ఎన్నికల జాప్యం.. పంచాయతీలకు శాపం !

ఆలస్యం అమృతం విషం ఈ నానుడి అతికినట్లు సరిపోయే సందర్భం ఏదైనా ఉందంటే  అది ఇదే.  తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు ఆలస్యం అయ్యే కొద్దీ..   కేంద్రం నుంచి పంచాయతీలకు రావసిన  కేంద్ర నిధులు  రాకుండా ఆగి పోతాయి. అంతే కాదు..  నిర్దిష్ట గడువు ముగిస్తే అవి మురిగి  పోతాయి కూడా.   అవును..  రాజీవ్ గాంధీ ప్రభుత్వం 1992లో తెచ్చిన 73వ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం.. ప్రజలచే ఎన్నుకోబడిన పంచాయతీలు కొలువు తీరి ఉన్నప్పడు మాత్రమే  పంచాయతీలకు  కేంద్ర నిధులు అందుతాయి. అయితే తెలంగాణలో గ్రామ పంచాయతీల గడువు 2024 జనవరిలోనే ముగిసింది. ఇక అక్కడి నుంచి  కారాణాలు ఏవైనా పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ముడి పడలేదు. ఈ కారణంగా ఇప్పటికే, కేంద్ర ప్రభుత్వం  2024-2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్రానికి రావలసిన రూ.1,550 కోట్లను రిలీజ్ చేయకుండా  విత్ హెల్డ్  లో పెట్టింది. అంటే..  నిధుల విడుదలను నిలుపుదల  చేసింది. అలాగే ప్రస్తుత   ఆర్థిక సంవత్సరానికి సంబందించి   రూ.1,450 కోట్లు కూడా విడుదల కాలేదు.  అంటే..  పంచాయతీ ఎన్నికలు సకాలంలో నిర్వహించక పోవడం వలన రాష్ట్రంలోని గ్రామ  పంచాయతీలు ఇంచుమించుగా రూ.3000 కోట్లు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది.  మరో వంక నిధుల కొరతతో అల్లాడుతున్న గ్రామ పంచాయతీలకు ప్రాణప్రదంగా భావించే  కేంద్ర నిధుల విడుదల కావాలంటే..   స్థానిక సంస్థల ఎన్నికలు తక్షణం నిర్వహించడం మినహా మరో మార్గంలేదన్నది పంచాయతీరాజ్ శాఖ అధికారుల సమాచారం. మరోవంక..  స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30లోగా నిర్వహించాలని   హై కోర్టు గడువు విధించింది. ఈ అన్నిటినీ మించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్  కల్పించిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళాలని  బీసీ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. లేదంటే .. అంటూ రాజకీయ హెచ్చరికలు చేస్తున్నాయి. దీంతో  గండం నుంచి గట్టెక్కేదారి కనిపించక రేవంత్ రెడ్డి ప్రభుత్వం తికమక పడుతోంది. ఇతర అంశాలు ఎలా ఉన్నా..  రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు ఫేస్  చేస్తున్న తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ముందు కేంద్ర గ్రాంట్స్ తెచ్చుకోవడం పై దృష్టి పెట్టాలి,  లేదంటే,  పంచాయతీల పరిస్థితి మరింత అధ్వాన స్థితికి దిగజారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి, ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా, గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల అవుతాయనే నమ్మకం లేదనీ, గడువు ముగిసిన గత సంవత్సరం నిదుల విడుదల పూర్తిగా కేంద్ర ప్రభుత్వం విచక్షణాదికార పరిధిలోకే వస్తుందనీ,  సో ..గత ఆర్థిక సంవత్సరానికి సంబందించిన రూ.1,550 కోట్లు విడుదల కేంద్రం దయ .. మన ప్రాప్తం అన్నట్లుగానే ఉంటుందని అధికారులు అంటున్నారు. అయితే..  గతంలో   ఎన్నికలు నిర్వహించిన వెంటనే విత్ హెల్డ్  లో పెట్టిన నిధులను విడుదల చేసిన అనుభవాల ఉన్నాయి కాబట్టి  ఎన్నికలు జరిగితే గత, ప్రస్తుత సంవత్సరాలకు సంబందించిన రూ. 3000 కోట్లు విడుదలవుతాయనే విశ్వాసాన్ని పంచాయతీ శాఖ అధికారాలు వ్యక్తం చేస్తున్నారు.   అలాగే.. ఈలోగా ఎన్నికలు జాప్యానికి కారణాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రనికి లేఖ రాస్తే, కేంద్ర నిధులు  విడుదల అవుతాయని  కొందరు అధికారులు అంటున్నారు  అయితే..  స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశం రోజురోజుకూ మరింత జటిలం అవుతున్న నేపధ్యంలో, ఈ చిక్కు ముళ్ళు వీడి, పంచాయతీ ఎన్నికల జరగడం  ప్రస్తుత పరిస్థితిలో సాధ్యమేనా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

పాక్ అణుబాంబులు భ‌య‌పెట్ట‌డానికేనా?

సింధూన‌ది పై ప్రాజెక్టు క‌డితే అణుబాంబులేస్తానంటోంది పాక్. మొన్న‌టికి మొన్న ఇదే అణు బాంబుల విష‌యంలో భారీ ఎత్తున భ‌య‌ప‌డ‌బ‌ట్టే క‌దా?  కాళ్లు పట్టుకుని మ‌రీ ఇండియాతో కాల్పుల విర‌మ‌ణ ఒప్పందానికి వ‌చ్చింది? ఈ విష‌యం పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ మ‌ర‌చిపోతే ఎలా? మొన్న‌టి యుద్ధంలో భార‌త్ పాక్ ని భ‌య‌పెట్ట‌కుండా ఏకంగా ఆ దేశ అణు నిల్వ‌లున్న ప్రాంతంలో బాంబులు జార విడిచి ఉండాల్సింది.  జ‌స్ట్ ఆ నూర్ ఖాన్ బేస్ పై బ్ర‌హ్మోస్ లు వ‌దిలినందుకే త‌ల్ల‌డిల్లిపోయింది పాక్.  ఈ ఎయిర్ బేస్ కి ద‌గ్గ‌ర్లో ఇటు ఆర్మీ చీఫ్ హెడ్ క్వార్ట‌ర్ తో పాటు అటు అణు నిర్వ‌హ‌ణ చేసే నేష‌న‌ల్ క‌మాండ్ ఆఫీసు కూడా ఉంటుంది. ఇక్క‌డ భార‌త్ బాంబులు ప‌డ్డంత‌నే.. ఇదే పాక్ ఆర్మీ చీఫ్‌.. జ‌డుసుకుని బంక‌ర్లో దాక్కున్నాడు. అలాంటి బీరువు ఇప్పుడు మ‌ళ్లీ బీరాలు ప‌లుకుతున్నాడు. సింధూన‌ది మీద ప్రాజెక్టు క‌డుతున్నందుకే ఇలా అంటుంటే మ‌రి బ్ర‌హ్మ‌పుత్రా న‌ది మీద చైనా క‌డుతున్న ప్రాజెక్టు ప‌రిస్థితి ఏంటి? సింధూన‌ది ఎలా కుటుంబ ఆస్తి కాదో అదీ అంతేగా? మ‌రి చైనాపై కూడా భార‌త్ అణు బాంబులు వేయాలా? మొన్న ప‌హెల్గాం దాడి త‌ర్వాత ఇదే సింధూజ‌లాల‌ విష‌యం వెలుగులోకి వ‌స్తే మేం అణుబాంబులు వేస్తామ‌ని అన్నారు పాక్ దేశ నాయ‌కులు. తీరా భార‌త్ యుద్ధానికి దిగితే వేయాల్సిన బాంబులు వేయ‌డం మానేసి.. బంక‌ర్ల‌లో దాక్కున్నారు. ఇరాన్ ద‌గ్గ‌ర అణుబాంబులు ఉంటే..  ప్ర‌పంచానికే అతి పెద్ద విప‌త్తుగా భావించిన అమెరికా.. పాక్ విష‌యంలో ఎందుకో వెన‌క‌డుగు వేస్తూనే ఉంటుంది. అంటే పాక్ ద్వారా భార‌త్ ని భ‌య‌పెట్టి ఆయుధాలు కొనిపించాల‌న్న యోచ‌న అమెరికాది. అందుకే ఆ దేశ గ‌డ్డ‌పై నుంచి ఇలాంటి బీరాలు ప‌లికిస్తోంద‌న్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వెలువ‌డుతున్నాయ్.  మేం పోతే స‌గం ప్ర‌పంచాన్ని లాక్కెళ్లిపోతామ‌ని మీరు భ‌య‌పెడ‌తారేమో.. కానీ భార‌త్ మొన్న‌టిలా చేసి చూపిస్తుంది.  అయినా యుద్ధం జ‌రుగుతుంటే మ‌న ద‌గ్గ‌ర ప్లాన్స్ లేవు ప్రేయ‌ర్సే అన్న మునీర్ కూడా .. ఇలా భార‌త్ ను భ‌య‌పెట్టేందుకు ప్రయత్నించడం  ఆశ్చ‌ర్యంగా ఉంది. ట్రంప్ కుటుంబానికి అమ్ముడుపోయి పాకిస్థాన్ని తాక‌ట్టి పెట్టి బ‌తుకుతున్న మునీర్  సైన్యాధ్య‌క్షుడంటే ఆసియాకే అవ‌మాన క‌రంగా ఉందని అంటున్నారు దౌత్య నిపుణులు.

ఓట్ల చోరీ.. రాహుల్ ఆరోపణలు.. ఈసీ ఖండనలు!

తాజాగా రాహుల్ గాంధీ మీడియా ముందుకు వచ్చి ఎన్నికల సంఘంపై తీవ్ర ఆరోపణలతో విరుచుకుపడ్డారు. ఈసీ తప్పులకుప్పగా  మారిందంటూ ఏకంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. తాను చేసే ఆరోపణలన్నిటికీ ఆధారాలున్నాయనీ, తాను, తన ఇన్వెస్టిగేషన్ టీమ్ ఎంతో శ్రమించి శోధించి ఈ వివరాలను సేకరించామని చెప్పుకున్నారు. అయితే ఆయన ఆరోపణలను ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంతే సాధికారికంగా ఖండించింది.  తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో రాహుల్ చేసిన కొన్ని ఆరోపణలు, వాటికి ఈసీ ఖండనలూ ఇలా ఉన్నాయి..    బెంగళూరు సెంట్రల్ లోక్‌సభ  స్థానంలో ఒక్కటి వినా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కాంగ్రెస్ విజయం సాధించినా, కేవలం ఒక్కటంటే ఒక్క నియోజకవర్గంలో  ఓట్ల చోరీ కారణంగా సెంట్రల్ లోక్ సభ స్థానాన్ని కాంగ్రెస్ కోల్పోయిందని పేర్కొన్నారు. అయితే రాహుల్ ఆరోపణను ఈసీ ఆధారాలను చూపుతూ ఖండించింది.  బెంగళూరు సెంట్రల్ లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో కాంగ్రెస్ ఏడింటిలో మెజారిటీ సాధించిందన్నది అవాస్తవం.  ఆ లోక్ సభ నియోజకవర్గంలో బీజేపీ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. కాంగ్రెస్ నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో విజయం సాధించింది. రాహుల్ పేర్కొన్నట్లుగా బీజేపీ ఒకే ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో మెజారిటీతో లోక్ సభ స్థానాన్ని గెలుచిందనడం పూర్తిగా అవాస్తవం అని ఈసీ పేర్కొంది.  అదే విధంగా నకిలీ ఓట్ల గురించి రాహుల్ గాంధీ తన పవర్ పాయింట్ ప్రజంటేషన్ లో   శ్రీవాస్తవ అనే వ్యక్తికి ఏకంగా మూడు రాష్ట్రాలలో  ఓటర్ ఐడీ ఉంది. ఆ మూడు రాష్ట్రాలూ ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, కర్నాటక. ఈ మూడు రాష్ట్రాలలోనూ శ్రీవాస్తవ ఓటు వేశాడు. ఆయన తన ఓటును బీజేపీకే వేశారంటూ ఉదాహరణగా చూపారు. అయితే ఈ ఆరోపణను కూడా ఈసీ నిర్ద్వంద్వంగా ఖండించింది. శ్రీవాస్తవ అనే వ్యక్తి మూడు రాష్ట్రాలలోనూ ఓటు వేశారనడం అబద్ధమని సాక్ష్యాలతో సహా పేర్కొంది. అయినా శ్రీవస్తవ అనే వ్యక్తి బీజేపీకే ఓటు వేశారని రాహుల్ ఎలా చెప్పగలరని నిలదీసింది. వాస్తవానికి శ్రీవాస్తవక 2011లో యూపీలో, 2016లో మహారాష్ట్రలో నివశించారనీ, ప్రస్తుతం కర్నాటకలో ఉంటున్నారనీ పేర్కొన్న ఈసీ.. ప్రతి సారీ కూడా ఆయన చట్టబద్ధంగా తన ఓటర్ ఐడీని మార్చుకున్నారని, ఒకే సారి మూడు రాష్ట్రాలలో ఓటు వేయలేదనీ ఈసీ విస్పష్టంగా తేల్చేసింది. ఇక ఒకే చిరునామాలో 80 మంది ఓటర్లు నమోదయ్యారన్న ఆరోపణకు కూడా ఈసీ స్పష్టమైన వివరణతో సమాధానం ఇచ్చింది.  వాస్తవానికి రాహుల్ చెప్పిన చిరునామాలో ఉన్నవి అద్దెకు ఇచ్చే సత్రాలుఆ చిరునామాలో ఉన్నవి అద్దెకు ఇచ్చే చావళ్లు. అంటే సత్రాలలాంటివన్న మాట.  అక్కడ పనివాళ్లు, సెక్యూరిటీ గార్డులు  తాత్కాలికంగా వచ్చి ఉంటారు. తర్వాత అక్కడ నుంచి మారిపోతారు. అలాంటి చావళ్లను  అడ్రస్ ప్రూఫ్‌గా   ఉపయోగించుకుని ఓటరు ఐడిలు  పొందారు కానీ అక్కడ వారు నివసించడంలేదు. అంత మాత్రాన అవన్నీ నకిలీ ఓట్లు ఎలా అవుతాయని ఈసీ నిలదీస్తోంది. అంతే కాకుండా వారంతా బీజేపీకే ఓటు వేశారని రాహుల్ ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నిస్తోంది.  మొత్తం మీద ఓట్ల చోరీ అంటూ రాహుల్ చేపట్టిన ఆందోళన, ఉద్యమం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. మొత్తం మీద రాహుల్ ఆరోపణలు, ఈసీ ఖండనలు నోటీసులతో దేశంలో రాజకీయ వేడి పెరిగింది. 

నీతా అంబానీ గ్యారేజ్‌లో దేశంలోనే ఖరీదైన రూ.100 కోట్ల కారు

అంబానీ గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నాయి. అయితే తాజాగా నీతా అంబానీ ఖరీదైన కారు గురించి ఆసక్తికర విషయాలు  బయటకు వచ్చాయి. ఆ కారు ఖరీదు, దానిలోని ఫీచర్స్ గురించి వింటే మాత్రం కళ్లు బైర్లు కమ్మాల్సిందే.  ప్రపంచ కుబేరుల్లో ఒకరైన రిలయన్స్ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ  గ్యారేజ్‌లో ఎన్నో ఖరీదైన కార్లు ఉన్నప్పటికీ   ఓ  కారు మాత్రం వార్తల్లో నిలుస్తోంది.  దాదాపు వంద కోట్ల రూపాయల విలువైన ఆ కారు ఖరీదు, అందులోని ఫీచర్ల గురించి ఆసక్తికర సమాచారం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఈ కారు దేశంలోనే అత్యంత ఖరీదైనదని అంటున్నారు.  ఆ కారు పేరు ఆడీ ఏ9 చమేలియన్ . ఈ కారు ఖరీదు అక్షరాలా వంద కోట్ల రూపాయలు. ఈ కారులో ఎన్నో ప్రత్యేకమైన ఫీచర్స్ ఉన్నాయట. వాటిల్లో ముఖ్యమైనది ఏంటంటే,  ఈ కారు ఊసరవెల్లిలా రంగులు మార్చుకోగలదట.  ఈ కారు ఎప్పటికప్పుడు తన రంగులను మార్చుకుంటుందట. ఒక్క బటన్ నొక్కితే చాలు,  కారు రంగు మారిపోతుందట. ఈ కారు పెయింటింగ్ పూర్తిగా ఎలక్ట్రిక్‌గా జరుగుతుందట. ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి కార్లు కేవలం 11 మాత్రమే ఉన్నాయట.ఈ కారు సింగిల్-పీస్ విండ్‌స్క్రీన్, రూఫ్‌తో స్పేష్ షిప్‌లా కనిపిస్తుంది. అల్ట్రా-ఎక్స్‌క్లూజివ్ కారు అయిన ఈ ఆడి ఏ9 చమేలియన్ రెండు-డోర్ల కాన్ఫిగరేషన్‌తో ఉంటుంది. ఈ కారులో 4.0-లీటర్ V8 ఇంజిన్‌ అమర్చారు. ఇది  600 సీసీ హార్స్‌పవర్‌ కారు. కేవలం మూడున్నర సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల   వేగాన్ని అందుకుంటుంది. దీని గరిష్ట వేగం గంటకు 250 కిలోమీటర్లు. అందుకే నీతా అంబానీకి ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ ఈ కారు ప్రత్యేకంగా నిలుస్తోంది.

హిమాలయాల్లో దొరికే మూలికల భస్మంతో బంగారం తయారీ అంటూ చీటింగ్..నిందితులు అరెస్ట్

బంగారం తయారు చేస్తామంటూ జనాలను మోసం చేస్తున్న నిందితుల ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు.   హిమాలయాల్లో దొరికే మూలికలతో బంగారం తయారు చేసి ఇస్తామంటూ నాగపూర్ కు చెందిన ఓ ముఠా హైదరాబాద్ లో మోసాలకు పాల్పడుతోంది. అమాయకుల నుంచి  లక్షల్లో డబ్బు చోరీ చేస్తున్న ముఠాలోని ముగ్గురిని ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు  అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. నాగపూర్ కు చెందిన గ్యాంగ్ హైదరాబాద్ లోకి ప్రవేశించి స్వామీజీ వేషధారణలో కష్టాలు తొలగిపోయేలా రెండు కేజీల బంగారం తయారుచేసి ఇస్తామంటూ అమాయక  జనాలను బురిడీ కొట్టిస్తూ వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ క్రమంలోనే బంజారాహిల్స్ కి చెందిన గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఈ గ్యాంగ్ మాయలో పడ్డాడు.  హిమాలయాల్లో దొరికే మూలికలతో , భస్మంతో తయారు చేసిన బంగారాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని, ప్రతి పనిలో విజయం సాధిస్తారంటూ నమ్మించి ...గోపాల్ సింగ్ వద్దనుండి 10 లక్షల రూపాయలు తీసుకొని... అతని అతని ఇంటికి వెళ్లి నెల రోజుల పాటు పూజలు చేసి అనంతరం ఒక ఎర్ర  బట్టలో రెండు కేజీల బంగారం ఉందంటూ వారి చేతికి ఇచ్చారు. వారం రోజులు పూజ గదిలో ఉంచిన అనంతరం దీనిని తెరిచి చూడాలని సూచించారు. అయితే గోపాల్ సింగ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఐదు రోజుల తర్వాత ఆ బట్ట తెరిచి చూడగా బంగారపు రంగులో ఉన్న ఇనుప ముక్కలు కనిపించాయి. స్వామీజీలమంటూ తమకు ఆ ఇనుపముక్కలను అంటగట్టిన వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులకు  ఫిర్యాదు చేశారు.   కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముఠాలోని ముగ్గు రిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు.  ఈ ముఠా నిజాంపేట్ లోని గద్వాల్ ఆయుర్వేదిక్ సెంటర్, నాగోల్ లోని మహాలక్ష్మి ఆయుర్వేదిక్ సెంటర్లలో ఏజెంట్లుగా పని చేస్తున్నారు. వీరు హిమాలయాల్లో నుండి భస్మం తీసుకువచ్చి... జనాలను నమ్మించి... మోసాలకు పాల్పడుతూ...    లక్షల్లో నగదు దోచేస్తున్నారు.  ఇప్పుడు నిందితులను అరెస్టు చేయడంతో మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.  

ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. జీవో విడుదల చేసిన ఏపీ సర్కార్

ఏపీలో కూటమి సర్కార్ కీలక ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం స్త్రీశక్తికి సంబంధించి ప్రభుత్వం సోమవారం (ఆగస్టు 10) మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ పథకం ఏయే బస్సుల్లో అమలవుతుంది, టికెట్ల జారీ ఎలా ఉంటుంది వంటి అన్ని వివరాలతో కూడిన  జీవోను ప్రభుత్వం విడుదల చేసింది.  ఈ జీవోలో ప్రభుత్వం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించే స్త్రీశక్తి పథకం ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి వస్తుందన్ని స్పష్టం చేసింది.  ఈ పథకంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ స్ధానికులైన మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే ఇందుకు తగిన గుర్తింపు కార్డులను చూపించాల్సి ఉంటుంది. ఇక ట్రాన్స్ జండర్లకు సైతం ఈ పథకం వర్తిస్తుంది.  స్త్రీ శక్తి పథకం కింద   మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సు ల్లో ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. బాలికలు, మహిళలు, ట్రాన్ జెండర్ లు ఈ ఉచిత ప్రయాణానికి అర్హులు. అయితే పల్లెవెలుగు, ఆర్డినరీ, సిటీ ఆర్డినరీ, ఎక్స్ ప్రెస్, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఈ పథకం కింద ఉచితంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది.  సప్తగిరి ఎక్స్ ప్రెస్ , సూపర్ లగ్జరీ , నాన్ స్టాప్ సర్వీసులు, అంతర్రాష్ట్ర సర్వీసులు, ఎసీ సర్వీసుల్లో ఉచిత ప్రయాణానికి  అవకాశం ఉండదు. 

వన్డే వరల్డ్ కప్ 2027కు కోహ్లీ, రోహిత్‌లు అనుమానమేనా?

టీమిండియా స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మలు రెండేళ్ల తర్వాత జరగనున్న వన్డే ప్రపంచ కప్ లో ఆడటం అనుమానంగానే కనిపిస్తోంది.  గతేడాది టీ-20 ప్రపంచకప్ తర్వాత ఇద్దరూ ఒకేసారి అంతర్జాతీయ టీ-20లకు వీడ్కోలు పలికారు. ఇక, ఈ ఏడాది ఐపీఎల్ తర్వాత ఇద్దరూ ఒకేసారి టెస్ట్ ఫార్మాట్‌ నుంచి వైదొలిగారు. ప్రస్తుతం వీరిద్దరూ వన్డేల్లో మాత్రం టీమిండియాకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వైట్ బాల్ క్రికెట్‌లో గొప్ప ఆటగాళ్లుగా పేరు తెచ్చుకున్న కోహ్లీ, రోహిత్ త్వరలోనే వన్డే క్రికెట్ నుంచి కూడా వైదొలగబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో టీమిండియా వన్డే సిరీస్ ఆడబోతోంది. ఆ సిరీస్ తర్వాత రోహిత్, కోహ్లీ ఒకేసారి వన్డేలకు కూడా రిటైర్మెంట్ ప్రకటించవచ్చని తెలుస్తోంది.  నిజానికి వీరిద్దరూ 2027 వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగాలని భావిస్తున్నట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే ఆ ప్రపంచకప్ ఆడాలంటే బీసీసీఐ నిబంధనల ప్రకారం వీరిద్దరూ ఈ ఏడాది డిసెంబర్‌లో జరిగే దేశీయ వన్డే సిరీస్ అయిన విజయ్ హజారే ట్రోఫీ ఆడవలసి ఉంటుంది. 2007 ప్రపంచ కప్‌లో రోహిత్, కోహ్లీ ఆడాలంటే అప్పటి వరకు వారిద్దరు ఫిట్‌నెస్‌ కాపాడుకోవడంతో పాటు ఫామ్‌లో ఉండటం అవసరం. ఈ నేపధ్యంలో వారిద్దరనీ ఎంపిక చేయడానికి బీసీసీఐ ఓ కండీషన్ పెట్టిందంట. ఈ ఏడాది డిసెంబరులో ప్రారంభమయ్యే విజయ్ హజారే ట్రోఫీలో వారిద్దూ పాల్గొంటేనే ప్రపంచకప్ స్క్వాడ్ కోసం వీరిని పరిగణనలోనికి తీసుకుంటామన్నదే ఆ కండీషన్ గా చెబుతున్నారు. అంటే విజయ్ హజారే ట్రోఫీలో  వీరు ఆడకపోతే వరల్డ్ కప్ దారులు మూసుకుపోయినట్టే.  ఇక టీమ్ ఇండియా కోచ్  యువ ఆటగాళ్లవైపే మొగ్గు చేపుతాడన్నది తెలిసిందే.  టెస్టుల విషయంలోనూ అదే జరిగిందనీ,  గిల్‌కు సారథ్యం ఇవ్వడం వెనుక కారణం అదే అంటున్నారు.  ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో ఆడాలనే తొలుత  రోహిత్, కోహ్లీ భావించారంట. కానీ భవిష్యత్తు అవసరాలు దృష్య్టా ఎంపిక కష్టమని బీసీసీఐ వర్గాలు చెప్పడంతోనే  వారు టెస్టులకు గుడ్ బై చెప్పారట. ఇంగ్లాండ్ టెస్టు సిరీస్‌లో బీసీసీఐ, గంభీర్ వ్యూహాలు ఫలించి భారత్ యువ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శనతో సిరీస్‌ను డ్రాగా ముగించారు.  ఆ క్రమంలో రోహిత్, కోహ్లీ భవితవ్వం ఏంటో మరో రెండు నెలల్లో వచ్చే ఆస్ట్రేలియా వన్టే సిరీస్‌లో తేలనుంది. ప్రస్తుతం టీమ్ ఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మే ఉన్నాడు.  ఇటీవలే చాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సారథ్యంలో ఇండియా నెగ్గింది.  అయితే  ఆస్ట్రేలియా వన్టే సిరీస్‌కి శుభమన్‌గిల్‌కే జట్టు పగ్గాలు అప్పగిస్తారని గట్టిగా వినిపిస్తోంది. ఇక పోతే కోహ్లీ, రోహిత్ లు వచ్చే వరల్డ్ కప్ లో ఆడతారా లేదా అన్నది విజయ్ హజారే ట్రోఫీ తేల్చేస్తుంది. ఆ  ట్రోఫీలో ఆడితేనే రోహిత్, కోహ్లీ పేర్లను ప్రపంచకప్ కోసం పరిశీలిస్తారు. ఒక వేళ ఆ ట్రోఫీలో వీరిరువురూ ఆడినా, అందులో వారు రాణించడంపైనే వరల్డ్ కప్ జట్టకు ఎంపక ఆధారపడి ఉంటుందని క్రీడా పండితులు అంటున్నారు. కాగా ఈ పరిస్థితుల నేపథ్యంలో యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వాలనే ఉద్దేశంతో వీరిద్దరూ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ తరువాత  తమ రిటైర్మెంట్ ప్రకటిస్తారని ఊహాగానాలు కూడా వినబడుతున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ ఏడాది అక్టోబర్‌లో జరిగే వన్డే సిరీస్ ముగిసిన తర్వాత 2027 ప్రపంచకప్ లోపు టీమిండియా మరో ఆరు వన్డే సిరీస్‌లు ఆడనుంది.

రాహుల్ గాంధీ అరెస్టు

కాంగ్రెస్ సీనియర్ నేత, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పోలీసులు అరెస్టు చేశారు.  గత కొద్ది రోజులుగా ఓట్ల చోరీపై కాంగ్రస్ పార్టీ, ఆ పార్టీ నేతృత్వంలోని ఇండియా కూటమి  ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.  బీహార్‌లో అధికార పార్టీకి తొత్తుగా ఎన్నికల సంఘం వ్యవహరిస్తుందంటూ పార్లమెంట్ వేదికగా నిరసనలు తెలుపుతున్న విపక్షాలు  లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో ఎన్నికల సంఘం కార్యాలయం ముట్టడికి బయల్దేరాయి. తాజాగా  సోమ వారం పార్లమెంట్ భవనం నుంచి ఈసీ  కార్యాలయానికి ప్లకార్డులు ప్రదర్శిస్తూ మార్చ్ నిర్వహించ తలపెట్టాయి.  అయితే విపక్షాల ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. సంసద్ మార్గ్ కు వెళ్లే మార్గంలో బారికేడ్లు అడ్డుగా పెట్టారు. అయితే విపక్ష ఎంపీలు వాటిని దాటుకుని వేళ్లే ప్రయత్నం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.  ఈ సందర్భంగా పోలీసులు రాహుల్ గాంధీ సహా విపక్ష ఎంపీలను  అదుపులోనికి తీసుకుని అక్కడ నుంచి తరలించారు. 

జగన్ మేనమామపై కేసు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మేనమామ, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డిపై తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.  నిబంధనలను ఉల్లంఘించి తిరుమలలో రాజకీయ ప్రసంగాలు, వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదు చేశారు. తిరుమలలో రాజకీయ ప్రసంగాలు నిషేధిస్తూ ఇటీవల పాలకమండలి తీర్మానం చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే  రవీంద్రనాథ్ రెడ్డిపై టీటీడీ విజిలెన్స్ అధికారులు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు నమోదు చేశారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం (ఆగస్టు 10) ఉదయం మాజీ ఎమ్మెల్యే  రవీంద్రనాథ్ రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం  ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ సందర్భంగా ఆయన రాజకీయ వ్యాఖ్యలూ, విమర్శలూ చేశారు.  పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికలలో వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.  తాము జగన్ వెంటే ఉన్నామని చెప్పేందుకు పులివెందుల ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. కూటమి ప్రభుత్వం అరాచకంగా వ్యవహరిస్తోందంటూ విమర్శలు గుప్పించారు. పులివెందులలో  వైసీపీ కార్యకర్తలపై విచ్చలవిడిగా దాడికి పాల్పడుతూ తెలుగుదేశం ఇష్టారీతిగా వ్యవహరిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో  శ్రీవారి ఆలయ ప్రాంగణంలో రాజకీయ ఆరోపణలు చేశారంటూ టీటీడీ విజిలెన్స్ పోలీసులు రవీంద్రనాథ్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. 

రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీట్

కాంగ్రెస్ కీలక నేత ప్రియాంకా గాంధీ భర్త రాబర్ట్ వాద్రాపై ఈడీ చార్జిషీట్ దాఖలు చేసింది.  2008 నాటి గురుగ్రామ్ భూముల కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో వాద్రాకు గరిష్ఠంగా ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించాలని కోరుతూ ఈడీ ఢిల్లీలోని పీఎంఎల్‌ఏ ప్రత్యేక  కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. అలాగే.. ఈ కేసుకు సంబంధించి రూ. 38.69 కోట్ల విలువైన 43 ఆస్తులను  ప్రభుత్వపరం చేయాలని ఆ చార్జిషీట్ లో పేర్కొంది. ఈడీ దాఖలు చేసిన ప్రాసిక్యూషన్ కంప్లైంట్‌ను పరిశీలించిన ప్రత్యేక కోర్టు.. రాబర్ట్ వాద్రాకు నోటీసులు జారీ చేసింది. అనంతరం ఈడీ చార్జ్ షీట్ పై విచారణ అంశాన్ని ఈ నెల 28కి వాయిదా వేసింది.   గురుగ్రామ్‌లోని భూమి అమ్మకానికి సంబంధించి రాబర్ట్ వాద్రా తప్పుడు వివరాలతో దస్తావేజులు సృష్టించారని ఈడీ తన చార్జిషీట్‌లో ఆరోపించింది. భూమి విలువను ఉద్దేశపూర్వకంగా తక్కువ చేసి చూపారనీ, దీనివల్ల హర్యానా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ రూపంలో రూ. 44 లక్షల నష్టం వాటిల్లిందని పేర్కొంది.   అంతే కాకుండా ఈ లావాదేవీల ద్వారా రాబర్ట్ వాద్రా 58 కోట్ల రూపాయలు అక్రమంగా పొందారని, ఇది మనీలాండరింగ్ ద్వారా వచ్చినట్లు తమ దర్యాప్తులో గుర్తించినట్లు పేర్కొంది

పులివెందుల వ‌ర్సెస్ కుప్పం

పులివెందుల‌లో గెల‌వ‌గానే  రాష్ట్రం మొత్తం తెలుగుదేశం గెల‌వ‌డం సాధ్య‌మేనా? ఇదీ వైసీపీ నేత‌ల ప్ర‌శ్న‌. అదే కుప్పంలో గెల‌వ‌గానే వైసీపీ ఆంధ్ర అంత‌టా విజ‌యం సాధించిన‌ట్టేనా? ఇది ప్ర‌స్తుతం స‌ర్వ‌త్రా వినిపించే ప్ర‌శ్న‌.  ప్ర‌స్తుతం పులివెందుల జెడ్పీటీసీ మీద  తెలుగుదేశం ఫుల్ ఫోక‌స్ పెట్టింది. ఎక్క‌డైతే వైసీపీ బ‌లంగా ఉందో.. అక్క‌డే దెబ్బ కొట్టాల‌న్న‌ది ఆ పార్టీ  వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే క‌డ‌ప‌ జిల్లాలో మ‌హానాడు నిర్వహించింది.   ఈ క‌ల్చ‌ర్ ఈనాటిది కాదు.. ఎప్ప‌టి నుంచో ఉంది. రాజ‌కీయ‌మంటేనే అది. కాలేజీ రాజ‌కీయాల నుంచి పెద్దిరెడ్డికి, చంద్ర‌బాబుకీ పోటీ. ఆ మాట‌కొస్తే రెడ్లు త‌ప్ప రాజ‌కీయాలు క‌మ్మ‌ల‌కు సూటుకావంటూ సాగుతుంది ఈ సంకుల స‌మ‌రం. తొలి నాళ్ల‌లో చంద్ర‌బాబు త‌న‌కు వ‌రుస దెబ్బ‌లు త‌గ‌ల‌డంతో.. మ‌నం నిజంగానే రాజ‌కీయాల‌కు సూటుకామా? అన్న కోణంలో దిగాలు ప‌డ్డ ప‌రిస్థితి ఉంది. అయినా స‌రే ఎ తొలిసారి నుంచి చంద్ర‌గిరిలో గెలిచి.. ఆపై కుప్పం  నుంచి ఆయ‌న 40 ఏళ్లుగా గెలుస్తూనే వ‌స్తున్నారు. నాలుగు సార్లు ముఖ్య‌మంత్రి కాగ‌లిగారు కూడా. అలాంటి కుప్పంలో ఎలాగైనా స‌రే గెల‌వాల‌న్న‌ది జ‌గ‌న్ ఎత్తుగ‌డ. మొన్న ఇక్క‌డ వైనాట్ వ‌న్ సెవంటీ ఫైవ్ లో బాగంగా కుప్పంలో గెలిచి తీరాల్సిందే అన్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేసింది వైసీపీ. భ‌ర‌త్ ని భారీ ఎత్తున స‌న్న‌ద్దం చేసింది. కానీ భ‌ర‌త్ కూట‌మి గాలిలో కొట్టుకు పోవ‌ల్సి వ‌చ్చింది.  కుప్పం అంటే బాబు- బాబు అంటే కుప్పం అన్న‌ది ఒక బ్రాండ్ గా మారింది.  అందుకే బాబు కుప్పం నుంచి కూర‌గాయ‌లు విమానాల ద్వారా ఎగుమ‌తి చేసే ఏర్పాట్లు చేస్తామ‌ని బ‌హుమానం ప్ర‌క‌టించారు. అంతే కాదు త‌న సొంత సెగ్మెంట్లో ఇల్లు క‌ట్టుకోవ‌డంతో పాటు ఆ నియోజక వ‌ర్గానికి.. త‌న స‌తీమ‌ణిని ఇంచార్జ్ గా చేసి అన్ని విష‌యాల‌ను క్షుణ్ణంగా  ప‌రిశీలిస్తున్నారు.  ఇదిలా ఉంటే, పులివెందులలో ఎమ‌ర్జెన్సీ త‌ర్వాత  దేశ వ్యాప్తంగా జ‌రిగిన‌ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఏపీ నుంచి ఒకే ఒక్క‌డిగా గెలిచారు వైయ‌స్ఆర్. అంటే అప్ప‌టి నుంచి పులివెందుల వైయ‌స్ ఫ్యామిలీకి అంత ప‌ట్టున్న సెగ్మెంట్. ఇక్క‌డ ఇత‌ర పార్టీలు పాగా వేయ‌డం అంత తేలికైన ప‌ని కాదు. బీటెక్ ర‌వి ఇక్క‌డ ఎప్ప‌టి నుంచో విజ‌యం రుచి చూడ్డం కోసం ఎదురు  చూస్తున్నారు కానీ ఇప్పటి వరకూ సాధ్యం కాలేదు. కార‌ణం ఇక్క‌డ రెడ్లు, బీసీ, ఎస్సీ ఎస్టీ క్రిష్టియ‌న్ మైనార్టీ ఓటు బ్యాంకు మొత్తం గంపగుత్తగా వైయ‌స్ కుటుంబానికి గ‌మద్దతుగా నిలవడం ఒక రివాజుగా వ‌స్తోంది.  కాబ‌ట్టి ఇట్స్ నాట్ సో ఈజీ. అలాంటి నియోజక వ‌ర్గంపై ప‌ట్టు సాధించ‌డం వ‌ల్ల తమ ఆధిప‌త్యం మ‌రింత స్ప‌ష్టంగా నిరూపించ‌వ‌చ్చ‌న్న భావ‌న‌లో ఉంది తెలుగుదేశం. అంతే కాదు లోకేష్ ని అడ్డు పెట్టుకుని ఆయ‌న త‌న‌కు సొంతం కాని మంగ‌ళ‌గిరిలో ఎలా పోటీ చేశారో అలా పోటీ  చేసి జ‌గ‌న్ త‌న స‌త్తా చాటాల‌న్న స‌వాళ్లు కూడా ఉన్నాయి. ఇక సీఎం స్థాయి వ్య‌క్తుల‌ సొంత నియోజ‌క‌వ‌ర్గాల్లో గెలిస్తే ఎలాంటి పరిణామ క్ర‌మాలు సంభ‌విస్తాయో చెప్ప‌డానికి కొండంగ‌ల్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక్క‌డ ఓడిన రేవంత్ రెడ్డి త‌ర్వాత కాలంలో కాంగ్రెస్ లోకి వెళ్లి ఎంపీగా మ‌ల్క‌జ్ గిరి నుంచి పోటీ చేసి గెలిచి.. అటు పిమ్మ‌ట పీసీసీ చీఫ్ గా ఎదిగి ఆపై ముఖ్య‌మంత్రి పీఠంలో స‌గ‌ర్వంగా కూర్చుకున్నారు. ఇలా ఉంటుంది ఒక సీఎం సెగ్మెంట్ తో పెట్టుకుంటే. ఇక కేసీఆర్ గ‌జ్వేల్ విష‌యానికే వ‌స్తే.. ఇక్క‌డ కేసీఆర్ కి ఎంత వ్య‌తిరేక‌త ఉన్నా  కూడా ఈ ప్రాంత వాసులు ఆయ‌న్నే పదే ప‌దే గెలిపిస్తారు. కార‌ణ‌మేంటంటే.. కేసీఆర్ వ‌ల్ల జాతీయ స్థాయిలో త‌మ నియోజ‌క‌వ‌ర్గం పేరు మారు మోగుతోంది కాబ‌ట్టి. అలా ఉంటుంది ఆయా వీవీఐపీ నియోజక వ‌ర్గాల్లోని ప్ర‌జానాడి. ఇపుడు పులివెందుల‌లో ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించడం  ద్వారా తెలుగుదేశం పార్టీ  వైసీపిని జగన్ అడ్డాలో  దెబ్బ తీసి సత్తా చాటి తొడగొట్టాలని  చూస్తోంది. ఒక ర‌కంగా చెబితే అది జ‌గ‌న్ ని ఆయ‌న ప‌రివార‌గ‌ణాన్ని ఒకింత ఎక్కువ రెచ్చ‌గొట్ట‌డ‌మే అవుతుంద‌ని అంచ‌నా వేస్తారు విశ్లేష‌కులు. ఒక వేళ నిజంగానే ఈ ఉప‌ ఎన్నికలో టీడీపీ గెలిస్తే అది భ‌విష్య‌త్తులో మ‌రిన్ని సవాళ్లకుకు దారి తీస్తుందనడంలో  ఎలాంటి  సందేహం లేదు. అలాగ‌ని రాజ‌కీయ పార్టీలు సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకోకుండా ఉండవు.  ఒక పార్టీ అంటే అన్ని చోట్లా గెల‌వాల‌నుకుంటుంది. గ‌తంలో ఎన్టీఆర్, ఇందిర వంటి వారికే వారి వారి సొంత నియోజకవర్గాలలో ఓడిన పరిస్థితి ఉంది.  కాబ‌ట్టి... గెలుపు ఓటములు  స‌ర్వ‌సాధార‌ణం. స‌రిగ్గా అదే స‌మ‌యంలో ఆస‌క్తి క‌రం కూడా.

మెట్ పల్లిలో భారీ అగ్రిప్రమాదం.. గన్నీ బ్యాగ్స్ గోడౌన్ లో 24 గంటలుగా అదుపులోకి రాని మంటలు

జగిత్యాల జిల్లా మెట్ పల్లి భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మెట్ పల్టిలోని వ్యవసాయ మార్కెట్ లో ఆదివారం ( ఆగస్టు 10) ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు సోమవారం (ఆగస్టు 11) ఉదయానికి కూడా అదుపులోనికి రాలేదు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని గన్నీ సంచుల గోదాంలో  మంటలు చెలరేగాయి. సమాచారం తెలిసిన వెంటనూ అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. భారీ పొగ కమ్ముకోవడంతో అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఆరు అగ్నిమాపక యంత్రాలతో  గత 24 గంటలుగా మంటలు ఆర్పడానికి అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నా మంటలు అదుపులోనికి రాలేదు. జేసీబీలతో గోడౌన్ గోడలు కూల్చి మంటలను  అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నా.. భారీ సంఖ్యలో గోనె సంచులు ఉండటంతో అవన్నీ అంటుకుని పెద్ద ఎత్తున మంటలు ఎగసి పడుతున్నాయి. కాగా సంఘటనా స్థలాన్ని ఆదివారం (ఆగస్టు 10) రాత్రి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరిశీలించి ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుకున్నారు. మంటలు పూర్తిగా అదుపులోనికి వచ్చిన తరువాత మాత్రమే నష్టం అంచనా వేయడానికి వీలౌతుందని అధికారులు తెలిపారు. 

ఈడీ విచారణకు సినీ నటుడు దగ్గుబాటి రాణా

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో నటుడు దగ్గుబాటి రాణా సోమవారం (ఆగస్టు 11) ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో ఇప్పటికే  చిత్రపరిశ్రమకు చెందిన పలువురిని ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. ప్రకాశ్ రాజ్, విజయదేవరకొండ తదితరులు ఈడీ విచారణకు హాజరైన సంగతి విదితమే. ఇలా ఉండగా ఇదే కేసులో ఈడీ నటుడు మోహన్ బాబు కుమార్తె, నటి మంచు లక్ష్మికి కూడా నోటీసులు జారీ చేసింది. బుధవారం (ఆగస్టు 13) విచారణకు హాజరు కావాల్సిందిగా ఆ నోటీసులలో పేర్కొంది.   బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కు సంబంధించి హైదరాబాద్ కేంద్రంగా నమోదైన కేసులపై ఈడీ విచారణ చేపట్టింది. ఇప్పటికే విచారణకు హాజరైన నటుడు ప్రకాశ్ రాజ్ ఇకపై బెట్టింగ్ యాప్స్ కు ప్రమోషన్ చేయనని తెలిపారు. ప్రజలకు హాని చేసే వ్యాపారాల ప్రమోషన్ లకు దూరంగా ఉంటానని విచారణ అనంతరం ప్రకటించారు.  ఇక విజయ్ దేవరకొండ అయితే..తాను అసలు బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేయలేదనీ, తాను ప్రమోషన్ చేసినది గేమింగ్ యాప్ అని పేర్కొన్నారు. లీగల్ గా కొనసాగుతున్న గేమింగ్ యాప్ ప్రమోషన్ లో మాత్రమే తాను పాల్గొన్నానని చెప్పిన విజయ దేవరకొండ.. విచారణకు పూర్తిగా సహకరిస్తానని పేర్కొన్నారు.  

మోడీ- పుతిన్- జిన్ పింగ్ క‌లిస్తే..ఏమ‌వుతుంది???

  ట్రంప్ అస‌లు బాధంతా ఇదే. గ‌త అధ్య‌క్షుల‌కు కేవ‌లం ర‌ష్యా మాత్ర‌మే అతి పెద్ద అడ్డంకి. రెండో ప్ర‌పంచ యుద్ధం త‌ర్వాత ఇరు దేశాల మ‌ధ్య‌ ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం మొద‌లైంది. అప్ప‌టి వ‌ర‌కూ ఆయుధం ప‌ట్ట‌ని అమెరికా..  పెర్ల్ హార్బ‌ర్ ఘ‌ట‌న త‌ర్వాత అణుబాంబు వ‌ర‌కూ ఆయుధాల త‌యారీ నేర్చుకుంది. ఆపై ర‌ష్యాతో పోటీ  ప‌డుతూ.. ఇటు ఆయుధాల‌తో పాటు అటు స్పేస్ లోనూ మున్ముందుకు వెళ్తూ వ‌చ్చింది. ఫైన‌ల్ గా ఇప్పుడు నాసా పేరు ఎక్కువ‌గా  వినిపిస్తోంది ప్ర‌పంచంలో. ర‌ష్య‌న్ స్పేస్ గురించి ఎక్క‌డా ఊసే ఉండ‌దు. దీనంత‌టికీ కార‌ణం పోటీ. ఆపై చైనాతో పోటీప‌డ్డం మొద‌లైంది అమెరికా. చైనా వ‌రల్డ్ ప్రొడ‌క్ష‌న్ హౌస్ గా ఉంది. పిన్నీసు నుంచి రాకెట్ల వ‌ర‌కూ చైనాపై ఆధార‌ప‌డ‌కుండా ఈ ప్ర‌పంచం ఏదీ చేయ‌లేదు. ముందుకు వెళ్ల‌లేదు. మొన్న రాహుల్ గాంధీ ఒక స్మార్ట్ టీవీ యూనిట్లోకి వెళ్లి చూడ‌గా తెలిసిందేంటంటే.. కేవ‌లం పై డ‌బ్బాలు త‌యారు చేయ‌డం స్టిక్క‌ర్లు వేయ‌డం త‌ప్ప మ‌న మేకిన్ ఇండియా ఏమంత ఎఫెక్టివ్ గా లేద‌ని తేల్చి చెప్పారాయ‌న‌. దానర్ధం ఏంటంటే  చైనాను కాద‌ని మ‌న‌మేం చేయ‌లేక పోతున్నామ‌ని. మ‌న‌మే కాదు ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే ప‌రిస్థితి. ఈ విష‌యంలో ట్రంప్ ఎలాగైనా స‌రే చైనాతో పోటీ ప‌డ‌దామ‌ని ట్రై చేస్తున్నారు. ఇప్ప‌టికే చైనా ఆర్మీ  ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌ది. దాని త్రివిధ ద‌ళాల‌తో పోల్చితే అమెరికన్ ఆర్మీ జుజుబీ. దీంతో స్మార్ట్ వార్ చేయ‌డ‌మెలా?. అన్న‌ది ప్రాక్టీస్ చేస్తూ వ‌స్తోంది. గ‌త కాల‌పు అధ్య‌క్షుడు రొనాల్డ్ రీగ‌న్ ప్ర‌వేశ పెట్టిన స్టార్ వార్ త‌ర‌హాలో గోల్డ‌న్ డోమ్ అనే సేఫ్టీ లైన్ ప్ర‌వేశ పెట్టే యోచ‌న చేస్తున్నారు ట్రంప్ నాయ‌క‌త్వంలోని అమెరిక‌న్ ర‌క్ష‌ణ రంగ నిపుణులు. ఇదే ర‌ష్యా సంగ‌తి చూస్తే ర‌ష్యా మొత్తం నాశ‌న‌మైనా కూడా ఆటోమేటిక్ ట్రిగ‌రింగ్ ద్వారా ప్ర‌పంచాన్ని నామ‌రూపాల్లేకుండా చేయ‌గ‌లిగే స‌త్తా త‌మ సొంత‌మ‌ని గుర్తు చేస్తోంది ఆ దేశం. ఇక భార‌త్ విష‌యానికి వ‌స్తే.. ఈ దేశాన్ని పాక్ ఉగ్ర‌వాదులు సాయంతో.. కెలికి ఆపై యుధ్దానికి ప్రేరేపించి అటు పిమ్మ‌ట ఆయుధ కొనుగోళ్లు చేయిద్దామ‌ని చూసింది యూఎస్. తెలివి మీరిన భార‌త్ ప‌క్కా వ్యూహ‌ర‌చ‌న‌తో హండ్ర‌డ్ ప‌ర్సంట్ స్ట్రయిక్ రేట్ తో.. ఇటు ఉగ్ర‌వాదుల‌ను అటు చైనా  పీఎల్ 15లు, ఆపైన అమెరిక‌న్ ఎఫ్  16 ల‌ను ప‌డ‌గొట్టి దుమ్ము దులిపేసింది. దీనంత‌టికీ కార‌ణం వ్యూహ‌ర‌చ‌న‌. స‌రిగ్గా పాక్ అణు నిల్వ‌లున్న కిరానా కొండ‌ల‌పై బ్ర‌హ్మోస్ ల‌ను వ‌ద‌ల‌డంతో.. అక్క‌డ ప‌డ్డ దెబ్బ ఇటు పాక్ కి అటు అమెరికాకి  కూడా దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించింది. దీంతో జ‌డుసుకున్న పాక్ అమెరికా కాళ్లు ప‌ట్టుకుని.. కాల్పుల విర‌మ‌ణ బేరానికి వ‌చ్చింది. ఇలా ఎటు నుంచి ఎటు చూసినా ఈ మూడు అగ్ర‌దేశాలు ఒక్కొక్క‌రూ ఒక్కో ర‌కంగా అమెరికాతో ఢీ అంటే ఢీ అంటున్న‌వారే. మొన్న‌టికి మొన్న‌.. అమెరిక‌న్ ఎఫ్- 35ల‌ను వ‌ద్ద‌ని  రిజెక్ట్ చేసింది భార‌త్. మ‌నం కూడా దాని ప‌నితీరు కేర‌ళ ట్రివేండ్రం ఎయిర్ పోర్టులో ఆగిన‌పుడు చూసే ఉంటాం. 40 మంది మెకానిక్ లు వ‌చ్చినా కూడా దాన్ని రిపేర్ చేయ‌లేక పోవ‌డంతో.. గ్లోబ్ మాస్ట‌ర్ సాయంతో బ్రిట‌న్ కి ఎయిర్ లిఫ్ట్ చేయాల్సి వ‌చ్చింది. ఇక 2018లో తాడ్ ల‌ను కొన‌మ‌ని ప్రెష‌ర్ చేసింది యూఎస్. మాకొద్దా ఎయిర్ డిఫెన్స్ సిస్ట‌మ్ అని తెగేసి చెప్పి.. ఎస్ 400 ల‌ను కొనుగోలు చేసింది భార‌త్. కార‌ణం అమెరికా న‌మ్మ‌ద‌గిన దేశ‌మేం కాదు. అదే ర‌ష్యా ఇటు బ్రహ్మోస్ వంటి మిస్సైళ్ల‌ త‌యారీకి సాంకేతిక సాయం చేస్తూనే.. అటు తాము యుద్ధంలో ఉండ‌గా కూడా ఎస్ 400 డెలివ‌రీ చేసింది. అంతేనా ఏ చిన్న సైనిక సాయం కావాల‌న్నా చేస్తుంది. అదే అమెరికా మ‌నం కార్గిల్ వార్ లో ఉండ‌గా.. జీపీఎస్ సిస్ట‌మ్ ని ఆపి హ్యాండ్ ఇచ్చింది. .ఇలాంటి న‌మ్మ‌క ద్రోహ దేశం వ‌ద్ద ఏం కొన్నా స‌రే మ‌న‌కేం పెద్ద యూజ్ అవ‌దు.  గ‌తంలో పెంట‌గాన్ రిపోర్టుల‌ను బ‌ట్టీ చూస్తే ప్ర‌పంచంలోనే అమెరికా ద‌గ్గ‌ర  ఆయుధాలు కొనే దేశాల్లో మ‌నం థ‌ర్డ్ ప్లేస్ లో ఉండేవారం. కానీ అమెరికా దాని నీచ బుద్ధి బ‌య‌ట ప‌డుతూ వ‌చ్చాక‌.. మ‌నం ఆయుధాల ప‌రంగా దూరం జ‌రుగుతూ వ‌స్తున్నాం. ప్ర‌స్తుతం ట్రంప్ కోపం కూడా అందుకే. భార‌త్ ర‌ష్యాకు మ‌రింత ద‌గ్గ‌ర‌వుతుంటే ప‌రిస్థితి.. అమెరికాకి మైండ్ పోతోంది. దానికి తోడు మ‌నం ప్ర‌తిదానికీ ర‌ష్యా స‌హ‌కారంతో సొంత సిస్ట‌మ్ త‌యారు చేసుకుంటూ వ‌స్తున్నాం. ఎస్ 400 త‌ర‌హాలో ప్రాజెక్ట్ కుషా. ఆపై ఎఫ్ 35 ల లాంటి ఫిఫ్త్ జెన్ ఫైట‌ర్ జెట్స్.. ఇలా ఓన్ ప్రొడ‌క్ష‌న్ మొద‌లు పెట్టాం. ఎందుకంటే గ‌త ఆప‌రేష‌న్ సిందూర్ లోపాక్ ఇటు అమెరికా అటు చైనా, ట‌ర్కీల‌ నుంచి పెద్ద ఎత్తున ఆయుధ సాయం పొందింది. వారంత‌ట వారు త‌యారు చేసుకోలేక పోవ‌డం వ‌ల్ల‌.. ఆ దేశం చివ‌ర్లో బోల్తా కొట్టింది. మ‌న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ చెప్పిన‌ట్టు.. ఆయుధం ఉండ‌గానే స‌రిపోదు. దాన్ని వాడే సామ‌ర్ధ్యం కూడా అత్య‌వ‌స‌రం. అదెప్పుడు సాధ్య‌మంటే వాటిని మ‌న‌మే త‌యారు చేసుకోవ‌డం వ‌ల్ల స‌గానికి  స‌గం త‌ర్పీదు అయి ఉంటామ‌ని అంటారాయ‌న‌. దానికి తోడు ఆయుధ త‌యారీలో ర‌ష్యన్ మేడ్ మోస్ట్ ప‌ర్ఫెక్ట్ క‌మ్ ప‌వ‌ర్ఫుల్. మొన్న‌టి యుద్ధంలో పాక్ ని మ‌నం క‌ట్ట‌డి చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించింది ఎస్ 400 లు. ఈ విష‌యాన్ని తాజాగా మ‌న ఎయిర్ చీఫ్ ఏపీ సీంగ్ సైతం చెప్పుకొచ్చారు.. మ‌నం ఎఫ్ 16ల‌తో స‌హా ఆరు యుద్ధ విమానాలు ప‌డ‌గొట్టామంటే కార‌ణ‌మ‌దే. ఈ విష‌యం పాక్ ఒప్పుకోకున్నా ట్రంప్ సైతం అవును నిజ‌మేన‌న్నారు.   అలాంటి కండీష‌న్లో ర‌ష్యా- భార‌త్- చైనా అనే ఈ మూడు దేశాలు క‌లిస్తే స‌గం ప్ర‌పంచం అటు వైపు మొగ్గుతుంది. మ‌రో స‌మ‌స్య  ఏంటంటే భార‌త్ కి ఈ మూడు దేశాల్లోనే కాస్త మ‌ర్యాద‌రామ‌న్న ల‌క్ష‌ణాలు అధికం. మ‌నం ఎవ‌రినీ యుధానికి ప్రేరేపించం. ఎవ‌రితోనూ యుద్ధం కావాల‌ని కోరుకోం. ఎవ‌రినీ ట‌క్క‌రి బుద్ధుల‌తో దెబ్బ తీయాల‌ని చూడ్డం. దీంతో ఇప్ప‌టికే భార‌త్ ని స‌గం దేశాలు అగ్ర నాయ‌క‌త్వం వ‌హించ‌మ‌ని కోరుకుంటున్నాయ్. ఇదే ట్రంప్ చూడండీ.. ర‌ష్యాతో యుద్ధంలో ఉన్న దేశ‌మ‌ని కూడా వ‌ద‌ల‌కుండా ఉక్రెయిన్ తో ఏ విదంగా ఖ‌నిజ త‌వ్వ‌కాల ఒప్పందం చేసుకున్నారో. ఆపై భార‌త్ తో ఘ‌ర్ష‌ణ‌లో ఉన్న టైంలోనే పాక్ ద్వారా త‌మ కుటుంబ కంపెనీలో పెట్టుబ‌డులు పెట్టించుకున్నారు. ఇదంతా ప్ర‌పంచం చూస్తూనే ఉంది.  దానికి తోడు బ్రిక్ దేశాలన్నీటికీ ఒక భ‌రోసా అందించేలా అత్యంత చౌక ధ‌ర‌ల‌కే మ‌నం ఆయుధాల త‌యారీతో పాటు స‌ర‌ఫ‌రా కూడా చేస్తున్నాం. ఇక్క‌డే ట్రంప్ కి భార‌త్ అంటే ఒళ్లు మండిపోతోంది. ఆయా అమెరిక‌న్ కంపెనీల నుంచి మ‌న వాళ్ల‌ను వాష్ అవుట్ చేయ‌మంటున్నారాయ‌న‌. ఇంకా సుంకాల మోత మోగిస్తామ‌ని చెప్పుకొస్తున్నారు.  ప్ర‌పంచ‌మంతా ట్రంప్ భార‌త్ ని ఏదో భ‌య‌పెట్టి ఇర‌కాటంలో పెడుతున్నాడ‌ని అంటున్నారుగానీ.. దీని ప్ర‌భావం వ‌చ్చే రోజుల్లో బ‌లంగా ఉండ‌నుంది. డాల‌ర్ ద్వారా లావాదేవీల‌ను మానేసి బ్రిక్ దేశాలు త‌మ‌కు తాము స్వ‌యంగా ఒక క‌రెన్సీ ఏర్పాటు చేసుకుని త‌ద్వారా.. చెల్లింపులు చేసుకునేలా తెలుస్తోంది. దీంతో స‌గం ప్ర‌పంచం డాల‌ర్ ని వాడ్డం త‌గ్గించేస్తాయి. దీంతో అమెరికా న‌డ్డి విరిగి న‌ట్టేట్లో ప‌డ్డం ఖాయం. ఇప్ప‌టికే అమెరికా ఒక క‌న్జ్యూమ‌ర్ బేస్డ్ కంట్రీ.. ఆ దేశ ప్ర‌జ‌ల్లో అత్య‌ధిక శాతం క్రెడిట్ కార్డుల‌ను బేస్ చేసుకుని బ‌తుకుతుంటారు. అంతే కాదు.. ప్ర‌భుత్వాలు కూడా య‌ధేచ్చ‌గా రుణాల మాఫీ చేస్తూ ఉంటుంది. ఇంత వెస‌లుబాటుకు కార‌ణం అమెరిక‌న్ డాల‌ర్ లో ప్ర‌పంచంలోని ప్ర‌తి చెల్లింపు జ‌రుగుతుంది కాబ‌ట్టి.. ఆ నిల్వ‌లు ఆ దేశం చెంత అంత ఎక్కువ‌గా ఉంటుంది కాబ‌ట్టి. దానికి తోడు ప్ర‌పంచంలో ఉన్న ప్ర‌తి వ‌న‌రుపై గుత్తాధిప‌త్యం వ‌హించి ఆపై ఆయా దేశాల‌కు ఇవ్వాల్సిన మొత్తాలు కూడా.. త‌మ ట్రెజ‌రీల్లో దాచుకుంటుంది యూఎస్.  ఒక వేళ డాల‌ర్ చెల్లింపుల‌ను కంట్రోల్ చేయ‌గ‌లిగితే.. దెబ్బ‌కు అమెరికా ఆర్ధిక వ్య‌వ‌స్థ మొత్తం కుప్ప‌కూలిపోతుంది. ఈ విష‌యం గుర్తించిన బిజినెస్ మెన్ ట్రంప్.. ఒక‌టే సుంకాల బెదిరింపుల‌కు పాల్ప‌డుతున్నారు. కానీ ఈ ప్ర‌భావం భార‌త జీడీపీపై ప‌డేది కేవ‌లం పాయింట్ టూ ప‌ర్సంటేజీ మాత్ర‌మే.. కాబ‌ట్టి ఏం పెద్ద భ‌య‌ప‌డ‌కూడ‌ద‌న్న కృత నిశ్చ‌యంతో ఉంది. దీంతో పెద్ద‌న్న ట్రంప్ కి లోలోన అణుబాంబులు ప‌డుత‌న్న చ‌ప్పుడు వినిపిస్తోంది..  ఉన్న సిట్యువేష‌న్ కి తోడు.. ఈ మూడు దేశాల క‌ల‌యిక అంటేనే హ‌డలెత్తి పోతోంది ట్రంప్ నాయ‌క‌త్వంలోని అమెరికా.

హైదరాబాద్ వరద ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన

  హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యటించారు. బల్కంపేట, అమీర్ పేట్ గంగూభాయి బస్తీల్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్‌తో కలిసి ముఖ్యమంత్రి ముంపు ప్రాంతాలను  పరిశీలించారు. బస్తీ వాసుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మంచి నీరు ఎలా వస్తుంది.. అందులో ఏమైనా మురుగు నీరు కలుస్తుందా? అంటూ వారిని స్వయంగా అడిగి సీఎం తెలుసుకున్నారు.  వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలను వెంటనే యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. అలాగే వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలపై సీఎం రేవంత్ ఆరా తీశారు. ఈ వరద ప్రభావంపై హైడ్రా కమిషనర్ సహా ఇతర అధికారులను ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా డ్రైనేజీ వ్యవస్థను సైతం ఆయన పరిశీలించారు.  ముంపు సమస్య రాకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో హైదరాబాద్ మహానగరం తడిసి ముద్దవుతుంది. వరుసగా ప్రతి రోజు నగరంలో ఏదో ఒక ప్రాంతంలో భారీ వర్షం కురుస్తునే ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. రోడ్లుపై భారీగా వర్షపు నీరు నిలిచిపోతుంది. డ్రైనేజీలోని మురుగు నీరు సైతం రహదారులపైకి వచ్చి భారీగా చేరుతుంది. అలాగే ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. వరద పరిస్థితిని ముఖ్యమంత్రికి  బాలుడు వివరించాడు. బుద్ధ నగర్‌లో  జశ్వంత్ అనే బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై సీఎం ఆరా తీశారు. కాలనీలో నడుస్తూ జశ్వంత్ నుంచి వివరాలు తెలుసుకున్నరు. తను 7వ తరగతి చదువుతున్నట్లు సీఎంకు  జశ్వంత్ వివరించారు. వరద నీరు ఇంట్లోకి చేరడంతో పుస్తకాలు తడిసిపోయాయని చెప్పిని ముఖ్యమంత్రికి బాలుడు తెలిపాడు. భవిష్యత్ లో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని బాలుడికి సీఎం రేవంత్  ధైర్యం చెప్పారు.  మరోవైపు వర్షాలు, సీజనల్ వ్యాధులపై మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వరద సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు. నీరు నిలిచే ప్రాంతాల్లో వెంటనే తొలగింపు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజలు మ్యాన్‌హోల్స్‌, విద్యుత్‌ స్తంభాలకు దూరంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప.. ప్రజలు బయటకి రావొద్దని సూచించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, వాటర్ బోర్డు, హైడ్రా అధికారులు పాల్గోన్నారు.  

బ్యాగ్ నిండా ప్లాస్టిక్ కవర్లే... కట్ చేస్తే అధికారుల చేతికి చిక్కిన యువకుడు

  ఓ యువకుడు టిక్ టాక్ గా తయారు అయ్యి... తన లగేజ్ తీసుకొని... బ్యాంకాక్ నుండి ఢిల్లీకి విమానంలో బయలుదేరాడు. అనంతరం సదరు యువకుడు ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగి నడుచుకుంటూ వెళుతున్న సమ యంలో కస్టమ్స్ అధికారులు అతని లగేజ్ను చెక్ చేసి... ఒక్కసారిగా ఆశ్చర్య చకితు లయ్యారు. బ్యాగ్ నిండా కవర్లు వాటిని విప్పి చూసిన అధికా రులు నూరేళ్లు పెట్టారు.  అధికా రులు వెంటనే అప్రమత్తమై యువకుడ్ని అదుపులోకి తీసుకున్నారు... ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఓ యువకుడు ఫ్లైట్ దిగి నడుచుకుంటూ వెళ్తున్న సమయం లో కస్టమ్స్ అధికారులకు అతని కదలికలపై అనుమా నం వచ్చి.... అతని బ్యాగ్ తనిఖీలు చేశారు... కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం కలగకుండా గంజాయిని ప్లాస్టిక్ కవర్స్ లలో ప్యాకింగ్ చేసి... వాటిని లగేజ్ బ్యాగ్ అడుగు భాగంలో పెట్టి... దాని పైన దుస్తులు పెట్టుకుని వచ్చాడు. ప్లాస్టిక్ కవర్స్లలో ఉన్న ప్యాకేజీలను తెరిచి చూసిన అధికా రులు ఒక్క సారిగా షాక్ గురయ్యారు.  వీడు మామూలోడు కాదురా బాబోయ్.. ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు ఏకంగా 20కోట్లు విలువ చేసే గంజా యిని... ప్లాస్టిక్ కవర్లో ప్యాకింగ్ చేసి దర్జాగా తీసుకెళ్తు న్నాడు.అధికారులు వెంటనే ఆ యువ కుడ్ని అదుపులోకి తీసుకొని అతని వద్దనున్న 20 కోట్ల విలువచేసే 19.87 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని యువకుడిపై ఎన్డీపీ ఎస్ ఆక్ట్ కింద కేసు నమోదు చేసు కొని...  అసలు ఈ గంజాయి ఎక్కడి నుండి తీసుకొస్తు న్నాడు. ఢిల్లీలో ఎవరికి ఈ గంజాయి చేరవేయనున్నాడనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు

శ్రీశైలం ఘాట్ రోడ్డులో ట్రాఫిక్ జామ్‌పై డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ

  నంద్యాల జిల్లా శ్రీశైలం హైదరాబాద్ ఘాట్ రోడ్డులో భక్తులు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు పడకుండా త్వరితగతిన శ్రీశైలం వచ్చి దర్శనం చేసుకుని ట్రాఫిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు తిరిగి గమ్య స్థలాలకు  వెళ్లే విధంగా ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాతో పోలీసుల పర్యవేక్షణ చేపట్టారు . నంద్యాల జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా ఆదేశాలతో టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ జామ్ పై డ్రోన్ కెమెరాలతో శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు  ఆధ్వర్యంలో పర్యవేక్షించారు.   వరుస సెలవులు రావడంతో శ్రీశైలం హైదరాబాద్ రహదారిపై ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా సి ఐ చంద్రబాబు  ప్రత్యేక చర్యలు చేపట్టారు. డ్రోన్ కెమెరాతో శ్రీశైలం హైదరాబాద్ డ్యామ్ పరిసరాలను ఎక్కడైనా ట్రాఫిక్ జామ్ అయిందా రోడ్డుకు ఇరువైపులా వాహనాలు నిలిపి ట్రాఫిక్ జామ్ కు ఏమైనా అవుతుందా అని మొబైల్ పార్టీని అనుసంధానం చేస్తూ శ్రీశైలం టూ టౌన్ సీఐ చంద్రబాబు ఆధ్వర్యంలో ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.