ్ శర్మ ఉన్నారు. మీడియా మేనేజిమెంట్ ఇన్చార్జి గా సమాచార శాఖ కమీషనర్ టి.విజయకుమార్ రెడ్డి,ఎపిటిఎస్ ఎండి నందకిశోర్,డిఐజి ఎస్పి రాజశేఖర్ బాబు ఉన్నారు.

కూరగాయల ధరలు అడిగి తెలుసుకున్న మంత్రి!

వరంగల్ రూరల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి మండల కేంద్రంలో కూరగాయల మార్కెట్ ని తెలంగాణా రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ నీటి సరఫరా శాఖ మంత్రి గౌరవ ఎర్రబెల్లి దయాకర్ రావు ఆకస్మిక తనిఖీ చేశారు. ప్రజలతో మాట్లాడి, ధరలు అందుబాటులో ఉన్నాయా అని ఆరా తీశారు.  అధిక ధరలకు కూరగాయలు అమ్మినా, బ్లాక్ మార్కెట్ కి తరలించినా, కృత్రిమ కొరత సృష్టించినా, కఠిన శిక్ష లు ఉంటాయని మంత్రి హెచ్చరించారు. ప్రజలు స్వీయ నియంత్రణ తో, లాక్ డౌన్ పాటించాలా గుంపులుగా ఉండవద్దని, ముఖాలకు మాస్క్ లు ధరించాలని, సామాజిక దూరం పాటించాలని ప్రజలకు విజ్ఞ‌ప్తి చేశారు.  

సీడ్స్ రవాణాకు ఆటంకాలు లేకుండా చూడండి!

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు విత్తనాలు ( సీడ్స్ ) సరఫరాకు రవాణా పరంగా ఎదురవుతున్న ఆటంకాలు లేకుండా చూడాలని సీడ్స్ ఉత్పత్తిదారులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ ను కోరారు. మంగళవారం బంజారాహిల్స్ లోని మినిస్టర్స్ క్వార్టర్స్ నివాసంలో వినోద్ కుమార్ కు వారు తమ సమస్యలు వివరించారు. లాక్ డౌన్ వల్ల తమకు రాష్ట్రంలో గానీ, ఇతర రాష్ట్రాల్లో కానీ రవాణా పరంగా సమస్యలు ఎదురవుతున్నాయని వారు వినోద్ కుమార్ దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ వ్యాప్తంగా 400 సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్లు ఉన్నాయని, సుమారు మూడు లక్షల మంది రైతులు విత్తన ఉత్పత్తిదారులుగా ఉన్నారని వారు వినోద్ కుమార్ కు తెలిపారు. ప్రధానంగా వరి, మొక్కజొన్న, పత్తి విత్తనాలు ప్రాసెస్ చేసి దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు సరఫరా చేస్తున్నామని వారు పేర్కొన్నారు. వివిధ రకాల పంటలు చేతికి అందుతున్న నేపథ్యంలో రైతుల నుంచి విత్తనాలు ప్రాసెసింగ్ చేసేందుకు యూనిట్లకు చేరాల్సి ఉండగా లాక్ డౌన్ వల్ల జిల్లాల్లో క్షేత్ర స్థాయి పోలీసులు సీడ్స్ రవాణాను అడ్డుకుంటున్నారని వారు వినోద్ కుమార్ కు విన్నవించారు. లాక్ డౌన్ నుంచి నిత్యావసరాల సరుకుల కింద విత్తనాల రవాణాకు సీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చినా జిల్లాల్లో క్షేత్ర స్థాయి పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. క్షేత్ర స్థాయి పోలీసుల ఇబ్బందుల వల్ల  సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్లకు కూలీలు కూడా రాలేని దుస్థితి ఏర్పడిందని వారన్నారు. దేశవ్యాప్తంగా అవసరమైన 80 శాతం సీడ్స్ తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని,  అలాంటప్పుడు రాష్ట్రంలోనే ఇబ్బందులు వస్తే ఎలా అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యలపై తక్షణమే స్పందించిన వినోద్ కుమార్ డీజీపీ మహేందర్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.  విత్తన ఉత్పత్తిదారుల సమస్యలను పరిష్కరించాలని సూచించారు. లాక్ డౌన్ నుంచి సీడ్స్ సరఫరాను సీఎం కేసీఆర్ మినహాయింపు ఇచ్చారని వినోద్ కుమార్ డీజీపీ కి గుర్తు చేశారు. వెంటనే రంగంలో దిగిన డీజీపీ మహేందర్ రెడ్డి డీఐజీ సుమతిని నోడల్ అధికారిగా నియమించి విత్తన ఉత్పత్తిదారులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూడాలని ఆదేశించారు. విత్తన ఉత్పత్తిదారులతో సంప్రదింపులు జరిపిన సుమతి... వారి వివరాలు అడిగి తెలుసుకున్నారు. విత్తన ఉత్పత్తిదారులు, పోలీసులు, ట్రాన్స్ పోర్ట్ సిబ్బందితో కలిపి వాట్సాప్ గ్రూప్ ను తయారు చేశారు. ఎవరికి ఎక్కడ సమస్యలు ఎదురైనా వెంటనే వాట్సాప్ గ్రూప్ ద్వారా సమాచారాన్ని అందజేయాలని డీఐజీ సుమతి కోరారు.

ఏపీ ఉద్యోగులకు ఊరట.. రెండు విడతల్లో మార్చినెల జీతం

ఏపీలో కరోనా లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడింది. దీంతో మార్చినెల జీతాలు, పింఛన్లు కూడా ఇవ్వలేని పరిస్ధితి ఉంది. దీంతో ఏప్రిల్ ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, వేతనాలను రెండు విడతల్లో చెల్లిస్తామని సీఎం జగన్ ఉద్యోగ సంఘాలకు తెలిపారు. ఈ మేరకు తనను కలిసిన ప్రభుత్వం ఉద్యోగులసంఘం నేత సూర్యనారాయణకు సీఎం జగన్ ఈ విషయం చెప్పారు. మార్చి నెలకు గానూ చెల్లించాల్సిన వేతనాలను రెండు విడతల్లో చెల్లించాలని సీఎం జగన్ నిర్ణయించారు.  ఏపీలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అన్ని ప్రభుత్వశాఖల నుంచి వచ్చే ఆదాయనికి తీవ్రంగా గండిపడింది. నెలనెలా రావాల్సిన పన్నులతో పాటు మైనింగ్, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్ ఆదాయాలు కూడా నిలిచిపోయాయి. దీంతో వేల కోట్ల రూపాయల రాబడి పోయినట్లయింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల నుంచి తాజా వివరాలు తీసుకున్న ప్రభుత్వం రోజుకు రెండు కోట్ల రూపాయల ఆదాయం కూడా రావడం లేదని తేల్చింది. ఇలాంటి పరిస్ధితుల్లో ఉద్యోగుల వేతనాలు, జీతాలు,  పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది.  తెలంగాణ ప్రభుత్వం తరహాలో కోతలు పెట్టకుండా రెండు విడతల్లో జీతాలు, వేతనాలు, పింఛన్లు ఇవ్వాలన్న నిర్ణయం తీసుకోవడం మంచి పరిణామమని ఉద్యోగులు పేర్కొంటున్నారు. ఇప్పటికే కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు ఉద్యోగసంఘాల తరఫున 100 కోట్ల నిధులను ప్రభుత్వానికి ఇచ్చిన ఉద్యోగులు.. రెండు విడతల జీతానికి కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది.

స్టేడియంలో కూరగాయల మార్కెట్!

ఎల్బీనగర్ కూరగాయల మార్కెట్ ను తాత్కాలికంగా సరూర్ స్టేడియంలోకి తరలించడానికి జ‌రుగుతున్న ఏర్పాట్లను తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ప్రజలకు ఏ ఇబ్బంది రానివ్వకుండా  రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ మార్కెట్ల, పలు ఖాళీ ప్రదేశాలకు త‌ర‌లిస్తున్న‌ట్లు మంత్రి తెలిపారు. కరోనా వైరస్ ప్రబలకుండా ప్రజలు గుమిగూడే అవకాశం లేకుండా, కొనుగోళ్లకు వచ్చిన ప్రజలు ఖచ్చితంగా సామాజిక దూరం పాటించేలా ఈ  ఏర్పాట్లు చేస్తున్నారు. మొబైల్ రైతుబజార్ల ద్వారా వీలయినన్ని ఎక్కువ ప్రాంతాలకు తక్కువ ధరకు తాజా కూరగాయల్ని పంపిస్తున్నారు.    ప్రజలందరూ ప్రభుత్వ సూచనలు పాటించి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాల‌ని మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు.  కరోనాను ఎదుర్కొనే విషయంలో దూరదృష్టితో నిర్ణయాలు తీసుకుంటున్నామ‌ని, ఈ పరిస్థితుల నుండి బయటపడేందుక ప్రజల సహకారం సంపూర్ణంగా ఉండాలని ఆయ‌న అన్నారు.

ఏపీలో మరో 17 కరోనా కేసులు.. ఢిల్లీ వెళ్లిన వారు మొత్తం 711

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటీవ్ కేసులు భారీగా పెరిగాయి. ఒక్కరోజే 17 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారు, వారి బంధువులలో కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు అధికారులు గుర్తించారు. గత రాత్రి వరకు 164 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా 147 మందికి నెగిటివ్ రాగా 17 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో ఏపీలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 40 కి చేరింది. ఢిల్లీ మత ప్రార్థనల్లో పాల్గొన్న వారిలో అత్యధిక మందికి కరోనా సోకిందని తేలడంతో.. వారితో సన్నిహితంగా మెలిగినవారు, వారితో కలిసి ప్రయాణించిన వారిలో ఆందోళన నెలకొంది. దీంతో ఢిల్లీ వెళ్లి వచ్చిన వారిపై ఏపీ సర్కార్ పై దృష్టి పెట్టింది. రాష్ట్రం నుంచి ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చినవారి లెక్క తేల్చింది. ప్రార్థనలకు వెళ్లినవారు మొత్తం 711 మందిగా పోలీసులు గుర్తించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారందరూ తమ దగ్గరలోని ప్రభుత్వాసుపత్రులకు వెళ్లి చెక్ చేయించుకోవాలని.. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

బయట తిరిగితే అరెస్ట్ చేస్తాం

గుంటూరు లో 103 కేసులు చెక్ చేశాం...అందులో 5గురికి పాజిటివ్ కేసులు వచ్చాయని గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ అన్నారు. గుంటూరు లో 2,మాచర్ల లో 2 కేసులు..కారంపూడి లో ఒక కేసు బయటపడింది..మొత్తం ఇప్పటికే 9 కేసులు వచ్చాయని తెలిపారు. 180 మంది లో 140 మంది ని గుర్తించాం.. 40 మంది కోసం వెతుకుతున్నాం అన్నారు.  ఢిల్లీ లో మీటింగ్ కి వెళ్లిన వారు... వారి భార్య లకు పాజిటివ్ కేసులు వచ్చాయనీ గుంటూరు జిల్లా కలెక్టర్ చెప్పారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన వారు స్వచ్చందంగా టెస్ట్ చేయించుకోవాలి..అలా కాకుండా మాకు పట్టుబడితే కఠినంగా చర్యలు ఉంటాయి. నోటీసులు అందుకొని బయట తిరిగితే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ కింద అరెస్ట్ చేస్తాo. కారంపూడి, మాచర్ల, గుంటూరు లో కర్ఫ్యూ విధించాము. పాజిటివ్ కేసులు ఉన్న ప్రాంతాల్లో ఇంటికే వెళ్లి కూరగాయలు, నిత్యావసర వస్తువుల ఇస్తామన్నారు కలెక్టర్.

జ‌మాత్ స‌మావేశాలు ఎంత మంది జీవితాల్ని...

త‌బ్లీక్ జ‌మాత్‌కు చెందిన మూడు రోజుల ఇస్త‌మా ఈ నెల 13-15 ఢిల్లీలోని నిజాముద్దీన్ మ‌ర్క‌జ్‌లో జ‌రిగింది. ఈ స‌మావేశంలో 75 దేశాల నుంచి ఎనిమిదివేల మంది వరకూ హాజరైనట్లుగా గుర్తించారు. ఇండోనేషియా.. మలేషియా.. సౌదీ.. కజకిస్థాన్ ఇలా చాలా దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారు. ఇలా హాజరైన విదేశీయుల సంఖ్య ఏకంగా రెండు వేలు. మూడు రోజుల స‌మావేశాలు ముగిసిన‌ప్ప‌ట్టికీ ఇంకా మ‌ర్క‌జ్ భ‌వ‌నంలోని ఆరు అంతస్తుల డార్మటరీల్లో 280 మంది విదేశీయులు ఉన్నట్లుగా తేలింది. అక్కడున్న మొత్తం 300 మందికి కొవిడ్ 19 లక్షణాలు ఉన్నట్లుగా గుర్తించారు. వీరిలో 175 మందికి పరీక్షలు నిర్వహించగా పలువురికి కరోనా లక్షణాలు ఉన్నట్లుగా తేలింది. అనారోగ్యంగా ఉన్న 75 మందిని ఆదివారమే ఢిల్లీలో గుర్తించారు. లాక్ డౌన్ నిబంధనల్ని ఉల్లంఘించి ఒకేచోట వేల మంది ఎలా ఉన్నారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. మరింత షాకింగ్ అంశం ఏమంటే.. మూడు రోజుల ఇస్త‌మా జరిగిన స్థలం నిజాముద్దీన్ పోలీస్ స్టేషన్ ను అనుకునే ఉండటం. చేతులు కాలాక ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఇప్ప‌డు ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మౌలానాపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదేశించారు. లాక్‌డౌన్ కార‌ణంగా స్వస్థలాలకు వెళ్లేందుకు వాహనాలు లేక ఇక్కడే ఉన్నారని మ‌ర్క‌జ్ భవనం ప్రతినిధి చెబుతున్నారు.

కరోనా ట్రైన్ ఎంత మంది ప్రాణాల్ని బ‌లితీసుకోనుందో!

ఈ నెలలో ఆంధ్ర‌, తెలంగాణాకు చెందిన‌ సుమారు 1500 మంది ఢిల్లీలో మూడు రోజుల ఇస్త‌మా ముగిసిన త‌రువాత  సామూహికంగా ట్రైన్‌ల‌లో తిరిగివ‌చ్చారు. వీరిలో 300 మంది హైదరాబాదులో కొంతమంది విజయవాడ గుంటూరు లో మరియు చీరాల లో  80 మంది ఒంగోలులో 200 మంది దిగినట్టు సమాచారం. ఇంకా రాష్ట్రంలో ఎక్కడ ఎక్కడ ఎంత మంది దిగారో తెలియదు.  ఇప్పటి వరకు విదేశాలనుంచి వచ్చినవారి అడ్రసు లు ఎయిర్ పోర్ట్ ద్వారా సేకరిస్తే ఇప్పుడు ట్రైన్ లో ప్రయాణించిన వారి వివరాలు సేకరించటం పెద్ద‌ విషయం కాదు. మ‌ల్ల‌ప‌ల్లి లో త‌బ్లీక్ జ‌మాత్ హెడ్‌క్వార్ట‌ర్ మ‌సీద్ వుంది.  మెయిన్‌రోడ్డు మీద చౌరాస్తాలోనే వుంది. అక్క‌డ వీరంద‌రి స‌మాచారం వుంటుంది. జ‌మాత్ వాళ్ళు ఓ ప‌ద్ద‌తి ప్ర‌కారం ప‌ని చేస్తారు. కాబ‌ట్టి ఢిల్లీ వెళ్లిన ప్ర‌తి ఒక్క‌రి పేరు, ఫోన్‌నెంబ‌ర్‌, అడ్ర‌స్‌తో స‌హా స‌మాచారం వీరి వ‌ద్ద వుంటుంది. పోలీసులు వెళ్లి ఈజీగా ఈ స‌మాచారం తీసుకోవ‌చ్చు.  వీరి అడ్రసు ల కోసం అధికారులు జల్లెడ పడుతున్నారు.వీరి గుర్తింపు లో జాప్యం జరిగితే భారీ మూల్యం చెల్లించక తప్పదు. వీరిలో చీరాల నవాబ్ పేట మరియు పేరాల  మసీదు సెంటర్ దగ్గర వాళ్ళు అక్కడ కు వెళ్ళి వచ్చిన వారే. విదేశాల నుండి వచ్చి క్వారంటైన్ లో ఉన్నవారికి రిపోర్టు లు నెగిటివ్ రాగా డిల్లీ నుంచి వచ్చిన వారివి మాత్రం పాజిటివ్ వస్తున్నాయి. హైదరాబాద్ విజయవాడ గుంటూరు మాచర్ల చీరాల కేసులు అవే. దీనికి వారు స్వచ్ఛందంగా ముందుకు రావాలి.

తెలంగాణాలో కరోనా కాటుకు ఆరుగురు బ‌లి!

తెలంగాణలో కరోనా మరణాలు ఒక్కసారిగా ఆరుకు పెరిగాయి. ఈ ఆరుగురూ  త‌బ్లీక్ జ‌మాత్ హెడ్ క్వార్ట‌ర్ ఢిల్లీ మ‌ర్క‌జ్‌లో ఇస్త‌మా  కోసం వెళ్లిన వారే కావడం ఆందోళన కలిగిస్తోంది.  త‌బ్లీక్ జ‌మాత్ ఆధ్వ‌ర్యంలో ఈ నెల 13 నుంచి 15 వరకు మూడు రోజుల ఇస్త‌మా ఢిల్లీలోని నిజాముద్దీన్ మ‌ర్కజ్ భ‌వ‌నంలో జ‌రిగింది. ఈ ఇస్త‌మాలో పాల్గొని వ‌చ్చిన వారిలో ఆరుగురు క‌రోనా పాజిటివ్‌తో మృతి చెందిన‌ట్లు తెలంగాణా రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది.  క‌రోనా పాజిటివ్ వ‌చ్చి తెలంగాణాలో మృతి చెందిన వారంతా త‌బ్లీక్ జ‌మాత్ ఇస్త‌మాకు వెళ్లి వ‌చ్చిన‌వారే. ఇద్దరు గాంధి ఆసుపత్రిలో, ఒకరు అపోలో ఆసుపత్రిలో, ఒకరు గ్లోబల్ ఆసుపత్రిలో, ఒకరు నిజామాబాద్ లో, ఒకరు గద్వాలలో మరణించినట్లు వైద్యారోగ్య శాఖ పేర్కొంది.  మృతుల్లో హైద‌రాబాద్ పాత బస్తీకి చెందిన జర్నలిస్ట్, ఓ మహిళ కూడా ఉన్నట్లు గుర్తించారు.  తెలంగాణ నుంచి మొత్తం 280 మంది ఈ మూడు రోజుల ఇస్త‌మా కోసం ఢిల్లీ వెళ్లినట్లు గుర్తించారని తెలుస్తోంది. అత్యధికంగా హైదరాబాద్ నుంచి 186 మంది వెళ్లగా.. నిర్మల్ 11, ఆదిలాబాద్ 10, నిజామాబాద్ 18, మెదక్ 26, రంగారెడ్డి 15, ఖమ్మం 15, వరంగల్ 25, నల్గొండ 21, కరీంనగర్ 17, భైంసా 11 మంది చొప్పున వెళ్లారని సమాచారం.  వీరి ద్వారా వైరస్ సోకే అవకాశం ఉందని భావిస్తున్న అనుమానితులను ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు గుర్తించి, ఆసుపత్రులకు తరలిస్తున్నాయి. వారికి పరీక్షలు నిర్వహించి, వైద్యం అందిస్తున్నారు.  మర్కజ్ ఇస్త‌మాలో పాల్గొన్న వారికి కరోనా వైరస్ సోకినట్లు తెలుస్తున్నందు వల్ల..ఈ మూడు రోజుల ఇస్త‌మా పాల్గొన్న ప్రతీ ఒక్కరు విధిగా తమ సమాచారాన్ని అధికారులకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ కోరింది. ఇస్త‌మాలో  పాల్గొన్న వారికి ప్రభుత్వమే పరీక్షలు నిర్వహించి, ఉచితంగా చికిత్స కూడా అందిస్తుంది. కాబట్టి త‌బ్లీక్ జ‌మాత్ మర్కజ్ కు వెళ్ళి వచ్చిన వారంతా తప్పక అధికారులకు సమాచారం అందించాలి. వారి గురించి ఎవరికి సమాచారం తెలిసినా వెంటనే ప్రభుత్వానికి తెలియ చేయాలని వైద్య ఆరోగ్య శాఖ విజ్ఞప్తి చేసింది.  మార్చి 13-15 తేదీల మధ్య ఢిల్లీలో నిర్వహించిన ఈ ఇస్త‌మాలో 2000 మంది పాల్గొనగా.. విదేశాలకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో పాల్గొన్నారు. థాయ్‌లాండ్, ఇండోనేసియా, మలేసియా, కిరిగిస్థాన్ తదితర ఆసియా దేశాలకు చెందిన వారు ఈ ఇస్త‌మాలో పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో ఈ మూడు రోజుల ఇస్త‌మాలో పాల్గొన్నారు.

తెలంగాణలో కరోనా మరొకరి ప్రాణాలను బలి తీసుకుంది!

కొత్త‌గా  ఆరు పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. తెలంగాణలో క‌రోనా మ‌ర‌ణాల సంఖ్య 2 చేరింది. సోమ‌వారంనాడు కొత్త‌గా ఆరుగురికి పాజిటివ్ రావ‌డంతో మొత్తం కేసుల సంఖ్య 77కు పెరిగింది. . అయితే క‌రోనాబారిన ప‌డి చికిత్స‌పొంది పూర్తిగా కోలుకున్న 13 మందిని డిశ్చార్జ్ చేశారు. నెగిటివ్ రిపోర్ట్ రావ‌డంతో చెస్ట్ హాస్పిటల్ లో చికిత్స పొందిన వీరిని వారి వారి ఇళ్ల‌కు పంపిన‌ట్లు సోమ‌వారం రాత్రి విడుద‌ల చేసిన హెల్త్ బులెటిన్ లో ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. 2 మరణాలు, 14 మంది కోలుకున్న వారిని మినహాయిస్తే.. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న కరోనా కేసుల సంఖ్య 61. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఆరు కొత్త కేసులు నమోదయ్యాయి. ఇందులో కరీంనగర్‌కు చెందిన రెండు కేసులు కూడా ఉన్నాయి. 

కేసీఆర్ సంచలన నిర్ణయం!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కరోనా దెబ్బకు రాష్ట్ర ఆదాయం దారుణంగా పడిపోవటంతో వేతనాల్లో భారీ కోత పెట్టారు. ఆదివారం నాటి విలేకరుల సమావేశంలోనే కేసీఆర్ ఈ మేరకు స్పష్టమైన సంకేతాలు ఇఛ్చారు. అసలు  ఉద్యోగులకు వేతనాలు కూడా ఇఛ్చే పరిస్థితి లేదని..ఇది ఆపద సమయం అని అందరూ సర్దుకోవాలని వ్యాఖ్యానించారు.. అన్నట్లుగే మరుసటి రోజు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రజా ప్రతినిధుల దగ్గర నుంచి ఉద్యోగుల వరకూ అందరి వేతనాల్లోనూ భారీ కోత పెట్టారు. ఈ మేరకు సోమవారం నాడు జరిగిన సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ‘తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రమైన ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో, అత్యంత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రగతి భవన్ లో సోమవారం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఇందులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సమీక్షించిన పిదప వివిధ రకాల వేతనాల చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నాం’అని ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ముఖ్యమంత్రి, రాష్ర్ట మంత్రివర్గం, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర కార్పొరేషన్ చైర్ పర్సన్లు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం కోత విధిస్తారు. ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్ఎస్ లాంటి అఖిల భారత సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధిస్తారు. మిగతా అన్ని కేటగిరీల ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం కోత విధిస్తారు. నాల్గవ తరగతి, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల వేతనాల్లో 10 శాతం కోత విధిస్తారు. అన్ని రకాల రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లలో 50 శాతం కోత విధిస్తారు. నాల్గవ తరగతి రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ లో 10 శాతం కోత విధిస్తారు. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ గ్రాంటు పొందుతున్న సంస్థల ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మాదిరిగానే వేతనాల్లో కోత విధిస్తారు.

ఇక సీసీఎంబీలో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు!

హైదరాబాద్ నగరంలోని కేంద్ర ప్రభుత్వ సంస్థ సీసీఎంబీలో మంగళవారం నుంచే క‌రోనాపరీక్షలు నిర్వహించ‌నున్నారు. కేంద్ర మెడికల్ రీసెర్చ్ నుంచి సోమవారం సీసీఎంబీకి ఆదేశాలు జారీ కావ‌డంతో మంగళవారం నుంచి కరోనా టెస్టులు చేయడానికి సీసీఎంబీ సిద్ధమవుతోంది. గాంధీ ఆసుపత్రి నుంచి సీసీఎంబీకి శాంపిల్స్ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రతి రోజూ 800 నుంచి 1000 కరోనా టెస్టులు నిర్వహించే సామర్థ్యంతో సీసీఎంబీ వుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపు మేరకు సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ(సీసీఎంబీ) శాస్త్రవేత్తలు కరోనా పరీక్షల కిట్లను అభివృద్ధి చేస్తున్నారని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ ఇటీవ‌ల వెల్లడించింది. కచ్చితమైన ఫలితాలు ఇచ్చే ఈ కిట్లను చౌక ధరకు త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపింది. సీసీఎంబీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. కిట్‌ ధర వెయ్యి రూపాయ‌ల‌లోపే ఉండేలా కిట్లు రూపొందించ‌డానికి పరిశీలిస్తున్నట్లు సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌ కుమార్‌ మిశ్రా అన్నారు.

మ‌ద్యం దుకాణాలు తెర‌వం! వ్య‌స‌న‌ప‌రుల‌కు PHC సెంటర్లలో చికిత్స!

ఎవరైనా మద్యానికి వ్యసనమైన వ్యక్తులు మరీ ఎక్కువగా ఆందోళనకు గురైతే రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖ సిబ్బంది ఎక్సైజ్ CI లు మరియు SI లు ఇలాంటి వ్యక్తులను గుర్తించి వారికి మానసిక వేదనకు గురికాకుండా సరైన అవగాహన కల్పించి అవసరమైతే వారికి దగ్గర్లో ఉన్న  PHC సెంటర్లకు చికిత్స నిమిత్తం తీసుకెళ్లి వారికి చికిత్స జరిగేలా చర్యలు తీసుకోవాలని మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ గారు ఎక్సైజ్ అధికారులకు ఆదేశించారు. మద్యం వ్యసనంగా వున్న వ్యక్తుల కుటుంబాలకు ఆ వ్యక్తులపై ఎక్కువ దృష్టి పెట్టి మనసు మరల్చడానికి యోగ వంటి ఆసనాలు, ద్యానం, వ్యాయామం, ఆద్యాత్మిక చింతన, కుటుంబ సభ్యులతో ఇతరత్రా ఆటలు చెస్, క్యారమ్స్ వంటి ఆటలను ఆడటం వలన మంచి మానసిక శక్తి నిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యులు ఎక్కువ సమయం వారితో గడపాలని సూచించారు.   ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేతపై కృతనిశ్చయంతో వున్నందున సంబందిత అధికారులు తగు చర్యలు తీసుకొని, మద్యం దుకాణాల బంద్ ను అమలుచేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు కరోన నిర్మూలించడానికి ఇచ్చిన ఆదేశాలను సమార్దవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. రాష్ట్ర అబ్కారి, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖామాత్యులు  వి. శ్రీనివాస్ గౌడ్, ఎక్సైజ్ కమిషనర్, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్లు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్లు సోమ‌వారం నాడు సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సమీక్ష సమావేశంలో కరోన కారణంగా లాక్ డౌన్ సమయంలో అన్ని మద్యం దుకాణాలు మూసివేయడంతో మద్యానికి వ్యసనంగా మారిన కొందరు వ్యక్తులు మానసికంగా ఆందోళనకు గురైతు వింతగా ప్రవర్తించడం వంటి విషయాలపై చర్చించారు.

ఏపీ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన 7,060 మందిపై కేసులు

ఆంధ్ర ప్రదేశ్ లో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన  7,060 మందిపై కేసులను నమోదు చేసినట్టు రాష్ట్ర డి జి పి గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. బెజవాడలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన డి జి పీ గౌతమ్ సవాంగ్ లాక్ డౌన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు. " ప్రజలకు చాలా వరకు అవగాహనవచ్చింది.ఇప్పటికే ప్రజలు నుంచి మంచి స్పందన వస్తోంది. ప్రజలు అనవసరంగా బయటకు రావద్దు.ప్రజలు ఇంట్లోనే ఉండాలని కోరుతున్నాం.విదేశాలు నుండి తిరిగి వచ్చే వారిపై నిఘా చేపట్టాం," అని డి జి పీ ఇచ్చారు.  ఇప్పటి వరకు 22 వేలమందిని గుర్తించామని చెప్పిన డి జి పీ, నిత్యావసరవస్తువులు రవాణా చేసే గూడ్స్ వాహనాలకు అనుమతి ఇచ్చినట్టు, పోలీసు ఫ్యామిలీ హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.  హోమ్ డెలివరీ సిస్టంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. పోలీసు డిపార్ట్మెంట్ లో 55 సం.లు పైబడినవారికి హై రిస్క్ డ్యూటీలు లేకుండా ఆఫీసులో ఉండేలా చూడాలని సూచించామన్నారు గౌతమ్ సవాంగ్.

మాజీ సర్పంచ్ దంపతుల ఔదార్యం!

కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో ఓ సర్పంచ్ ల జంట ముఖ్యమంత్రి కేసీఆర్ కు అండగా నిలబడాలని ప్రతిన బునింది.అందుకు అనుగుణంగా తమ గ్రామంలో వైరస్ ను కట్టడి చేసేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్న పారిశుధ్య కార్మికులకు ధాన్యాన్ని దానంగా ఇవ్వాలని సంకల్పించారు. సూర్యపేట జిల్లా హుజుర్నగర్ మండలంలోని బురుగడ్డ గ్రామానికి చెందిన అరుణ్ కుమార్ దేశముఖ్, రాధిక అరుణ్ కుమార్ దేశముఖ్ ల దంపతులు తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఊరు వాడ స్వాగతిస్తుంది. వరుసగా 10 సంవత్సరాలు ఒక ఐదు సంవత్సరాలు భర్త అరుణ్ కుమార్ దేశముఖ్ ఆ తరువాత ఐదు సంవత్సరాలు భార్య రాధిక అరుణ్ కుమార్ దేశముఖ్ లు సర్పంచ్ లు గా వ్యవరించిన ఆ గ్రామంలో పారిష్యుద్య కార్మికులు పడుతున్న శ్రమ ను గుర్తించి ఒక్కొక్కరికి బస్తా ధాన్యం దానం చెయ్యాలని నిర్ణయించారు.  అనుకుందే తడవుగా తమ కల్లాల వద్దనే ఆ ధాన్యాన్ని పారిష్యుద్య కార్మికులకు అందించే విదంగా వారిని అక్కడికే పిలిపించి ధాన్యాన్ని అంద జేశారు.అరుణ్ కుమార్ తీసుకున్న నిర్ణయాన్ని పలువురు స్వాగతించడం తో పాటు విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉండడం తో పాటు ప్రజలకు సేవలు అందించేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని పలువురు కోరుతున్నారు.

బాధ్యతగా చేయూతనిద్దాం! ఇంటి వద్దకే ఆహారం అందిద్దాం!

ప్రపంచ దేశాలు కరోనా మహమ్మారి తో విలవిలలాడుతున్న సందర్భంలో లాక్ డౌన్ సమర్థంగా అమలయ్యేలా చూసేందుకు సామాజిక బాధ్యతగా బీజేపీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు ఐదుగురు ఆహారం అందించే ప్రణాళికలో ముందుకు సాగాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. సోమవారం ఆయన రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జీ లతో టెలి కాన్ఫరెన్స్లో మాట్లాడారు. వివిధ దేశాల్లో వేగంగా విస్తరిస్తున్న  కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని, కట్టడి చేసేందుకు పేద, బడుగు, సామాన్య ప్రజలకు నిత్యావసర సరుకులు, ఆహార సమస్య తలెత్తకుండా చూసుకోవాల్సిన సామాజిక బాధ్యత బిజెపి కార్యకర్తలదేనని స్పష్టం చేశారు. అందుకు జిల్లాల వారీగా, నియోజకవర్గాల వారీగా, నగరాలు, పట్టణాల, మండలాల వారీగా ప్రణాళికాబద్ధంగా నిరుపేదలకు వలస కూలీలకు నిత్యావసర సరుకులు, ఆహార పదార్థాలను అందించే బాధ్యతను సమర్థంగా అమలు చేయాలని రాష్ట్రపదాధికారులకు, జిల్లా అధ్యక్షులకు, జిల్లా ఇన్చార్జిలకు బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.  బిజెపి జాతీయ అధినాయకత్వం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశానుసారం  కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, నిర్మూలించేందుకు ప్రతి బీజేపీ కార్యకర్త క్షేత్రస్థాయిలో ఫీడ్ ద నీడ్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్య నాయకులకు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ వ్యక్తిగతంగా ఫోన్లో సంభాషించి కార్యక్రమాల అమలు తీరుపై దిశానిర్దేశం చేశారు. క్షేత్ర స్థాయిలో జరుగుతున్న కార్యక్రమాల అమలు తీరుపై ఎప్పటికప్పుడు రాష్ట్ర కార్యాలయానికి నివేదికలు సమర్పించాలని పార్టీ నాయకులను ఆదేశించారు.

కోవిడ్ 19 అత్యవసర పాస్ మంజూరుకు ప్రభుత్వం సన్నాహాలు

* అత్యవసర సేవలలో ఉన్న ప్రైవేటు వ్యక్తుల కోసం ఏర్పాటు * మొబైల్ ఫోన్లో క్యూర్ కోడ్, చెక్ పోస్టుల వద్ద స్కానింగ్ : హిమాన్హు శుక్లా కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో లాక్ డౌన్ అమలవుతుండగా అత్యవసర సేవలలో నిమగ్నమై ఉన్న ప్రైవేటు వ్యక్తులతో సహా, వ్యవసాయ ఉత్పత్తుల సరఫరా కోసం ప్రభుత్వం కోవిడ్ 19 అత్యవసర పాస్ ను మంజూరు చేయాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ విషయానికి సంబంధించి స్పష్టమైన అదేశాలు చేయగా, అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు. ప్రధానంగా కోవిడ్ -19 అత్యవసర పాస్ ప్రైవేట్ రంగ కర్మాగారాలు, కార్యాలయాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగుల కోసం జారీ చేస్తారు.  వ్యవసాయ, సహకార (MKTG II) జారీ చేసిన జిఓ ఆర్ టి నెంబర్ 289 లో జాబితా చేర్చబడిన వస్తు సేవల ఉత్పత్తి,  సరఫరాలో నిమగ్నమై ఉన్న వారందరూ ఈ పాస్ పొందేందుకు అర్హులే.  పాస్ కోసం సంస్థ యజమాని తనతో సహా ఉద్యోగుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సంస్థ సిబ్బందిలో ఇరవై శాతం మాత్రమే పని చేయడానికి అర్హులు అయినందున కనిష్టంగా 5, గరిష్టంగా ఇ-పాస్ జారీ నిబంధనలు,  షరతులకు లోబడి మంజూరు చేస్తారు.  ఈ పాస్ ల కోసం కరోనా వ్యాధి నివారణ సేవలలో ఉన్న వారంతా దరఖాస్తు చేయనవసరం లేదు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు, నిర్ణీత సమయంలో (ఉదయం 6 నుండి 11 వరకు) అవసరమైన వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి వెళుతున్న సాధారణ ప్రజలు, తదనుగుణ వస్తు రవాణా వాహనాలు, వ్యవసాయ, ఉద్యాన, ఆక్వా ఉత్పత్తులను రవాణా చేసే రైతులకు ఈ పాస్ తో పని లేదు. మరోవైపు పాస్ పొందేందుకు సైతం ఎవ్వరూ కార్యాలయాలకు రానవసరం లేదని దీనిని పర్యవేక్షిస్తున్న ప్రత్యేక అధికారి , చేనేత, జౌళి శాఖ సంచాలకులు హిమాన్హు శుక్లా తెలిపారు. మొత్తం ప్రక్రియ ఆన్‌లైన్‌లో పూర్తి చేయవఛ్చని, https://gramawardsachivalayam.ap.gov.in/CVPASSAPP/CV/CVOrganizationRegistration పై క్లిక్ చేయడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. స్పందన పోర్టల్ వెబ్‌లింక్ (https://www.spandana.ap.gov.in/) ద్వారా  కూడా పాస్ పొందగలుగుతారన్నారు. జిల్లా కంట్రోల్ సెంటర్ ఛైర్మన్,  సంయిక్త కలెక్టర్ దరఖాస్తును పరిశీలించి ఆమోదము, తిరస్కరించే అధికారం కలిగి ఉంటారన్నారు. నిబంధనలను అనుసరించి ఆమోదం పొందిన పాస్ ను ప్రత్యేక  QR కోడ్‌తో SMS ద్వారా ఉద్యోగి మొబైల్ నంబర్ కు పంపుతామని, వెబ్-లింక్ క్లిక్ చేసినప్పుడు QR కోడ్‌తో సహా పాస్ కనిపిస్తుందని వివరించారు.  చెక్ పోస్టుల వద్ద ఉన్న పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్ రీడర్ అందిస్తామని, తద్వారా పోలీసు అనుమతి లభిస్తుందని పేర్కొన్నారు. భధ్రతా ప్రమాణాల పరంగానూ ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామన్న హిమాన్హు శుక్లా ఈ పాస్ కు పాస్లో ఎన్క్రిప్టెడ్ క్యూఆర్ కోడ్ ఉందని,  చెక్ పోస్టులలోని పోలీసు సిబ్బందికి క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయటమే కాక,  అత్యవసర పాస్ యొక్క నిజాయితీని ధృవీకరించడానికి మొబైల్ అనువర్తనానికి అనుగుణమైన మెకానిజం ఉందని హిమాన్హు శుక్లా వివరించారు.  ఎలాంటి ఫోర్జరీ, దుర్వినియోగంకు అవకాశం లేదన్నారు. పాస్ కోసం దరఖాస్తు చేసిన వారు  తమ ఇబ్బందులను నమోదు చేసుకోవడానికి 1902కు పిర్యాధు చేస్తే అవి జాయింట్ కలెక్టర్‌కు దృష్టికి వెళతాయన్నారు.

వ‌ల‌స‌కూలీల‌పై  స్ప్రే చేసి శుద్ది చేశార‌ట‌!

నిరుపేద‌ల‌పై నిర్ద‌య‌గా వ్య‌వ‌హ‌రించారు. యూపీలో ఈ దారుణం జ‌రిగింది. ఇత‌ర రాష్ట్రాల్లో ఇరుక్కుని వున్న వ‌ల‌సకూలీల‌ను బ‌స్సులు పెట్టి పిలిపించుకున్నారు. అంత వ‌ర‌కు బాగానే వుంది. అయితే వ‌చ్చిన వారిని రోడ్డు మీదే కూర్చోబెట్టి మ‌నుషుల‌పైనే క‌రోనా ఇన్ఫెక్ష‌న్ రాకుండా చ‌ల్లే స్ప్రే చ‌ల్లారు. మీ కళ్ళను మూసుకోండి.. మీ పిల్లల కళ్ళను కూడా మూసేయండి అంటూ వారందరిపై ఈ రసాయనాన్ని చల్లారు. పిల్లలతో సహా ఆ బడుగు జీవులంతా కళ్ళు మండి విలవిలలాడిపోయిన దృశ్యాలు వైర‌ల్ అయి చూసే వారిని కంట‌త‌డిపెట్టిస్తున్నాయి. అధికారుల అతి చేష్ట‌ల‌కు అభాగ్యులు విల‌విల‌లాడారు. వీరంతా కూలీ నాలీ చేసుకునే కార్మికులు. వివిధ రాష్ట్రాల్లోని జిల్లాల్లో చిక్కుబడిపోయిన వీరు యూపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బస్సుల్లో బరేలీ జిల్లాకు చేరుకున్నారు. వీరిలోని ఓ బ్యాచ్ బస్సు దిగగానే బిలబిలమంటూ మున్సిపల్ సిబ్బంది, పోలీసులు మాస్కులతో సహా ప్రొటెక్టివ్ సూట్లు ధరించి అక్కడికి చేరుకున్నారు. వలస కార్మికులను ఒక చోట కూర్చోబెట్టి.. వారిపై ఈ స్ప్రేను చల్లారు. 'అప్ నే ఆంఖో బంద్ కర్ లో! బచ్చొంకీ ఆంఖ్ భీ బంద్ కర్ లే..  అంటూ వారందరిపై ఈ రసాయనాన్ని చల్లారు. ఈ అమానుషం పట్ల అధికారులను, పోలీసులు త‌మ‌ను తాము స‌మ‌ర్థించుకోవ‌డం విశేషం. క్లోరిన్, నీటితో నింపిన ద్రవాన్నే చల్లాలని ఆదేశించామని, అంతే తప్ప ఎలాంటి కెమికల్ నీ ఇందులో కలపలేదని యుపి అధికారులు సమర్థించుకున్నారు.  భారీ సంఖ్యలో వేర్వేరు చోట్ల నుంచి వఛ్చిన వీరిని కరోనా పాజిటివ్ సోకకుండా, వీరి వల్ల మరెవరికీ ఎలాంటి 'ప్రమాదం' లేకుండా చూసేందుకు 'శుద్ది' చేసామంటూ చెబుతున్నారు అధికారులు త‌మ‌ను ఆద‌ర్శంగా తీసుకోవాల‌ని సూచిస్తున్నార‌ట మ‌రి.... అది విష‌యం.