జగన్ ఇంటి ముందు రైతుల ఆందోళన

  వైసీపీ నాయకుడు జగన్మోహన్‌రెడ్డి లోటస్ పాండ్ ఇంటిముందు రైతులు భారీ సంఖ్యలో చేరి ఆందోళన చేస్తున్నారు. వీరంతా గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గానికి చెందిన రైతులు. జగన్‌కి చెందిన ఇండస్ట్రీస్‌కి గురజాల నియోజవర్గంలో గతంలో ప్రభుత్వం కేటాయించిన దాదాపు 613 ఎకరాల భూములను వినియోగంలోకి తేనందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లీజును రద్దు చేసిన విషయం తెలిసిందే. అంతకు నాలుగు రోజుల ముందు ఈ భూములు వినియోగంలోకి రాకపోవడంతో భూముల మొదటి సొంతదారులైన రైతులు ఈ పొలాల్లో పండించిన పంటలను సరస్వతి ఇండస్ట్రీస్‌కి చెందిన వారు ట్రాక్టర్లతో దున్నే ప్రయత్నం చేశారు. అప్పుడు రైతులు అడ్డుకోవడంతో వారిని గాయపరిచారు. ఆ సంఘటనలో గాయపడిన రైతులను తీసుకుని గురజాల ప్రాంతానికి చెందిన రైతులందరూ జగన్ ఇంటి ముందు ఆందోళన కార్యక్రమం చేస్తున్నారు.

ఇంతకీ భవ్యశ్రీ ఎక్కడుందో

  హైదరాబాద్‌‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌ విజయవాడకు చెందిన యువతి భవ్యశ్రీ మిస్సింగ్ కేసులో దర్యాప్తు సస్పెన్స్ సినిమాలా సాగుతోంది. ఆమె మొబైల్ సిగ్నల్ శుక్రవారం వరకు దొరకలేదు. శుక్రవారం సాయంత్రం సిగ్నల్ దొరికింది. ఆ సిగ్నల్స్ ప్రకారం ఆమె తూర్పు గోదావరి జిల్లాలో వున్నట్టు పోలీసులు భావించారు. అయితే ఆ తర్వాత ఆమె సెల్ ఫోన్ సిగ్నల్స్ విశాఖపట్టణానికి మారిపోయాయి. సెల్ సిగ్నల్స్ ప్రకారం భవ్యశ్రీ విశాఖపట్నం జిల్లా పాడేరులోని గెస్ట్ హౌస్‌లో వున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే అక్కడకు వెళ్ళిన పోలీసులకు గెస్ట్ హౌస్ రూమ్‌లో భవ్యశ్రీ కనిపించలేదు. పోలీసులు వెళ్ళిన సమయంలో రూమ్‌లో టీవీ ఆన్ చేసి వుంది. ఆమె మాత్రం కనిపించలేదు. తాము వస్తున్న విషయాన్ని గ్రహించి ఆమె అక్కడ నుంచి మరో చోటికి వెళ్ళిపోయిందని పోలీసులు అనుమానిస్తున్నారు. తన మిస్సింగ్ గురించి మీడియాలో నిరంతరం కవరేజ్ వస్తూ వుండటంతో వాటిని గమనిస్తూ భవ్యశ్రీ తమకు కనిపించకుండా తప్పించుకుంటోందని కూడా పోలీసులు అనుమానిస్తున్నారు. భవ్యశ్రీ ఇలా ఎందుకు చేస్తోందో కూడా అర్థంకాని విధంగా వుందంటున్నారు. అసలు భవ్యశ్రీ  సెల్ ఫోన్ భవ్యశ్రీ దగ్గరే వుందా.. మరెవరిదగ్గరైనా వుందా, వాళ్ళు ఇలా గేమ్ ఆడుతున్నారా అనే విషయంలో కూడా అంతుబట్టకుండా వుందని అంటున్నారు. సాధ్యమైనంత త్వరలో ఈ సస్పెన్స్‌కి తెరదించుతామని చెబుతున్నారు.

వర్మకి శ్రీదేవి లాయర్ నోటీసులు

  దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తాను తీయబోయే ‘సావిత్రి’ అనే కళాఖండం తాలూకు స్టిల్స్ బయటపెట్టినప్పుడు కలకలం రేగిన విషయం తెలిసిందే. ఒక చిన్నకుర్రాడు తన టీచర్‌‌ని చూస్తున్న చిత్రాలు బయటపడగానే మహిళా సంఘాలు తీవ్ర నిరసనను వ్యక్తం చేశాయి. వర్మ ఏవోవే సుత్తి కబుర్లు చెప్పినప్పటికీ నిరసన ఆగలేదు. ఆ తర్వాత వర్మ ఆ సినిమా పేరును ‘శ్రీదేవి’ అని మార్చాడు. దాంతో ఇప్పుడు సినీ నటి శ్రీదేవి  వర్మకి నోటీసులు పంపింది. ఒక అసభ్యమైన సినిమాకి తన పేరు పెట్టడమేంటని ఆమె తన నోటీసులలో ప్రశ్నించింది. రామ్ గోపాల్ వర్మకి లాయర్లు పంపిన నోటీసులో- దక్షిణ, ఉత్తరాది భాషల్లో శ్రీదేవి నటిగా మంచి పేరుందని, ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న ఆమె పేరుని.. అందులోనూ అభ్యంతరకరంగా ఉంటుందేమోననే భావనను ప్రచార చిత్రాలు కల్పించిన నేపథ్యంలో ఆమె పేరుని టైటిల్‌గా వాడటం తగదని శ్రీదేవి తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ విషయమై శ్రీదేవి భర్త రామ్‌గోపాల్ వర్మను వివరణ కోరాలని ఫోన్ చేస్తే, వర్మ ఒక వాట్సప్ మెసేజ్ పంపి ఊరుకున్నాడని, ఇది పద్ధతి కాదని పేర్కొన్నారు. వర్మ గతంలో పలు ఇంటర్వ్యూల్లో శ్రీదేవి అంటే తనకు చాలా ఇష్టమని, ఆమె భర్త బోనీని చూస్తే అసూయగా ఉందని వర్మ పేర్కొనడాన్ని ఈ సందర్భంగా సదరు న్యాయవాది గుర్తు చేశారు. ఈ నోటీసు అందిన మూడు రోజుల్లోగా స్పందించకపోతే తాము తీసుకునే తదుపరి చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని కూడా శ్రీదేవి తరఫున ఆ నోటీసులలో న్యాయవాది తెలిపారు. ఈ చిత్రం టైటిల్ మార్చుతున్నట్లు రాతపూర్వకంగా ఇవ్వాలని, జాతీయ స్థాయి వార్తా పత్రికల్లో క్షమాపణలు చెబుతూ, ప్రకటన ఇవ్వాలని, వేరే కొత్త టైటిల్‌ని కూడా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

60 అడుగులు ముందుకొచ్చిన సముద్రం

  హుదూద్ తుఫాను ప్రభావంతో విశాఖపట్టణం జిల్లా నక్కపల్లి మండలంలోని రాజయ్యపేట, బోయపాడు, బంగారంపేట గ్రామాల వద్ద సముద్రపు అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. సముద్రం దాదాపు 60 అడుగులు దాటి ముందుకు వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. సముద్ర తీరాల్లోని మత్స్యకారులందరూ ముందు జాగ్రత్తగా తెప్పలు, పడవలు, వలలను సురక్షిత ప్రాంతాలకు చేర్చుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ తీర ప్రాంతంలో లోతట్టు ప్రాంతాల్లో వున్న ప్రజలను పోలీసులు అప్రమత్తం చేస్తున్నారు. చాలామందిని లోతట్టు ప్రాంతాల నుంచి తరలిస్తున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకి వెళ్ళకుండా పోలీసులు గస్తీ నిర్వహిస్తున్నారు.

వరంగల్: మహిళా రైతు ఆత్మహత్య

  తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ జిల్లాలో కరెంటు సమస్య కారణంగా అప్పులు చేసి పండిస్తున్న పంట ఎండిపోవడంతో పార్వతి అనే మహిళా రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం రంధన్ తండాలో ఈ దారుణం జరిగింది. ఈ గ్రామానికి చెందిన పార్వతికి ఒకటిన్నర ఎకరాల పొలం ఉంది. అయితే రోజుకు రెండు మూడు గంటలు కూడా కరెంటు సక్రమంగా రాకపోవడంతో ఆ పొలం ఎండిపోయింది. డబ్బు మొత్తం పంటకే పెట్టడంతో తన కుమార్తెకు ఫీజు కూడా కట్టలేని పరిస్థితికి ఈ మహిళా రైతు చేరుకుంది. ఈ సమస్యలతో పార్వతి ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగింది. ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందింది.

మోడీని కలిసిన ఫేస్‌బుక్ మార్క్ జుకర్‌బర్గ్

  ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్ ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీని కలిశారు. రెండు రోజుల పర్యటన కోసం ఇండియాకి వచ్చిన జుకర్‌బర్గ్ ఇక్కడ మోడీని కలవటంతోపాటు ఇంటర్నెట్ మీద జరిగే ఒక సదస్సులో కూడా పాల్గొంటారు. మోడీని కలిసిన అనంతరం జుకర్‌బర్గ్ మాట్లాడుతూ, ఫేస్‌బుక్ కారణంగా ప్రధాని నరేంద్రమోడీ గురించి భారతదేశంలోని మారుమూల గ్రామాలకు కూడా బాగా తెలిసిందని అన్నారు. భారతదేశంలో ఫేస్‌బుక్ సేవలను మరింత విస్తరించే ఆలోచన తనకు వుందని చెప్పారు. భారతదేశంలో ఇంకా వందకోట్ల మందికి ఇంటర్‌నెట్ సదుపాయం లభించాల్సి వుందని ఆయన అన్నారు. భారతదేశం తమకు చాలా ప్రధానమైన మార్కెట్ అని, ఇక్కడి మార్కెట్‌ని కాపాడుకుంటామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు.

దిక్కులు చూడకు రామయ్య స్వీట్ రివ్యూ

  తారాగణం: నాగశౌర్య, సనా మక్బూల్,అజయ్, ఇంద్రజ, బ్రహ్మాజీ తదితరులు సంగీతం: కీరవాణి, దర్శకత్వం: త్రికోటి, నిర్మాత: రజనీ కొర్రపాటి.   ‘అమెరికన్ బ్యూటీ’ అనే సూపర్ హిట్ ఇంగ్లిష్ సినిమా ప్రేరణతో తయారు చేసుకున్న కథ అనిపించే ‘దిక్కులు చూడకు రామయ్య’ తెలుగులో సరికొత్త కథాంశంతో చేసిన ప్రయత్నమనిచెప్పవచ్చు. పదిహేనేళ్లకే గోపాలకృష్ణ అలియాస్ క్రిష్ (అజయ్)కి భవాని (ఇంద్రజ)తో పెళ్లయిపోతుంది. చిన్న వయసులోనే ఇద్దరి బిడ్దల తండ్రి అయిపోతాడు. టీనేజ్‌ని సరిగ్గా ఎంజాయ్ చేయలేపోయాననే వెలితి క్రిష్‌లో ఉంటుంది. డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివే మధు (నాగశౌర్య) క్రిష్ కొడుకు. అయితే ఎంజాయ్ చేయాల్సిన వయసులో ఎంజాయ్ చేయలేదన్న బాధలో సమీత (సనా మక్బుల్) అనే అమ్మాయికి క్రిష్ సైట్ కొడుతూవుంటాడు. తనకు పెళ్ళి కాలేదని అబద్ధం చెప్పి ఆ అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేస్తాడు. ఆ అమ్మాయినే మధు కూడా ప్రేమిస్తాడు. అయితే ఒక సందర్భంలో తన తండ్రి సమీతతో చనువుగా ఉంటున్నాడని తెలుస్తుంది. సమీత కూడా తన తండ్రిని పెళ్లాడటానికి రెడీగా ఉందని తెలుసుకున్న మధు, తన తల్లి కోసం ఏం చేశాడు? ఏ విధంగా తన తండ్రిని మార్చాడు? అనేది ఈ ‘దిక్కులు చూడకు రామయ్య’ సినిమా కథ.   ఈ చిత్రానికి హీరో నాగశౌర్య అయినా, కథాపరంగా అసలు హీరో అజయ్. తన కెరీర్‌లోనే చెప్పుకోదగ్గ పాత్రను ఇందులో అజయ్ చేశారు. తల్లి బాగుకోసం పరితపిస్తూ, తండ్రికి బుద్ధి చెప్పే పాత్రలో నాగశౌర్య చక్కగా ఇమిడిపోయాడు. తన పాత్రకు అన్ని విధాలుగా న్యాయం చేశాడు. సనా మక్బూల్ అందానికీ, అభినయానికీ ఆస్కారమున్న పాత్ర చేసింది. చాలాకాలం తర్వాత వెండితెరపై మెరిసిన ఇంద్రజ తల్లి పాత్రలో మెప్పించారు. బ్రహ్మాజీ చక్కని వినోదాన్ని పంచారు.   ఈ సినిమాలో ప్రేమ, బంధాలు, భావోద్వేగాలను చక్కగా ఆవిష్కరించారు. చక్కని వినోదంతో ప్రేక్షకులకు విసుగు రాకుండా జాగ్రత్త పడ్డారు. తన సంగీతంతో కీరవాణి సినిమాను మరో స్థాయిలో నిలబెట్టారాయన.

దళితుడు కాకుండా.. దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు: రేవంత్‌రెడ్డి

  తెలంగాణ సీఎం కేసీఆర్‌ మీద తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కేసీఆర్‌ దళితుడిని తెలంగాణ ముఖ్యమంత్రిని చేస్తానని, అలా చేయకపోతే తన తల తెగ నరుక్కుంటానని చెప్పాడని, అధికారం వచ్చాక తెలంగాణ ప్రజల్ని, దళితుల్ని మోసం చేశాడని రేవంత్ రెడ్డి విమర్శించారు. దళితుడు ముఖ్యమంత్రి కావాల్సిన తెలంగాణకు ఓ దరిద్రుడు ముఖ్యమంత్రి అయ్యాడు అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తన మంత్రివర్గంలోని వారిని టీడీపీ ఎమ్మెల్యేల ఇళ్ళ దగ్గర కేసీఆర్ కాపలాగా పెట్టాడని, టీటీడీపీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్‌లోకి తీసుకురాకపోతే మంత్రి పదవుల నుంచి తప్పిస్తానని కేసీఆర్ బెదిరిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లాగా బయట నుంచి విద్యుత్ కొనుగోలు చేయడం చేతకాకపోతే, చంద్రబాబును ఒప్పించి మేమే విద్యుత్ తీసుకువస్తామని టీడీపీ ఎమ్మెల్యేలు ఎర్రబెల్లి దయాకర్ రావు, రేవంత్ ఈ సందర్భంగా అన్నారు.