సుప్రీంలో అమరావతి కేసుల విచారణ.. జగన్ సర్కార్ లో టెన్షన్

ఏపీకి ఏకైక రాజధానిగా అమరావతిని మాత్రమే కొనసాగించాలని సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం  (మార్చి 28) విచారించనుంది. రాజధాని తరలింపును ఆపాలని గతంలో ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి విదితమే. ఈ తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్, అలాగే  స్టే ఇవ్వొద్దనీ, హైకోర్టు తీర్పునే అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని  కోరుతూ అమరావతి రైతులు దాఖలు చేసిన పిటిషన్ లను కూడా  జస్టిస్‌ జోసెఫ్‌, జస్టిస్‌ నాగరత్నలతో కూడిన సుప్రీం కోర్టు  ధర్మాసనం విచారించనుంది. కాగా అమరావతి కేసుల విచారణ త్వరిత గతిన పూర్తి చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ గతంలో చేసిన విజ్ణప్తిని అప్పట్లో సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.     గతంలో నిర్ణయించిన తేదీనే అంటే మార్చి 28నే అమరావతి పిటిషన్ల విచారణ చేపడతామని స్పష్టం చేసింది.    అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని జగన్ సర్కార్ పదేపదే సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతోంది. ఆ క్రమంలోనే ఈ నెల  2న ఇదే అంశాన్ని  న్యాయస్థానం ముందుకు తీసుకురాగా కోర్టు నిరాకరించింది. గతంలో చెప్పిని విధంగా ఈ నెల 28నే ఈ కేసు విచారణ చేపడతామని విస్పష్టంగా తేల్చి చెప్పింది.  హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా ప్రయత్నిస్తున్న జగన్ సర్కార్ కు మంగళవారం కోర్టు ఏం చెబుతుందన్న విషయంలో టెన్షన్ తప్పడం లేదు.  ఇలా ఉండగా  మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం  ఇప్పటికే  స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా.    

మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్ సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం

మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీఆర్ఎస్ సభ్యలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. బీఆర్ఎస్ సభ్యులు నామా నాగేశ్వరరావు, మాలోతు కవిత ఈ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. ప్రస్తుత సమావేశాలలోనే మహాళా రిజర్వేషన్ బిల్లును సభలో ప్రవేశ పెట్టాలని కోరారు. అలాగే మహిళా రిజర్వేషన్ బిల్లుపై చర్చించేందుకు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని వారు కోరారు. కాగా ఇటీవలే ఢిల్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మహిళా రిజర్వేషన్ల బిల్లు కోసం హస్తినలో దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ల కోసం పోరును ఉధృతం చేయడంలో భాగంగా ఆమె త్వరలో దేశంలోని వర్సిటీలు, కాలేజీలలో రౌండ్ టేబుల్ సమావేశాలకు ప్రణాళిక రూపొందించారు. అలాగే మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు కోరుతూ విద్యావేత్తలు, మేధావులకు కవిత పోస్టు కార్డులు రాశారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే మహిళా బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని కవితతో పాటు పలు పార్టీల నేతలు డిమాండ్ చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం విస్మరించినందున ఆందోళనని మరింత తీవ్ర రూపం చేయాలని నిర్ణయించారు.  ఈ నేపథ్యంలోనే లోక్ సభలో బీఆర్ఎస్ మహిళా రిజర్వేషన్ బిల్లుపై వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పట్టింది. 

జైలు శిక్ష పడినా బీజేపీ ఎమ్మెల్యేలు సేఫ్.. వారికి అనర్హత అంటదు!

మోడీ ఇండిపేరు పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సూరత్ కోర్టు ఇలా జైలు శిక్ష విధించిందో లేదో అలా ఆయనపై లోక్ సభ సెక్రటేరియెట్ అనర్హత వేటు వేసింది. అయితే ఈ చర్య.. కేంద్రంలోని బీజేపీ సర్కార్ స్వపక్షీయుల విషయంలో ఒకలా, విపక్షీయుల విషయంలో మరోలా వ్యవహరిస్తోందంటూ ఇంత కాలంగా వస్తున్న విమర్శలకు బలం చేకూర్చింది. బీజేపీ పాలిత రాష్ట్రం అయిన కర్నాటకలో ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలకు కోర్టులు జైలు శిక్షలు విధించినా, అలా విధించి రెండు నెలల దూటుతున్నా.. ఇంత వరకూ వారిపై అనర్హత వేటు పడలేదు. రూ.50లక్షల అవినీతి కేసులో నేరం రుజువై బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ కు కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. అలాగే మరో బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామికి చెక్ బౌన్స్ కేసులో ప్రజాప్రతినిథుల ప్రత్యేక న్యాయస్థానం నాలుగేళ్ల జైలు శిక్ష విధించింది. వీరిద్దరికీ కోర్టుల్లో జైలు శిక్ష పడినప్పటికీ అసెంబ్లీలో వీరి సభ్యత్వం మాత్రం పదిలంగానే ఉంది. అంతే కాదు.. ఏదైనా కేసులో రెండేళ్లు, అంతకు మించి జైలు శిక్షకు గురైన వారు ఎన్నికలలో పోటీ చేయకుండా ఆటోమేటిగ్గా వారిపై అనర్హత వేటు పడుతుంది. కానీ కర్నాటక బీజేపీ ఎమ్మెల్యేలకు మాత్రం అవేమీ వర్తించడం లేదు.  వీరిద్దరికీ జైలు శిక్ష పడినప్పటికీ వారి శాసనసభ సభ్యత్వాలను ఇంతవరకు రద్దు చేయలేదు. ప్రస్తుతం బెయిల్ పైన ఉన్న వీరిద్దరూ   కర్నాటక అసెంబ్లీకి త్వరలో జరగనున్న ఎన్నికలలో పోటీ చేయడానికి వారు అప్పుడే సన్నాహాలు కూడా మొదలెట్టేశారు.  ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రెండేళ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలుశిక్ష పడిన వ్యక్తి తీర్పు వెలువడిన తేదీ నుంచి రాజ్యంగ పదవుల్లో ఉండటానికి గానీ లేదా ఎన్నికల్లో పోటీ చేయడానికి గానీ వీల్లేదు.  పై కోర్టుకు వెళ్లడానికి కోర్టు అవకాశం  ఇచ్చినా, ఆయన అనర్హుడే అవుతారు. రాహుల్ విషయంలో బీజేపీ చెబుతున్న మాటలివి. మరి ఇవే మాటలు.. రాహుల్ లాగే శిక్ష పడి దర్జాగా ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్న బీజేపీ వారికి వర్తించదా అని కాంగ్రెస్ సహా విపక్షాలు నిలదీస్తున్నాయి.   

నకిలీ సర్టిఫికెట్ తో లా అడ్మిషన్.. స్పీకర్ తమ్మినేనిపై రాష్ట్రపతికి కూన ఫిర్యాదు

తమ్మినేని నకిలీ  సర్టిఫికెట్‌తో లా అడ్మిషన్ తీసుకున్నారంటూ రాష్ట్రపతికి తెలుగుదేశం ఎమ్మెల్యే కూన రవికుమార్ ఫిర్యాదు చేశారు.  తాను డిగ్రీ చదవలేదంటూ తమ్మినేనే స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పారని ఆ ఫిర్యాదులో కూన పేర్కొన్నారు. ఎన్నికల అఫిడవిట్ లో కూడా తమ్మినేని డిగ్రీ చదవలేదనే పేర్కొన్నారన్న కూన ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆ ఫిర్యాదులో  కోరారు. అలాగే ఇదే విషయంపై    ఏపీ, తెలంగాణ గవర్నర్లు, ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సీఎం జగన్‌..కు లేఖలు రాశారు.  తమ్మినేని సీతారాం స్పీకర్ అయిన తర్వాత హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని మహాత్మాగాంధీ లా కళాశాలలో 2019-20లో నకిలీ డిగ్రీ సర్టిఫికెట్‌తో అడ్మిషన్ తీసుకున్నారని లేఖలో పేర్కొన్నారు. లా కోర్సులో చేరాలంటే డిగ్రీ, లేదంటే అందుకు సమానమైన కోర్సు పూర్తి చేసి ఉండాలని, కానీ తమ్మినేని డిగ్రీ కానీ, అలాంటి మరే కోర్సు కానీ చదవలేదని అన్నారు. ఈ విషయాన్ని ఆయనే గతంలో ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ్మినేని స్వయంగా పేర్కొన్నారని కూన గుర్తు చేశారు. అంతేకాదు, 2019 సాధారణ ఎన్నికల  సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లోనూ  తన అత్యున్నత విద్యార్హత ఇంటర్మీడియెట్ మాత్రమేనని, శ్రీకాకుళంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఏ చదువుతూ మధ్యలోనే మానేశానని ఆయన స్వయంగా వెల్లడించిన విషయాన్ని కూన రవికుమార్ ఆ లేఖలో పేర్కొన్నారు. అలాగే, తమ్మినేని లా పరీక్షలకు హాజరైనట్టు వివిధ దినపత్రికల్లో వచ్చిన వార్తల క్లిప్పింగ్‌ను, ఎన్నికల అఫిడవిట్‌ను కూడా ఆయన ఆ లేఖలకు జత చేశారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా నకిలీ సర్టిఫికెట్లతో అడ్మిషన్ తీసుకోవడం సరికాదని, విలువలకు, నైతిక ప్రవర్తనకు కట్టుబడలేదని, కాబట్టి ఆయన శిక్షార్హుడని, తమ్మినేనిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా చట్టంముందు అందరూ సమానమేనని చాటిచెప్పాలని ఆయన ఆ లేఖలో కోరారు.

కథ కంచికేనా? సజ్జల ఇంటికేనా?

వైసీపీ.. ఆవిర్భావం నుంచీ ఆ పార్టీలో ఏదో హడావుడి. విపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడూ కూడా ఏదో అలజడి. గందరగోళం. తమ అధినేతకు వ్యతిరేకంగా ప్రపంచం అంతా ఏకమైపోయి ఏదో చేసేయడానికి ప్రయత్నిస్తోందన్న ఆందోళన కనిపిస్తూనే వస్తోంది. ఇప్పుడు నాలుగేళ్లు అధికారంలో ఉన్న తరువాత కూడా వైసీపీపై ప్రజా వ్యతిరేకతకు తమ విధానాలు, తమ తప్పిదాలు కారణం కాదంటోంది. కోర్టుల్లో ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పులు వస్తే విపక్ష నేత మేనేజ్ చేశారంటుంది. సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలో క్రాస్ ఓటింగ్ చేస్తే విపక్షం కోట్లు కుమ్మరించి వారిని ప్రలోభ పెట్టిందంటుంది. అంతే కానీ ప్రజలలో, లేదా పార్టీలో జగన్ పట్ల వ్యతిరేకత పెరుగుతోందని అంగీకరించదు. ఆయనపై కుట్ర జరుగుతోందనే చెబుతుంది. అదలా ఉంచితే.. వైసీపీ అధినేత జగన్ ను తమ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్సే( ఎమ్మెల్యే కోటా, గ్యాడ్యుయేట్) ఎన్నికలలో ఓటమి ఉక్కపోతకు గురి చేస్తోంది. ఈ ఓటమితో ఇప్పటి వరకూ పడిపోతున్నది మంత్రులు, ఎమ్మెల్యేల గ్రాఫే అని చెప్పుకోవడానికి అవకాశం లేకుండా చేసింది. ఇప్పుడు పార్టీ వ్యూహాత్మకంగా నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఒక పథకం ప్రకారం పార్టీ ప్రస్తుత పరిస్థితికి, పార్టీలో అసంతృప్తికీ, ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమికీ, ఇంకా ఏమైనా ఉంటే అన్నిటికీ సజ్జలే కారణమన్న ప్రచారం పార్టీ శ్రేణుల్లో వ్యూహాత్మకంగా మొదలైంది. ఎందుకంటే..  సకల శాఖల మంత్రిగా  రాష్ట్రం మొత్తానికి సజ్జల చిరపరిచితుడే. పార్టీలో ఏం జరిగినా సజ్జల కనుసన్నలలోనే జరుగుతుంది. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకైనా ఉండేది సజ్జలే.  పార్టీ నిర్ణయాలైనా, ప్రభుత్వ నిర్ణయాలైనా  మంత్రులు, అధికారులు కాదు సజ్జలే మీడియా ముందుకు వచ్చి చెబుతారు. ఆఖరికి జగన్ కుటుంబంలో పరిణామాలపై వివరణ ఇచ్చినది కూడా సజ్జలే. షర్మిల కొత్త పార్టీ పెట్టిన సమయంలో కానీ, విజయమ్మ రాజీనామాపై స్పందించడం కానీ అన్నీ సజ్జలే చేశారు.  మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ శాఖల, నియోజకవర్గాల సమస్యల గురించి ముఖ్యమంత్రికి విన్నవించుకోవాలన్నా సజ్జల అనుమతి ఉండాల్సిందే. ప్రభుత్వం విడుదల చేసే జీవోల వెనుక ఉండేదీ సజ్జలే.  అసలు ఇదంతా ఎందుకు.. విపక్ష నేతగా పాదయాత్ర చేసిన సమయంలో వైపీసీ అధినేత జగన్ ప్రత్యక్షంగా ప్రజల ముందుకు వచ్చేవారు. వారు తమ సమస్యలపై నేను ఉన్నాను.. నేను విన్నాను అంటూ వారికి నేరుగా హామీలిచ్చే వారు, భరోసా ఇచ్చేవారు. అయితే అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ నోట నేను ఉన్నాను, నేను విన్నాను అన్న మాట రావడం లేదు. సజ్జల ఉన్నారు.. సజ్జల వింటారు అన్నట్లుగా పరిస్థితి మారిపోయిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక వైసీపీలో ప్రస్తుతం వెల్లువెత్తుతున్న అసంతృప్తికి  కారణం సజ్జలేన్న ప్రచారం పకడ్బందీగా మోదలైంది.  అంటే సకల శాఖల మంత్రిగా ప్రభుత్వ సలహాదారు సజ్జల పార్టీలో మంచికీ చెడుకీ కూడా కారణభూతుడిగా మారిపోయారు. స్పష్టంగా చెప్పాలంటే.. ఫేస్ ఆఫ్ వైసీపీ జగన్ అయితే ఫేట్ ఆఫ్ వైసీపీ సజ్జల అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. అందుకే గత ఏడాది ఏప్రిల్ లో జగన్ తన క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా వెల్లువెత్తిన అసంతృప్తి, అసమ్మతి నేరుగా జగన్ కు తాకకుండా సజ్జల దగ్గరే ఆగిపోయాయి. అప్పట్లో అయితే అసమ్మతి ఒక్కసారిగా ఎగసిపడి తాటాకు మంటలా ఆగిపోయింది. అయితే ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎమ్మెల్సీ ఎన్నికలలో పరాభవాలు, పార్టీ ఎమ్మెల్యేలలోనే వెల్లువెత్తుతున్న అసమ్మతి, అసంతృప్తి అలాగే సస్పెన్షన్ వేటుకు గురైన ఎమ్మెల్యేల ఆగ్రహం, ఆక్రోషం అంతా హు ఈజ్ సజ్జల..అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  సామాన్య జర్నలిస్టు అయిన సజ్జల ఇన్ని కోట్ల ఆస్తులెలా కూడబెట్టారంటూ ప్రశ్నిస్తున్నారు. క్రాస్ ఓటింగ్ కోసం కోట్లు చేతులు మారాయంటూ సజ్జల చేసిన విమర్శలు ఆయనకే బూమరాంగ్ అయ్యాయి.  ఆయనపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  ఈ నేపథ్యంలోనే సజ్జల వ్యూహాలకు అనుగుణంగానే ఇప్పటి దాకా జగన్ పాలన సాగిందన్న పరిస్థితి నుంచి, ఇప్పుడు పార్టీలో సజ్జలకు వ్యతిరేకంగా పకడ్బందీ వ్యూహాలు రూపుదిద్దుకుంటున్నట్లు వైసీపీ శ్రేణులే చెబుతున్నాయి. ప్రస్తుత క్లిష్ట పరిస్థితి నుంచి జగన్ బయటపడాలంటే.. సజ్జలపై వేటు వేడయమే మార్గమన్నట్లుగా వైసీపీ భావిస్తోంది. తొలి నుంచీ వైసీపీ వ్యూహాలు అలాగే ఉన్నాయి. మంచి అంతా జగన్ ఖాతాలో, తప్పులన్నీ వీలైతే విపక్షాల ఖాతాలో.. అది కుదరకపోతే పార్టీలోనే కీలకంగా ఉన్న వ్యక్తి మీదకు నెట్టేయడం. గతంలో విజయసాయి. పార్టీలో నంబర్ 2గా ఉన్న సమయంలో సర్వం ఆయనే అనేటట్లు ఉండేది పరిస్థితి. ఆ తరువాత విజయసాయి పరిస్థితి ఏలా మారిందో అందరికీ తెలుసు. విజయసాయి తరువాత ఆ స్థానంలోకి వచ్చిన సజ్జలపై ఇప్పుడు కత్తి వేలాడుతోందని అంటున్నారు. ఇటీవలి పరిణామాల తరువాత పార్టీ నేతలే మీడియా ముందుకు వచ్చి  తప్పు సజ్డలదేనని, సీఎం జగన్‌కు ఏమీ సంబంధం లేదంటూ ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆ ప్రచారం చాలా చాలా చిన్నగానే ఉన్నా.. రానున్న రోజులలో ఇది మరింత ఉధృతం అవుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.   సజ్జల తప్పుడు నిర్ణయాల కారణంగానే జగన్ పై విమర్శలు వస్తున్నాయన్నట్లుగా సీన్ క్రియేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.  ఇంత కాలంగా ప్రతిపక్షాలపై జరిగిన దాడులు, బనాయించిన కేసులు అన్నిటి వెనుకా ఉన్నది సజ్జలే అని ఎస్టాబ్లిష్ చేయడానికి రంగం సిద్ధమైంది. ఆ దిశగా ప్రచారమూ ఆరంభమైంది. అంతా సజ్జలే చేశారు. వైసీపీ ఫేస్ జగన్ దే అయినా, ప్రస్తుత పార్టీ ఫేట్ కు మాత్రం సజ్జలే కారణం అంటూ  వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి.   అన్నిటికీ మించి పార్టీ ప్రస్తుత పరిస్థితి నుంచి బయటకు రావాలంటే సజ్జలను బలి చేయడమే మార్గమన్న నిర్ణయానికి వైసీపీ వచ్చేసిందనీ, అది జరిగితేనే.. జగన్ తాను సజ్జలను నమ్మి మోసపోయానన్న నిజం తెలుసుకుని ఇప్పటి వరకూ జరిగిన తప్పిదాలను సరిదిద్దుకుంటారన్న అభిప్రాయాన్ని ప్రజలలో కలిగించే అవకాశం ఉందని పార్టీ ఒక నిర్ణయానికి  వచ్చేసిందని అంటున్నారు.   పార్టీ నుంచి సస్పెన్షన్ కు గురైన ఎమ్మెల్యేలు ఎలాగూ సజ్జలనే టార్గెట్ చేస్తున్నారు. పార్టీ కూడా అదే కంటిన్యూ చేస్తే... ఇక జగన్ పై పడిన మచ్చలన్నీ చెరిగిపోతాయన్నది వైసీపీ నేతల భావనగా కనిపిస్తోంది.   అయితే ఇదంతా పార్టీలో సజ్జల వ్యతిరేకుల వ్యూహమే అనుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఇప్పటికింకా పార్టీ మొత్తం సజ్జల గుప్పెట్లోనే ఉంది. సజ్జల వ్యతిరేకులు తమంతట తాముగా సజ్జలను విమర్శిస్తూ గళం విప్పే అవకాశం లేదు.  జగన్ స్వయంగా.. ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి   సజ్జలను టార్గెట్ చేయాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసి ఉంటారని పరిశీలకుల అంటున్నారు.  అన్నిటికీ మించి జగన్ కు తాను వినా పార్టీలో మరెవరూ గుర్తింపు పొందడానికి ఇష్టపడరని ఆయన నైజం తెలిసిన వారు అంటున్నారు. విజయసాయి రెడ్డి,   వైవీ సుబ్బారెడ్డి,  ఉమ్మారెడ్డి, మైసూరారెడ్డి, ఇలా పార్టీలో కీలకంగా వ్యవహరించిన ఎవరైనా ఆ తరువాత డమ్మీలుగా మారిపోయారని గుర్తు చేస్తున్నారు. ఇక ఇప్పుడు సజ్జల వంతు అని చెబుతున్నారు. వైసీపీలో సజ్జల కథ కంచికి చేరిందనీ, ఆయన ఇంటికి చేరడమే తరువాయనీ అంటున్నారు. 

మరో వివాదంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్

వివాదాలు ఆయన వెంట పడతాయో.. వివాదాల వెంట ఆయన పడతారో చెప్పలేం కానీ తెలంగాణ హైల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ మాత్రం నిత్యం వివాదాలతో వార్తలలో ఉంటారు.  గతంలో ఒక సారి  శ్రీనివాస్ రావు ఏసుక్రీస్తు దయతోనే దేశంలో కరోనా కేసులు తగ్గాయనీ, కరోనా నుంచి విముక్తి చెందామనీ చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలు వివాదాస్పద మయ్యాయి. ఆయన అలా  అని ఊరుకోలేదు.   క్రైస్తవం వల్లే దేశం అభివృద్ధి చెందిందన్నారు.ఆఫ్కోర్స్ అది ఆయన వ్యక్తి గత విశ్వాసం కావచ్చును. కానీ, ఆయన ఒక అధికారి, ఆవిషయం మరిచి పోయి చేసిన వ్యాఖ్య సహజంగానే అప్పట్లో దుమారం రేపింది. గత ఏడాది డిసెంబర్ లో  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో శ్రీనివాసరావు   ఈ వ్యాఖ్యలు చేశారు. అప్పట్లో ఆయన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. అంతే కాదు ప్రపంచానికి, అభివృద్ధి పాఠాలు నేర్పిందే క్రైస్తవ మతమని,    ప్రపంచం  అభివృద్ధి చెందడానికి క్రైస్తవులే కారణమని కూడా అన్నారు. అదే జోరులో  క్రైస్తవ మత ప్రచారానికి నడుంబిగించాలని కూడా సూచించారు.  నిజమే అప్పట్లో హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస రావు సెమీ క్రిస్మస్ వేడుకలలో తన   విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. అది కూడా వ్యక్తిగత హోదాలో హాజరైన సెమీ క్రిస్మస్ వేడుకల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అయితే, రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పోస్టులో ఉన్న ఆయన, తన విధుల్లో భాగమైన కరోనా మహమ్మారి కట్టడి జీసస్ క్రైస్ట్ దయవల్లే జరిగిందని చెప్పడం విమర్శలకు తావిచ్చింది.  నిజానికి  శ్రీనివాసరావు మత విశ్వాసాల గురించి పెద్దగా తెలియక పోయినా  ఆయన రాజకీయ ఆశలు, ఆకాంక్షల గురించి మాత్రం ఆయన తన చేష్టల ద్వారా అందరికీ తెలిసేలా వ్యవహరిస్తుండటంకద్దు. గతంలోనూ ఆయన పబ్లిక్ లో ముఖ్యమంత్రి కేసీఆర్  కాళ్లు మొక్కి, వివాదాస్పద అధికారిగా వార్తల్లోకి ఎక్కారు.  అదొక వివాదం అయితే కరోనా నుంచి విముక్తి పొందడానికి ఏసుక్రీస్తు దయే కారణమంటూ చేసిన వ్యాఖ్యలు మరో వివాదం. ఆయన వ్యాఖ్యలపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొన్నారు. అది సర్దుమణిగిందనుకునే లోగానే.. తాజాగా అయన రాష్ట్రంలో ఆదర్శవంతమైన ఎమ్మెల్యే అంటూ ఎవరైనా ఉంటే అది మంత్రి హరీష్ రావేనని అన్నారు. కొత్తగూడెంలోపర్యటించిన సందర్భంగా హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఒక విధమైన తన్మయత్వంతో మంత్రి హరీష్ పై ప్రశంసల వర్షం కురిపించారు. హరీష్ సిద్ధిపేటకు చేసిన దానిలో సగంపనులు చేసిన కొత్తగూడెం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు.  ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. ప్రభుత్వోద్యోగా, బీఆర్ఎస్ కార్యకర్తా అంటూ సామాజిక మాధ్యమంలో నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

జయహో ఎన్టీఆర్ వెబ్ సైట్, శకపురుషుడు సావనీర్.. చంద్రబాబుకు వివరించిన ఎన్టీఆర్ శతజయంతి కమిటీ

నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకల కమిటీ చైర్మన్ టి.డి. జనార్థన్ సారధ్యంలో ఆదివారం(మార్చి 26)  తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడితో ఆయన నివాసంలో బేటీ అయ్యింది. మహానటుడు, ప్రజానాయకుడు తెలుగువారి ఆరాధ్యుడు అయిన ఎన్.టి.ఆర్. శతజయంతి సంవత్సరంలో ఆయన తరతరాలకు గుర్తిండిపోయేలా జయహో ఎన్.టి.ఆర్. అన్న వెబ్ సైట్, శకపురుషుడు అనే ప్రత్యేక సంచికతో పాటు ఎన్.టి.ఆర్. శాసనసభలో చేసిన ప్రసంగాలు, చారిత్రక ప్రసంగాలతో రెండు పుస్తకాలను తీసుకొస్తున్నామని టీడీ జనార్ధన్ చంద్రబాబు నాయుడికి  వివరించారు.   శత జయంతి వేడుకలలో భాగంగా ఎన్.టి.ఆర్. ప్రసంగాలతో వెలువడే రెండు పుస్తకాలను విజయవాడలో ఆవిష్కరిస్తామని, వెబ్ సైట్,  శకపురుషుడు సావనీర్ ను హైదరాబాదులో  విడుల చేస్తామని తెలిపారు.  ఈ రెండింటికీ సంబంధించిన  విశేషాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా  వివరించారు.  గత ఐదు నెలలుగా ఎన్.టి.ఆర్. శతజయంతి కమిటీ శ్రమిస్తున్నదని,  సినిమా రంగంలోని ప్రముఖులు మరియు రాజకీయరంగంలోని నిష్ణాతుల అభిప్రాయాలను వీడియో/వ్యాస రూపంలో తీసుకున్నామనీ,  ఎన్.టి.ఆర్.ను తరతరాలు గుర్తుంచుకునే దిశగా వీటిని రూపకల్పన చేస్తున్నామని   జనార్థన్ ఈ సందర్భంగా చంద్రబాబుకు తెలిపారు.   ఎన్.టి. రామారావు  నటుడుగా, రాజకీయ నాయకుడుగా అనూహ్య విజయాలను సాధించి మార్గదర్శకుడిగా మిగిలారని అటువంటి నాయకుడిపై జనార్థన్ సారథ్యంలో కమిటీ చేస్తున్న కృష్టి అభినందనీయమని చంద్రబాబు అన్నారు.  ఈ కమిటీ చేస్తున్న అవిరళ కృషికి తమ మద్దతు ఉంటుందన్నారు.  హైదరాబాద్, విజయవాడ రెండు ప్రాంతాలలో ఏర్పాటు చేసే కార్యక్రమాలు విజయవంతం కావటానికి కావలసిన సంపూర్ణ మద్దతు అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. టి.డి. జనార్థన్ అధ్యక్షతన రావుల చంద్రశేఖర్ రెడ్డి, కాట్రగడ్డ ప్రసాద్, కంఠంనేని రవిశంకర్, విక్రమ్ పూల, భగీరథ, అట్లూరి నారాయణరావు, డి. రామ్ మోహన్ రావు,  మండవ సతీష్, కె. రఘురామ్, శ్రీపతి సతీష్, మధుసూదన రాజు, విజయ్ భాస్కర్, గౌతమ్ బొప్పన కమిటీ సభ్యులు చంద్రబాబునాయుడిని కలిసిన వారిలో ఉన్నారు. 

నైన్త్ స్టాండర్డ్ ప్రశ్నపత్రంలో కోహ్లీపై ప్రశ్న!

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీపై తొమ్మదో తరగతి ప్రశ్నపత్రంలో ఒక ప్రశ్న పొందుపరిచారు. టీమ్ ఇండాయా మాజీ కెప్టెన్, పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. భారత దేశంలో ఒక మతం లాంటి క్రికెట్ లో మకుటం లేని రారాజులా వెలుగొందుతున్నకోహ్లీ  ఇప్పటి వరకు ఎన్నో రికార్డులు సాధించాడు.   విద్యార్థులకు క్రీడల పట్ల ఉన్న ఆసక్తి, అవగాహనపై తొమ్మిదో తరగతి పశ్నపత్రంలో కోహ్లీపై ఒక ప్రశ్న ఇచ్చారు.   ఆసియాకప్ లో ఆప్ఘనిస్థాన్ జట్టుపై విరాట్ కోహ్లీ సెంచరీ సాధించాడు. అందుకు సంబంధించి 100-120 పదాల్లో వ్యాసం రాయాలన్నదే ఆ ప్రశ్న. ఈ ప్రశ్నాపత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కవిత పిటిషన్ విచారణ మూడు వారాలు వాయిదా!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారణ మూడు వారాలకు వాయిదా పడింది. ఈడీ సమన్లు రద్దు చేయాలని, మహిళలను ఇంటి వద్దే విచారించాలని, తనకు వ్యతిరేకంగా ఈడీ ఎలాంటి (అరెస్ట్ లాంటి) చర్యలు తీసుకోవద్దని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేయగా,  తమను సంప్రదించకుండా ఆదేశాలు ఇవ్వొద్దని కోరుతూ  ఈడీ కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి విదితమే . కవిత పిటిషన్ విచారణ ఈ రోజు సుప్రీంలో జరిగింది. ఆ సందర్భంగా  ఢిల్లీ లిక్కర్ కుంభకోణం  కేసు విచారణను ఈడీతో కాకుండా..  కోర్టు పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి, విచారణ జరపాలని కోరారు. కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, విక్రమ్ చౌధురి వాదనలు వినిపించగా,  ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్  వాదనలు వినిపించారు.  ఒక మహిళగా తనకు ఉన్న హక్కులను ఈడీ కాలరాస్తోందని పిటిషన్   ఆరోపించిన కవిత  తనను  తమ ఇంటి వద్ద లేదా.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలని కోరారు.    సీఆర్పీసీ సెక్షన్ 160ని ఉల్లంఘించి.. తనని ఈడీ కార్యాలయానికి పిలిచి విచారిస్తున్నారని పేర్కొన్నారు. విచారణ సందర్భంగా ఈడీ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని వాపోయారు. న్యాయవాదుల సమక్షంలో, సీసీ టీవీ కెమెరాల ఎదుట విచారణ చేపట్టేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.  మహిళలను ఈడీ ఆఫీసుకు పిలిచి విచారణ జరిపే విషయంలో గతంలో నళినీ చిదంబరం పిటిషన్ దాఖలు చేశారు. ఇదే విషయంలో కవిత వేసిన పిటిషన్ ను, నళిని వేసిన పిటిషన్ కు కోర్టు ట్యాగ్ చేసింది. తర్వాతి హియరింగ్ లో రెండు పిటిషన్లను కలిపి విచారించే అవకాశం ఉందని అంటున్నారు. 

వివేకా హత్యకేసు సాగదీత ఇంకెంత కాలం.. సుప్రీం

వివేకా హత్య కేసు దర్యాప్తులో జాప్యంపై సుప్రీం కోర్టు సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసును ఇంకెంత కాలం సాగదీస్తారని ప్రశ్నించింది. కేసు మొత్తం రాజకీయ దురుద్దేశంతో కూడినదేనంటూ రిపోర్టు రాశారంటూ పేర్కొన్న సుప్రీం కోర్టు, హత్యకు ప్రధాన కారణాలు, ఉద్దేశాలు బయటపెట్టాలని ఆదేశించింది. అంతే కాకుండా అవసరమైతే విచారణాధికారిని మార్చండి, మరో అధికారిని నియమించండి అని పేర్కొంది. అయితే ఇప్పుడు ఉన్న అధికారిని మార్చాలన్నది తమ ఉద్దేశం కాదనీ, ఆయనా కొనసాగుతారనీ పేర్కొంది. సీబీఐ ఇచ్చిన సీల్డ్ కవర్ నివేదిక మొత్తం చదివామని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం ఆ నివేదిక ఆధారంగా ఉత్తర్వులు ఇవ్వబోమని స్పష్టం చేసింది. కేసు దర్యాప్తు వేగవంతం విషయంలో సీబీఐ డైరెక్టర్ నుంచి ఆదేశాలు తీసుకోవాలని ఆదేశిస్తే ఈ నెల 29కి విచారణను వాయిదా వేసింది.  

జగన్ పై వాళ్లకీ నమ్మకం పోయిదా?

వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్‌పై  ఆయన సొంత సామాజిక వర్గమే నమ్మకం  కోల్పోయిందా?   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో చోటు చేసుకున్న పరిణామాలే అందుకు సాక్ష్యమా అంటే రాజకీయ వర్గాల నుంచి ఔననే సమాధానం వస్తోంది.    నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారంటూ వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురిలో ముగ్గురు జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావడమే ఇందుకు సాక్ష్యమంటున్నారు. అసలు గత ఎన్నికలలో నెల్లూరు జిల్లా వైపీపీకి పదికి పది అసెంబ్లీ స్థానాలనూ కట్టబెట్టింది. ఇప్పుడు ఆ జిల్లాకే చెందిన ముగ్గురు కీలక పెద్దా రెడ్లనే పార్టీకి వ్యతిరేకంగా క్రాస్ ఓటింగ్ కు పల్పడ్డారంటూ జగన్ సస్పెండ్ చేశారు.   క్రాస్ ఓటింగ్‌కు పాల్పడిన ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు జగన్ సొంత సామాజిక వర్గానికి చెందిన వారే కావడం గమనార్హం. అయితే సస్పెన్షన్ కు గురైన ముగ్గురు పెద్దా రెడ్లూ కూడా తాము క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదనే అంటున్నారు. అదే సమయంలో తమపై విశ్వాసం ఉంచని జగన్ పై విమర్శలు సైతం గుప్పిస్తున్నారు. ఈ ముగ్గురిలో ఇద్దరు ఆనం రామనారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి అయితే  గత కొంత కాలం నుంచీ సొంత పార్టీపై విమర్శలు గుప్పిస్తున్నవారే. ఇక మూడో ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి అయితే ఇంత కాలంగా పార్టీని అంటిపెట్టుకునే ఉన్నారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడలేదని అంటున్నారు. అసలు వైసీపీ మరీ ముఖ్యంగా సకల శాఖల మంత్రి సజ్జలకు తాను క్రాస్ ఓటింగ్ కు పాల్పడినట్లు ఎలా తెలిసిందంటున్నారు. ఏకపక్షంగా తనపై నింద మోపి పార్టీ నుంచి సస్పెండ్ చేశారంటూనే.. తన సస్పెన్షన్ పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తానిప్పుడు ఫ్రీ బర్డ్ నని మేకపాటి వ్యాఖ్యానించారు.  అదలా ఉంచితే.. అయితే గత ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. అలాంటి జిల్లాలో ఇలాంటి పరిస్థితులు నెలకొనడానికి కారణం జగన్ తీరేనని పార్టీ వర్గాలలోనే చర్చ జరుగుతోంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి వీస్తున్న ఎదురుగాలికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019లో పార్టీలకు అతీతంగా జగన్ సామాజిక వర్గం మొత్తం వైసీపీకి మద్దతు పలికిందనీ, ఇప్పుడు అదే సమాజిక వర్గంపార్టీలకు అతీతంగా ఆయనకు వ్యతిరేకంగా మారుతోందని అంటున్నారు.   ఒక్క ఉమ్మడి నెల్లూరు జిల్లా అనే కాదు.. జగన్ సామాజిక వర్గానికి చెంది ప్రభుత్వ తీరుపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న వారి సంఖ్య   ఉమ్మడి కడప జిల్లా నుంచి మొదలు  అనంతపురం, కర్నూలు, చిత్తూరు,  ప్రకాశం జిల్లాల్లో కూడా ఘనంగానే ఉందని పార్టీ వర్గాలే అంటున్నాయి.   ఇంకోవైపు  జగన్‌ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఒక సామాజిక వర్గాన్ని  లక్ష్యంగా చేసుకొన్నారనీ,  ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి అంటూ ప్రతిపక్ష నేతగా మద్దతు ప్రకటించిన ఆయనే స్వయంగా   అధికారం చేపట్టిన తరువాత మాటమార్చి, మడమతిప్పి మూడు రాజధానులంటూ ప్రకటించిన విషయాన్నిపరిశీలకులు గుర్తు చేస్తున్నారు. 

చివరకు మిగిలేది ఆ నలుగురేనా?

జగన్ చేతులు కాలాయి. పట్టుకుందామనుకున్న ఆకులు దొరకడం లేదు. జగన్ కు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో మొదలైన పరాభవం, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల వరకూ కొనసాగిందనీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో కూడా ఇదే పరిస్థితి ఎదురౌతుందన్న విశ్లేషణల నేపథ్యంలో గతనాలుగేళ్లుగా తిరుగులేని విజయాలు సాధిస్తూ వస్తున్నజగన్ పార్టీ ఈ వరుస పరాభవాలను జీర్ణించుకోలేకపోతోంది. బయటకు ఎమ్మెల్సీ ఎన్నికలతోనే పార్టీలో జగన్ కు వ్యతిరేకత ఆరంభమైనట్లు కనిపిస్తున్నా.. వాస్తవానికి ఏడాదికి ముందే పార్టీపై జగన్  పట్టు సడలడం ఆరంభమైందని పరిశీలకులువిశ్లేషిస్తున్నారు.   ముఖ్యమంత్రిగా అధికారాలు చేపట్టి కేబినెట్ ఏర్పాటు చేసిన సమయంలోనే జగన్ తన కేబినెట్ లో మంత్రులు కేవలం రెండున్నర సంవత్సరాలు మాత్రమే పదవులలో ఉంటారనీ, రెండున్నరేళ్ల తరువాత కేబినెట్ ను సమూలంగా మార్చేసి కొత్తవారికి అవకాశం ఇస్తారనీ ప్రకటించారు. అప్పట్లో ఈ ప్రకటనను అందరూ స్వాగతించారు. సాహసోపేత చర్యగా అభివర్ణించారు. ఇలా చేయడం వల్ల   మంత్రుల బాధ్యతతో పని చేయడమే కాకుండా, ఎమ్మెల్యేలు కూడా ప్రజా సేవపై దృష్టి పెడతారనీ అంతా భావించారు. అయితే జగన్ తాను చెప్పినట్లుగా రెండున్నరేళ్లకు కేబినెట్ ను సమూలంగా మార్చలేదు. మూడేళ్ల తరువాత ఆయన చేసినది మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ మాత్రమే. అంటే తొలి కేబినెట్ లో ఉన్నవారిలో కొందరికి ఉద్వాసన పలికి మరి కొందరిని చేర్చుకున్నారు. అంతే దానికి కూడా భయం భయంగా ఎవరిని మారిస్తే ఏం సమస్య వస్తుందో అని ఒకటికి పది సార్లు కసరత్తులు చేసి నిర్ణయాలను పదే పదే మార్చుకున్నారు. ఇంత చేసినా అప్పట్లో అసమ్మతి భగ్గుమంది.  నెలల తరబడి అసమ్మతి కొనసాగింది. మూడేళ్లుగా జగన్ మాటే వేదం అన్నట్లుగా ఇచ్చిన బిల్డప్ అంతా పేకమేడే అని తేలిపోయింది.  ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో జగన్ ఎంతగా గుప్పెట మూసి ఉంచినా ఆ వేళ్ల సందులోంచి పార్టీ ప్రతిష్ట జారిపోయిందన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇప్పుడు మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీల్లో పరాజయం గట్టి షాక్ ఇస్తే.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓ స్థానం కోల్పోవడం అదీ కూడా సొంత ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం వైసీపీకి కోలుకోలేని షాక్ గా చెప్పవచ్చు.  ఇక రాజకీయ వర్గాలలో అయితే ఇక వైసీపీ జారుడు బండ మీద బ్యాలెన్సింగ్ కు చేస్తున్న ప్రయత్నంగానే చర్చ జరుగుతోంది. జారుడు బండ మీద బ్యాలెన్సింగ్ అంటే జారి పడటంగానే వారు అభివర్ణిస్తున్నారు.  అంతే కాకుండా  జగన్ పార్టీకి రాజకీయ పతనం ఆరంభంగానే చెబుతున్నారు.  నాలుగేళ్లలోనే పార్టీ పరిస్థితి ఇలా దిగజారడానికి జగన్ రెడ్డి వ్యవహార శైలే కారణమని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్న చందంగా ఈ నాలుగేళ్లూ ప్రభుత్వాన్ని నడిపిన తీరే ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న పరిస్థితికి కారణమని చెబుతున్నారు.  ఇక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక సీటు కోల్పోవడానికి సొంత పార్టీ ఎమ్మెల్యేలు గీత దాటడమే కారణమని జగన్ పార్టీ చెప్పడాన్ని కూడా పరిశీలకులు తప్పుపడుతున్నారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలపై నమ్మకం ఉంచకుండా తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన వారిని నమ్ముకోవడం కంటే దివాళా కోరుతనం ఏముంటుందని ప్రశ్నిస్తున్నారు. మరో వైపు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ నలుగురిని వైసీపీ సస్పెండ్ చేసింది. ఆ నలుగురూ తాము క్రాస్ వోటింగ్ కు పాల్పడలేదని మీడియా ముందుకు వచ్చి బల్లగుద్ది మరీ చెబుతున్నారు. అదే సమయంలో తెలుగుదేశం అధినేత తమ విజయానికి క్రాస్ ఓటింగ్ ఎంత మాత్రం కారణం కాదని చెబుతున్నారు. తమ పార్టీ టికెట్ పై గెలిచిన ఎమ్మెల్యేలు అందరూ పంచుమర్తి అనూరాథకే ఓటు వేశారనీ, అందుకే ఆమె 23తో విజయం సాధించిందనీ చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా.. తెలుగుదేశం నుంచి గెలిచి.. వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న నలుగురు ఎమ్మెల్యేలూ తాము వైసీపీ అభ్యర్థికే ఓటు వేశామన్న మాట చెప్పడం లేదు. అటువంటప్పుడు వైసీపీ అధినేత తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని ఎలా నిర్ధారించగలరని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. వైసీపీలో అసంతృప్త ఎమ్మెల్యేలు కట్టు దాటకుండా ఉండటానికి జగన్ పకడ్బందీ చర్యలే తీసుకున్నారు. అసంతృప్తులను గుర్తించి వారని ప్రత్యేకంగా పిలిపించుకుని మాట్లాడారు. బుజ్జగించారు. వారి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకున్నారు.  ఇంత చేసినా జగన్ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని చెబుతున్నారు. అంటే స్వయంగా పార్టీ అధినేత పిలిచి మాట్లాడినా, బుజ్జగించినా, వారు లేవనెత్తిన సమస్యలను పరిష్కరించినా.. వినకుండా క్రాస్ ఓటింగ్ కు పాల్పడటమంటే.. ఆయన మాట చెల్లుబాటు కాకపోవడమే. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే జగన్ మాట పార్టీలో చెల్లుబాటు కావడం లేదంటే.. ముందు ముందు ధిక్కార స్వరాలు మరిన్ని ఉంటాయనడానికి సంకేతంగానే చూడాల్సి ఉంటుంది. నలుగురు ఎమ్మెల్యేల సస్పెన్షన్ ద్వారా పార్టీలో  ఉన్న అసమ్మతిని చల్లార్చాలని ప్రయత్నించడమంటే.. ఉన్న మంటపై నీళ్లకు బదులు పెట్రోలు పోయడమే అవుతుందని పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఇప్పటికే పలువురికి టికెట్లు ఉండవు అని మీటింగ్ లు పెట్టి మరీ ప్రకటించిన జగన్ ఇప్పుడు ఏ హామీ ఇచ్చి వారిని సముదాయించగలరని అంటున్నారు.   ఏది ఏమైనా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ కు ఎదురైన పరాభవం పార్టీపై సడలిన ఆయన పట్టుకు సంకేతంగానే పరిశీలకులు అభివర్ణిస్తున్నారు. ముందు ముందు ఆ పట్టు మరింత సడలుతుందనీ, సొంత పార్టీ ఎమ్మెల్యేలను నమ్మకుండా బటయ నుంచి వచ్చిన వారినే దగ్గరకు చేర్చుకుంటున్న ఆయన తీరు కారణంగా భవిష్యత్ లో ఆ బయటి వారు మాత్రమే మిగిలే పరిస్థితి వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. 

సస్పెన్షన్ వ్యూహం బూమరాంగ్ అయినట్లేనా?

క్రాస్ ఓటింగ్ చేశారని నలుగురు ఎమ్మెల్యేల్ని వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ సస్పెండ్ చేసింది. వారిపై అనర్హతా వేటు వేస్తారన్న చర్చ కూడా ప్రారంభమయింది.  అసలు అనర్హత వేటు వేయకుండా కేవలం సస్పెండ్ చేసి ప్రయోజనమేముందన్న వాదనా వినవస్తోంది. అనర్హత వేటు వేయకుండా కేవలం సస్పెండ్ చేయడం వల్ల ఎమ్మెల్యేలకు వచ్చే ఇబ్బందేమీ ఉండదన్న వాదన గట్టిగా వినిపిస్తోంది. కేవలం సస్పెన్షన్ తోనే వదిలేస్తే.. పార్టీని ధిక్కరించి సస్పెన్షన్ వేటు వేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెడీ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, పార్టీని ధిక్కరించడానికి ఇసుమంతైనా వెనుకాడకుండా ముందుకు వచ్చేవారి సంఖ్య పెద్దగానే ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సస్పెండైన నలుగురిపైనా అనర్హత వేటు వేయడానికి అవసరమైన ప్రక్రియపై హై కమాండ్ దృష్టి పెట్టిందని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  అయితే ఇక్కడే రాజ్యాంగ నిపుణులు పార్టీ నుంచి సస్పెండ్ అయితే చేయగలరు కానీ, క్రాస్ వోటింగ్ పేరు చెప్పి వారిపై అనర్హత వేటు వేసే అవకాశాలైతే లేవని అంటున్నారు. క్రాస్ వోటింగ్ పేరు చెప్పి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా..  పార్టీలో అసంతృప్తి ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య ఎక్కువ ఉందన్న వార్తలు వినవస్తున్న నేపథ్యంలో వారిని కట్టడి చేయడానికి మాత్రమేనని అంటున్నారు.   ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, ఆ తరువాత తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో ఒకేసారి ఒకే సారి ఒకే పార్టీకి చెందిన, అందులోనూ అధికార పార్టీకి చెందిన  నలుగురు శాసనసభ్యులు పార్టీ నుండి సస్పెండ్‌ కావడం ఇదే తొలిసారి.   ఇక ఇప్పుడు వైసీపీ సస్పెండ్ చేసిన నలుగురు ఎమ్మెల్యేలలో ఇద్దరు చాలా కాలం కిందటి నుంచే పార్టీ విధానాలను బహిరంగంగా వినిపిస్తూ వస్తున్నవారే. మరో ఇద్దరిని క్రాస్ ఓటింగ్ ఆరోపణలతో సస్పెండ్ చేస్తూ గతం నుంచీ పార్టీ లైన్ కు భిన్నంగా బహిరంగంగా మాట్లాడుతున్నవారిపై కూడా వైసీపీ వేటు వేసింది. ఇక సస్పెన్షన్ తరువాత  ఏమిటి? అనర్హత వేటు పడుతుందా? అంటే.. ఆ అవకాశాలు లేవనే చెబుతున్నారు రాజకీయ పరిశీలకులు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఎమ్మెల్యేపై కానీ ఎంపీపై కానీ అనర్హత వేటు వేయాలంటే వారు వేరే పార్టీలో చేరడమే, లేదా పార్టీ విప్ ను ధిక్కరించడమో చేయాలి.  ఇక్కడ ఇప్పుడు వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన వారెవరూ వేరే పార్టీలో చేరలేదు. ఇక రహస్య ఓటింగ్ లో విప్ ను ధిక్కరించారని తేల్చడానికి ఆధారాలు ఉండవు. అసెంబ్లీలో, లోక్ సభలో, రాజ్యసభలో బిల్లుల పైచర్చ సందర్భంగా జరిగే బహిరంగ ఓటింగ్ సందర్భంగా విప్ ధిక్కరించిన వారిని గుర్తించి అనర్హత వేటు వేయడానికి వీలు ఉంటుంది. అందుకే ఇప్పుడు పార్టీ నుంచి సస్పెండ్ చేసిన నలుగురూ డిస్ క్వాలిఫై అయ్యే అవకాశాలు లేవనే అంటున్నారు.  సో వైసీపీ నలుగురిని సస్పెండ్ చేసి  ఇంకా  అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్న పలువురిని పరోక్ష హెచ్చరిక జారీ చేసిందని భావించాల్సి ఉంటుంది. పార్టీ శ్రేణుల సమాచారం మేరకు  పాతిక మందికి పైగా అసంతృప్త ఎమ్మెల్యేల పేర్లతో ఐ ప్యాక్ ఒక జాబితాను జగన్ కు అందించిందని చెబుతున్నారు.   ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో మరో అభ్యర్థిని నిలబెట్టినా గెలిచి ఉండేవారమంటూ తెలుగుదేశం పేర్కొనడానికి కారణం కూడా అదేనని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే క్రాస్ ఓటింగ్ పేర నలుగురిని సస్పెండ్ చేసిన, డిస్ క్వాలిఫై చేస్తున్నామంటూ ప్రచారం చేయడం ద్వారా అసంతృప్తులకు గట్టి హెచ్చరిక పంపామని వైసీపీ భావిస్తోందని పరిశీలకులు అంటున్నారు. ఇలాంటి అనర్హతా వేటు ప్రచారంద ద్వారా కంట్రోల్ చేయాలనుకుంటున్నారనీ, అది సాధ్యమయ్యే పని కాదనీ అంటున్నారు. 

బీజేపీ తప్పులో కాలు?

లోక్‌సభలో రాహుల్ గాంధీ అనర్హత వేటు వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్ష పార్టీలు, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని, రాహుల్ గాంధీ నాయకత్వాన్ని వ్యతిరేకించే ,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ, ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రివాల్, తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  సహా అన్ని పార్టీలూ, అందరు నాయకులు ఖండిస్తున్నారు. ఇక కాంగ్రెస్, కాంగ్రెస్ మిత్ర పక్షాల సంగతి అయితే చెప్పనే అక్కరలేదు. నిజానికి ఈ పరిణామం, కాంగ్రెస్ అనుకూల, వ్యతిరేక విపక్షాలు అన్నిటినీ ఏకం చేసింది. తాత్కాలికంగా అయినా  ఏకతాటిపైకి   తీసుకువచ్చిందని బీజేపీ అనుకూల మీడియా, మేథావి వర్గాలు కూడా అంటున్నాయి. బీజేపీ తప్పులో కాలేసిందనే అభిప్రాయమే ఆ వర్గాల నుంచి వ్యక్తమౌతోంది.  ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించిన వ్యవసాయ చట్టాలు మొదలు, ప్రధాని మోడీ ప్రభుత్వం తీసుకున్న మరికొన్ని వివాదాస్పద నిర్ణయాలను చాలా గట్టిగా సమర్ధించిన లోక్ సత్తా నేత  జయ ప్రకాష్ నారాయణ్   సైతం ఈవిషయంలో మోడీ ప్రభుత్వాన్ని తప్పు పట్టారు. ప్రతి చిన్న విషయానికీ అనర్హతను అస్త్రంగా ఉపయోగిస్తే ప్రజాస్వామ్యం క్షీణించిపోతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.  రాహుల్‌ గాంధీకి పై కోర్టులలో అప్పీల్‌ చేసుకునే వెసులుబాటు ఉందని.. ఒకవేళ పై కోర్టులో శిక్షను తగ్గించినట్లయితే, అనర్హత వేటును వెనక్కి తీసుకునే అవకాశం ఉంటుందని జయప్రకాష్ నారాయణ వివరించారు. ఇలాంటి సందర్భంలో లోక్‌సభ అధికారులు రాహుల్‌పై వెంటనే అనర్హత వేటు వేయకుండా  కాస్త వేచి చూస్తే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే ఎన్నికల వ్యూహకర్త, ప్రశాంత్ కిషోర్ కూడా చాలా కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీకి, రాహుల్ గాంధీకి అనుకూలంగా స్పందించారు. ఒక పరువు నష్టం కేసులో రెండేళ్ల శిక్ష పడటం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అలాగే అధికార పక్షం కూడా కొంత పెద్ద మనసు చేసుకోవాల్సిందని సూచించారు. రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసే నిర్ణయాన్ని అంత వేగంగా తీసుకుని ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీకి సూరత్ కోర్టు తీర్పును పై కోర్టులో అప్పీల్ చేసే గడువు ఇవ్వాల్సిందని పేర్కొన్నారు. నేను న్యాయ నిపుణుడిని కాదు. కానీ ప్రాసెస్ ఆఫ్ లాను చూస్తే రాహుల్ కి విధించిన శిక్ష మోతాదు ఎక్కువే అనిపిస్తున్నది. ఎన్నికల వేడిలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి కాదు. ఇదే చివరిదీ కాబోదు  అని అన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి  చిన్న హృదయంతో పెద్దోడివి కాలేవు అనే మాటను కేంద్రం గుర్తు చేసుకోవాలి  అని ప్రశాంత్ కిషోర్  అన్నారు. నిజానికి ఈ మొత్తం వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి ప్రత్యక్ష ప్రమేయం లేక పోయినా  సమయం, సందర్భాలను బట్టి తెర వెనక తతంగం అంటా కమల నాథులే కానిచ్చారనే విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహం లేదు. అందుకే ఆర్థిక అవకతవకల వ్యవహారంలో చిక్కున్న ఆదానీ వ్యవహారంలో మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తున్న రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడడం పలు అనుమానాలకు ఆస్కారం కల్పిస్తోందని, అంటున్నారు. ఆదానీని కాపాడేందుకు రాహుల్ పై వేటు  వేశారనే కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణకు బలం చేకురుతోందని మేథావులు, రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరో వంక కాంగ్రీస్ పార్టీ  రాహుల్ అనర్హతకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త ఆందోళనలకు పిలుపు నివ్వడంతో బీజేపీ ఇరకాటంలో పడిందనే అభిప్రాయం బలపడుతోంది. ఒక విధంగా సెల్ఫ్ గోల్ చేసుకుందని అంటున్నారు.

వైకాపాలో అసమ్మతి సునామీ?

వైసీపీలో ఏం జరుగుతోంది? ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిపై పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? అధినాయకత్వం ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఎమ్మెల్యేలు ఏం ఆలోచిస్తున్నారు? ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారనే నెపంతో ఏకపక్షంగా నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని  ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, పార్టీ క్యాడర్ ఎలా చూస్తున్నారు? మరీ ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్ గురించి ప్రజల ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఈ ప్రశ్నలన్నిటికీ   సామాన్య ప్రజల నుంచి మేథావుల వరకు అందరూ అందరి నోటా వ్యక్తమౌతున్న ఎకాభిప్రాయం  ‘రోజులు దగ్గర పడ్డాయి’ అనే. పట్టభద్రుల నియోజక వర్గాల్లో వైకాపా ఓటమి, ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తే, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఎమ్మెల్యేలలో ఉన్న సొంత పార్టీపైనా, ప్రభుత్వంపైనా ఉన్న అసంతృప్తిని బహిర్గతం చేసిందని అంటున్నారు. ముఖ్యంగా, వైకాపా ఎమ్మెల్యేలో అసమ్మతి కొత్త వవిషయం కాదు. చాలా కాలంగా  చాలా మంది  ఎమ్మెల్యేలో అసమ్మతి అగ్గి రాగులు తూనే వుంది. భగ్గు మనేందుకు సిద్ధంగా వుంది. అయితే  ఇంతకాలం పిల్లి మేడలో గంట కట్టేదేవరనే దగ్గర ఆగిన అసమ్మతి లావా ప్రవాహానికి  స్వయంగా పార్టీ అధినాయకత్వమే గేట్లు ఎత్తేసింది. పొమ్మన కుండా పొగ పెట్టి  ఆనం రామ నారాయణ రెడ్డి, కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని బయటకు పంపిన పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి క్రాస్ వోటింగ్ సాకు చూపి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డితో పాటు మహిళా ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి పై సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో ఇక అసమ్మతి కట్టలు  తెంచుకుంటుందన్న పార్టీ లో చర్చ మొదలైంది.  ఈ నేపథ్యంలోనే  వైసీపీలో  చాలా మంది ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారని సస్పెన్షన్‌కు గురైన నెల్లూరు గ్రామీణ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. కొందరు ఎమ్మెల్యేలు, నాయకులు బహిరంగంగానే బయటికి వస్తున్నారని తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో చాలా మంది లోలోపల ఉడికిపోతున్నారని చెప్పారు. మరో పార్టీలో చేరిక కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నారని వ్యాఖ్యానించారు.  2024 ఎన్నికలలో ఎవరికి ఓటేయాలన్న విషయంలో రాష్ట్ర ప్రజలు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడించారు. వచ్చే ఎన్నికల తరువాత రాష్ట్ర రాజకీయాల నుంచి వైసీపీ శాశ్వతంగా డిస్మిస్‌( సస్పెండ్) అవుతుందని జోస్యం చెప్పారు. 2024లో రాజకీయ ప్రజా సునామీ రాబోతోందని.. నిన్నటి పట్టభద్రుల ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమే స్పష్టమైన ప్రజా తీర్పు అని వ్యాఖ్యానించారు. ప్రజా సమస్యలు పరిష్కరించాలనే తపన ఉన్న తాను.. విసిగి వేసారి చివరికి గట్టిగా మాట్లాడానని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. చివరికి పార్టీ (వైసీపీ)కి విధేయుడిగా ఉన్న తనపైనే నిఘా పెట్టారన్నారు. ప్రజా సమస్యలు ప్రస్తావిస్తే అనుమానించారని.. పరిష్కరించకుండా రాజకీయ కోణంలో ఆలోచించారని చెప్పారు.  అదలా ఉంటే, కడప మొదలు ప్రతి జిల్లాలోనూ, వైకాపా ఎమ్మెల్యేలు, నాయకులు,కార్యకర్తలు జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాలుగా నిట్టనిలువుగా చీలిపోయారని అంటున్నారు. అక్కడక్కడా రహస్య సమావేశాలు జరుగుతున్న  సమాచారం కూడా పార్టీ పెద్దలకు చేరుతోందని అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల ప్రతి కదలిక పైనా ఒకరికి తెలియకుండా మరొకరిని నిఘా పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీలో ఒకరిని ఒకరు నమ్మే పరిస్థితి లేకుండా పోయిందని, చివరకు మంత్రులు కూడా రాజకీయాల గురించి మాట్లాడేందుకు జంకుతున్నారని అంటున్నారు. ఈ పరిణామాలను గమనిస్తే నిజంగానే కోటంరెడ్డి అన్నట్లుగా  వైసీపీని అసమ్మతి సునామీ ముంచేసేలా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ఎక్కడ?

ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపునకు.. క్రాస్ ఓటింగే కారణమంటూ.. అందుకు సంబంధించి నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు.. ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డితోపాటు ఉండవల్లి శ్రీదేవిపై అధికార ఫ్యాన్ పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలు మీడియా ముందుకు వచ్చి తమదైన శైలిలో స్పందించారు.  ఇక ఆనం రామనారాయణరెడ్డి అయితే సైకిల్ పార్టీలో చేరేందుకు చాలా కాలంగా వేచి చూస్తున్నారన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆయన పార్టీ మారే క్రమంలో క్రాస్ ఓటింగ్ వేయడం ద్వారా టీడీపీ అభ్యర్థిని బలపరిచి ఉంటారని అంతా భావిస్తున్నారు. అంత వరకు బానే ఉంది. కానీ ఇంత తతంగం జరిగినా... జరుగుతున్నా.. తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మాత్రం ఇప్పటి వరకు.. ఈ అంశంపై స్పందించక పోవడం పట్ల పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వినియోగించుకొన్న తర్వాత తాడికొండ శ్రీదేవి ఎక్కడా కనిపించడం లేదు.ఆమె అజ్ణాతంలోకి వెళ్లారన్న చర్చ సమాజిక మాధ్యమంలో జోరుగా సాగుతోంది.  మరోవైపు  క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినది ఈ  నలుగురు ఎమ్మెల్యేలే అని వైసీపీ అధిష్ఠానం ప్రకటించగానే గుంటూరులోని ఎమ్మెల్యే శ్రీదేవి కార్యాలయంపై ఫ్యాన్ పార్టీ శ్రేణులు దాడి చేసి ఆమె ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. శ్రీదేవికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యాయి.  ఒక వైపు ఇలాంటి పరిణామాలు చోటు చేసుకొంటుంటే.. కోటంరెడ్డి, మేకపాటి లాగా ఆమె కూడా మీడియా ముందుకు వచ్చి.. ఏ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటు వేయాలని.. తమ పార్టీ సూచించిందో.. ఆ అభ్యర్థికే తాను ఓటు వేశానని... అంతేకానీ.. తాను క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని.. అయితే ఎవరో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడి.. తన మీద ఇటువంటి ఆరోపణలు చేసి.. తన రాజకీయ జీవితాన్ని బలి చేస్తున్నారంటూ ప్రకటించే అవకాశం ఉన్నా.. ఎమ్మెల్యే శ్రీదేవి ఆ అవకాశాన్ని వినియోగించుకోలేదు.   తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి నియోజకవర్గంలో ఫ్యాన్ పార్టీకి మరో సమన్వయకర్తగా గతంలో మాజీ మంత్రి డొక్క మాణిక్య వర ప్రసాద్‌ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ఈ నేపథ్యంలో డొక్కా నియామకాన్ని శ్రీదేవితో పాటు ఆమె అనుచరులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఆ క్రమంలో అప్పటి కప్పుడు అర్థరాత్రి వేళ.. జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌, హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత నివాసానికి చేరుకొని.. ఎమ్మెల్యే శ్రీదేవితోపాటు ఆమె అనుచరులు ఆందోళనకు దిగారు.  దాంతో వారిని మేకతోటి సుచరిత సముదాయించి.. ఆ తర్వాత ఆ పంచాయతీని తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయంలో పెట్టడంతో... ఎమ్మెల్యే శ్రీదేవి తాత్కాలికంగా కూల్ అయ్యారు. ఆ తరువాత కొద్ది రోజులకే.. పార్టీ జిల్లా  ఇన్‌చార్జ్ బాధ్యత నుంచి మేకతోటి సుచరిత తప్పుకోవడంతో.. ఆ బాధ్యతలను సైతం డొక్కా మాణిక్య వర ప్రసాద్‌కు వైసీపీ అధిష్టానం అప్పగించింది.    ఇంకోవైపు తాడికొండ నియోజకవర్గంలో పార్టీ అదనపు సమన్వయ కర్తగా కర్తగా సురేష్ కుమార్‌ను పార్టీ అధిష్టానం నియమించింది. దీంతో అతడి ఆధ్వర్యంలోనే స్థానికంగా  వైసీపీ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాలు సైతం కత్తెర సురేష్ ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి.  దీంతో స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి ఉత్సవ విగ్రహాంగా మారడంతో.. ఆమె తీవ్ర అసంతృప్తికి లోనయ్యారనే చర్చ సైతం స్థానికంగా  కొనసాగుతోంది. అలాంటి వేళ ఆమె తెలుగుదేశం గూటికి చేరాలని నిర్ణయించుకొని ఉంటారని.. అందులో భాగంగానే ఎమ్మెల్యే శ్రీదేవి తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనూరాథకు ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటు వేసి ఉండవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదీకాక తాడికొండ నియోజకవర్గం నుంచి వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో శ్రీదేవిని కాకుండా మరో  అభ్యర్థిని  బరిలోకి దింపేందుకు ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించుకున్నారనీ, ఆ విషయం గ్రహించే శ్రీదేవి క్రాస్ ఓటింగ్ కు పాల్పడి ఉంటారనీ పార్టీ శ్రేణులు అంటున్నాయి.

కేసీఆర్ సర్కార్ కు లీకేజీ చిక్కులు

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారానని హ్యాండిల్  చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఫెయిల్ అయిందా? అంటే అవుననే అంటున్నారు  రాజకీయ విశ్లేషకులు. నిజానికి, రాజకీయ విశ్లేషకులు మాత్రమే కాదు అధికార బీఆర్ఎస్ నాయకులు కూడా అదే మాట అంటున్నారు.ఎనిమిదేళ్ళ పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలన్నీ ఒకెత్తు అయితే, టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వం చేసిన తప్పు ఒక్కటీ ఒకెత్తని బీఆర్ఎస్ నాయకులే వాపోతున్నారు. అంతేకాదు ఇప్పటికైనా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే  రాజకీయంగా భారీ మూల్యం చెల్లించక తప్పదని అంటున్నారు.  ముఖ్యంగా అదే సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ( ఈడీ) విచారణ ఎదుర్కోవలసి రావడంతో, ముఖ్యంత్రి టీఎస్పీఎస్సీ లీకేజీపై దృష్టి పెట్టలేదనీ, అందువలన  లీకేజీ వ్యవహారం కోతి పుండు బ్రహ్మరాక్షసి చందంగా మరింత జటిలంగా మారిందని బీఆర్ఎస్ సీనియర్ నేతలు అంటున్నారు. అలాగే  మంత్రి కేటీఆర్ లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడిన సమస్యతో తమకు సంబంధం లేదన్న విధంగా మాట్లాడడంతో విద్యార్ధులలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని అంటున్నారు. మళ్ళీ పరీక్షలు రాయండి అన్నం పెడతాం, ఫీజులు కడతాం అంటూ నిరుద్యోగులను అవమానపరిచే విధంగా మాట్లాడడం కూడా విద్యార్థుల ఆగ్రహానికి కారణం అవుతోందని అంటున్నారు. కొందరు నిరుద్యోగ యువకులు భౌతిక దాడులకు సైతం వెనుకాడమని హెచ్చరిస్తున్నారంటే పరిస్థితి తీవ్రత అర్థమవుతోందని అంటున్నారు. ఒక విధంగా సున్నితంగా పరిష్కరించవలసిన సమస్యను ప్రభుత్వ పెద్దల ధోరణి వలన జటిలం అయిందనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది.  అలాగే  ‘సిట్’ విచారణలో  టీఎస్సీఎస్సీ నిర్వాకం బయట పడిందని,  తెలంగాణ ఉద్యమానికి ఊపిరిగా నిలిచిన, ‘నియామకాలు’ విషయంలో ప్రభుత్వం డొల్లతనం బయట పడిందని అంటున్నారు. ఒక విధంగా, టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల విషయంలో ప్రతిపక్షాలకు ప్రభుత్వమే ఆయుధాన్ని అందించిందనే అభిప్రాయం బీఆర్ఎస్ వర్గాలలోనే వినవస్తోంది.  అదలా ఉంటే, ఇటు కాంగ్రెస్, అటు బీజేపీ ఇదే విషయంగా పోటాపోటీగా ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగానే ,రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీజేపీ, శనివారం(మార్చి 25) నిరుద్యోగ మహాధర్నా నిర్వహించింది. గ్రూప్ వన్  పరీక్షల పేపర్‌ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్‌ అంధకారంలో పడిన నేపథ్యంలో వారి తరపున పోరాడేందుకు పార్టీ దశల వారీ ఉద్యమ కార్యాచరణ రూపొందించింది. ఇందులో భాగంగా  పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ నేతృత్వంలో ఇందిరాపార్క్‌ వద్ద వేలాది మందితో ‘మా కొలువులు మాగ్గావాలే’ అనే నినాదంతో,   నిరుద్యోగ మహాధర్నా నిర్వహించారు.  కాగా  నిరుద్యోగ మహాధర్నా బీజేపీకే పరిమితమైన కార్యక్రమం కాదని, 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్ కు ముడిపడి ఉన్న సమస్య అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తెలిపారు. వారందరికీ అండగా ఉంటామని, కేటీఆర్‌ను బర్తరఫ్‌ చేసేవరకూ వదలిపెట్టబోమని తేల్చి చెప్పారు. టీఎస్పీఎస్పీ ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో మంత్రి కేటీఆర్‌ పాత్ర లేదని సీఎం కేసీఆర్‌ భావిస్తే తక్షణం, హైకోర్టు సిట్టింగ్‌ జడ్జి ఆధ్వర్యంలో విచారణను కోరాలని, సకాలంలో పరీక్షలు నిర్వహించి నిరుద్యోగులకు భరోసా ఇవ్వాలని అన్నారు. తన కుమారుడి ప్రమేయాన్ని ఖండించని కేసీఆర్  రాష్ట్ర ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు లక్షలాది మంది నిరుద్యోగులు, వారి కుటుంబాలను అంధకారంలోకి నెట్టడం కేసీఆర్‌ దుర్మార్గ చర్యలకు పరాకాష్ఠ  అని విమర్శించారు. అలాగే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మళ్ళీ మరోమారు, ఉద్యమం నాటి, వాతావరణం కనిపిస్తోందిని అంటున్నారు.  రెండు రోజుల కిందట వివిధ విద్యార్ధి సంఘాలు సంయుక్తంగా నిరుద్యోగ దీక్ష, ర్యాలీ నిర్వహించేందుకు చేసిన ప్రయత్నాలను పోలేసులు అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వందల మంది విధ్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే  దీక్షలో పాల్గొనేందుకు సిద్దమైన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్ యు నాయకులను ఎక్కడిక్కడ హౌస్ అరెస్ట్ చేశారు.  మరో వంక ఏప్రిల్ రెండవ వారంలో లక్షమందితో నిరుద్యోగ నిరసన దీక్ష నిర్వహిస్తామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ పరిస్థితిలో ముఖ్యమంత్రి ప్రత్యక్షంగా జోక్యం చేసుకుని  సమస్య పరిష్కారానికి కృషి చేయాలని  లేదంటే  రాజకీయంగా భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని, బీఆరేస్ నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.

ఏపీ రాజకీయాల్లో కొత్త డైమెన్షన్!

రాజకీయాలలో ఏదీ శాశ్వతం కాదు. ఎవరూ శాశ్వతం కాదు. ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి.  అందుకే,   రాజకీయాలు నిశ్చలన చిత్రాలు కాదు, పాలిటిక్స్ ఈజ్ డైనమిక్  అనే నానుడి ఏర్పడింది. నిజం. ఎమ్మెల్సీ ఎన్నికల వరకు  ఏపీ రాజకీయాలు ఎటు  వెళుతున్నాయి, అనే విషయంలో చాలామందికి చాలా సందేహాలున్నాయి. ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన వైసీపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి  వచ్చింది మొదలు, మీటల మీదనే దృష్టి పెట్టి పేద ప్రజల ఓట్లను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు సాగిస్తూ వచ్చారు. అప్పులు చేసి మరీ ప్రజల ఖాతాల్లో డబ్బులు వేస్తున్నామనే బిల్డప్  ఇచ్చారు.  అయితే, మీటలు నొక్కి ప్రజల ఖాతాల్లో పైసలు వేసినా ప్రజలను ఆకట్టుకోలేక పోయారు. సంక్షేమ ప్రయోజనాలు పొందుతున్న వర్గాల ప్రజల్లోనూ సర్కార్ విధానాల పట్ల వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఓ వంక మీటలు నొక్కుతూ మరో వంక  పన్నుల మోత, చార్జీల వాతలతో ప్రజలపై మోయలేని భారం వేస్తున్న జగన్ రెడ్డి ప్రభుత్వంతో ప్రజలు విసిగెత్తి పోయారు. ఇసుక పాలసీ, మద్యం పాలసీ వంటి తలాతోకా లేని విధానాలతో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న జగన్ సర్కార్ పై  ప్రజలు మండిపడుతున్నారు. ఇదేమి పాలనా ఇదెక్కడి పాలన  ఒక చేత్తో ఇచ్చి  చెత్త పన్ను వంటి చెత్త ఆలోచనలతో రెండు చేతులా దోచుకుంటున్న జగన్ రెడ్డికి  రెండో ఛాన్స్ ఇచ్చేది లేదనే నిర్ణయాని కొచ్చారు. అయితే. ఇంతవరకు అందుకు ఒక స్పష్టమైన రుజువు, ఆధారం దొరకలేదు. కానీ  ఇప్పడు, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రభుత్వం పట్ల  ముఖ్యంగా  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అహంకార పోకడల పట్ల ప్రజాగ్రహం స్పష్టమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం సారథ్యంలోనే వైసీపీ వ్యతిరేక కూటమి ఏర్పడుతుందనే స్పష్టత వచ్చందని అంటున్నారు. ఎమ్యెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఏకైక ప్రత్యాన్మయంగా టీడీపీ ఏమర్జ్  అయిన నేపథ్యంలో, పొత్తుల విషయంలో కూడా క్లారిటీ వస్తోందని పరిశీలకులు అంటున్నారు. నిజానికి  రాష్ట్రంలో రాజకీయ పొత్తులకు సంబంధించి చాలా కాలంగా చాలా చాలా చర్చలు,  వ్యూహాగానాలు సాగుతున్నా ఇంతవరకు ఒక స్పష్టత అయితే రాలేదు. ఈ నేపథ్యంలో  మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు పితాని సత్యనారాయణ కొత్త చర్చకు తెర తీశారు. పొత్తులపై ఇప్పటి వరకూ ఎలాంటి నిర్ణయం జరగలేదని చర్చలు మాత్రమే జరుగుతున్నాయన్నారు. ఏదైనా పార్టీ తమతో కలుస్తానంటేనే పొత్తులపై అధిష్ఠాన నిర్ణయం తీసుకుంటుందన్నారు.అంతే కాదు  నిజం అయినా కాకున్నా ఇంతవరకు జనసేన, బీజేపీ కూటమితో  పొత్తుకు టీడీపీ తహతహా లాడుతోందనే ప్రచారం జరిగింది. అయితే  పితాని  బీజేపీ పార్టీ పొత్తుల విషయంలో క్లారిటీ ఇవ్వాలని, వైసీపీ తో విడిపోతేనే ఆ పార్టీతో పొత్తు గురించి ఆలోచిస్తామని  బంతిని బీజేపీ కోర్టులోకి నెట్టారు.  అదే సమయంలో పితాని  టీడీపీ క్యాడర్ కు కూడా హిత బోధ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుతో సంబరాలు చేసుకుంటే సరిపోదు కష్టపడితేనే గెలుపు సాధ్యం అవుతుందన్నారు. ఆత్మ విమర్శ చేసుకుని చేసిన తప్పులు, సవరించుకుంటేనే విజయం వరిస్తుందని పితాని పేర్కొన్నారు. ప్రత్యేకించి తాడేపల్లిగూడెంలో టీడీపీ ఇంచార్జ్ వలవల బాబ్జీ గెలుపు కోసం క్యాడర్ ఇప్పటినుంచే కష్ట పడాలని సూచించారు. అధికార పార్టీ పతనం ప్రారంభమైందన్నారు. జగన్ మరలా అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు. జగన్ కు ఒక్క ఛాన్సే చివరి ఛాన్స్ అయ్యిందన్నారు. ఏమైనా  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, ఏపీ రాజకీయాల్లో కొత్త డైమెన్షన్  తీసుకొచ్చాయి. ఇది మాత్రం నిజం.

మోడీతో ఢీ అంటే ఢీ.. తగ్గేదేలే ..రాహుల్ !

కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు  పార్లమెంట్ మాజీ సభ్యుడు రాహుల్ గాంధీ  ప్రధాని నరేంద్ర మోడీపై, తగ్గేదే లే అన్న తరహాలో మరో మారు విరుచుకు పడ్డారు. ప్రశ్నాస్త్రాలను సందించారు. గత లోక్ సభ ఎన్నికల సందర్భంగా, ‘మోడీలంతా దొంగలే’ అనే అర్థం వచ్చేలా చేసిన వ్యాఖ్య.. పై బీజేపీ ఎమ్మెల్యే ఒకరు సూరత్ కోర్టులో  వేసిన క్రిమినల్ డిఫమేషన్ కేసులో నాయస్థానం ఆయనకు రెండేళ్ళు జైలు శిక్ష విధించిన విషయం. కోర్టు తీర్పు నేపధ్యంగా రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన విషయం తెలిసిందే. అయితే రాహుల్ గాంధీ అనర్హత వేటు పడినా  తగ్గేదేలే అనే రీతిలో, అదానీ, మోడీ సంబంధాలను మరోమారు గట్టిగా గళమెత్తారు.  అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియా ముందుకు వచ్చిన ఆయన.. డిఫెన్స్ సెక్టార్‌తో ముడిపడి ఉన్న అదానీ షెల్ కంపెనీలలో ఎవరు పెట్టుబడి పెట్టారో చెప్పాలని ప్రధాని మోడీని ప్రశ్నించారు. అలాగే అదానీ కంపెనీ పెట్టుబడులలో  ఒక చైనా జాతీయుడికి కూడా సంబంధం  ఉందని ఆరోపించారు. అందుకే ఆ పెట్టుబడుల వివరాలేంటో చెప్పాలని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. అలాగే  దేశంలో ప్రజస్వామ్య వ్యవస్థలపై దాడి జరుగుతోందని, దేశ విదేశాల్లో వివాదస్పద వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ,  తాను భారత దేశ ప్రజాస్వామ్యం కోసం పోరాడాను, పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు. భారత్‌ జోడో యాత్రతో  ప్రజల్లోకి వెళ్లానని గుర్తు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి ప్రజాస్వామ్యం పై విశ్వాసం లేదని,   ప్రజాస్వామ్యాన్ని కాపాడే వ్యక్తే అయితే తనకు మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని ఫైరయ్యారు. భారత ప్రజల ప్రజాస్వామిక గొంతు వినిపించేందుకు, కాపాడేందుకే  తాను ఉన్నానని  భయపడేది లేదని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీలకు ఇదివరకటిలా మీడియా సంస్థల నుంచి లభించిన మద్ధతు ఇప్పుడు లేదు. ఇది ఓబీసీల వ్యవహారం కాదు. ఇది మోడీ, అదానీల సంబంధానికి సంబంధించిన వ్యవహారం. దాన్నుంచి దృష్టి మళ్లించడం కోసం విదేశాల్లో నా వ్యాఖ్యల గురించి మాట్లాడతారు. అనర్హత అంశాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు ఓబీసీ అంటున్నారు. నేను నిజం మాట్లాడతాను. మాట్లాడుతూనే ఉంటాను. నాపై అనర్హత వేటు వేసినా, జైల్లో పెట్టినా నాకు పెద్ద తేడా ఏమీ లేదు. అనర్హతలు లాంటివి నన్ను ఏం చేయలేవు. ఇలాంటి వాటిని నేను పట్టించుకోను. నా పోరాటాన్ని యథావిధిగా కొనసాగిస్తాను. మోడీని  ప్రశ్నిస్తూనే ఉంటాను. ఇది ఓబీసీ వ్యవహారం కాదు... మోదీ, ఆదానీ మధ్య ఉన్న బంధం పై ప్రశ్నిస్తున్నాను. రూ. 20 వేల కోట్లు ఎక్కడివి, ఎక్కడి నుంచి ఆదానీ షెల్ కంపెనీల్లోకి వచ్చాయో చెప్పాలని రాహుల్ గాంధీ విలేకరుల సమవేశంలో ప్రశ్నల వర్షం కురిపించారు.   కేసు, శిక్ష, తదుపరి కార్యాచరణ గురించి అడిగియన ప్రశ్నకు సమాధానమిస్తూ రాహుల్ గాంధీ, నేను దేశ న్యాయవ్యవస్థను గౌరవిస్తాను. అందుకే న్యాయపరమైన అంశాల గురించి నేను ఇప్పుడు మాట్లాడను. . పార్లమెంటులో నేను మాట్లాడబోయే అంశాల గురించి మోదీ భయపడ్డారు. నాపై అనర్హత వేటు వేయడానికి అదే కారణం. నాకు సంఘీభావం, మద్ధతు ప్రకటించిన విపక్షాలకు కృతజ్ఞతలు. అందరం కలసి కట్టుగా పనిచేద్దాం. నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా, లేకున్నా నా పని నేను చేస్తా అని రాహుల్ ఉద్ఘాటించారు.   ప్రధాని ప్రతిపక్షాలకు ఒక గట్టి ఆయుధాన్ని ఇచ్చారు. ప్రధాని చర్యలతో ఆయన చేసిన తప్పు గురించి చర్చ జరుగుతోంది. అదానీ ఒక అవినీతి, అక్రమార్కుడని ప్రజలందరికీ తెలిసిపోయింది. అలాంటి వ్యక్తిని ప్రధాని మోడీ ఎందుకు కాపాడాలని చూస్తున్నారని జనం చర్చించుకుంటున్నారు. అదానీ గురించి అడిగితే.. దేశంపై దాడి అంటున్నారు. అంటే అదానీయే దేశం అని ప్రధాని చెబుతున్నారా?  అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. కాగా  విలేకరుల సమావేశంలో రాహుల్  ప్రవర్తించిన తీరును గమనిస్తే  ఆయన  మోదీ మహా సంగ్రామానికి సిద్దమవుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.